13, జనవరి 2015, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ! ... ‘‘ బంగారు తెలంగాణ’’, ‘‘సింగపూర్’’


ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.
గురువులు చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.
‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.
‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.
‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.
కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ బంగారు తెలంగాణ,    సింగపూర్ ’’
రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.

‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు
కొడుకు మళ్ళీ అవే మాటలు  చెప్పాడు.
ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.
‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు
‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...
గురువులు గజగజ వణికి పోయారు.
‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.
‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.
‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.
‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.
మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.
‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.

నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.ముఖం మొత్తును.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి