26, డిసెంబర్ 2010, ఆదివారం

బాలల కోసం ఓ బహుమతి - జగన్నాథ శర్మ గారి సరళ వచన మహా భారతం


బాలల కోసం సరళ వ్యావహారికంలో అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ రచించిన మహా భారతం (ఆది పభా అరణ్య పర్వాలు ) హైదరాబాద్ పాలపిట్ట బుక్స్ వారు ఇటీవల వెలువరించారు.

పుస్తకం చూడ ముచ్చటగా ఉంది. బాలి వేసిన అందమైన ముఖ చిత్రంతో చూడ గానే ఆకట్టు కునేలా ఉంది. ముద్రాపకులు తమ ముందు మాటలో మరల ఎందుకనగా ... అంటూ, భారతాన్ని మరల ఎందుకు ప్రచురిస్తున్నారో సహేతుకంగా వివరించారు. తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అనే మాట ఈతరం పిల్లలకు తెలుసా ? అనే ప్రశ్నను ముందుగా సంధించి, ఆబాల గోపాలాన్ని శతాబ్దులుగా అలరిస్తున్న ఈ అధ్బుత పౌరాణిక గాథను మరల మరల ప్రతి తరం చదివి తీరాలని చెబుతున్నారు. ఇప్పటికే వ్యాస ప్రోక్త భారతాన్ని తెలుగులో చాల మంది పద్యంలోను, గద్యం లోను రచించారు. అత్యాధునిక సాంకేతిక ధోరణులు ప్రబలిన ఇరవయ్యొకటో శతాబ్దంలో జీవిస్తున్న వారి చేత సరి కొత్తగా చదివించాల్సిన గ్రంథమిది. భారతాన్ని ఎందరో తిరుగ రాసి నప్పటికీ, ఎప్పటికప్పుడు వచ్చే తరానికి కొత్తగా వినిపించాల్సిన గాథ మహా భారతం. అద్భుత కథన నైపుణ్యం కలిగిన జగన్నాథ శర్మ గారు పిల్లలకు సులువుగా బోధ పడేందుకు గాను, ఈ తరానికి నచ్చేట్టుగాను, వారి మనసు మెచ్చేట్టుగాను, చవులూరిస్తూ చదివించే విధంగా సరళ వచనంలో ఈ రచన చేసారు. నవ్య వార పత్రికలో ధారావాహికంగా వెలువడుతున్న ఈ పిల్లల వచన మహా భారతం అసంఖ్యాక పాఠకుల మనసులు దోచుకుంటోంది. ఎందరో ఎంతగానో ప్రశంసలు కురిపించారు, కురిపిస్తున్నారు. పద్దెనిమిది పర్వాల జగన్నాథ శర్మ గారి వచన భారతం రచనను మొత్తం ఆరు భాగాలుగా వెలువరిస్తున్నట్టుగా ప్రచురణ కర్తలు తెలియ జేస్తున్నారు. ఆ వరసలో వెలువడిన తొలి సంపుటం యిది. ఈ సంపుటిలో ఆది, సభా, అరణ్య పర్వాల కథ ఉంది. శర్మ గారు ఈ వచన భారతాన్ని తమ జననీ జనకులు అయల సోమయాజుల రామ సోదెమ్మ, జగన్నాథం గారలకు భక్తి ప్రపత్తులతో అంకితం చేసారు. ప్రతి ఇంట తల్లి దండ్రులు కొని , తమ చిన్నారులకు బహుమతిగా యిచ్చి వారి చేత చదివించ తగిన చక్కని పుస్తకమిది. పిల్లలకు ఇవ్వ తగిన గొప్ప బహుమతి గా పుస్తకాన్ని చెప్పుకో వచ్చును.

జగన్నాథ శర్మ గారి గురించి ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు .....

1956లో పార్వతీ పురంలో జన్మించిన శర్మ గారు వందలాది కథలు వ్రాసేరు. యువ మాస పత్రికలో వచ్చిన వీరి రాజధాని కథలు, పల్లకి వార పత్రికలో వచ్చిన మా ఊరి కథలు, ఆది వారం ఆంధ్ర జ్యోతిలో వచ్చిన అగ్రహారం కథలు విశేష ప్రాచుర్యం పొందాయి. నవలా రచయితగా, సినిమా, టి.వి. రచయితగా కూడా వీరు ప్రసిద్ధులు. ప్రస్తుతం నవ్య వారపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. అరణి, అనీలజ, నీలకంఠాచార్య వీరి కలం పేర్లు.

ఇప్పటి వరకు ప్రచురితమయిన వీరి రచనలు ....

తెలుగు లోనికి అనువాదం చేసిన ప్రపంచ ప్రఖ్యాత పిల్లల జాన పద కథలు పాల పిట్ట కథలు. ( వివరాల కోసం ఇక్కడ నొక్కి చూడండి)

పేగు కాలిన వాసన (కథా సంకలనం)

బాలల కోసం సరళ వ్యావహారికంలో రచించిన మహా భారతం ( ఆది సభా అరణ్య పర్వాలు)

త్వరలో వెలువడనున్న పుస్తకాలు ....

జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య మొదటి పేజీ)

అగ్రహారం కథలు


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

Admin చెప్పారు...

GOOD.

కామెంట్‌ను పోస్ట్ చేయండి