సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సభకు నమస్కారం !



సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణమ్.

చక్కగా మాట్లాడ గలగడమే వ్యక్తికి అలంకారం. ఆకట్టుకునేలా ప్రసంగించ గల వారికి ఎప్పుడూ సంఘంలో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. సభలలో అయితే, వక్తలలో గొప్పగా ఉపన్యసించ గలడని పేరు పొందిన వక్తల ప్రసంగాలను కార్యక్రమం చివరిలో ఉండేటట్టుగా నిర్వాహకులు జాగ్రత్త పడుతూ ఉంటారు. దానికి కారణం సభకు వచ్చిన జనాలను వెళ్ళి పోకుండా కట్టడి చేయడానికే అనే విషయం సర్వ విదితమే.

సభలలో తరుచుగా మాట్లాడాల్సి వచ్చే వక్తలకు ఎదురయ్యే ప్రధాన సమస్య , ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించడం అనేది. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియ జేస్తూ, ప్రేక్షక మహాశయులకు అభివాదాలు చేస్తూ ప్రారంభించాలనుకున్న వారి ఉపన్యాసం, వేదిక ఒక్కో సారి పెద్దలతో క్రిక్కిరిసి పోయి ఉండే పక్షంలో ఈ ప్రారంభ వాక్యాలు ఎంతకీ తెమలవు. దాదాపు వందన సమర్పణలా ఉంటాయి వారి ఉపన్యాస ప్రారంభ వాక్యాలు.

ఏవో తంటాలు పడి మొదలెట్టాక, ఇక ఆగే పని లేదు. వినేవారి సహనాన్ని పరీక్షకు పెట్టడమే

మైకాసురులని వీరిలో కొందరు అప్పటికే పేరు పడిపోయి ఉంటారు. సహనం చచ్చిన నిర్వాహకులు వారి వాక్ప్రవాహానికి అడ్డ కట్ట వేయడానికి నానా హావభావ ప్రదర్శనలూ చేస్తూ ఉంటారు.

ఎట్టకేలకు, చివరిగా ఓ రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను అని భరోసా యిచ్చిన సదరు వక్త కచ్చితంగా ఆ పీకుడు మరో అరగంట దాకా కొనసాగించాడన్నమాటే.

ఇక, సభా కార్యకమాలలో చివరి వక్తగా ఉపన్యసించ వలసిన వక్త బాధ మరో రకంగా ఉంటుంది. అప్పటికే అతను చెప్ప దలచిన నాలుగు ముక్కలూ అంతకు ముందు మాట్లాడిన వక్తలలో ఎవరో ఒకరు చెప్పీసి ఉంటారు. ఇహ అతనికి కొత్తగా ఏమీ చెప్పడానికి మిగలక పోవడంతో ఉపన్యసించడానికి నానా తంటాలూ పడతాడు. విలువ చచ్చిన ఆ మాటలకు విసిగి పోయిన ప్రేక్షకులు ఒక్కోసారి ఉదాత్తంగానూ, ఒక్కోసారి భీకరంగానూ తమ అసమ్మతిని ప్రదర్శిస్తూ ఉంటారు.
బెదిరి పోయిన సదరు వక్త అర్ధాంతరంగా ఉపన్యాసం ముగించీసి, ఓ రైలు తప్పి పోయిన వాడి నవ్వు ముఖాన పులుముకుని, తిరిగి తన సీటులో కూలబడి, కర్చీఫుతో ముఖం రుద్దుకునే కార్యక్రమాన్ని మొదలెడతాడు.

ఉపన్యాసకులలో గండరగండలు కొందరుంటారు. వారికి వేదికతో పని లేదు. ప్రేక్షకులతో నిమిత్తంత లేదు. కార్యక్రమ అజెండాతో పని లేదు. సభా కార్య క్రమం దేనికి సంబంధించినదో వారికి తెలియ నక్కర లేదు. వస్తారు. అనర్గళంగా ఉపన్యాసంతో చితక్కొట్టేస్తారు. జరూరు పని ఉంది. మీరంతా మన్నించాలి అంటూ వారి అనుమతితో నిమిత్తం లేకుండా అక్కడ నుండి వెళ్ళి పోతారు. ఈ జబర్దస్తీ వక్తలు దేని గురించయినా మాట్లాడ గలరు. సాహిత్య సభలో కూరగాయల గురించీ, కార్మిక సభలో కథా సాహిత్యం గురించీ .....

ఇక, సభలలో దండల ప్రహసనం గురించి చెప్పు కోవాలంటే చాలా ఉంది. ఒక్కో తూరి కొన్ని సభలలో అప్పటి కప్పుడు దండలు వేసి సత్కరించాల్సిన వ్యక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోతూ ఉండడంతో నిర్వాహకులు చేసేదేమీ లేక నిర్మొహమాటంగా ముందు సత్కరించిన సన్మానితుని కాస్త ప్రక్కకి లాగి, ఒక్క ముక్క క్షమాపణలతో దౌర్జన్యంగా వారి మెడలోని దండలను, వారి చేతికిచ్చిన బొకేలను, కొండొకచో వారికి కప్పిన దుశ్శాలువాను కూడా ఒలుచుకు పోతారు. ఇంద్రడుకి తన సహజ కవచ కుండలాలు ఇచ్చిన దాన వీర శూర కర్ణుని భంగిమలో ఓ చిరు నవ్వు బలవంతాన విసిరి లోలోపల కుమిలి పోతూ ఆ దౌర్జన్య కాండకు తలొగ్గడం తప్పితే సదరు వక్త చేసేదేమీ ఉండదు.

సభల గురించి మాట్లాడు కునేటప్పుడు కురు సభలో శ్రీకృష్ణ రాయబారం గురించి తలచు కోకుండా ఉండలేం. ఒక నిండు సభలో అంత అర్ధవంతంగా ఉపన్యసించిన మహా వక్త ప్రపంచ చరిత్ర లోనే మరొకడు లేడు.

మన వివేకానందుడినీ,

వాళ్ళ చర్చల్ నీ ఓ సారి మనసారా తలుచుకుని కాసంత ముందుకు జరుగుదాం.

కల్పిత పాత్రే అయినా, మన జంఘాల శాస్త్రిని మరచి పోవద్దు సమా !

ఇంకా ఎందరో మహానుభావులు. వారందరకీ వందనాలు చెబుతూ నా ఎరికలో జరిగి సభావశేషాలు, సభా విశేషాలు ఒకటి రెండు మీ ముందుంచుతాను:


విశాఖ పట్నంలో శ్రీ,శ్రీ షష్టి పూర్తి సభలో కవి ఆరుద్ర అలిగేరు. వివరాల జోలికి నేనిప్పుడు పోదలచు కోలేదు. ఆ రోజు సాయంత్రం పెద్ద బహిరంగ సభ జరిగింది. తాపీ ధర్మారావు సభాధ్యక్షులు.
అలిగిన ఆరుద్ర గారూ, వారి శ్రీమతి రామ లక్ష్మి గారూ ముందు వరసలో కూర్చున్నారు. సభలో ఉపన్యసించేందుకు ఆరుద్ర సుముఖంగా లేరు.


తాపీ ధర్మారావుగారు, ఇహ ఊరుకో లేక, పెద్దాయన కనుక, పెద్దరికం వహించి ఆరుద్ర గారిని ఉపన్యసించడానికి వేదిక మీదకి ఆహ్వానించేరు. ఆరుద్ర కదల లేదు.

తాపీ వారు వదిలి పెట్ట లేదు. ‘‘ ఇప్పుడు సభను ఉద్దేశించి ఆరుద్ర గారు నాలుగు మాటలు మాట్లాడుతారు.’’ అని ఏకపక్షంగా ప్రకటించారు. దాంతో ఆరుద్రకి ఎక్కడో కాలింది. మౌనంగా వేదిక ఎక్కి,

‘‘ సభకు నమస్కారం ! ఇక సెలవు !’’

అని, నాలుగంటే నాలుగే ముక్కలు పలికి వేదిక దిగి పోయేడు. ఆరుద్ర చతురతకి సభ నివ్వెర పోయింది.

ఆ తర్వాత మెత్తబడిన ఆరుద్ర ఆనాటి సభలో అపూర్వమైన ప్రసంగం అనర్గళంగా చేసేడనుకోండి ...

నేను విన్న మరో సభా ముచ్చట:

ఓ పెద్ద సభలో దేశం పట్టనంత ఒక మహాకవికి సన్మాన కార్యక్రమం జరిపించేరు. ఎందు చేతనో కానీ దుశ్శాలువా విషయంలో కొంత ఉదాసీనత కనబరచి, చవక రకం శాలువా కవిగారికి కప్పేరు. అంతే, కవిగారికి ఒళ్ళు మండి పోయింది. ఆ అసంతృప్తిని అణుచుకుంటూ ఇలా అన్నారుట: ‘‘ ఈ కార్యక్రమ నిర్వాహకులు నాకు కప్పిన శాలువా మాకు చాలా ఉపయోగ పడుతుందని విన్నవిస్తున్నాను. చాలో రోజులుగా ఒడియాలు పెట్టేందుకు సరైన గుడ్డ లేదంటూ ఇటీవల మా ఆవిడ ఒకటే సణుగుతోంది. ఆలోటు దీనితో తీరిపోతుంది.’’

కవిగారి వ్యంగ్యంతో కంగు తిని, నిర్వాహకులు అప్పటికప్పుడు ఖరీదయిన మరో శాలువా తెప్పించి వారికి కప్పి, బ్రతుకు జీవుడా ! అని ఊపిరి పీల్చుకున్నారుట.

ఒక సారి ఓ పెద్ద సభలో ప్రముఖ నటులు శ్రీ గుమ్మడి వేంకటేశ్వర రావు గారు ఉపన్యసించడానికి లేచారు. సభ నానా గోలగా ఉంది. ఎంతకీ సద్దు మణగ లేదు. గుమ్మడి గారు చాలా సేపు నిరీక్షించేరు. కార్యక్రమ నిర్వాహకులు కంగారు పడి పోతున్నారు. వాలెంటీర్స్ ఎక్కడో తిరుగుతూ పట్టించు కోవడం లేదు. ప్రేక్షకుల మధ్యకి పరుగులు తీసి వారిని సద్దుమణిగేలా చేదామని ఒకరిద్దరు వేదిక మీదనుండి లంఘించ బోయారు. గుమ్మడి గారు వాళ్ళని కంటి చూపుతో నివారించి, కంచు కంఠంతో హాలు దద్దరిల్లిపోయే లాగున ‘‘ హలో, వాలంటీర్స్ ! ముందు మీరంతా నిశ్శబ్దంగా ఉండాలి ’’ అని అరిచేరు.

మొత్తం సభలోని వారంతా ఒక్క సారి ఉలిక్కి పడి, అందులో చమత్కారం అర్థం చేసుకుని చాలా సేపు పగలబడి నవ్వేరు. తర్వాత గుమ్మడి గారు అద్భుతమైన ప్రసంగం చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్ద వతావరణంలో చేసారు.

సభా కార్యక్రమాలలో వక్తల తొట్రుపాటుల వల్లనయితే నేమి, తెలియమి వల్ల నయితే నేమి జరిగే సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి కూడా. బరువైన పదాన్ని వాడాలనే దుగ్ధతో సన్మానితునికి శ్రద్ధాంజలి ఘటించే వారూ, సంతాప సభలో ప్రసంగించే అదృష్టం దక్కినందుకు తనకా రోజు అమితానందంగా ఉందంటూ వాక్రుచ్చే వారూ కూడా కనిపిస్తూ ఉంటారు.

నొక్కి వక్కాణించడాలూ, బల్ల గుద్ది చెప్పడాలూ సభలలో సర్వసాధారణం.


కవితా పఠనం జరిగే సాహితీ సభలలో అయితే ఒక్కో సారి పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి.

ఏ కవీ తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూస్తూ ఉంటాడే కాని. తన ముందు వాడి కవిత్వం శ్రద్ధగా విన్న దాఖలాలు ఎక్కడో కానీ కనిపించవ్.


సభలలో వక్తల హావ భావ చేష్టల వల్ల కూడా ఒక్కో సారి నవ్వులు పూస్తూ ఉంటాయి.

వక్తలలో కొందరకి కొన్ని పదాలు అలవాటుగా పదే పదే దొర్లిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం, అవి వారి ఊత పదాలు మరి.

ఒక సారి ఒక ప్రాచ్య కళాశాలలో వార్షికోత్సవ సభ జరుగుతోంది. సభాధ్యక్షత వహించిన వారు పెద్ద పోలీసు ఆఫీసరు. ఆమెకు తెలుగు అంతగా రాదు. కళాశాల ప్రిన్సిపాల్ గారు మహా పండితులు. వారికి మాట మాటకీ ‘‘ దీని పేరేమిటీ ...‘‘ అనే ఊత పదం వాడడం అలవాటు. అలవాటు ప్రకారం, ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మాటి మాటికీ దీని పేరేమిటీ ... అనడం మొదలు పెట్టారు. అలా అన్న ప్రతి సారీ ఆయన చూపుడు వేలు అనుకో కుండా ఆవిడ గారి వేపే చూపెడుతూ ఉండడంతో సభలో అంతా క్షణానికో సారి పెద్ద పెట్టున నవ్వుతూ గోల చేసారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో కళాశాల అధ్యక్షుల వారికీ తెలియ లేదు .సభాధ్యక్షురాలికీ అవగతం కాలేదు !

వక్తలకు ఇలా ఊత పదాలు లేనిదే మాట్లాడ లేని బలహీనత ఉంటే మాత్రం సభల్లో హాస్యరసం చిప్పిల్లక తప్పదు.

సరే, కథా మంజరి అలవాటు ప్రకారం సభ గురించిన ప్రస్తావన ఉన్న ఒకటి రెండు శ్లోకాలను ప్రస్తావించాలి కదా ?

చూడండి:

న సా సభా యత్ర న సంతి వృద్ధా:, న తే వృద్ధా యే న వదంతి ధర్మం
నా సౌ ధర్మో యత్ర న సత్యమస్తి, న తత్సత్యం యచ్చతే నాభ్యుపేతమ్

ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు. ఎవరు ధర్మాన్ని చెప్పరో, వారు వృద్ధులు కారు. దేని యందు సత్యం లేదో, అది ధర్మం కాదు. దేని వలన లోక కల్యాణం జరుగదో అది సత్యం కాజాలదు. అని మహా భారతం చెబుతోంది. అంటే, లోక కల్యాణం చేసే సత్య ధర్మ ప్రవచనం చేసే పండితులు ఎక్కడ ఉంటారో, అదే మంచి సభ అని భావం.

మరో శ్లోకం చూడండి:

యత్ర ధర్మో హ్యధర్మేణ, సత్యం యత్రానృతేన చ,
హన్యతే ప్రేక్షమాణానాం, హతా స్తత్ర సభాసద:

ఏ న్యాయ సభలో ధర్మం అధర్మం చేతను, సత్యం అబద్ధం చేతను బాధింపబడుతోందో ఆ సభలోని సభాసదులు జీవచ్ఛవాల వంటి వారే అవుతున్నారని దీని భావం.

ఇక్కడ మరో చిన్న అంశం - సభలోని వారిని సభాసదులు అని వాడడం జరిగింది. సాధారణంగా సభలోని వారిని సభికులు అనడం కద్దు. కానీ, సభికులు అంటే సభలో ధర్మం తెలిసిన వారే అనే కాక, జూదరులు అనే మరో అర్ధం కూడా ఉండడంతో ఆ పదం వాడడం అంత సబవుగా తోచదు.

మరొకటి చూడండి:

విపది ధైర్య మధాభ్యదయే క్షమా, సదసి వాక్పటుతా యుధి విక్రమ:
యశసి చాభిరతి ర్వ్యసనం శ్రుతౌ, ప్రకృతి సిద్ధ మిదం హి మహాత్మనామ్


ఈ శ్లోకంలో కవి కష్టంలో ధైర్యాన్ని, ఐశ్వర్యం కలిగి నప్పుడు ఓర్పు, యుద్ధంలో భుజబలం, కీర్తియందు ఆసక్తి విద్యయందు కోరిక సజ్జనుల సహజ గుణాలుగా చెబుతూ సభలలో సంపూర్ణమైన వాక్ నైపుణ్యం కలిగి ఉండడం కూడా సజ్జనుల సహజ గుణ మని చెబుతున్నాడు.

న సా సభా యత్ర న భాతి కశ్చిత్, న సా సభా యత్ర విభాతి చైక:
సభా తు సైవా2స్తి యథార్హరూపా, పరస్పరం యత్ర విభాంతి సర్వే.

ఒక్కడూ ప్రకాశించనిది, అది సభ అనిపించు కోదు. అంటే ప్రసంగించిన వక్తలందరూ చెత్తగా మాట్లాడితే అది మంచి సభ అనిపించు కోదుట. పోనీ, ఏ ఒక్కరో ప్రకాశించినా అదీ మంచి సభ అనిపించు కోదుట. అంటే, సభలో వక్తలంతా చెత్తగా ప్రసంగించి , ఏ ఒక్క వక్తో గొప్పగా మాట్లాడినంత మాత్రం చేత ఆ సభ మెచ్చుకో తగినది కాదని భావం. ఎక్కడయితే, ఉన్న వారందరూ ఒకరి వల్ల ఒకరు అధిక తరంగా ప్రకాశిస్తారో, అదే సభ అనే పేరుకి తగినది అని కవి భావం.


సభ గురించిన మరో మంచి శ్లోకం చూడండి:


సభా కల్పతరుం వందే, వేదశాఖోపజీవితం
శాస్త్రపుష్ప సమాయుక్తం, విద్వద్భ్రమర శోభితమ్.

వేదాలు అనే శాఖలతో, శాస్త్రాలు అనే పువ్వులతో, విద్వాంసులు అనే తుమ్మెదలతో ప్రకాశించే సభ అనే కల్ప వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని దీని భావం.

చివరిగా గుర్తొచ్చిన ఓ జోక్ తో ముగిస్తాను ...


‘‘ నిన్న టౌన్ హాలులో మావారికి సన్మాన సభ జరిగింది. ఎంత ఘనంగానో జరిగిందిట ! టౌను హాలు సగం జనంతో నిండి పోయిందిట. తెలుసా !?’’ అంది మీనాక్షి దర్పంగా స్నేహితురాలు కామాక్షితో.

దానికి కామాక్షి మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ’’ పోదూ, మరీ బడాయి కాక పోతే ... ఆ సభకు మా వారూ వచ్చేరు. సగం హాలంతా ఖాళీయేనట కదా ? ’’ అంది.

స్వస్తి.










10, నవంబర్ 2010, బుధవారం

నా నరక లోక యాత్ర ... ద్వితీయ భాగం !!


నా నరక లోక యాత్ర మొదటి భాగంలో, నాకు నరకంలో బెర్తు ఖాయమై పోయినట్టే అని చెప్పాను. గుర్తండే ఉంటుంది. ఆ టపా చదవని వాళ్ళూ, గుర్తు లేని వాళ్ళూ ఈ లంకె నొక్కి చూడవచ్చును.

ఇక, ఇందులో నా నరక లోక యాత్రా విశేషాలు పొందు పరుస్తున్నాను ...
* * * * * * * * *

కళ్ళు తెరిచి చూద్దును కదా, నాకు తెలీని వేరే ఏదో లోకంలో ఉన్నాను. అక్కడంతా గలీజుగా ఉంది. నానా కంగాళీగానూ ఉంది. ఆర్తుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. వికటాట్ట హాసాలు కర్ణభేరి బ్రద్దలయ్యే లాగున ప్రతిధ్వనిస్తున్నాయి.సలసల క్రాగే నూనె బాణళుల నుండి వచ్చే ధూమం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తానికి అక్కడ నానా బీభత్సంగానూ ఉంది. (ఐతే, ఒకటి, అదెంత భీకరంగా ఉన్నప్పటికీ హైదరాబాదంత గలీజుగా మాత్రం లేదనిపించడం విషయాంతరం)

కాస్త తమాయించుకుని, ‘‘ నేనిప్పుడెక్కడ ఉన్నాను?‘‘ అనడిగేను.
ప్రక్కనున్న రాక్షసాకారి వికటంగా నవ్వి, ’’ నరకంలో నయ్యా.‘‘ అని బదులిచ్చేడు.

’’ నరకం లోనా ! నన్నిక్కడి కెందుకు తెచ్చేరు? నేనేం పాపం చేసానని?‘‘ అనడిగేను గాభరాగా.

నాప్రశ్నకి వాడు జవాబు చెప్పే లోగానే, మరో ప్రక్క నుండి,’’ నరకానికి రాకేం చేస్తావురా,త్రాష్ఠుడా ! ‘‘ అనే మాటలు వినిపించేయి.

ఉలిక్కిపడి, అటు చూసేను. అక్కడ నా కథ లోని ప్రథాన పాత్రలలో ఒకడైన సర్వేశ్వర శాస్త్రులు కనిపించేడు. మనిషి కొంచె వడిలేడు. పూర్వపు నిగారింపు లేదు. దబ్బ పండులా ఎలా ఉండే వాడు ! పప్పూ. ఆవు నెయ్యీ, గోంగూర, ఆవకాయ పచ్చడీ, కంది గుండా, నువ్వుల నూనె, అప్పడాలూ, ఒడియాలూ, నాలుగు రకాల కూరలూ, పచ్చళ్ళూ, గారెలూ, నూలు పచ్చడీ, నువ్వులుండలూ, ముక్కల పులుసూ ....ఇవేవీ భోజనంలో అమరడం లేదు కాబోలు. కొంచెం జాలేసింది.

‘‘ మహానుభావా! మీరేమిటి ఇక్కడ ? క్రమాంతస్వాధ్యాయులూ, జటా,ఘనా,పనస తిరగేసీ మరగేసీ కూడా ఒప్ప చెప్పగల సమర్ధులూ,నిప్పును నీళ్ళతో కడిగే వంశీయులూ, ఇక్కడకి దయ చేసారేం?’’ అనడిగేను.

శాస్త్రుల వారి ముఖం మరింత దీనంగా తయారయింది.‘‘ నుదుటి రాత నాయనా ! నుదుటి రాత. ఆ వెంకన్న పంతులుగాడూ, వాడి మనుషులూ లేరూ, వాళ్ళ వల్ల వొచ్చింది నాకీ అరిష్టం. వాడు పెట్టిన పేచీయే కదా, నాచేత పాపం చేయించింది? అందుకే నన్నిక్కడికి లాక్కొచ్చేరు ...’’

‘‘ మరి ఆయనో ? ... ఆయనా ఇక్కడే ఉన్నారా? ...’’ అడిగేను, సంశయంగా.

‘‘ వాడి శ్రాద్ధం, ఉండకేం చేస్తాడూ ! అదిగో, ఆమూల అఘోరిస్తున్నాడు , మాష చక్రాలు (గారెలు) ఇక్కడ దొరక్క విలవిలలాడి పోతున్నాడు.’’

‘‘ఇంకా ఎవరెవరొచ్చేరో ...?’’

‘‘అంతా వచ్చేం నాయనా. బుచ్చి వెంకూ, చయనులూ, సొట్ట జగ్గడూ. బుచ్చబ్బాయీ, సూరిపంతులూ .. ఒహరనేమిటి? అంతా ఇక్కడే ఉన్నాం.’’

‘‘ గౌరీపతి రాలేదో? ...’’

‘‘ నీ పిండం కాకులకు పెట్టా. ఇలాంటి సందేహాలొస్తున్నాయేఁవిటయ్యా, నీకూ ..... గౌరీపతి గాడు రాకేం? మహా రాజు మొగుడిలా వచ్చేడు ... అడిగో ఆ ప్రక్కన జంద్యాలు వొడుకుతూ కూచున్నాడు, చూడు ...’’ అటు చూసేను. నిజఁవే. ఇంద్రుడూ వగైరాలు వెండివో, బంగారానివో జంద్యాలు వేసుకుంటారు కానీ , నూలు జంద్యాలు వేసుకోరు కదా? ఈ గౌరీపతి ఇక్కడ కూడా తాళం బిళ్ళ త్రిప్పుతూ నూలు జంద్యాలు వొడకడం ఎందుకో? నంగిరితనం. జడ్డితనం కాక పోతే, అనిపించింది.

నేనింకా ఏదో అడగబోయే లోగా శాస్త్రి గారే ఖంగున అడిగేరు: ‘‘ ఇక్కడి కొచ్చేటప్పుడు, చేతులూపుకుంటూ రాక పోతే, కాసిన్ని మాష చక్రాలు పట్టుకుని రాక పోయూఁవూ? నీ మొహం యీడ్చ. నోరు ఝలాయించి పోతోంది. ...’’ అన్నారు బాధగా.

‘‘ నాకో బీడీ కట్టయినా తెచ్చి ఉండాల్సింది ..’’ మరో ప్రక్క నుండి వెంకన్న పంతులు గొంతు పీలగా వినిపించింది.

మాట మార్చడానికి, ‘‘ అయితే, అంతా ఇక్కడకే చేరారన్న మాట ! ...’’ అన్నాను.

‘‘అఘోరిచావులే. యేళ్ళు ఎత్తికెట్టి కాల్చ. నీ పుట్టువు బూజు కాను. మేఁవే కాదు, అదిగో ఆ ప్రక్కన చూడు, మీ గురజాడా, వాడెవడూ? తల చెడిన ముండలకి మళ్ళీ పెళ్ళిళ్ళని , అదనీ ఇదనీ మన ఆచారాలని మంట కలిపేడు, వాడు, వీరేశలింగం కాబోలు వాడి పేరు ...వాడూ చాలా కాలమై ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే అనేఁవిటి ? మీ కార్లమాక్స్ గాడూ, మావో గాడూ , వాళ్ళంతా ఆ సలసల మరిగే నూనెలో ఎలా వేగుతున్నారో చూడు !’’ అన్నారు అంతా ఉక్రోషంగా ముక్త కంఠంతో.

గాభరాగా అటు చూసేను. అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళెవరూ లేరు. వీరప్పన్ లాంటి వాళ్ళెవరో కనిపిస్తున్నారు.

నన్నిక్కడికి తీసుకొచ్చిన యమ దూతలలో ఒకడు నా ప్రక్కలో పొడిచి, గుసగుసగా అన్నాడు: ‘‘ వాళ్ళెవరూ ఇక్కడ లేరు. అంతా హాయిగా స్వర్గంలో ఉన్నారు. ఈ ముసిలాయనకి తద్దినం బోయినాలు లేక, మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడు ....’’ అని.

రెండో భటుడు దానికి కొనసాగింపుగా చెప్పేడు: ’’ శాస్త్రి గారి భార్యా, రమణా, పరమేశూ కూడా అక్కడే ఉన్నారు ... నువ్వీయన మాటలు పట్టించు కోకు ... పద,నీ ఎంట్రీ ఇక్కడ రికార్డు చేయించాలి ...’’ అని.

‘‘మరి, మా తెల్లావో?’’ అడిగేను ఆత్రతగా.

ఈ సారి ఇద్దరు భటులూ ఏక కంఠంతో చెప్పారు: ‘‘ దానికేం ! అది కూడా అక్కడే నిక్షేపంగా ఉంది. ఇప్పుడు అసలక్కడ స్వర్గ లోకపు కేంటిన్ లో ఆ తల్లి క్షీరంతోనే కదా, అక్కడ ఇంద్రాదులకు కాఫీలూ గట్రా కాచేది !’’

నేను హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో అక్కడికి వచ్చిన పురోహిత వర్గమంతా అక్కసు వెళ్ళ గ్రక్కుతూ గబగబా తలో మాటా అనడం మొదలెట్టేరు.

‘‘ మా మీద కథ రాస్తాడూ? అప్రాచ్యపు వెధవ. సలసలా మరిగే నూనె బాణలిలో పడెయ్యండి.‘‘

‘‘ వొళ్ళంతా శూలాలు గుచ్చండి’’

‘‘ కక్కకట్టుకి కొరత వెయ్యండి, తిక్క కుదురుతుంది’’

‘‘ వైతరణి నీళ్ళు బిందెల కొద్దీ త్రాగించండి.’’

‘‘ తెలుగు టీవీ ఛానెళ్ళు రాత్రీ పగలూ విడవకుండా చూపించండి.త్రాష్ఠుడు, కళ్ళు పేలిపోయి ఛస్తాడు.’’

‘‘ దిన పత్రికలలో నానా చెత్తా ఆచివరి నుండి, ఈ చివరి వరకూ అక్షరం విడవకుండా చదివించండి.’’

‘‘ కథా మంజరి బ్లాగు టపాలన్నీ కంఠోపాఠం చెయ్యమనండి.’’

నాకు నరక లోకంలో అమలు కావలసిన శిక్షలను వాళ్ళంతా అలా ఖరారు చేస్తూ ఉంటే నాకు వొళ్ళు కంపరమెత్తి పోయింది. వజవజ వణికి పోయేను.

యమభటులిద్దరూ నా భుజం మీద చరిచి, నాకు ధైర్యం చెబుతూ వాళ్ళతో ఇలా అన్నారు.’’ అబ్బే, అంత సీన్ లేదు లెండి. వీరిని ఆ కథ రాసినందుకు కాక, వేరే కారణం చేత ఇక్కడికి తీసుకుని వచ్చేం. ఇక్కడ అట్టే సేపు ఉంచం. ఇక్కడి రికార్డులలో వీరి పేరూ వివరాలూ మరో తూరి నమోదు చేసి, ఒక పేము బెత్తం దెబ్బ శిక్షతో సరి పుచ్చి, నేరుగా స్వర్గానికి బదిలీ చేస్తాం. అక్కడ కొలువు తీరి ఉన్న గురజాడ, చా.సో, విశ్వనాథ సత్యనారాయణ, దేవుల పల్లి , నండూరి, కవిత్రయం వారూ , పోతన ... ఓ ... ఇలా కోట్ల సంఖ్యలో ఉన్న మహానుభావులను చూసి తరిస్తూ, వారిని సేవించుకుంటూ , వారి దీవెనలు అందుకుంటూ అక్కడే ఉంటారు .......’’

‘‘ మరి మేఁవో ?!’’ ఏడుపు గొంతులతో ఒకేసారి అరిచినట్టుగా అన్నారంతా.

‘‘ మీరిక్కడే ఉండాలి. మీరిందాక చెప్పిన శిక్షలతో పాటు, అలాంటివే కొన్ని వేల వేల శిక్షలు మీకింకా అమలు పరచ వలసి ఉంది. వాటిలో మొదటి శిక్ష కథా మంజరి బ్లాగు టపాలన్నీ అక్షరం పొ్ల్లు పోకుండా కంఠోపాఠం చేసి గడగడా వొప్పగించడం!‘‘

‘‘ ఆఁ!!!‘‘ అంటూ, అంతా నోళ్ళు వెళ్ళ బెట్టీసేరు.

* * * * * * * * * *

నేను మనిషిని ప్రేమిస్తాను. మానవత్వాన్ని ఆరాధిస్తాను. కానీ, మనో రుగ్మతలను అసహ్యించుకుంటాను. మనో వైక్లబ్యాలను ఏవగించుకుంటాను.

వృత్తులను గౌరవిస్తాను. కానీ, ఆయా వృత్తి నిర్వహణలో వ్యక్తులు పోయే ద్వంద్వ ధోరణులూ, విపరీతపు పోకడలూ తిరస్కరిస్తాను. ఎండగడతాను .

ఆ కథ రాసినందుకు కించ పడిన ఒక వర్గీయులు నన్ను ‘‘ నరకానికి పోతావ్ రా, గాడిద కొడకా!’’ అని ఆశీర్వదించేరు. శాపనార్ధాలు పెట్టేరు. చాలా మంది మాత్రం, భుజం తట్టి ఆశీర్వదించేరు.


నానరక లోక యాత్రకు కారణభూతమయిన ఆ కథనీ, ఆ కథా నేసథ్యాన్నీ చదవాలనుకునే వారు ఈ లింకు నొక్కి చూడ వచ్చును.

శలవ్.

8, నవంబర్ 2010, సోమవారం

నా నరక లోక యాత్ర ... మొదటి భాగం !


ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు. పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది. అందులో పురోహితులూ, సన్యాసులూ తప్పకుండా నరకానికి పోయే అవకాశం గురించిన ప్రస్తావన ఉంది.

చూడండి:

నరకాయ తే మతి శ్చేత్,
పౌరోహిత్యం సమాచర
వర్షం యావత్ కిమన్యేన
మఠచింతాం దినత్రయమ్.

ఈ శ్లోకంలో కచ్చితంగా ఎవరు నరకానికి పోతారో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు శ్లోక కర్త.

వారెవయ్యా, అంటే,

నీకు నరకానికి పోవాలని కోరిక ఉంటే ఒక యేడాది పాటు పౌరోహిత్యం చెయ్యి !

అంతకాలం ఓపిక లేదనుకుంటే దానికీ ఓ మార్గం ఉంది.

ఒక మూడు రోజులు మఠం గురించి ఆలోచించు. మూడు రోజుల పాటు మఠ ప్రవేశం చేసి చూడు. అంతే, నీకు నరకం తథ్యం !

పౌరోహిత్యం చేసే వాళ్ళూ, సన్యాసులూ తప్పులు చేసే అవకాశం పుష్కలంగా ఉంది కనుక, వారు తప్పకుండా నరకానికి పోవలసిన వారే అని దీని భావం.

నాకున్న ఒకటి రెండు అనుభవాలు ఆలోచిస్తే, కనీసం, నాకు అది నిజమే అనిస్తుంది.
నేను ఉద్యోగ రీత్యా పని చేసే ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉదయాన్నే, నాతో పాటు గంగయ్య హొటల్ లో పెసరట్టూ ఉప్మా లు తృప్తిగా తిని, వేడి వేడి కాఫీ కులాసాగా సేవించి, ఆతర్వాత, అవి అరిగే వరకూ వీధరుగుల మీద చీట్ల పేకలో తరించి, ప్రొద్దు తిరిగి, మధ్యాహ్నంఏ మూడింటికో తద్దినం పెట్టడానికి తీరికగా బయలు దేరే వాడు. అంత వరకూ, తద్దినం పెట్ట వలసిన ఇంటి యజమాని, వారి బంధుగణం ఉదయం నుండీ అభోజనంతో ఆకలితో నకనకలాడి పోతూ. నీరసాలు ముంచు కొచ్చి, ఇతని కోసం ఎదురు చూపులు చూస్తూ శోష వచ్చి పడి పోయే స్థితికి చేరు కునే వారు...

ఓ సారి మా మామ గారి ఇంట్లో ఒక భోక్త తీరా భోజనానికి కూర్చున్నాక, తిన లేక తిన లేక నాలుగు ముద్దలు నోట పెట్టుకని భళ్ళున అక్కడే వమనం చేసుకున్నాడుట. కారణం మరేమీ కాదు, డబ్బు కక్కుర్తితో అప్పటికే వేరొక చోట ఆ వ్యక్తి భోక్తగా వెళ్ళి కడుపు నిండా తిని రావడమేనని తెలిసింది.

నేను ఓ కుగ్రామంలో పని చేసే రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబీకులు ఇంట్లో పితృకార్యం చేస్తూ సాయంత్రం ఐదయినా, పిలిచిన భోక్తలు ప్రక్క ఊరి నుండి ఎంతకీ రాక పోవడంతోదిగాలు పడి పోయి, చివరకి పెళ్ళయిన బ్రహ్మచారిగా ఆ ఊళ్ళో ఒంటరిగా ఒక గది తీసుకుని ఉంటున్న నన్ను భోక్తగా రమ్మని బ్రతిమాలేరు. అప్పటికే నేను మధ్యాహ్న భోజనం కానిచ్చి, ఏదో పుస్తకం చదువుతూ ఓ కునుకు తీస్తున్నాను. నా భోజనం అయిపోయింది కదా, నేనెలా పనికి వస్తాను ? అనడిగేను. ఆ కుగ్రామంలో మరొక బ్రాహ్మణ నలుసు లేక పోవడం చేత, పాపమో,పుణ్యమో తమ ఇంటికి వచ్చి భోక్తగా తమ తల్లి గారి ప్రసాదం తిని వెళ్ళమని కన్నీళ్ళతో వేడుకున్నారు. నాకిక తప్పింది కాదు.ఆ రోజు నేను వారింటి పితృకార్యంలో నిష్ఠగా పాల్లొన లేదు. వారి బలవంతం చేతనే కావచ్చు, తిండి తినీసి, వారింటికి భోక్తగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆచారం మంట కలపేను. ఆ కారణం చేత నాకు నరకం తప్పదని నేను ఇప్పటికే నిర్ణయానికొచ్చీసేను.

ఇప్పుడు చెప్పండి, నిష్ఠగా, శుచిగా, చిత్త శుద్ధితో చేయాల్సిన పురోహిత కార్యాలు మొక్కుబడిగా, అశ్రద్ధగా,తూతూ మంత్రంగా, పిండి కొద్దీ రొట్టె, యావత్ తైలం, తావద్వాఖ్యానమ్ లాగా , ఇచ్చే డబ్బు కొద్దీ చేయించే వారూ నరకానికి పోతారంటే, పోరూ మరి !

అలాగే, నిత్యానంద స్వాముల వంటి వారు మన వెర్రిభారతంలో వేలూ, లక్షలూనూ. వాళ్ళందరూ నరకానికి కాక పోతే, స్వర్గానికి పోతారా ! ఆలోచించండి.

అందుకే, శ్లోక కర్త అథమపక్షం ఓ ఏడాది పాటు పౌరోహిత్యం చేసిన వారూ, కనీసం ఓ మూడు రోజుల పాటు సన్యాసిగా ఉండే వారు సైతం నరకానికి పోవసిందే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు ...

తప్పులు చేసే పురోహితులూ, సన్యాసులే కాదు, తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!

సరే, అదలా ఉంచితే, నాకు నరక లోకపు బెర్తు ఖాయం అని తేలి పోయింది. ఏం చేస్తాం చెప్పండి. అయితే, నాకు తోడుగా అక్కడ నాకంటె ముందుగానో, కాస్తంత అటూ యిటూ గానో, మిత్రుడు భీమ్ పాపాల శర్మ , కవితా కరవాలాలతో చెండాడే కుకవులూ, భార్యలను ఏడిపించుకుని తినే భర్తలూ, భర్తలను కాల్చుకు తినే భార్యలూ, రేగింగు వీరులూ, కల్తీ మందులూ వస్తువులూ విక్రయించే వ్యాపారులూ, అధిక వడ్డీలు గుంజే అధమాధములూ, ప్రజా సేవ పేరిట ప్రజా కంటకులైన నాయకమ్మన్యులూ ( రాజ్యాంతే నరకం ధృవమ్ కదా ) , పసి పిల్లలను గొడ్డుల్లా బాది పైశాచికానందం పొందే టీచర్లూ, క్షుద్ర సాహితీ సమరాంగణ సార్వ భౌములూ, నాలాగా చేతికొచ్చిన బ్లాగులు పెట్టి బాధించే బ్లాగు పిశాచులూ, హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళూ, రాంగ్ కాల్స్ చేస్తూ విసిగించే ఫోనాసురులూ ... ... మరింక చెప్ప లేను ... ఇలా చాలా మంది వచ్చి చేరుతారనే నిబ్బరంతో నరక లోక యాత్రకు రెడీ అయి పోతున్నాను, మరి ... నరక లోకపు జాగిలమ్ములు మబ్బు చాటున ఖణేళ్ మన్నాయ్ !!

నా నరక లోక యాత్ర ద్వితీయ భాగంలో ఆ ముచ్చటలు వివరిస్తాను. మీరంతా చదివి ఆనందించ వచ్చును. మనకి స్వర్గమో, నరకమో ఇతమిత్థంగా ఇంకా తేలని స్థితిలో, ఎదుటి వాడికి నరకం ఖాయమని తేలి పోయేక , మనకి ఆనందం వెయ్యదూ?!