21, సెప్టెంబర్ 2015, సోమవారం

సాహసం శాయరా డింభకా !



సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.


పిరికి గొడ్డులా ఉంటే లోకం తరిమి కొడుతుంది. అదే, బోర విరుచుకుని తిరిగేవనుకో లోకం సాగిల పడుతుంది. వెనుక బడితేను వెనకేనోయ్ అన్నాడు కవి. సాహసం చేయ లేక పోతే ఏదీ సాధించ లేం.‘ చెట్టు లెక్క గలవా ? పుట్ట లెక్క
గలవా ?..’’ అంటూ చెంచు లక్ష్మి కూడా ఓ క్వశ్చనీర్ హీరో గారి ముఖాన కొట్టడం తెలిసిందే కదా.

మా చిన్నప్పుడు ఊళ్ళోకి సర్కస్ కంపెనీ వచ్చిందంటే పండుగే, పండుగ ! పొద్దస్తమానం ఆ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండే వాళ్ళం. సర్కసు చూసొచ్చిన కుర్రాళ్ళు ఇంటి వెనుక పెరళ్ళలో ఏవో ఫీట్లు ప్రాక్టీసు చేయబోవడం రివాజు. అలా, మా వీధి పిలగాయలు నలుగురైదుగురు కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్న వాళ్ళూ లేక పోలేదు. సింహాలూ. పెద్ద పులులూ దొరికే ఛాన్సు ఎలాగూ లేదు కనుక,సీమ పందికి తర్ఫీదు ఇవ్వ బోయి అది భీకరంగా నిరాకరించడంతోను, తొడ కండ పీకేలాగున తన అసమ్మతి చూపడంతోను మంచాన పడిన కుర్రాళ్ళూ ఉండే వారు.

అలాగని సాహసాలు చెయ్యకుండా ఎలా ఉంటాం చెప్పండి?

సాహసాలంటే మంటల్లో దూకడాలూ, ఎత్తుల మీంచి దూకడాలూ మాత్రమే కానక్కర లేదు.

మా డింగరి బుచ్చబ్బాయ్ తనకి సున్నా మార్కులు వేసిన లెక్కల మాష్టారి మీదకి చాటుగా గురి చూసి మెట్లంగి రాయొకటి విసర లేదూ ? అప్పుడు వాడి సాహసానికి మేఁవంతా నోళ్ళు వెళ్ళబెట్టేం కదా. సాహసం కోసం మరీ ఇంతలేసి అకృత్యాలు చెయ్యమనడం లేదు కానీ, మీ పరిధిలో మీరు ఏవో ఒకటి రెండు సాహసాలయినా చేయక తప్పదు,జీవిత కాలంలో.

తెలుగు వర్ణమాల తెలిసిందే కదా, మరింకేం - ఏ కవితో రాసి పారెయ్యండి. ధైర్యంగా ఏ తలమాసిన పత్రికకో పంపించెయ్యండి. అచ్చోసిన వాడూ, చదివిన వాడూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళు పోతారు. ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ఇతరులకే కానీ మనకి ప్రమాదమేమీ లేదని ఢంకాభజాయించి చెబుతున్నాను.

ఇంటావిడ ధాం ధూమ్ లాడుతూ ఉంటే , పిరికి వాడిలా ముంగిముషాణంలా కూచో వద్దు. ఒక సారయినా సాహసోపేతంగా నోరు విప్పండి. మా సత్రాయిగాడు ఓ సారి ఇలాగే ధైర్యం చేసి వాళ్ళావిడ కన్నా పెద్ద నోరు పెట్టి ’’ నవ్వన్నది నిజమేనే ...‘‘ అని గాఠిగా అరిచేడు. వాడి ధైర్యానికి ఆవిడ మ్రాన్పడి పోయింది తెలుసా?

ఓ సారి మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చిత్రరాజాలను గుర్తుకు తెచ్చు కోండి.



మన ఎన్టీవోడినీ,





కాంతారావునీ,


రాజనాలనీ




వీళ్ళందరినీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ( దేశ వాళీ వీరులనే కాక విదేశీ వీరులని కూడా స్మరించడం మీ యిష్టం)

సాహస వీరుడు, సాగర కన్య లాంటి సినిమాలు చూసి పిరికి తనం ఏ మూలనయినా ఉంటే పోగొట్టుకోండి అని నా ఉచిత సలహా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరింత వివరంగా చెబుతూ మీ సహనాన్ని పరీక్షించే సాహసం చేయ లేను.

నా బ్లాగే కదా అని ఇలా నానా చెత్తా రాసే సాహసం చేస్తున్నానని మీరనుకుంటున్నారు కదూ.అవున్నిజమే. ఇంతకీ సాహసం చెయ్యమని ఒక కవి శ్లోకంలో చెప్పిన విషయమే మీముందు ఇవాళ ప్రస్తావించ బోతున్నాను. చూడండి:

న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి
సాహసం పున రారుహ్య, యది జీవతి పశ్యతి.

ప్రమాదాలు ఎదుర్కోనిదే మానవులు కార్య సాఫల్యాన్ని పొంద లేరు .విజయాన్ని అందు కోలేరు.అందు చేత, సాహసం చేసి, జయించి, బ్రతికి ఉంటే శుభాలు పొంద గలరు అని దీని భావం.

బ్రతికి యుండిన శుభములు బడయ వచ్చు ... అనుకుంటూ ఏ సాహస కృత్యమూ చేయకుండా పిరికి తనంతో బతకొద్దని కవి ఉవాచ. సహసం చెయ్. శుభాలు పొందు. ఆ సాహసం చేయడంలో ఛస్తే పాయె. బతికి ఉంటే శుభాలు పొంద గలవు అని కవి గారు హామీ యిస్తున్నారు.

వెన్ను చూపడం, మడమ త్రిప్పడం ... వంటి జాతీయాలు కదన రంగంలో సాహసోపేతంగా ముందుకు పొమ్మని ప్రోత్సహించేవే కదా.

బ్రేవో. గో ఎ హెడ్.

సాహసాల పేరిట సొమ్ము చేసుకునే టక్కరి తనమూ సాహసమేనా? ఏమో, 1979 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నేను రాసిన ఈ సాహసాల కథ చదివే సాహసం చేస్తే మీకే తెలుస్తుంది. చదివేక, ధైర్యం ఉంటే సాహసంతో కామెంటండి.

నా కథ చూడండి:






అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

పొగడ దండలు ! లేదా భజంత్రీలు ! లేదూ, గోకుళ్ళ వ్యవహారం



 పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలుమొహ మాటపు పొగడ్తలుబలవంతపు పొగడ్తలుబరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అనిసొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడోలేదోచుట్టూ ఉన్న వాళ్ళు వహ్వావహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.
ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడోకానీసొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.
డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినాఎలాగయినా వాయించు కో వచ్చును కదా.
సొంత డబ్బా సంగతి ఇలా ఉంటేఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తేనీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.
నువ్వు నా వీపు గోకితేనేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరేఈ విషయం కాస్త ప్రక్కన పెట్టిపొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతివ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటేస్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటేనిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:
పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు
ముద్దియలా హరికి గలరు ముగురందరిలో
పెద్దమ్మ నాట్య మాడును
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.
తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు
నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ
నన్నా తిరుమల రాయుడు
కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోనుశుక్రాచార్యునితోనుమన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితేఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,
రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపంరాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుకప్రభువులవారు ముక్కంటితో సమానం.
రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదుఒక కన్ను లేదు కానీప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని
పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా
జగ జట్టి యన్న తండ్రికి
దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు
అని !

నగపతి - ఇంద్రుడు
అతని పగతుడు (శత్రువు) - నరకుడు
అతని పగతుడు - శ్రీ కృష్ణుడు
అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)
అతని పగతుడు - భీముడు
అతని అన్న - ధర్మ రాజు
అతని తండ్రి - యముడు
అతని వాహనం - దున్న పోతు !
ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములుకొందరు పార్ధుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులుకొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందరు నందరే మఱియునందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలుకోతులు,పందులుదున్న పోతులుగాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు
నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్
పిఱికి తనంబును లోభము
గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటేపిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. ఈరప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారుఏమిచ్చారు అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం
డేపాటి ధనం బొసంగె నీరప రాజా ?’’
దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !
‘‘పాపాత్ముండెవ్వరికిని
చూపనిదే చూపెనయ్యసూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.


ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె
నిష్ట సంపన్నురాలిందిర భార్య యై
కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె
కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై
బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె
అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడుబహు కుటుంబీకుడుపతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడుకోరిన కోరికలను తీర్చే వాడుపెద్ద కుటుంబం కల వాడుఅన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితేవిష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలుకుమారుడుకుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదనిఅతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇదినిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటేభరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?
అదే విధంగాఅన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడుపాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.
దామోదరుడు అంటేదామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం.పద్మ గర్భుడు .
చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడుదయా గుణము కల వాడుశత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతిస్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.
ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును
తగ నర్ధుల కీయ నట్టి త్యాగముసభలోఁ
బొగిడించు కొనుచుఁ దిరిగెడి
మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కప్పల కథ !



ఎన్నికల వేళ దేశంలో, మరీ ముఖ్యంగా మన   రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే, కప్పల కథ రాయాలనిపించడం యాదృచ్ఛికమేమీ కాదని మనవి చేస్తున్నాను.
లోగడ కథా మంజరిలో చెప్పుల కథ రాశానా ? ఇప్పుడు కప్పల కథ రాస్తే తప్పేఁవిటని అనిపించి రాస్తున్నాను. 
ముందుగా మన ఆనవాయితీ ప్రకారం కప్ప అనే అర్ధాన్నిచ్చే పదాలు ఇంకా ఏమేం ఉన్నాయో చూదాం ...
అజంభము, అజిరము, అజిహ్వము,అనిమకము,అనూపము, అలిమకము,కృతాలయము,
చలికాపు, సూచకము, దుర్దురలము,దాటరి. ప్లవము, భుకము,మండూకము లాంటి చాలా ఉన్నాయి కానీ అంత ఆయాసం మనకొద్దు.  అన్నట్టు హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధంతో పాటూ కప్ప  అనే అర్ధం కూడా ఉందండోయి !
కప్పల్లో బావురు కప్ప, బాండ్రు కప్పచిరు కప్ప అని   చాలా రకాలు  కనిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో కప్పల గురించిన ప్రస్తావన వచ్చిన తావులు ఒకటి రెండు విన్నవిస్తాను ...
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !
అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన. మరంతే ... మన దగ్గర సొమ్ముంటే ఎక్కడెక్కడి వాళ్ళూ బంధువుల మంటూ వచ్చి చేరుతారు. చెఱువు నీటితో కళకళలాడుతూ ఉంటే వేలాదిగా కప్పలు వచ్చి చేరుతాయి కదా, అలాగన్నమాట.

మరో పద్యం చూడండి ...
సరసుని మానసంబు సరస ఙ్ఞుఁడెఱుంగును, ముష్కరాధముం
డెరిఁగి గ్రహించు వాఁడె ? కొలనేక నివాసముగాఁగ దుర్దురం
బరయఁగ నేర్చు నెట్లు వికజాబ్జమరంద సౌరభో
త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ ! కరుణాపయోనిథీ !

ఈ పద్యం కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకం లోనిది.   దుర్దురము (కప్ప ) ఉండేదీ, కమలం ఉండేదీ కూడా కొలను లోనే ! కానీ, ఆ కమలంలో ఉండే తేనెని  తుమ్మెద మాత్రమే ఆస్వాదిస్తుంది కానీ ప్రక్కనే ఉండే కప్పకి దాని మాధుర్యం తెలయదు కదా !అలాగే సరసుని మనసు పరసుడే తెలిసికో గలుగుతాడు అని దీని భావం. ఇందులో కప్ప ప్రస్తావన వచ్చి నప్పటికీ ఆ ప్రస్తావన దాని గౌరవం ఇనుమడించేలా మాత్రం లేదు పాపం ...

వెనుకటికి ఓ అవధాని గారికి  ‘‘ కప్పని చూచి పాము గడగడ వణికెన్ !’’ అని వో సమస్య నిచ్చేరుట. దానిని అవధాని   తెలివిగా, కిర్రు చెప్పులు వేసుకుని,  కర్ర పట్టుకుని, పొలం కాపునకు వచ్చిన రైతు     వెంకప్ప  (వెం –కప్ప) ను చూచి అక్కడ  వో పాము గడగడా వణికిందని  సమస్యాపూరణం చేసారు. మేకల్ని చూసి పులులూ , కప్పల్ని చూసి పాములూ ఎక్కడయినా భయ పడతాయా, మన వెర్రి గానీ !

