25, ఆగస్టు 2010, బుధవారం
భగవంతుడు భక్త సులభుడు !!
21, ఆగస్టు 2010, శనివారం
శాంతము లేక, సౌఖ్యమూ లేదూ ...
తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:
న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.
కోపం మంచి వాళ్ళకి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులని బాధిస్తుంది.
చందనం చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒక్కలాగే దహించి వేస్తంది కదా?
కోపం అగ్ని లాంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతంగా ఉండండర్రా అని చెబుతూ ఉంటారు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
అని బద్దె భూపతి చెప్ప లేదూ?
క్రోధమ తపముంజెఱచును
క్రోధమ యణిమాదులైన గుణములఁబాపున్
క్రోధమ ధర్మ క్రియలకు
బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికి జన్నే?
(నన్నయ . భారతం)
కోపం వలన తపస్సు చెడి పోతుంది. అణిమాది సిద్ధులు పనికి రాకుండా పోతాయి. కోపం ధర్మ విధులకు ఆటంకం కలిగిస్తుంది. మునులకు కోపం తగదు.
చీటికీ మాటికీ వెర్రి కోపంతో ఊగి పోతూ శాపాలిచ్చే దూర్వాస ముని తెలుసు కదా? దాని వలన అతని
తపో ఫలితమంతా హరించుకు పోయేది.
కీచకుడు ద్రౌపదిని చెరబట్టాలని తమకంతో వెంట తరిమాడు. ఆమె విరటుని కొలువు లోనికి ప్రవేశించింది. ఆమెను తరుముతూ వచ్చేడు కీచకుడు. అక్కడే ఉన్నవలలుడు అనే పేరుతో విరటుని కొలువులో వంటల వాడిగా ఉన్న భీముడికి కోపం నసాళానికెక్కింది. అమిత క్రోధా వేశంతో ఊగి పోయేడు. అక్కడ ఉన్న ఓ ఫలవృక్షాన్ని పెకిలించి, దానితో కీచకుని అంతం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అంత పనీ చేసే వాడే, కంకుభట్టుగా విరటుని కొలువులో ఉన్న ధర్మ రాజు గూఢ భాషణంతో వారించ బట్టి సరి పోయింది. లేక పోతే, అఙ్ఞాత వాసం భగ్నమై, కథ మళ్ళీ మొదటి కొచ్చి ఉండేది.
వలలుండెక్కడఁజూచె? నసేవ్యక్ష్మాజముల్ పుట్టవే?
ఫలితంబై వర శాఖ లొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగాఁ
గల యీ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికిన్ !
ఈ వంటల వాడు వలలుడు ఈ ఫలవృక్షాన్ని ఎక్కడ చూసాడయ్యా ! ఒట్టి మూర్ఖుడిలా ఉన్నాడే? చక్కగా పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి, అందరికీ నీడని ప్రసాదిస్తూ సేద దీర్చే ఈ పండ్ల చెట్టు ఇతనికి వంట కట్టెల కోసం కావలసి వచ్చిందా? వేరే చోట ఎక్కడా ఎండి పోయిన పనికి రాని చెట్లే లేనట్టు వీడి కన్ను దీని మీద పడ్డదేమయ్యా. పండ్ల చెట్టుని ఎవరయినా వంట చెఱకు కోసం తెగ నరుకుకుంటారా?
ధర్మ రాజు మాటలలోని అంతరార్ధం గ్రహింపునకు వచ్చేక భీమ సేనుడు అప్పటికి శాంతించేడు. ఆ తర్వాత వడ్డీతో సహా తన కసి తీర్చుకున్నాడనుకోండి.
కోపం వస్తే వారించడానికి అందరకీ అలాంటి అన్నగార్లు దొరకొద్దూ?
అన్నగారంటే అన్నగారా ! ధర్మ రాజు గుణ గణాలను వర్ణిస్తూ విజయ విలాసంలో చేమకూర వేంకట కవి ‘‘ కోపమొకింత లేదు, బుధ కోటికి కొంగు పసిండి, పత్యమా రూపము, తారతమ్యము లెఱుంగని స్వతంత్రుడు ... యిత్యాదిగా వర్ణించాడు.
అందు చేత కోపం తగ్గించు కోవడం మంచిది. కోపం వల్ల ఎంత వినాశం జరిగిందో చెప్పడానికి మన పురాణాలలోనూ, కావ్యాలలోనూ , ప్రబంధాలలోనూ అసంఖ్యాకమైన వృత్తాంతాలున్నాయి.
అవన్నీ నేను చెప్పడం మొదలు పెడితే చదవడానికి విసుగు వేసి మీకు కోపం రావచ్చు.
చివరగా రెండు చిన్న జోకులు:
అప్పా రావు: ఎందుకురా, అంత కోపంగా ధుమ ధుమలాడి పోతున్నావు?
పాపారావు: ఆ శాంతారావు గాడిని కోపం తగ్గించుకోరా నాయనా, అని చిలక్కి చెప్పినట్టగా ఎంత చెప్పినా వినడే ! వొళ్ళు మండి పోయిందనుకో, చెడామడా దులిపేసాను...
మరొకటి:
భర్త: మా ఆవిడకి వొళ్ళెరుగని పిచ్చి కోపమనుకో. ప్రతి దానికీ ఒకటే అరుస్తూ ..
భార్య: ఆఁ ... ప్రతి దానికీ ఊరికే అరుస్తూ ఉంటాను. గోల చేస్తాను. అదేగా మీరు చెప్నబోయేది? (అంటూ గయ్యిమంది)
20, ఆగస్టు 2010, శుక్రవారం
మన ఓటు మంచికే !
19, ఆగస్టు 2010, గురువారం
ఏ నిముషానికి ఏమి జరుగునో ... ...
మరు నిముషంలో ఏమి జరుగుగుతుందో మనకి తెలియదు. క్షణం మనది కాదు.
ఈ శ్లోకం చూడండి:
కాంతం ప్రాహ కపోతికా22కులతయా కాంతాంతకాలో2ధునా
వ్యాధో2ధో ధృతచాప పాణిత శర: శ్యేన: పరిభ్రామ్యతి
ఇత్థం సత్య2హినా స దృష్ట ఇషునా శ్యేనో2పి తేనాహత:
తూర్ణం తౌ తు యమాలయం పరిగతౌ దైవీ విచిత్రాగతి:
ఓ చెట్టు మీద పావురాల జంట కులాసాగా కాపురం చేస్తున్నది. ఇంతలో ఆడు పావురం మగనితో అంది కదా: ‘‘ ఓ ప్రియుడా ! మనకి లోకంలో ఇక నూకలు చెల్లిపోయేలా ఉంది. అంత్య కాలం దగ్గర పడినట్టుగా ఉంది. అదిగో, అలా చూడు ! బోయ ఒకడు బాణాన్ని ఎక్కు పెట్టి మన వేపే గురి చూస్తున్నాడు. పైన డేగ ఎగురు తోంది. ఇవే మనకి చివరి ఘడియలు ’’
ఆ కపోత మిధునం ప్రాణాల మీద ఆశ వదులుకుని ఊపిరి బిగ పట్టి మృత్యువు ఆసన్నమయిందని నిర్ణయించుకుని విషాదంతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నది.
ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది !
ఒక పాము జరజరా ప్రాకి వచ్చి, వేట గాడిని కరిచింది. వాడి బాణం గురి తప్పింది. తిన్నగా వెళ్ళి పైన ఎగురుతున్న డేగకి తగిలి, అది మరణించింది. పాము కాటుకి వ్యాధుడూ మృతి చెందాడు.
చూసారు కదా? కొద్ది క్షణాల తరవాత దొరక బోయే ఆహారాన్ని తలచుకుంటూ సంతోషంగా ఉన్న డేగ, బోయ ఇద్దరూ అకాలమృత్యు వాత పడ్డారు. చావు తథ్యమనుకున్న పావురాల జంటకి ఆ గండం గడిచింది.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ .... అని లవకుశ సినిమాలో కవి ఈ తత్వం బాగా వంట పట్టించుకునే ఆ చరణం రాసాడు కదూ.
జీవితం క్షణ భంగురం అనే విషయం విస్మరించి అశాశ్వతాలయిన విషయాలను శాశ్వతాలని అనుకోవడం తగదు.
ఏవీ మన వెంట రావు.
చూడండి:
ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే , నారీ గృహ ద్వారి, జన:శ్మశానే
దేహాశ్చితాయాం, పర లోక మార్గే కర్మానుగ: గచ్ఛతి జీవ యేక:
మనం జీవిత కాలంలో సంపాదించుకున్న ధనమంతా, మరణానంతరం మన వెంట రాదు.భూమి మీదనే ఉండి పోతుంది పశు సంపద కూడా పశువుల శాలలోనే ఉండి పోతుంది తప్ప కనీసం మన పార్ధివ శరీరాన్ని చూడడానికయినా రాదు. ఎంతో ప్రియమైన భార్యా మణి కూడా ఇంటి ద్వారం వరకూ తప్ప కనీసం శ్మశానం వరకూ కూడా రాదు. బంధు మిత్రులు పరేత నిలయ ప్రాంతం వరకూ మాత్రమే వస్తారు. మన వెంట కడదాకా రారు.
పిచ్చి మమకారంతో , గంధాదులు అలముకుని, ఎంతో జాగ్రత్తగా, మురిపెంగా , అపురూపంగా, చూసుకున్న మన దేహం చితి వరకూ మాత్రమే కదా వచ్చేది?
ఇక, పర లోక మార్గాన మనని వెన్నంటి వచ్చేది ఎవరయ్యా అంటే, మనం చేసిన కర్మ మాత్రమే
పుణ్య కర్మలు చేయడం వలన పుణ్య లోకాలకీ, పాప కర్మలు చేయడం వలన పాప లోకాలకీ పోతాం.
స్వర్గ నరకాల సంగతి ట్రాష్ అనుకున్నా, మంచి పనులను చేయాలనే భావనలో తప్పు లేదు కదూ?
ధర్మాన్ని ఆచరించడం కూడా ఎలాగంటే,
అజరామరవత్ ప్రాఙ్ఞొ విద్యా మర్ధం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు, మృత్యునా ధర్మ మాచరేత్
తెలివైన వాడు ముసలితనం, చావు లేని వాని వలె విద్యను సముపార్జిస్తూ, ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి.
మృత్యువు జుత్తు పట్టి లాగుతున్నట్టుగా భావించి ( అంటే, మరు క్షణంలోనే చావు తప్పదనుకుంటూ) ధర్మాన్ని ఆచరించాలి.
అంటే రేపు, మాపు అంటూ వాయిదాలు వేయకుండా తక్షణమే ప్రారంభించి ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి.
చెప్పొచ్చావులే, గొప్ప ! ఇంతకీ, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలేమిటయ్యా, అని, నన్ను ఎవరయినా నిలదీసే ప్రమాదాన్ని శంకించి, చెబుతున్నాను:
తన యెఱిగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక పంకమున బడున్ !
(నన్నయ )
తనకి తెలిసిన దానిని గురించి చెప్పమని ఎవరయినా అడిగితే చెప్పని వాడు, నిజం పలుకని వాడు ఘోరమైన నరకకూపంలో పడతాడని భారతం చెబుతోంది. అందుచేత, ఎందుకయినా మంచిదని ( ఎవరూ అడగక పోయినా) నాకు తెలిసినదీ ( ఏదో , సముద్రంలో నీటి బొట్టంత) , విన్నదీ, కన్నదీ, చదివినదీ, తెలిసినదీ, తెలుసుకున్నానని అనుకున్నదీ, అర్ధమయినదీ. అర్ధమయిందనుకున్నదీ చెప్పడం నా ధర్మం కనుక చెబుతున్నాను.
ఇక, ఈ టపా చదివి, పోనిద్దూ, అని ఊరుకోకుండా, బాగుందనో, బాగు లేదనో, కామెంట్ రూపంలో వెల్లడి చేయడం మీ కనీస ధర్మంగా భావించండి. ఆ ధర్మాన్ని ఆచరించి, పుణ్యలోకాలలో ( రంభా, ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఘృతాచి ... ) సీటుని అడ్వాన్సుగా బుక్ చేసుకోండి. ఆపైన మీ యిష్టం. మళ్ళీ, చెప్ప లేదంటనక పొయ్యేరు ....
( ఈ రాతని లైట్ తీసుకోండేం?)
18, ఆగస్టు 2010, బుధవారం
వేటి వలన ఏవి శోభిస్తాయి ?
17, ఆగస్టు 2010, మంగళవారం
ఇవి ఉంటే అవి అక్కర లేదు !!
13, ఆగస్టు 2010, శుక్రవారం
ఏవి అసలైన పూజా పుష్పాలు?
11, ఆగస్టు 2010, బుధవారం
ముఠా కవులు
9, ఆగస్టు 2010, సోమవారం
ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ మహాత్మా , ఓ మహర్షీ !
8, ఆగస్టు 2010, ఆదివారం
వాళ్ళంతే, మరి ...
7, ఆగస్టు 2010, శనివారం
శేషం కోపేన పూరయేత్ !!
6, ఆగస్టు 2010, శుక్రవారం
మా ఇంటి కొస్తే నాకేం తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావ్ ?
28, జులై 2010, బుధవారం
కోపం తన్నుకొస్తోందా ; పది లెక్క పెట్టండి ....
సహసా విదధీత న క్రియా, మవివేక: పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:
ఈ శ్లోకం ఏం చెబుతోందంటే , ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !
ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఓ కథ ప్రచారంలో ఉంది.
అదేమిటంటే ...
కిరాతార్జునీయమ్ కావ్యం రచించిన భారవి గురించిన కథ. భారవికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, అతని తండ్రి మాత్రం ఎప్పుడూ అతని గొప్పతనాన్ని అతని ఎదుట పొగుడుతూ ఒక్క మంచి మాట కూడా అనే వాడు కాదుట ! దీనితో భారవికి కోపం వచ్చి , తండ్రిని అంతం చేయాలనుకున్నాడుట. ఆలోచించి ఓ రాత్రి ఇంట్లో అటక మీదికి ఎక్కి , ప్రక్కనే ఓ బండ రాయి పెట్టుకుని అదను కోసం చూస్తూ కూర్చున్నాడుట. ఇంతలో తల్లిదండ్రుల సంభాషణ అతని చెవిని పడింది.
తల్లి : ‘‘ మన భారవిని లోకమంతా అంత గొప్ప కవి అని పొగుడుతూ ఉంటే, మీరు మాత్రం ఒక్కసారీ మెచ్చు కోవడం లేదు ! వాడెంత బాధ పడుతున్నాడో తెలుసా ? ...’’
తండ్రి : ‘‘ అమాయకురాలా ! మన భారవి నిజంగా చాలా గొప్ప కవి. అతని కవిత్వం మహాద్భుతం. అందరూ పొగుడుతున్నట్టుగా తండ్రినయిన నేను పొగడ కూడదు. అది వాడికి క్షేమకరం కాదు.అందుకే పొగడడం లేదు. తండ్రి పొగడ్త బిడ్డలకి ఆయుక్షీణం అంటారు. అంతే కానీ వాడన్నా , వాడి కవిత్వమన్నా నాకెంత ఇష్టమో తెలుసా ? ...’’
దీనితో భారవి గుండె బరువెక్కింది. కిందకి దిగి వచ్చి, తన అపరాధాన్ని మన్నించమని తండ్రిని వేడుకుని, తనకి తగిన శిక్ష వేయమని కోరేడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. దానితో తండ్రి భారవిని ఒక యేడాది పాటు అత్త వారింటిలో గడపి రమ్మని శాసించాడు.
శిక్ష వేయమంటే తండ్రి వరమిచ్చాడనుకుంటూ పొంగి పోతూ భారవి భార్యా పిల్లలతో పాటు అత్త వారింటికి చేరాడు.
తొలి రోజులు బాగానే గడిచాయి. అత్త వారింట భారవికి మంచి మర్యాదలే జరిగాయి. కాని రోజులు గడిచే కొద్దీ అతనికి ఆ ఇంట గౌరవాదరాలు తగ్గి పోయాయి. అంతా చాలా హేయంగా చూడ సాగారు. భారవికి భరించ లేనంత అవమానంగా ఉంది. కానీ ఏడాది శిక్షాకాలం గడపాలి కనుక, పంటి బిగువున కాలం గడపసాగేడు.
ఇలా ఉండగా అతని భార్య శుక్రవారం వరలక్ష్మి నోము నోచుకుంటాననీ, దానికి ఏర్పాట్ల కోసం కొంత డబ్బు ఇమ్మనీ అడిగింది.
