22, జూన్ 2010, మంగళవారం

మీ దయ వల్ల మేం బ్రతికి పోయాం ! .... మంచి మాట


ఆంధ్ర మహా భారతం విరాట పర్వం ( తిక్కన సోమయాజి రచన) ప్రథమాశ్వాసం నుండి)


పాండవుల అరణ్యవాసం ముగిసింది. ఇక మిగిలింది అఙ్ఞాతవాసం. ఆ ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిశ్చయమయింది. సరే. మారు వేషాలలో ఎవరికీ అనుమానం రాని విధంగా అఙ్ఞాతంగా గడపాలి. విరటుని కొలువులో ధర్మ రాజు కంకు భట్టు గానూ, భీముడు వలలునిగానూ,అర్జునుడు బృహన్నలగానూ, నకులుడు దామగ్రంధి గానూ, సహదేవుడు తంత్రీపాలుడు అనే పేరుతోనూ వ్యవహరించడానికి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ సమయంలో రాజ పురోహితుడు ధౌమ్యుడు పాండవులకు కొన్ని సేవా ధర్మాలు తెలియ జేసాడు.

నేటి హిత ‘ వచనమ్’ డాట్ కామ్ లో వాటి గురించి ....

లోకంలో తెలిసిన వారు చాలమంది ఉంటారు. కాని, శ్రేయోభిలాషులయిన వారు అట్టి విఙ్ఞు లకు అదనెరిగి తగిన బుద్ధులు చెప్ప వలసినదే.

మీరు ఉన్నతమయిన కౌరవాన్వయంలో పుట్టిన వారు. అలాంటి మీరు ఒక సామాన్య మానవ మాత్రుని సేవిస్తూ , మానావమానాలను సహిస్తూ, అణగిమణగి సవినయంగా ఉండడం కష్టమే.

రకరకాలయిన అస్త్రాలు మంటల వంటివి. వాటిని ధరించే పాండవులు అగ్నుల వంటి వారు. అట్టి మీరు కాల విరోధాన్ని మరచి పోకూడదు సుమా ! కాదని మరచి పోతే, బాహాటంగా మీ పరాక్రమాన్ని ప్రకటిస్తే మీ ఉనికి తెలిసి పోతుంది. కార్యం చెడి పోతుంది. అఙ్ఞాత వాసం భంగమవుతుంది.

కనుక నాకు తెలిసినంత మేరకు మీకు కర్తవ్యం ఉపదేశిస్తాను. వినండి.

రాజ సభలోకి తగిన విధంగా అడుగు పెట్టాలి. తనకు తగిన ఆసనంలో కూర్చోవాలి.తన రూపంలో కాని, వేషంలో కాని ఏ మాత్రం తేడా ఉండ కూడదు. అంటే, వికృతత్వం లేకుండా చూసుకోవాలి. వేషానికి భిన్నంగా వేషధారణ పనికి రాదు. సమయం తెలుసుకుని మసలు కోవాలి.రాజ సభలో ప్రసంగించేటప్పుడు సమయం చూసి. తనకు అవకాశం దొరికినప్పడు మాత్రమే ప్రసంగించాలి. అలా చేస్తే ఎవరయినా రాజుకి గౌరవపాత్రుడవుతాడు.

రాచ కొలువువ ఉన్నాను కదా, రాజుతో చనువుగా తిరుగుతున్నాను కదా అని, నాకేమిటి అనే భావనతో నిర్భయంగా మర్యాదను అతిక్రమించి నడుచుకో కూడదు. అలాగయితే, మొదటికే మోసం వస్తుంది.

రాజగృహం కన్నా అందమయిన ఇల్లు కట్టుకో కూడదు. అలాగే రాజు గారిలా దుస్తులు ధరించ కూడదు. రాజు మాట్లాడే విధంగా మాట్లాడడం తగదు. అంటే వీటి వేటి లోనూ ఎంత మాత్రం రాజుని అనుకరించ కూడదు. సేవకుడు ఎట్టి పరిస్థితి లోనూ రాజు దగ్గర తన ఆధిక్యాన్ని చూపించ కూడదు. అణకువగా జీవించాలి.

ఎందుకంటే, రాజు ధిక్కారాన్ని సహించడు. తన ఆఙ్ఞను అతిక్రమించే వాడు కొడుకవనీ, మనుమడవనీ, సోదరుడవనీ, స్నేహితుడవనీ రాజు అంగీకరించడు. తన మేలు కోసం, భద్రత కోసం వారిని తన శత్రువులు గానే పరిగణిస్తాడు. వారి మీద కోపం పెంచుకుని వారి అంతు చూస్తాడు.

