24, నవంబర్ 2010, బుధవారం

ఒక పరి దైవం ... ఒక పరి దెయ్యం !


ఉదయాన్నే వచ్చేడు, మిత్రుడు భీమ్ పాపాల శర్మ. వాడిని చూస్తూనే నా గుండె తరుక్కు పోయింది.పది లంఖణాలు చేసిన వాడిలా ఉన్నాడు. మనిషిలో ఉత్సహం ఎక్కడా మచ్చుకయినా లేదు. దెయ్యాలతో సయ్యాట లాడించ గలవాడూ, హత్యలూ, హింస అంటూ నిత్యం కరాళ తాండవం చేసే వాడూ, చరిత్రలో రక్తపు జాడలను రొక్కంగా మార్చ గల చతురత కలవాడూ అయినా , నా మిత్రుడే ఇలా డీలా పడి పోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఏం జరిగిందేం జరిగిందని నేను అడిగే లోపే బెక్కుతూ చెప్పేడు: ‘‘ వెధవ కల ! వెధవ కలా
అని ! వొట్టి పీడ కల ! జడిసి పోయి చచ్చేననుకో !’’ అన్నాడు.

‘‘ ఏమిట్రా, ఆ కల ? ’’ అడిగేను.

‘‘ నా ఖర్మ కాలి, ఓ పేద్ధ కార్పొరేట్ హాస్పటల్ కి వైద్యం కోసం వెళ్ళినుట.’’

‘‘ అయితే ...?’’

‘‘ నా జబ్బు తగ్గ లేదు సరి కదా, వాళ్ళు నన్నూ, నా పర్సునీ, నా క్రెడిట్ కార్డునీ, బేంక్ బ్యాలన్సునీ, మొత్తం ఊడ్చేసారు ...’’

‘‘ పోనీ, నీ రోగం కుదిరిందా ?’’

నా మాటల్లో వ్యంగ్యం ధ్వనించిందేమో, నిష్ఠుర పడుతూ అన్నాడు: ‘‘ నా బొంద తగ్గింది. తగ్గితే, ఇలా ఉంటానూ? .... రాత్రికి రాత్రే ఎవరి కంటా పడకుండా ఇలా పారి పోయి వచ్చేసాను ... ఇంకా ఉంటే, నా గోచీ కూడా మిగల్చ రేమో నని భయం వేసిందనుకో ...’’

‘‘ భయమెందుకురా? ... కలే కదా, సరే, ఇంతకీ ఏం రోగం వచ్చిందని అక్కడికి
వెళ్ళావు ?’’ ఆరాతీసాను.

‘‘ బుద్ధి తక్కువై వెళ్ళాను. కొంచెం జలుబు చేసిందంతే. జండూ బామ్ తో పోయే దానికి, తగుదునమ్మా అని, ముచ్చట కొద్దీ అక్కడికి వెళ్ళానులే .... కలలోనే కదా అని కొంచెం సాహసం చేసినట్టున్నాను.... గుండు గొరిగీసేరు ...కచ్చ దాదాపు ఊడదీసీసేరు ...’’ ఏడుస్తూ చెప్పేడు.

వాడిని ఓదార్చి, సాగనంపేక ఆలోచనలో పడ్డాను.

* * * * * * * * * * * * * * * * * * * *

‘వైద్యో నారాయణో హరి : ’ అన్నారు. కానీ, వైద్య రంగం కలవారికే కానీ, లేని వారికీ, సగటు జనాలకు - అందని మ్రాని పండే అవుతోంది. అక్కరకు రాని చుట్టమే అవుతోంది. అందని గగనమే అవుతోంది. భయ పెడుతోంది. బాధిస్తోంది. పీడిస్తోంది. ధన మదం పట్టిన వైద్య రంగంతో దేశం జబ్బు పడింది.


వైద్యం సరిగా తెలియని వారిని వెక్కిరిస్తూ, ‘ నీ చేతి మాత్ర, వైకుంఠ యాత్ర ’ అనడం కద్దు.

కాని, ఇప్పుడు వైద్య రంగం శత సహస్రదళాలుగా వికసించింది. విస్తరించింది. కాని , ఏం లాభం !
అధిక శాతం జనాభాకి అందుబాటులో ఉండడం లేదు.

అప్పిచ్చు వాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడ తెగక పారు ఏఱును, ద్విజుడున్
చొప్పడిన ఊర నుండుము
చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము సుమతీ !

అని, బద్దె భూపాలుడు నెత్తీ నోరూ కొట్టుకుని మరీ చెప్పేడు. ఇప్పుడు దాదాపు ప్రతీ ఊళ్ళోనూ వైద్యులు కనిపిస్తున్నారు. కాని, వారిలో కనిపించని దల్లా రవ్వంత మానవీయ దృక్పథం. అంతే.

