పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

సారీ, గురూ !


మా తింగరి బుచ్చి గాడు మీకు గుర్తున్నాడు కదూ!
వీడు రెండో తరగతి రెండుసార్లు చదివి ‘ ఇహ మనకీ చదువులు వంట బట్టవు కానీ ’ అనుకోని వదిలేసాడు. ఆ తర్వాత తన నేస్తులయిన బడి గుంటలంతా పాస్ పీస్ మంటూ ఏవో ఇంగిలిపీసు ముక్కలు మాట్లాడేస్తూ ఉండడంతో తనూ ఓ నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చుకోవాలను కున్నాడు. ముందుగా ఓ రెండింటిని ఒంట పట్టించు కున్నాడు.
అవి : 1. టాంక్యూ
2. షారీ ! ...
వాడు వాటిని అలాగే పలుకుతాడు. అవేమిటో మీకు నేను చెప్పనక్కర లేదు. ఈ రెండూ నేర్చుకొన్న కొత్తలో ఏది ఎప్పుడు వాడాలో తెలియక తెగ తికమక పడి పోతూ ఉండే వాడు. దానికిదీ, దీనికదీ వాడేస్తూ ఉండే వాడు. అలవాటయ్యే సరికి వారం పది రోజులు పట్టింది.
సరే, టాంక్యూ సంగతి అలా ఉంచితే వాడు షారీ పదం నేర్చుకొన్న కొత్తలో ఆ మోజు కొద్దీ దాన్ని ప్రయోగించడానికి తగిన పరిస్థితులను తానే కల్పించుకొనే వాడు.
సినిమా హాళ్ళలో, ఇంటర్వెల్ అయ్యాక తిరిగి షో మొదలయ్యే వేళ, చీకట్లో కావాలనే కుర్చీలలో కూర్చునే వారి కాళ్ళు
తొక్కి ‘ షారీ ’ ! అని పళ్ళికిలించే వాడు. ఈ సరదా ఒక్కో సారి వికటించి, ‘‘ ఎవడ్రా నువ్వూ ’’తో మొదలై తిట్ల దండకాలతోనూ, ఒక్కోతూరి గూబ గుయ్యి మనిపించడాలతోనూ ముగిసేది. మూడు తిట్లూ, ఆరు చెంప కాయలతో వాడికా పదం బాగా వంటబట్టింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు వాడు.
మనలో చాలా మంది ఈ సారీ పదం అలవోకగా వాడేస్తూ ఉంటాం. అడుసు తొక్క నేల ? కాలు కడుగ నేల ? అని కూడా చూసు కోం.
అండగా సారీ అనే దిక్కుమాలిన పదం ఒకటుండగా
ఆలోచించి పని చెయ్యడ మెందుకు దండగా ! ... అనుకొంటూ ఉంటాం, కాస్త కవితాత్మకంగా.
మన పూజా విధానంలోనూ, మనం పలికే మంత్రంలోనో, చేసే పూజలోనో, అసలు మన భక్తిలోనో ఏమేనా పొరపాట్లూ గట్రా ఉంటే దేవుళ్ళకు సారీ చెప్పేసే సుళువు ఒకటి మన వాళ్ళు పొందు పరిచే ఉంచారు.
మీ తెలిసినదే కదా.
వినాయక పూజ చేస్తున్నామనుకోండి, చివరలో
మంత్రహీనం, క్రియాహీనం, భక్తి హీనం గణాధిప:
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.
అని లెంపలు వాయించు కోవాలి. ఎలాగూ సారీ చెప్పేస్తున్నాం కదా అని భక్తిలో కానీ, పూజా విధానంలో కానీ, మంత్రంలో కానీ బుద్ధి పూర్వకంగా పొరపాటు చేయ కూడదు. అలాగే ఏమరుపాటూ తగదు. కళ్ళు పోతాయ్.
అసలు సారీ చెప్పు కోవాల్సిన పరిస్థితి తెచ్చు కోవడమే తప్పయితే, అలా చెప్పే సారీని కూడా కుర్రకారు కొంతమంది
మరీ విడ్డూరంగా, యాదాలాపంగా, నిర్లక్ష్యంగా , తలపొగరుగా కూడా చెబుతూ ఉండడం కద్దు. అదే -
సారీ గురూ ! ఇది మరింత దిక్కు మాలిన పదం.
సారీ ! డాడ్ .. సారీ మమ్మీ .. మీకు ముందుగా చెప్పే వీలు లేక పోయింది .. ఈమె మీ కోడలు ! అని వొకానొక రోజున అథాట్టుగా బాంబు పేల్చి నట్టుగా చెప్పే పుత్ర రత్నాలూ ...
నీ చేత గొడ్డు చాకిరీ చేయించు కుని, నీ ఆశల మీద నీళ్ళు కుమ్మరించేస్తూ, ‘‘ సారీ, నీకు ఇంక్రిమెంటు ఇవ్వడం కుదరదు’’ అని చెప్పే ఆఫీసర్లూ ...
‘‘ మీ రచన బావుంది. కానీ సారీ మేం వేసుకో లేం’’ అని చెప్పే సంపాదకులూ ...
ఏ గంటన్నర సేపో శ్రమ తీసుకుని ముస్తాబై కూర్చుంటే, ‘‘ సారీరా ! ఇవాళ వేగిరం రావడం కుదరదు. సినిమాకి రేపు వెళదాంలే’’ అని ఫోను చేసే భర్తలూ ...
ఇలా ఈ సారీ అనే పదం చాలా తేలిగ్గా వాడేసుకో గలిగే పదం.
 
ఇక,
మన ప్రాచీన కవులకు కవిత్వం పట్ల, ఛందస్సు పట్ల , అసలు అక్షరం పట్ల ఎంత విధేయత ఉండేదో చూడండి :
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో2స్తుతే.
ఎక్కడయినా అక్షర స్ఖలనం జరిగినా, అంటే అక్షర దోషం కలిగినా, ఛందోభంగం వచ్చినా, లేదా మరే దోషాలు నా కవిత్వంలో ఉన్నా, ఓ అక్షర మూర్తీ ! వాటిని అన్నింటినీ మన్నించు తండ్రీ ! నారాయణుడవైన నీకిదే నా నమస్కారం !
ఇంత భక్తీ, నిబద్ధతా ఉండబట్టే వారు మహా కవులయ్యారు. ఋషులయ్యారు. నానృతి: కురుతే కావ్యమ్ కదా.
పొరపాటు చేసినా క్షమించమని అడగడంలో ఇంత ఉదాత్తత చూపించాలి. ఇంత విధేయత కనబరచాలి.
అంతే కానీ, సారీ గురూ ! అనేస్తే చాలనుకో కూడదు. ఇదే నేను చెప్ప దలచినది.
నేను చెప్ప దలచిన దానిని అర్ధమయ్యేలా సరిగా చెప్ప లేదనిపిస్తోందా. కథా మంజరి ( ఏకైక నస బ్లాగు ) తరఫున,
సారీ, గురూ !


22, ఫిబ్రవరి 2015, ఆదివారం

తిడితే తిట్టే నంటారు, కానీ, బ్రహ్మయ్యకి బుద్ధుందా చెప్పండి ?!


అవున్నిజఁవే ! బ్రహ్మ దేవుడ్ని తిట్ట కూడదు. ! తప్పు. కళ్ళు పోతాయ్ !  లెంపలు వాయించుకో ... కానీ, అతడు చేసే తింగరి పనులకు ఒక్కోసారి శతక కవి థూర్జటి style లో తిట్టాలనిపిస్తుంది. కదూ !
లేక పోతే ఏఁవిటి చెప్పండి ?
అష్టైశ్వర్యాలూ ప్రసాదిస్తాడు. అజీర్తి రోగం పట్టు కునేలా ఆశీర్వదిస్తాడు.
సకల విద్యాపారంగతునివి కమ్మని చెబుతాడు. అష్ట దరిద్రాలూ అనుభవించు పొమ్మంటాడు.
అందమైన మనోహర రూపం ప్రసాదిస్తాడు. అలవి మాలిన అహంకారాన్నీ, అఙ్ఞానాన్నీ అంట గడతాడు.
ఏ టీ ఎమ్ సెంటర్లో ఏ.సీ ఉండి, అది పని చేస్తూ, ఏ టీ ఎమ్ మాత్రం పని చేయ నట్టుగానూ ...
రైల్ లో బెర్తు కన్ ఫరమ్ అయిన కులాసాలో మనం ఉండగా రైలే రద్దయే పరిస్థితి కలిగినట్టుగానూ ...
నువ్వు పో గొట్టు కొన్న నీ పర్సులో వేలాది రూపాయలు ఉండడమూ, నీకు దొరికిన ఎవడో తల మాసిన వాడి పర్సులో చిల్లర నాణేలు మాత్రమే ఉండడమూ ...
కష్టపడి నువ్వు నానా గడ్డీ కరచి, నానా పుర్రాకులూ పడి ఎన్నికల్లో నెగ్గితే, నీ పార్టీ ప్రతి పక్ష హోదాకి కూడా నోచుకోకుండా గల్లంతయినట్టుగానూ  చమత్కారం చేస్తాడు !
నీ అందమయిన పెళ్ళానికి అణకువ తక్కువ చేస్తాడు.
నీ ఐశ్వర్యవంతుడయిన మొగుడికి మంకు తనం అలవిమాలినంత ఇచ్చి, వేధించుకు తినమంటాడు, వేథ !
నీబీటెక్ కొడుక్కి తాసీల్దారు ఆఫీసులో గుమస్తా ఉద్యోగం వేయిస్తాడు.
వాడి ఏడో తరగతి ఫెయిల్డ్ ముద్దుల బిడ్డకి వ్యాపారంలో పిచ్చ పిచ్చగా చక్రం త్రిప్పే నేర్పు ప్రసాదిస్తాడు.
ఎదురింటి వాడింట్లో కరెంటు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే, నువ్వు చీకట్లో తచ్చాడాల్సిన స్థితిని కల్పిస్తాడు, ఇద్దరి కనెక్షనూ ఒకే స్తంభం నుండే వచ్చినా !
నువ్వు కాపీ కొట్టిన ముందు వరుస రుర్రాడు అన్నీ తప్పుడు జవాబులే బరబరా రాసి పారేస్తాడు. వెర్రి బకరావై దాన్నే కాపీ కొట్టి. బొక్కబోర్లా పడతావు !

 ఎందుకు లెండి . చెబితే చేంతాడంత. వాడు చేసే తిక్క పనులు అన్నీ ఇన్నీ కావు.
ఈ శ్లోకం చూడండి :
యాత: క్ష్మామఖిలాం ప్రదాయ హరయే పాతాల మూలం బలి:
సక్తుప్రస్థవిసర్జనాత్ స చ ముని: స్వర్గం సమారోపిత:
ఆబాల్యా దసతీ సురపురీం కుంతీ సమారోహయత్
హా ! సీతా పతి దేవతా2గమదధో ధర్మస్య సూక్ష్మా గతి:
దీని అర్ధం ఏమిటంటే,
వామనుడు మూడడుగుల నేల దానం ఇమ్మని బలిని కోరాడు. ముందూ వెనుకా చూసు కోకుండా సరే ఇస్తున్నా పట్టు అన్నాడు మహా దాత బలి. అప్పటికీ రాక్షస గురువు శుక్రాచార్యడు వద్దు సుమీ, దుంప నాశనమై పోతావ్ ! అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ బలి విన లేదు ! అంత గొప్ప దానాన్ని చేసిన బలికి ఏం జరిగింది ?
పాతాళానికి పోయేడు !
సక్తుప్రస్థుడు అనే ఒక ముని కొద్దిపాటి పేల పిండిని ఎవడికో పెట్టాడు. వానికి స్వర్గం లభించింది !
వివాహం కాకుండానే తల్లి అయిన కుంతికి స్వర్గం లభించింది.
పరమ పతివ్రత అయిన సీతా దేవి మాత్రం భూగర్భంలో పడిపోయింది. ఆహా ! ధర్మం నడక ఎంత సూక్ష్మమైనదో కదా !
ఇదీ శ్లోక భావం.
అలారాసి పెట్టి ఉంది మరి అనుకుంటాం. కానీ అలా రాసిన వాడిని థూర్జటి కవిలాగా తిట్ట కూడ దంటూనే తిట్టే సాహసం చెయ్యం !
ఇంతకీ థూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో వేథను ఎలా తిట్టాడో కాస్త చూదామా ?
వేథం దిట్టగ రాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ? థీ చాతురిం జేసినన్ యటుల రా బాటంచు నేఁ బోక క్షు
ద్భా దాదుల్ కలిగింప నేల ? యది కృత్యంబైన దుర్మార్గులం
యీ ధాత్రీశుల చేయ నేటి కకటా ! శ్రీకాళ హస్తీశ్వరా !
దీని భావం:
ఓ శ్రీకాళహస్తీశ్వరా ! బ్రహ్మ దేవుడిని తిట్ట కూడదు. కానీ, లేక పోతే, మమ్మల్ని పండితులు గానూ, కవులుగానూ పుట్టించడం ఎందుకు ? పోనీ, తన బుద్ధి నేర్పరితనం వల్ల అలా చేసేడే అను కుందాం. ఆ పాండిత్యం వలన కలిగిన ఙ్ఞానంతో మిమ్ములను సేవించు కుంటూ, ఆ మార్గంలో నడవనీయ కుండా మాకు ఆకలి దప్పులు ఎందుకు పెట్టాడయ్యా
మాకుండే ఆ బాధలను ఆసరాగా చేసుకొని, తమ చుట్టూ తిరిగేలా చేసుకొంటున్న ఈ దుర్మార్గులయిన రాజులను ఎందుకు పుట్టించాడయ్యా !
ఈ ఆకలి బాధలూ, సంసార జంఝాటాలూ లేకుండా ఉంటే, ఓ దేవా ! నీవు మాకు ప్రసాదించిన పాండిత్యంతో , దాని వలన కలిగిన మంచి ఙ్ఞానంతో సదా మిమ్ములనే సేవించు కుంటూ ఉండే వారము కదా !
(తిక్కలోడివి కాక పోతే, మాకు మంచి పాండిత్యం ఇవ్వడ మెందుకు ? దానిని మీ కోసం వినియోగించ కుండా రాజులను ఆశ్రయిస్తూ దేబిరించడ మెందుకూ ? అలా దేబిరించడానికి కారణభూత మయిన ఆకలిదప్పులను మాకు ఇవ్వడ మెందుకూ ? వాటిని ఆసరాగా చేసు కొని మా బలహీనతలనూ, దీనత్వాన్నీ ఆసరాగా చేసుకొని మమ్ములను తమ చుట్టూ తిప్పుకొని రాక్షసానందం పొందే ఈ దుర్మార్గులయిన రాజులను పుట్టించడమెందుకూ ! )
గూగులమ్మ ఉచితంగా బ్లాగులు పెట్టుకోండని అనడ మెందుకూ ?  ఈ కథా మంజరి బ్లాగరు పనీపాటా లేకుండా చేతికొచ్చిన రాతలు రాయడ మెందుకూ ?
లలాట లేఖో న పున: ప్రయాతి.
తల రాత మార్చ లేం కదా.

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

తమాషాగా లేదూ ?!

అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !
వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ
కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.
బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
























ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...
3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.
ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !
ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.
గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )
విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !
చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !
పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!







17, ఫిబ్రవరి 2015, మంగళవారం

గాడిదల కథా కమామీషూ ... !


కుక్కలు విశ్వాసానికీ, గాడిదలు సహనానికీ పెట్టింది పేరు.
కాకుల గురించి కాకి గోల ( ఇక్కడ నొక్కి ఆ కాకి గోల భరించండి) అనే టపా రాస్తూ త్వరలో గాడిదల గురించి కూడా
ఓ టపా పెడతానని చెప్పాను కదా.
ఇప్పుడు గాడిదల గురించి రాయడం మానుకుంటే ‘ మాట తప్పేడురా గాడిద కొడుకు ! ’ అని ఎవరు తిడతారో అనే భయంతో ఇది పెడుతున్నాను.
మా చిన్నప్పుడు ఆవకాయలు పెట్టే రోజున మామిడి టెంకలనూ,జీళ్ళనూ చేజిక్కించుకుని గోడలన్నీ ‘‘ దడిగాడు వాన సిరా’’ లాంటి వ్రాతలతో ఖరాబు చేసే వాళ్ళం. ‘‘ గోడలు పాడు చేసిన గాడిద ఎవర్రా ?! అని పెద్దాళ్ళతో తిట్లు తినే వాళ్ళం.
ఇప్పుడు పెద్దయ్యాక, ఖరీదయిన పెయింట్లు తిరిగి వేయించుకో లేక, చాపల్యం చావక కాబోలు, అలాంటి అడ్డమయిన రాతలూ బ్లాగుల్లోనూ, ముఖ పుస్తకాలలోనూ రాయడం మొదలు పెట్టాం.
సరే, మరి గాడిదల కథా కమామీషూ కాస్త చూడండి ...
‘ ఖర’ నామ సంవత్సరం గురించి కథా మంజరి తెగ గర్విస్తోంది.
గాడిదకు చాలా పేర్లుఉన్నాయి. చక్రీవంతం,బాలేయం, రాసభం,గర్ధబం, గార్ధభం,గాడ్ద, ఖరం, గాలిగాడు ... ఇలా.
ఏ పేరుతో పిలిచినా ఓండ్ర పెడుతూ పలుకుతుంది కనుక అందరకీ తెలిసిన గాడిద అని పిలుచుకుంటేనే సుఖంగా ఉంటుంది.
రామాయణంలో ఖర దూషణలు అనే ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు. ఇద్దరూ అన్న దమ్ములు. రావణుని చెల్లెలు శూర్ఫణఖ దండకారణ్యంలో ఉన్న శ్రీరాముని మీద మనసు రాక్షసంగా పారేసుకుంది. లక్ష్మణుడు దాని ముక్కు చెవులూ కోసి తరిమేసాడు. అది వెళ్ళి ఈ అన్నదమ్ములిద్దరికీ తన గోడు చెప్పుకుంది. ఈ అడ్డగాడిద లిద్దరూ రామునిపైకి దండెత్తి, అతని చేతిలో చచ్చారు.

భాగవతంలో గార్ధభాసురుడు అనే వాడు కనిపిస్తాడు. వీడూ రాక్షసుడే. వీడు బలరాముని చేతిలో హతుడయ్యాడు.
ఇక, దేవకీ వసు దేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు పుడితే , కసంసుడిపాల బడకుండా వసు దేవుడు ఆ పసివాడిని గంపలో పెట్టుకొని యమునానది దాటి వ్రేపల్లెకు చేరి యశోదమ్మ ప్రక్కన ఉంచి ఆమె కన్న ఆడశిశువును తనతో నిరాటంకంగా తెచ్చుకొన్నాడు. విష్ణుమాయ చేత ఆ పనిలో అతనికి ఎలాంటి ఆటంకాలూ ఎదురు కాలేదు. కానీ
దారిలో ఒక గాడిద మాత్రం రహస్య భేదనం జరిగేలా ఓండ్ర పెట్టింది. ఓండ్ర శబ్దంలో ఓం కారం ఉంది కనుక తన అరుపు
ఓంకారనాదం అనుకుందేమో పిచ్చి ముండ ! శాంతం పాపం ! శాంతం పాపం!
ఇహ లాభం లేదని, వసు దేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకో వలసి వచ్చింది.
గాడిద ముఖం కలిగిన దేవుళ్ళూ, దేవగణాల వాళ్ళూ ఉన్నారంటే ఈ చతుష్పాది ఎంత మహిమ కలదో వేరే చెప్ప నక్కర లేదు.
ఇవి గాడిదల ప్రస్తావన ఉన్న పురాణ కథలు కాగా, గాడిదల గురించిన నీతి కథలు అనేకం ఉన్నాయి.
అందరికీ తెలిసిన ప్రముఖమైన కథ ఇది:
ఒక చాకలి ఇంట కుక్క గాడిద ఉండేవి. కుక్క అతని ఇంటిని కాపలా కాస్తూ ఉంటే, గాడిద బరువులు మోసేది. తనెంత విశ్వాసంగా ఉన్నా ఇంటి యజమాని తనని సరిగా చూడడం లేదని కుక్కకి కోపం వచ్చింది. ఇక వాడి పట్ల విశ్వాసంగా ఉండ కూడదని భౌ భౌ తీర్మానం ఒకటి ఆత్మగతంగా చేసుకొంది. ఓ రాత్రి యజమాని ఇంట దొంగలు పడ్డారు. సహాయ నిరాకరణకు పూనుకొన్న కుక్క దొంగను చూసి కూడా మొరగడంమానేసింది. గాడిద కంగారు పడి కుక్కను హెచ్చరించింది. కుక్క ససేమిరా అని మొరగడానికి నిరాకరించింది. అయ్యో యజమాని, పాపం, అనుకుంటూ దొంగలొచ్చారని యజమానికి తెలియ జేయడం కోసం గాడిద ఓండ్ర పెట్టింది. చాకలి లేచాడు. నిద్రాభంగమయినందుకు కోపంతో దుడ్డు కర్రతో గాడిదను చావ మోదాడు ! ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకో కూడదని చెప్పే నీతి కథ ఇది.
గాడిదల గురించి కొన్ని జాతీయాలూ, సామెతలూ కూడా చూదాం:

గాడిద గత్తర
గాడిద పిల్ల కోమలం
గాడిద పుండుకి బూడిద మందు
గాడిద కేం తెలుసు గంధం వాసన
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.
పనీ పాటా లేని అడ్డ గాడిద
యజమానికి ఎదుటా, గాడిదకు వెనుకా ఉండ రాదు.
గాడిద గుడ్డు
గాడిద గుడ్డూ గరుడ స్తంభం
గాడిదతో చెలిమి కాలి తాపులకే
గాడిదల మోత, గుర్రాల మేత
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పడితే, ఒంటె అందం చూసి గాడిద మూర్ఛ పోయిందిట !
అందానికి లొటిపిటా, పాటకి  గాడిదా అంటూ కన్యా శుల్కంలో  ఉత్తరం చదివే ఘట్టంలోమధుర వాణి విరగబడి నవ్వడం గుర్తుందా ?
పూర్వం యుద్ధాలలో గజ సైన్యం, ఆశ్విక సేన వగైరాలు ఉండేవి. గాడిదల సేనలు ఉండేవో లేదో తెలియదు. రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసే రాజులే ఎలాగూ గాడిదలు కనుక వేరే గాడిదల సేన ఉండే అవసరం లేక పోయి ఉండ వచ్చును.
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులూ, లుబ్ధావధానులూ పరస్పరం త్వం శుంఠా అంటే త్వం శుంఠా ! అనీ,
గాడిదా ! అంటే అడ్డగాడిదా !అనీ ఒకరినొకరు ముచ్చటగా తిట్టుకునే వారు.
మరి గాడిద ప్రస్తావన గల కొన్ని పద్యాలు కూడా చూదామా ?
గాడిదల గురించిన చక్కని చాటువు చూడండి:
రేరే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిమ్ ?
రాజా శ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్ !
సర్వా పుచ్ఛవతో హయమితి వదంత్య త్రాధికారే ప్థితౌ
రాజా తై రుపదిష్టమేవ మనుతేన్ సత్యం తటస్థాపరే:

దీని అర్ధం : ఓ గాడిదా ! బట్టలు మోస్తూ గ్రామాలు తిరుగుతూ శ్రమ పడతావెందుకు ? హాయిగా రాజు గారి గుర్రాల శాలకు పోయి అక్కడ గుర్రాలతో పాటు గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోక లున్నవన్నీ గుర్రాలే నని అక్కడి అధికారు లంటారులే. రాజు కూడా గుడ్డిగా ఆ మాట నమ్ముతాడు !
చవట గాడిదలన తగిన రాజుల గురించీ, అధికారుల గురించీ ఈ సంస్కృత చాటువు వివరిస్తే, శ్రీనాథుని తెలుగు చాటువు కూడా చూడండి మరి:

బూడిద బంగలై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్ల నై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారల ’’ చొచ్చొచో ‘‘ యనన్
గోడల గొందులం దొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిద ! నీవునుం దొదిగి కవివి కావు కదా ! యనుమాన మయ్యెడున్ !
బూడిద రంగులో ఒళ్ళంతా కళావిహీనమై, పాలి పోయిన ముఖంతో, వీధీ వీధీ తిరుగుతూ, వచ్చీ పోయే వారు అదిలిస్తూ ఉంటే గోడల వెనుకా. సందుగొందలలోనూ ఒదిగి పోతూ ఓండ్ర పెడుతూ ఉంటావు. ఓ గాడిదా ! నాకు అనుమానం కలుగుతోంది. ఈ కొండవీటిలో నువ్వు కూడా ఒక కవివి కాదు కదా !

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివిడైనను నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ !

గంగి గోవు పాలు చిన్న గరిటెడు చాలు. కడివెడు గాడిద పాలు ఎందుకని వేమన సభక్తికంగా పెట్టే అన్నం ఏ కొద్దిపాటి అయినా చాలును అని చెప్పడానికి మధ్యన పాపం గాడిదను లాక్కుని వచ్చాడు. గాడిద పాలకి ఉన్న విలువ గురించి సైన్సు చెప్పని రోజులవి.
కవి చౌడప్ప గాడిదనూ వదల లేదు. అతడివే మూడు పద్యాలు చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా.
కవిత్వాన్ని మెచ్చు కుంటూ ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ అవహేళన చేస్తూ, అవమాన పరిచే తుంటరి వాడు గాడిద.
ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడు కంచు తిట్టగా విని మదిలో
వీడా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా.
పలికిన మాటను మరిచే అబద్ధాలకోరును గాడిదా అని ఒక తండ్రి ఎవడో తిడితే, ఇలాంటి వాడా నా కొడుకు ! ఛీ ! అని గాడిద కూడా ఏడిచిందిట.
గాడీపాలకి గలగిన
వాడయితేనేమి కవుల వంచించిన యా
గాడిద కొడుకును దిట్టగ
గాదా మరి కుంద వరపు కవి చౌడప్పా.
పెద్ద పెద్ద వాహనాలు, పల్లకీలు ఉంటే మాత్రం ఏం ? కవులను మోసగించే వాడు గాడిద కొడుకు ! వాడిని తిడితే ఏం తప్పు కనుక ? పిరదౌసిని మోసగించిన సుల్తాను ప్రభువు గాడిదే కదా ?
వెనుకటి రోజులలో సార్ధవాహులు తమ ప్రయాణాలలో ఎడ్లబళ్ళూ, గుర్రాలూ , మూటలూ అవీ మోయడానికి గాడిదలనూ వినియోగించే వారన్నది తెలిసిన విషయమే కదా.
గోపాల కృష్ణ రావు గారు చెప్పిన సాలూరి గాడిదల మీది పద్యం కూడా చూడండి మరి ..
గాడిద సాలూరు విడచి
ఏడకొ పోయేనటంచు నెంచకు బ్రదరూ
ఏడకు పోలే దదియును
ఈడనె పాల్టిక్సులోన ఎదిగెను మంత్రై!!
వొకప్పుడు సాలూరులో గాడిదలు ఎక్కువగా ఉండేవిట.అవన్నీ ఎక్కడకి పోయాయి చెప్మా ! అని బెంగ పడే పని లేదుట. అవన్నీ మంత్రులై భాగ్య నగరానికి పోయేయిట.

అవునూ, కవులకు కవి వృషభులు అని బిరుదులూ అవీ ఇస్తూ ఉంటారు కదా. కవి గార్ధభ బిరుదులు ఇవ్వరు.
ముట్నూరు కృష్ణారావు పంతులు గారి మనుమరాలు వోసారి తాత గారితో ముచ్చటలాడుతూ ‘‘ తాతా ! మీ బందరులో గాడిదలు ఎక్కవే సుమండీ !’’ అందిట. దానికాయన‘‘ అవునమ్మ, ఇక్కడి గాడిదలు చాల వన్నట్టు పొరుగూరి గాడిదలు కూడా వచ్చి పోతుంటాయి !’’ అని వో చురక వేసారుట !
అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు కాంతం కథలలో కాంపోజిషను పుస్తకాల దొంతర పట్టు కెళుతున్న మేష్టరు గారితో ‘‘ ఏమిటి మాష్టారూ ! గాడిద బరువు మోసుకెడుతున్నారూ ?!’’ అని పరాచికాలాడ బోయేడుట. దానికాయన వెంటనే ‘‘ అబ్బీ !ఇవి 40 గాడిదల బరువురా !’’ అని చురక వేసి నోరు మూయించేరుట. డవాలా బంట్రోతులకి మల్లె పాపం, మేష్టర్లకీ, కోర్టు కాగితాల కవిలె కట్టలు  మోసుకెళ్ళే లాయర్లకీ ... యిలా .. కొన్ని వృత్తుల వారికి ఈ గాడిద బరువులు మోయడం విధాయకమే మరి. కదా !
కవి సమ్మేళనాలలో పాత మాటల మూటలతో నానా చెత్తా మోసుకొని వచ్చి ఆహూతులను చచ్చినట్టు వినేలా చేసే కవులూ , ప్రజానీకాన్ని అడ్డగాడిదల్లా అడ్డంగా మోసగించి, దొరికినంతా దోచుకు తినే రాజకీయ ఖరనాయకులూ, వారికి కొమ్ము కాచే కొన్ని పత్రికల వాళ్ళూ, , టీవీల వాళ్ళూ , కుక్కలనీ, పిల్లులనీ, గాడిదలనీ నానా చెత్తా కుమ్మరించే కథా మంజరి బ్లాగరూ, తన చుట్టూ జరిగే అన్న్యాయాన్ని ఎదిరించే సత్తా లేని వాళ్ళూ, ఆడవాళ్ళను కాల్చుకు తినే వాళ్ళూ ,లంచాలు మేసే వాళ్ళూ... వీళ్ళంతా గాడిదలు ... కాదేమో, అడ్డ గాడిదలు. కదా మరి.

ఈ టపా తమ మీద పెట్టిన కథా మంజరి బ్లాగరుకి గాడిదలు అంతర్జాతీయ గార్ధభ మహా సభ పెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానించి ’’ దడిగాడువానసిరా ’ అనే బిరుదు ప్రదానం చేయ బోతున్నాయని ఒక (అ) విశ్వసనీయమైన సమాచారం వల్ల తెలుస్తోంది.

పిల్లుల గురించి మరోసారి. ఇక శలవు.







పన్నగ ధారీ ! నగ ధారీ ! ... ఓ చమత్కార శ్లోకం ...

ఈ శ్లోకం చూడండి:

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశి ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.

ఈశ్లోకంలో కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ  వచ్చేలా రచించాడు.
ముందుగా శివ పరమయిన అర్ధం చూదాం.


శివ పరంగా అర్ధం చెప్పు కునేటప్పుడు శ్లోకం లో పదచ్ఛేదం ఇలా ఉంటుంది:
పన్నగధారి,  కరాగ్ర:,  గంగా, ఉమా లక్షిత:,   గదా, అగ్ర భుజ:,  శశి ఖండ శేఖర:,   ఉమా పరిగ్రహ:,  అనాది:, ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

పన్నగధారి:, గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:, అనాది: , మహు:, త్వామ్ అవతు !

భావం: చేతిలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతుల ప్రియ నాథుడూ, భుజాల మీద చక్కని బాహుపురులూ, బంగారు ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన వాడూ , పార్వతీ దేవిని తన అర్ధాంగిగా పొందిన వాడూ, పుట్టుకే లేని అభవుడూ అయిన పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడు గాక !

కవి ఈ శ్లోకంలో శివుడికి  ఈ విశేషాణాలు వేసాడు.
 పన్నగధారి                                     =    పామును ధరించిన వాడు
గంగో మా లక్ష్మిత: = గంగా = ఉమా లక్షిత:    =    గంగా పార్వతులచే కోరబడిన వాడు
అగదోగ్ర భుజ:                                  =    భుజాల మీద బాహుపురులు,                                         
                                                        స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర:                                  =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                  =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                           =     పుట్టుక లేని వాడు
మహు:, త్వామ్ అవతు                        =      సదా   మిమ్ము కాపాడు గాక !     

ఇక, శ్లోకం లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కోవాలంటే, కవి శివుడికి వేసినట్టుగా చెప్పిన విశేషణ పదాలలోని తొలి అక్షరాలను తొలిగించి చదువు కోవాలి !


విశేషణాలలోని తొలి అక్షరాలు తొలిగిస్తే,  పదచ్ఛేదం ఇలా ఉంటుంది:
నగధారి, కరాగ్ర: ,  గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:, శిఖండ శేఖర:,  మా, పరిగ్రహ: , అనాది: , ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

కరాగ్ర:, నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ: , అనాది: , త్వామ్, ముహు:, అవతు.

కరాగ్ర: నగధారి            =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గో                           =      ఆవుల చేత,
మా                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                      =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ దేవికి ప్రభువు
                                     అయిన వాడు )
గద: అగ్ర భుజ:            =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు
శిఖండ శేఖర:             =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు
మా                          =      లక్షీ దేవిని
పరిగ్రహ:                     =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                      =      ( మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన అర్ధమగు) విష్ణువు
                                     పుట్టుక లేని వాడు అయిన విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !

భావం:  గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ,  గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన గదనూ, తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమా పతీ అయిన వాడూ, పుట్టుక లేని వాడూ అయిన శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !
స్వస్తి.

   


16, ఫిబ్రవరి 2015, సోమవారం

మాయమై పోయానోచ్ ... ఒక చమత్కార శ్లోకం ...


ఎవరయినా సంపదలనిచ్చే లక్ష్మీ దేవిని నుతిస్తారే తప్ప, దరిద్ర దేవతను పొగడరు కదా ?
కాని, ఈ శ్లోకంలో కవి దరిద్ర దేవతను ఎలా నుతిస్తున్నాడో చూడండి:

దరిద్రాయ నమస్తుభ్యం, సిద్ధో2హం త్వత్ప్రసాదత:
సర్వం పశ్యామి దేవేశ, న మాం పశ్యతి కశ్చన.
దీని అర్ధం ఏమిటంటే,
ఓ దరిద్ర దేవతా ! నీకు వందనాలు. ఎందువల్లనంటే, నీ అనుగ్రహం వల్లనే కదా, నేను సిద్ధుడనైనాను. నాకు మహిమాన్వితమైన గొప్ప సిద్ధులు చేకూరాయి.
ఎలా అంటావా?
నేను అన్నింటినీ చూడ గలుగు తున్నాను. కాని ఒక్కరు కూడా నన్ను చూడ లేక పోతున్నారు.
ఈ కామరూప విద్య నాకు ప్రసాదించింది నువ్వే కదా, తల్లీ !
ఇదీ కవిగారు దరిద్ర దేవతను నుతించిన వైనం.
ఇందులో చమత్కారం సులభ గ్రాహ్యమే. అష్ట దరిద్రుడైన వాడికి అందరూ కనిపిస్తారు. కానీ వాడి మీద ఒక్కరి చూపు కూడా పడదు. దరిద్రుడిని ఎవరు మాత్రం చూస్తారు చెప్పండి? వాడి ఉనికిని ఎవరు మాత్రం గుర్తిస్తారు చెప్పండి?
‘దరిద్రుడనయినందు వలన నన్ను ఎవరూ పట్టించు కోవడం లేదు’ అని వాపోతున్నాడన్నమాట.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

లేడిని చూసి పారి పోయిన వొక సింహం కథ

మన కవులు భాషను క్రీడా రంగంగా చేసుకుని ఎన్ని చక్కని ఆటలు ఆడుకున్నారో గమనిస్తే చాలా సరదాగా ఉంటుంది ..
 

క్రింది శ్లోకాన్ని పరికించండి ...

కస్తూరీ జాయతే తస్మాత్ ? కో హన్తి కరిణామ్ శతమ్ ?
కిం కుర్యాత్ కౌతరో యుద్ధే ? మృగాత్ సింహ: పలాయతే.
 

లేడిని చూసి సింహం పారిపోతోందని కవి గారి ఉవాచ !!

పోదురూ, మరీ బడాయి కాక పోతేనూ ! 

ఇప్పుడు కవి గారి అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తాను. చూడండి ...
చరణాల వారీగా ఇలా చెప్పు కుందాం...
కస్తూరి దేని నుండి పుడుతుంది ? ... మృగాత్ = మృగం నుండి
అనేక ఏనుగులను చంపేది ఏది ? .... సింహం
పిరికిపంద యుద్ధంలో ఏం చేస్తాడు ? ....పలాయతే ... పారి పోతాడు!

శ్లోకంలోని మూడు ప్రశ్నలకీ వరుసగా చివరి పాదంలోని మృగాత్ సింహ:, పలాయతే అనే వాటిని జవాబులుగా చెప్పుకుంటే మరే అసంగతమూ ఉండదులేడిని చూసి సింహం పరిగెత్తడమూ ఉండదు!
క్రమాలంకారంతో కవి గారు సాధించిన చమత్కారం యిది !
బాగుంది కదూ ? ...

10, ఫిబ్రవరి 2015, మంగళవారం

హవ్వ ! దేవతలకూ దారిద్ర్యమేనా ? !


దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.
చూడండి:
హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య, నలాంగలం
క్రమ పరిమితా భూమిర్విష్ణో: న గౌ ర్న చ లాంగలం
ప్లవహతి కృషి:నాద్యా ప్యేషాం ద్వితీయం గవం వినా
జగతి సకలే నే దృగ్దృష్టం దరిద్ర కుటుంబకమ్.

బలరాముడికి నాగలి ఉంది. కాని ఎద్దులు లేవు.
శివుడుకి ఎద్దు ఉంది. కాని నాగలి, భూమి లేవు.
హరికి మూడడుగుల నేల ( బలి ఇచ్చినది) ఉంది. కానీ, ఎడ్లు, నాగలి లేవు.
ఇంత దరిద్ర కుటుంబం ఎక్కడా చూడ లేదయ్యా ! అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.
కేవలం చమత్కారం కోసమే సుమండీ. నాగలి, ఎద్దు, భూమి మొదలయినవి ఆయా దేవతలకి వరుసగా ఆయుధమూ, వాహనమూ, ధర్మ పత్ని గానూ శోభిల్లుతున్నాయి.
కాసుల పురుషోత్తమ కవి కూడా వ్యాజ నిందా రూపమైన తన ఆంధ్రనాయక శతకంలో హరి పరమ దరిద్రుడని వెటకారంగా అన లేదూ?
చూడండి:
ఆలు నిర్వాహకురాలు భూదేవియైయఖిల భారకుడను నాఖ్యఁదెచ్చె
ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్ధదుడన్న ఘనతఁదెచ్చె
కమలఘర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁదెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుడన్న ప్రతిభఁదెచ్చె
ఆండ్రు బిడ్డలుఁదెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ !
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !
శ్రీహరికి అఖిల భారకుడు ( సమస్త లోక భారాన్ని వహించేవాడు), కామితార్ధదుడు ( కోరిన కోరికలు ఇచ్చే వాడు), బహు కుటుంబికుడు ( జగమంత కుటుంబంకలవాడు), పతిత పావనుడు
( పతితులను వారి పాపాలు పోగొట్టి, పుణ్యాత్ములుగా చేసే వాడు) అనే పేర్లు ఉన్నాయి.
అయితే , మన కవి హరికి ఈ పేర్లన్నీ రావడానికివరుసగా అతని భార్యలు భూదేవి, శ్రీ లక్ష్మి, అతని కుమారుడు బ్రహ్మ, కుమార్తె గంగ కారణం తప్ప అతని గొప్పేమీ లేదని వ్యాజ నిందా రూపంలో చెబుతున్నాడు. హరి మొదటి నుండీ (దరిద్ర) దామోదరుడేనుట !
దామోదరుడు అంటే, దామము (పద్మము) ఉదరము నందు కలవాడని అర్ధం. శ్రీహరి నాభిలో కల పద్మం నుండే కదా బ్రహ్మ జనించినది.
ఇది నిందా రూప స్తుతి. అట్టి మహనీయులను పత్నులుగాను, కుమారునిగాను, కుమార్తె గాను కలిగిన హరి మరింత ఘనత వహించిన వాడు కదా. వ్యాజ నిందా రూపంలో హరిని నుతించడానికి కవి అతనికి లేని పోని దారిద్ర్యాన్ని ఆపాదించి చెబుతున్నాడు.
దేవతల దారిద్ర్యాన్ని గురించిన మరొక చాటువు కూడా చూదాం
శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట, రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడ లేక సుమీ !
కవి తమాషాగా శివుడు హిమవత్పర్వతం మీద నివాసం ఏర్పరచు కోవడం, సూర్య చంద్రులు ఆకాశంలో ఉండడం, శ్రీహరి నిరంతరం పాలకడలిలో ఆది శేషుని మీద పవళించడం కేవలం నల్లి బాధ పడ లేకనే అని చెబుతున్నాడు.నల్లులూ, దోమలతో వేగాల్సిన దరిద్రం ఆ దేవతలకీ తప్పడం లేదని చమత్కారంగా చెబుతున్నాడు.
పరమేశుడు కాశీ నగరం విడిచి రావడానికి కూడా ఈ దరిద్రమే కారణం కదా.
దేవతల దారిద్ర్యం గురించిన ఈ చమత్కారాలకు ఇక స్వస్తి. మరో టపాలో మళ్ళీ కలుద్దాం.

28, జనవరి 2015, బుధవారం

ఎంత కష్టం ? ఎంత కష్టం ?


‘‘ హాయిగా ఇంత వండి పడేసి, మొగుడు ఆఫీసుకి వెళ్ళాక, తిరిగి యింటికి తగలడే వరకూ నీకు పనేం ఉంటుంది చెప్పు? ఏ పత్రికో పట్టుకుని ఆ వెర్రి మొర్రి సీరియల్సూ గట్రా చదవుతూ పడుకోవడమో, లేదంటే, పిచ్చి పిచ్చి టీ.వీ జీళ్ళ పాకం సీరియళ్ళు చూస్తూ గడపడమో తప్పితే ?’’
ఈ రకమయిన మాటలు ఇదే మోతాదులో కాక పోయినా, కొంత మాటల మేకప్ వేసుకుని దాదాపు ప్రతి యింటా విన బడుతూనే ఉంటాయి.
మీరేం చేస్తున్నారని ఎవరయినా అడిగితే ఎందుకో తెలీదు కానీ , కొంచెం అనవసరంగా మొహమాట పడి పోతూ జాబేమీ చేయడం లేదండీ, హౌసు వైఫునిఅని జవాబిచ్చే సగటు ఆడవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం.
జాబ్ చేసే ఆడవారికి తామేదో తీసి పోయి నట్టుగా పాపం , కించ పడుతూ మాట్లాడుతూ ఉండే వారూ కనిపిస్తారు. ఈ వేగవంతమయిన రోజులలో ఉద్యోగం ఆడవాళ్ళకి కొంత వెసులు బాటుని కలిగించేదే కానీ అదనపు సదుపాయం మాత్రం కాదని నాకనిపిస్తూ ఉంటుంది. ఆర్ధిక స్వేచ్ఛ వలన ఆడవాళ్ళకి అదనపు గౌరవంతో పాటు అదనపు సమస్యలూ తెచ్చి పెడుతూ ఉండడం కూడా కొన్ని ఇళ్ళలో కనిపించే విషాదం.
సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, ఇళ్ళలో ఆడవాళ్ళు చేసే అవధానం ఎలాంటిదో శ్రీమాన్ గరిక పాటి నరసింహా రావు అవధాని గారు చెప్పిన ఒక ప్రసిద్ధ మైన ఆశు పద్యం తెలియని వారి కోసం చెప్పుకుందాం.
అష్టావధానం లో సమస్యా పూరణం, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటానాదం ,పురాణ పఠనం,అప్రస్తుత ప్రసంగం మొదలయిన ఎనిమిది అంశాలు ఉంటాయి కదా. ఈ అంశాల ఎన్నికలో అవధాని అభిరుచిని బట్టి కొన్నిటి స్థానంలో వేరే అంశాలూ చేర్చబడుతూ ఉంటాయి. ఏమైనా అంశాల సంఖ్య ఎనిమిదికి మించదు. ఘంటా నాదం బదులు పుష్ప గణనం, కానీ చదరంగ క్రీడ కానీ ఉండవచ్చును. కొందరు అవధానులు ఈ ఎనిమిది అంశాలలో న్యస్తాక్షరిని చేర్చి అవధానం చేస్తూ ఉంటారు.
పృచ్చకులు నిర్వహించే సమస్య మొదలగు వాటి గురించి క్లుప్తంగా చెప్పు కుందాం,
1. సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక ఛందస్సులో ఒక పద్యం యొక్క నాలుగవ పాదం చెబుతాడు.అతను ఇచ్చిన పాదం కొంత అసంబద్ధంగానో, అసంగతంగానో, అశ్లీలార్ధ ద్యోతకంగానో కనిపించ వచ్చును.హేతు బద్ధంగా అనిపించక పోవచ్చును. కానీ, అవధాని పద్యం యొక్క మీది మూడు పాదాలు చెప్పడంతో ఆ అసంగత్వం ఏదేనా ఉంటే, తొలిగి పోయి చక్కని భావ యుక్తమయిన పద్యం తయారవుతుంది. ఇది సమస్య.
ఉదాహరణకి : ఒక పృచ్ఛకుడు ‘‘ ఈతాకుల గుడిసె లోన ఇనుడు దయించెన్’’ అనే సమస్య ఇచ్చాడు. ఇది పద్యంలోని నాలుగో పాదం. తూర్పు కొండల్లో ఉదయించాల్సిన సూర్యుడు ఈతాకుల గుడిసెలో ఉదయించడ మేమిటి ? అవధాని గారి పూరణతో పద్యంలో ఆ సందిగ్ధత తొలిగి పోతుంది. చూడండి:
సీతా పతి పూదోటకు
ఏతా మెత్తంగ వలయు వేకువ జామున్
తాతా ! తొంగున్నావా ?
ఈతాకుల గుడిసె లోన ఇనుడుదయించెన్.
శ్రీరాముల వారి పూల తోటను చూసు కుంటూ ఉండే తోట మాలి తన ఈతాకుల గుడిసెలో పడుకుని ఉన్నాడు. తెల్ల వారింది. తాతను నిద్ర లేపుతూ మనుమరాలు కాబోలు, అంటోంది:
‘‘ తాతా, సూర్యుడు ఉదయించాడు. రాముల వారి పూల తోటకు ఏతాం ఎత్తి నీళ్ళు పట్టాలి. ఇంకా నవ్వు నీ ఈతాకుల గుడిపెలో పడుకుని లేవ లేదా?’’ అని అవధాని గారి చక్కని పూరణతో పృచ్ఛకుడు సమస్య ఇచ్చి నప్పటి అసంబద్ధత తొలిగి పోయింది కదూ?
2. నిషేధాక్షరి: పృచ్ఛకుడు ఏదో ఒక అంశం యిచ్చి కోరిన ఛందస్సులో అవధాని పద్యం చెప్పడం మొదలు పెడుతూ పాదం తొలి పదంలో తొలి అక్షరాన్ని పలుకుతాడు. వెంటనే పృచ్ఛకుడు తర్వాతి పదాన్ని నిషేధిస్తాడు. అంటే అవధాని ఇక ఆ అక్షరాన్ని ఉపయోగించ కూడదన్న మాట. దానికి బదులు మరో అక్షరాన్ని వేసు కోవాలి. ఉదాహరణకి అవధాని శ్రీరాముని మీద పద్యం చెప్పడానికి సిద్ధ పడి శ్రీ అని అన్నాడను కోండి, పృచ్ఛకుడు అనే అక్షరాన్ని నిషేధిస్తాడు. దానితో అవధాని ర అనే అక్షరానికి బదులుగా మరో అక్షరం వాడాలి. ఇలా పృచ్ఛకుడు ప్రత్యక్షర నిషేధం కానీ, తాను కోరిన చోట నిషేధం కానీ విధిస్తూ ఉంటాడు. నిషేధించిన అక్షరాన్ని వదిలి అవధాని వేరే అక్షరాన్ని ప్రయోగిస్తూ , మొత్తానికి అర్ధవంతమయిన పద్యం చెప్పాలి. అవధానంలో అవధాని ప్రతిభకు నిషేధాక్షరి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి.
3. దత్త పదిలో పృచ్ఛకుడు తనకు తోచిన నాలుగు పదాలు చెబుతాడు. వాటిని వరుసగా ఒక్కో పాదంలో ఉపయోగిస్తూ, అర్ధవంతమయిన చక్కని పద్యం అవధాని చెప్పాలి.
చూడండి, ఒక దత్తపది. ఒక పృచ్ఛకుడు పాలు, పెరుగు, నేయి, నూనె అనే పదాలు ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ భారతార్ధం వచ్చే లాగున ఒక పద్యం చెప్పమన్నాడు.
అవధాని గారి పూరణ చూడండి:
పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధ మింక.
నాలుగు పాదాల లో పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలూ వచ్చేయి కదా. ఇక భావం చూడండి:
దుర్యోధనుడు పాండవులకు రాజ్య భాగం ఇవ్వడు. దుర్మార్గం వాడిలో మరీ పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడా చూడం .వాడిలో మూర్ఖత్వం ప్రబలి పోయింది. ఇక యుద్ధం తప్పదు.
4. వర్ణన: పృచ్ఛకుడు కోరిన అంశం గురించి, కోరిన ఛందస్సులో కోరిన వర్ణన చేస్తూ అవధాని పద్యం చెప్పాలి.
ఇవి సాధారణంగా దేవతా వర్ణనలో, ప్రకృతి వర్ణనలో అయి ఉంటాయి.
5. .ఆశువు: అవధాని పృచ్ఛకుడు అడిగిన విషయం మీద చక్కని పద్యం చెప్పాలి. అడిగే వాడు పకోడీ మీద పద్యం కావాలన వచ్చు. కంప్యూటరు గురించి కావాలన వచ్చు దేని గురించయినా పద్యం చెప్పమన వచ్చు. అతనిష్టం. అవధాని ఆశువుగా, ధారాశుద్ధితో మొత్తం పద్యం చెప్పాలి.
6. ఘంటా నాదం (లేదా) చదరంగం (లేదా) పుష్ప గణన (లేదా) తేదీ, వారాల లెక్క :
(a) ఘంటానాదం: అవధానం జరుగు తున్నంత సేపూ ఒక వ్యక్తి ఠంగ్ మని ఒక్కో గంట కొడుతూ ఉంటాడు. అవధానం చివరలో అతడు ఎన్ని గంటలు కొట్టేడో అవధాని లెక్క తప్ప కుండా సరిగ్గా చెప్పాలి.
(b) చదరంగం: ఒక ప్రక్క ఇతర పృచ్ఛకులకు పద్య పాదాలు అవీ చెబుతూనే అవధాని ఒక వ్యక్తితో చదరంగం ఆడాలి. గెలవక పోయినా ఫరవా లేదు కానీ, ఓడిపో కూడదు.
(c) పుష్ప గణన: ఇది కూడా ఘంటా నాదం లాంటిదే. గంటలకు బదులు ఇక్కడ పూల లెక్క ఉంటుంది.
ఒక వ్యక్తి పూల రాశి లోనుండి ఒక్కో పువ్వునూ తీసి ప్రక్కన పెడుతూ ఉంటాడు. అవధాని ఆ పూల సంఖ్య సరిగ్గా చెప్పాలి.
(d) తేదీ వారాల లెక్క: పృచ్ఛకుడు ఏడాది, నెల, తేదీ చెప్పి, ఆ రోజు ఏ వారమో చెప్ప గలరా ? అనడిగితే తడుము కోకుండా అవధాని ఆ వారం పేరు సరిగ్గా చెబుతాడు.
7. పురాణపఠనం: పృచ్ఛకుడు కోరిన గ్రంధం లోనుండి కోరిన భాగం లోని పద్యాలు చదివి,పురాణం చెప్పడం.
8. అప్రస్తుత ప్రసంగం: అవధానం జరుగుతున్నంత సేపూ, అవధాని గారి ఏకాగ్రతను చెడ గొడుతూ ఒక పృచ్ఛకుడు చమత్కారవంతమైన సంభాషణ తనకు తోచిన రీతిని చేస్తూ ఉంటాడు. అవధాని అతనికి తగు రీతిలో , అతనడిగిన దానికి దీటుగా బదులు చెబుతూ ఉండాలి.
అష్టావధానంలో చోటు చేసుకుంటూ ఉండే మరో అంశం వ్యస్తాక్షరి అని చెప్పు కున్నాం కదూ. ఇదెలా చేస్తారంటే, పృచ్ఛకుడు అనుష్టుప్ శ్లోకంలో ఉండే సంఖ్యానుగుణంగా గడులు గీసుకుని సిద్ధంగా ఉంటాడు. అవధానం మొదలయ్యేక, పృచ్ఛకుడు తనకు నచ్చిన అంశం మీద ఒక శ్లోకం చెప్పమంటాడు. సాధారణంగా ఇది కూడా ఏ దేవతా ప్రార్ధనో అవుతుంది. అయితే, శ్లోకమంతా ఒకే సారి కాకుండా, తనకు నచ్చిన గడి సంఖ్య చెప్పి, ఆ గడిలో ఉండ తగిన అక్షరం చెప్పమని అవధానిని అడిగి, అతను చెప్పిన అక్షరాన్ని ఆ గడిలో వ్రాసుకుంటాడు.అవధానం పూర్తయే లోగా మొత్తం అన్ని గడులూ అవధాని అప్పుడూ అప్పుడూ చెప్పిన అక్షరాలతో నిండి పోతాయి. అవధానం చివరలో ఆ అక్షరాలన్నీ కలిసి ఒక పూర్తి అర్ధవంతమయిన శ్లోకం అవుతుంది..
అవధానం లోని అంశాల గురించి ఇక్కడ నేను వ్రాసినది సర్వ సమగ్రం కాక పోవచ్చును. కొంత అస్పష్టత ఉండ వచ్చును. నా తెలియమి కూడా కారణం కావచ్చును. కానీ నాకు తెలిసినంతలో అవధానం లోని అంశాలను వివరించాను. పెద్దలు సరి చేస్తే సరి దిద్దుకుంటాను.
అవధాని పృచ్ఛకులకు ఒకే సారి నాలుగు పాదాలూ చెప్పనవసరం లేదు. చెప్పడు కూడా. ఆవృత్తికి ఒక పాదం చొప్పున చెబుతాడు, అవధానం ముగిసే సమయానికి పద్యం నాలుగు పాదాలూ పూర్తవుతాయి.
ఆ తరువాత అంశం, ధారణ. అవధాని ఒక్కో పాదం చొప్పున అన్ని ఆవృత్తాలలో చెప్పిన మొత్తం పద్యాలు తిరిగి ఆయా అడిగిన వారికి (పృచ్ఛకులకు) ధారగా అప్ప చెబుతాడు. ఎక్కడా తడుము కోరాదు. ఏం చెప్పానని అడుగ రాదు. మొదట చెప్పిన దానికి భిన్నంగా చెప్ప రాదు. ధారణ విజయవంతంగా చేస్తే అవధానం విజయవంతంగా పూర్తయినట్టు లెక్క ! మరో విషయం, మొత్తం అవధాన సమయం నాతి దీర్ఘంగా ఉండ కుండా చూడడం కూడా అవధాని ప్రతిభకు పట్టం కట్టేదే.
ఇంత కష్టసాధ్యమైన అవధానం మన ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా చేస్తూ ఉంటారో ఈ పద్యంలో చూడండి:
అడుగడుగున నిషేధాఙ్ఞ జారీ చేయు
భర్త నిషేధాక్షరార్తిఁదోప
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ
మాసమ్ము గడప సమస్య కాగ
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు
దత్తుండు దత్త పదమ్ము కాగ
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి
వర్ణనీయాంశమై వరలు చుండ
పాలు కూరలు పళ్ళ బండ్ల వారల రాక
ఆశు ధారా కవిత్వార్ధ మనఁగ
అత్తయ్య వేసెడి అక్షింత లవి యన్ని
పాత పురాణంపు పఠన మనఁగ
చీటి మాటికి వచ్చు సెల్లు సందేశాలు
వ్యస్తాక్కరమ్ముల వరుస గాగ
విసుగు తెప్పించెడి వీర ధారా వాహి
అధిక ప్రసంగమై అడ్డు పడఁగ
దినము దినమిట్లు వనితలు తిప్పలు పడి
పూట పూటకు అవధాన పూర్ణ బుద్ధి
తనరు చుండంగ పురుషావధాను లేల?
వర సహస్రావధానులీ పడతు లెల్ల !
.ఆడ వాళ్ళు అవధానంలో అవధాని గారు చేసే పనులన్నీ తమ నిత్య జీవితమనే అవధానంలో ఎలా చేస్తున్నారో చూడండి.
మొగుడు ప్రతీ దానికీ అడ్డు పడుతూ అది వద్దు, ఇది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు అంటూ తల తినేస్తూ ఉంటాడుట. దీనిని నెట్టుకు రావడమే ఆడ వారు చేసే నిషేధాక్షరి .
చాలీ చాలని జీతం రాళ్ళతో, లేదా బొటా బొటీ డబ్బులతో నెల గడపడమే వారికి సమస్య.
అదీ ఇదీ సర్దవే అమ్మా, అంటూ వెంట పడే కాన్వెంటు పిల్లలను ముస్తాబు చేసి, బడికి పంపడమే దత్తపది.
ఇంట్లో బుజ్జి పాపాయిలు ఉంటే నిత్యం వారిని ముద్దాడుతూ, వారికి సేవలు చేయడంతోనే సరి పోతుంది. అదే వర్ణన.
పాలబ్బాయ్, కూరలబ్బాయ్ సండ్ల బళ్ళ వాళ్ళతో చేసే సంభాషణే ఆశువు
ఇక ఇంట్లో అత్త గారు కనుక ఉంటే ఆవిడ గారు వేసే అక్షింతలు, వినిపించే పాత పురాణం అంతా యింతా కాదుట. అదే పురాణపఠనం
ఈ మధ్యలో సెల్ ఫోను రింగవుతూ ఉంటుంది. ఆ బాధ మరీ వర్ణనాతీతం ఇల్లాలికి. అది వ్యస్తాక్షరి.
విసుగు తెప్పించే బుల్లి తెర ధారావాహికలు అధిక స్రసంగాలు.
ఇలా రోజూ తిప్పలు పడే వనితలు గొప్ప అవధాన విద్య ప్రదర్శిస్తున్నారు. సహస్రావధానులైన పడతులుండగా, ఇక పురుషావధాను లెందుకండీ ...
నిత్యావధానులైన ఆడవారికి నమోవాకాలు .
తల్లుల కష్టం వెల కట్ట లేనిది. వెల కట్ట రానిదీనూ.
వారికి ఆది వారమూ లేదు, శలవు దినమూ ఉండదు. కదూ?
రిటైర్మెంటు అసలే లేదు.