15, జనవరి 2014, బుధవారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్య దోశె... ఆహా ! ఏమి రుచి !



కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లు

చాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా హొటల్ డేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాష్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ,,, ,,, మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

10, డిసెంబర్ 2013, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ...






ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.

గురువుల చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.

‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.

‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.

‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.

కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ తెలంగాణా ... సమైక్యాంధ్ర ’’

రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.



‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు

కొడుకు మళ్ళీ అవే మాటలు ,ప్పాడు.

ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.

‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు

‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ;’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...

గురువులు గజగజ వణికి పోయారు.

‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.

‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.

‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.

‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.

మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.

‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.



నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.




13, నవంబర్ 2013, బుధవారం

శునక పురాణం



‘‘ ఛీ ! కుక్క వెధవా ! ’’ అని ఎవరి మీద నయినా కోపం వొచ్చి నప్పుడు తిడతాం కానీ, శునక పురాణం చదివితే శునక జాతిని అలా కించ పరుస్తూ తిట్టడం ఎంత తప్పో తెలుసు కుంటాం. మానవ జాతి చరిత్ర మనుషుల కున్నట్టే, కుక్కల చరిత్ర కుక్కలకూ ఉంటుంది.ఆ కుక్కల చరిత్ర అంతా వాటికి వన్నె తెచ్చేదే కాక పోయినా వాటికంటూ ఓ చరిత్ర ఉంది కదా. ఆ సంగతి తెలుసు కోవాలి.

శునక పురాణం అనే శీర్షికను చూసి కథా మంజరి తిక్కల బ్లాగరు అష్టాదశ పురాణాలనూ అపనిందలపాలు చెయ్య బోతున్నాడని మాత్రం అనుకో వద్దు. ఇది కేవలం శుకములను గూర్చిన గుది గుచ్చిన భోగట్టాల సమాహారం. అంతే.


కుక్కకు చాలా సర్యాయ పదాలు ఉన్నాయి. చూదాం. కుక్క. శునకము,జాగిలము, నాయి. వే(బే)పి లాంటి తెలిసిన పదాలే కాక, శ్వానము,అలిపకము,అస్తిభిక్షము,కుక్కురము ,సారమేయము

.సూచకము,జిహ్వానము,కౌలేయకము,కంకశాయము వృకరాతి ... లాంటి చాలా పదాలకు కుక్క అనే అర్ధం.దులో మరీ, అడ కుక్కకి కుక్కురి, శుని అని పేర్లున్నాయి. వేట కుక్కకయితే ఆఖేటికము,ఉడుప కుక్క,మోరపడము లాంటి పేర్లున్నాయి.కుక్క భౌ భౌ అని అరుస్తుందని మనకు తెలుసు కానీ, కుక్క అరుపును భషణము, మొఱగుడు అని కూడా అంటారు. వీటి మాట కేం గానీ, కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. చాలా జాతులు ఉన్నాయి
, దేశవాళీ కుక్కలు, విదేశీ జాతుల కుక్కలూ కూడా ఉన్నాయి. విదేశీ కుక్కలకే మన్నన ఎక్కు కదా !సౌమ్యాకారులూ, అతి భీకరాకరులూ అయిన కుక్కలూ ఉంటాయి. జాతి కుక్కలూ, వీధి కుక్కలూ. గజ్జి కుక్కలూ , పిచ్చి కుక్కలూ లాంటి శునక జాతి భేదాలూ ఉంటాయి.. పిల్లల కున్నన్ని కాక పోయినా కుక్కలకూ చాలా వరైటీ పేర్లు ఉంటాయి. అందులో టామీ అనే పేరు మన అప్పారావు అనే పేరులాగా చాలా ప్రసిద్ధం.
 కుక్కలు చాలా విశ్వాస  పాత్రమైన  జంతువులు అన్నమాట నిజమే కానీ అవి ఎంచేతనో తమ విశ్వాస గుణాన్ని కాస్సేపు ప్రక్కన పెట్టి, యజమానినే కరచిన సంఘటనలూ అక్కడక్కడ చోటు చేసుకోవడం కాదన లేని సత్యం.కారణాల కోసం పెద్దగా అన్వేషించ నక్కర లేదు. ఎంతయినా కుక్క బుద్ధి కుక్క బుద్ధే కదా ?!


మొరిగే కుక్క కరవదని ఒక సామెత. దీనికి రుజువులూ సాక్ష్యాలూ చూపడం కష్టం. మొరిగే కుక్కల దగ్గరకి వెళ్ళి కరుస్తుందో, లేదో గమనించే సాహసం చెయ్యలేం కదా,

కొన్ని కుక్కలు విస్సాకారంగా మన మీద ఓ లుక్కు వేసి ఊరుకుంటాయే కానీ మొరగవు. బోలెడు డబ్బులు పోసి పెంచు కుంటున్నా, జబ్బుల లొస్తే కుక్కల ఆసుపత్రులకు తీసికెడుతున్నా అవి మాత్రం కిమన్నాస్తిగా ఉండి పోతాయి. చిన్న గుర్రు కూడా పెట్టవు. దొంగలను చూసి మొరగని కుక్కలు అవేం కుక్కలు ? తిండి దండగ
 కాకపోతే.

