28, జూన్ 2010, సోమవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 2.

అఙ్ఞాత వాస వత్సరాన్ని గడపడానికి కంకుభట్టుగా విరట రాజు కొలువులో ప్రవేశించిన ధర్మ రాజు గురించి నిన్నటి టపాలో చూసాం. ఇప్పుడు భీముడు ఎలా వచ్చేడో చూదాం ...భీముడు వలలుడు అనే పేరుతో వంటల వాడిగా విరటమహా రాజు కొలువులో కుదురు కోడానికి బయలు దేరాడు.

అతని చేతిలో గరిటె ఉంది. కత్తిని చంకకి తగిలించుకున్నాడు. నల్లని వస్త్రాన్ని దట్టీగా బిగించుకున్నాడు. అందులో చుర కత్తి బిగించి ఉంది. ఎడమ చేతిలో పదనైన శూలాలు ఉన్నాయి. రంగు రంగుల లేడి చర్మాన్ని ఉత్తరీయంగా వేలాడదీసుకుని ఉన్నాడు. చూసే వారికి అతని రూపం దుస్సహంగానూ, ఆశ్చర్యం కొలిపేదిగానూ ఉంది.

భీముడు ధర్మ రాజు వచ్చిన దిక్కులో నుండి కాకుండా మరో దిక్కు నుండి విరటుడున్న తావునకు వచ్చాడు. గజగమనంతో గంభీరంగా వచ్చేడు. అలా వస్తున్న భీముడిని దూరం నుండి చూసాడు విరాట రాజు.అతడి మనసులో భయం చోటు చేసుకుంది. ఆశ్చర్యం కలిగింది. అతడి దీర్ఘ బాహువులు, విశాలమైన వక్ష స్థలం రాజుకి పరవశత్వాన్ని కలిగించాయి. మనసులో ఇలా అనుకున్నాడు:

‘‘ ఇతడు మానవ మాత్రుడు కాడు. మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చిన సూర్యుడో, చంద్రుడో, ఇంద్రుడో అయి ఉంటాడు.ఇతనిదేకులమో?పేరేమిటో? నాసేవకులలో ఎవరయినా ఇతనిని గుర్తు పట్టగలరేమో ?’’

విరటుడు ఇలా అనుకుంటూ ఉన్నంతలోనే, భీముడు అక్కడికి వచ్చి జయనాదంతో వినయంగా విరాట మహా రాజునకు నమస్కరించాడు. తర్వాత ఇలా అన్నాడు :

భీముడు:

‘‘ రాజా ! నేను నాలవ జాతి వాడిని. నీకు సేవ చేయాలని ఇక్కడికి వచ్చాను. నీవు మెచ్చుకునేలా వంటలు చేస్తాను. నన్ను మించిన వాడు వంటలు చేయడంలో మరొకడు లేడు.

నా పేరు వలలుడు. నాకు కూడూ గూడూ యిస్తే చాలును. నువ్వు కోరిన వంటకాలు చేసి పెడతాను. భక్తితో నిన్ను సేవిస్తాను. ’’ ఇలా అనగానే రాజు భీముడితో యిలా పలికాడు:

విరటుడు:

‘‘ నిన్ను చూస్తే నాలవ జాతి వాడిలాగా కనబడడం లేదయ్యా. నీ రూపం చూస్తే మొత్తం భూభారాన్ని వహించ గలిగే వాడివిగా కనిపిస్తున్నావు. నువ్వు వంటలు చేయడం ఏమిటి ! నీకు నేను తగిన వాహనం యిస్తాను. పీఠం సమకూరుస్తాను. వెల్ల గొడుగుని సిద్ధం చేయిస్తాను. నీకు నా కొలువులో చనువుగా మెలుగుతూ తిరగ గలిగే పదవి చేకూరుస్తాను. నా గజ సైన్యానికి నిన్ను అథ్యక్షునిగా చేస్తాను. నా ఏనుగులను పర్యవేక్షిస్తూ ఉండవయ్యా.’’

భీముడు: (తల అడ్డంగా తాటించాడు) ‘‘ రాజా ! నాకవన్నీ ఎందుకయ్యా? రాజులకు ఇంపుగా వంట చేస్తాను. నా వంట ధర్మ రాజుకి చాలా నచ్చేది. నీవు పుణ్యాత్ముడివి. అందు చేత ధర్మ రాజుని ఎలా సేవించు కున్నానో, నిన్నూ లాగే సేవిస్తాను.

నేను బలవంతుడను. అడవి దున్నలతో, ఏనుగులతో, పెద్ద పులులతో, సింహాలతో పోరాడుతాను. బలవంతులూ, మల్లురూ, వారితో పోరాడుతాను. ఒక్క గడియలో వారిని చిత్తు చేసి పారేస్తాను. నీకు వినోదం కలిగిస్తాను. నీకిష్టమైతే నన్ను నీ కొలువులో చేర్చుకో.

ఒక వేళ నీకు నా చేత కొలువు చేయించుకోవడం యిష్టం లేక పోతే నన్ను పొమ్మనటం మంచిది. నాకు నచ్చిన చోటుకి వెళ్తాను. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు.’’

విరటుడు: (బ్రతిమాలే ధోరణిలో): అయ్యో, నీరూపాన్ని చూసి, నీ పరాక్రమాన్ని అంచనా వేసుకుని నీకు తగిన విధంగా చెప్పాను తప్ప , మరోటి కాదు.నువ్వు ఇక్కడ ఉండడమే మాకు ఇష్టం. సరే, నీవు వంటశాలకు అధికారిగా ఉండు. వంట వాళ్ళంతా నీ అదుసాఙ్ఞలలో ఉంటారు.’’

ఈ విధంగా పలికి, విరటుడు సంతోషంగా భీముడిని తన కొలువులో వంటల వాడిగా ఏలుకున్నాడు.

ఇక, విరటుని కొలువులోనికి పాండవ మధ్యముడు అర్జునుడు ప్రవేశించిన తీరు రేపటి హిత వచనమ్డాట్ కామ్ లో చూదాం ....

స్వస్తి. .

3 కామెంట్‌లు:

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) చెప్పారు...

ఓసారిటు చూడగలరు.
http://sreemadaandhramahaabharatam.blogspot.com/

కమనీయం చెప్పారు...

Ihave read your reviews and children columninNavya recently and liked them.Please read my friend Ramisetty's article Srikakulam naaprathibimbam inAndhrajyothi sunday Also please atten and see exhibition of beautiful paintings of my friend Nagabhushanarao's granddaughter in Madaapur artgalleryO from OCtober 10to17.

కమనీయం చెప్పారు...

people feel vinayakaas friendly God so your comment is apt .But I feel they are going too much.there is no blasphemy in Hinduism But it will be better.if we observe some self restraint in celebrating Vinayakachavitifestival.

కామెంట్‌ను పోస్ట్ చేయండి