7, జూన్ 2010, సోమవారం

మంచి మాట


ఆంధ్ర మహా భారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం ( తిక్కన కృతం) శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ఒక అపూర్వ మయిన పద్యం ఉంది.

సారపు ధర్మమున్ విమల సత్యముఁబాపము చేత బొంకుచేఁ
బారముఁబొంద లేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్య శుభ దాయక మయ్యును దైవముండెడిన్

ఉత్తమ మయిన ధర్మం, నిర్మల మయిన సత్యం పాపం చేతను, అసత్యం చేతను దరి చేర లేక చెడబారి పోవడానికి సిద్ధ మయిన తరుణంలో వాటిని రక్షించ గలిగే సమర్ధత కలిగి ఉండి కూడ ఎవరు ఉపేక్ష చేస్తారో, అది వారికే కీడు కలిగిస్తుంది. కాని, ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడే దైవం ఉంటాడు సుమా!

శ్రీకృష్ణుడు కురు సభలో పెద్దలందరి ఎదుట పలికిన పలుకులివి.

ఉదాత్తమయిన వ్యంగ్య వైభవంతో, గంభీర భావ ప్రధానమయిన ఈ పద్యం మహా భారతం లోనే ఒక ధర్మ దీపంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు.

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత నశిస్తున్నప్పుడు దక్షులైన వారు చూస్తూ ఊరుకుంటే, అది వారికే హాని కలిగిస్తుంది. సత్య ధర్మాలను కాపాడడానికి భగవంతుడు ఉంటాడు.

కురు సభలో సత్య ధర్మాలకి చ్యుతి కలుగుతున్నా ఉపేక్ష చేసిన పెద్దలకు ఒక హెచ్చరికగా ఉంటుందీ పద్యం. అలాగే, సత్య ధర్మాలను కాపాడే శ్రీకృష్ణుడు పాండవ పక్షం వహించి ధర్మ రక్షణ చేసి, సత్యాన్ని కాపాడతాడని సూచన కూడ ఇందులో ఉంది.

ఈ పద్యం తిక్కన రచలనలో ఒక అనర్ఘ రత్నంగా భాసిస్తూ ఉంటుంది. మహా భారత కథా తత్త్వానికి ఈ పద్యం ఆత్మ వంటిదని పెద్దలు చెబుతారు.

క్లిష్ట మయిన పరిస్థితులలో భగవంతుడు ధర్మాన్నీ, ధర్మాత్ములను రక్షిస్తాడని, అధర్మాన్నీ, అధర్మ పరులనూ శిక్షిస్తాడనీ నమ్మే తెలుగు వారి విశ్వాసానికి అద్దం పట్టేలా ఉంటుందీ పద్యం.

తదుపరి హిత వచనమ్ . కామ్ లో మరి కొన్ని చూదాం ...

స్వస్తి.


1 కామెంట్‌:

WitReal చెప్పారు...

చాలా మంచి పద్యాలు గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు.

మంచి ధర్మ సూత్రాన్ని చెబుతూనే, కృష్ణుడు భవిష్య చిత్రాన్ని అందరికి చూపించాడీ పద్యంలో!

కామెంట్‌ను పోస్ట్ చేయండి