ఏదయినాసరే సాధించుకో గలిగే సమర్ధుడి పనికి అడ్డు వెళ్ళ కూడదు. తగుదునమ్మా అని ఆ పని తనమీద వేసుకుని నేర్పును ప్రదర్శిస్తూ పూసుకుని తిరుగ కూడదు. దాని వలన అసలు స్థితికి ముప్పు వస్తుంది.

రాజుతో సన్నిహితంగా ఉండడంలో తప్పు లేదు. కాని రాజు దగ్గర చాలమంది ఉంటారు వారికి కష్టం కలిగించే పనులలో మాత్రం జోక్యం చేసుకోవడం తగదు. అలా చేయడం వల్ల ఆ సేవకుడి గొప్పతనం వెల్లడి కావచ్చును. సమర్ధత తెలియ వచ్చును. పేరు ప్రతిష్ఠలు రావచ్చును. కాని ఆ తర్వాత హాని కలగడం మాత్రం తథ్యం. అందు వలన తెలివయిన వారు అలాంటి పనులకు పూనుకొనరు.

రాజు దగ్గర మౌనంగా ఉండ కూడదు. అలాగని పదిమందితో ఆర్భాటంగా మాట్లాడ కూడదు. సన్నిహితులయిన సేవకులతో పాటు తాను రాజుతో మాటలాడడం సబబు.

రాజు కొలువులో ఉన్నప్పుడు వ్యతిరేకత తోచే విధంగా ఇతరులకు జవాబులు చెప్ప కూడదు. అవసరమయినప్పుడు మాత్రం తనంతట తానే ముందుకు వచ్చి రాజాఙ్ఞను నిర్వర్తించాలి.

సభలో ఎప్పుడై రాజునకు మరీ ఎట్ట ఎదురుగా నిలబడ కూడదు. అలాగని వెనుకవేపూ ఉండ కూడదు. ఏదో ఒక ప్రక్కగా నిలబడి సేవించాలి. సదా రాజు ముఖం లోకే చూస్తూ ఏమంటాడో, ఎటు చూస్తాడో, ఎవరిని చూస్తే ఎటువంటి ఆలోచన కలుగుతుందో - వీటన్నింటినీ మనసులో ఉంచుకుని జాగురూకతతో మెలగాలి.

రాజాంత:పురంలోని మాటలు ఎప్పుడూ బయటపెట్ట కూడదు. గుట్టు పాటించాలి. వేరే ఎక్కడయినా రాజుకి సంబంధించిన మాటలు వినబడితే ముందుగా బాగా ఆలోచించాలి. ఆతర్వాత అవి రాజువినదగినవయితే వాటిని రాజు చెవిని వేయాలి.అప్రియమయిన విషయాలు ఎప్పుడూ రాజుకి చెప్ప కూడదు.

రాజాంత:పురంలో రకరకాల వారుంటారు. అక్కడ తిరిగే గూని వారు, కుబ్జలు ( వామనులు) పరిచారికలు మొదలయిన వారితో స్నేహం పనికి రాదు. భటుడికి అంత:పురంతో సంబంధం మంచిది కాదు.

రాజు అనుమతిస్తేనే ఆసనం ఎక్కి కూర్చోవాలి. అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా పెద్ద పెద్ద వాహనాలను తమంతట తాము ఎన్నుకోవడం, ఎక్కడం తగదు. రాజు దగ్గర ఎంత గౌరవాదరాలు ఉన్నప్పటికీ అది తగని పని.

రాజు తనను గౌరవించాడు కదా అని పొంగిపో కూడదు. ఉబ్బితబ్బిబ్బయిపో రాదు. అలాగే అవమానించినప్పుడు అయ్యో, రాజు అవమానించాడు కదా అని క్రుంగిపోనూ కూడదు. మానావమానాలను సమానంగా పరిగణిస్తూ రాజు దగ్గర మెలిగితే సేవకులకు మంచి జరుగుతంది. ఆపదలు తొలిగి పోతాయి.

ఒక్కోసారి రాజు ఎవరినయినా సంరక్షించాలని అనుకుంటాడు. లేదా, శిక్షించాలని అనుకుంటాడు. ఆ సంగతి ముందే తనకు తెలిసినా అవి అమలు కాక ముందే తనంతట తానుగా వాటి గురించి వెల్లడి చేయ కూడదు. అలా చేసే వాడు మూర్ఖుడు.