నిజఁవే ... కప్పని చూస్తే జాలేస్తుంది. పరిశోధనల పేరిటా, పరీక్షల పేరిటా రోజూ కళాశాలల్లో ఎన్ని కప్పలు దారుణంగా చంపి వేయ బడుతున్నాయో కదా ... ఇలా కప్పలకి మనుష్య జాతి వలన పీడ  ఉండగా సర్ప జాతి వలన ప్రాణగండం ఎలానూ ఉంది. పాములు కప్పలు దొరికితే మహదానందంగా చప్పసరించేస్తాయి మరి ... కడుపు నిండి కప్పలు తిన్న పాము కదలకుండా నిబ్బరంగా పడుంటుందిట. కప్ప తిన్న పాములా కదలకుండా   ఎలా ఉన్నాడో చూడూ అనడం  లోకంలో వొక వాడుక.

శ్రీ.శ్రీ గారు వో గేయంలో ఘూకం కేకా ,,, భేకం బాకా అన్నారు. ఈ విధంగా ఆధునిక కవిత్వం లో కూడా కప్ప ప్రస్తావన వొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

ఆత్రేయ గారయితే ఏకంగా కప్పలు అనే వొక ప్రసిద్ధమయిన నాటికనే రాసి పడీసేరు.
నూతి లోని కప్పలు అనే దానికి లోకం తెలియని మూర్ఖులు అని అర్ధం,
కప్పదాట్లు అంటే  తెలుసు కదా ?  నడకలోనో, పరుగులోనో మధ్యలో ఓ దాటు వదిలేసి అడుగులెయ్యడం. కొంత మంది తమ ప్రసంగంలో ఎంతకీ అవసరమయిన విషయాన్ని చెప్పకుండా  తప్పించు కోడానికి ప్రసంగంలో కప్పదాట్లు వేయడం కద్దు.  సమయం వచ్చి నప్పుడు వాడి బండారమంతా బయట పెడతాను ! అని అప్పటికా ప్రస్తావనని దాట వేసే కప్ప దాట్ల రాజకీయ నాయకులని చూసేం కదా ... కప్ప గెంతులు అనే ఆట ఆడపిల్లలకి చాలా ఇష్టమయిన ఆట వెనుకటి రోజుల్లో. ఇవాళ మన చిన్నారి పాపలకి ఈ ఆట ఆడుకోడానికి కంప్యూటర్ లో కప్పగెంతులు ఆట ఉందో లేదో నాకు తెలియదు.

కప్పదాట్లనే సంస్కృతీకరిస్తే మండూక ప్లుతి న్యాయం  అవుతుంది.

సంగీత రాగాలలో కూడా దాటు గతి   అని వొకటుందని చెబుతారు. ఇలాంటిదే కాబోలు. కానయితే దానికి మంచి గౌరవస్థానం ఉంది.

ఉపనిషత్తులలో మండూకోపనషత్తు ఉంది. దాని వివరాలు తెలిసిన పెద్దలు చెప్పాలి. నా లాంటి అల్పఙ్ఞుడికేం తెలుస్తుంది చెప్పండి ?

కప్పల తక్కెడ అని ఓ జాతీయం. తక్కెడలో కప్పలని ఉంచి తూకం వేయడం ఎవరి తరమూ కాదు. అవి వొక చోట స్థిరంగా ఉంటే కదా ?  ( మన రాజకీయ పార్టీ నాయకుల్లాగ ! )

అప్పాలు కప్పలుగా మారిన వైనం వెనుటి రోజులలో ఓ తెలుగు సినిమాలో చూసి తెగ నవ్వుకున్నాం గుర్తుందాండీ ?
‘‘కరవమంటే   కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం ’’అనే మాట విన్నారు కదూ ? కప్ప కరవడమేఁవిటి పాపం ... అందుకే కదా, ‘‘కప్ప కాటు లేదు, బాపన పోటు లేదు ’’అనే సామెత పుట్టిందీ ?
‘‘కప్పలు అరుస్తూనే ఉంటాయి, దరులు ( గట్లు) పడుతూనే ఉంటాయి ’’అనేది మరో సామెత.
‘‘కప్పలు ఎఱుగునా కడలి లోతు’’ అని కూడా మరో సామెత ఉంది.

వీటి మాటకేంగానీ,‘‘ కప్పలు అరిస్తే కుప్పలుగా వాన పడతుంది’’ అని వో సామెత ఉంది.
కప్పల పెళ్ళి చేస్తే జోరుగా వానలు పడతాయని మన వారిలో వో నమ్మకం ఉంది.
కప్పల బెక బెకలు పుష్కలమైన నీటి తావులకి చక్కని సంకేతాలు.  ( ట ! )
తాళం కప్పలో కప్పకీ మనం చెప్పు కుంటున్న కప్పకీ ఏఁవయినా సమ్మంధం ఉందో, లేదో ఆలోచించాలి ...

బాల సాహిత్యం లోనూ. జానపద సాహిత్యం లోనూ చాలా కప్పల కథలు కనిపిస్తూ ఉంటాయి.  కప్పలు అందమైన రాజకుమారిగా మారి పోవడమో, లేదా యువరాణి ముని శాపం చేత కప్పగా మారి పోవడమో  ... ....ఇలాంటి కల్పిత కథలు  చాలానే కనిపిస్తాయి.
ఇంతటితో కప్పల కథకి స్వస్తి !

బెక !  బెక !!  బెక !!!

16, సెప్టెంబర్ 2015, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు !



వినాయక చవితి శుభాకాంక్షలు.
ఉదయాన్నే వొచ్చేడు నా కాషాయ మిత్రుడొకడు. ఇదేం పిచ్చిరా బాబూ ! ఇదేం గోల! ఊరంతా ఎక్కడ చూసినా వినాయక ఉత్సవాలేదారి పొడుగునా వినాయక పెండాల్ లే కనిపిస్తున్నాయి. ఒక దానిని మించిన ఎత్తులో ఒకటి ఉంటున్నాయి వినాయక విగ్రహాలు. మైకులు చెవులు చిల్లులు పడేటట్టుగా హోరెత్తించేస్తున్నాయి. ఆ రంగులు పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తుందని మొత్తుకుంటున్నా వీరికి చెవి కెక్కదు. వీళ్ళ దుంప తెగ !
అవేం విగ్రహాలు ! ఒక్కో చోట ఒక్కో రకం వినాయక ప్రతిమ కనిపిస్తోంది. ఎవడికి తోచినట్టు వాడు చేయిస్తున్నాడు. ఆధునిక వినాయకుడట ! ఆల్ట్రా మోడరన్ వినాయకుడట. వీళ్ళకి మతులు కానీ పోతున్నాయాఅని ఆవేశ పడి పోయాడు.


మైకుల హోరు తగ్గించి, శబ్ద కాలుష్యం అరికట్టాలనీవినాయక ప్రతిమల తయారీలో పర్యావరణానికి హాని కలిగించే రంగుల వాడకం కూడదనీ చెబుతున్న దానిలో విప్రతిపత్తి లేదు. కానిరకరకాల ఫోజులలో వినాయక ప్రతిమలు చేయిస్తూ గణపతి దైవాన్ని అపహాస్యంపాలు చేసేస్తున్నారనే విషయంలో నా అభిప్రాయం వేరుగా ఉంది.
విఘ్నాలు పోగొట్టి మనందరకీ సకల శుభాలూ కలిగిచే వినాయకుడంటే మనందరకీ చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే,
ఆ తొండంఆ బాన పొట్ట, ఆ కుబ్జ రూపు ... ఇవేవీ మనకి తోచవు. ఒక దేవతా మూర్తిగా భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూనే వినాయకుడిని మనం ఒక ఆత్మీయ మిత్రునిగామనలో ఒకడిగా భావిస్తాం కాబోలు. అందుకే ఏ దేవుడికీ లేని విధంగా వినాయకుడికి పూజలు చేసే వేళ వినాయక రూపాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా రూపొందించుకుంటున్నాం.
ఒక్కో చోట ఒక్కో ఆకారంలో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఈ ఉత్సవ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కపు విందు చేస్తూ ఉంటాయి. అపరిమితమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.
వినాయకుడు ఫేంటూ చొక్కా వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ల్యాప్ టాప్ ముందు కూచున్న తీరు చూసి మురిసి పోతాం
.
మోటారు బైకు నడిపే వినాయకుడూజైజవాన్ లా ముస్తాబయిన వినాయకుడూ, రకరకాల పండ్లతో చేసిన వినాయకుడూ, క్రికెట్ లాంటి ఆటలు ఆడే వినాయకుడూ, రక్షక భటుని వేషంలో ఉండే వినాయకుడూ, ఇలా ఒకటేమిటిఎన్ని రకాల ఫోజులలోనో వినాయక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి,
వినాయకుడి విషయంలో ఇదేదో తీరని అపచారం జరిగి పోతున్నదని ఊరకే గుండెలు బాదుకోనవసరం లేదని
నా అభిప్రాయం.
వినాయకుడంటే జనాలకి భక్తితో పాటు ఒక దగ్గరితనం కూడా ఉంది.తమనీతమ వృత్తులనీ, తమ జీవితాన్నీ ,జీవితావసరాలనీ, తమ ఆలోచనలనీ, తమ ఆనందాలనీ, తమ నైమిత్తిక సమమస్యలనీ, తమ అభిరుచులనీ, అభీష్టాలనూ. తమకు చెందిన సమస్త వస్తు సముదాయాన్నీ తమతో పాటు తమ ఇష్ట దైవం వినాయకుడివిగా భావించి తమను తాము ఆ గణపతితో అన్ని విషయాలలో ఐడింటిఫై చేసుకోవడం వల్ల గణపతిని ఒక దేవుడి కన్నాఒక ఆత్మీ బంధువుగానోచెలికానిగానో చూస్తూ ఉండడం వలన ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వినాయక ప్రతిమలు చేయిస్తున్నారు అని నా భావన. కనుక, ఇదేమంత తీవ్రంగా ఆక్షేపించ వలసిన విషయం కాదనుకుంటాను
సరే,  వినాయక చవితి సందర్భంగా వినాయకుని స్తుతించే ఒక చక్కని పద్యం చూదాం ....

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధము లాను వేళ బా
ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపఁబోయి యా
వంకఁగుచంబుఁగాన కహి వల్లభ హారముఁగాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁగొల్తు నభీష్ట సిద్ధికిన్
అల్లసాని పెద్దన. మను చరిత్రము)
బాల గణపతి తల్లి పార్వతమ్మ ఒడిలో చేరాడు. చనుబాలు త్రాగుతున్నాడు.పసితనపు చెయిదము చేత తొండంతో అవతలి కుచాన్ని పట్టు కోవాలని చూసాడు. అర్ధ నారీశ్వరత్వం వల్ల అటు వేపు తల్లి స్తనం వానికి దొరక లేదు.
సరి కదాపాముల హారాన్ని చూసిదానిని తామర తూడు అనుకుని పట్టుకో బోయాడు ! గజాస్యుడు కదా మరి ! తామర తూడు పట్ల ఆకర్షితుడు కావడం సహజమే మరి ! అట్టి వినాయకుడిని నా కోరికలు నెరవేరాలని సేవిస్తాను
అని పెద్దన గణపతి స్తవం కమనీయంగా చేసాడు, తన మను చరిత్రములో.
అందుకే,
పెద్దన గారి మను చరిత్ర కల్పాంతముల దనుక మను చరిత్ర !!.
అవిఘ్నమస్తు..
స్వస్తి.



12, సెప్టెంబర్ 2015, శనివారం

గుడ్డి రాజుకి నిద్ర పట్టడం లేదు !



సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర
 వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

నిద్రకు వెలియై

నే నొంటరినై

నా గది లోపడ చీకటిలో

చీకటి లోపల నాగదిలో ...  అంటాడు శ్రీశ్రీ.

నిద్ర మంచిదే కానీఅతి నిద్ర అనర్ధదాయకం !

జీవితమున సగ భాగం
నిద్దురకే పరి పోవు
మిగిలిన ఆ సగ భాం
చిత్త శుద్ధి లేక పోవు ..
అందుకే, మత్తు వదలరా ! అంటూ హెచ్చరిస్తాడు వో సినీ కవి.

సరే, ఎలాగూ నిద్ర పట్టడం లేదు కనుక తిక్కన భారతం తీసాను. చిన్న పద్యం వొకటి కనిపించింది. పద్యం చిన్నదే కానీ భావం అగాధం.  మీరూ చూద్దురూ ...


 గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని  ఈ  చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు  ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి,

 ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

ఇలాంటి సందర్భాల లోనే కదా, జీవితం మీద చెప్పలేనంత విరక్తి కలిగేది ?!







చెట్లు కూలుతున్న దృశ్యాలు !



కుమారుడు, తటాకము,కావ్యము,నిధానము,ఆలయము,వనము,భూదేవ స్థాపనము ఈ ఎనిమిదింటినీ మన పూర్వీకులు సప్త సంతానాలుగా పేర్కొన్నారు.

వీటిలో కొందరు కుమారునికి బదులుగా సత్ర ప్రతిష్ఠ ను సప్త సంతానాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. అదలా ఉంచితే, వీటిలో వనము అంటే తోట అని అర్ధం. తోటలు పెంచడంలో మన పూర్వీకులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అందులో ధార్మిక దృక్పథమూ, లోక కల్యాణ సంకల్పమూ తప్ప, వ్యాపార దృక్పథం ఇసుమంతయినా ఉండేది కాదు.

ఆర్ధిక ప్రయోజనం లేదనుకుంటే, ఎలాంటి చెట్లనయినా, అనాలోచితంగా మొదలంటా నరికి వేయడానికి సందేహించని ప్రవృత్తిని పెంపొందించుకున్నాం. ఎంత దురదృష్టమో కదూ?

ఈ సందర్భంగా మాకూ ఉన్నాయి స్వగతాలు పేరిట గోపీచంద్ వ్రాసిన తుమ్మ చెట్టు గుర్తుకు వస్తున్నది. అందులో భూకామందు తన పొలంలో పెంచుకున్న తుమ్మ చెట్టుని ఎంతో ప్రీతి పాత్రంగా చూసుకుంటాడు. కాని, అతను గతించాక, కాని కాలం దాపురించి, అతని అల్లుడు పొలం గట్టున ఆ తుమ్మ చెట్టు అసహ్యంగా ఉండడమే కాక, వ్యర్ధంగా ఉందని భావించి, నిర్దయగా దానిని కొట్టి వేయిస్తాడు. ఇందులో తుమ్మ చెట్టు ఆత్మగతం ఎంతో విఙ్ఞాన దాయకంగానూ, చాలా హృదయంగమంగానూ ఉంటుంది. తుమ్మ ముళ్ళు కాళ్ళలో దిగబడుతున్నా, దాని ఉపయోగం తెలిసిన రైతులు తుమ్మ చెట్టును ఎంతో ఆదరంగా చూసుకుంటూ ఉంటారు. దాని విశిష్టత తెలియని వ్యక్తుల దృష్టిలో తుమ్మ చెట్టు ఒక పనికి రాని చెట్టు. ఈ రచన చదివితే, ఒక్క తుమ్మ చెట్టే కాదు, ప్రతి చెట్టూ మానవాళికి ఎంతో ఉపయోగకారి అని గ్రహిస్తాం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ...

మన పెద్దలు వన దేవతలను కొలిచారు. చెట్లనూ, పుట్లనూ సేవించడం మన హైందవ సంస్కృతిలో ఒక ప్రథానభాగం.

మా చిన్నప్పుడు సోషలు పాఠంలో అశోకుడు రహదారికి ఇరు ప్రక్కలా చెట్లు నాటించెను. అనే అంశాన్ని ఎంతో ఇష్టంగా చదువుకునే వాళ్ళం. అశోకుడు రోడ్డుకి రెండు ప్రక్కలా చెట్లు ఎందుకు నాటించాడో తెలుసునా? అనడిగితే, దారి మధ్యలో అయితే ఇబ్బంది కదండీ అనే కొంటె కోణంగుల కాలమిది.

చెట్లను ప్రేమించడమంటే, ప్రకృతిని ఆరాధించడం.