అందుచేతనే కదా, ఒక శ్లోకంలో కవి ఇలా అన్నాడు:

వైద్య రాజ నమ స్తుభ్యం, యమరాజ సహోదర !
యమస్తు హరతి ప్రాణాన్, వైద్య:ప్రాణాన్ ధనానిచ.

యముడికి తోడ బుట్టిన వాడి వయిన ఓ వైద్యుడా ! నీకు నమస్కారం. ఎందుకంటే, యముడు కేవలం ప్రాణాలనే తీసుకుని పోతాడు. మరి వైద్యుడో ? ప్రాణాలనూ, ధనాన్నీ కూడా హరిస్తాడు. కనుక, నా జోలికి రాకయ్యా, నీకో నమస్కారం ! అని దీని భావం.

ఈ శ్లోకం చూడండి:

యావత్కంఠగతా: ప్రాణా::, యావన్నశ్యతి చేంద్రియమ్
తావత్ చికిత్సా కర్తవ్యా, కాలస్య కుటిలా గతి:

వైద్యం ఎంత వరకూ చేయాలయ్యా, అంటే,

గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ. ఇంద్రియాలలో చైతన్యం ఉన్నంత వరకూ.వైద్యుడు రోగికి చికిత్స చేస్తూనే ఉండాలి. కాల గతి చెప్పరానిది సుమీ ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో జరిగేది వేరు. యావత్తైలం, తావద్వ్యఖ్యానమ్ అన్నట్టుగా, రోగి డబ్బులు ఇచ్చేంత వరకే వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తరువాత నీ చావు చావు పొమ్మంటున్నాడు. అవును కదూ?

అయితే, వైద్యుడేమీ భగవంతుడు కాడు కదా, చికిత్స జరిపించ గలడు కానీ, ఆయుర్దాయం నిలప లేడు కదా. క్రింది శ్లోకం అదే చెబుతోంది.

వ్యాధే: తత్త్వ పరిఙ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహ:
ఏతద్వైద్యస్య వైద్యత్వం, న వైద్య: ప్రభురాయుష:

వ్యాధి స్వభావం తెలుసు కోవడం, ఉన్న బాధను తగ్గించడానికి ప్రయత్నించడం, ఇంత వరకే వైద్యుడు చేయ గలడు. ఆయుర్దాయం మాత్రం వైద్యుని చేతిలో లేదు కదా ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో, రోగికే తెలిసి పోతున్న వ్యాధి ఏమిటో కనుక్కునే నెపంతో వైద్యుడు చేయించే పరీక్షలు అన్నీ యిన్నీ కావు.వ్యాధి నిర్ధారణ మాట అలా ఉంచితే, రోగి వాటితోనే సగం దివాళా తీయడం ఖాయం.


అయితే, ఒకటి ... నీ కంటూ కథా మంజరి పేరుతో ఓ దిక్కుమాలిన బ్లాగు ఉంది కనుక, తెలుగులో ఏపిల్ కీ బోర్డుతో టైపు చేయగల నేర్పు ఉంది కనుక, వైద్యుల గురించి అవాకులూ చవాకులూ పేలుతున్నావు, ఎక్కడెక్కడివో శ్లోకాలు ఉటంకిస్తూ రాద్ధంతం చేస్తున్నావు ... మరి వైద్యులూ మనుషులే కదా, వాళ్ళూ బ్రతకొద్దూ? అంటారేమో,

చూడండి:

వైద్యామృతంలో ఒక శ్లోకం ఏమని చెబుతోందో ...

నైవ కుర్వీ లోభేన, చికిత్సా పుణ్య విక్రయమ్
ఈశ్వరాణాం వసుమతాం, లిప్సేతార్ధం తు వృత్తయే.

చికిత్స చేసే వైద్యుడు ఆ పుణ్యాన్ని ధనాశాపరుడై అమ్ముకో కూడదు. చికిత్సను ఒక దైవ కార్యంలాగా చేయాలి. అంతే తప్ప డబ్బుకి అమ్ముకో కూడదు. కాని, వైద్యులు తమ కుటుంబ పోషణ కోసం కాసులు కల వారి వద్ద, ఇవ్వగల స్తోమత కల వారి వద్ద నుండి కోరినది తీసికో వచ్చును. అని దీని భావం.

అంటే, డబ్బున్న వారినుండి డబ్బు తీసుకుని, పేదలకు వీలయితే ఉచితంగానూ. లేదంటే
నామ మాత్రపు వసూలు తోనూ వైద్యం చేసి మానవత్వం చూపించాలని దీనర్ధం.

కాని, దురదృష్టవశాత్తు వైద్యులు అలా ప్రవర్తించడం (ఎక్కడో, ఎవరో కాని ) లేదు. నిజానికి వైద్యుడు నారాయణుడితో సమానం. దైవంతో సమానుడైన వైద్యుడు


కొండొకచో



దెయ్యంగా మారి పోతున్నాడనేదే నా ఫిర్యాదు.

ఈశ్లోకాలు కూడా చూడండి:

జృంభమానేషు రోగేషు, మ్రియమానేషు జంతుషు
రోగ తత్త్వేషు శనకై: వ్యుత్పద్యంతే చికిత్సకా:

ప్రవర్తనార్ధ మారంభే, మధ్యే త్వౌషధ హేతవే
బహుమానార్ధ మంతే చ, జిహీర్షంతి చికిత్సకా:

రోగుల నుండి డబ్బులు గుంజు కోవడంలో వైద్యలకు వారి చిట్కాలు వారికి ఉన్నాయి. ఆ టెక్నిక్కులు , గిమ్మిక్కులు, మేజిక్కుల, వారికి బాగా తెలుసును. ఈ శ్లోకంలో కవి అదే చెబుతున్నాడు. చూడండి:

రోగాలు ముదిరి పోయి ప్రాణాలు కడ తేరి పోతూ ఉంటే, రకరకాల పరీక్షలూ గట్రా చేసి, ప్రయోగాలూ విశ్లేషణలూ జరిపి, (కొందరు) వైద్యులు అప్పుడు మెల్లగా రోగ తత్వం తెలిసిందంటూ చికిత్సకి పూనుకుంటారు.

మొదట రోగ నిదానం చేయడానికి డబ్బు గుంజుకుంటారు. మధ్యలో మందులకని డబ్బు లాగుతారు. చివరలో బహుమానమని (అంటే, రోగం తగ్గింది కనుక సంతోషం కొద్దీ) డబ్బులిమ్మని వేధిస్తారుట. ఇదీ లోక రీతి అని కవి చెబుతున్నాడు. మొత్తానికి ఆది మధ్యాంతాలలో కూడా వైద్యుడు డబ్బులు గుంజుతూనే ఉంటాడని కవి భావన.

ఈ కాలంలో బహుమానం పేరుతో అడక్క పోయినా, రూమ్ ఛార్జీలూ, సేవల ఛార్జీలూ, బెడ్ ఛార్జీలూ, మన్నూ మశానం పేరుతో బాగానే గుంజుతారు. రోగం కుదిరిందన్న ఆనందం హరించుకు పోయి, రోగికి ఈ పీడ ఎక్కువవుతుంది. ఖర్మ కాలి, రోగి టపా కట్టేస్తే, చెప్పే పని లేదు. మృత దేహం ఒప్పగించడానికిన్నూ అధిక మొత్తం చెల్లించాల్సిందే కదా !


చివరిగా మంచి ఆరోగ్యం కోసం మన పెద్దలు ఏం చెప్పారో కూడా చూడండి మరి ...

ఆరోగ్యం భాస్కరా దిచ్చే, ద్ధన మిచ్చేత్ హుతాశన:
ఙ్ఞానం మహేశ్వరా దిచ్చేత్, మోక్ష మిచ్చేత్ జనార్ధనాత్.



సూర్య భగవానుని ఉపాసించడం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది.
అగ్నిని ఉపాసించడం వలన సంపద కలుగుతుంది.
ఈశ్వరుని వలన ఙ్ఞానం కలుగుతుంది.
జనార్దనుని వలన మోక్షం కలుగుతుంది.

స్వస్తి.









3 కామెంట్‌లు:

Chakradhar Sarma Rayapati చెప్పారు...

meeru pustakalu baga chaduvutunnatunnaru.andari telugu kanna medi koncham different ga vundi.mee post bagundi nijam kudanu..avunu intha ga cheptunnaru meru gani doctor daggara ila mosa poyaraa enti?

http://namanobavalu.blogspot.com/

కథా మంజరి చెప్పారు...

డా. ముద్దు వెంకట రమణ రావు గారు జీ మెయిల్ ద్వారా ఈ కామెంట్ చేసారు.

Ramana Rao Muddu మీకు ఒక బ్లాగుకు లింక్‌ను పంపారు:

you know about me and grandfather.Many people still are treated by Govt.hospitals.Why should you go to corporate hospitals for minor complaints?Anyway Iam for nationalisation of medical services and free treatment of all as in France.Let us not follow America in this respect.Dr.Ramanarao.

అజ్ఞాత చెప్పారు...

ఒకపరి తల్లిగా నొప్పారి రోగుల
లాలించుచు చికిత్సలందజేయు;
ఒకపరి తండ్రిగా నొప్పారి రోగుల
అవసరాలను దీర్చి అభయమిచ్చు;
ఒకపరి గురువుగా నొప్పారి రోగికి
హితబోధలనుజేసి వెతలదీర్చు;
ఒకపరి సఖుని గా నొప్పారి రోగుల
కష్టసుఖములెంచ నిష్టపడును;

తల్లిదండ్రుల మరియు సంతతము గురుని
సఖుని మరిపింపజేయును ; సుఖము గూర్చు;
అహరహమ్మును ప్రజల శ్రేయస్సు కొరకు
పాటువడు దైవసముడు - సద్వైద్యుడెపుడు!!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి