13, జనవరి 2015, మంగళవారం

కోదండ రామయ్యా ! కోతుల రాజ్యాన్ని చక్క దిద్దగా రావయ్యా !

కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటే, చూడవోయ్, బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామని, చూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతే, మరేమిటి చెప్పండి ? మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూ, అభినయ విశేషాలూ, సంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటే, మా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు. అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితే, సమయం వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు. కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో దిట్టలు. అర చేతిలో వైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీ, వీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేక, ప్రతి ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడక, నడత, మాట తీరు, ప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాం, మనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం. కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్ బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనతం విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటే, ఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదం, అధికారం, తెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరి, ఒకే చోట ఈ నాలుగూ కూడితే, చెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలి, దాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?
స్వస్తి.

12, జనవరి 2015, సోమవారం

కవి గారి రీజనింగు !


మన కవులు వాడే కవి సమయాలు బోలెడు.
స్త్రీలను వర్ణించేటప్పుడు ... అందమైన ముఖాన్ని చంద మామతోనూ, అరవిందం తోనూ పోలిక తెస్తారు.
వారి కురులు మేఘ మాలికలు
నేత్రాలు బేడిస చేపలు. చూపులు తూపులు. కనుబొమలు ధనుస్సులు . నడుము ఆకాశం. దంతాలు తారకలు. తొడలు అరటి బోదెలు. పాలిండ్లు పూర్ణ కుంభాలు. వేణి ఫణి. అధరాలు మధుశాలలు. పెదవులు దొండ పండ్లు. నాసిక సంపెంగ. ఇలా చాలా ఉన్నాయి లెండి. అంగాంగాలకూ ఎవరికి తోచిన పోలికలు వారు చెబుతారు.

ఆ సంగతి అలా ఉంచితే మనం కూడా నిత్య వ్యవహారంలో చాలా పోలికలను వింటూ ఉంటాం.
పొడుగ్గా ఉండే వారిని గెడ కర్రలా ఉన్నాడంటారు. తెలివి హీనుడిని మొద్దు రాచ్చిప్ప అంటారు. లంచాలడిగే వారిని జెలగలంటారు. కష్టపడి పని చేస్తే గాడిద చాకిరీ అంటారు. కష్టాలను కొండలంటారు. నీచులను పాములంటారు.
చక్కని జంటను రతీ మన్మథులంటారు. ముసలి ముత్తయిదవుల జంటను పార్వతీ పరమేశ్వరులాంటారు.
అతి వాగుడిని సుత్తి దెబ్బలంటారు. అందమైన భార్యకు అందవిహీనుడయిన భర్తను చూసి, కాకి ముక్కుకి దొండ పండు అంటూ ఎద్దేవా చేస్తారు. నచ్చని తిను బండారాన్ని ఒట్టి గడ్డి అంటారు. నాయకుల దృష్టిలో జనాలు గొర్రెలు.
చదువూ సంధ్యా లేని వారు అడ్డ గాడిదలు. గయ్యాళి పెళ్ళాలు చుప్పనాతి శూర్పణఖలు. చలి పులిలా మీద పడుతోందంటారు. ధారాపాత వర్షాన్ని కుంభపోత అంటారు. కదలని ఫైళ్ళవి నత్త నడకలంటారు. కొందరు ఆఫీసర్లని అగ్గి రాఁవుళ్ళంటారు అబద్ధాలాడే వారిని అబద్ధాల పుట్ట అంటారు. దీర్ఘ కోపిది పాము పగ అంటారు. పేరు గొప్పా ఊరు దిబ్బా అయితే నేతి బీర కాయ చందం అంటారు. ఎప్పుడూ తన లోకం తనదేలా ఉండే వాడిని నూతి లోని కప్ప అంటారు. నిరక్షర కుక్షిని పశువంటారు. వాచాలుని వస పిట్టతో పోలుస్తారు. మౌనంగా ఉండే వాడిని ముని అనో, ముంగి ముషాణమనో అంటారు.

ఇలా చెబుతూ పోతే, చాలా ఉంటుంది. చెప్పడానికి చేంతాడంత !

ఇంత వరకూ రాసిన టపాని ఎప్పటి లాగే నా వెనుక వంగుని చూస్తున్న మా తింగరి బుచ్చి‘ బాగుందిరా ! ’అని మెచ్చుకున్నాడు. మా యింట కాఫీ టిపిన్లు సేవించి కబుర్లు చెప్పే వాడి నోట మొదటి సారి మెచ్చుకోలు మాట విని నేను ఆనంద పరవశుడి నయ్యాను. ఇంత లోనే,‘‘ అవును ! మన వాళ్ళు భలే పోలికలు తెస్తార్లే. కవులను ఎద్దులతో పోలుస్తారు కదా ! ’’ అని తనవిఙ్ఞాన భాండారంలో నుండి ఒక అమూల్యమైన విషయాన్ని ప్రస్తావించేడు. నా తల తిరిగి పోయింది.

‘‘ ఏఁవిటీ, కవులను ఎద్దులంటారా! ’’ అన్నాను, కంగారుగా.

‘‘ మరే, కవి వృషభులనే మాట నువ్వు విన లేదా ! ’’ అని నా తెలివి తక్కువ తనం మీద జాలి చూపించాడు.

కథా మంజిరి (ఏకైక నస బ్లాగు) బ్లాగుని మూసెయ్యా లన్నంత విరక్తి కలిగింది నాకు !

మా తింగరి బుచ్చి గాడి గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ, ఒక కవి గారు ఒక శ్లోకంలో ఎలాంటి రీజనింగు తీసారో చూడండి:

మనం లోకంలో మంచి వారి మనసు వెన్నతో సమానం అంటూ ఉంటాం కదూ. ఆ కవి కాదు పొమ్మంటున్నాడు.

కవి గారి రీజనింగు ఏమిటో మీరే చూడండి:


సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయ స్తదళీకమ్.

దీని అర్ధం : మంచి వారి మనస్సు వెన్న లాంటిదని కవులు చెబుతూ ఉంటారు. ఆ మాట అబద్ధం !
ఎందు కంటే, ఇతరుల మనో దుఃఖానికి మంచి వారి మనసు కరిగి పోతుంది. కానీ, కానీ, వెన్న ఇతరుల దు:ఖానికికరుగదు. వేడి తగిలితేనే కాని కరుగదు  కదా !

ఈ రీజనింగు చూసి ఈ కవి గారు మా తింగరి బుచ్చికి తమ్ముడనుకునేరు ! కాదు సుమా !

ఇది వినోక్త్యలంకార భేద మనుకుంటాను.



10, జనవరి 2015, శనివారం

అంతా బూతేనా ?( పెద్దలకి మాత్రమే ..కాదు)



కవి చౌడప్ప పేరెత్తితే చాలును, థూ ... అంతా బూతు ! అనెయ్యడం తెలిసిన విషయమే.
చౌడప్ప నిజంగా అన్నీ బూతు పద్యాలే రాసాడా ? కాదనే చెప్పాలి. అందుకే మన సాహిత్య కారులు కవుల చరిత్రలు రాస్తూ కవి చౌడప్పకు సముచిత స్థానమే ఇచ్చారు.
కంద పద్యాలలో రచించాడు కవి తన చౌడప్ప శతకాన్ని. కవికి తనలా వేరొకరు కంద పద్యాలను రాయ లేరనే ఆత్మ ప్రత్యయం ఎక్కువ. అందుకే ఎంత థీమాగా చెప్పాడో చూడండి:
ముందుగ చను దినములలో
కందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందరు నను ఘనుడందురు
కందమునకు కుందవరపు కవి చౌడప్పా.
భావం : పూర్వం రోజులలో కందపద్య రచనకు తిక్కన గారిది అందె వేసిన చేయి అంటారు. ఇవాళ నన్ను కంద పద్య రచనలో ఘనుడినని అంటారు.
కందము నీవలె జెప్పే
యందము మరిగాన మెవరియందున గని సం
క్రందన యసదృశనూతన
కందర్పా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీలా ఇంత అందంగా కందం చెప్పడం మరెవరికీ చాతకాదయ్యా ! నువ్వు ఇంద్రునితో సమానమైన నూతన మన్మథుడివి సుమీ ! అని కవి తన గురించీ, తన కంద పద్యం గురించీ చెప్పాడు.
కందముల ప్రాసగణయతు
లందముగా కవిత నెందరల్లరు విను నీ
కందంబులు రససన్మా
నందంబులు కుందవరపు కవిచౌడప్పా.
భావం: గణాలూ, యతులూ ,ప్రాసలూ కుదిరేలా చూసుకుని ఎందరు కంద పద్యాలను అల్ల లేదు ?
కాని, నీ కందాలు మాత్రం మహా రుచికరంగా భేషుగ్గా ఉంటాయి సుమీ !
నా నీతి వినని వానిని
భానుని కిరణములు మీద బారని వానిన్
వానను తడియని వానిని
గాననురా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఈ కవికి ఎంత ఆత్మవిశ్వాసం అంటే, తను చెప్పే నీతులు వినని వాడూ, ఎండ వేడిమి తగలని వాడూ, వానలో తడవని వాడూ ఎవడూ ఉండడు. అలాంటి వాడిని తను చూడ లేదుట !
తెలుగులో పచ్చి బూతు కవిగా ముద్ర పడి పోయిన చౌడప్ప బూతులూ, అశ్లీల శృంగారం పెచ్చు మీరిన పద్యాలు రాయక పోలేదు. అయితే రాసిన వన్నీ బూతులే కావు. చక్కని నీతి పద్యాలూ మిక్కుటంగానే ఉన్నాయి.
హాస్యం కోసం బూతాడక తీరదనుకునే రోజుల వాడు మన కవి.
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీతులు చెప్పడానికేం ! ఓ ! చాలా ఉన్నాయి. కానీ కొంచెమయినా బూతు మాటలు పలుకక పోతేనవ్వు పుడుతుందిటయ్యా ? రాజులను నవ్వించాలి కదా ! నీతులు, బూతులు రెండూ సమానమైన లోకఖ్యాతికరాలే కదా !
పది నీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గు పద్యము సభలన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుందవరపు కవిచౌడప్పా.
భావం: పది నీతులు, పది బూతులు , పది శృంగార పద్యాలు సభలో చదివిన వాడే గొప్పవాడు కదా.!
ఛీ ! బూతు ! అంటూ ముఖం వికారంగా పెట్టే వాళ్ళకి కవి ఓ గట్టి చురకే వేసాడండోయ్ !
బూతని నగుదురు గడు తమ
తాతలు ముత్తాత మొదలు తరముల వా
రే తీరున జన్మించిరొ !
ఖ్యాతిగ మరి కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఛీ ! పచ్చి బూతు ! అన్న వాళ్ళే ఆ బూతుని నవ్వుతూ వింటారు. వాళ్ళ తాతముత్తాతలు బూతు లోంచి కాక పోతే మరెలా పుట్టుకొచ్చారు ?
జానపదులలో విస్తారంగానూ, నాగరికులలో రవంత అరుదుగానూ వినిపిస్తూ, నిఘంటువులలో ఎక్కడో మారుమూల బిక్కు బిక్కుంటూ ఉండే బూతు మాటలను ఈ కవి నిర్భీతిగా, ఏ మొఖమాటాలకీ తావు లేకుండా, గుట్టూ మట్టూ లేకుండా చాలా పద్యాలలో వాడిన మాట నిజమే అయినా, చౌడప్ప వన్నీ బూతు పద్యాలే కావు. చక్కని కందాలూ, ఎంచక్కని వృత్త పద్యాలూ చాలా ఉన్నాయి.
నీచులనూ, నీతి బాహ్యులనూ, మేక వన్నె పులలనూ, కుహనా మేథావులనూ, ఈ కవి ఏ శషభిషలూ లేకుండా జలకడిగి పారేస్తాడు.
చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: కవిత్వాన్ని చదవాలి. చక్కగా ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ హేళన చెయ్య కూడదు. అవమానించ కూడదు. అలా చేసే వాడు తుంటరి గాడిద !
ఇయ్యా యిప్పించ గల
యయ్యలకే గాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా మీసము
కయ్యానకు కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఇచ్చే వాడికీ, ఇప్పించగల వాడికీ మీసాలు ఉండాలి. కానీ మిగతా పనిమాలిన వెథవలందరికీ మీసాలెందుకూ దండగ ! రొయ్యకు బారెడు మీసం ఉంటుంది ! ఎందుకూ !
మునుపాడి వెనుక లేదను
పెను గొంటె గులాము నోరు పీతిరి గుంటే
యనిఘనుడు సత్య వాక్యమె
గన వలెరా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ముందు ఇస్తానని మాట యిచ్చి , తరువాత లేదు పొమ్మంటాడే, వాడి నోరు అశుద్ధం గొయ్యితో సమానం ! ఈ మాటలు పూర్తిగా నిజం.
పెద్దన వలె కృతి చెప్పిన
పెద్దన వలె ; నల్ప కవిని పెద్దన వలెనా ?
ఎద్దన వలె, మొద్దన వలె
గ్రద్దన వలె కుందవరపు కవిచౌడప్పా.
భావం: అల్లసాని పెద్దన లాగా కవిత్వం చెప్పిన కవినే పెద్ద అనాలి కానీ, తక్కిన పనికి మాలిన కవులని అందరినీ పెద్ద అనాలా ? ఎద్దనాలి. మొద్దనాలి. గ్రద్ద అనాలి.
కీలెరిగి వాత పెట్టడ మంటే ఇదే కాబోలు.
తులసీదళముల హరిపద
జలజంబుల పూజసేయు సరసుల యమ దూ
తలుజూచిఏమి చేయం
గలరప్పా కుందవరపు కవిచౌడప్పా.
భావం: హరి పాద పద్మాలకు తులసీ దళాలతో పూజ చేసే వాడిని యమ దూతలు కూడా ఏమీ చెయ్య లేరు !
పరవిత్తము గోమాంసము
పరసతి తన తల్లి యనుచు భావించిన యా
నరుడు నరుండా రెండవ
కరిరవదుడె కుందవరపు కవిచౌడప్పా.
భావం: పరుల సొమ్ము గోమాంసంతో సమానంగానూ, పరుల భార్యలను తల్లితో సమానంగానూ ఎవడయితే చూస్తాడో, వాడు అపర నారాయణుడే !
వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
కానలు పస కుందవరపు కవిచౌడప్పా.
భావం: పంటలకు వానలే పస. సానపట్టడం వల్ల వజ్రాలు కాంతితో మెరుస్తూ ఉంటాయి. యుద్ధాలకి సేనలు తగిన బలం. జంతువులకు క్షేమకరమయిన తావులు అడవులే.
పులి నాకి విడుచు దైవము
గల వానికి దైవ బలము గలుగని వేళం
గలహించి గొఱ్ఱె కరచును
కలియుగము కుందవరపు కవిచౌడప్పా.
భావం: దేవుని దయ ఉంటే, పులి కూడా వాడిని ఏమీ చేయదు. అలా తడిమి వదిలేస్తుంది. దైవ బలం లేక పోతే, గొఱ్ఱె కూడా కరుస్తుంది ! కలి కాలపు వింత అంటే ఇదే !
పాండవు లిడుమల బడరే
మాండవ్యుడు కొరత బడడె మహి ప్రాకృత మె
వ్వండోపు మీరి చనగ న
ఖండిత యశ కుందవరపు కవిచౌడప్పా.
భావం: చేసుకున్న వాళ్ళకి చేసుకొన్నంత ! పాండవులు ఎన్న కష్టాలు అనుభవించ లేదు ? మాండవ్య ముని కొరత పడ లేదూ ! పూర్వ జన్మలో చేసిన పాపాలు తప్పించు కోవడం ఎవరి తరమూ కాదు.
ఆడిన మాటను తప్పిన
గాడిద కొడకంచు తిట్టగావిని మదిలో
వీడా ! నా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఆడిన మాటను తప్పిన వాడిని గాడిదా ! అని తిడితే వీడా నా కొక కొడుకు ! అని గాడిద కూడా ఏడిచిందిట !
మూలిక క్రియ కొదిగినదే
నాలుక సత్యంబు గలదె నడిపిన వాడే
యేలిక వరమిచ్చినదే
కాళికరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: మందుకు పనికొచ్చేదే మూలిక. సత్యం పలికేదే నాలుక. చక్కగా పాలించే వాడే ఏలిక. వరమిచ్చేదే దేవత !
కుటుంబ వ్యవస్థ పట్ల కవి చౌడప్పకి ఎంత గౌరవమో చూడండి:
తన సతి యిడగా మనుమలు
తనయులు తలిదండ్రులన్న దమ్ముల్ బంధుల్
దినదినములు భుజియించుట
ఘనవిభవము కుందవరపు కవిచౌడప్పా.
భావం: భార్య వడ్డిస్తూ ఉంటే, మనుమలు, తల్లిదండ్రులూ, అన్నదమ్ములు, బంధువులూ అందరూ కలిసి రోజూ భోజనం చెయ్యడం ఎంత వైభవంగా ఉంటుందో కదా ! ( ఈ రోజుల్లో ఇలాంటి సీను ఎక్కడో తప్ప, కనబడి ఛస్తుందా, ఏమన్నానా ?)
సరసము చతురోపాయము
హరి భక్తియు శాంత గుణము నర్థుల పట్లన్
పరమౌ చుపకారము విను
కరుణాకర కుందవరపు కవిచౌడప్పా.
భావం: సరసం, చతురోపాయం, హరి భక్తి, శాంత గుణం, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి.
సీమ దయా పరుడేలిన
క్షేమంబగు దోసకారి సీమేలినచో
క్షామంబగు నతడేలే
గ్రామంబున కుందవరపు కవిచౌడప్పా.
భావం: దయాపరుడైన వాడు నేలను పరిపాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. దుర్మార్గుడు పాలిస్తే అంతటా కరువే . ( ప్రభువుల వారలూ, చిత్తగించారా ?)
చౌడప్ప కవి వర్గ దృక్పథం ఎలాంటిదంటే,
ఎన్నగల యడవి మృగముల
కన్నీరేమైన వేటగానికి ముద్దా ?
నన్నాపు దొరకు బీదల
కన్నీరును కుందవరపు కవిచౌడప్పా.
భావం: వేట గాడికి అడివి జంతువు కన్నీళ్ళు ముద్దా యేమిటి ? వాటికతడు కరిగి పోతాడా ? అలాగే దోచు కునే దొరకు పేదవారి కన్నీళ్ళు ముద్దొస్తాయా ?
చౌడప్ప వృత్త పద్యాలలో మచ్చు కొకటి చూడండి:
ఆసలజేరి దుర్గుణ గణాఢ్యుని దాత వటంచు వేడినన్
మీసము దువ్వుచున్ దిశల మీదన చూచుచు దుర్మథాంథుడై
మీసము నియ్య లేని నలు విత్త గులాము కీర్తి చేరునా ?
భూసుర వర్య కుందవర భూషణ చౌడ కవీశ్వరోత్తమా !
భావం: దుర్మార్గుడిని మన ఆశ కొద్దీ దాతవు అని వేడుకొంటే యేమవుతుంది ? మీసాలు మెలి త్రిప్పుతాడు. పైకీ కిందకీ చూస్తాడు. వీసం కూడా ఇవ్వడు. ఆ వెధవకి ఏం కీర్తి వస్తుంది చెప్పండి 
కావాలనే చాలా బూతు పద్యాలు చెప్పాడు. అలాగే చాలా నీతులూ చెప్పాడు. ఆ సంగతి కవి ఇలా స్పష్టం చేస్తున్నాడు:
బూతులు కొన్నిట కొన్నిట
నీతులు చెప్పితి బుధులు నీతులబూతుల్
బూతుల మెచ్చందగు నతి
కౌతుక మతి కుందవరపు కవిచౌడప్పా.
భావం: నా పద్యాలలో కొన్నింట నీతులు చెప్పాను. అలాగే, కొన్నింట బూతులూ చెప్పాను. తెలివైన వాళ్ళు నేను చెప్పిన నీతులతో పాటు ఆ బూతులనీ మెచ్చు కోవాలి సుమా !
చౌడప్ప కవి దెబ్బ ఎలాంటిదంటే ....
కాకులు వేవేలొక్క తు
పాకి రవము విన్న నులికి పడవా మరి ! నా
ఢాకకు తగు నాలాగే
కాకవులును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఒక్క తుపాకి చప్పుడు వినగానే వేల కొద్దీ కాకులయినా సరే తుర్రుమంటూ ఎగిరి పోతాయ్ ! కదా ! అలాగే, కువులు కూడా నా దెబ్బకు అదిరి పోవలసినదే !
ఏం పెంకెతనం !
ఈ టపా రాసి post చెయ్య బోతూ ఉంటే వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. వస్తూనే వంటింటి వాసలనలని పసి కట్టేసి, ఇవాళ టిపిను పెసరట్లలా ఉందే ! అని సంతోషంగా నవ్వీసి , నేను రాసినదంతా చదివేడు.
‘‘ ఛ ! నువ్వు కూడా ఇంత దిగజారి పోతా వనుకో లేదు. నీ దిక్కుమాలిన కథా మంజరి బ్లాగులో ఇంత కాలం ఏవో పద్యాలూ, శ్లోకాలూ పెడుతూ నీ చేతి దురద తీర్చు కుంటున్నావంటే పోనీ లెమ్మను కున్నాను.. చివరకి ఈ అప్ప కవిగాడి పద్యాలు పెట్టే స్థితికి వచ్చేవన్నమాట !’’
అంటూ ఘాటుగా విమర్శించాడు. నేను కొయ్యబారి పోయేను.
వాళ్ళక్కయ్య ( సొంత సోదరి కాదు లెండి. వరసకి అక్కయ్య. అదీ వాడు కలుపుకొన్న వరసే)
పెసరట్టూ, ఉప్మా టిఫిను పెట్టి, కమ్మని కాఫీ ఇస్తే తాగి నిమ్మళించేడు.
అప్పుడన్నాడు: ‘‘ హు ! నీ ఏడుపేదో నువ్వు ఏడువ్. నాకెందుకు గానీ, ఆ అప్ప కవిగాడి మిగతా బూతు  పద్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయ్ ?!’’ అన్నాడు సూటిగా.
ఈ మారు నిఝంగానే ( ఒక మేజా బల్ల చేయించు కోడానికి సరిపడేటంతగా ) కొయ్యబారి పోయేను.

8, జనవరి 2015, గురువారం

చిన్నప్పటి నుండి వాడు తేడాయే !

ఒక చక్కని దత్త పది ...




పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం.
ఈ చక్కని దత్తపది చూడండి ... 

  పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నేయిలను గల్గ దిట్టియహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !


భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)
వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.
ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.
వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.
ఇక భారత యుద్ధం తప్పదు !

వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :
రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను   కననే ? మూర్ఖత వానిని  ఊనెను

కనన్, ఏ + ఇలన్   =  ఏ లోకంలో నయినా ఉందా ?
వానిన్ + ఊనెన్.    =  వానిని మూర్ఖత్వం  పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
వాడసలు చన్నప్పటి నుండీ తేడాయే!