హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జూన్ 2010, శుక్రవారం

మంచి మాట

హిత ‘ వచనమ్’ . కామ్ లో భారతేతి హాసంలో చెప్ప బడిన హిత వచనాలను ఒక చోట క్రోడీకరించి వచనంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కదా ? ఆ క్రమం లో , ఇది, శ్రీమదాంధ్ర మహా భారతం, నన్నయ కృతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం నుండి ....

జనమే జయునితో సరమ పలికిన పలుకులు:

ఓ రాజా ! ఈ పని తగినది. ఈ పని తగనిది అని మనస్సులో ఆలోచించుకుని చేయాలి. అలా కాకుండా బీద వారికీ, అశక్తులకీ , మంచి వారికీ కావాలని అపకారాలు చేసే నీతి రహితులకు అకారణంగానే ఆపదలు వస్తూ ఉంటాయి

ఉదంకోపాఖ్యానం లోని ‘ నిండు మనంబు నవ్య నవనీత సమానము ...’’ అనే పద్యం చాల ప్రసిద్ధమైనది. పౌష్య మహా రాజు శాపమిచ్చిన పిదప ఉదంకునితో పలికిన పలుకులు ...

ఓ మహా మునీ ! అప్పుడే తీసిన వెన్నలా మిక్కిలి మృదువుగా ఉంటుంది బ్రాహ్మణులు మనసు. మరి వారి మాట మాత్రం భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది. ఇది నిజం. మనసూ, మాట రాజులలో దీనికి విరుద్ధంగా ఉంటాయి. అంటే, రాజులలో మనసు వజ్రతుల్యంగా ఉంటుంది. మాట నవనీత సమానంగా ఉంటుంది. కనుక, బ్రాహ్మణుడు శాపమిస్తే, తరిగి ఉపసంహరించ గలుగుతాడు. రాజు ఎంత శాంత స్వభావం కలవాడయినా, యిచ్చిన శాపాన్ని ఉపసంహరించ లేడు సుమా !

భృగు మహర్షి తో అగ్ని దేవుడు పలికినది ...

తనకు తెలిసిన విషయాన్ని ఇతరు డెవరయినా ‘ఇది ఎలా జరిగిందో చెప్పు ’ అని అడిగితే చెప్పడానికి నిరాకరించే వాడు ఘోరమయిన నరక కూపంలో పడతాడు. అలాగే, సత్యం చెప్పని వాడు కూడ నరకానబడతాడు.


మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో ...

స్వస్తి.


10, జూన్ 2010, గురువారం

మంచి మాట


హిత వచనమ్ . కామ్ లో భారతంలో చెప్ప బడిన రాజ నీతి ధర్మాలు చూస్తున్నాం కదా.
ఇప్పడు మరి కొన్ని యుద్ధనీతి ధర్మాలు చూదాం ... శాంతి పర్వం ద్వితీయాశ్వాసం నుండి ....


రాజు తన మూల బలం ( అంటే, చతురంగ బలాలలో ప్రధాన సైన్యం) శత్రుసంహారార్ధం అని భావించి, దానిని ప్రేమగా చూడాలి. శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించి నప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం.యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి. అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన సామోపాయంతో ప్రవర్తించాలి.

ఒక్కో సారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు. శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా సామ దాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి భేదోపాయానికి ప్రయత్నించాలి.

శుక్రాచార్యుడి మతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావ మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.

మరి కొంత యుద్ధ నీతి చూడండి ...

యుద్ధంలో శత్రువు పైన్యంతో ఎదుర్కొంటే, నువ్వూ సైన్యం తోనే ఎదిరించాలి. శత్రవు ఎక్కటి కయ్యానికి తలపడితే నీవూ అదే చేయాలి.శత్రువు మాయోపాయాలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీవు కూడ కపటోపాయంతోనే ఎదిరించాలి.
శత్రువు వెన్ను చూపి పారిపోయినా, అజాగ్రత్తగా ఉన్నా, అతని ఆయుధం భగ్నమయినా, శరణు వేడినా, మ్రొక్కినా, శత్రువు గుర్రాలు నేల కూలినా, పారి పోయినా, శత్రువు వేరొకడితో యుద్ధం చేస్తున్నా, ఎట్టి పరిస్థితులలోనూ శత్రువుని చంప కూడదు సుమా ! అది యుద్ధ నీతి కాదు. అధర్మంగా యుద్ధంలో శత్రువుని చంపడం కంటె చావడం మంచిది.

మరొక విషయం ... యుద్ధంలో వాడే ఆయుధాల గురించి ... చివర ములికిని ఉంచి తయారు చేసిన ఆయుధాన్ని కానీ, లేదా, విషం పూసిన ఆయుధాన్ని కానీ ఎలాంటి శత్రువు మీద కూడ ప్రయోగించ కూడదు. అలా చేస్తే రాజునకు నరకం ప్రాప్తిస్తుంది.
అలాగే యుద్ధలో తనకు సహాయంగా వచ్చి, ఘోరంగా గాయాలబారిన పడిన వారిని పట్టించు కోకుండా ఉండ కూడదు.అది చాల పాప హేతువు.

శత్రువుపై దండెత్తి, అతని రాచ నగరుని వశం చేసుకుని, నాశనం చేయడమూ, అక్కడి ప్రజలను బాధించడమూ కూడ తగదు. అలాగే బ్రాహ్మణుల యిళ్ళను, దేవాలయాలను కొల్ల గొట్టడం కూడా సరి కాదు. అది రాజునకు తగని పని.

భీష్ముడు ఈ యుద్ధ నీతిని బోధించగా విని, ధర్మ రాజు ‘‘ మొత్తానికి రాజ ధర్మం కంటె మరొక పాప కార్యం లేనట్టుంది. ఎలా చూసినా రాజునకు నరకం తప్పేలా లేదు.’’ అంటూ కించ పడ్డాడు.

రాజ్యాంతే నరకం ధృవమ్ అని పెద్దలు చెప్ప లేదూ ?

మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో చూదాం ...

స్వస్తి.


7, జూన్ 2010, సోమవారం

మంచి మాట


ఆంధ్ర మహా భారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం ( తిక్కన కృతం) శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ఒక అపూర్వ మయిన పద్యం ఉంది.

సారపు ధర్మమున్ విమల సత్యముఁబాపము చేత బొంకుచేఁ
బారముఁబొంద లేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్య శుభ దాయక మయ్యును దైవముండెడిన్

ఉత్తమ మయిన ధర్మం, నిర్మల మయిన సత్యం పాపం చేతను, అసత్యం చేతను దరి చేర లేక చెడబారి పోవడానికి సిద్ధ మయిన తరుణంలో వాటిని రక్షించ గలిగే సమర్ధత కలిగి ఉండి కూడ ఎవరు ఉపేక్ష చేస్తారో, అది వారికే కీడు కలిగిస్తుంది. కాని, ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడే దైవం ఉంటాడు సుమా!

శ్రీకృష్ణుడు కురు సభలో పెద్దలందరి ఎదుట పలికిన పలుకులివి.

ఉదాత్తమయిన వ్యంగ్య వైభవంతో, గంభీర భావ ప్రధానమయిన ఈ పద్యం మహా భారతం లోనే ఒక ధర్మ దీపంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు.

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత నశిస్తున్నప్పుడు దక్షులైన వారు చూస్తూ ఊరుకుంటే, అది వారికే హాని కలిగిస్తుంది. సత్య ధర్మాలను కాపాడడానికి భగవంతుడు ఉంటాడు.

కురు సభలో సత్య ధర్మాలకి చ్యుతి కలుగుతున్నా ఉపేక్ష చేసిన పెద్దలకు ఒక హెచ్చరికగా ఉంటుందీ పద్యం. అలాగే, సత్య ధర్మాలను కాపాడే శ్రీకృష్ణుడు పాండవ పక్షం వహించి ధర్మ రక్షణ చేసి, సత్యాన్ని కాపాడతాడని సూచన కూడ ఇందులో ఉంది.

ఈ పద్యం తిక్కన రచలనలో ఒక అనర్ఘ రత్నంగా భాసిస్తూ ఉంటుంది. మహా భారత కథా తత్త్వానికి ఈ పద్యం ఆత్మ వంటిదని పెద్దలు చెబుతారు.

క్లిష్ట మయిన పరిస్థితులలో భగవంతుడు ధర్మాన్నీ, ధర్మాత్ములను రక్షిస్తాడని, అధర్మాన్నీ, అధర్మ పరులనూ శిక్షిస్తాడనీ నమ్మే తెలుగు వారి విశ్వాసానికి అద్దం పట్టేలా ఉంటుందీ పద్యం.

తదుపరి హిత వచనమ్ . కామ్ లో మరి కొన్ని చూదాం ...

స్వస్తి.


4, జూన్ 2010, శుక్రవారం

మంచి మాట

ఏ ప్రభుత్వమయినా సక్రమంగా నడుస్తూ, అభివృద్ధి పనులు చేయాలంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడుతూ ఉండవలసినదే. ప్రజల నుండి పన్నులు వసూలు చేయ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ధనాగారాన్ని ఎలా నింపు కోవాలా అనే ఆలోచనతో మరీ క్రూరమయిన విధంగా పన్నులు వేయడం వసూలు చేయడం తగదు.

శ్రీమదాంధ్ర మహా భారతం శాంతి పర్వం ద్వితీయాశ్వాసంలో భీష్ముడు ధర్మ రాజుకి కోశాగారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చక్కగా వివరించిన సందర్భం ఉంది. సార్వ జనీనమయిన ఆ ఉపన్యాస సారాంశం వచనంలో ...హిత వచనమ్ . కామ్ టపా గా అందిస్తున్నాను .....

భీష్ముడు ధర్మ రాజుతో యిలా చెప్పాడు...

ధర్మ రా జా ! ప్రజల నుండి పన్నులు వసూలు చేసేటప్పుడు రాజు చాల జాగ్రత్త వహించాలి

రాజా ! సావధానంగా విను. పన్నుల రూపంలో రాజునకు ధనం చేకూర్చే వాళ్ళలో రైతులు, వర్తకులు, గోపాలురు ముఖ్యులు.

ధనోత్పత్తికి వర్తక వాణిజ్యాలు ఆధారాలు. అలాగే, ధాన్యాభివృద్ధికి భూమి ఆధారం. అందు వల్ల ఇవి రాజు ఆధీనం లోనే ఉండాలి. వాటికి హాని కలుగ కుండా ఉండే రీతిలో రాజు జాగ్రత్తగా ధనాగారాన్ని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నించాలి.

ఆకలితో ఉన్న పులి ఈనిన వెంటనే తన పిల్లలను తానే తినేస్తుంది. ఆ విధంగా క్రూరంగా రాజు ప్రజల నుండి పన్నుల వసూలు చేయడం మొదలెడితే పన్నులు సరిగా వసూలు కావు, సరి కదా, కోశాభివృద్ధి ఆగి పోతుంది. అందు వలన ప్రజలకు బాధ కలగనీయకుండా, కష్టం తెలియకుండా జలగ నెత్తురును ఎలా పీలుస్తుందో అలా, రాజు ప్రజల నుండి పన్నులు వసూలు చేయించ గలగాలి. అప్పుడే కోశాగారం కళకళలాడుతుంది.

ప్రజాభి వృద్ధికరమయిన పనులు రాజు చేస్తూ ఉండాలి. మూర్ఖపు పట్టుదలలకు పోకూడదు. చక్కటి ఉపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడతారు. కోశాగారం తప్పకుండా నిండుతుంది. రాజు ఏం చేయాలంటే, ఎవరిని దండించాలో వారిని తగిన సమయంలో దండించాలి. శిక్షార్హులకు సకాలంలో తగిన దండన విధించాలి. వారి సంపదను స్వాధీన పరుచు కోవాలి. అలా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. బొక్కసమూ నిండుతుంది.

రాజుకి అసూయ తగదు. ధనవంతులయిన తన ప్రజల సిరిసంపదలను చూసి ఓర్చుకో లేక, బలవంతంగా, అన్యాయంగా వారి సంపదను స్వాధీన పరుచుకో కూడదు. అలా చేస్తే రాజుకి కీడు కలుగుతుంది. అందు వలన రాజు దయతో వ్యవహరించి అందరికీ ఆనందం కలిగించాలి.

ఉచితానుచితాలు తెలిసిన రాజు ఇహ పరాలలో సిద్ధిని పొందడం కోసం సామంత రాజులను ఆదరించాలి. వారితో స్నేహంగా మెలగాలి.కర్షకులను ఊరికే భయభ్రాంతులకు లోను చేయ కూడదు. అదను చూసి వారినుండి పన్నులు వసూలు చేయాలి. ధనాగారం నింపుకోవాలి.

రాజు బొక్కసం నింపుకోడానికి న్యాయమైన మార్గాలనే ఎంచుకోవాలి. అంతే కాని, పన్నులు రాబట్టకోవడం కోసం కపటోపాయాలు పన్నుతూ కుటిలుడై ఉండడం తగదు సుమా.

ఓ ధర్మ రాజా! జాగ్రత్తగా విను. అపాత్ర దానం చేసి, ధనాన్ని నాశనం చేసుకుంటే ఆ ధన సంపాదన వలన ప్రయోజనం లేదు. అయితే పాత్రులయిన వారికి దానం చేసి, సంపదలను వెచ్చిస్తే మాత్రం అది ఆ సంపదకు ప్రయోజనకారి అవుతుంది. అందు వల్ల పాత్రత ఎరిగి దానం చేయాలి.

ఓ ధర్మ రాజా ! ఈ విధంగా నీవు నడుచుకుంటే నీ భాండాగారం వృద్ధి చెందుతుంది. దానితో పాటు నీ మిత్రబృందం , రాష్ట్రం , సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కనుక ఈ మార్గం లోనే నడుచుకో. ప్రజలను చక్కగా పరిపాలించు. ప్రజారక్షణ చెయ్యి. యుద్ధాలకు భయ పడ వద్దు. పరాక్రమంతో నీ శత్రువులను సంహరించు. యాగాలు చెయ్యి. దరిద్రులైన బ్రాహ్మణ కుటుంబాలను కాపాడు. మంచి వారిని రక్షించు.

ఉతథ్యుడనే మహర్షి మాంధాత మహా రాజునకు ఇదే విధమయిన హిత వచనాలు చెప్పాడు. అతను చెప్పిన హిత వచనాలేమంటే ...

ధర్మం వల్లనే ప్రాణి కోటి అభివృద్ధి చెందుతుంది. ధన లాభం కలుగుతుంది. రాజనే వాడు ధర్మాన్ని కాపాడడానికే జన్మిస్తాడు. కనుక అతనికి అహంకారం తగదు. కామాన్ని విడిచి పెట్టాలి. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ధర్మ మార్గంలో రాజ్య పాలన చేయాలి .....

ఇవీ భీష్ముడు ధర్మ రాజుకి చెప్పిన ఆదాయ మార్గాలు.

మరి కొన్ని .... తదుపరి హిత వచనమ్ . కామ్ లో.....

విన్నారా, ... ఆర్ధిక శాఖామాత్యుల వారూ ? !

స్వస్తి..

31, మే 2010, సోమవారం

మంచి మాట


మహా భారతంలో రాజ నీతి విషయాలు, ధర్మాలు, హిత వచనాలు చాల ఉన్నాయి. వాటిని వచనంలో ఇక్కడ పొందు పరుస్తున్నాను. చర్విత చర్వణంగా వాటిని మళ్ళీ రాయడమెందుకయ్యా, అంటే, తెలిసిన వారు లక్షల్లో ఉన్నా, తెలియని పదిమంది చదువరుల కోసం నాకు తెలిసినంతమట్టుకు రాస్తే తప్పు లేదనిపించింది. అదీ కాక, ఆయా పర్వాలలో ఉండే వాటిని అన్నింటినీ ఒక చోట క్రోడీకరించి వచనంలో రాయడం వల్ల యువతరం వారికి భారతేతి హాసం మీద మక్కు వ పెరగ వచ్చును కదా అనిపించింది. ఇక నుండి వరసగా ఈ టపా క్రింద వచనంలో రాదామనుకుంటున్నాను.

మహా భారతం సభా పర్వం ( నన్నయ రచన) మొదటి ఆశ్వాసంలో నారద ముని ధర్మ రాజుని కొన్ని రాజనీతి విషయాల గురించి తరచి తరచి అడుగుతాడు. సార్వకాలీన మయిన ఆ పలుకులివి:
( సభా పర్వం ప్రథమాశ్వాసం 26 -56)

ధర్మ రాజా ! మీ వంశంలో ఎంతో మంది రాజ శ్రేష్ఠులు చక్కని ధర్మ పద్ధతిని ఏర్పరచి ఉన్నారు. నీవు ఆ ధర్మ పద్ధతిని విడిచి పెట్టకుండా ఆచరిస్తున్నావు కదా? ధర్మాన్ని తెలుసుకోవాలి. ధర్మార్ధ కామాలు ఒక దానికొకటి బాధకాలు కాకూడదు.కాలోచితంగా వాటిని విభజించుకుని ధర్మ కామాలని ఆచరిస్తున్నావు కదా? ధర్మం మీదనే మనస్సును నిలిపి, చేయ దగిన పనులను గురించి రాత్రి నిద్రించడానికి ముందు స్వంత బుద్ధితో ఆలోచించుకుంటున్నావు కదూ? నీ కొలువులో రక రకాల ఉద్యోగులను నియమించి ఉంటావు. ఆ ఉద్యోగులలో స్థిర బుద్ధి కల వాళ్ళనీ, యోగ్యులైన వాళ్ళనీ, వారి వారి శక్తి సామర్ధ్యాలు గమనించి వారి గౌరవానికి భంగం లేకుండా, స్థిరంగా నియమించావు కదా?

పుణ్యాత్ములనీ, శాస్త్ర విషయాలు బాగా తెలిసిన వాళ్ళనీ, నీమీద ప్రేమ కల వారిని, మీ పూర్వీకుల నుండి మీ కొలువులో నమ్మకంగా పని చేస్తున్న బ్రాహ్మణోత్తములను రాచ కార్యాలు చేయడం కోసం నీకు మంత్రులుగా నియమించుకున్నావు కదా?

ఓ ధర్మ రాజా ! రాజు విజయానికి మూల మైనది మంత్రాంగం. అంటే రహస్యాలోచన. అట్టి మంత్రాంగాన్ని బయటకి వెల్లడి కాకుండా పదిలంగా కాపాడుతున్నావు కదూ ?

రాజా ! నీ పురోహితుడు ఎలాంటి వాడయ్యా? ధైర్యవంతుడేనా? ధర్మాధర్మాలు బాగా తెలిసిన వాడే కదా? వివిధ శాస్త్రాలు బాగా చదువుకున్న వాడేనా? రాగ ద్వేషాలు లేని వాడే కదా?

రాజా ! నీవు ఎన్నొ యఙ్ఞాలు చేస్తూ ఉంటావు. నీ యాజి నిపుణుడే కదా? ప్రయోగ నిపుణత్వం, కర్తవ్యపరాయణత్వం కల వాడే కదా?

ఈ మంత్రులున్నారు చూసావా, పలుకు బడి, సమర్ధతా కలిగి, నీ శత్రు వర్గం రాజ పుత్రులతో చేతులు కలిపి, వాళ్ళకి లంచాలిచ్చి, వారిని మహా ధనవంతులుగా చేసి, నీకు వ్యతిరేకులుగా చేసే అవకాశం కూడా ఉంది. అలా జరుగకుండా చూసుకోవాలి సుమా ! డబ్బు ఎలాంటి వారికయినా, దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది.

రాజా ! నీ ఆస్థాన జ్యోతిష పండితులు స్వీయ ప్రతిభతో దేవతా సంబంధాలు, అంతరిక్ష సంబంధాలు, భూ సంబంధాలు అయన ఉత్పాతాలను ముందుగానే కని పెట్టి, వాటికి విరుగుడుగా నీ చేత శాంతి క్రియలు జరిసిస్తున్నారు కదా?

ఇక, ఆయుర్వేద విద్యలో సమర్ధులైన నీ ఆస్థాన వైద్యులు లోకోపకార బుద్ధితో, ప్రజల మీద ప్రేమతో ఎనిమిది శాఖలుగా విస్తరించిన ఆ వైద్య విధానంతో సేవలు చేస్తున్నారు కదా?

పెద్దలను సేవిస్తూ మనోవ్యథలేవయినా ఉంటే తొలగించుకుంటున్నావు కదా? అలాగే నీ ఆరోగ్యాన్ని చక్కని ఔషధాలు సేవిస్తూ కాపాడుకుంటున్నావు కదూ ?

నీ కొలువులో రక రకాల పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నీతి మార్గంలో నడుచుకునే వారే కదా? రాగ ద్వేషాలు లేకుండా అందరి పట్ల సమ బుద్ధి కలవారే కదా? అలాంటి వారిని చక్కగా పరీక్షించి మరీ ఎన్నిక చేసి నీ కొలువులో నియమిస్తున్నావు కదూ ?

ఓ ధర్మ రాజా ! ఉత్తములు, మధ్యములు, అధములు ఉంటారు. ఆయా వ్యక్తుల ఉత్తమ, మధ్యమ, అధమ యోగ్యతలని గుర్తించి, వాళ్ళని ఎవరికి తగినట్టుగా అలా ఉత్తమ మధ్యమ, అధమ కార్య నిర్వహణకి నియమిస్తున్నావు కదా? ఎవరికి తగిన పని వారికి పురమాయించాలి. నీ సేవకులందరకీ తగిన జీతం దయతో సకాలంలో ఇస్తున్నావు కదా?

చేయించుకున్న సేవలకి తగినంత జీతం లేక పోయినా, అది కూడా సకాలానికి అందక పోయినా, సేవకులు దరిద్రంతో బాధలు పడతారు. అలా వారిని బాధించడం దేవేంద్రుడికి కూడా మంచిది కాదు సుమీ !

వంశ పారంపర్యంగా ఎందరో సేవకులు నీ వద్ద పని చేస్తూ ఉంటారు. వారిని ఉచిత రీతిని సన్మానిస్తున్నావు కదా? అలా చేస్తే వాళ్ళు నీ కోసం యుద్ధంలో ప్రాణాలయినా అర్పిస్తారు.

నీ కోసం యుద్ధాలలో పాల్గొని, ఎందరో వీరులు వీర మరణం పొంది ఉంటారు. మరి, ఆ వీర సైనికుల కుటుంబాలకు కూడుగుడ్డలకి లోటు లేకుండా యిచ్చి కాపాడుతున్నావా లేదా?

రాజా ! నీవు రాజకార్యం చేయడం కోసం ఎందరినో నియమిస్తూ ఉంటావు. ధనం పట్ల లోభత్వం కలవాళ్ళనీ, దొంగలనీ,స్నేహానికి తగని వాళ్ళనీ, శత్రుపక్షం వహించే వారినీ ధైర్యం లేని వాళ్ళనీ, దుర్మార్గులనీ అలాంటి పనుల కోసం నియమించడం లేదు కదా?
రాజా ! నీ రాజ్యంలో దొంగల భయం లేకుండా చూసుకుంటున్నావు కదూ? నీ ప్రభుత్వంలో ధనాశాపరులైన లంచ గొండులు ఎవరయినా, ఆ దొంగల నుండి డబ్బు దీసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే అవకాశమూ ఉంది. గచనించు.

నీ రాజ్యంలో అనా వృష్టి భయం లేకుండా చెఱువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి కదా?

రాజా ! ఉదార బుద్ధితో రైతులకి ధాన్యపు విత్తనాలు ఇస్తున్నావు కదూ? అలాగే వర్తకులుంటారు. వారికి వ్యాపారం చేసికోడానికి డబ్బు కావాలి. ధర్మ వడ్డీకి, అంటే, నూటికి ఒక రూపాయ వడ్డీ వంతున అప్పులు ఇవ్వాలి. ఆపని నీవు చేస్తున్నావు కదా?

ఇక, రాజ్యంలో ఎందరో అనాథలూ, అంగ వికలురూ ఉంటారు. కుంటి, మూగ, గ్రుడ్డి, ఏ బంధువులూ లేని వారూ... యిలా ఎందరో ఉంటారు. వారిని దయతో పోషిస్తున్నావు కదూ ? యుద్ధంలో శరణు వేడిన వాడు నీ శత్రువయినా వాడిని కాపాడాలి. అలా చేస్తున్నావా?

చేసిన మేలు గుర్తించి, ఆ మేలు చేసిన వ్యక్తిని పెద్దలున్న నీ రాజ్య సభలో తగిన రీతిని సత్కరిస్తున్నావు కదూ? అలా చేసిన రాజే రాజ్యాన్ని చక్కగా పాలించ గలడు. నీకు వచ్చే ఆదాయంలో నాల్గవ భాగాన్ని, లేదా మూడవ భాగాన్ని, లేదా, సగ భాగాన్ని మాత్రమే నీవు ఖర్చు చేయాలి. అంతకు మంిచ చెయ్య కూడదు. నమ్మతగిన వారిని, ప్రభు భక్తి కలవారిని, సమర్ధులను నీ కొలువులో నియమించు కోవాలి. గురువులను, వృద్ధ శిల్పులను, గొప్ప వాణిజ్యవేత్తలను, బంధువులను, ఆశ్రితులను, మంచి వారిని వారికి పేదరికం రాకుండా నువ్వే కాపాడుతూ ఉండాలి.

రాజ్యం లోపల, వెలుపల ... అలాగే కోట లోపల వెలుపల అనేక శత్రువులుంటారు. వారినుండి నిన్ను నీవు సతతం కాపాడు కోవాలంటే నీకు గూఢచారులే శరణ్యం. రాజులు చార చక్షువులు. శత్రు రాజుల ప్రవర్తనలని గూఢచారులు అనే కళ్ళతో నిత్యం గమనిస్తూ ఉండాలి సుమా !

పండితులతో చర్చిస్తూ, రాగ ద్వేషాలు లేకుండా సమ బుద్ధితో లోక వ్యవహారాలు చూస్తున్నావు కదా?


ఓ ధర్మ రాజా ! ప్రపంచమంతా వార్త మీదనే ఆదార పడి నడుస్తోంది. అది లేక పోతే ప్రజలంతా చిమ్మ చీకటిలో మునిగి పోతారు. అందు వల్ల రాజు వార్తను బాగా నడపాలి. అంటే రాజు వార్తా నిర్వహణకి ప్రాధాన్యమివ్వాలి.

రాజా ! భార్యను పొందడానికి ఫలం సంభోగ సుఖం, పుత్రులు పుట్టడం. ధర్మాలు వినడానికి ఫలం సచ్ఛీలం.మంచి ప్రవర్తన సిద్ధించడం. సంపాదించిన దానికి ఫలం దానం చేయడం, అనుభవించడం వేదాలకు ఫలం అగ్ని హోత్రాలు. ఈ సంగతి తెలుసుకో.

రాజా ! కోటని దుర్భేద్యంగానూ ,చక్కగానూ రక్షించు కోవలసి ఉంటుంది సుమా ! నీ రక్షణలో ఉన్న కోటలన్నీ ధన ధాన్యాలతో, ధనుర్బాణాలతో, వివిధ ఆయుధాలతో ఎప్పుడూ నిండి ఉండాలి. అలాగే నీళ్ళకి లోటు రానియ్య కూడదు. పశువులకు గడ్డి నిల్వ చేసి ఉంచాలి. అలాగే ఉప్పు, పులుపు,కారం వంటి ఆహార పదార్ధాలు, వివిధ పానీయాలు, వంట కట్టెలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి సమా !

దైవ బలాన్ని పొంది, కామ క్రోధాదులయిన లోపలి శత్రువులని జయించి, ఇంద్రియాలని జయించి, బలపరాక్రమంతో దుష్టులయిన నీ శత్రువులని జయిస్తున్నావు కదా?

దండయాత్రకి బయలు దేరే ముందుగానే బలవంతులయిన నీ శత్రు రాజుల మీద సామ దాన భేద దండోపాయాలను చక్కగా ప్రయోగిస్తున్నావు కదూ?

రాజా ! ముఖ్యంగా 14 రకాలయిన రాజ దోషాలు ఉన్నాయి. నాస్తికత అసత్యం పలకడం, ఏమరుపాటుగా ఉండడం, సోమరితనం, తెలివి తక్కవ వారితో రాచ కార్యాలు కోసం ఆలోచన చేయడం, అతి కోపం, ఎక్కవగా దుఃఖించడం, చేయ వలసిన పని కోసం చాలా సేపు ఆలోచిస్తూ కాలయాపన చేయడం, ఆలస్యంగా చేయడం, బుద్ధిబంతులని గుర్తించక పోవడం, ప్రయోజనాలను దెబ్బతీసే పనులు చేయడం,చేదామనుకున్న మంచి పనులు చేయక పోవడం, రహస్యాలోచనలని బయటకి పొక్క కుండా కాపాడుకో లేక పోవడం, శుభ కార్యాలను చేయకుండా ఉండడం, నిత్యం ఇంద్రియ సుఖాలలో తేలియాడుతూ గడపడం ... ఇవీ రాజ దోషాలు. వీటిని విడిచి పెట్టావు కదా ?

ఇవీ నారదుడు చెప్పిన రాజ నీతి ధర్మాలు. ఎంత సమకాలీన సత్యాలో ఎంత సార్వజనీనమయిన విషయాలో గమనిస్తే మహా భారతం ఎందుకు భారతీయులకు అంత ప్రామాణిక గ్రంథమయిందో తెలుస్తుంది.
మరో సారి మరి కొన్ని ....

ఇప్పటికి స్వస్తి.