వెనుకటికి వో చాకలి ఇంట ఓ కుక్కా, గాడిదా ఉండేవిట. యజమాని తనకి సరైన తిండి పెట్టకుండా. సరిగా చూడకుండా ఉన్నాడనే ఉక్రోషంతో ఓ రాత్రి చాకలి ఇంట దొంగలు పడితే మొరగ కుండా ఉండి పోయిందిట. దాంతో కుక్క చేయ వలసిన డ్యూటీ గాడిద తన నెత్తిన వేసుకుని యజమానిని నిద్ర లేపుదామని ఓండ్ర పెట్టిందిట. చాకలి నిద్రా భంగమైనందుకు కోపంతో గాడిదని చావబాదాడట. ఈ కథ వలన తెలుసుకోవలసిన నీతి మాట అటుంచితే, పెంపుడు కుక్కలకు కూడా కోపతాపాలు ఉంటాయనీ, యజమానికి అవి సర్వ కాల సర్వావస్థల లోనూ విశ్వాస పాత్రంగా ఉంటాయనీ గుడ్డిగా నమ్మడం కూడా పొరపాటే అని గమనించాలి.

కుక్కలకు ఏకైక ప్రబల శత్రువు మ్యునిసిపాలిటీ వారి కుక్కకల బండి. వీధిలో కనిపించే ప్రతి ఊర కుక్కనీ బండిలో  పడేసి పట్టుకు పోతూ ఉంటారు

గొప్పింటి వారు తమ ఇళ్ళ గేట్ల ముందు ‘‘ కుక్క లున్నవి జాగ్రత్త ’’ అని బోర్డులు  వేలాడదీస్తూ ఉంటారు.

పోస్టు జవాన్లకూ, పేపరు కుర్రాళ్ళకూ అలాంటి ఇళ్ళలో ఉండే కుక్కల వలన ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.

పోలీసు కుక్కలు ప్రత్యేక శిక్షణ  పొందిన కుక్కలు . నేర ప్రాంతాన్ని మూచూసి, వాసన పసిగట్టి నేరస్థులను పట్టు కోవడంలో ఇవి రక్షక భటులకు సహకరిస్తాయి

ఇన్ని కుక్కల గురించి చెప్పి, పాత కాలం నాటి హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ ఫోను ముందు కనిపించే కుక్క గురించి చప్పక పోతే భౌ ! భౌ ! మని కసురు కోదూ ?

మహా భారతంలో కనిపించే కుక్క పేరు సరమ. రాక్షసులనుండి తమ గోగణానికి కాపలాగా దేవేంద్రుడు సరమ అనే కుక్కను ఉంచేడు. అయితే రాక్షసులు దానికి పాలు పోసి మచ్చిక చేసుకుని గోవులను అపహరించుకు పోయే వారు. దానితో ఇంద్రుడు గోవులు ఏమౌతున్నాయని సరమను అడిగేడు. అది చెప్పడానికి భయపడి పోయింది. దానితో ఇంద్రుడు దాని డొక్కలో తంతే పాలన్నీ కక్కీసి, పారి పోయింది.ఇంద్రుడు దానిని తరుము కుంటూ హిమాలయాల వరకూ వెళ్తే అక్కడ రాక్షులు కనిపించేరు. వారిని వధించేడు. ఇదీ కథ. దీని వలన కూడా కుక్కలు మరీ అంత విశ్వాస పాత్రులైనవి కావేమో అనే సందేహం కలుగక మానదు. పైచ్చు అవి శత్రువు నుండి లంచాలు మేయడానికి కూడా సిద్ధ పడి పోతాయని అనిపిస్తోంది.

అందుకే లంచాలు మేసే వెధవలంతా కుక్కలతో సమానమని కథా మంజరి బ్లాగరు తీర్మానించు కున్నాడు.

మహా భారతంలో మరొక కుక్క ప్రస్తావన సుప్రసిద్ధమే. పరీక్షిత్తుకు పట్టం కట్టేక ధర్మరాజాదులు బొందితో కైలాసానికి బయలు దేరారు. వారిని ఓ శునకం వెంబడిస్తూ నడిచింది, మార్గ మధ్యంలో మొదట ద్రౌది, తరువాతసహ దేవుడు, నకులుడు,భీముడూ అర్జునుడూ వరసగా నేలకు కుప్పకూలి పోయేరు. ధర్మ రాజు వెను తిరిగి చూడ లేదు. వారంతా అలా పడి పోవడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఇంద్రుడు ఎదురొచ్చి తన నగరుకి రమ్మని ధర్మరాజుని ఆహ్వానించేడు. తన వెంట వస్తున్న కుక్కని విడిచి రాననీ. అది పాపమనీ ధర్మరాజు పలికేడు. అప్పుడా కుక్క తన నిజరూపు చూపి నిలిచింది. అతడే ధర్ముడు. ధర్మజుడు ధర్మ తత్పరుడు కనుక ధర్మం అతని తుదకంటా నిలిచిందని ఫలితార్థం.

కాల భైరవ స్వామి అంటే శునక రూపంగా భావించ కూడదు. కాలము అంటే నలుపు. నల్లని రూపు కలవాడు. విశ్వాసానికి పేరందిన ఒక కుక్క స్వామి వాహనం శునకం.

దత్తాత్రేయ స్వామి వారి వద్ద ఎప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలకు ప్రతీకలు. స్వామి వేద మూర్తి. స్వామి మూడు ముఖాలూ  సృష్టి, స్థితి, లయకారుల స్వరూసాలు

బళ్ళారి రాఘవ ఒకసారి గుడివాడలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నప్పుడు కాటి సీనులో ఎక్కడి నుండో ఒక కుక్క స్టేజీ మీదకు అకస్మాత్తుగా ప్రవేశించిందిట. అంతా అవాక్కయి పోయేరు. ప్రేక్షకులు గొల్లున నవ్వేరు. రాఘవ సమయస్ఫూర్తితో నాటకంలో లేని ఓ డైలాగు ... ‘‘ ఓ శునక రాజమా !నీకును నేను లోకువయిపోతినా; పొమ్ము ’’ అని దానిని అదిలించే సరికి అది అక్కడి నుండి పారి పోయిందిట. ఈ విధంగా మహా నటుడు రాఘవ ఆ నాటి నాటకం రసాభాసం కాకుండా చేసారుట.

యండమూరి వీరేంద్రనాథ్ ఏ కంగా కుక్క అనే ఓ నాటికనే రాసేడు.

రావి కొండల రావు గారి కుక్క పిల్ల దొరికింది నాటిక చాలా మందికి తెలిసిన గొప్ప హాస్య నాటిక.
కుక్కలను విశ్వాసపాత్రంగా చూపించిన రాము లాంటి తెలుగు హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి.
Ramu-poster.jpg
 అలాగే విఠలాచార్య సినిమాలలో హీరోయో, హీరోయనో అకస్మాత్తుగా కుక్కగా మారిపోయే సందర్భాలూ ఉంటాయి.
విజయా వారి పాతాళ భైరవిలో కూడా ఒక  కుక్క మనకి  గుర్తండే ఉంటుంది. ఇలా తెలుగు సాహిత్యంలో కుక్కల ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది.

Telugucinemaposter patalabhairavi 1951.JPG

కుక్కలకి ప్రాధాన్యత ఇచ్చి తీసిన ఇంగ్లీషు  సినిమాలు కొల్లలు కనిపిస్తాయి.




మరి కొన్నింటిని చూద్దాం ...


కనకపు సింహాసనమున
శునకముఁగూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !

అని. బద్దెన సుమతీ శతకంలో కుక్క బుద్ధిని ఎండ గట్టేడు. ఆ వంకతో కొందరు మనుషులు నైజాన్ని చాటి చెప్పేడన్నమాట.

కుక్కలు చెప్పులు వెతుకును అని ఊరికే మనవాళ్ళు అన లేదు కదా ? అది దాని నైజ గుణం మరి.


భర్తృహరి సుభాషిత త్రిశతిలో ఒక శ్లోకంలో కుక్కల నైజం ఇలా వర్ణించి చెప్పాడు

లాంగూల చాలన మధుశ్చరణావఘాతం
భూమౌ నిత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చభుక్తే.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం చూడండి:

వాలము ద్రిప్పు, నేలబడి వక్త్రము, కుక్షియుఁజూపు, క్రిందట
బడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్రశుం

డాలము శాలితండు లగు పిండంబుల చాటు వచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్యగుణయుక్తిఁగఁజూచు మహోన్నత స్థితిన్

దీని భావం ఏమిటంటే, కుక్క తనకి ఆహారం పవడేసే వాడి ఎదుట నానా వికారాలూ పోతుందిట. వాడి ఎదుట నిలబడి తోక ఊపుతుంది. నేల మీద దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేలను తవ్వుతుంది. కాని భద్ర గజం అలా కాదు. ఆ తినేదేదో మురిపించుకుని మురిపించుకుని మరీ తింటుంది. అదీ ధీరుల లక్షణం అంటాడు కవి.

అంతే కదా, కుక్క కుక్కే , ఏనుగు ఏనుగే. దారంట ఏనుగు పోతూ ఉంటే కుక్కలు ఊఁ... అదే పనిగా మొరుగుతాయి. వాటి వలన ఏనుగుకి వచ్చే లోటు ఏమీ ఉండబోదుకదా,

శ్రీనాథుడు ఓ చాటువులో ఇదే చెప్పాడు

సర్వఙ్ఞ నామధేయము
శర్వునికే, రావుసింగ భూపాలునికే
యుర్విం జెల్లును, తక్కొరు
సర్వఙ్ఞుండనుట కుక్క సామజ మనుటే

ఈ పద్యంలో సర్వఙ్ఞుడనే పేరు శర్వునికే తప్ప సింగభూపాలుడికి చెల్లదనే గూఢార్ధం ఉందని, రాజాగ్రహం చల్లార్చడం కోసం శర్వునికీ, రావుసింగభూసాలునికి మాత్రమే సర్వఙ్ఞుడనే పేరు తగునని కవి సమర్ధన చేసాడనీ అంటారు.

కొంతమంది డబ్బుదేం ఉంది కుక్కను తంతే రాలుతుందనడం కద్దు. నిజానిజాలు పైవాడి కెరుక. పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు ఇవ్వాలన్నది మాత్రం ఖాయం. అందు వల్ల డబ్బులు రాలడం కోసం కుక్కలను తన్నే సాహసం చెయ్య వద్దని కథామంజరి విఙ్ఞప్తి చేస్తోంది.

సరే, కుక్కల ప్రస్తావన వచ్చిన మరో పద్యం చూడండి:

నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూర పంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.

కొంత మందికి అన్నింటి లోనూ దోషమే కనబడుతుందతి కానీ ఒక్క మంచీ కనబడదని దీని సారాంశం.

వేమన కూడా

అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డ వారి నెల్ల తొలగ గొట్టు
చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ

అని చెప్ప లేదూ ? !

శునక: పుచ్ఛమివ వ్యర్ధం లుబ్ధస్య పరి జీవనం
నహి గుహ్యా గోపాయచ, నచ దంశ నివారణే

అంటే, కుక్క తోక దాని సిగ్గును అది దాచు కోడానికీ, ఈగలను తోలుకోడానికీ కూడా పనికి రాదు. అలాగే లోభి వాడి ధనం కూడా ఎందుకూ పనికి రాదు. కుక్క తోక వంకర కదా

ఇదే భావాన్ని మా అన్నగారు పంతుల గోపాల కృష్ణరావు తన కందాలూ, మకరందాలూ లో ఆట వెలదుల అనుబంధంలో ఒక ఆట వెలది పద్యంలో ఇలా చెప్పేరు:

కుక్క తోక చూడ కటిలమై యుండును
దాని శీల మదిమె దాచ లేదు
తోల లేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె.

ఎంత ఇల్లాలయినా. వొసే పెద్దమ్మా, దరిద్ర గొట్టుదానా ! అని నర్మ గర్భంగా పిలిస్తే తెలివైన ఇల్లాలు ఊరుకుంటుందా ? అంతే దీటుగా నర్మ గర్భంగా తల వాచి నోయే లాగున బదులిస్తుంది.

ఆ వైనం చిత్తగించండి ...

పర్వతశ్రేష్ఠ నుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాముఅత్తను గన్న తల్లి
పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ,
సున్నమించుక తేగదే సుందరాంగి

సుష్ఠగా భోంచేసి తాంబూలం వేసుకోవాలనుకున్నాడు భర్త. పెట్టెలో అన్నీ ఉన్నాయి కానీ సున్నం లేదు. భార్యని ఇలా ముద్దుగా కేకేసి అడిగాడు
పర్వత నాజు పుత్రిక పార్వతీ దేవి. మె భర్త శివుడు. అతని విరోధి మన్మధుడు. అతని అన్న బ్రహ్మ. అతని భార్య సరస్వతి. ఆమె అత్త లక్ష్మి మెను కన్నతల్లి గంగ. ఆమె ముద్దుల బిడ్డ పెద్దమ్మ. ఒసే దరిద్రగొట్టు పెద్దమ్మా కాస్త సున్నం తేవే అని దీనర్ధం

ఆవిడ అంతే నర్మ గర్భంగా జవాబిస్తూ సున్నం తెచ్చి మగడికి అందించింది.

శతపత్రంబుల మిత్రుని
సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్
సతతముఁదాల్చెడు నాతని
సుతువాహన ! వైరి వైరి సున్నంబిదిగో !

శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు. అతని కుమారుడు కర్ణుడు. అతడిని చంపిన వాడు అర్జునుడు. వాని బావ శ్రీకృష్ణుడు,అతని కొడుకు మన్మధుడు. అతని మామ చంద్రుడు. అతనిని తలపై ధరించే వాడు శివుడు. అతని కొడుకు వినాయకుడు. అతని వాహనం ఎలుక. దానికి విరోధి పిల్లి. దానికి వైరి కుక్క ! ఒరే కుక్క వెధవా సున్నం ఇదిగోరా అని నర్మ గర్భంగా తిట్టి పోసిందా మహా ఇల్లాలు.

శునక పురాణం గురించి చెప్పేటప్పుడు అంతరిక్ష ప్రయాణం చేసొచ్చిన లైకా అనే కుక్క పిల్లను తలచుకోవడం ఎంత అవసరమో, మన పతంజలి గారి బొబ్బిలి అనే కుక్కని గురించి తలుచుకోక పోవడం చాలా దారుణం. దానంత దండగమారి కుక్క లోకంలో మరోటి ఉండబోదు. రాజుల లోగిళ్ళలో పడి తెగ మేసిన పనికిమాలిన కుక్క అది. రాజులతో వేట కెళ్ళి ఎన్ని దొంగ వేషాలు వెయ్యాలో అన్నీ వేసిన కుక్క అది. దాని వైభోగం, దాని బుద్ధికుశలత, దాని యవ్వారం వగైరాల గురించి తెలుసు కోవాలంటే పతంజలి గారి వీర బొబ్బిలి, గోపాత్రుడు చదవాల్పిందే మరి.

ఇక, చివరగా కుక్కల మీ ఉన్న సామెత లేమిటో కొంచెం చూదాం. చాలా ఉన్నాయి లెండి.

1.కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదుకదా
2.కుక్క అతి మూత్రం,బంధువైరం లేకుంటే గంటకు ఆమడ దూరం పోనా అందిట !

కనబడిన చోటెల్లా ఆగి, కాలెత్తి ఉచ్చ పోయడం కుక్కల అలవాటు. అలాగే దారంట కనబడిన ప్రతి కుక్కతోనూ జట్టీ పెట్టు కోవడం కూడా దాని అలవాటు. ( తానొచ్చిన దారి వాసన బట్టి గుర్తుంచు కోవడం కోసం అలా చేస్తుంది) కుక్కకున్న ఈ లక్షణాలను చూసి ఈ సామెత పుట్టింది.
3.కుక్క ఉట్టెలు తెంచ గలదు కాని కుండలు పగులకుండా ఆప గలదా ?
4.కుక్క గోవు కాదు. కుందేలు పులి కాదు.
5.కుక్క కాటుకి చెప్పు దెబ్బ
6.కుక్కకు ఏం తెలుసు మొక్క జొన్నప రుచి ?
7.కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు.
8.కుక్కకు కూడా కలసి వచ్చే కాలం ఉంటుంది.
9.కుక్కకు కూడు పెడితే కుండకు ముప్పు
10.కుక్కకు జరీ కుచ్చులు కట్టినట్టు
11.కుక్కలు చింపిన విస్తరిలా ఉంది కాపురం
12. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు
13.కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.
14.కుక్క బుద్ధి దాలికుంటలో ఉనేనంతసేపే
15.కుక్క కనబడితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క కనబడదు.
16. మొరగ నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందిట.

