10, జూన్ 2010, గురువారం

మంచి మాట


హిత వచనమ్ . కామ్ లో భారతంలో చెప్ప బడిన రాజ నీతి ధర్మాలు చూస్తున్నాం కదా.
ఇప్పడు మరి కొన్ని యుద్ధనీతి ధర్మాలు చూదాం ... శాంతి పర్వం ద్వితీయాశ్వాసం నుండి ....


రాజు తన మూల బలం ( అంటే, చతురంగ బలాలలో ప్రధాన సైన్యం) శత్రుసంహారార్ధం అని భావించి, దానిని ప్రేమగా చూడాలి. శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించి నప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం.యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి. అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన సామోపాయంతో ప్రవర్తించాలి.

ఒక్కో సారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు. శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా సామ దాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి భేదోపాయానికి ప్రయత్నించాలి.

శుక్రాచార్యుడి మతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావ మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.

మరి కొంత యుద్ధ నీతి చూడండి ...

యుద్ధంలో శత్రువు పైన్యంతో ఎదుర్కొంటే, నువ్వూ సైన్యం తోనే ఎదిరించాలి. శత్రవు ఎక్కటి కయ్యానికి తలపడితే నీవూ అదే చేయాలి.శత్రువు మాయోపాయాలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీవు కూడ కపటోపాయంతోనే ఎదిరించాలి.
శత్రువు వెన్ను చూపి పారిపోయినా, అజాగ్రత్తగా ఉన్నా, అతని ఆయుధం భగ్నమయినా, శరణు వేడినా, మ్రొక్కినా, శత్రువు గుర్రాలు నేల కూలినా, పారి పోయినా, శత్రువు వేరొకడితో యుద్ధం చేస్తున్నా, ఎట్టి పరిస్థితులలోనూ శత్రువుని చంప కూడదు సుమా ! అది యుద్ధ నీతి కాదు. అధర్మంగా యుద్ధంలో శత్రువుని చంపడం కంటె చావడం మంచిది.

మరొక విషయం ... యుద్ధంలో వాడే ఆయుధాల గురించి ... చివర ములికిని ఉంచి తయారు చేసిన ఆయుధాన్ని కానీ, లేదా, విషం పూసిన ఆయుధాన్ని కానీ ఎలాంటి శత్రువు మీద కూడ ప్రయోగించ కూడదు. అలా చేస్తే రాజునకు నరకం ప్రాప్తిస్తుంది.
అలాగే యుద్ధలో తనకు సహాయంగా వచ్చి, ఘోరంగా గాయాలబారిన పడిన వారిని పట్టించు కోకుండా ఉండ కూడదు.అది చాల పాప హేతువు.

శత్రువుపై దండెత్తి, అతని రాచ నగరుని వశం చేసుకుని, నాశనం చేయడమూ, అక్కడి ప్రజలను బాధించడమూ కూడ తగదు. అలాగే బ్రాహ్మణుల యిళ్ళను, దేవాలయాలను కొల్ల గొట్టడం కూడా సరి కాదు. అది రాజునకు తగని పని.

భీష్ముడు ఈ యుద్ధ నీతిని బోధించగా విని, ధర్మ రాజు ‘‘ మొత్తానికి రాజ ధర్మం కంటె మరొక పాప కార్యం లేనట్టుంది. ఎలా చూసినా రాజునకు నరకం తప్పేలా లేదు.’’ అంటూ కించ పడ్డాడు.

రాజ్యాంతే నరకం ధృవమ్ అని పెద్దలు చెప్ప లేదూ ?

మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో చూదాం ...

స్వస్తి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి