తీపి గుర్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తీపి గుర్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఆట పాటల మేటి


ఆట పాటల మేటి, హరి కథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు విజయ నగర ప్రభువులు ఇచ్చిన ఒక సమస్యను ఈ విధంగా పూరించారు. చూడండి:

సానుల యొద్ద నిచ్చకము సల్పుచు లొంగుచునుంట కర్షమౌ
దానము సేయ కుంటకు వృధా దినముల్సరి పుచ్చుకుంటకున్
ఙ్ఞానియు జాణయైన తన నాథుని గన్గొను నప్డు కు
న్మానము ప్రేమ లజ్జయును మాటికి బోరగ బ్రీతి మీరెడున్.

నారాయణ దాసు గారి గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

దాసు గారి జీవిత చరిత్ర నా యెరుక చదవడం ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది.
హరి కథనే కాదు, అవసర పడితే గిరి కథ కూడ చెప్పటల దిట్ట దాసు గారు.

దాసు గారు గజ్జె కట్టి, విజయ నగరంలో గుమ్చీ అరుగు మీద, మూడు కోవెళ్ళ దగ్గర గొంతెత్తి
శంభో నినాదం చేసారంటే, మైకులు లేని ఆ రోజులలో ఊరు ఊరంతా మారు మ్రోగి పోయేదని చెబుతారు.

నేను తెలుగు పండితునిగా నియామకపు ఉత్తర్వులు అందుకుని తొలి సారిగా ఉద్యోగ జీవితంలో నిడగల్లు అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాయనయ్యాను. ఆ ఊరు మా స్వగ్రామం పార్వతీ పురానికి కేవలం 8 కి,మీ. దూరంలో ఉంది. బస్సు దిగేక 4 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ఇప్పుడు బస్సు సౌకర్యం వచ్చిందనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, ఆ నిడగల్లు గ్రామానికి దాసు గారు జన్మించిన అజ్జాడ అగ్రహారం చాలా దగ్గర. దాసు గారి జన్మస్థలాన్ని ఒకటికి రెండు సార్లు దర్శించుకునే అదృష్టం నాకు లభించింది. అంతే కాదు, విజయనగరంలో
ఐదేళ్ళ పాటు మహా రాజా ప్రభుత్వ సంస్కృత కలాశాలలో చదువుకునే రోజులలో నిత్యం దాసు గారి దివ్య గళంతో పునీతమైన గుమ్చీని, మూడు కోవెళ్ళని దాటుకుంటూ వెళ్ళే వాడిని.
అను నిత్యం నేనూ, మా మిత్రులూ అక్కడికి రాగానే దాసు గారిని తలుచుకుంటూ పరవశించి పోయే వాళ్ళం.

అప్పటి మా మిత్రులలో మంగిపూడి వేంకట రమణ మూర్తి దాసు గారి పరోక్ష శిష్య సరంపరలో ఒకడిగా హరి కథలు నేర్చుకుని, హరిదాసుగా మంచి పేరే సంపాదించుకున్నాడు.

ఈ సందర్భంగా నారాయణ దాసు గారి గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను ఓ సారి గుర్తు చేసుకుందాం:

1.
ఎవరీ ముగ్ధ మనోఙ్ఞ దర్శనుఁడెవండీ శారదా మూర్తి ! యీ
నవ శృంగార రసావతారుడెవరన్నా ! శ్రీమదజ్జాడయే
యవునా ! ఆ దరహాస!మానడకతీ!రాఠీవి!యాదర్ప! మా
కవితా దీప్తి! యనన్య సాధ్యములురా! కైమోడ్పులందింపరా!

2.
పండించె నీ కాలి గండ పెండెరము రం
గారు ముంగారు బంగారు పంట
నర్తించె నీ కీర్తి నవనవస్ఫూర్తి యా
సేతు శీతాచలక్ష్మాతలాన
జోహారులందె నీ సాహిత్య నందిని
కదలించి సహృదయ హృదయములను
గంభీరమయ్యె నీ శంభో నినాదంబు
దిగ్దిగంతాల బ్రతి ధ్వనించి

కాంతు లీనెను రాజ సభాంతరాల
నీ జయశ్రీ దృగంత నీరాజనాల
యక్షగాన కళా మహాధ్యక్ష పదవి
అక్షరంబయ్యె నీ పట్ల నాది భట్ల !

3.
చిఱు తాళముల జత చే ధరించిన చాలు
లయ తాళములు శుభోదయము పలుకు
కాలి గజ్జె లొకింత ఘల్లుమన్నను చాలు
భరతమ్ము నీ ముందు శిరసు వంచు
వీణతంత్రులు ముని వ్రేళ్ళు సోకిన చాలు
సంగీత వాహిని పొంగి పొరలు
గంటంబుఁబూని క్రీగంటఁగాంచిన చాలు
కవిత నీ యెదుట సాక్షాత్కరించు

నేటి కథకులందు నీ పేరు చెప్పక
గజ్జె కట్టు వాడు కాన రాడు
తెలుగు వెలుగు దేశ దేశాన నింపిన
హరి కథా పితా మహా ! నమోస్తు !

4.
ఎవడురా! యచట తెండింకొక్క గ్లాసంచు
అమృత రక్షకులకు నాఙ్ఞ యొసఁగి
సుధ కంటె మా హరి కథ లెస్స యని బృహ
స్పతి తోడ నర్మ భాషణము నెఱపి
ఏవమ్మ వాణి ! యేదీ వీణ ! సరి క్రొత్త
తీవలా ! యని గిరాందేవి నడిగి
ఆగవే రంభ ! ఆ హస్త మట్టుల గాదు
త్రిప్పి పట్టు మటంచు తప్పు దిద్ది

ఏమయా ! క్రొత్త సంగతు లేమటంచు
బ్రహ్మమానస పుత్రుని పలుకరించి
ఆది భట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగునిందందు స్వర్గ మందిరములందు !

ఆ దివ్య మహస్సుకి నమోవాకములర్పిస్తూ ....

స్వస్తి.



17, ఆగస్టు 2010, మంగళవారం

ముఖే ముఖే సరస్వతీ ...


పాట పరిమళించింది.
గళం ప్రాంతీయాభిమానాల నిగళాలు తెంచి వేసింది.
ఆనందంగా ఆ ప్రతిభా మూర్తిని అక్కున చేర్చుకుంది.
ఆశీర్వదించింది.
కళకు ఎల్లలు లేవంది.
కళా జగతికి తలుపులూ, ద్వారబంధాలూ లేవంది.
అడ్డంకులూ, అడ్డదార్లూ లేవని నిరూపితమైంది.


శ్రీరామ్ అభినందనలయ్యా !!

29, జూన్ 2010, మంగళవారం

మా టామీ కథ

మొన్నీ మధ్య మా యింట్లో ఒక శుభకార్యం జరిగితే, దానికి విజయ నగరం నుండి మా చిన్నమ్మాయీ, అల్లుడు, పిల్లలు ( మనవడు, మనవరాలు) తో వచ్చేరు. అప్పుడు మా చిన్నమ్మాయి మన టామీ ఫొటో ఒకటి ఉండాలి కదా ఒక సారి చూపించరూ? అని అడిగింది. ఉంది. కాని , ఎక్కడో మా దగ్గర ఉన్న చాలా ఫొటోలలో కలిసి పోయి కనబడ లేదు. సరే, యీ సారి దొరికేక, దానిని మీ బ్లాగులో పెట్టండి. అని మా అమ్మాయి మరీ మరీ చెప్పింది. నిన్న అనుకోకుండా సుధా రాణి గారి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో ఆవిడకి దైవమిచ్చిన కుక్క స్నోవీ గురించి రాసిన కథనం చూసాక ( దాని కోసం ఇక్కడ నొక్కండి) అరే ! మా టామీ గురించి నేను కూడా ఎందుకు రాయ కూడదు? అనిపించింది. ఆ కుతూహల ఫలితమే
ఈ కథనం .....

మేము విజయ నగరం జిల్లా సాలూరులో ఉండేటప్పుడు నాగావళి ఏటవతల ఓ చక్కని ఇంట్లో అద్దెకి ఉండే వాళ్ళం. ఆ ఇల్లు మా డాక్టరు మిత్రులదే. నాగావళి ఏటికి అటు వేపు ఉండే శ్రీనివాప నగర్ కాలనీ అది. పట్టుమని పది యిళ్ళు ఉండేవి. అన్నీ కొత్తగా కట్టిన ఇళ్ళే. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాద కరంగా ఉండేది. మా ఇంటి ముందు పెద్ద ఆట స్థలం ఉండేది. ఆ చివర డిగ్రీ కాలేజీ ఉండేది. అది కూడా కొత్తగా వచ్చినదే. అందు వల్ల పెద్ద పెద్ద భవనాలేమీ లేవు.

మా కాలనీలో టామీ అని ఓ కుక్క తిరుగుతూ ఉండేది. ఎవరు పెంచే వారో తెలియదు. కాలనీ అంతా నాదే నన్నట్టుగా తెగ తిరిగేది. దానికి టామీ అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. మా ఆవిడా, పిల్లలూ దానిని చాలా యిష్టంగా చూసే వారు. దానికి రోజూ మూడు పూటలా తినడానికి ఏదేనా పెడుతూ ఉండే వారు. మా అమ్మాయిలిద్దరూ అప్పటికి చాలా చిన్న వయసు వాళ్ళు. టామీతో ముచ్చటగా ఆడుకుంటూ ఉండే వారు.

ఇదంతా 1988 నాటి సంగతి.

తర్వాత, నాగావళికి 1990 లో ఎప్పుడూ రానంత వరదలు వచ్చేయి. వర్షం కుండ పోతగా కురిసింది. మన్నూ మిన్నూ ఏకమయింది. నాగావళి మీద సాలూరు ఊర్లోకి వెళ్ళడానికి ఉండే బ్రిడ్జి కూలిపోయింది. ఊర్లోకీ, మా కాలనీ వారికీ రాక పోకలు బంద్ అయ్యాయి. కాలనీ అవతల 8 కిలో మీటర్ల దూరంలో రామభద్రపురం ఉంది. అక్కడి నుండి విజయ నగరం, విశాఖ పట్నం , ఇటు - బొబ్బిలి, పార్వతీపురం - అది దాటేక ఒరిస్సా - వీటిని కలిపే హైవే ఉంది.

బ్రిడ్జి కూలిపోవడంతో మా కాలనీ ఒకటి ఒంటరి అంకెలా మారి పోయింది.

ఇహ లాభం లేదని వరద నీరు తీసాక పదిహేను రోజులకి సాలూరు ఊర్లోకి ఇల్లు మార్చేసాం.

మా పిల్లలు దాదాపు ఓనెల రోజుల వరకూ టామీని గుర్తు చేసుకుంటూ బెంగ పడే వారు. తర్వాత క్రమేపీ టామీ గురించిన ఆలోచనలు మా ఇంట్లో మరుగున పడి పోయాయి.

చెప్పొచ్చేదేమిటంటే ....

నాగావళి అవతలి వేపున్న కాలనీ లోని ఇల్లు మారేక మేం చాలా సంవత్సరాల పాటు అక్కడికి మరి వెళ్ళ లేదు. ప్రత్యేకంగా ఏకారణమూ లేక పోయినా, వీలు పడ లేదంతే. మా అందరి మనస్సులలోను టామీ గురించిన ఆలోచనే తుడిచిపెట్టుకు పోయింది. టామీ మా ఎవరికీ గుర్తే లేదు.

1998 లో అంటే, దాదాపు పదేళ్ళ తర్వాత, మా పెద్దమ్మాయి పెళ్ళి కుదిరితే, కాలనీలో మా పరిచయస్థులను పెళ్ళికి పిలవడానికి నేనూ, మా ఆవిడా నడుచుకుంటూ బయలు దేరాము.

ఇప్పుడంతా మారి పోయింది. పడి పోయిన బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన కట్టేరు. రాక పోకలు బాగా జరుగుతున్నాయి. పెద్ద దూరం కాక పోవడంతో, సాయంత్రం పూట చల్లగా ఉందని చెప్పి, కబర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము.

అక్కడికి మేం అప్పట్లో ఉండే కాలనీ ఇంకా దాదాపు కిలోమీటరు ఉంటుంది. హఠాత్తుగా ఓ కుక్క వచ్చి మా మీద పడింది ! మేం తుళ్ళి పడ్డాం. అది సంతోషం పట్ట లేనట్టుగా బిగ్గరగా అరుస్తూ, నాలుక పెట్టి మా ఒళ్ళంతా నాకేస్తూ, అబ్బ ! దాని హడావిడి అంతా యింతా కాదు ... ఒక్క సారిగా ఎక్కడి నుండో ( దూరాన ఉన్న కాలనీ నుండి ) వచ్చి అది మా మీద పడడంతో మా కంగారు, భయం చెప్పనలవి కాదు. ముచ్చెమటలు పోసాయి. మా గుండెలు అదిరిపోయేయి.

తీరా చూస్తే అది మా టామీ !!

అది మమ్మలనేమీ చేయడం లేదనీ, చాలా ఏళ్ళకి మేం కనిపించినందుకు ఆనందంతో ఉక్కిబిక్కిరవుతోందనీ, దాని సంతోషాన్ని, ప్రేమనీ అలా మా మీద కలియబడుతూ చాటుతోందనీ మరి కొద్ది సేపటకి కానీ మాకు అర్ధం కాలేదు.
అర్ధమయేక మాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. నిజం.

మా టామీ జాతి కుక్క కాక పోవచ్చును. ఒట్టి ఊర కుక్క కావచ్చును. కాని అది మా జాతైన కుక్క అనడంలో మాకు సందేహం లేదు.

ఇదీ మా టామీ కథ.

( అన్నట్టు, మా నాగావళి వరదల వల్ల వంతెన కూలిపోయిన నేపథ్యంతో ఆంధ్ర ప్రభ లో వరద అనే కథ
ఒకటి అప్పట్లో రాసేను. వీలు చూసుకుని ఆ కథని మీతో బ్లాగులో పంచుకుంటాను)

మా టామీ ఇప్పుడేమయిందో తెలీదు. నాగావళి ఒడ్డున ఇసుక తిన్నెల మీద నా కోసం, మా ఆవిడ కోసం, మా పిల్లల కోసం అటూ, యిటూ తిరుగుతోందో, యేమో ....











5, మే 2010, బుధవారం

చిత్రం ! భళారే విచిత్రం !!










పద్యం ఇదీ:

ఎన్నడు చూడబోయినను యించుక మాయని హాస రేఖ నీ
కన్నుల కానుపించునది కమ్మగ, యిమ్ముగ వెన్నెలంబలెన్ !
మిన్నగు నీదు వర్తనము మెచ్చఁగ హెచ్చగు శక్తి కావలెన్
మన్సన చేసి , నన్నెపుడు మానసమందిడు రామ కృష్ణుఁడా !


ఈ ఫొటో దాదాపు నలభై ఏళ్ళ క్రిందటిది. విజయనగరం వీనస్ ఫోటో స్టూడియోలో మేం సరదాగా తీయించుకున్నది. ( తే 21-11-1971 దీన) అంటే, అప్పుడు మేం విజయనగరం మహా రాజా
సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ మూడో సంవత్సరం చదువుతున్నాం.

ఫొటోలో ఎడమ చేతి వేపు ఉన్నది నేను .

కుడి చేతి వేపు ఉన్నది ఎవరో తెలుసా?

ఆంధ్రామృతం బ్లాగు ద్వారా అందరికీ చక్కని పద్య రచనలతో చిర పరిచితుడైన శ్రీ చింతా రామ కృష్ణా రావు.

క్రింద ఉన్న పద్యం అతని గురించి 21-11-1971 దీన నేను రాసిన పద్యం. నా దగ్గర ఈ ఫొటో లేదు, నేను రాసిన ఆ పద్యమూ లేదు. కాని సహృదయుడైన నా మిత్రుడు రామకృష్ణా రావు వీటిని ఇంత కాలం తన దగ్గర భద్ర పరచి, ఇటీవలే నాకు పంపించేడు.

ఆంధ్రామృతం బ్లాగుని అభిమానించే బ్లాగర్లకందరికీ ఈ ఫొటో సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను...

29, ఏప్రిల్ 2010, గురువారం

మా వూరెళ్ళాం ...!!



















మొన్న 24వ తేదీ, శనివారం నాడు మా పార్వతీ పురం ప్రయాణం. పుట్టిన గడ్డకి వెళ్తున్నాం అనే సరదాతో మాకు వొళ్ళూ మీదా తెలియడం లేదు.

నవ్య వార ప్రతిక సంపాదకులు, ప్రముఖ రచయిత టి.వి , సినిమా ల రచయిత
శ్రీ ఎ.ఎన్.జగన్నాధ శర్మ కథల సంపుటి ‘ పేగు కాలిన వాసన’ ఆవిష్కరణ సభ అక్కడ మా బాల్య మిత్రులు , కథా రచయిత పి.వి.బి.శ్రీరామ మూర్తి , తదితర సాహితీ మిత్రులు చేస్తాం రమ్మన్నారు.

బాగానే ఉంది. ఈ నెపంతో నయినా, మళ్ళీ దాదాపు 35 ఏళ్ళ తర్వాత మా ఊరు చూడొచ్చు కదా, అనే సంబరంతో రైట్ వస్తాం అనేసాం.

ఇక్కడి నుండి ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి , నేను , జగన్నాథ శర్మ , పుస్తక ప్రచురణ కర్త గుడిపాటి ,
పొగబండి కథల రచయిత, ప్రముఖ పాత్రికేయుడు, టి.వి రచయిత ఓలేటి శ్రీనివాస భాను బయలు దేరాం.

24 వ తేదీ రాత్రి 9 గంటలకి బయలుదేరే నాగావళి ఎక్సప్రెస్ లో ఎ.సి. త్రీ టైరులో రిజర్వేషన్లు ఉన్నాయి. మా మొత్తం టిక్కెట్టు జగన్నాధ శర్మ దగ్గర ఉంది. అందరం 8 గంటల ప్రాంతంలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో కలవడానికి తీర్మానం.
అందరికన్నా ముందుగా జగన్నాధ శర్మ చేరుకున్నాడు. ఇక చూడాలి, మా శర్మ తొందర ! నేను స్టేషన్కి చేరుకున్నాక, శర్మకి ఫోను చేసి, ‘ ఎక్కడున్నావురా బాబూ ’ అనడిగేను. ‘ ఇదిగో, సరిగ్గా ఓవరు బ్రిడ్జి దగ్గరే ’ అంటాడు. ఫోనులో ఒకరి మాటలు ఒకరికి వినబడడం లేదు. సికిందరాబాదు ప్లాట్ ఫారమ్మీద , ఆ రద్దీలో ఏ ఓవరు బ్రిడ్జి మొదట్లో ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఎలాగయితే నేం కలుసుకున్నాం.అప్పటికే వచ్చేరు ఓలేటి శ్రీని వాస భానూ , గుడిపాటి. రైల్వేలో పనిచేసాడు కనుక కాబోలు శ్రీను ఈ రైల్వే అంతా నాదే ! అన్నంత ధీమాగా అటూ యిటూ నడుస్తున్నాడు. శర్మ, ‘చూడు చూడు , ఈ రైల్వే అంతా సొంత ఆస్థిలా ఎలి ఫీలై పోతున్నాడో ’ అంటూ నవ్వేడు. ఇక గుడిపాటి మాత్రం హరి మీద గిరి పడ్డా చలించని రీతిలో మహా నింపాది.