ఎండకూ , వానకూ ఓర్చు కోవాలి. తన ఇల్లు, పరాయి కొంప అని అనుకో కూడదు. ఆకలి వేస్తుంది, అలసి పోతాను, నిద్రా సమయం మించి పోతుంది, దాహం వేస్తున్నది ఈ పనంతా ఒక్కడినే ఎలా చేయడం, ఇదేమిటి రాజు నాకు ఈపని ఇప్పుడు పురమాయించేడు ... ఇలా సేవకుడు ఎప్పుడూ ఆలోచించ కూడదు. అనుకో కుండా రాజు ఒక పని చెప్తే భక్తి శ్రద్ధలతో చేయాలి. నెపాలు వెతక కూడదు.

రాజునకు ఎంత ఆప్తుడయినా కావచ్చును. కాని, రాజధనాన్ని పాము ఎముకల లాగా చూడాలి. వాటిని సంగ్రహించే బుద్ధి మానుకోవాలి. లేక పోతే ధన, మాన ప్రాణాలు నిలవవు. వాటికి ముప్పు కలుగుతుంది. ( పాము ఎముకలు విషతుల్యాలు కనుక, వాటిని తాక రాదని లోక ప్రసిద్ధి.)

రాజు కొలువు తీరినప్పుడు సేవకుడు బహిరంగంగా ఆవులించ కూడదు. తుమ్మ కూడదు. నవ్వడం అసలే పనికి రాదు. నిష్ఠీవనం ( ఉమ్మి వేయడం) నిషిద్ధం. వీటి వల్ల ప్రక్క వారికి యిబ్బంది. చిరాకు. కాబట్టి వీటిని తప్పని సరయితే గోప్యంగా చేయాలి.

శత్రువుల దూతలు, రాజు ఆగ్రహానికి గురయిన వారు, రాజు చేత నిరాకరించబడిన వారూ, పాపాత్ములూ ఎప్పుడూ తమకు దగ్గరగా ఉండ కూడదు. అంటే, వారిని చేరదీయ కూడదు. దాని వలన చివరకు నింద రావడమే కాక, కీడు కూడ కలుగుతుంది.

రాజు దగ్గర మెలిగే వారెవరితోనూ వైరం పనికి రాదు. చివరకి ఏనుగుతోనయినా, దోమతోనయినా సరే. అంటే గొప్ప వారితో నయినా, సామాన్యులతో నయినా వైరం కూడదు. రాచ కొలువునకు చెందిన వారితో స్నేహంగా ఉండడం మేలు.

సంపదలు అనుభవించడానికే కదా అని, మన దగ్గర ఉంది కదా అని, రాజునకు తెలిసేలా విచ్చలవిడిగా భోగాలు అనుభవించ రాదు. రాజునకు కంటగింపుగా ఉండేలా భోగాలు అనుభవించకుండా, వినమ్రతతో వేడుకలు చేసుకోవాలి.


ఇలా ధౌమ్యుడు చేసిన హిత బోధలు విని పాండవులు చాల సంతోషించారు. సంతోషించి అతనితో యిలా అన్నారు: ‘‘ మాకు తల్లయినా, తండ్రయినా, దైవమయినా, మిత్రులయినా మీరే ! మేము విరటుని కొలువులో ఉండేటప్పుడు ఎలా మెలగాలో చక్కగా బోధించారు. మేము పాటించ వలసిన నడవడిక పద్ధతులను ఎంతో చక్కగా, స్పష్టంగా వివరించారు. నిజం చెప్పాలంటే, మీ దయ వల్ల మేము బ్రతికి పోయాం ... ’’


మరి కొన్ని ... తదుపరి హిత ‘వచనమ్’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.


4 కామెంట్‌లు:

కమల్ చెప్పారు...

అందుకే అన్నారు పెద్దలు '' వింటే భారతం వినాలి'' అని ...

great MAHABHARATHAM

మంచి టపా రాసినందుకు ధన్యవాదాలు.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) చెప్పారు...

ఓ సారిక్కడ చూడ గలరు.
http://sreemadaandhramahaabharatam.blogspot.com/search/label/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%20%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81

Sandeep చెప్పారు...

అయ్యా జోగారావుగారు,

చక్కని విషయాలను తెలియజేశారు. వేదుల బాలకృష్ణమూర్తి గారు కూడా మన సాహితీసంపదను digitalize చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మీ బోటి పెద్దలు ఈ దివ్యకార్యానికి పూనుకోవడం తెలుగుతల్లికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ఇచ్చి చల్లగా చూడాలని, మీరు ఇలాంటి వ్యాసాలు ఇంకా చాలా వ్రాయాలని కోరుకుంటున్నాను.

పంతుల జోగారావు చెప్పారు...

కమల్ , నరసింహ, సందీప్ గార్లకు నా ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి