31, మే 2015, ఆదివారం

పొటిగరాప్పంతులు ( జూ ) తో మాటా మంతీ ...

ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు.
కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా?
సాన్దీ గిరీశమూ కలిసి తీయించుకున్న ఫొటోల డబ్బులు వసూలు చేసుకుని రమ్మని వాడిని పంతులు పంపిస్తాడు.
నేను కలిసింది ఆ పొటిగరాప్పంతులు గారి మనవడిని. పొటిగరాప్పంతులు, జూనియర్ నన్న మాట.
‘‘పొటిగరాప్పంతులూ ఎలా ఉన్నావెలా ఉన్నావ్’’ అనడిగేను.
‘‘ ఏం ఉండడంలే, ఏదో, యిలా ...’’ అన్నాడు.
‘‘ అదేం ? ’’
‘‘ మా తాత గారు కాలం చేసే వరకూ గిరీశం గారి బాకీ కోసం మనుషులని పంపించీ, తను కాళ్ళరిగేలా తిరిగీ కూడా ఆ బాకీ రాబట్టుకో లేక పోయేరు. వారి తదనంతరం మా తండ్రి గారూ . తర్వాత నేనూ, కనీసం గరీశం గారి మనవళ్ళెవరయినా కనిపించక పోతారా, వారి తాత గారివ్వాలిసిన బాకీ తీర్చక పోతారా అనే ఆశతో ఇలా విజనగరం వీధులంట తెగ తిరుగుతున్నాను..‘‘
‘‘ ఎవరూ కనిపించ లేదూ?’’
‘‘ కనిపించకేం. కానీ అందరూ ఆ తాత గారి చందమే‘‘
‘‘అదేమిటి?’’
‘‘ అందరూ దాదాపు గిరీశం గార్లాంటి వాళ్ళే తయారయేరు. సానుల్తో ఫొటోలు దిగడం, డబ్బుల కోసం మనిషిని పంపిస్తే ఏవో మాయ మాటలు చెప్పి తప్పించు కోవడం ... పైగా గాయత్రి మీద ప్రమాణాలు చెయ్యడమొకటీ ... బిజినెస్సు దివాళా తీసిందనుకో’’ అన్నాడు విచారంగా.
పాపం. అనుకున్నాను. పొటిగరాప్పంతులు పంపిన మనిషికి టోకరా ఇచ్చి, గిరీశం , శిఫ్యడు వేంకటేశంతో ఆ బడుద్ధాయికి చదువు చెప్పే నెపంతో ఉడాయించడం ..... క్రిష్ణరాయపురం అగ్రహారం వెళ్ళిఅగ్ని హోత్రావధాన్లు ఇంట తిష్ఠ వేయడం..... అన్నీ గుర్తొచ్చాయి,
‘‘ సరే కానీ, విజయ నగరం అందాలు చూపించే ఫొటోలు ఏవయినా ఉంటే ఇద్దూ, మా బ్లాగు మిత్రులకి చూపిస్తాను’’ అనడిగేను.
‘‘ బ్లాగా ? అంటే ...? ’’ అనడిగేడు అనుమానంగా.
‘‘ దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ, ముందు ఫొటోలుంటే ఇవ్వు’’
‘‘సరేలే, నీ ఏడుపేదో నువ్వుఏడువ్. ఏవో కొన్ని ఫొటోలున్నట్టున్నాయి. ఇస్తాను తీసికెళ్ళి ఎలా తగలడతావో నీ ఇష్టం.
ముందు నాకో మాంఛి చుట్ట పీక ఉంటే ఇలా పారెయ్‘‘
‘‘ చుట్ట లేదు కానీ, కింగ్ సైజు ఫిల్టరు సిగరెట్టుంది, కాల్చు’’ అంటూ ఓ సిగరెట్టూ, అగ్గి పెట్టె అందించాను.
చీదరగా ముఖం పెట్టాడు పంతులు.
‘‘ చుట్ట లేదూ? గురజాడ వారు మా గిరీశం నోటంట చుట్ట మాహాత్మ్యం గురించి ఎంత గొప్పగా చెప్పారో అప్పుడే మరిచి పోయేరా వెధవ కక్కకట్టల్లారా.... ’’ అంటూ అయిష్టంగానే సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి వదిలేడు.
‘‘ మరి నేనడిగిన ఫొటోలో?’’
‘‘ నీ అమ్మ కడుపు కాల. వదలేలా లేవురా. సరే నా దగ్గర కొన్ని ఫొటోలేవో ఉన్నట్టున్నాయి. ఇస్తాను. అప్పటి విజయనగరం కాదురా తండ్రీ. చాలా మారి పోయింది. పండు ముత్తయిదువులా ఎంత బాగుండేదని ... ఇప్పటి రూపంలో మన విజయ నగరాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కు పోతుందిరా బాబూ ....నువ్వే చూడు ...’’ అంటూ కొన్ని ఫోటోలు అందించేడు.
ఆత్రంగా వాటినందుకుని, గబగబా చూసేను. ‘‘ అవునూ, ఇంకా చాలా స్థలాలకి చెందిన ఫొటోలు ఉండాలే , ఏవీ,
చా.సో గారి హవేలీ , మచ్చ కొండా, కొట లోని రౌండ్ మహల్, మోతీ మహల్, పెద్ద చెరువు గట్టు మీద రాజుల విగ్రహాలూ, ఏనుగుల తోటా, నారాయణ దాసు గారూ, ద్వారం వారూ, కోడి రామ్మూర్తి గారూ నివసించిన ఇళ్ళూ, వ్యాయామశాల, పూల్ బాగ్, , బాబా మెట్ట , దివాన్ గారి మేడ, రాజారావు మేడ, అంబటి సత్రం, అయ్య కోనేరు గట్టున వెలసిన వేంకటేశ్వర స్వామి వారి చిన్న గుడీ. చిన్న ఆంజనేయ స్వామి వారి కోవెలా, లంక వీధి, కానుకుర్తి వారి సత్రం, అయోధ్యా మైదానం,, రాజు గారి సాని సింహాచలం మేడ ... ఇవన్నీ ఏవీ ? ’’ అడిగేను.
‘‘ నీ ముఖం తగలెయ్య. పైసా విదల్చకుండా ఫొటోలన్నీ దొబ్బుకు పోతూ, మళ్ళీ అవి లేవు, ఇవి లేవు అంటూ సణుగుడొకటా.? ఇప్పటికి ఉన్నవి తీసికెళ్ళు. ఈ సారి మిగతావి దొరికితే ఇస్తానులే. సరే కానీ, ఈ సారి వచ్చి నప్పుడు మంచి చుట్టల కట్ట తేవడం మాత్రం మరిచి పోవద్దు సుమీ....ఇక వెళ్ళు ఆ గిరీశం ఎలానూ ఇక దొరకడు. కనీసం వాడి మనవలో, మునిమనవలో కనిపిస్తారేమో చూడాలి. మా తాత గారు తీసిన పుటిగరాపుల బాకీ వసూలు చేసుకోవద్దూ? అసలప్పుడే మా తాత గారు సౌజన్యారావు పంతులు గారిని కలిసి ఆ గిరీశం మీద దావా పడేద్దామనుకున్నారట కానీ, విశాఖ పట్నం వెళ్ళి రావడానికి ఛార్జీలు లేక ఉండి పోయార్ట. .. సరేలే, వెళ్ళిరా ...’’ అంటూ జనంలో కలిసి పోయేడు.
ప్రవాహంలా సాగి పోతున్న అ జన వాహినిలో ఈ జూనియర్ పుటిగరాప్పంతులుకి వందలాది, వేలాది గిరీశంలాటి వాళ్ళు కనిపిస్తారు.
గిరీశం నేర్పించి పోయిన టక్కరి విద్యలు ఉపయోగించి పంతులుని లాఘవంగా బురిడీ కొట్టించి చక్కా పోతారు.
పంచె కట్టు మానీసి, ఫేంటూ చొక్కాలతో లుబ్ధావధాన్లూ, కరటక శాస్త్రీ , అగ్ని హోత్రావధాన్లూ వగైరాలు కాని ,
వాళ్ళ లాంటి వారు కానీ, కూడా కనిపించ వొచ్చును.
సౌజన్యారావు పంతులు కనిపించడు. కనీసం అలాంటి మహానుభావులూ కనిపించరు.
ఇక మధుర వాణి సంగతంటారా? అక్కడే కాదు యావద్దేశంలోనూ, ఆ మాట కొప్తే యావత్ ప్రపంచం లోనూ పొటిగరాప్పంతులకే కాదు, అసలు ఎవరికీ మరి కనిపించదు. ఎందుకంటే ఆవిడ గురజాడ వారి కాళ్ళొత్తుతూ
ఏ స్వర్గంలోనో అంత గొప్ప పాత్రగా తనని తీర్చి దిద్దిన ఆ మహా రచయిత ఋణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ....
మరింక పుటిగరాప్పంతులు (జూ) ఇచ్చిన ఫొటోలు చూడండి .......
మహా రాజా వారి కోట. ఇందులోనే రౌండ్ మహల్, మోతీ మహల్ వగైరా భవనాలు ఉన్నాయి. ఇప్పుడీ కోట లోని భవనాలన్నీ రాజుల వితరణ త తో విద్యాసంస్థలకు నెలవులయి విలిసిల్లుతున్నాయి.

ఈ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొదటి అంకం లోని మొదటి స్థలం ఇదే. బొంకుల రాయడు గరీశం బొంకుల దిబ్బ దగ్గరే నాటకంలో తొలి సారిగా కనిపిస్తాడు..ఇప్పుడీ ఖాళీ జాగాలో కూరగాయల మార్కెట్టు ఉంది.

దీనిని మూడు లాంతర్ల జంక్షన్ అంటారు. నిజానికిది నాలుగు రోడ్ల కూడలి కాదు. ఇక్కడ మూడు రోడ్ల కూడలి ఉంది. ఒకటి కస్పా బజారు మీదుగా కోట వేపు వెళ్ళే రోడ్డు కాగా, దానికి ఎదురుగా అంబటి సత్రం, పూల్ బాగ్లకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇక, మూడులాంతర్లకి ఎదురుగా పోయే రోడ్డు లో మొదట్లోనే అమ్మ వారి గుడీ, అది దాటేక గంట స్థంభం వస్తాయి. ఆ దారి తిన్నగా రైల్వే స్టేషన్కి దారితీస్తుంది. గంటస్థంభం నుండి మధ్యలో ఎడమ వేపు తిరిగితే పెద్ద చెరువు, రాజుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఈ మూడు లాంతర్లు మూడు సింహం బొమ్మలు. వాటి మీద ఒకప్పుడు చవురు దీపాలను వెలిగించే వారుట. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ దీపాలూ ఉండేవి. ఇప్పుడా దీపాలూ లేవు. ఆ వెలుగులూ లేవు. ఒకప్నపుడు రోడ్డుకి ఎత్తుగా మూడు మెట్లతో ఉండే ఈ కట్టడం , రోడ్డు మందంగా బలియడం వల్ల కురచగా మారి పోయింది.
మహా కవి గురజాడ . ఈ విగ్రహం గురజాడ స్మారక గ్రంథాలయం ఆవరణలో ఉంది.
ఇదే అయ్య కోనేరు. కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలో పొటిగరాప్పంతులు మనిషి గిరీశం నుండి అతనూ మధురవాణీ తీయించుకున్న ఫొటోల బాకీ డబ్బులు అడగాడానికి వస్తే, గరీశం వినబడనట్టు నటిస్తూ, ‘ అయ్యకోనేటికి తోవ ఇదే’ అంటాడు కదూ? ఆ అయ్య కోనేరు ఇదే.
విజయనగర ప్రభువులు పితృకర్మలు ఇక్కడ చేసే వారట. 1980 వరకూ అనుకుంటాను, దానికి చెందిన శిధిల కట్టడాలు ఇక్కడ కనిపించేవి.
ఈ కట్టడాన్ని గుమ్చీ అంటారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఇక్కడ హరి కథలు చెప్పే వారు.
విజనగర రాజుల పరమత సహనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ దర్గా కోటకు అతి సమీపంలో కస్పా బజారుకి వెళ్ళే దారిలో ఉంది.
ఇది కోటకీ, బొంకుల దిబ్బకీ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముద్దుగా ప్యారిస్ కార్నర్ అని పిలుచుకుంటూ
రోజూ సాయంత్రాల వేళ కవులూ, రచయితలూ కబుర్లతో సందడి చేస్తూ ఉండే వారు.

ఈ మూడు కోవెళ్ళ లోనే దాసు గారు తరచుగా హరి కథలు చెప్పే వారు.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల. ఇక్కడ వేద పాఠశాల, భాషా ప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వ్యాకరణ విద్యాప్రవీణ కోర్సలు నిర్వహించే ప్రాచ్య కళాశాల, ఉన్నత పాఠశాల, ఉన్నాయి. దేశం గర్వించే మహా పండితులు మెసలిన చోటు,
ఇది విజయనగర ప్రభువులు నిర్మించి అవిఘ్నంగా నిర్వహిస్తున్న విద్యార్ధి ఉచిత భోజన శాల.
సింహాచల దేవస్థానం చౌలటరీ అంటారు. ఏళ్ళ తరబడి రోజూ వందలాది విద్యార్ధులకి ఉచితంగా కమ్మని భోజనాన్ని సమకూరుస్తూ వారి విద్యాభ్యాసం కుంటు పడకుండా కాపాడుతున్న చల్లని తల్లి.

విజయగరం ప్రభుత్వ మహా రాజ సంగీత కళాశాల.
ద్వారం నాయుడు గారి లాంటి సంగీత దిగ్దంతులు నడయాడిన చోటు. ఘంటసాల సంగీత సాధన జరిగింది ఇక్కడే.

అయ్య కోనేరు తూర్పు గట్టున వెలసిన పెద్ద ఆంజనేయ స్వామి వారి కోవెల.

కోట వెనుక భాగం. కందకం

రాజా వారి డిగ్రీ కళాశాల. గురజాడ చదివినదీ, ఉద్యోగం చేసినదీ ఇక్కడే
గంటస్థంభం. విజనగరానికి ఇది తలమానికం.
పెద్ద చెరువు. వేలాది ఎకరాల నేలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఓ సారి తమ విజయనగర అనుభవాలను స్మరించుకుంటూ , విజయగరంలోని ఒక్కో ప్రదేశాన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు:
‘‘విజయనగరంలో నాకన్నీ ఇష్టం. చివరకి పెద్ద చెరువులో దోమలు కూడా. ’’ అని.
ఈ పెద్ద చెరువు దగ్గర దోమల మందిరం అని ఒకటుండేది. అక్కడ దోమలు ఎక్కవగా ఉండే రోజులలో దాదాపు ఒక నెల రోజుల పాటు పాఠశాలలకి ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే వారుట.
శ్రీ పైడితల్లి అమ్మ వారి గుడి. విజయనగర రాజుల ఇల వేలుపు. ఏటా విధిగా జరిగే అమ్మ వారి పండుగలో సిరిమానోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ.
అమ్మ వారికి చెందిన తొలి గుడి విజయ నగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. వనం గుడి అని ఆ గుడికి పేరు.
కన్యాశుల్కం, ముత్యాల సరాలు, తెలుగు తొలి కథ దిద్దుబాటు మొదలయిన గురజాడ రచనలు జాతి నోముల ఫలంగా వెలుగు చూసిన చోటు ఇదే
గుమ్చీ ఈ ప్రక్కగా వెళ్తే శంకర మఠం వస్తుంది. కౌముదీ పరిషత్తు తొలి రోజుల కార్యక్రమాలు అక్కడే జరిగేవిట.


ఇవీ జూనియర్ పొటిగరాప్పంతులు నాకిచ్చిన ఫొటోలు. మరోసారి అతను మిగతా ప్రదేశాల ఫోటోలు ఇచ్చాక మీముందు పెడతాను.
ఈ లోగా అతని కోసం మంచి చుట్టలు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేయాలి. మరి ఉంటాను.

















29, మే 2015, శుక్రవారం

తెలుగు సాంఘిక నాటక రంగచరిత్రను మహోజ్జ్వలమైన మలుపు త్రిప్ప బోయి చతికిల పడ్డ వొకానొక నాటకం విశేషాలు ( లేక ) జోరా మేషారి నటనా ప్రతిభ !

నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...

విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ చేసుకునే వాళ్ళం. చివర్లో మూడు నాలుగేళ్ళపాటు కాలేజీ, హైస్కూలూ విడి పోయినా, పని వేళలలో మాత్రం మార్పు లేదు.

సరే, దీనికేం గానీ, సాలూరి ప్రజలు మమ్మల్ని ఎంతగా ప్రేమించే వారంటే, మాలో చాలా మందిమి, ముఖ్యంగా హైస్కూలు టీచర్లం సాలూరు వచ్చేక మరి కదిలే వారం కాము. ఎవళం పది పన్నెండు ఏళ్ళకి తక్కువ అక్కడ పని చేయ లేదు, అందరిలోకీ నేను మరింత సుదీర్ఘ కాలం పని చేయడం వల్లనూ, కథలూ కాకర కాయలూ రాసే వాడిని కనుకనూ, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడిని కావడం చేతనూ నన్ను మా సాలూరి వాళ్ళు మరింతగా అక్కున చేర్చు కున్నారు. అందుకే అక్కడి నుండి 24వ ఏట ట్రాన్సఫర్ అయి వెళ్ళి పోతూ ‘‘ మంచి గంధము సాలూరి మంచి తనము ’’ అన్నాను. ఇందులో రవంత అతిశయోక్తి లేదండీ.

ఆరుద్ర నవరసాలూరు సాలూరు ! అన్నారు. సాలూరి రాజేశ్వరరావూ , ఘంటసాల మాష్టారూ. సాలూరి చిన గురువు గారూ ఆ మట్టి వాసన పీల్చిన వారే కదా !

ఆ రోజుల్లో మా విద్యా సంస్థ ప్రతియేడూ ఠంచనుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేది.

మా మినిష్టీరియల్ స్టాఫ్ లో చుక్కా దంతేశ్వర రావు అని ఒకాయన జూనియర్ అసిస్టెంట్ ఉండే వారు. అయనకు నాటకానుభవం మెండు. మంచి నటులు, పరిషత్ పోటీలలో కూడా చాలా బహుమతులు గెల్చకున్ననటులు. ఓ ఏడాది మా మేష్టర్లతో ఓ నాటిక కాలేజీ వార్షికోత్సవంలో వేసి తీరాలని పట్టు బట్టేరు. నాటిక పేరు ఇప్పుడు నాకు గుర్తు లేదు. కాలేజీ స్టాఫ్ నుండీ, హైస్కూలు సిబ్బంది నుండీ, ఆఫీసు సిబ్బంది నుండీ నటులను ఎన్నిక చేయడం జరిగింది. అంతా ఉత్సహంగా ముందు కొచ్చేరు.

‘‘ జోరా మేషారూ ! మీరూ ఓ వేషం వేసి తీరాలండీ ’’ అన్నాడు మా దంతేశ్వరరావు.

నా పేరు అసలే చాలా కురచ. నాలుగే అక్షరాలు . జో –గా – రా – వు. అంతే ! దానిని మా మేష్టర్లు మరింత కుదించి, జోరా మేషారూ అని పిలిచే వారు. నా పేరులో రెండక్షరాలు ఎలాగూ మింగేస్తున్నారాయె ! కనీసం మేష్టారులో ష కింద ట కూడా తినెయ్యాలా చెప్పండి అనేవాడిని.

ఎవరూ వినేవాళ్ళు కారు. నేను ఎప్పటికీ వాళ్ళకి జోరా మేషారినే.

‘‘ పోదూ, నేను వేషం వెయ్యడ మేఁవిటి ?’’ అన్నాను.

‘‘ మీరు వెయ్యందే మేమూ వెయ్యం, మీరు కాదంటే ప్రన్సిపాల్ గారితో చెప్పించి మరీ ఒప్పిస్తాం ’’ అని ముద్దుగా బెదిరించేరు.

‘‘ ఆ డైలాగులూ అవీ బట్టీ పట్టడం నా వల్ల కాదు. అదీ కాక మీకు తెలుసు కదా. నాకు మతి మరపు జాస్తి. ఏ డైలాగు తరువాత ఏది చెప్పాలో నాకు గుర్తుండి చావదు. నామానాన నన్నొదిలేద్దురూ ! ’’ అన్నాను.

అదేం కుదర్దు అన్నారంతా. ఏపుగా ఉంటారు కదా ఎస్ ఐ వేషం వెయ్య మన్నారు. నాటిక చూసేను. ఆ పాత్రకు డైలాగులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా వల్ల కాదు పొమ్మన్నాను. ఓ బంట్రోతు పాత్ర చాలా తక్కువ డైలాగులతో ఉన్నట్టుంది. అదయితే చేస్తానన్నాను.

‘‘ అదా ! పెద్దవాళ్ళు ... మీకు బావోదేమో ’’ అన్నాడు.

‘‘‘‘ నటన ప్రథానం కానీ వేషంతో పనేమి ’’ టన్నాను ఏదో తెలిసినట్టు.

‘‘ఏదో, మీరూ మాతో పాటే స్టేజీ ఎక్కుతున్నారు. అదే చాలు ’’అని అంతా సరే అన్నారు.

అందులో నావి మొత్తం ఆరు డైలాగులు.

1. చిత్తం

2. చిత్తం బాబయ్యా

3. చిత్తం ..అలాగే నండయ్యా, అలాగే కానియ్యండి

4. చిత్తం ... చిత్తం

5. చిత్తం ..అలా అనకండయ్యా ...

6. చిత్తం .. దండాలయ్యా.

సరిగ్గా ఇవే కాక పోవచ్చును కానీ, దాదాపు ఇవే పొడిమాటలు.

మరో సౌలభ్యం ఏమిటంటే, ఇవన్నీ వేరు వేరు చోట్ల ఒకేనటుడితో, అదే ఇంటి యజమాని వేషం వేస్తున్న మా దంతేశ్వరరావుతో నేను అనాల్సిన డైలాగులు.

‘‘ మొత్తం ఆరు చిత్తాలున్నాయి. ఏవి ఎక్కడ అనాలో గుర్తుకు రాక పోతే నన్నేం అనకూడదు. ’’ అని ముందే చెప్పాను.

నాటకం మొదలయింది. మేష్టర్లు నాటిక వేస్తున్నారని చెప్పి సాలూరి జనం విరగబడి పోయేరు.

నాపని రంగస్థలం మీదున్న బల్లలనీ వాటినీ తుడుస్తూ ఉండడమే

‘‘ జోరా మేషారూ ! ... జోరా మేషారూ ! ’’ అంటూ మా పిల్లలూ, ప్రేక్షకులూ ఒకటే చప్పట్లు. నాలో నటుడు పెట్రేగి పోయేడు. గబగబా అన్నింటినీ తుడిచేస్తూ వీర లెవెల్లో నటించేస్తున్నాను.

నాటిక మేం ఎంత ఛండాలంగా వేసినా, ఇక్కడి జనాలు అల్లరి చెయ్యరనీ, పైపెచ్చు సరదాగా చూస్తారనీ తెలిసి పోయేక ఇక నాకు ధైర్యం వచ్చీసింది.

ఆరు చిత్తాలు కాస్త పదిహేను ఇరవై చిత్తాలు వరకూ పెరిగి పోయేయి. లెక్క చూసుకో లేదు. సరదా పుట్టి నప్పుడల్లా చిత్తం అనేస్తున్నాను. నాలోని నటుడ్ని ఎవరూ ఆప లేక పోయేరు.

ఒక చోట టేబిలు మీద ఉన్న టెలి ఫోన్ ని రిసీవర్ మీదకెత్తి తుండు గుడ్డతో తుడుస్తున్నాను. . ఆ సన్నివేసంలో ఇంటి యజమానికి ఒక ముఖ్యమైన పోన్ కాల్ రావాలి. ఆ ఫోన్ కాల్ కథని మలుపు తిప్పుతుంది. రిసీవర్ ని మీదకెత్తి తుడుస్తూ ఎంతకీ క్రెడిల్ చేయడం లేదు నేను. నౌకరు పాత్రలో జీవించేస్తున్నాను. మా దంతి ‘‘ ఫోను పెట్టండి జోరా మేషారూ ’’ అని సైగలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకి నేను రిసీవరు పెట్టకుండానే తెర వెనుక నుండి కాలింగ్ బెల్ మ్రోగడం, నా చేతిలోని రిసీవరుని మా దంతేశ్వర రావు అందు కోవడం జరిగి పోయేయి. అంతా ఒకటే నవ్వులే నవ్వులు !

‘‘ నేనింక ఈ బాధలు పడ లేనురా ... ఏ రైలు కిందో తల పెట్టీవాలనుందిరా ... ’’ అని ఇంటి యజమానిగా మా దంతి డైలాగుకి ... నేను  ‘‘ అలా అనకండయ్యా ...’’ అనే డైలాగు చెప్పడానికి బదులు ... మరో చోట చెప్పాల్సిన ‘‘ చిత్తం ... అలాగేనండయ్యా ... అలాగే కానియ్యండి ... ’’ అనీసేను.!

దాంతో మా దంతి తెల్ల బోవడం, జనాలు కేరింతలు కొట్టడం ... మరడక్కండి ...

మొత్తం మా మేష్టర్ల నాటిక రసాభాసగా ముగిసింది.

వెన్న పూసలాంటి మనసున్న మా సాలూరి జనాలకి అదేమీ పట్ట లేదు. మేం నాటిక వేయడమే చాలునన్నంతగా ముచ్చట పడి పోయేరు.

ఇలా జరిగింది నా నాటక రంగ ప్రవేశం. మరెప్పుడూ నటుడిగా స్టేజి ఎక్కింది లేదు. అందు వల్ల తెలుగు నాటక రంగం ఇప్పటిదాకా బతికి బట్ట కట్టిందను కుంటాను.





స్వస్తి.

27, మే 2015, బుధవారం

ఎర్ర డబ్బా ఆకలి కేకలు !



ఎర్రగా బుర్రగాకొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?
నగరాల్లోపట్నాలలోపల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులుకవర్లుఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చినా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరిఅక్కడ ముద్రలు వేయించుకునిఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలోబస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళిఅవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.


ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవికబుర్లు చెప్పేవినిష్టూరాలు పలికేవినిందలు వేసేవిసాయం కోరేవిఅభయం యిచ్చేవిధైర్యం చెప్పేవిబెంగలుబాధలుచికాకులుకష్టాలు కలబోసుకునేవికన్నీళ్ళు కార్చేవినవ్వుతూ కళకళ లాడేవి ... ...
కొన్ని మృదువుగాకొన్ని కఠినంగాకొన్ని క్లుప్తంగాకొన్ని సుదీర్ఘంగామరి కొన్ని పెళుసుగాకుండ బద్దలు కొట్టి నట్టుగాహెచ్చరికలుఓదార్పులుమంతనాలుహిత వచనాలువేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...
శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .
కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.
కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...
ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.
మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.
ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?
లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?
నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.
ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...
ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనోపూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.
సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.
అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..
అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.

చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.
నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?

23, మే 2015, శనివారం

మరీ ఇంత అన్యాయమా ! అన బడు వొక జుత్తుల పోలిగాని వ్యథ !

ఈ కథామంజరి నస బ్లాగు ఉంది చూసారూ దాని ఓనరు పరమ పిసినారి సుమండీ. ఏడాదిగా అతని దగ్గర ఎంతో వినయంగా పని చేస్తున్నాను. ఒళ్ళు దాచుకో కుండా పని చేస్తున్నాను. ఒళ్ళు హూనం చేసుకొని అతని ఇంటిని శుభ్రం చేసే చాకిరీ నాదే. రోజూ వాడి ఇంటిని శుభ్రం చేసే పని నాదే. చేసేది వాడే అయినా నన్నుఉపయోగించు కుంటున్నాడు కనుక నేనే ఆ చాకిరీ అంతా చేస్తున్నట్టు లెఖ్ఖ కదా ! ఇంత చాకిరీ వాడి కోసం చేసినా వాడు నామీద రవంత ప్రేమ కూడా చూపించడు.
పనంతా అయ్యేక దులిపి ప్రక్కకి విసిరేస్తాడు. నన్నసలు మళ్ళీ వాడి అవసరం వచ్చే వరకూ తాకనయినా తాకడు.
సరే వాడి పాపాన వాడు పోతాడులే.
ఈ మధ్య జుత్తు బాగా పెరిగి పోయి ఒకటే చిరాగ్గా ఉంది. నన్ను చూస్తూనే‘‘ తలమాసిన వెధవా’’ అంటూ తిడుతున్నాడు. నాకు ఒళ్ళు మండి పోతోంది. వాడి బ్లాగును ఎవడూ చూడకుండు గాక ! చూసినా ఒక్క కామెంటూ పెట్టకుండు గాక ! వాడి తొక్కలో సిస్టం చీటికీమాటికీ మొరాయించు గాక ! అని వాడిని మనసులోనే శపించేను.
వాడి ఇల్లంతా శుభ్రం చేయడం కోసం నన్ను ఇంతగా హైరానా పెడతాడా నా ఒళ్ళంతా చీదరగా ఉంది. మురికి పట్టి పోయాను. సబ్బో గిబ్బో పెట్టి కొంచెం స్నానం చేయిస్తే వాడి సొమ్మేం పోయింది నా వొంటిని అంటిన దుమ్మూ ధూళిని వదిలించడానికట - నన్నుటేబిలు అంచుకేసి టపా టపా బాదేడు. ఊపిరాడింది కాదు. వాడి మీద ఏ మర్డరు కేసో పెట్టి బొక్కలో తోచించేస్తేనో అన్నంత కోపం వచ్చింది.
ఆ మధ్య వాడి ఫ్రెండొకడు వచ్చి నన్ను చూసి పగలబడి ఒకటే నవ్వడం ! నా తల తీసేసి నట్టయింది.
ఎంత అవమానం !
‘‘ఈ తలమాసిన శాల్తీ ఎక్కడిదోయ్ ! ’’ అని వెక్కిరిస్తూ ఒకటే నవ్వేడు.
ఇహ నేను ఈ కథామంజరి ( ఏకైక నస బ్లాగు ) గాడి అథార్టీ భరించ లేను. కానీ ఏమీ చెయ్య లేను కదా. చేతిలో ఎర్ర ఏగానీ కూడా లేని వాడిని కదా అస్వతంత్రుడిని కదా !
అంచేత మనమే తగ్గాలి. ఒదిగి ఉండాలి. శాంతం భోషాణం పెట్టె అన్నారు పెద్దలు.
ఇలా ఉండగా నాకో దివ్యమైన ఆలోచన వచ్చింది. పోనీ మనమే జుత్తు కటింగ్ చేయించుకుని కాస్త ట్రిమ్ గా తయారై కనిపిస్తేనో అప్పుడయినా ఈ వెటకారాలూ వెక్కిరింతలూ తగ్గిస్తాడేమో?!
ఈ ఆలోచన వచ్చేక మా కథా మంజరి గాడి మూడ్ బాగుందని అనుకుని నా మనసులో మాట వాడి ముందు బయట పెట్టాను
‘‘ పారూజుత్తు బాగా పెరిగి పోయింది. తల మాసి పోంది. చిరాగ్గా ఉంది. సెలూన్ కి వెళ్ళి క్షవరం చేయించుకు రావాలనుకుంటున్నాను. డబ్బులివ్వరూ ? ’’ అని దేబిరిస్తూ అడిగాను.
అంతే. వాడేమన్నాడో తెలుసునా ?
‘‘ ఓరి జుత్తుల పోలిగా ! నీకు క్షవరం కూడానా దండగ ఖర్చు ! అట్టే మాట్లాడితే పెంట మీద విసిరి పారెయ్య గలను జాగ్రత్త !’’
అని కసిరేడు. ఏడాదిగా నా చేత అరవచాకిరీ చేయించుకొని ఇంత మాటంటాడా ! మరీ ఇంత అన్యాయమామీరే చెప్పండి ?
నా తమ్ము డొకడు ఉన్నాడు. మా ఓనరు గాడి షేవింగు కిట్ లో ఉన్నాడు. వాడూ నాలాగే తలంతా మాసిపోయిజుత్తుల పోలి గాడిలా ఉన్నాడు.
ఏదో ఒక రోజున మా కథామంజరి నస బ్లాగరు ఓనరు మహాశయుడు మా ఇద్దరినీ పెంట కుప్ప మీద విసిరి పారెయ్యక తప్పదనిపిస్తోంది. ఈ అన్యాయం ఖండించే వారే లేరా మము బ్రోచే వారే లేరా ! హే ! భగవాన్ !
గమనిక : ఈ టపాలో వాడిన‘‘ ఇల్లు ’’ అనే పదమునకు మానిటరూసీ.పీ.యూకీ బోర్డూమౌసూప్రింటరుస్కానరూ వగైరాలని అర్ధం చేసుకో గోరుతాను.
ఇట్లు,
తమ విశ్వాసపాత్రుడు,
జుత్తుల పోలిగాడు.



20, మే 2015, బుధవారం

సూది పురాణమ్ !



సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది.
అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ దొరికి కుడదామని కూచుంటే, సూదిలోకి దారం కళ్ళ జోడు లేనిదే ఎక్కించ లేం !. అదెక్కడ పెట్టామో గుర్తుకు రాదు. దాంతో విసుగొచ్చి సూదీ దారాలని పక్కన పడేస్తాం. తర్వాత కళ్ళ జోడు జాడ కనిపించి, కొంచెం తీరిక దొరికింది కదా అని ఏరాత్రి పూటో కుట్టడానికి కూచుంటామా ! కరెంట్ ఠక్ న పోతుంది. జీవితంలో ఐరనీ ఇదే. మన దినాలు బావుండక పోతే అన్నీ ఇలాగే జరుగుతాయి ! ... సరే, ఈ సోది కాస్సేపు ఆపి, సూది కథలోకి వద్దాం.

సూచి అనే దానికి రూపాంతరమే సూది. దీనికి మరి కొన్ని పర్యాయ పదాలూ ఉన్నాయండోయ్. సేవని,సూచకము, సూచి, సూచిక,సూచిని, సేవతి ... ఈ పదాలన్నింటికీ సూది అనే అర్ధం ! ఇంత ఆయాసం మనం పడ లేం కానీ మనం సూది అనే పిలుచుకుందాం.సూదుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు సూది. బొంత సూది, కుట్టు సూది, మందు సూది ...వీటిలో గుండు సూదులది రాచహోదా లెండి. ఇవి ఆఫీసుల్లోనూ అక్కడా చక్కా అందమైన ముఖమల్ ఆసనం అలంకరించిన చోట ఉంటాయి. వాటి దర్జాయే వేరు ! బట్టలూ, పుస్తకాలూ, బొంతలూ కుట్టే సూదులు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి కాక మిషను సూదులు వేరు. ఆస్పత్రులలో రోగుల జబ్బలకు పొడిచే మందు సూదులను లోగడ మరుగుతున్న నీళ్ళలో శుభ్రం చేసే వారు. స్టెరిలైజేషనంటారు దానిని. ఇప్పుడా బాధ లేదు. హాయిగా వాడి పారేసే మందు సూదులొచ్చేయి. సుఖమే కాక, ఇవి ఆరోగ్యరీత్యా మంచివి కూడానూ

 ఇక సూదుల పెద్దన్న దబ్బనం. వీటితో గోనె సంచులూ గట్రా కుడతారు.
అసలీ సూదులు మన దేశం లోకి విదేశాల నుండి ముందటి రోజుల్లో దిగుమతి అయ్యేవిట ! తర్వాత తర్వాత మనఁవూ సూదులను తయారు చేయడం మొదలెట్టాం.

గాంధీజీకి రోజూ బోలెడు ఉత్తరాలు వచ్చేవిట. ఓ రోజు గుండు సూది గుది గుచ్చి ఎక్కువ కాగితాల బొత్తి వచ్చిందిట. జాతి పిత ఆ ఉత్తరాన్ని పూర్తిగా ఓపికగా సాంతం చదివేక దానికున్న ఆ గుండు సూదిని తీసి జాగ్రత్త చేసి, ఉత్తరాన్ని చెత్త బుట్టలో వేసారుట ! ప్రక్క నున్న వారెవరో ఆశ్చర్య పడి ఇదేమిటని అడిగితే, ఈ ఉత్తరంలో మనకి పని కొచ్చేది ఈ గుండు సూది ఒక్కటే ! అని బదులిచ్చారుట !
మన మహా భారతంలో వచ్చిన సూది ప్రస్తావన అందరికీ తెలిసినదే కదా ! రారాజు పాండవులకి ఐదూళ్ళు కాదు కదా సూది మొన మోపినంత భూభాగం కూడా ఇవ్వనని చెప్పడం వల్లనే కదా భారత యుద్ధం వచ్చింది !
కుట్టు కోడానికే కాదు, సూది హింస కూడా ఒకటుంది. విలన్లూ, కొందరు రక్షక భటులూ నేరస్థుల గోళ్ళలో సూదులు కుక్కి నిజమో అబద్ధమో రాబట్టే, హింసాత్మక చర్యలకూ సూదులే ఉపయోగ పడడం సూదుల జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలి పోతుంది.

సూదిలోకి దారం అవలీలగా ఎక్కించ గలుగు తున్నామంటే మన కంటి చూపు భేషుగ్గా ఉన్నట్టే ! గుండు సూది నుండి ఇక్కడ సమస్తం దొరుకుతాయండీ అని ఏ షాపు గురించయినా చెప్పుకుంటూ ఉంటే ఆ షాపు ఇవాళ్టి మన మాల్ లాంటి దన్నమాట !

గతాన్నీ వర్తమానాన్నీ సమన్వయ పరుస్తూ కుట్టే సూది లేక పోయిందే ! అని కవి నారాయణ రెడ్డి గారు ఓ కవితలో ఖేద పడ్డారు.
పరమానందయ్య గారి శిష్యుల సూది కథ తెలిసినదే కదా. గురువు గారు ఓ సారి ఓ సూది తెండ్రా అని చెప్పారుట. పొలోమని శిష్యులందరూ బయల్దేరారు. వారికి ఓ చిన్న సూదిని అంతమందీ కలిసి తేవడం ఎలాగో తెలిసింది కాదు. సూది తెమ్మని గురువు గారు అందరికీ కలిసి చెప్పారాయె ! అందు వల్ల బాగా ఆలోచించి, ఆ సూదిని ఓ తాటిమానుకి గుచ్చి మోసుకొచ్చేరుట. తీరా , గురువుల దగ్గరకి వెళ్ళే సరికి తాటి దూలం ఒక్కటే మిగిలింది ! సూది దారిలో ఎక్కడో జారి పడి పోయింది !

సూదికి సంబంధించిన సామెతలు కూడా కొన్ని కనిపిస్తాయి. చూడండి ...

1. సూదికి రెండు మొనలు ఉంటాయా!

2. సూది కుతికె, దెయ్యపాకలి. ( పీక సన్నం, ఆకలెక్కువ లాంటిదన్నమాట)

3. సూది కోసం దూలం మోసినట్టు

4. సూది కోసం వెళితే, పాత రంకులు బయట పడ్డాయిట !

5. సూది గొంతు, బాన కడుపు

6. సూది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా ?

7. సూది బెజ్జం చూసి జల్లెడ వెక్కిరించి నట్టు !

8. సూదిలా వచ్చి, గడ్డ పారలా మారినట్టు
9. సూదిని మూట కట్టి నట్టు

10.సూది బెజ్జంలో ఒంటె దూర వచ్చును కానీ, భాగ్య వంతుడు స్వర్గం చేర లేడు ( ఇది బైబిల్ సూక్తి)
11. గడ్డి మేటులో సూదిని వెదికినట్టు ! ( వృథా ప్రయాస అన్నమాట ! )

సూదిలొ దారం ... సందులొ బేరం లాంటి సినిమా పాటలు ఉన్నాయి కానీ, వాటిలో అశ్లీలత ఏమన్నా ఉందా అని బుర్ర గోక్కోవడం దండుగ. ఉండక పోతేనే ఆశ్చర్యం కానీ, ఉంటే అబ్బుర మేముంది ?

అన్యోన్యంగా ఉండే భార్యా భర్తలను చిలకా గోరింకాలా ఉన్నారంటారే కానీ సూదీ దారంలా కలిసి పోయారని అనక పోవడానికి కారణం ఏమిటో ; సూది కుట్టేదీ, దారం చుట్టుకు పోయేదీ కనుకనా ? చూడాలి.

ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న వూళ్ళలో సూదులోళ్ళు అని చిల్లర వ్యాపారస్తులు కొందరు రోడ్లమ్మట తిరుగుతూ కనిపిస్తారు. చేతిలో ఓ నిడుపాటి గెడ కర్రకు మీద ఆ చివర అట్ట ముక్కలకు తగిలించి సూదులూ, పిన్నీసులూ, బూరలూ, మొలతాళ్ళూ లాంటివి తెచ్చి అమ్ముతూ ఉంటారు.

ఇక, చివరగా చిన్నప్పుడు మా పెద్దాళ్ళు తరుచుగా చెప్పి కడుపారా నవ్వించిన సూది కథ ఒకటి చెబుతాను ...
అనగనగనగా ... ఒక ఊళ్ళో ఒక అవ్వ నూతి గట్టు మీద కూచుని ( నూతి గట్టు మీద కూచోడ మేఁవిటనకండి. అదంతే కథకి కాళ్ళూ చేతులూ లేవు)
చిరిగిన బొంత కుడుతోందిట. ఇంతలో చెయ్యి జారి సూది నూతిలో బుడుంగున పడి పోయిందిట. కుయ్యో, మొర్రో అంటూ , సూదీ సూదీ బేతాళా ! అంది అవ్వ. దారం నూతిలో పడి పోయింది. దారం దారం బేతాళా ! అంది . బొంత పడి పోయింది. బొంతా బొంతా బేతాళా ! అంది ఈ సారి ఏకంగా అవ్వే నూతిలోకి పడి పోయింది ! ....
ఈ కథ ఇంత వరకూ ఇలా సాగుతూ ఉంటుంది. పిల్లలు ఊఁ ... కొడుతూనే ఉంటారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ప్రశ్నలే ప్రశ్నలు !

ఊఁ.. అంటే అవ్వ నూతిలోంచి బయటి కొస్తుందా ?

ఉహూఁ !

ఉహూఁ అంటే వస్తుందా ?

(తల అడ్డంగా తిప్పే వాళ్ళం )

తల తిప్పితే వస్తుందా ?

(పగలబడి నవ్వుతాం)

వెంటనే మరో ప్రశ్న ! నవ్వితే వస్తుందా

మాట్లాడకుండా ఉంటే వస్తుందా ? కథ బాగుందంటే వస్తుందా ? వస్తుందంటే వస్తుందా ? రాదంటే వస్తుందా ! ...
ఇది అనంతం






















19, మే 2015, మంగళవారం

ఆ పైన మీ ఇష్టం !



బృహత్సంహిత లోని ఈ శ్లోకం చూడండి ...

జయే ధరిత్ర్యా: పుమేవ సారం, పురే గృహం సద్మని చైక దేశ:
తత్రా2పి శయ్యా, శయనే వరా స్త్రీ, రత్నోజ్వలా రాజ్య సుఖస్య సార:

దేశం ఎంత విశాలంగా ఉండనీ, కేంద్రమైనది నగరమే. నగరం ఎంత పెద్దదిగా ఉండనీ, తన ఇల్లే ఎంతో ప్రీతి పాత్రంగా ఉంటుంది. తన ఇల్లు ఎంత పెద్దదిగా ఉండనీ, దానిలో తన పడక గదే శాంతిని కలిగిస్తుంది. ఆ పడక గదిలో కూడ మిక్కిలి విశ్రాంతిని ఇచ్చేది శయ్య. ఆ శయ్యా సుఖం కూడ పూర్తిగా పొందాలంటే స్వీయానురక్తయై, ఉత్తమురాలైన భార్య వల్ల మాత్రమే మనశ్శాంతి చేకూరుతుంది. అని దీని భావం.

అంటే, మహారాజుకైనా స్వగృహం మాత్రమే శాంతిని ఇస్తుందనీ, అందునా, అనురక్త ఐన భార్య మాత్రమే చిత్త శాంతినీ, సౌఖ్యాన్నీ ఇవ్వగలదనీ తెలుసు కోవాలి.

మన ఇంట లేని సౌకర్యాలు ఎన్నింటిని అతిథి మర్యాదలు చేసే చుట్టాలు సమకూర్చినా, మరీ ఎక్కువ రోజులు అక్కడ ఉండాలనిపించక పోవడం అందరకీ అనుభవం లోకి తరుచుగా వచ్చే విషయమే.

ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుదామా, మన ఇంట , మన పడక గదలో, మన మంచం మీద సేద దీరుదామా అని ఊరికే ఇదయి పోతాం.

ఇది నాది అను కోవడంలో ఉండే తృప్తితో ఏదీ సాటి రాదు.

అందుకే పెద్దలు గృహమే కదా స్వర్గ సీమ అన్నారు.



దానిని స్వర్గ ధామం చేయడమూ, నరక తుల్యంగా మార్చడమూ కూడ మన చేతుల్లోనే ఉంది. కదూ?

18, మే 2015, సోమవారం

వో పాలేటయినాదంటే ....!



పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతావూ ? మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !

అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...
ఓ పాలేటయినాదంటే ...
మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు ఏసంకాలం,అలపొద్దులేళ నానూ, నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట అందిల కూకున్నాఁవా ? మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ్మూరితీ ( ఈన కతలు రాస్తాడు నెండి ) మా రవణ మూరితీ ( ఈడు అరికతలు మా బాగా సెపుతాడు ) మరింకా మా రామ జోగారావూ, మా సోమయాజులూ అన్నమాట . ఈ సివరాకరిద్దరూ ఉప్పుడు బూమ్మీద నేరు. పోనారండి. అత్తల్సు కుంతె కడుపు దేవి పోతాదండి. ఏటి సేత్తాం. అదలా గుంచండి ...
మాం కూకున్న కాడికి దగ్గర్నోనే మరో పది మంది దాకా కూకున్నరు. ఆల్లంతా పల్లెటూరి బైతులు నాగున్నరనుకున్నం. ఆల్ల ముందు నున్నగ నించుని రివట నాగున్న వోడు వొకడు సింకి నెక్చరు ఇచ్చెత్తన్నాడు. ఆడు సెప్పేదంతా సుట్టూ సేరినోల్లు సెవులప్ప గించి ఇంతన్నారు.
ఆడేటి సెపుతున్నాడూ ?బదగద్గీత ! ఆడి మాటలు యిని మాం నవ్వాపు కోనేక పోయేం ! పిక్కిరోల్లం కదా,పొగ రెక్కువుంతాది. ఆల్లని పల్లెటూరి బైతుల నాగా సూసి అయ్యేల ఇరగబడి ఇరగబడి నవ్వీసినాం. మరాల్లకి కోపం రాదా ? మమ్మల్ని కొట్టనాని కొచ్చేరు. కక్కా ముక్కా తినీవోల్లు. ఆల్లతోటి మాఁవేటి సాగ్గలం.? గుంటలం. ఓరినాయనో బేగి పరిగెత్తరా నాయన ! అంటూ అక్కడి నుండి పారి పోయినం. ఎలగయితేనేం గండం గడిసింది పిండం బయట పడింన్నట్టుగ మాకు ఆయేల దరువులు తప్పినయ్యి ! ఇయ్యాల పెందిల నెగిసీ నెగడంతోటే ఇదంతా ఎందుకో గుర్తుకొచ్చినాది. , ఆ సోదంతా బరికీసి నా బ్లాగు టపాలో పడీసినాను. ఏటంతే అనండి ఇందల నీతేటో కడాకు సదవండి మీకే తెలుస్తాది ...

ఇంతకీ బుద్దిగా తలలూపుతూ యింటున్న ఆల్లందరికీ ఆడేటి సెపుతున్నాడూ ? బదవద్గీత సెపుతున్నాడని సెప్ప నేదా ?
అదెలాగుంటే ....
‘‘కురుచ్చేత్ర యుద్దం మొదలయి పోనాది. యుద్దానికి ముందు దాపలో గుర్రఁవూ ఎలపలో గుర్రఁవూ కట్టి కిసన మూరితి బండి మీద అరుజునుడిని ఎక్కించుకుని అక్కడికి ఎల్లినాడు. అరుజునుడు ఎగస్పార్టీ వోల్లని సూసాడు. ఇంకేటుంది ?ఉచ్చ కార్చీసు కున్నాడు ! ‘అక్కడంతా ఆడికి ఎవులు కనిపించినారు ?తాతియ్యలు,బాయ్యలు,దద్దలు,మాయ్యిలు,... అంతా ఆల్లే ! ఓర్నాయనో ! నా సేతుల్తో మనోల్లని సంపనే నంటూ బానం వొగ్గీసి బండి దిగి పోనాడు.

మరప్పుడు కిసన బగవాను మూరితి ఏటన్నాడో ఎరికా ?

‘ ఓరి పల్లకోరా ! పెద్ద పోటు గాడి నాగ ఈల్లందరినీ నువ్వే సంపీస్తావను కుంతున్నావేటి ?!
పుట్టించినోడినీ నానే ! సంపీ వోడినీ నేనే . సేసే వోడినీ,సేయించే వోడినీ నానే. నానంతే ఎవులను కుంతున్నావు ? బగమంతుడిని. విందిరా గాందీనీ విజీనారం రాజు గోరినీ నానే కదా పుట్టించి నోడిని. ఈడినీ ఆడినీ,మన పోలుపిల్లి గవిరయ్య కూతురు లచ్చుమునీ,మనూరు బుగత బాబునీ,ఆడి కొడుకునీ,అందరినీ నానే కదా పుట్టించి నాను. నాను నోకంలో ఎప్పుడయితే దరమం నాసినఁవై పోతదో అప్పుడు పుడతానన్నమాట ! .......’’ ఇలా సాగి పోనాది ఆడి పెసంగం.
మద్దె మద్దెలో ఆడాడిన బూతు మాటలు తీస్సి సెబుతున్నాను కానీ,సత్తె పెమాణికంగా అయ్యేల ఆడి పెసంగం అచ్చు ఇలాగ్గానే ఉంది.
ఆడి మాటలకు బైతు గాడి మాటలనీ. తాగు ముచ్చోడి కబుర్లనీ మాం పడి పడి నవ్వీసి తన్నులు తినబోయి,తప్పించు కున్నం కానీ, ఇందల ఒక్క అచ్చరం అపద్దం నేదు. మరాడి మాటలు సుట్టూ సేరి నోల్లు ఎలాగ్గ యిన్నారూ ?మన చాగంటి పంతులు గోరు టీ.పీలో సెబుతే మనం ఇంతంన్నాం కామా ! అంత బక్తితో ఇన్నారు. స్రెద్దగా యిన్నారు.
ఇప్పుడు మీరు సెప్పండి. నవ్విన మాం గొప్పోల్లఁవా ?ఆల్ల జీవ బాసలో,ఏ జంకూ గొంకూ నేకండా సాజంగా, అమాయకంగా బూతులు కలిపేస్తూ మాటాడిన ఆడు గొప్పోడా ?ఆడు సెప్పిందంతా గొప్పోడి పెవచనం నాగా స్రెద్దగా,బయ బత్తుల తోటి యింటూ కూకున్న ఆలు గొప్పోల్లా ?ఏటంతారు ?ఆల్లే గొప్పోల్లంతాను.ఆడే గొప్పోడంతాను.

ఆల్లని పల్లెటూరి బైతుల్నాగా సూసి ఎకసెక్కెం ఆడిన మా గుంటకాయల్దే తప్పంతాను. మీరేటంతారు ?


---------------------------------------------------------------------------------------

విక్కడ మీకో డౌటు సందేయం రావాల ! వొరే కదా మంజరి బ్లాగరోడా, ఆల్లని పల్లెటూరి బయితులన్నావూ, తఁవరేదో పట్న పోల్ల నాగా ఆల్లని ఎక  సెక్కాలాడేవూ ! ఏటిదంతా. తప్పు కాదా ! కల్లు పోవా ! పైన దేవుడు సూడ్డా !అంతారు. కద ?

నిజిఁవే.  కానయితే ఆల్ల కత ఆల్ల మాటల్లోనే పెపితే ఎలాగుంతాదో సూద్దాఁవని పెయత్నం సేసినానంతే.

మన ముకం ! ఆల్ల నాగా సొచ్చంగా మాటాడ్డం, సొచ్చంగా బతకడం మన తరఁవా !

ఆల్ల బాస ఆల్ల బొడ్డు కాడినుండి వొస్తాది. మన్దో ?  బుర్ర నోంచి వోస్తాది. అదీ తేడా.