23, మే 2012, బుధవారం

కథా రచయితలు, కవులు కొలువుతీరిన ఈ అరుదైన ఫొటోకి ఇవాళకి అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !



బరంపురంలో 1979 జనవరి20, 21, 22 తేదీలలో అఖిల భారత రచయితల సమ్మేళనం వేడుకలు అపూర్వంగా జరిగేయి.
అప్పుడు తీసిన ఫొటో ఇది.
ఈ ఫొటోలో శ్రీ.శ్రీ, కాళీపట్నం రామారావు, వుప్పల లక్ష్మణ రావు, కె.వి.కృష్ణ కుమారి, చాగంటి తులసి, చాగంటి సోమయాజులు, బలివాడ కాంతారావు,  రామ మోహనరాయ్, శీలా వీర్రాజు, బలివాడ కాంతారావు, జ్వాలాముఖి, చలసాని ప్రసాద్. స్మైల్,  చెఱబండరాజు, వాకాటి పాండురంగారావు, కప్పగంతుల మల్లికార్జునరావు, భమిడిపాటి రామ గోపాలం, మంజుశ్రీ, అవసరాల రామ కృష్ణారావు, లత, వంటి ప్రముఖులతో పాటు వర్ధమాన రచయితలు దేవరాజు రవి, తాతా విశ్వనాథ శాస్త్రి,  మానేపల్లి సత్యనారాయణ, అరుణ్ కిరణ్, సస్యశ్రీ, ప్రసాద్, మల్లేశ్వరరావు, వంటి రచయితలు ఉన్నారు. విశాఖ నుండి రా.వి.శాస్త్రి ఈ సభలకు వచ్చినట్టే గుర్తు. వారు ఈ ఫోటోలో లేరేం చెప్మా ? 
ఈ సభలు జరిగేక, దాదాపు ఇరవై రెండేళ్ళ తర్వాత భ.రా.గో
 25 -4 -2002 తేదీ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో దీనిని ప్రచురించారు. ఫొటో లోని రచయితలను తాను గుర్తించి నంత వరకూ పేర్లు ప్రకటించారు.  దాదాపు 43 మంది రచయితల పేర్లు తెలిసిన వారు తెలియజేయమని కోరారు. ఎక్కువ మంది పేర్లు చెప్పిన వారికి
వంద రూపాయల విలువగల కథా సంపుటాలను బహుమతిగా ఇస్తానని కూడా
ప్రకటించేరు.  అప్పట్లో వారి ప్రకటనకి ఎలాంటి స్పందన వచ్చిందో నాకు గుర్తు లేదు. ఎంత మంది ఎందరి పేర్లు చెప్ప గలిగారోకూడా నాకు తెలియదు.
ఈ సభలు జరిగన తీరు గురించి కళ్ళకు కట్టే విధంగా భరాగో అప్పట్లో 28-1-1979 నాడు ఒక దిన పత్రికలో చక్కగా చాలా విపులంగా రిపోర్టు చేసారు కూడా !
ఇదిలా ఉంచితే,  ఈ ఫొటో ప్రచురిస్తూ భ.రా.గో గుర్తించిన రచయితలలో  మీది వరసలోని 11 వ వ్యక్తిగా వారు నన్ను పేర్కొన్నారు.  పంతుల జోగారావు ? అని
కొంచెం సందేహంగానే అన్నారు.
 వారు అనుకొన్నది సరి కాదు. ఆ వ్యక్తిని నేను కాదు. ఎవరో నాకూ తెలియదు.
ఆ సభలలో నేనూ పాల్గొన్నాను. కానీ, ఈ ఫొటోలో లేను. ఆ రోజు ఫోటో సెషన్లో మొదట తీసిన ఫొటో ఇది.
ఆ వెంటనే మరో ఫొటో కూడా ఇంత మంది రచయితల తోనూ తీయడం జరిగింది. ఆ ఫొటోలో నేను ఉన్నాను. నాతో పాటూ ఈ ఫొటోలో లేని  నేటి నవ్య సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ, ఆంధ్రభూమి ఉపసంపాదకులుగా చేసి ఇటీవల మరణించిన జ్యోత్స్న గారూ మొదలయిన మరికొంతమంది రచయితలం ఉన్నాం. మొదటి ఫొటోలో కనిపించని మరి కొంతమంది అందులో కనబడతారు. కొంత ఆలస్యంగా వచ్చి ఫొటోలో దిగిన ఆ రచయితలతో కూడిన ఫొటో ఎవరి దగ్గర దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు భ.రా.గో గారూ లేరు. ఈ ఫొటో లోని చాలా మంది రచయితలూ లేరు. తక్కిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో ?

ఏమయినా, ఈ అరుదైన ఫొటోకి ఇప్పుడు అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !


20, మే 2012, ఆదివారం

నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా ...





ఒక వయసులో ఎంతో కొంత కవిత్వం అల్లకుండా ఉండడం సాధ్యం కాదేమో. అలా రాసిన కవిత ఇది. అప్పట్లో అందరిలాగానే నేనూ కవిత్వంలో కొంత నిప్పులు కక్కడానికి ప్రయత్నించాను. శ్రీ. శ్రీ జోక్ ప్రకారం నిప్పులు కక్కే కవిత్వం  కాదు కానీ,  నిప్పులలో కుక్క దగిన కవిత్వమే ఇది, అని త్వరలోనే తెలివిడి కలిగి, మరి కవితలు రాయడం మానేసాను.
అదన్నమాట, సంగతి.

12, మే 2012, శనివారం

ఒకటి కొంటే ఒకటి ఉచితం ... రామాయణం పుస్తకం కొంటే భారత గ్రంథం ఉచితం !


























మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..


పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.


మరో మాట ... ఎందుకేనా మంచిదని చెప్పి చదువరులను ముందే హెచ్చరించాడు.


ఒక కథ వినేటప్పుడు మఱొక కథ మీద దృష్టి నిలిపితే, మొత్తం మొదటి అర్ధం గోచరించకుండా పోతుంది. అందు చేత ఈ రాఘవ పాండవీయం చదివేటప్పుడు ఒకే అర్ధం కలిగిన మామూలు కావ్యాన్ని ఎలా చదువుతారో అలాగే చదవండి. అంటే, ముందుగా రామాయణార్థాన్ని చదువుదామనుకుంటే, మనసు లోకి మరింక భారతార్థం ఏమిటా అని ఆలోచించకండి. అలాగే భారతార్ధం వచ్చేలా చదివేటప్పుడు రామాయణార్ధ ఏమిటా అని ఆలోచించకండి. ఏకార్ధ కావ్యం ఎలా చదువుతారో అలాగే చదువు కోండి. అని వివరణ ఇచ్చాడు.






రాఘవ పాండవీయం లోని రామాయణార్థంలో నూ భారతార్ధం లోనూ అర్ధాలు వచ్చే ఒక పద్యం ఉదాహరణకు చూద్దామా !


వెలయునఖిల భువనములలోన వారణ


నగరిపురమ తల్లి నాదనర్చి


రాజ్య లక్ష్మి మిగుల బ్రబల నయోధ్యనా


రాజ వినుతి గనిన రాజధాని.






ఈ పద్యం రామాయణ పరంగా అయోధ్యా నగరాన్ని వర్ణించే పద్యం. ఇదే పద్యం భారతార్ధంలో అయితే, హస్తినాపురాన్ని వర్ణిస్తున్న పద్యం !




ఇందులో సంస్కృతాంధ్ర శబ్ద సభంగ శ్లేష కవి వాడాడు.






ముందుగా రామాయణ పరంగా అర్ధం ఎలాగంటే,


రామాయణ పరంగా పద్యంలోని పదాలు ఇలా విరిచి చదువు కోవాలి.






అఖిల భువనముల లోన్, = అన్ని లోకాలలోనూ


అవారణ, నగరిపు, రమ, తల్లి = అడ్డు లేని ఇంద్రుని యొక్క సంపదయైన అమరావతికి తల్లి అన్నట్లుగా రాజ వినుతి గనిన = గొప్ప పేరు గాంచిన


రాజధాని అయోధ్యనాన్ = అయోధ్య అనే పేరుతో ప్రబలున్ = వెలయు చున్నది.






అంటే,

ఇంద్రుని రాజధాని అమరావతి. . దానికి తల్లి లాంటి నగరం అయోధ్య అన్నమాట.!






ఇక, భారతార్థంలో అన్వయం చూదామా !






న + యోధ్య = అయోధ్య ( యుద్ధం చేసినా జయింప బడనిది )


వారణ నగరి = వారణం అంటే ఏనుగు, వారణ నగరి అంటే హస్తినా పురం !


పురమ తల్లి = పుర శ్రేష్ట్రం. ( శ్రేష్ఠమైన నగరం )


అన్వయం ఇలా చూడాలి.






అఖిల భువనములలోన + వారన నగరి + పురమ తల్లి..






అంటే, అన్ని లోకాలలోనూ, హస్తినా పురం చాలా గొప్పది అని అర్ధం అన్నమాట !


తక్కిన అర్ధమంతా సుబోధకమే కదా !


వార్నాయనో ! ఒక్క పద్యానికి రెండు రకాల ( రామాయణ, భారతార్ధాలు ) అర్ధాలు గ్రహించడానికే ఇంత పీకులాట అయింది. ఇక మొత్తం కావ్యం అంతా చదవాలంటే మాటలా ? అనుకుంటున్నారా ?


తప్పదండీ, బాబూ, కష్టే ఫలీ ! అన్నారు. కావ్య రసం గ్రోలాలంటే ఆ మాత్రం కష్టపడొద్దూ ?


పనిలో పని, పింగళి సూరన కళా పూర్ణోదయం చదవండి..ఒక మిష్టరీ నవల చదువుతున్నట్టగా ఉంటుంది. తెలుగు కవుల గొప్ప తనమేమిటో తెలుస్తుంది. ! మన కావ్య సంపదను మనం ఎంత పదిలంగా కాపాడు కోవాలో తెలుస్తుంది !






స్వస్తి.




8, మే 2012, మంగళవారం

కటకట లక్ష్మణా !



తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికలో తే 2-11-2011 దీ సంచికలో ప్రచురణ.



1, మే 2012, మంగళవారం

మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్సృహ ...


‘‘ ఎటు వేపేనా వెళ్ళు, కానీ, ఉత్తరం దిక్కు వేపు మాత్రం వెళ్ళకు ! ’’ అని ముసలి రాజు మరీ మరీ చెప్పి పంపిస్తాడా ? రాకుమారుడు అటు వేపే వెళ్తాడు.
ఇచ్చట నోటీసుల అంటించ రాదు అనే బోర్డు మీది అక్షరాలు రకరకాల వాల్ సోష్టర్ల నడుమ బిక్కు బిక్కుమంటూ కనిపిస్తూ ఉంటాయి.
ఇచ్చట మూత్రము చేయ రాదు ( మా హైదరాబాదులో అలాగే రాస్తారు మరి) అని ఉంటుందా ? అక్కడంతా ముక్కులు బద్దలయ్యేంత దుర్వాసన గుప్పు మంటూ ఉంటుంది.
నిశ్శబ్దమును పాటించుము అనే చోట నయాగరా జలపాత హోరు వినిపిస్తున్నా , లైబ్రేరియన్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసి నిస్సహాయంగా చేతులెత్తేస్తాడు.
వాహనములకు ప్రవేశము లేదు అని వ్రాసి ఉన్న హెచ్చరికను తుంగలో తొక్కి ఏ పోలీసో ఎదురయ్యే వరకూ ఆకతాయి వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి.
ప్లేట్లలో చేతులు కడగరాదు అని మా ఊళ్ళో చిన్న చిన్న హొటళ్ళలో బోర్డు రాసి పెట్టే వారు. అందు చేత జనాలు ఆ వినతిని  మన్నించి, టిఫిన్ తిన్నాక, చేతులు గ్లాసులలో ముంచి చక్కా పోయే వారు.
స్త్రీలకు మాత్రమే అని కనిపిస్తున్నా కొందరు జబర్దస్తీ రాయుళ్ళు బస్సులలో ఆ సీట్ల లోనే కూర్చోడం అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే.
మెడలు పక్కకి వాల్చి వాహనాలు నడిపే చోదకుల విన్యాసాలూ,పట్ట పగలు కూడా వెలిగే వీధి దీపాలూ, బస్సుల్లో వ్రేలాడుతూ ప్రయాణం చేసే ఫుట్ బోర్డు వీరుల సర్కస్  ఫీట్లూ  ...
ఇలా చెప్పు కుంటూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. మన సామాజిక  సామాజిక స్పృహ  అలాంటిది మరి !
ఈ మేడే నాడు సామాజిక స్పృహ  గుర్తుకు రావడం యాదృచ్ఛిక మేమీ కాదు.
దానితో పాటు మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్పృహ గురించి మీకు చెప్పాలనిపించడం కూడా సహజమైన విషయమే.
మా తింగరి బుచ్చిగాడు గుర్తున్నాడు కదూ ?  పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా తింగరి బుచ్చిగాడు ఆరేడేళ్ళ వయసు లోనే గొప్ప  సామాజిక స్పృహ సంతరించు కున్నాడు. అది విశేషమే కదా ?
ఆ ముచ్చట చెప్పాలనే ఈ టపా పెడుతున్నాను.
నేనూ , మా తింగరి బుచ్చిగాడూ ఎలిమెంటరీ బడిలో చదువుకునే రోజులవి. మా బడి పేరు జంగం బడి. మా బడి పోలీసు స్టేషను వీధికి దగ్గరలోనే ఉండేది. మా బడికి ఎదురుగా ఒక చేకు గోడౌను ఉండేది. అంటే తెలుసు కదా ? గోగు నారని అక్కడ మిషన్ల లో పెట్టి పెద్ద పెద్ద బేళ్ళగా కట్టి ఎక్కడికో ఎగుమతి చేసే వారు.
ఆరోజుల్లో అక్కడ తయారయే చేకు బేళ్ళు మాకంటికి ఆకాశమంత ఎత్తుగా కనిపించేవి. ఆ తయారీ కూడా మాకు చాలా వింతగా కనిపించేది. నార బేళ్ళు కట్టే మిషన్లు ఒకటో, రెండో ఉండేవి. వాటిలో నార వేసి మనుషులు తొక్కే వాళ్ళు.  తర్వాత పెద్ద పెద్ద చక్రాలను నలుగురైదుగురు మనుషులు బలంగా పట్టుకుని తిప్పే వారు. పెద్ద పెద్ద తాళ్ళతో ఆ మిషన్లోనే వాటిని పెద్ద బేళ్ళుగా కట్టే వారు. అలా కట్టిన బేళ్ళ నుండి ఒక్క చిన్న నార పీచు లాగి తియ్యడం కూడా మాకు చాతనయ్యేది కాదు. మా శలవు రోజులన్నీ ఆ గోడౌను లో ఉండే రావి చెట్టు కిందే గడిచి పోయేవి.
సరే, ఇదంతా అలా ఉంచితే, ఒక రోజు మా తింగరి బుచ్చి నన్ను రహస్యంగా ప్రక్కకి పిలిచి, ‘‘ నీకో రహస్యం చెబుతాను. మన చేకు గోడౌనులో దొంగతనం జరుగుతోంది. తెలుసా ! ’’ అనడిగేడు.
‘‘ దొంగతనమా !’’ అన్నాను భయంగా.
‘‘ అంటే, దొంగ వ్యాపార మన్న మాట.’’ అని వివరించేడు. కల్తీ , దొంగ వ్యాపారం, దోపిడీ లాంటి పదాలు వాళ్ళ అన్నయ్య తరుచుగా అంటూ ఉంటాడు. అవే వీడికీ వంట బట్టేయి.
‘‘ మనం ఈ విషయం పోలీసులకి చెప్పాలి. పోలీసు స్టేషన్ కి వెళదాం పద !‘‘ అన్నాడు.
నా నిక్కరు తడిసి పోయింది.
‘‘ అమ్మో ! నాకు భయం’’ అన్నాను.
‘‘ నీకు సామాజిక స్పృహ లేదు.’’ వెక్కిరించాడు వాడు. ఈ పదం కూడా వాడు వాళ్ళ విప్లవ అన్నయ్య నుండి నేర్చుకున్నదే. అసలీ విప్లవమనే పదం కూడా వాడికి అలాతెలిసిందే. ‘‘ అంటే ఏమిటి ’’ అనడిగేను. ‘‘ నాకూ సరిగా తెలియదు. తిరగ బడడంట.’’ అన్నాడు. మా అవ్వ ఆ మధ్య నీరసంతో కళ్ళుతిరిగి నేలకు తిరగ బడి పోయింది. ఇది సామాజిక స్పృహ  అవునో కాదో నాకు తెలియదు. నిజంగా. నిజం. సరస్వతి తోడు.
నాకు సామాజిక స్పృహ లేదని ఖాయమై పోయేక, వాడొక్కడూ పోలీసు స్టేషన్కి బయలు దేరాడు.


 అక్కడ జరిగిన బోగట్టా అంతా నా మనో నేత్రంతో ( అంటే ఏఁవిటో నాకు సరిగ్గా తెలియదు. మా కథా మంజరి బ్లాగరు అంకుల్ చెప్పాడు ) చూసాను కనుక మీకు చెబుతున్నాను. 

మా తింగరి బుచ్చి గాడు వీరోచితంగా పోలీసు స్టేషను వరకూ వెళ్ళి , అక్క డ చాలా సేపు తటపటాయించి, ఎలాగయితేనేం, స్టేషను లోకి ప్రవేశించాడు.
అక్కడింకా పోలీసు బాబాయిలు మేలుకో లేదు. మేలుకునే ఉన్నా,  అంటే,  ఉత్త బాబాయిల్లా గానే ఉన్నారు.
కానీ, పోలీసు బాబాయిల్లా లేరన్న మాట.
అంచేత, ఏం కావాలి బాబూ ! అనడిగేరు లాలనగా.
‘‘ కంప్లయంటు ఇవ్వడానికి వచ్చానండీ’’ అన్నాడు వీడు.
‘‘ మీ నాన్న మీదా ?’’
‘‘ కాదండీ ...’’
‘‘ మీ అమ్మ మీదా ?‘‘
‘‘ కాదండీ ..’’
‘‘ పోనీ, ఇంకెవరయినా మీ ఇంట్లో వాళ్ళ మీదా ? లేక మీ పక్కింటి అంకుల్ గారి మీదా ’’
’’ఉహూఁ !  కాదండీ ...’’
‘‘ నీ జేబులో అయిదు పైసల బిళ్ళ పోయిందా ?’’ చివరి ప్రయత్నంగా కొంచెం లాలనగానే అడిగాడు పో.బా.
‘‘ కాదండీ ..’’ అంటూ, ఎందుకయినా మంచిదని నిక్కరు జేబు ఓసారి తడిమి చూసుకున్నాడు మా తింగరి బుచ్చి గాడు.
అప్పటికి పోలీసు  బాబాయిలో నిజమైన పోలీసు బద్ధకంగా నిద్ర లేచాడు.
‘‘ మరెవరి మీదరా నా కొడకా  ?’’ విసుగ్గా అడిగేడు. అయినా, ముద్దుగానే అడిగాడు. మన వాడికి  కాళ్ళలో సన్నని వణుకు మొదలయింది.
’’ మా బడి దగ్గర గోడౌన్ వాళ్ళ మీదండీ ....వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు ...’’అన్నాడు, ఎలాగో కొంచెం ధైర్యం చిక్కబట్టుకొని.
పో.బా కి ఓ క్షణం తను  ఏం విన్నాడో అర్ధం కాలేదు.
‘‘ సరేలే ... నువ్వు మీ ఇంటికి పోయి, మీ పెద్ద వాళ్ళు ఎవరి నయినా పంపించు. వాళ్ళొచ్చి రిపోర్టు ఇస్తారు ’’ అన్నాడు.
‘‘ వాళ్ళకంత సామాజిక స్పృహ  లేదండీ !’’ అన్నాడు టక్కున మా తింగరి బుచ్చిగాడు.

ఈ సారి పోలీసు బాబాయిలందరికీ నిజంగానే మతి పోయింది ! కాసేపు మాట పడి పోయింది.

‘‘ సరేలే, పద ...ఓయ్, 110 నువ్వు వీడి వెంట వెళ్ళి ఆ సంగతేమిటో చూడు ...’’ అన్నాడొక పెద్ద పో.బా.

తింగరి బుచ్చి గాడికి ఏనుగు నెక్కి నంత సంబర మనిపించింది.

110 పో.బా తనని తన సైకిలు వెనుక కూర్చుండ పెట్టుకొని తొక్కడం వాడికి మరింత గర్వ మనిపించింది. 




సామాజిక స్పృహ ఉండడం వల్ల ఎంత గౌరవమో కదా అనుకున్నాడు.

పో.బా ని మన వాడు నేరుగా గోడౌను లోకి తీసుకు వెళ్ళి అక్కడ దొంతరలుగా ఉన్న చేకు బేళ్ళను చూపించాడు.
‘‘ ఇక్కడ ఎన్ని బేళ్ళు ఉన్నాయో చూసారు కదండీ ...’’
‘‘అయితే ? ...’’ బిక్క మొహంతో అడిగాడు పో.బా.
‘‘ రండి చెబుతాను.’’ అని పో.బా ను మా తింగరి బుచ్చి గాడు గోడౌను గేటు వెలుపలి గోడ దగ్గరకు తీసుకు వచ్చాడు. అక్కడ గోడ మీద రాసి ఉన్న అక్షరాలు చదవమన్నాడు.

పో.బా కూడ బలుక్కో కుండానే వీజీగానే చదివేసాడు :  ‘‘STICK NO BILLS  ... ’’
అప్పుడు మా తింగరి బుచ్చి గాడు విజయ గర్వంతో తల ఎగరేస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. ‘‘ చూసారా సారూ ? గోడౌన్ లోపల అంత స్టాకు ఉంచుకొని , ఇక్కడ చేకు బేళ్ళు స్టాకు లేవని బోర్డు పెట్టారు. ఇది దొంగ వ్యాపారమే కదా ? మీరు వీళ్ళని జైల్లో పెట్టాలి.’’ అన్నాడు .

పో.బా కి తల తిరిగి, మూర్ఛ వచ్చినంత పనయింది. పోలీసు ఉద్యోగం వదిలేసి ఎక్కడి కయినా పోవాలన్నంత విరక్తి  కలిగింది.

Stick no bills  అనే బోర్డుని మా తింగరి బుచ్చి గాడు తన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని ఉపయోగించి,కూడ బలుక్కొని,  
 ‘‘ స్టాక్ నో బేల్స్   ’’ అని చదువు తున్నాడని అర్ధం కావడానికి  అతనికి  కొంత సేపు పట్టింది. అతనా షాకు నుండి తేరుకునే లోపల మా తింగరి బుచ్చిగాడు ‘‘ మీకు సామాజిక స్పృహ  కానీ ఉంటే వెంటనే ఈ దొంగ వ్యాపారులను జైల్లో పెట్టాలి ! ’’ అని   ఒకటే సతాయిస్తున్నాడు.

పోలీసు బాబాయి ‘‘ సరే ... సరే ..నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, వీళ్ళందరినీ నేను జైల్లో పెడతానుగా ! ’’ అన్నాడు.

విజయ గర్వంతో విజిలు వేస్తూ మా తింగరి బుచ్చి గాడు  జారి పోతున్న నిక్కరును మీదకి లాక్కుంటూ ఇంటి ముఖం పట్టాడు.

వాడు నాలుగడుగులు వేసాడో లేదో, వెనుక నుంచి ’’ మళ్ళీ మా పోలీసే స్టేషను వేపు వచ్చావంటే ముందు నిన్ను బొక్కలో పడేసి మక్కలు విరిచేస్తాను జాగ్రత్త ! ’’ అన్న పో.బా. మాటలు వినిపించి వాడి నిక్కరు తడిసి పోయింది.   అవి పో.బా. తనని గురించి అన్న మాటలేనని వాడు వెనక్కి తిరగ నక్కర లేకుండానే పోల్చుకున్నాడు.


 అంతే ! ... ఇల్లు చేరే వరకూ పరుగో ... పరుగు !  పరుగో, పరుగు !!

ఇదండీ మా తింగరి బుచ్చిగాడి సామాజిక స్పృహ అను ఇంగ్లీషు పాండిత్యం !



ఇది నిజంగా జరిగిందంటే మీరు నమ్ముతారా ?














29, ఏప్రిల్ 2012, ఆదివారం

తగునా ఇది నీకూ ? ( పెద్దలకు మాత్రమే )


యుక్తం కిం తవ శర్వరీశ ముఖ  మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా  వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు.

భావం:
‘‘ఓ అందగాడా  నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’
‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’
‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’


21, ఏప్రిల్ 2012, శనివారం

పన్నగ ధారీ ! నగ ధారీ !!


ఈ శ్లోకం చూడండి:

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశి ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.

ఈశ్లోకంలో కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ  వచ్చేలా రచించాడు.
ముందుగా శివ పరమయిన అర్ధం చూదాం.


శివ పరంగా అర్ధం చెప్పు కునేటప్పుడు శ్లోకం లో పదచ్ఛేదం ఇలా ఉంటుంది:

పన్నగధారి,  కరాగ్ర:,  గంగా, ఉమా లక్షిత:,   గదా, అగ్ర భుజ:,  శశి ఖండ శేఖర:,   ఉమా పరిగ్రహ:,  అనాది:, ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

పన్నగధారి:, గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:, అనాది: , మహు:, త్వామ్ అవతు !

భావం: చేతలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతులు ప్రియ నాథుడూ, భుజాల మీద చక్కని బాహుపురులూ, బంగారు ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన వాడూ , పార్వతీ దేవిని తన అర్ధాంగిగా పొందిన వాడూ, పుట్టుకే లేని అభవుడూ అమిన పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడు గాక !

కవి ఈ శ్లోకంలో శివుడికి  ఈ విశేషాణాలు వేసాడు.
 పన్నగధారి                                     =    పామును ధరించిన వాడు
గంగో మా లక్ష్మిత: = గంగా = ఉమా లక్షిత:    =    గంగా పార్వతులచే కోరబడిన వాడు
అగదోగ్ర భుజ:                                  =    భుజాల మీద బాహుపురులు,                                         
                                                        స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర:                                  =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                  =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                           =     పుట్టుక లేని వాడు
మహు:, త్వామ్ అవతు                        =      సదా   మిమ్ము కాపాడు గాక !     

ఇక, శ్లోకం లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కోవాలంటే, కవి శివుడికి వేసినట్టుగా చెప్పిన విశేషణ పదాలలోని తొలి అక్షరాలను తొలిగించి చదువు కోవాలి !


విశేషణాలలోని తొలి అక్షరాలు తొలిగిస్తే,  పదచ్ఛేదం ఇలా ఉంటుంది:

నగధారి, కరాగ్ర: ,  గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:, శిఖండ శేఖర:,  మా, పరిగ్రహ: , అనాది: , ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

కరాగ్ర:, నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ: , అనాది: , త్వామ్, ముహు:, అవతు.

కరాగ్ర: నగధారి            =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గో                           =      ఆవుల చేత,
మా                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                      =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ దేవికి ప్రభువు
                                     అయిన వాడు )
గద: అగ్ర భుజ:            =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు
శిఖండ శేఖర:             =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు
మా                          =      లక్షీ దేవిని
పరిగ్రహ:                     =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                      =      ( మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన అర్ధమగు) విష్ణువు
                                     పుట్టుక లేని వాడు అయిన విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !

భావం:  గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ,  గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన గదనూ, తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమా పతీ అయిన వాడూ, పుట్టుక లేని వాడూ అయిన శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !
   


20, ఏప్రిల్ 2012, శుక్రవారం

పరాకేలనోయి ప్రభూ !


ఈ అందమయిన భావ చిత్రణ చూడండి:

రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా మంధాన మా కలయతి దధి రిక్త భాండే

తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి: దేవో2పి దోహన థియా వృషభం నిరుంధన్ !

భావం: రాథ మనసంతా శ్రీకృష్ణుని మీదే ఉంది. పరవశయై ఉంది. అలా శ్రీకృష్ణుని మీద లగ్న చిత్త అయిన రాథ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోంది !

కృష్ణుడికి అప్పుడు ఆవుల పాలు పితికే వేళయింది. అతని చూపంతా రాథ మీదే ఉంది. ఆమె వక్షోజ సౌందర్యాన్నే చూస్తూ పరవశించి పోయి ఉన్నాడేమో, పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధనాలు వేస్తున్నాడు !

(చిత్రంలో కృష్ణుడి చేష్టలు సరిగానే ఉన్నాయి. మరక్కడ అప్పుడు రాథ లేదు కాబోలు..)