ఇక రావాల్సింది కవి శివా రెడ్డి. ఎంతకీ రాడే ! ఓ ప్రక్క రైలుకి టైమయి పోతోంది. ఫోను చేద్దాం అంటే, శివా రెడ్డి దగ్గర సెల్ లేదు. సెల్ వాడరు. శివా రెడ్డి కోసం ఇక పరుగో పరుగు ! ఓ ప్రక్క భానూ, మరో ప్రక్క గుడిపాటి వెతకడం మొదలెట్టారు. ఇంతలో ‘వచ్చేస్తున్నా ’ అని కవిగారి నుండి ఫోనొచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఎ.షి.త్రీ టైరు ఎటుందని శివారెడ్డి అడిగితే ఓ తలమాసిన వాడు తప్పుడు సమాచారం అందించడంతో, పాపం శివా రెడ్డి మొత్తం రైలుకి ఆ చివర నుండి యీ చివర వరకూ తిరగాల్సి వచ్చింది. వస్లూనే తనకి ఆ తప్పుడు సమాచారం యిచ్చిన వ్యక్తిని అటూ యిటూ ఏడు తరాలు తిట్టి పోసి, అలుపు తీర్చుకున్నాడు శివా రెడ్డి.

మొత్తానికి అందరం చేరేం. ఇక అప్పటి నుండి మా ప్రయాణం అంతా నవ్వులే నవ్వులు ! సరదాలే సరదాలు ! కబుర్లే కబుర్లు !! ఎవరి ముద్దలు వాళ్ళు యింటి దగ్గరే తిని రమ్మని శర్మ హుకుం జారీ చెయ్యడంతో రైల్లో తిండి బాధ లేదు. బెర్తులు చూసుకుని కుదురుకున్నాం.


జో పాపా ! లాలీ , జో !!

శివా రెడ్డికి కింద బెర్తులో ఉన్న ఓ ఇల్లాలు బాత్ రూం అవసరపడి, తన బిడ్డని కాస్త చూడమని అందించింది, ‘ ఉచ్చ పోసెయ్యదు కదా ?’ అడిగేరు శివారెడ్డి. ‘‘ లేదండీ, పాపకి డైఫరు కట్టేను ’’ అని భరోసా యిచ్చిందా తల్లి. సరే అని పాపని ఒళ్ళోకి తీసుకున్నశివా రెడ్డి పాట్లు ఇంక చూడాలి ! పాప ఒకటే ఏడుపు. శివా రెడ్డి పాపని సముదాయించడం ! ఆ దృశ్యం చూసి తీరాలి .ఎంత ముచ్చట వేసిందో.

ఆ రాత్రి మూడు గంటలకి తిరుపతి నుండి వచ్చిన మధురాంతకం నరేంద్ర మాతో కలిసేరు. ఆయనకి అక్కడి నుండి రిజర్వేషను శర్మ ముందే చేయించాడు.

నరేంద్రతో పాటు, శర్మతో ఎప్పుడో హైస్కూలులో చదువుకున్న ఓ మిత్రుడు - పేరు సత్య ప్రకాష్ - అంత రాత్రి వేళప్పుడు శర్మని కలుసుకోడానికి వచ్చేడు. ఇటీవల నవ్యలో జగన్నాధ శర్మ సినీ దర్శకుడు, రచయిత వంశీ గురించి రాసిన ఓ వ్యాసంలో కంఠు అని చూసి, చాలా రోజులకి తన పాత
మిత్రుడి జాడ పోల్చుకున్నాడుట , అతను. రైల్వేలోనే ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడుట. ఎప్పటిదో, శర్మది, చిన్నప్పటి ఫొటో ఒకటి జేబులో పోలిక పట్టడం కోసం ఉంచుకుని మరీ వచ్చేడు. నిజానికి ఆ ఫొటో ఇప్పుడు చూసి, శర్మే గుర్తు పట్ట లేడు. అంత భద్రంగా తన చిన్న నాటా మిత్రుని ఫొటో పదిలంగా దాచుకుని తెచ్చిన ఆ వ్యక్తి ని చూసి, అబ్బుర పడ్డాం.

విజయవాడ స్టేషనులో రాత్రి మూడు గంటల వేళలో ఆ బాల్య మిత్రులు ఇద్దరూ కలుసుకుని తనివితీరా కొద్ది సేపు కబుర్లు చెప్పుకునే ఆ దృశ్యం భువన మోహనంగా ఉంది.

శర్మ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టేడు.

కబుర్లతో జాము రాత్రి వరకూ హోరెత్తించి, పడుకున్నాం. ఏం పడుకోవడం లెండి ! నాకూ, శర్మకీ, భానుకీ మా సొంతూరు చూడబోతున్న ఆనందంతో నిద్ర పడితే కదా ?

తెల్లారి నాలుగో గంటకి అందరికీ తెలివొచ్చింది. శివా రెడ్డి అప్పటికే ఓ దఫా తేనీరు సేవించి, నాకొక టీ యిప్పించి కబుర్లు ప్రారంభించేరు. శర్మ వచ్చి చేరాడు. మరి కాస్సేపటికి భాను. శర్మ ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తూనే ఉంది.


రైలు విశాఖ పట్నం చేరింది. ఆంధ్రభూమిలో పని చేసే జ్యోత్స్న , అతని మిత్రులు మేడా మస్తాన్ రెడ్డి మమ్మలని కలవడానికి వచ్చేరు. టిఫిన్ పొట్లాలతో సహా ... మళ్ళీ కబుర్లు. ఫొటోలు దిగేం. టిఫిన్లయేక రైలు కదలబోతూ ఉంటే ఎక్కాం.


దార్లో తాటి ముంజెలూ, వేరు సెనక్కాయలూ , టీలూ ...
రైలు మా పార్వతీ పురం చేరబోతూ ఉంది. ఆ పరిసరాలని చూస్తూ శర్మ సంతోషం పట్ట లేక చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టేడు.

అదిగో శివాలయం. అదిగో సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, అల్లదిగో వేణు గోపాల్ టాకీస్, ఇదిగిదిగో మా టౌను రైల్వే గేటు ....అంటూ పొంగి పోతూ. మా సరదా చూసి శివారెడ్డీ, గుడిపాటీ, నరేంద్ర ఎంత ముచ్చట పడ్డారో !

రైలు మా పార్వతీ పురం టౌను స్టేషన్లో ఆగింది. అక్కడే కదా, ప్లాట్ ఫారం చివర, తురాయి చెట్టు కింద, సిమ్మెంటు బల్ల మీద కథల గురించి చెప్పుకుంటూ - నేనూ, శర్మా, భానూ, మా పీ.వీ.బీ.శ్రీరామ మూర్తి - ఎన్నో సాయంత్రాలు చీకటి చిక్కబడే వరకూ గడిపే వాళ్ళం ... మమ్మలని రచయితలుగా మేం తీర్చి దిద్దుకున్న నేల తల్లి అదే కదా !

పొంగి పోయాం. కళ్ళు చెమర్చాయి. ఉద్విగ్నంతో ఎవరికీ నోరు పెగలడం లేదు.
ఆ గాలి, ఆనేల, ఆమట్టి వాపనా మాకిష్టం. .....
మమ్మల్ని రిసీవ్ చేసుకుందుకి చాలా మంది మిత్రులు రచయితలు వచ్చేరు.
రచయితలు పి.వి.బి.శ్రీరామ మూర్తీ, గంటేడ గౌరు నాయుడూ, చింతా అప్పల నాయుడూ. జల్దు బాబ్జీ, ... కార్లో సాదరంగా తీసికెళ్ళి మమ్మల్ని ఓ లాడ్జిలో దించేరు.

మా ఊరి వీధుల్లో ...


స్నానాలూ, భోజనాలూ కానిచ్చేక, నేనూ , జగన్నాధ శర్మా, ఓలేటి శ్రీనివాస భానూ మా ఊరినీ, మేం తిరిగిన వీధులనీ చూడడానికి బయలు దేరాం.
మా బాల్యాన్ని వెతుక్కుంటూ ఆ వీథులమ్మట ముచ్చట పడి పోతూ చాలా సేపు తిరిగాం

పార్వతీ పురంలో ఆ రోజు వరకూ ఎండలు అదర గొట్టేసాయిట. మేం ఊరిని చూడ్డానికి బయలు దేరామో, లేదో, చల్లగా అయి పోయింది వాతావరణం. మా ఊరి తల్లకి మేమంటే ఎంత ప్రేమో !!

వీధులన్నీ తిరిగేం. అప్పటి ఆత్మీయ మిత్రులని, బంధువులని కొందరిని కలుసుకున్నాం. ముచ్చట్లు కలబోసుకున్నాం.
ఒక సారి మేం దాదాపు నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళి పోయేం.మా కంఠు (శర్మ) అప్పటిలో పని చేసిన కర్రల మిల్లుని చూసాం. అదే కదా, పేగు కాలిన వాసన కథకి నేపథ్యంగా నిలిచిన చోటు....
శర్మ అగ్రహోరం కథల్లో చెప్పిన మా యిల్లు, జోగారావు గారి మేడ చూసాం. పాత పోలీసు స్టేషను వీధీ, కంచర వీధీ .. శర్మ రాసిన మాస్టర్ పీస్ మినీ కథ - పండా అప్పట్లో ఉన్న పూరిల్లూ ...
శర్మ అన్నయ్య గణపతి, తండ్రి పని చేసిన కోమటి గుమస్తా కొట్టు ... చూసి శర్మ కళ్ళలో నీళ్ళు ఉబికి రావడం గమనించి మాకూ కళ్ళు చెమరించాయి...
సాయంత్రం కావస్తోంది. పుస్తకావిష్కరణ సభా కార్యక్రమానికి వేళ దగ్గర పడుతోంది. ఆ వీధులని, ప్రదేశాలనీ వదల లేక వదల లేక మళ్ళీ మా బస దగ్గరకి చేరాం మేం వెళ్ళే సరికి కాళీ పట్నం రామారావు మాష్టారు వచ్చి ఉన్నారు. రచయితలు జయంతి వెంకట రమణ, డాక్టర్ వి. చంద్ర శేఖర రావు , ఎ,వి, రెడ్డి శాస్త్రి , వేద ప్రభాస్, డా. బి.ఎస్.ఎన్. మూర్తి, కొల్లూరు జగన్నాధ రావు, మల్లా ప్రగడ రామారావు గంటేడగౌరు నాయుడు, చింతా అప్పల నాయుడు, నఖ చిత్ర కారుడు పరిశి నాయుడు, ... చాలా మంది సభ జరిగే చోటుకి బయలు దేరడానికి రెడీ అయిపోయి ఉన్నారు. ఇక మాదే ఆలస్యం. వేగిరం స్నానాలు చేసి, తయారయి అంతా బయలు దేరాం ...

ఆ సాయంత్రం పేగు కాలిన వాసన కథా సంపుటి ఆవిష్కరణ సభ చాలా విజయవంతంగా జరిగింది.
ఎందరో రచయితలు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చేరు. , మా బాల్య మిత్రులూ ఎక్కడెక్కడి నుండో వచ్చేరు...అంతా ఒక పండుగ వాతావరణం.

సభని ప్రారంభిస్తూ పి.వీ.బీ , చింతా అప్పల నాయుడు గారలు స్వాగతం పవలికారు.
సభాధ్యక్షులు శివా రెడ్డి . ముఖ్య అతిథి కాళీ పట్నం రామారావు మాష్టారు. పుస్తక సమీక్షలు అట్టాడ అప్పల నాయుడు, మధురాంతకం నరేంద్ర గారలు అపూర్వంగా పుస్తక సమీక్షలు చేసారు.. వాళ్ళు ప్రసంగిస్తున్నంత సేపూ చప్పట్లు ఆగ లేదు సభలో గుడిపాటి మాట్లాడుతూ త్వరలోనే జగన్నాధ శర్మ రాసిన అగ్రహారం కథలని ఒక చక్కని సంపుటిగా తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించడంతో ఆనందంతో సభ మారు మ్రోగి పోయింది. .జల్దు బాబ్జీ ఆప్త వాక్యం చదివేడు. శర్మ మిత్రులు మంథా రఘునాథ శర్మ, పేర్రాజు, పంతుల లక్ష్మణ మూర్తి, శర్మ తమ్ముడు, రాము - రాయపూర్ నుండి వచ్చేడు... యిలా ఎందరో, ఇక , చాల మందిరచయితలు కూడా అతనితో తమ అనుబంధాన్ని కొద్ది మాటలలో సభలోని వారితో మాటల్లో పంచుకున్నారు.

తర్వాత జగన్నాధ శర్మకి అపూర్వమైన రీతిలో ఘన సన్మానం జరిగింది.
మేం పుట్టి, పెరిగి, తిరుగాడి, తొలి కథలు రాసుకున్న మా పార్వతీ పురంలో మా కంఠు (జగన్నాధ శర్మ)కి ఈ విధమైన

అపూర్వ సత్కారం లభించడం మాకు ఎప్పటికీ మరిచి పోలేని మధురానుభూతిని మిగులుస్తుంది.

మా నేలని తాకేం. మా ఊరి చెరువుల మీద నుండి, కొండల మీద నుండి వచ్చే చల్లని గాలి పీల్చాం. చిన్న నాటి మిత్రులని కలుసుకున్నాం. మా పెద్దల, గురువుల ఆశీర్వాదాలు అందుకున్సాం . మా బాల్యం లోకి వెళ్ళి పోయేం ....

బరువెక్కిన గుండెతో మా చల్లని తల్లికి, మా ఊరికి వీడ్కోలు పలికాం ....

పార్వతీ పురంలో పీ.వీ.బీ, జల్దు బాబ్జీగారల ఇళ్ళలో కమ్మని భోజనాలూ , టిఫిన్లూ . చవులూరించే ఆ రుచులు తలుచుకుంటూ తిరుగు ప్రయాణం. సభా విశేషాల గురించీ, మా పార్వతీ పురం ప్రజల ఆత్మీయతానురాగాల గురించీ చాలా సేపు మాట్లాడుకుంటూ గడిపేక, ఎవరి బెర్తుల మీదకి వాళ్ళు చేరాం. ఎన లేని ఆనందంతో కాబోలు అందరికీ బాగా నిద్ర పట్టింది.

మర్నాడు రైల్లో మళ్ళీ మామూలే ! ఉదయాన్నే మూడింటికి లేచాం. మధురాంతకం తిరుపతి వెళ్ళాలి కనుక విజయ వాడలో దిగేసారు ...

ఆ ఉదయం టీలు, కాఫీలు ఆరారా త్రాగుతూ కబర్లు మొదలెట్టాం ...

ఆ ఉదయం రైల్లో సైడు బెర్తు మీద బాసిం పట్టు వేసుకుని కూర్చుని శివా రెడ్డి చేసిన ప్రసంగం మహా అద్భుతంగా సాగింది.
నగర జీవితాన్ని గురించీ, కవిత్వాన్ని గురించీ, నవలా సాహిత్యం గురించీ అనువాద రచనల గురించీ, శ్రీశ్రీ, నారాయణ బాబు, ఆరుద్ర .... ఒక శాఖా చంక్రమణంగా సాగినా, శివా రెడ్డి ప్రసంగం వరద గోదావరిలా పరవళ్ళు తొక్కింది. నేనూ. జగన్నాధ శర్మ, ఓలేటి శ్రీనివాస భానూ, గుడిపాటి శ్రోతలం. శివాదెడ్డి అపూర్వ ప్రసంగాన్ని ఆ వేళ చల్లని ఉదయం సమయంలో , వేగంగా దూసుకు పోతున్న రైల్లో వినడం నిజంగా ఒక అపూర్వానుభూతి అనే చెప్పాలి.

రైలు ఉదయం తొమ్మిది గంటల వేళకి సికిందరాబాద్ చేరుకున్నాక, బరువెక్కిన గుండెలతో వెళ్ళొస్తామని ఒకరికొకరు చెప్పుకుంటూ స్టేషను బయటికి దారితీసాం ....


మరి కొన్ని ఫొటోలు చూడండి ...


జగన్నాధ శర్మ,పంతుల జోగారావు.జ్యోత్స్న, శివా రెడ్డి. (విశాఖ రైల్వే స్టేషన్లో)






ఆప్త వాక్యం చదువుతున్న జల్దు బాబ్జీ
ఈ కార్యక్రమ నిర్వహణలో తెర వెనుక సూత్రధారి. మా ఆత్మీయ మిత్రుడు.





పేగు కాలిన వాసన ప్రచురణ కర్త గుడి పాటి




పార్వతీపురం బసలో ఓలేటి శ్రీనివాస భాను, శివా రెడ్డి, మధురాంతకం నరేంద్ర, జగన్నాధ శర్మల పిచ్చాపాటీ







జగన్నాధ శర్మ తనకు చేసిన సన్మానానికి ధన్యవాదాలు చెబుతూ ....



శర్మ మిత్రుడు, క్లాస్ మేట్ పంతుల లక్ష్మణ మూర్తి ముద్దులతో శర్మని ముంచెత్తుతూ ....


శర్మ మరో మిత్రుడు మంథా రఘునాధ శర్మ











శర్మని అభినందిస్తూ క్లాస్ మేట్ పేర్రాజు ...


పంతుల జోగారావు


.మధురాంతకం నరేంద్ర పుస్తక సమీక్ష చేస్తూ ... చిత్రంలో కుడి వేపు చివర ఉన్నది మంచు పల్లి శ్రీరామమూర్తి


అట్టాడ అప్పల నాయుడు పుస్తక సమీక్షలు ....


కాళీ పట్నం రామా రావు మాష్టారు శర్మని అభినందిస్తూ ...


పార్వతీ పురంలో ఈ కార్య క్రమ నిర్వహణలో ప్రధాన సూత్రధారి, రచయిత, జగన్నాధ శర్మ కి ఆత్మీయ మిత్రుడు పి.వి.బి.శ్రీరామ మూర్తి.


6, జనవరి 2010, బుధవారం

మా చదువుల తల్లి ...







































































విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి భోజన సత్రం. ఇక్కడ అన్న ప్రసాదాన్ని తిని చదువుకున్నాను.









విజయ నగరం . ప్రభుత్వ మహా రాజా వారి ప్రాచ్య భాషా కళాశాల. ఇక్కడే



నా భాషా ప్రవీణ చదువు అక్కడ 1969 - 1972 వరకూ జరిగింది.

శ్రీ మానాప్రగడ శేష సాయి గారు కళాశాల అధ్యక్షులు.

గోపాల రావు గారు, గోవిందాచార్యులు గారు, కస్తూరి గారు, సాంబ శివ రావు గారు, భాష్యకారాచార్యులు గారు, బుద్ధరాజు రామ రాజు గారు, శఠకోపాచార్యులు గారు ,
సుబ్బమ్మ గారు, కల్యాణి గారు, రంగా చారి గారు, రాష్ర్టపతి అవార్డు గ్రహీత పేరి సూర్య నారాయణ గారు... మా గురు దేవులు ...

ఇక మా మిత్రులు ... స్వర్గీయ దువ్వూరి పేరయ్య
పోమయాజులు, మంగి పూడి వెంకట రమణ మూర్తి, (హరి కథకులు) పి.వి.బి. శ్రీరామ మూర్తి ( కథా రచయిత) చింతా రామక్రిష్ణ, (కవి), బగ్గాం రామ జోగారావు (నటులు), బుడితి బలరామునాయుడు (సీర పాణి - డమరు ధ్వని కావ్య రచయిత)

కె.యన్.వై.పతంజలి ( ప్రముఖ హాస్య వ్యంగ్య రచయిత, పాత్రికేయులు) రాజా వారి కళాశాల విద్యార్ధి.