ఇవి కాక చివరగా ఓ ఏ సర్టిఫికేటు కుక్కల సామెత కూడా ఉంది.

16. కుక్క ఎక్క లేక కాదు చచ్చేది. పీక్కో లేక !

ఇక, కుక్క బతుకు, కుక్క చావు లాంటి జాతీయాలు మనకి తెలిసినవే.


అయ్యా, ఇదీ శునక పురాణం. చెప్పుకోవాలంటే ఇంకా చేంతాడంత ఉంది.

ఇక శలవ్.












22, అక్టోబర్ 2013, మంగళవారం

విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ


విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ ఇవాళ  ( 22.10.2013 ) అంగరంగ  వైభవంగా జరుగుతోంది. ప్రతి యేటా జారిగే ఈ జాతరకు రాష్ట్రం నలు మూలల నుండీ జనం అశేషంగా తరలి వస్తారు.

ఉత్తరాంధ్ర కల్ప వల్లి పైడి తల్లి






పైడి తల్లి అమ్మ వారి గుడి.. ఇది కోటకు సమీపంలో మూడు లాంతర్ల వద్ద ఉంది.



విజ యగరం కోట


ఇదే సిరిమాను. ఈ సిరిమాను అమ్మ వారి జాతర నాడు కోట నుండి అమ్మ వారి గుడి వరకూ ముమ్మారు తిరుగుతుంది, పూసపాటి రాజ వంశీయులు, ప్రజా ప్రతినిథులు, అధికారులు, అశేష ప్రజానీకం  ఈ సిరిమానునుని దర్శించు కోడానికి తహతహలాడుతారు.



విజయ నగరం గంట స్తంభం


సిరిమానోత్సవానికి చెందిన  వీడియో ( లోగడ తీసినది) చూడండి ....


8, సెప్టెంబర్ 2013, ఆదివారం

గణపతి కథ ..


అందరకీ వినాయక చవితి శుభాకాంక్షలు ... మీ కథా మంజరి.

మిత్రుడు ఓలేటి శ్రీనివాసభాను రాసిన గణపతి స్తుతి   చదవండి .. వినండి ..

ఇలాంటి చక్కని రచనలు మరిన్ని హాయిగా చదువుకొని ఆనందించాలంటే వెంటనే  గో తెలుగు డాట్ కామ్ కి    ( go telugu.com) కి వెళ్ళండి ...


అమ్మ పార్వతి జలకమాడగానెంచి
నలుగు పిండిని తాను బొమ్మగావించి
ఊపిరులు ఊదింది .. వాకిటను నిలిపింది
శంకరుని రాక తో కథ మలుపు తిరిగింది

అప్పుడే ఎదిగిన ఆ చిన్ని తండ్రి
తన కన్న తండ్రినే ద్వారాన నిలిపి
శూలి వేటుకు నేల కూలిపోయాడు
హస్తి ముఖమున తిరిగి లేచి నిలిచాడు

గుజ్జు రూపానికి బొజ్జొకటి  తోడు
వంకగా నెలవంక నవ్వుకొన్నాడు
గిరిజ కోపించింది శశిని శపియించింది
పాము మొలతాడుగా పనికి కుదిరింది

అన్ని లోకాలనూ తిరిగి రావాలి
తొలుత వచ్చిన వాడె నేత కావాలి
అమ్మ నాన్నలను  ముమ్మార్లు చుట్టి
గణనాథుడైనాడు పేరు నిలబెట్టి

చిటిబెల్లమిస్తేను  సిరులు కురిపించు
గరిక పోచే చాలు కరుణ చూపించు
ఇల లోన తొలి  పూజ  ఇంపుగా నీకె
విఘ్నాలు తొలగించి విజయాల నీవె




3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఏం దారి దేవుడా ...



కరవ మంటే కప్పకి కోపం

విడువ మంటే పాముకి కోపం

ఏం దారి దేవుడా.



ముందుకో వెనక్కో

ఒక్క అడుగు వేద్దామంటే

ముందు నుయ్యి

వెనుక గొయ్యి

ఏం దారి దేవుడా.



అత్త గారి కోక వొసిలిందంటే

కోపం

వొసల లేదంటే కోపం

ఏం దారి దేవుడా.



గోచీకి తక్కువా

గావంచాకి ఎక్కువా

ఏం దారి దేవుడా.



పది నెలల్లో పరిష్కారం

చెయ్య గలను లెమ్మంటాడు

తాయిలం ఇస్తే కానీ

ఆ కిటుకు లేవో

చెప్పను పొమ్మంటాడు

ఏం దారి దేవుడో.


ఇదిగో వస్తోంది

అదిగో వస్తోంది

మూతుల గుడ్డలు

మూల పడెయ్యొచ్చు

మూసిన తలుపులు తెరిచెయ్యొచ్చు


ఐతే గేరంటీ  లేదుట

ఆ పైన మీ ఖర్మం


ఏం దారి దేడుడా















28, ఆగస్టు 2013, బుధవారం

చొ ... చొ ... చ్చొ ...చ్చొ చ్చొ .. అను .. ఒక రాంగ్ షో కథ !


‘‘జై సమైక్యాంధ్రా ! ’’ అంటూ రాత్రి పడుకున్న భర్త, అర్ధ రాత్రి వేళ ‘‘ జై తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ ఉలిక్కిపడి లేచాడు. ‘‘కలొచ్చిందా ?’’ అడిగింది భార్య ఆవలిస్తూ, బద్ధకంగా .. ‘‘అవునే, మన అబ్బాయి దగ్గరకి హైదరాబాద్ వెళ్ళినట్టు కలొచ్చిందే .. ’’చెప్పాడు భర్త. ‘‘చాల్లెండి సంబడం. అర్ధ రాత్రి వేళ అంకమ్మ శివాలనీ, ఏఁవిటా నినాదాలూ మీరూనూ ... కళ్ళు మూసుకుని పడుకోండి ’’అంది భార్య. ‘సరే ’అని పడుకున్నాడు భర్త. మరో గంట గడిచేక ‘‘జై రాయల తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ నిద్ర లేచి కూర్చున్నాడు, ‘‘బావుంది వరస ... ఏఁవిటా కలవరింతలు ; మరో కలేఁవైనా వొచ్చిందేఁవిటి ? ’’ అడిగింది భార్య కాస్త కోపంగా. ‘‘అవునే ఈ సారి అమ్మాయి యింటికి అనంతపురం వెళ్ళినట్టు కలొచ్చిందే ...’’ చెప్పాడు భర్త నీరసంగా. ‘‘సరి..సరి.. ఎవరైనా వింటే నవ్వి పోతారు ..ఈ గొడవలన్నీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి ... ’’అంది భార్య. కాస్త కునుకు పట్టిందో లేదో, భర్త మళ్ళీ ఏదో కలవరిస్తున్నట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చుంది భార్య. భర్త నిద్రలో ‘ చొ..చొ..చ్చొ..చ్చొ ..’ అంటూ కలవరిస్తున్నాడు. ‘‘ ఏఁవయిందండీ .. ఆ చొచ్చొచ్చో లేఁవిటి ? ’’ అనడిగింది భర్తను తట్టి లేపుతూ .. తుళ్ళి పడి లేచాడు భర్త. ముఖం పీక్కు పోయి ఉంది. దెయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. ‘‘ఈసారి పేకాట రమ్మీ ఆడుతున్నట్టుగా కలొచ్చిందే ’’అన్నాడు నీరసంగా .. ‘‘ఖర్మ ! అయితే ఏఁవిటంటా ? ’’ అడిగింది భార్య. కాస్సేపు నసిగి చెప్పాడు భర్త దిగులుగా : ‘‘రాంగ్ షో డీల్ చూపించీసినట్టు కలొచ్చిందే .. ’’ అన్నాడు. అంతే. ఆ మొగుడూ పెళ్ళాలకి మరింక నిద్ర పట్ట లేదు.

18, ఆగస్టు 2013, ఆదివారం

చాప చుట్టెయ్య కూడదూ ? !



చాప చుట్టెయ్య కూడదూ ?!

నీ అసాధ్యం కూలా !
నీ మొహం మండా ...

నువ్వూ కూర్చోవు,
నన్నూ కూర్చో నివ్వవు

మరెందుకయ్యా

చాప చుట్టెయ్య కూడదూ ; !

15, ఆగస్టు 2013, గురువారం

హే, భగవన్ !



హన్నా అయ్యారే అను నొక మహనీయుడు దేశమును రిపేరు చేయ దలచి, చాలా తీవ్రముగా ప్రయత్నించి సాధ్యము కాక ఉస్సురని ఉండి పోయెను. ఇక మానవ ప్రయత్నము వలన ఇది సాధ్యము కాదని తలచి, హిమాలయములకు పోయి ఘోరమైన తపస్సు చేసెను, అన్ సీజను కాబోలునేమో, దేవుడు త్వరగానే ప్రత్యక్ష మయ్యెను.

అయ్యారే కనుల ఆనంద బాష్పములు రాలుచుండ ‘‘ హే భగవన్ !నా జన్మ ధన్యమైనది. నాకొక్క వరము ప్రసాదింపుము ’’  అని వేడుకొనెను,

‘‘ భక్తా ! ఏమి నీ కోరిక  ’’ అని భగవంతుడడిగెను.

‘‘ మా దేశమున అవినీతిపరుల యొక్కయు, అసత్యములాడు వారి యొక్కయు తలల తక్షణమే వేయి వ్రక్క లగునట్లు వరము నిమ్ము ’’  అని అయ్యారే అడిగెను.

అది విని భగవానుడు మిక్కిలి ఖిన్నుడయ్యెను.

‘‘ నాయనా ! నీవడిగిన వరములో రెండు క్లాజులున్నవి. అవినీతి పరులను దండింప వలెనన్న చేతులు రాకున్నవి.అన్ని కోట్ల మందిని నేనే సృజించితిని. నాచేతులతో నాశనము చేయుట  ఎట్లో తెలియకున్నది.అట్లయిన ఈ జంబూ ద్వీపమున ఒకరో ఇద్దరో మాత్రమే మిగులుదురు కాబోలు. ఇక నీ వరము లోని రెండవ క్లాజు అసత్యపరులని దండించు మనుట. పొద్దున లేచినది మొదలు మీ ఖండము నంలి దురద దర్శనములందును, చిత్రికలందును ప్రతి వాడును తానే సత్యవాదినని, తాను చెప్పినదే నిజమని చెప్పు చున్పాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటిని. అందు చేత ఇవి కాక వేరొక వరము వేడి కొనుము. ప్రసాదించెదను.’’  అనెను.

ఇట్టిది కదా నా భాగ్యము అని నిట్టూర్చి, ఏమి చేయుదనని చింతించి తుదకు అయ్యారే వేరొక వరమును వేడెను.

‘‘ హే భగవన్ ! ఈ వరము తప్పక ప్రసాదింపుము. ఏమనిన, స్విస్ బ్యాంకులలో ఉన్న మా వారి నల్ల ధనమంతయు తృటి కాలములో మా దేశ ఖజానాలో పడునట్లు చేయుము. దానితో మా దేశ ప్రజల దరిద్రము తీరి పోయి నీతి నియమములతో, ప్రశాంతముగా బ్రతికెదరు ’’  అని కనులు మూసుకుని వేడుకొనెను.

భగవంతుడు ‘‘ తథాస్తు ! ’’ అని పలికి వరము నిచ్చి అంతర్ధానమొందెను.

అయ్యారే కనులు తెరచి చూచెను. దేవుడు కనిపించ లేదు. అంతియ కాదు. దేశ ఖజానా కూడా ఖాళీగా ఉన్నది.
 దేవుడు తనని మోసగించెనని   అయ్యారే  భావించి,  ఆగ్రహంచెను. తిరిగి ఘోరమయిన తపము  చేయ బోయెను.
,
మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమయ్యెను.

‘‘ నాయనా ! తిరిగి ఏవరము కోరి తపము చేయు చున్నావు  అను క్షణము నన్నిట్లు డిస్టర్బు చేయుట నీకు తగునా ? !  ? ’’  అని అడిగెను.

అయ్యారే కోపము దిగమ్రింగుకొని, ‘‘ దేవా ! నన్ను వంచించితివి. నల్లధనమంతయు దేశ ఖజానాలోకి వచ్చు నట్లు చేసెద నంటివి, కనులు తెరచి చూచు నంతలో మాయమైతివి. ఖజానా ఖాళీగా ఉన్నది, ’’ అనెను,

అందుకు దేవుడు నవ్వి ఇట్లనెను. ‘‘ నాయనా ! నీవెంత అమాయకుడవు ? నేను వరమ నిచ్చుట జరిగినది. మీ దేశ ఖజానా ఇబ్బడి ముబ్బిడిగా నిండుట కూడా జరిగినది.’’

మరి ... అడిగేడు అయ్యారే, సందేహంగా ..

‘‘ నీవు కనులు మూసి తెరచు నంత లోన మీ నాయకుల్దానిని క్షణకాలములో హోంఫట్ ! చేసినారు. నేనేమి చేయుదును ?   నల్లధనమును రప్పించమనియే వరమడిగితివి. మీవాండ్లు దానిని వెంటనే చప్పరించి వేసినచో నేనేమి చేయుదును ? ఈ పాటికి అదంతయు వారలకు  అరగి పోయే యుండును ... అదిగో ! ఆవురావురుమను గావు కేకలు నీ చెవిని బడుట లేదా ?’’  అని దేవుడు తన నిస్సహాయతను వెల్లడించెను.

ఫలశృతి :  దేవుని నిస్సహాయత అను నామాంతరము గల  హే, భగవన్ ! అను ఈ కథను చదివిన వారికి ఉన్న రోగములు అధికమగునేమో కానీ కొత్త రోగములు రావు. కుటుంబ నియంత్రణ వలన ఒక్క పుత్రుడు ఉదయించిన ఉదయించ వచ్చును. ఈతి బాధలు తగ్గక పోయిననూ వాటికి అలవాటు పడి పోయెదరు.మీ వంశమున వంద తరముల వారికి సరి పోవునట్లుగా  ధన కనక వస్తు వాహన సౌభాగ్యములు అక్రమ మార్గమున యత్నించిన దక్క వచ్చును. కానీ ముందుగా చర్లపల్లి జైలులోను , మరియు తీహార్ జైలులోనూ వేకెన్సీ పొజిషను వాకబు చేయ వలెను.

స్వస్తి.








14, ఆగస్టు 2013, బుధవారం

మా ముద్దుల ముసిలోడా ...



విజయ నగరం పెద్దలందరూ కలిసి ‘‘ మూడు యాభైల మన గురజాడ ’’ కార్యక్రమాన్ని జరిపించాలని తలపెట్టి, 2011 సెప్టెంబరు 21 నాడు శ్రీకారం చుట్టేరు. సాలు పొడుగునా వేడుకలూ సభలూ రాజాంలో జరిగేయి. తరవాత్తరువాత, 2012 సె్టంబరు 19, 20 తేదీలలో ముగింపు సభలు ఘనంగా నిర్వహించుకొన్నారు.

తర్వాత, విశాఖ పట్నం కళాభారతి ఆడిటోరియంలో కన్యాశుల్కం

యథాతధ పూర్తి నిడివి ప్రదర్శన జరిగింది. దానితో ఆ సంబరాలు ముగిసాయి.

సరే, ఆ సందర్భానికి కొనసాగింపుగా వెలుగు మిత్రులంతా కలిసి ‘‘మూడు యాభయిల మన గురజాడ’’ అనే 400 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు.ఇందులో ప్రముఖులు గురజాడ గురించి రాసిన 50 వ్యాసాలున్నాయి. శిసాగర్, సీరపాణి, రజనిలు రాసిన మూడు కవితలూ,ఆయా సభలకు చెందిన ఫొటోలూ ఉన్నాయి.

‘‘మూడు యాభయిల మన గురజాడ’’ పుస్తకాన్ని ప్రచురించి న వెలుగు మిత్రులు  గురజాడకి అంకితం చేస్తూ రాసిన గేయం ఇది ...

ఇక చదవండి ....

మా ముద్దుల ముసిలోడా


ఇప్పుడంటే మురిగ్గుంటై
డెంగూ ఫీవరుగా
వూరిని ఝడిపిస్తోంది గానీ
మా అయ్య కోనేరు



ఆరడుగుల లోతుల్లోకి
విసిరేసిన అణాకాసుని
నీటి మడుగున చందమామగా చెరిపించేది

కారణాలడక్కూడదు.
‘‘ వీడికి వెఱ్ఱికాబోలు’’ అనుకుంటారు,

కడుపికింత తిండి పెట్ట లేక పోయినా
అడుక్కున్నోడికి సైతం
చేతికి సెల్ ఫోనిచ్చాం
ఇదీ అడుగు నుండి మా అభివృద్ధి
కడుపుమండా ఏలుబడి అలా సాగుతోంది
నిలుచున్న చోటే దిక్కులు వెతుక్కుంటూ
చట్ట సభల్లో పొక్కుల చిక్కుకుంటూ

ఎవడితరం పులి మీద సవారీ !’’
అదీ మా ప్రయోజకత్వం
సిగ్గిడిసి అడిగేస్తున్నా
మైడియర్ ఓల్డు అప్పారావు
అన్నావన్నావు

‘‘ మంచి గతమున కొంచెమునోయి’’
మేమేమో గతం గొప్పలే
దుదదపత్తింగా గోక్కుంటున్నాం
అందని ఎత్తులో నిలిచిన నీ మనసు
‘‘పట్టుబడాలని నిదానిస్తున్నాం.’’
‘‘ మందగించక ముందు అడుగేయి’’
కదా నువ్వన్నది

‘‘ చిత్రం చిత్రం మహా చిత్రం’’
ఎన్నిమార్లు కన్నిమార్లు
నిన్ను చూస్తున్న కొద్దీ
కొత్త చిగుర్లేసి నిగారిస్తుంటావు

‘‘ వీర్య మెరుగక విద్య నేర్వక’’
కూడా అన్నావు కదా !

అమ్మ ముసిలోడా



అయితే ఇక చూడు మా తడాఖా
‘‘ అరె ఝాఁ , ఝాఁఝటక్ .. ఫటక్ ...’’
అదుగో నవ్వుతున్నావు
‘‘మనవాళ్ళు వొట్టి వెధవాయిలోయ్’’

నీ నోట్లో నోరెట్టలేం తండ్రీ

నీకో నమస్కారం

అందుకే నీకోసం ఈ పుస్తకం ...



---- వెలుగు మిత్రులం.




10, ఆగస్టు 2013, శనివారం

భలే వాడి వయ్యా !



పారావారము నందు న
నారని పెను చిచ్చు వోలె హాలాహలమే
పారఁగ నద్దానిని మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై



భావం : పాల సముద్రంలో మహా అగ్ని లాగున విషం పుట్టింది. అది ఎంతకీ ఆరేది కాదు. లోకాలను కాపాడడం కోసం శివుడు దానిని మనసారా మ్రింగాడు.

పరమేశ్వరుడు లోకసంరక్షణార్థం   మద్యం పుచ్చు కొన్నాడని సమస్య. దానిని  అవధాని గారు  మనసారా అనే విరుపుతో చక్కగా పూర్తి చేసాడు.
అమృతం కోసం దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధించారు. వాసుకిని తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. పాల కడలిని చిలకడం మొదలు పెట్టారు. అందు లోనుండి కామ ధేనువు, కల్ప వృక్షమూ, ఐరావతమూ, శ్రీమహా లక్ష్మీ, కౌస్తుభమూ, అప్సరోంగనలూ వెలువడ్డారు. చివరగా కాలకూటం వెలువడింది. దానిని ఏం చేయాలో దేవ దానవులకు తెలిసింది కాదు. చివరకు ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్ధించారు. లోక రక్షణ కోసం  శివుడు దానికి సిద్ధ పడ్డాడు.

ఆ సందర్భంలో పోతన గారు చాలా గొప్ప పద్యాలు రాసారు. వాటిని కూడా ఒకింత గుర్తు చేసు కుందాం. మంచి కవిత్వాన్ని మననం చేసు కోడానికి ముహూర్తం అక్కర లేదు కదా.
కంటే జగముల దు:ఖము
వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ
శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది.
పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.
శుకుడు అందుకే అంటాడు :
మ్రింగెడు వాడు విభుండని
మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ,
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా.
పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ...

కదలం బారవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు,నేత్రంబులు నెఱ్ఱగావు, నిజజూటార్ధేందుఁడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో, డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో, భక్షింపుచో, మ్రింగుచోన్.
పరమ శివుడు హాలాహలాన్ని రారమ్మని కవ్వించి పిలిచాడు. తనూ ఓ అడుగు ముందుకు వేసి సమీపించేడు. ఆ విషాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసాడు.కిందకి లాగాడు. నోట పెట్టుకుని మ్రింగాడు.
అలా శివుడు విషాన్ని భక్షిస్తూ ఉంటే, వొంటి మీద హారాలలా వేలాడుతున్న పాములు బెదరడం లేదు. కదలడం లేదు. ఆ మహా తాపానికి పరమ శివుని ఒంటి మీద ఒక్క చుక్క చెమట పుట్టడం లేదు. కనులు ఎఱ్ఱ బడడం లేదు. జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ వేడిమికి కంది పోలేదు. శివుని పద్మంలాంటి ముఖం వాడి పోలేదు.,
భలే వాడివయ్యా, భోలా శంకరా !