భారవి దగ్గర చిల్లి గవ్వ లేదు. ఆలోచించి, తను వ్రాసిన కిరాతార్జునీయమ్ కావ్యం లోని ఒక శ్లోకం ఉన్న తాటాకును తీసి భార్యకు ఇచ్చి ఏ ధనవంతుని దగ్గరయినా దానిని కుదువ పెట్టి డబ్బు తెచ్చుకో మని చెప్పాడు. ఆమె దానిని ఓ ధనవంతుని ఇంట కుదువ పెట్టి అతడిచ్చిన పైకంతో నోము నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది.
ఇలా ఉండగా, ఆ ధనవంతుడు ఆమె ఇచ్చిన శ్లోకం వ్రాసి ఉన్న తాటాకుని ఎక్కడ పెడదామా అని ఆలోచించి , చివరకి తన కత్తి ఒరలో దానిని కత్తితో పాటు భద్రంగా ఉంచి , గూట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి పోయి, చాలా ఏళ్ళకి ఇంటికి వచ్చేడు.
వస్తూనే తన రాకతో భార్యకి విభ్రమం కలిగించాలనే చిలిపి ఆలోచనతో ఇంటి వెనుక వేపు ద్వారం లోనుండి ఇంట్లోకి ప్రవేశించాడు.
అక్కడ తమ పడక గదిలో భార్యతో పాటు మరో యువకుడు కూడా సన్నిహితంగా ఉండడం గమనించి, కోపంతో ఊగి పోయాడు. భార్యనీ , ఆ యువకుడినీ చంపెయ్యాలని అనుకుని క్రోధంతో గూటి లోనుండి కత్తిని తీసాడు. సర్రున కత్తి లాగుతూ ఉంటే దానితో పాటు ఓ తాటాకు కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా అని ఆసక్తిగా చదివాడు.
అదే, మీద చెప్పిన శ్లోకం !
ఒక్కక్షణం తటపటాయించేడు. ఇంతలో భార్య లేచి, భర్తని చూసి ఆనందంతో పలకరిస్తూ ఆ యువకుడిని పరిచయం చేసింది. ఆ యువకుడు వారి కుమారుడే. ఆ ధనవంతుడు విదేశాలకు వెళ్ళే సమయంలో అతని భార్య నెల తప్పింది. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టాడు. క్రోథావేశంలో ఆ సంగతి కూడా విస్మరించి నందుకు ఆ ధనవంతుడు చాలా సిగ్గు పడ్డాడు.
పెను ప్రమాదం నుండి తన భార్యనీ , కుమారుడినీ కాపాడినందుకు , తను క్రోథావేశంతో నేరం చేయకుండా రక్షించినందుకు అతనికి ఆ శ్లోక రచయిత భారవి పట్ల అపారమయిన గౌరవాదరాలు కలిగి, మరుచటి దినమే ఆ మహా కవిని దర్శించుకుని గొప్ప కానుకలు సమర్పించుకున్నాడు.
భారవి శిక్షా కాలం కూడా ఆ దినంతో ముగియడంతో అతను ఆ అపూర్వ ధన రాసులతో, భార్యా బిడ్డలతో తిరిగి తన తల్లిదండ్రుల చెంతకు ఆనందంగా చేరాడు.
చక్కగా ఆలోచించి చేసే పనికి ఏ ఆటంకమూ రాదు. వేయి విధాలుగా ఆలోచించి కార్యాలు చేయని వాడు గొప్ప ఆపదల పాలవుతాడు. ఆలోచించి చేసే వాడిని లక్ష్మి వరిస్తంది. అని ఈ శ్లోకార్ధం నిత్య సత్యం కదూ !
అందుకే కదా, కోపం తన్నుకొస్తూ ఉంటే , పది అంకెలు లెక్క పెట్టమని మని పెద్దలు చెప్పారు ....
రెడీ ... ఒన్ ... టూ ... త్రీ ... ఫోర్ ....!!
25, జులై 2010, ఆదివారం
వాళ్ళని మరి మార్చ లేం !
దుర్జనేన సమం వైరం , ప్రీతించాపి న కారయేత్