పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జనవరి 2015, బుధవారం

సరసం విరసం కానంత వరకూ మానసోల్లాసమే కదా !


మొగుడూ పెళ్ళాలన్నాక, ఆ పాటి మాటా మాటా అనుకోరా యేమిటి ?
మీ వాళ్ళు ఇలాగంటే, మహ చెప్పొచ్చారు లెండి, మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ? అని ఒకరి నొకరు దెప్పి పొడుచు కోవడం, మూతులు ముడుచు కోవడం, అలకలు, ముక్కులు చీదు కోవడాలూ, మాటలు మానెయ్యడాలూ, కూరలు తగలెయ్యడాలూ, ఉపాహారం తిన కుండానే వీధిలోకో, ఆఫీసుకో వెళ్ళి పోవడాలూ. ఆ తరువాత అయ్యో అనుకోడాలూ, తప్పంతా నాదే, నేనే ఊరికే రెచ్చ గొట్టేను, పాపిష్ఠి దాన్ని ( లేదా ) మూర్ఖపు వెధవని అనుకోడాలూ, సాయంత్రానికి వేడి వేడి పకోడీలు చేయడాలూ, కమ్మని కాఫీలు పెట్టడాలూ, మూరల లెక్కన మల్లెలో, సన్నజాజులో బేరమాడడాలూ, క్షమాపణలూ వగైరాలయేక, కరిగి పోవడాలూ ... ఇదీ సాంసారిక మాధుర్యం.
ఆది దంపతుల సరస సల్లాపాలు గమనిస్తే, అమృతోపమానమైన సరస సంభాషణతో భార్యా భర్తలు తమ దాంపత్యాన్ని ఎంత ప్రఫుల్లంగా, మధుర కావ్యంలాగున, తేనె వాక లాగున, ఇంద్ర ధనుస్సుల్లాగ మలచు కో వచ్చునో అవగత మవుతుంది.
చూడండి మరి :
క్వతిష్ట తస్తే పితరౌ మమేతి
అపర్ణ యోక్తే పరిహాస పూర్వం
క్వవా మమేవ శ్వసురౌ తవేతి
తామీరయన్ సస్మిత మీశ్వరోవ్యాత్
( శ్రీ కృష్ణకర్ణామృతమ్ )

దీనికి తెలుగు సేత:
‘నాకున్న తల్లి దండ్రులు
మీ కేరీ ’ యని యపర్ణ మేలము లాడన్
‘నాకున్న యత్త మామలు
నీ కేరీ’ యనుచు నగు త్రి నేత్రుని గొలుతున్ !
‘‘నాథా, నాకున్న మాతాపితరుల వంటి వారు నీకు లేరు. మా తలిదండ్రులు అంత గొప్ప వారు’’ అంటూ పార్వతి శివుడిని మేలమాడింది.
‘‘ పోదూ, మీ వాళ్ళ గొప్పలు నువ్వే చెప్పాలి. చాలు. చాలు. నాకున్న అత్త మామలు నీకు లేరులే !’’ అని బదులు చెప్పాడుట పరమ శివుడు. శివ పార్వతుల సల్లాపం ఎంత మనోహరంగా ఉన్నదో చూసారా ?
అర్ధనారీశ్వరత్వానికి అర్ధం, పరమార్ధం అదే.

స్వస్తి.

20, జనవరి 2015, మంగళవారం

అమ్మకి నచ్చిన అందమైన పాట !

ధన్యవాదాలు You tube


ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు ( ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.










మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.
అందులో మా అమ్మ తరుచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను. అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల సరస్వతి పాడినట్టుగా గుర్తుంది. మళ్ళీ చాలా ఏళ్ళకి అంతర్జాలం వారి ధర్మమా అని, అమ్మకి నచ్చిన ఈ పాట విన గలిగేను. ఈ పాట నాకు అందించడానికి  నాలుగేళ్ళ క్రితం మిత్రులు చాలా మంది సహకరించారు కూడా ! వారందరికీ అప్పుడే ధన్యవాదాలు తెల్పు కున్నాను. ఈ పాట  నా బ్లాగు గాడ్జెట్ లో అమ్మకి నచ్చిన పాట అని, లింకు కూడా ఇచ్చాను, చూడండి. దాని కథా కమామీషూ మరోసారి మీతో పంచు కోవాలని ఇదంతా రాస్తున్నాను. అందరికీ తెలిసిన రామాయణమే మళ్ళీ చెప్పాలా అని అడిగితే విశ్వనాథ వారు అన్నట్టు, రోజూ తిన్న అన్నమే తినడం లేదూ ! ఎవరి రుచులు వారివి. రుచికర మయిన పాయసాన్ని జీవిత కాలంలో ఏ ఒక్క సారో  వో గ్లాసుడు తాగి ఊరు కోం కదా ! దొరికి నప్పుడల్లా  తాగాలనే ఉంటుంది. అలాగే, యిదీనూ ! మంచి పుస్తకాలు పున్ముద్రణలు వేయడం లేదూ ... అలాగే నచ్చిన బ్లాగు టపాలను మళ్ళీ మళ్ళీ పెట్టడంలో తప్పేమీ లేదనుకుంటాను ...
ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.
దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.
సాహిత్యం ఇది:
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే
మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II

చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా
చుక్కల్ల రేడమ్మా ... సఖియా
మరుని శరముల చేత మనసు నిలువక నేను
మల్లె మొల్ల మొగలి మాలతి మందార
మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
పేరేమిటని వాని ప్రశ్నించినానే
మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...
(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)




ఈ విడ మా అమ్మ , పార్వతమ్మ

నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!

* * * *


19, జనవరి 2015, సోమవారం

జై బోలో .. చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ...


చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.
‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.
‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్పు కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’
‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.
‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరుగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు.
ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిస్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి
మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.
అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. శ్రీ దేవిలో ఉన్నాడు. చిరంజీవిలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్లో ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడిలోనూ. సానుభూతి సామ్రాట్టు జగన్ లోనూ ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ  ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం.
అంతే. ’’
ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.గాలికీధూళికీ పుట్టి పెరిగినా, అక్షరం ముక్క నేర్చుకోక పోయినా అమాంతంతగా రాత్రికి రాత్రి వాడో బాబా అయిపో వచ్చును.పిచ్చ నాకొడుకులు ఆశ్రమాలు కట్టి, భజనలు చేసి స్వయం ఉపాధి పథకం కింద దర్జాగా బతికెయ్యొచ్చును.
ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?
‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’
ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీసేను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.
చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...

ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !
అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.
‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.

సత్యాన్ని మించిన అసత్యం లేదు,
హింసను మించిన అహింస లేదు.
ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు.
దరిద్రాన్ని మించిన ధనం లేదు.
దు:ఖాన్ని మించిన సుఖం లేదు.

ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు
‘‘అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా !’’ అని మూయిస్తాం.
మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...
మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మించి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ?! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట.. మన తాత్విక బోధనలు! మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో, చెక్క పొడినవుల్తున్నామో, ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా, బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.
నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించింది . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది.
 ధన్యోస్మి.
జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.
చప్పట్ల బాబా తన తొలి భక్తుడినయిన నన్ను చూస్తూ చిరు నవ్వులు చిందించారు.































18, జనవరి 2015, ఆదివారం

మరయితే అసలు సమస్య ఏమిటయ్యా !


ఈ క్రింది శ్లోకం చూడండి:
కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
కాన్తా ముఖం కిం కురతే భుజంగం
క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలూ, నాలుగు సమాధానాలూ ఉన్నాయి. చూడండి:
కా శంభు కాన్తా ? = ఎవరు ఈశుని భార్య ? = గౌరి
కిము చంద్ర కాన్తం ? = ఏది చంద్ర బింబం ? = ముఖం
కాన్తా ముఖం కిం కురుతే = అమ్మాయి ముఖాన్ని ఏం చేస్తున్నాడు? = చుంబతి ( ముద్దు పెట్టు కుంటున్నాడు)
భుజంగం క: = పాము ఎవరు ? = వాసుకి.
ఈ విధంగా తొలి నాలుగు ప్రశ్నలకీ వరుసగా నాలుగో పాదం లోని ’’ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని
కవి నాలుగు జవాబులూ తనే ఇచ్చేడు.
మరయితే అసలు సమస్య ఏమిటయ్యా ?

ఒక కవి ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని ఒక సంస్కృత సమస్య ఇచ్చాడు. శ్లోకం లోని మీద మూడు పాదాలూ పూరణ.
కా విషమ సమస్యా ? = ఏది జటిలమైన సమస్య ? దీనికి నాలుగో పాదం లోని ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’ అనేదే జవాబు.
గౌరీ దేవి ముఖాన్ని వాసు దేవుడు ముద్దు పెట్టు కోవడ మేమిటీ , ఓఘాయిత్యం కాక పోతేనూ !!
మరదే , అందుకే కవికి మండుతుంది. ఏ అనౌచిత్యమూ లేకుండా ఈ సమస్య లోని ప్రతి పదానికి అర్ధవంత మయిన జవాబు వచ్చేలా ముందే ప్రశ్నలు వేశాడు కదండీ.
ఇలాంటి కిత కితలంటే మన పూర్వ కవులకి చాలా సరదా సుమండీ . మనలా ఎప్పుడూ ఆందోళనలతో ఏడుపుగొట్టు ముఖాలతో ఉండకుండా గొప్ప కులాసాగా, కుంచెం శృంగారం ఒలికించే పద్యాలూ శ్లోకాలూ చెప్పుకుంటూ ఉండే వారు కాబోలు.
ఆ రోజుల్లో వాళ్ళకి ఏ నవ్వుల క్లబ్బులూ ఉండేవి కాదని , వాటి అవసరం వాళ్ళకి పడ లేదని మా కథా మంజరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది.
శలవ్.



ఒకటి కొంటే ఒకటి ఉచితం ! రామాయణ గ్రంథం కొంటే, భారతం ఉచితం !


మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..

పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.

మరో మాట ... ఎందుకేనా మంచిదని చెప్పి చదువరులను ముందే హెచ్చరించాడు.
ఒక కథ వినేటప్పుడు మఱొక కథ మీద దృష్టి నిలిపితే, మొత్తం మొదటి అర్ధం గోచరించకుండా పోతుంది. అందు చేత ఈ రాఘవ పాండవీయం చదివేటప్పుడు ఒకే అర్ధం కలిగిన మామూలు కావ్యాన్ని ఎలా చదువుతారో అలాగే చదవండి. అంటే, ముందుగా రామాయణార్థాన్ని చదువుదామనుకుంటే, మనసు లోకి మరింక భారతార్థం ఏమిటా అని ఆలోచించకండి. అలాగే భారతార్ధం వచ్చేలా చదివేటప్పుడు రామాయణార్ధ ఏమిటా అని ఆలోచించకండి. ఏకార్ధ కావ్యం ఎలా చదువుతారో అలాగే చదువు కోండి. అని వివరణ ఇచ్చాడు.

రాఘవ పాండవీయం లోని రామాయణార్థంలో నూ భారతార్ధం లోనూ అర్ధాలు వచ్చే ఒక పద్యం ఉదాహరణకు చూద్దామా !

వెలయునఖిల భువనములలోన వారణ
నగరిపురమ తల్లి నాదనర్చి
రాజ్య లక్ష్మి మిగుల బ్రబల నయోధ్యనా
రాజ వినుతి గనిన రాజధాని.

ఈ పద్యం రామాయణ పరంగా అయోధ్యా నగరాన్ని వర్ణించే పద్యం. ఇదే పద్యం భారతార్ధంలో అయితే, హస్తినాపురాన్ని వర్ణిస్తున్న పద్యం !
ఇందులో సంస్కృతాంధ్ర శబ్ద సభంగ శ్లేష కవి వాడాడు.

ముందుగా రామాయణ పరంగా అర్ధం ఎలాగంటే,
రామాయణ పరంగా పద్యంలోని పదాలు ఇలా విరిచి చదువు కోవాలి.

అఖిల భువనముల లోన్, = అన్ని లోకాలలోనూ

అవారణ, నగరిపు, రమ, తల్లి = అడ్డు లేని ఇంద్రుని యొక్క సంపదయైన అమరావతికి తల్లి అన్నట్లుగా రాజ వినుతి గనిన = గొప్ప పేరు గాంచిన

రాజధాని అయోధ్యనాన్ = అయోధ్య అనే పేరుతో ప్రబలున్ = వెలయు చున్నది.
అంటే,
ఇంద్రుని రాజధాని అమరావతి. . దానికి తల్లి లాంటి నగరం అయోధ్య అన్నమాట.!

ఇక, భారతార్థంలో అన్వయం చూదామా !

న + యోధ్య = అయోధ్య ( యుద్ధం చేసినా జయింప బడనిది )
వారణ నగరి = వారణం అంటే ఏనుగు, వారణ నగరి అంటే హస్తినా పురం !
పురమ తల్లి = పుర శ్రేష్ట్రం. ( శ్రేష్ఠమైన నగరం )
అన్వయం ఇలా చూడాలి.

అఖిల భువనములలోన + వారన నగరి + పురమ తల్లి..
అంటే, అన్ని లోకాలలోనూ, హస్తినా పురం చాలా గొప్పది అని అర్ధం అన్నమాట !
తక్కిన అర్ధమంతా సుబోధకమే కదా !
వార్నాయనో ! ఒక్క పద్యానికి రెండు రకాల ( రామాయణ, భారతార్ధాలు ) అర్ధాలు గ్రహించడానికే ఇంత పీకులాట అయింది. ఇక మొత్తం కావ్యం అంతా చదవాలంటే మాటలా ?
 అనుకుంటున్నారా ?

తప్పదండీ, బాబూ, కష్టే ఫలీ ! అన్నారు. కావ్య రసం గ్రోలాలంటే ఆ మాత్రం కష్టపడొద్దూ ?

పనిలో పని, పింగళి సూరన కళా పూర్ణోదయం చదవండి..ఒక మిష్టరీ నవల చదువుతున్నట్టగా ఉంటుంది. తెలుగు కవుల గొప్ప తనమేమిటో తెలుస్తుంది. ! మన కావ్య సంపదను మనం ఎంత పదిలంగా కాపాడు కోవాలో తెలుస్తుంది !

స్వస్తి.




17, జనవరి 2015, శనివారం

నవ్వితే నవ్వండి ... ( నాకేం అభ్యంతరం లేదు)



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.
ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.
అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !
అలాంటివాటిని కొన్నింటిని చూదాం !
వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:
ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.
‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.
మరొకటి -
కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !
మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!
భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:
ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.
ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:
గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:
అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:
కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:
పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:
అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం
తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .
మరొకటి చూడండి:
తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి
కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !
చివరగా ఇంకొకటి ...
క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:
ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.
లోగడ కథా మంజరిలో తెలుగు, ఇంగ్లీషు పదాలు కలగాపులగం చేస్తూ కవులు రాసిన కొన్ని పద్యాలను ఉంచాను.
చూడాలనిపిస్తే ఆ టపా ఇక్కడ నొక్కి చూడండి. ఓ పనైపోతుంది.






15, జనవరి 2015, గురువారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా, ఏమి రుచి !

కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా, నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లుచాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా  హొటల్ ఉండేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాస్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లుళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ( ఆ ప్రక్కనే ఉపాధ్యయ భవన్ కదా ! దాని ప్రభావం కాబోలు ! ) ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ..... మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

13, జనవరి 2015, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ! ... ‘‘ బంగారు తెలంగాణ’’, ‘‘సింగపూర్’’


ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.
గురువులు చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.
‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.
‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.
‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.
కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ బంగారు తెలంగాణ,    సింగపూర్ ’’
రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.

‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు
కొడుకు మళ్ళీ అవే మాటలు  చెప్పాడు.
ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.
‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు
‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...
గురువులు గజగజ వణికి పోయారు.
‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.
‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.
‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.
‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.
మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.
‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.

నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.ముఖం మొత్తును.



కోదండ రామయ్యా ! కోతుల రాజ్యాన్ని చక్క దిద్దగా రావయ్యా !

కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటే, చూడవోయ్, బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామని, చూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతే, మరేమిటి చెప్పండి ? మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూ, అభినయ విశేషాలూ, సంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటే, మా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు. అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితే, సమయం వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు. కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో దిట్టలు. అర చేతిలో వైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీ, వీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేక, ప్రతి ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడక, నడత, మాట తీరు, ప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాం, మనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం. కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్ బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనతం విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటే, ఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదం, అధికారం, తెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరి, ఒకే చోట ఈ నాలుగూ కూడితే, చెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలి, దాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?
స్వస్తి.

12, జనవరి 2015, సోమవారం

కవి గారి రీజనింగు !


మన కవులు వాడే కవి సమయాలు బోలెడు.
స్త్రీలను వర్ణించేటప్పుడు ... అందమైన ముఖాన్ని చంద మామతోనూ, అరవిందం తోనూ పోలిక తెస్తారు.
వారి కురులు మేఘ మాలికలు
నేత్రాలు బేడిస చేపలు. చూపులు తూపులు. కనుబొమలు ధనుస్సులు . నడుము ఆకాశం. దంతాలు తారకలు. తొడలు అరటి బోదెలు. పాలిండ్లు పూర్ణ కుంభాలు. వేణి ఫణి. అధరాలు మధుశాలలు. పెదవులు దొండ పండ్లు. నాసిక సంపెంగ. ఇలా చాలా ఉన్నాయి లెండి. అంగాంగాలకూ ఎవరికి తోచిన పోలికలు వారు చెబుతారు.

ఆ సంగతి అలా ఉంచితే మనం కూడా నిత్య వ్యవహారంలో చాలా పోలికలను వింటూ ఉంటాం.
పొడుగ్గా ఉండే వారిని గెడ కర్రలా ఉన్నాడంటారు. తెలివి హీనుడిని మొద్దు రాచ్చిప్ప అంటారు. లంచాలడిగే వారిని జెలగలంటారు. కష్టపడి పని చేస్తే గాడిద చాకిరీ అంటారు. కష్టాలను కొండలంటారు. నీచులను పాములంటారు.
చక్కని జంటను రతీ మన్మథులంటారు. ముసలి ముత్తయిదవుల జంటను పార్వతీ పరమేశ్వరులాంటారు.
అతి వాగుడిని సుత్తి దెబ్బలంటారు. అందమైన భార్యకు అందవిహీనుడయిన భర్తను చూసి, కాకి ముక్కుకి దొండ పండు అంటూ ఎద్దేవా చేస్తారు. నచ్చని తిను బండారాన్ని ఒట్టి గడ్డి అంటారు. నాయకుల దృష్టిలో జనాలు గొర్రెలు.
చదువూ సంధ్యా లేని వారు అడ్డ గాడిదలు. గయ్యాళి పెళ్ళాలు చుప్పనాతి శూర్పణఖలు. చలి పులిలా మీద పడుతోందంటారు. ధారాపాత వర్షాన్ని కుంభపోత అంటారు. కదలని ఫైళ్ళవి నత్త నడకలంటారు. కొందరు ఆఫీసర్లని అగ్గి రాఁవుళ్ళంటారు అబద్ధాలాడే వారిని అబద్ధాల పుట్ట అంటారు. దీర్ఘ కోపిది పాము పగ అంటారు. పేరు గొప్పా ఊరు దిబ్బా అయితే నేతి బీర కాయ చందం అంటారు. ఎప్పుడూ తన లోకం తనదేలా ఉండే వాడిని నూతి లోని కప్ప అంటారు. నిరక్షర కుక్షిని పశువంటారు. వాచాలుని వస పిట్టతో పోలుస్తారు. మౌనంగా ఉండే వాడిని ముని అనో, ముంగి ముషాణమనో అంటారు.

ఇలా చెబుతూ పోతే, చాలా ఉంటుంది. చెప్పడానికి చేంతాడంత !

ఇంత వరకూ రాసిన టపాని ఎప్పటి లాగే నా వెనుక వంగుని చూస్తున్న మా తింగరి బుచ్చి‘ బాగుందిరా ! ’అని మెచ్చుకున్నాడు. మా యింట కాఫీ టిపిన్లు సేవించి కబుర్లు చెప్పే వాడి నోట మొదటి సారి మెచ్చుకోలు మాట విని నేను ఆనంద పరవశుడి నయ్యాను. ఇంత లోనే,‘‘ అవును ! మన వాళ్ళు భలే పోలికలు తెస్తార్లే. కవులను ఎద్దులతో పోలుస్తారు కదా ! ’’ అని తనవిఙ్ఞాన భాండారంలో నుండి ఒక అమూల్యమైన విషయాన్ని ప్రస్తావించేడు. నా తల తిరిగి పోయింది.

‘‘ ఏఁవిటీ, కవులను ఎద్దులంటారా! ’’ అన్నాను, కంగారుగా.

‘‘ మరే, కవి వృషభులనే మాట నువ్వు విన లేదా ! ’’ అని నా తెలివి తక్కువ తనం మీద జాలి చూపించాడు.

కథా మంజిరి (ఏకైక నస బ్లాగు) బ్లాగుని మూసెయ్యా లన్నంత విరక్తి కలిగింది నాకు !

మా తింగరి బుచ్చి గాడి గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ, ఒక కవి గారు ఒక శ్లోకంలో ఎలాంటి రీజనింగు తీసారో చూడండి:

మనం లోకంలో మంచి వారి మనసు వెన్నతో సమానం అంటూ ఉంటాం కదూ. ఆ కవి కాదు పొమ్మంటున్నాడు.

కవి గారి రీజనింగు ఏమిటో మీరే చూడండి:


సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయ స్తదళీకమ్.

దీని అర్ధం : మంచి వారి మనస్సు వెన్న లాంటిదని కవులు చెబుతూ ఉంటారు. ఆ మాట అబద్ధం !
ఎందు కంటే, ఇతరుల మనో దుఃఖానికి మంచి వారి మనసు కరిగి పోతుంది. కానీ, కానీ, వెన్న ఇతరుల దు:ఖానికికరుగదు. వేడి తగిలితేనే కాని కరుగదు  కదా !

ఈ రీజనింగు చూసి ఈ కవి గారు మా తింగరి బుచ్చికి తమ్ముడనుకునేరు ! కాదు సుమా !

ఇది వినోక్త్యలంకార భేద మనుకుంటాను.



10, జనవరి 2015, శనివారం

అంతా బూతేనా ?( పెద్దలకి మాత్రమే ..కాదు)



కవి చౌడప్ప పేరెత్తితే చాలును, థూ ... అంతా బూతు ! అనెయ్యడం తెలిసిన విషయమే.
చౌడప్ప నిజంగా అన్నీ బూతు పద్యాలే రాసాడా ? కాదనే చెప్పాలి. అందుకే మన సాహిత్య కారులు కవుల చరిత్రలు రాస్తూ కవి చౌడప్పకు సముచిత స్థానమే ఇచ్చారు.
కంద పద్యాలలో రచించాడు కవి తన చౌడప్ప శతకాన్ని. కవికి తనలా వేరొకరు కంద పద్యాలను రాయ లేరనే ఆత్మ ప్రత్యయం ఎక్కువ. అందుకే ఎంత థీమాగా చెప్పాడో చూడండి:
ముందుగ చను దినములలో
కందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందరు నను ఘనుడందురు
కందమునకు కుందవరపు కవి చౌడప్పా.
భావం : పూర్వం రోజులలో కందపద్య రచనకు తిక్కన గారిది అందె వేసిన చేయి అంటారు. ఇవాళ నన్ను కంద పద్య రచనలో ఘనుడినని అంటారు.
కందము నీవలె జెప్పే
యందము మరిగాన మెవరియందున గని సం
క్రందన యసదృశనూతన
కందర్పా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీలా ఇంత అందంగా కందం చెప్పడం మరెవరికీ చాతకాదయ్యా ! నువ్వు ఇంద్రునితో సమానమైన నూతన మన్మథుడివి సుమీ ! అని కవి తన గురించీ, తన కంద పద్యం గురించీ చెప్పాడు.
కందముల ప్రాసగణయతు
లందముగా కవిత నెందరల్లరు విను నీ
కందంబులు రససన్మా
నందంబులు కుందవరపు కవిచౌడప్పా.
భావం: గణాలూ, యతులూ ,ప్రాసలూ కుదిరేలా చూసుకుని ఎందరు కంద పద్యాలను అల్ల లేదు ?
కాని, నీ కందాలు మాత్రం మహా రుచికరంగా భేషుగ్గా ఉంటాయి సుమీ !
నా నీతి వినని వానిని
భానుని కిరణములు మీద బారని వానిన్
వానను తడియని వానిని
గాననురా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఈ కవికి ఎంత ఆత్మవిశ్వాసం అంటే, తను చెప్పే నీతులు వినని వాడూ, ఎండ వేడిమి తగలని వాడూ, వానలో తడవని వాడూ ఎవడూ ఉండడు. అలాంటి వాడిని తను చూడ లేదుట !
తెలుగులో పచ్చి బూతు కవిగా ముద్ర పడి పోయిన చౌడప్ప బూతులూ, అశ్లీల శృంగారం పెచ్చు మీరిన పద్యాలు రాయక పోలేదు. అయితే రాసిన వన్నీ బూతులే కావు. చక్కని నీతి పద్యాలూ మిక్కుటంగానే ఉన్నాయి.
హాస్యం కోసం బూతాడక తీరదనుకునే రోజుల వాడు మన కవి.
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీతులు చెప్పడానికేం ! ఓ ! చాలా ఉన్నాయి. కానీ కొంచెమయినా బూతు మాటలు పలుకక పోతేనవ్వు పుడుతుందిటయ్యా ? రాజులను నవ్వించాలి కదా ! నీతులు, బూతులు రెండూ సమానమైన లోకఖ్యాతికరాలే కదా !
పది నీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గు పద్యము సభలన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుందవరపు కవిచౌడప్పా.
భావం: పది నీతులు, పది బూతులు , పది శృంగార పద్యాలు సభలో చదివిన వాడే గొప్పవాడు కదా.!
ఛీ ! బూతు ! అంటూ ముఖం వికారంగా పెట్టే వాళ్ళకి కవి ఓ గట్టి చురకే వేసాడండోయ్ !
బూతని నగుదురు గడు తమ
తాతలు ముత్తాత మొదలు తరముల వా
రే తీరున జన్మించిరొ !
ఖ్యాతిగ మరి కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఛీ ! పచ్చి బూతు ! అన్న వాళ్ళే ఆ బూతుని నవ్వుతూ వింటారు. వాళ్ళ తాతముత్తాతలు బూతు లోంచి కాక పోతే మరెలా పుట్టుకొచ్చారు ?
జానపదులలో విస్తారంగానూ, నాగరికులలో రవంత అరుదుగానూ వినిపిస్తూ, నిఘంటువులలో ఎక్కడో మారుమూల బిక్కు బిక్కుంటూ ఉండే బూతు మాటలను ఈ కవి నిర్భీతిగా, ఏ మొఖమాటాలకీ తావు లేకుండా, గుట్టూ మట్టూ లేకుండా చాలా పద్యాలలో వాడిన మాట నిజమే అయినా, చౌడప్ప వన్నీ బూతు పద్యాలే కావు. చక్కని కందాలూ, ఎంచక్కని వృత్త పద్యాలూ చాలా ఉన్నాయి.
నీచులనూ, నీతి బాహ్యులనూ, మేక వన్నె పులలనూ, కుహనా మేథావులనూ, ఈ కవి ఏ శషభిషలూ లేకుండా జలకడిగి పారేస్తాడు.
చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: కవిత్వాన్ని చదవాలి. చక్కగా ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ హేళన చెయ్య కూడదు. అవమానించ కూడదు. అలా చేసే వాడు తుంటరి గాడిద !
ఇయ్యా యిప్పించ గల
యయ్యలకే గాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా మీసము
కయ్యానకు కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఇచ్చే వాడికీ, ఇప్పించగల వాడికీ మీసాలు ఉండాలి. కానీ మిగతా పనిమాలిన వెథవలందరికీ మీసాలెందుకూ దండగ ! రొయ్యకు బారెడు మీసం ఉంటుంది ! ఎందుకూ !
మునుపాడి వెనుక లేదను
పెను గొంటె గులాము నోరు పీతిరి గుంటే
యనిఘనుడు సత్య వాక్యమె
గన వలెరా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ముందు ఇస్తానని మాట యిచ్చి , తరువాత లేదు పొమ్మంటాడే, వాడి నోరు అశుద్ధం గొయ్యితో సమానం ! ఈ మాటలు పూర్తిగా నిజం.
పెద్దన వలె కృతి చెప్పిన
పెద్దన వలె ; నల్ప కవిని పెద్దన వలెనా ?
ఎద్దన వలె, మొద్దన వలె
గ్రద్దన వలె కుందవరపు కవిచౌడప్పా.
భావం: అల్లసాని పెద్దన లాగా కవిత్వం చెప్పిన కవినే పెద్ద అనాలి కానీ, తక్కిన పనికి మాలిన కవులని అందరినీ పెద్ద అనాలా ? ఎద్దనాలి. మొద్దనాలి. గ్రద్ద అనాలి.
కీలెరిగి వాత పెట్టడ మంటే ఇదే కాబోలు.
తులసీదళముల హరిపద
జలజంబుల పూజసేయు సరసుల యమ దూ
తలుజూచిఏమి చేయం
గలరప్పా కుందవరపు కవిచౌడప్పా.
భావం: హరి పాద పద్మాలకు తులసీ దళాలతో పూజ చేసే వాడిని యమ దూతలు కూడా ఏమీ చెయ్య లేరు !
పరవిత్తము గోమాంసము
పరసతి తన తల్లి యనుచు భావించిన యా
నరుడు నరుండా రెండవ
కరిరవదుడె కుందవరపు కవిచౌడప్పా.
భావం: పరుల సొమ్ము గోమాంసంతో సమానంగానూ, పరుల భార్యలను తల్లితో సమానంగానూ ఎవడయితే చూస్తాడో, వాడు అపర నారాయణుడే !
వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
కానలు పస కుందవరపు కవిచౌడప్పా.
భావం: పంటలకు వానలే పస. సానపట్టడం వల్ల వజ్రాలు కాంతితో మెరుస్తూ ఉంటాయి. యుద్ధాలకి సేనలు తగిన బలం. జంతువులకు క్షేమకరమయిన తావులు అడవులే.
పులి నాకి విడుచు దైవము
గల వానికి దైవ బలము గలుగని వేళం
గలహించి గొఱ్ఱె కరచును
కలియుగము కుందవరపు కవిచౌడప్పా.
భావం: దేవుని దయ ఉంటే, పులి కూడా వాడిని ఏమీ చేయదు. అలా తడిమి వదిలేస్తుంది. దైవ బలం లేక పోతే, గొఱ్ఱె కూడా కరుస్తుంది ! కలి కాలపు వింత అంటే ఇదే !
పాండవు లిడుమల బడరే
మాండవ్యుడు కొరత బడడె మహి ప్రాకృత మె
వ్వండోపు మీరి చనగ న
ఖండిత యశ కుందవరపు కవిచౌడప్పా.
భావం: చేసుకున్న వాళ్ళకి చేసుకొన్నంత ! పాండవులు ఎన్న కష్టాలు అనుభవించ లేదు ? మాండవ్య ముని కొరత పడ లేదూ ! పూర్వ జన్మలో చేసిన పాపాలు తప్పించు కోవడం ఎవరి తరమూ కాదు.
ఆడిన మాటను తప్పిన
గాడిద కొడకంచు తిట్టగావిని మదిలో
వీడా ! నా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఆడిన మాటను తప్పిన వాడిని గాడిదా ! అని తిడితే వీడా నా కొక కొడుకు ! అని గాడిద కూడా ఏడిచిందిట !
మూలిక క్రియ కొదిగినదే
నాలుక సత్యంబు గలదె నడిపిన వాడే
యేలిక వరమిచ్చినదే
కాళికరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: మందుకు పనికొచ్చేదే మూలిక. సత్యం పలికేదే నాలుక. చక్కగా పాలించే వాడే ఏలిక. వరమిచ్చేదే దేవత !
కుటుంబ వ్యవస్థ పట్ల కవి చౌడప్పకి ఎంత గౌరవమో చూడండి:
తన సతి యిడగా మనుమలు
తనయులు తలిదండ్రులన్న దమ్ముల్ బంధుల్
దినదినములు భుజియించుట
ఘనవిభవము కుందవరపు కవిచౌడప్పా.
భావం: భార్య వడ్డిస్తూ ఉంటే, మనుమలు, తల్లిదండ్రులూ, అన్నదమ్ములు, బంధువులూ అందరూ కలిసి రోజూ భోజనం చెయ్యడం ఎంత వైభవంగా ఉంటుందో కదా ! ( ఈ రోజుల్లో ఇలాంటి సీను ఎక్కడో తప్ప, కనబడి ఛస్తుందా, ఏమన్నానా ?)
సరసము చతురోపాయము
హరి భక్తియు శాంత గుణము నర్థుల పట్లన్
పరమౌ చుపకారము విను
కరుణాకర కుందవరపు కవిచౌడప్పా.
భావం: సరసం, చతురోపాయం, హరి భక్తి, శాంత గుణం, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి.
సీమ దయా పరుడేలిన
క్షేమంబగు దోసకారి సీమేలినచో
క్షామంబగు నతడేలే
గ్రామంబున కుందవరపు కవిచౌడప్పా.
భావం: దయాపరుడైన వాడు నేలను పరిపాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. దుర్మార్గుడు పాలిస్తే అంతటా కరువే . ( ప్రభువుల వారలూ, చిత్తగించారా ?)
చౌడప్ప కవి వర్గ దృక్పథం ఎలాంటిదంటే,
ఎన్నగల యడవి మృగముల
కన్నీరేమైన వేటగానికి ముద్దా ?
నన్నాపు దొరకు బీదల
కన్నీరును కుందవరపు కవిచౌడప్పా.
భావం: వేట గాడికి అడివి జంతువు కన్నీళ్ళు ముద్దా యేమిటి ? వాటికతడు కరిగి పోతాడా ? అలాగే దోచు కునే దొరకు పేదవారి కన్నీళ్ళు ముద్దొస్తాయా ?
చౌడప్ప వృత్త పద్యాలలో మచ్చు కొకటి చూడండి:
ఆసలజేరి దుర్గుణ గణాఢ్యుని దాత వటంచు వేడినన్
మీసము దువ్వుచున్ దిశల మీదన చూచుచు దుర్మథాంథుడై
మీసము నియ్య లేని నలు విత్త గులాము కీర్తి చేరునా ?
భూసుర వర్య కుందవర భూషణ చౌడ కవీశ్వరోత్తమా !
భావం: దుర్మార్గుడిని మన ఆశ కొద్దీ దాతవు అని వేడుకొంటే యేమవుతుంది ? మీసాలు మెలి త్రిప్పుతాడు. పైకీ కిందకీ చూస్తాడు. వీసం కూడా ఇవ్వడు. ఆ వెధవకి ఏం కీర్తి వస్తుంది చెప్పండి 
కావాలనే చాలా బూతు పద్యాలు చెప్పాడు. అలాగే చాలా నీతులూ చెప్పాడు. ఆ సంగతి కవి ఇలా స్పష్టం చేస్తున్నాడు:
బూతులు కొన్నిట కొన్నిట
నీతులు చెప్పితి బుధులు నీతులబూతుల్
బూతుల మెచ్చందగు నతి
కౌతుక మతి కుందవరపు కవిచౌడప్పా.
భావం: నా పద్యాలలో కొన్నింట నీతులు చెప్పాను. అలాగే, కొన్నింట బూతులూ చెప్పాను. తెలివైన వాళ్ళు నేను చెప్పిన నీతులతో పాటు ఆ బూతులనీ మెచ్చు కోవాలి సుమా !
చౌడప్ప కవి దెబ్బ ఎలాంటిదంటే ....
కాకులు వేవేలొక్క తు
పాకి రవము విన్న నులికి పడవా మరి ! నా
ఢాకకు తగు నాలాగే
కాకవులును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఒక్క తుపాకి చప్పుడు వినగానే వేల కొద్దీ కాకులయినా సరే తుర్రుమంటూ ఎగిరి పోతాయ్ ! కదా ! అలాగే, కువులు కూడా నా దెబ్బకు అదిరి పోవలసినదే !
ఏం పెంకెతనం !
ఈ టపా రాసి post చెయ్య బోతూ ఉంటే వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. వస్తూనే వంటింటి వాసలనలని పసి కట్టేసి, ఇవాళ టిపిను పెసరట్లలా ఉందే ! అని సంతోషంగా నవ్వీసి , నేను రాసినదంతా చదివేడు.
‘‘ ఛ ! నువ్వు కూడా ఇంత దిగజారి పోతా వనుకో లేదు. నీ దిక్కుమాలిన కథా మంజరి బ్లాగులో ఇంత కాలం ఏవో పద్యాలూ, శ్లోకాలూ పెడుతూ నీ చేతి దురద తీర్చు కుంటున్నావంటే పోనీ లెమ్మను కున్నాను.. చివరకి ఈ అప్ప కవిగాడి పద్యాలు పెట్టే స్థితికి వచ్చేవన్నమాట !’’
అంటూ ఘాటుగా విమర్శించాడు. నేను కొయ్యబారి పోయేను.
వాళ్ళక్కయ్య ( సొంత సోదరి కాదు లెండి. వరసకి అక్కయ్య. అదీ వాడు కలుపుకొన్న వరసే)
పెసరట్టూ, ఉప్మా టిఫిను పెట్టి, కమ్మని కాఫీ ఇస్తే తాగి నిమ్మళించేడు.
అప్పుడన్నాడు: ‘‘ హు ! నీ ఏడుపేదో నువ్వు ఏడువ్. నాకెందుకు గానీ, ఆ అప్ప కవిగాడి మిగతా బూతు  పద్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయ్ ?!’’ అన్నాడు సూటిగా.
ఈ మారు నిఝంగానే ( ఒక మేజా బల్ల చేయించు కోడానికి సరిపడేటంతగా ) కొయ్యబారి పోయేను.