ఎప్పుడో, ఏడాదికోసారి వన మహోత్సవాల తంతు తూతూ మంత్రంగా జరిపించి, చేతులు దులుపుకోవడం అనే ప్రహసనం మనకు తెలిసిందే.

కాని , మన పూర్వీకుల అలా కాదు. వృక్ష జాతిని దేవతాగణంగా తలపోసి ఆరాధించే వారు.
వాపీకూప తటాకాలు ప్రతిష్ఠించి, వనాలను అభివృద్ధి చేసే వారు. అటవీ సంపదకూ, వర్షాలకూ, భూసార పరి రక్షణకూ, సుఖతరమైన ప్రజా జీవితానికీ, చెట్లు ఆధారం అని ఏనాడో గ్రహించారు. అలాంటి వనాలను అభివృద్ధి చేసి ఆదర్శప్రాయులయ్యారు.

వృక్షో రక్షతి రక్షిత: అన్నారు.

ఈ శ్లోకం ఆ విషయాన్నే ఎలుగెత్తి చాటుతోంది. చూడండి:

దశకూప సమా వాపీ. దశ వాపి సమో హ్రద:
దశ హ్రద సమ: పుత్రో దశ పుత్ర సమో ద్రుమ:

పది నూతులతో ఒక దిగుడు బావి సమానం. నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె
సూనృత వ్రత యొక బావి మేలు .... అని నన్నయ గారు శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేత చెప్పించిన పద్యం ఇదే విషయాన్ని వివరించింది.

ఇక, పది దిగుడు బావులతో ఒక చెఱువు సమానం. ఒక కుమారుడు పది చెఱువులతో సాటి రాగలడు.
పదిమంది పుత్రులతో సమాన మైనది ఒక మహా వృక్షం !!

అని, చెట్టు ప్రాముఖ్యం ఎలాంటిదో వివరించారు.

అంతే కాదు, ఏయే చెట్లు నాటి పోషిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందో కూడా వివరించారు.

చూడండి:

అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం, న్యగ్రోథ మేకం దశతిన్త్రిణీకం
కపిత్థ బిల్వా2మలక త్రయంచ, పంచామ్రవాపీ నరకం న పశ్యేత్.

ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షం ( అంటే, వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు), ఒక మ్రరి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు. అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం ! అంటే, వారికి స్వర్ట ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.

స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను అదే లెక్కతో నాటి, అక్కడ ఓ దిగుడు బావి తవ్విస్తే సరి పోతుంది కాబోలు అనుకో వద్దు. లెక్క కేం కానీ, వీలయినన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశం.

చెట్లు కూలుతున్న దృశ్యాలు మనకింక కనిపించ కూడదు. కదూ?

స్వస్తి.

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ముఠా కవులు .. లేదా ... కవుల ముఠాలు !



స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్
క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్
తద్యూనం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతిం
స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మౌనవ్రతావలంబిన:

(సాహిత్య శేఖరం)

నోటికి తలుపుల లేవు. ఏమైనా వాగ వచ్చును. ఏవో కొద్ది మాటల పరిచయం ఉంది.వద్దనే వాళ్ళు లేరు. శాసించే ప్రభువు లేడు. పండిత పరిషత్తులూ మూలన పడ్డాయ్. అంచేత పండితులైన వారు ఎదురు చెప్ప లేక నోరుమూసుకుని ఉండి పోతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండడానికి యిష్ట పడతారు కదా. అందు చేత మీరంతా మేం కవులం ! మేమే కవులం!!
అంటూ, అడ్డూ ఆపూ లేకుండా నోటికి వచ్చినట్టుగా ఇల్లిల్లూ మారు మ్రోగి పోయేలాగ అరుస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో మా వంటి వారు ఇక మౌనవ్రతం అవలంబించడం కన్నా వేరే దారి ఏముంది ?



కవి ముఠాలు, లేదా, ముఠా కవులు అన్ని కాలాలలోనూ ఉండేవి / ఉన్నారు కాబోలు. ఈ శ్లోకం చూస్తే అదే అనిపిస్తున్నది. కావు కావుమని కాకులు అరచి ఊదరగొడుతూ ఉంటే, కోకిలలు బిక్కచచ్చిపోయి ఉండి పోక తప్పదేమో.