హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2010, మంగళవారం

మీ దయ వల్ల మేం బ్రతికి పోయాం ! .... మంచి మాట


ఆంధ్ర మహా భారతం విరాట పర్వం ( తిక్కన సోమయాజి రచన) ప్రథమాశ్వాసం నుండి)


పాండవుల అరణ్యవాసం ముగిసింది. ఇక మిగిలింది అఙ్ఞాతవాసం. ఆ ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిశ్చయమయింది. సరే. మారు వేషాలలో ఎవరికీ అనుమానం రాని విధంగా అఙ్ఞాతంగా గడపాలి. విరటుని కొలువులో ధర్మ రాజు కంకు భట్టు గానూ, భీముడు వలలునిగానూ,అర్జునుడు బృహన్నలగానూ, నకులుడు దామగ్రంధి గానూ, సహదేవుడు తంత్రీపాలుడు అనే పేరుతోనూ వ్యవహరించడానికి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ సమయంలో రాజ పురోహితుడు ధౌమ్యుడు పాండవులకు కొన్ని సేవా ధర్మాలు తెలియ జేసాడు.

నేటి హిత ‘ వచనమ్’ డాట్ కామ్ లో వాటి గురించి ....

లోకంలో తెలిసిన వారు చాలమంది ఉంటారు. కాని, శ్రేయోభిలాషులయిన వారు అట్టి విఙ్ఞు లకు అదనెరిగి తగిన బుద్ధులు చెప్ప వలసినదే.

మీరు ఉన్నతమయిన కౌరవాన్వయంలో పుట్టిన వారు. అలాంటి మీరు ఒక సామాన్య మానవ మాత్రుని సేవిస్తూ , మానావమానాలను సహిస్తూ, అణగిమణగి సవినయంగా ఉండడం కష్టమే.

రకరకాలయిన అస్త్రాలు మంటల వంటివి. వాటిని ధరించే పాండవులు అగ్నుల వంటి వారు. అట్టి మీరు కాల విరోధాన్ని మరచి పోకూడదు సుమా ! కాదని మరచి పోతే, బాహాటంగా మీ పరాక్రమాన్ని ప్రకటిస్తే మీ ఉనికి తెలిసి పోతుంది. కార్యం చెడి పోతుంది. అఙ్ఞాత వాసం భంగమవుతుంది.

కనుక నాకు తెలిసినంత మేరకు మీకు కర్తవ్యం ఉపదేశిస్తాను. వినండి.

రాజ సభలోకి తగిన విధంగా అడుగు పెట్టాలి. తనకు తగిన ఆసనంలో కూర్చోవాలి.తన రూపంలో కాని, వేషంలో కాని ఏ మాత్రం తేడా ఉండ కూడదు. అంటే, వికృతత్వం లేకుండా చూసుకోవాలి. వేషానికి భిన్నంగా వేషధారణ పనికి రాదు. సమయం తెలుసుకుని మసలు కోవాలి.రాజ సభలో ప్రసంగించేటప్పుడు సమయం చూసి. తనకు అవకాశం దొరికినప్పడు మాత్రమే ప్రసంగించాలి. అలా చేస్తే ఎవరయినా రాజుకి గౌరవపాత్రుడవుతాడు.

రాచ కొలువువ ఉన్నాను కదా, రాజుతో చనువుగా తిరుగుతున్నాను కదా అని, నాకేమిటి అనే భావనతో నిర్భయంగా మర్యాదను అతిక్రమించి నడుచుకో కూడదు. అలాగయితే, మొదటికే మోసం వస్తుంది.

రాజగృహం కన్నా అందమయిన ఇల్లు కట్టుకో కూడదు. అలాగే రాజు గారిలా దుస్తులు ధరించ కూడదు. రాజు మాట్లాడే విధంగా మాట్లాడడం తగదు. అంటే వీటి వేటి లోనూ ఎంత మాత్రం రాజుని అనుకరించ కూడదు. సేవకుడు ఎట్టి పరిస్థితి లోనూ రాజు దగ్గర తన ఆధిక్యాన్ని చూపించ కూడదు. అణకువగా జీవించాలి.

ఎందుకంటే, రాజు ధిక్కారాన్ని సహించడు. తన ఆఙ్ఞను అతిక్రమించే వాడు కొడుకవనీ, మనుమడవనీ, సోదరుడవనీ, స్నేహితుడవనీ రాజు అంగీకరించడు. తన మేలు కోసం, భద్రత కోసం వారిని తన శత్రువులు గానే పరిగణిస్తాడు. వారి మీద కోపం పెంచుకుని వారి అంతు చూస్తాడు.

ఏదయినాసరే సాధించుకో గలిగే సమర్ధుడి పనికి అడ్డు వెళ్ళ కూడదు. తగుదునమ్మా అని ఆ పని తనమీద వేసుకుని నేర్పును ప్రదర్శిస్తూ పూసుకుని తిరుగ కూడదు. దాని వలన అసలు స్థితికి ముప్పు వస్తుంది.

రాజుతో సన్నిహితంగా ఉండడంలో తప్పు లేదు. కాని రాజు దగ్గర చాలమంది ఉంటారు వారికి కష్టం కలిగించే పనులలో మాత్రం జోక్యం చేసుకోవడం తగదు. అలా చేయడం వల్ల ఆ సేవకుడి గొప్పతనం వెల్లడి కావచ్చును. సమర్ధత తెలియ వచ్చును. పేరు ప్రతిష్ఠలు రావచ్చును. కాని ఆ తర్వాత హాని కలగడం మాత్రం తథ్యం. అందు వలన తెలివయిన వారు అలాంటి పనులకు పూనుకొనరు.

రాజు దగ్గర మౌనంగా ఉండ కూడదు. అలాగని పదిమందితో ఆర్భాటంగా మాట్లాడ కూడదు. సన్నిహితులయిన సేవకులతో పాటు తాను రాజుతో మాటలాడడం సబబు.

రాజు కొలువులో ఉన్నప్పుడు వ్యతిరేకత తోచే విధంగా ఇతరులకు జవాబులు చెప్ప కూడదు. అవసరమయినప్పుడు మాత్రం తనంతట తానే ముందుకు వచ్చి రాజాఙ్ఞను నిర్వర్తించాలి.

సభలో ఎప్పుడై రాజునకు మరీ ఎట్ట ఎదురుగా నిలబడ కూడదు. అలాగని వెనుకవేపూ ఉండ కూడదు. ఏదో ఒక ప్రక్కగా నిలబడి సేవించాలి. సదా రాజు ముఖం లోకే చూస్తూ ఏమంటాడో, ఎటు చూస్తాడో, ఎవరిని చూస్తే ఎటువంటి ఆలోచన కలుగుతుందో - వీటన్నింటినీ మనసులో ఉంచుకుని జాగురూకతతో మెలగాలి.

రాజాంత:పురంలోని మాటలు ఎప్పుడూ బయటపెట్ట కూడదు. గుట్టు పాటించాలి. వేరే ఎక్కడయినా రాజుకి సంబంధించిన మాటలు వినబడితే ముందుగా బాగా ఆలోచించాలి. ఆతర్వాత అవి రాజువినదగినవయితే వాటిని రాజు చెవిని వేయాలి.అప్రియమయిన విషయాలు ఎప్పుడూ రాజుకి చెప్ప కూడదు.

రాజాంత:పురంలో రకరకాల వారుంటారు. అక్కడ తిరిగే గూని వారు, కుబ్జలు ( వామనులు) పరిచారికలు మొదలయిన వారితో స్నేహం పనికి రాదు. భటుడికి అంత:పురంతో సంబంధం మంచిది కాదు.

రాజు అనుమతిస్తేనే ఆసనం ఎక్కి కూర్చోవాలి. అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా పెద్ద పెద్ద వాహనాలను తమంతట తాము ఎన్నుకోవడం, ఎక్కడం తగదు. రాజు దగ్గర ఎంత గౌరవాదరాలు ఉన్నప్పటికీ అది తగని పని.

రాజు తనను గౌరవించాడు కదా అని పొంగిపో కూడదు. ఉబ్బితబ్బిబ్బయిపో రాదు. అలాగే అవమానించినప్పుడు అయ్యో, రాజు అవమానించాడు కదా అని క్రుంగిపోనూ కూడదు. మానావమానాలను సమానంగా పరిగణిస్తూ రాజు దగ్గర మెలిగితే సేవకులకు మంచి జరుగుతంది. ఆపదలు తొలిగి పోతాయి.

ఒక్కోసారి రాజు ఎవరినయినా సంరక్షించాలని అనుకుంటాడు. లేదా, శిక్షించాలని అనుకుంటాడు. ఆ సంగతి ముందే తనకు తెలిసినా అవి అమలు కాక ముందే తనంతట తానుగా వాటి గురించి వెల్లడి చేయ కూడదు. అలా చేసే వాడు మూర్ఖుడు.

ఎండకూ , వానకూ ఓర్చు కోవాలి. తన ఇల్లు, పరాయి కొంప అని అనుకో కూడదు. ఆకలి వేస్తుంది, అలసి పోతాను, నిద్రా సమయం మించి పోతుంది, దాహం వేస్తున్నది ఈ పనంతా ఒక్కడినే ఎలా చేయడం, ఇదేమిటి రాజు నాకు ఈపని ఇప్పుడు పురమాయించేడు ... ఇలా సేవకుడు ఎప్పుడూ ఆలోచించ కూడదు. అనుకో కుండా రాజు ఒక పని చెప్తే భక్తి శ్రద్ధలతో చేయాలి. నెపాలు వెతక కూడదు.

రాజునకు ఎంత ఆప్తుడయినా కావచ్చును. కాని, రాజధనాన్ని పాము ఎముకల లాగా చూడాలి. వాటిని సంగ్రహించే బుద్ధి మానుకోవాలి. లేక పోతే ధన, మాన ప్రాణాలు నిలవవు. వాటికి ముప్పు కలుగుతుంది. ( పాము ఎముకలు విషతుల్యాలు కనుక, వాటిని తాక రాదని లోక ప్రసిద్ధి.)

రాజు కొలువు తీరినప్పుడు సేవకుడు బహిరంగంగా ఆవులించ కూడదు. తుమ్మ కూడదు. నవ్వడం అసలే పనికి రాదు. నిష్ఠీవనం ( ఉమ్మి వేయడం) నిషిద్ధం. వీటి వల్ల ప్రక్క వారికి యిబ్బంది. చిరాకు. కాబట్టి వీటిని తప్పని సరయితే గోప్యంగా చేయాలి.

శత్రువుల దూతలు, రాజు ఆగ్రహానికి గురయిన వారు, రాజు చేత నిరాకరించబడిన వారూ, పాపాత్ములూ ఎప్పుడూ తమకు దగ్గరగా ఉండ కూడదు. అంటే, వారిని చేరదీయ కూడదు. దాని వలన చివరకు నింద రావడమే కాక, కీడు కూడ కలుగుతుంది.

రాజు దగ్గర మెలిగే వారెవరితోనూ వైరం పనికి రాదు. చివరకి ఏనుగుతోనయినా, దోమతోనయినా సరే. అంటే గొప్ప వారితో నయినా, సామాన్యులతో నయినా వైరం కూడదు. రాచ కొలువునకు చెందిన వారితో స్నేహంగా ఉండడం మేలు.

సంపదలు అనుభవించడానికే కదా అని, మన దగ్గర ఉంది కదా అని, రాజునకు తెలిసేలా విచ్చలవిడిగా భోగాలు అనుభవించ రాదు. రాజునకు కంటగింపుగా ఉండేలా భోగాలు అనుభవించకుండా, వినమ్రతతో వేడుకలు చేసుకోవాలి.


ఇలా ధౌమ్యుడు చేసిన హిత బోధలు విని పాండవులు చాల సంతోషించారు. సంతోషించి అతనితో యిలా అన్నారు: ‘‘ మాకు తల్లయినా, తండ్రయినా, దైవమయినా, మిత్రులయినా మీరే ! మేము విరటుని కొలువులో ఉండేటప్పుడు ఎలా మెలగాలో చక్కగా బోధించారు. మేము పాటించ వలసిన నడవడిక పద్ధతులను ఎంతో చక్కగా, స్పష్టంగా వివరించారు. నిజం చెప్పాలంటే, మీ దయ వల్ల మేము బ్రతికి పోయాం ... ’’


మరి కొన్ని ... తదుపరి హిత ‘వచనమ్’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.


17, జూన్ 2010, గురువారం

మంచి మాట

(ఆంధ్ర మహా భారతం సభా పర్వం ప్రథమాశ్వాసం నుండి)

మయుడు నిర్మించి యిచ్చిన సభలో పాండవులు ప్రవేశించారు. ఆ సమయంలో నారద ముని వచ్చి ధర్మ రాజుతో కొన్ని రాజనీతి విషయాలు ముచ్చటిస్తాడు. వాటిని ఇంతకు ముందు హిత వచనమ్ డాట్ కామ్ టపాలో ఉంచాను. వాటిని ఇక్కడ చూడ వచ్చును.

ఇక ... మరి కొన్ని ....

జరాసంధుని వధకు బయలు దేరే ముందు భీమ సేనుడు, అర్జునుడు ధర్మ రాజుతో పలికిన పలుకులు :

లోకంలో ప్రయత్నమే చేయని వానికి ఎప్పుడూ సిరి సంపదలు లభించవు. పురుషుడు బలహీనుడయినా సరే, ప్రయత్నం చేసే స్వభావం కలిగి ఉండాలి. అలాంటి స్వభావం కలవాడు, అసలు ప్రయత్నమే చేయని వాడిని, వాడు ఎంతటి బలవంతుడయినా జయించ గలడు.

పరాక్రమవంతుని రూప గుణ సంపదలు లోక ప్రసిద్ధాలై రాణిస్తాయి. పరాక్రమం లేని వాడికి అవన్నీ ఉన్నా ( రూప, గుణ, సంపదలు) అవి లేనట్లే కాంతి హీనాలవుతాయి.

ఓ ధర్మ రాజా ! శాస్త్రంలో చెప్ప బడిన విధంగా ధర్మ పద్ధతిలో పరాక్రమాన్ని ప్రదర్శించాలి. బద్ధి బలం, పురుష ప్రయత్నం చేసే పురుషులకు ఇది తప్పక చేయ వలసిన కర్తవ్యం సుమా !


( ద్వితీయాశ్వాసం నుండి ...)

ధర్మజుడు ఒనర్చిన రాజ సూయ యాగాన్ని చూసి. ఆనందించి , భీష్ముడు అగ్రపూజ ఎవరికి చేయడం సముచితమో ధర్మ రాజుకి వివరిస్తూ ....

ఓ ధర్మ రాజా ! స్నాతకుడు, , ఋత్వికుడు , సద్గురుడు , ఇష్టుడు , భూపాలుడు, ఙ్ఞాన సంపన్నుడు - వీరందరూ పూజార్హులు. వీరిలో సద్గుణాల చేత ఎవడు అధికుడో అలాంటి వాడిని ఒక్కని పూజించు. వానికి అగ్రపూజ చేయి.

శిశుపాలుడు శ్రీ కృష్ణునకు ధర్మజుడు అర్ఘ్యప్రదానం చేయడాన్ని నిరసిస్తూ పలు చెనటి మాటలు పలుకుతాడు. అప్పుడతనితో ధర్మజుడు అననయ పురస్సరంగా పలికిన మాటలు :


గొప్ప గుణాల చేత శ్రేష్ఠులని చెప్ప దగిన వాళ్ళకు, పండితులకు , ప్రభువులకు ఈ విధంగా కఠినంగా మాటలాడడం తగదు. పలుకు కాఠిన్యం విషం కంటె , అగ్ని కంటె కూడ అతి భయంకరమయినది సుమా !
ఓ శిశుపాలా, పరమార్ధ తత్వాన్ని భీష్ముడు అవగతం చేసి కొన్నట్టుగా నీకు అర్ధం కాదు. ఎక్కడయినా మహాత్ముల చరిత్రలు అల్పులు తెలుసుకో గలరా ?

భీష్ముడు:

ఈ శిశుపాలుడు మితి మీరిన చెడు నడత కలవాడు. అపరిపక్వ బుద్ధి కలవాడు. అసూయ, క్రోధావేశాలు ఇతనిలో మితి మీరాయి. తనకి గల కొద్ది రాజ్య సంపద చేతనే వివక్ష కోల్పోయి, అహంకరిస్తున్నాడు. మహాత్ములను నిందించే స్వభావం కలవాడు. ఇలాంటి వాడికి ధర్మ తత్వం తెలుసు కోవడం సాధ్య పడదు.

భీష్ముడు శిశుపాలునితో:

ఉత్తమ ఙ్ఞాన సంపద చేత ఎవడయితే గొప్ప వాడో, అట్టి వాడు వయస్సు చేత బాలుడయినా, బ్రాహ్మణుడు పూజింప దగిన వాడే. అపరిమితమయిన పరాక్రమంతో రాజుల్లో అధికుడయితే క్షత్రియుడు కూడ పూజార్హుడే.

వయోవృద్ధులయిన వాళ్ళు ఒక లక్ష మంది ఉండ వచ్చును. కాని, ఎవరినయినా వారి ఙ్ఞానాన్ని బట్టి మాత్రమే పూజిస్తాం.

శిశుపాలుడు భీష్ముని తూలనాడుతూ ....

ఈ భీష్ముడొక వెర్రి ముసలి వాడు. గుణహీనుడయి శ్రీకృష్ణుని అకారణంగా పొగుడుతన్నాడు.ధర్మ తత్వాలు పాండవులకే తెలుసునట ! ఇతని మాట విని కృష్ణుడికి ధర్మ రాజు అర్ఘ్యం ఇచ్చాడు.తన అర్హత ఎలాంటిదో తెలుసుకోకుండా కృష్ణుడు దానిని స్వీకరించాడు. బాగుంది. ఓడతో కట్టిన ఓడలాగా తన గౌరవాన్ని కోలుపోయి మాట తూలుతున్నాడు. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడా లేరు. ఇక్కడ రాజులు చేత కాని వాళ్ళా ఏమిటి ?

కృష్ణుడి గొప్పదనం ఏపాటిదో తెలిసిందే కదా ? పూతన అనే ఒక ఆడుదాన్ని చంపాడు. ప్రాణం లేని బండిని (శకటాసురుడుని) కాలితో తన్ని సంహరించాడు. సారం లేని ( మద్ది) చెట్లను విరిచాడు. పుట్టంత చిన్న కొండను ( గోవర్ధన పర్వతాన్ని) పెద్ద బలవంతుడిలా ఏడు రోజులపాటు ఎత్తాడు. ఎద్దుని (వృషభాసురుడి ని) చంపాడు. ఇవా ఇతని పరాక్రమాలు ? హవ్వ ! వీనిని పొగుడుతున్న నీ నాలుక వంద చీలికలు కావాలి.అప్పుడింకా బాగా పొగడ గలవు. ..
స్త్రీలను, గోబ్రాహ్మణులను, అన్నం పెట్టే వారిని, నమ్మిన వారిని చంపడం మహా పాతకమని చెబుతారు. ఈ పాపాలన్నీ గోవిందుడు చేసాడు కదా ? అలాంటి వీనికి అర్ఘ్యం యిప్పించడం తప్పు కాదూ? అంతే కాదు, వేరొకరిని ప్రేమించిన కన్యను ( అంబని) బలిమిని తన తమ్ముడికి కట్టబెట్టడానికి తెచ్చాడు. . మరో సంగతి. నువ్వు అనపత్యుడివి. నీకు పిల్లలు లేరనే దోషం ఉంది. అలాంటి నువ్వు చెప్పేధర్మాలు ప్రజలు ఎలా పాటిస్తారు ?

ఓ గాంగేయా ! ఇతరులను పొగడడం, నిందించడం, తనను తాను పొగుడు కోవడం, నిందించు కోవడం ఇవన్నీ చెయ్య కూడని పనులని పెద్దలు చెప్పారు.

( గమనిక: శిశుపాలుడు పలికిన వన్నీ కఠినోక్తులు. వీటిని హిత వచనమ్ డాట్ కామ్ లో ఎందుకు చేర్చావయ్యా అంటే ....శిశుపాలుడు తాను ఆచరించినా, ఆచరించక పోయినా పెద్దలు చెప్పిన హిత వచనాలను కొన్నింటిని తన వదరుబోతు తనంతో అయినా వల్లించాడు కదా? అదీ కాక, అహితం తెలిస్తే హితం గొప్పతనం మరింతగా ప్రకాశిస్తుంది మరి !)


ఇక, కపటజూదానికి రంగం సిద్ధమయింది. ఆ సందర్భంగా ధర్మజుడు దుర్యోధనునితో పలికినది:

మోసం , జూదం - ఇవి రెండూ కూడా క్షత్రియ ధర్మానికి తగినవి కావు. ధర్మాన్ని ఆచరించే వారు ఈ రెండింటినీ వదిలెయ్యాలి. అంతే కాక, మోసపు మార్గాలు అనుసరిస్తూ జూదం ఆడే నీచపు జూదగాళ్ళతో జూదమాడ కూడదు. దాని వలన లోకంలో ఎటువంటి వారయినా ధనం, ధర్మం కోల్పోతారు. అంతే కాదు, కపటపు జూదంలో గెలవడం మహా పాపమని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవడం ధర్మ యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడయిన దేవలుడు కూడ చెప్పాడు.

అప్పుడు శకుని ధర్మ రాజుతో పలికినది:

ఇదేం మాట ! బలహీనులను బలవంతులు ఎన్ని మోసాలతోనయినా ఓడించడం లోక సహజమే కదా? లోకంలో ఏ విధంగానయినా జయాన్ని సాధించాలి.

కపట జూదం ఆపించే ప్రయత్నంలో విదురుడు దుర్యోధనునితో:

చెడిపోయేలా ఎవరయితే చెడ్డ బుద్ధులు చెబుతారో, వారే నీకు స్నేహితులు. నీలాంటి వాడికి మాలాంటి వారు చెప్పే హితవచనాలు చెవికెక్కవు,

అంతేలే. లోకంలో వినడానికి ఇంపుగా ఉండే మాటలు పలికే వాళ్ళనే ఎక్కువగా మెచ్చుకుంటారు. మేలు చేసేదయినా వినడానికి ఇంపుగా లేక పోతే ఎవరూ వినడానికి యిష్టపడరు అందు చేత ప్రతిభావంతులు కూడ కటువైన మాటలు చెప్పడానికి వెనుదీస్తారు.


( ఇది హితం మనోహారిచ వచం దుర్లభ: ... అనేసూక్తి వంటిది.)

అయితేనేం? మొదట వినడానికి ఇంపుగా ఉండక పోయినా, చివరకి మేలు చేసే మాటను ఇష్టులైన వారు ఏ మాత్రం మొగమాటం లేకుండా బలవంతంగానయినా చెప్పాలి. అది ధర్మం. అలాంటి వాడే రాజుకి తగిన సహాయకారి అవుతాడు.

ధర్మజుడు జూదంలో ద్రౌపదిని ఓడాడు. ఆమెను తీసుకు రమ్మని ముందుగా దుర్యోధనుడు విదురుడిని కోరుతాడు ఈ దుర్విదగ్ధత సహించ లేక విదురుడు దుర్యోధనుడితో :

మూర్ఖుడా ! పొగరెక్కి మలినమైన మనస్సు కలవాడు , ఆయువుపట్టును నొప్పించే క్రూరుడు , ... యిలాంటి వారి సంపదలు నశించి పోతాయి.


ఇక, ద్రౌపది సభ వారిని తాను ధర్మ విజితనా , అధర్మ విజితనా అని అడిగిన దానికి పెద్దలు సమాధానం చెప్పి తీరాలని వికర్ణుడు అంటాడు.

అతని మాటలను సమర్ధిస్తూ విదురుడు పలికినది:


సభకు వచ్చి ఎవరయినా ధర్మ సందేహం అడిగితే సభ్యులలో ఎవరయినా తెలిసిన వారు దాని గురించి చెప్పాలి. అలా తెలిసీ చెప్పక పోతే, అసత్యం ఆడడం వల్ల కలిగిన ఫలితంలో సగాన్ని పొందుతారు.

ధర్మాన్ని తెలిసి కూడ, లాభాపేక్షతోనో , లోభం చేతనో , ఊగిసిలాడే బుద్ధి చేతనో ఎవరయినా దానిని మరొక విధంగా పలికితే అతను అసత్యమాడే దోష ఫలితాన్ని అనుభవిస్తాడు.

ధర్మం అధర్మం చేత బాధించబడి సభకు వస్తే సభ్యులు దానిని తీర్చాలి. లేక పోతే వారు అధర్మం చేత బాధించబడుతారు. సభ్యులు కామక్రోధాదులు విడిచి అధర్మాన్ని ఆపాలి. అలా చేయని నాడు ఆ అధర్మంలో నాల్గవ భాగం ఆ సభ్యులకు , మరొక నాల్గవ భాగం రాజునకు, మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది. అందు చేత అడిగినప్పుడు తెలిసిన సభ్యులు తప్పక ధర్మం చెప్పాలి.


ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలు యిచ్చాడు. ద్రౌపది ముందుగా ధర్మరాజుకు దాస్య విముక్తిని వరంగా కోరుకుంది. రెండవ వరంగా ధర్మజుని నలుగురు తమ్ములకు దాస్యం నుండి విముక్తి కోరింది. రాజు యిక మూడవ వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది యిలా అంది :

రాజా ! వైశ్య స్త్రీ ఒక వరం, ఉత్తమ క్షత్రియ స్త్రీ రెండు వరాలు , శూద్ర స్త్రీ మూడు వరాలు , బ్రాహ్మణ స్త్రీ వంద వరాలు కోరుకో వచ్చును. అందు వలన నేను రెండు వరాలు తప్పితే మూడోది కోరుకో కూడదు.


రాజు సంతోషించి: అమ్మా, నీవు ధర్మఙ్ఞవు. నీకు నేను బోధించ వలసిన నీతులు వేరే ఏమీ లేవు.
మనసులో వైరాన్ని తలచక పోవడం, ఓర్పు కలిగి ఉండడం, గుణాలు స్వీకరించి, దోషాలను విడిచి పెట్టడం ఇవి గొప్ప వ్యక్తి లక్షణాలు. ఇవన్నీ నీకు ఉన్నాయి. తల్లీ వర్ధిల్లు..


ఇవీ ఈనాటి హితవచనాలు ....


మరి కొన్ని ... తదుపరి హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో చూదాం ...


ఇప్పటికి స్వస్తి.









16, జూన్ 2010, బుధవారం

మంచి మాట


( మహా భారతం ఆది పర్వం అష్టమాశ్వాసం మందపాలోపాఖ్యానం నుండి.)

మందపాలుడు ఒక మునివర్యుడు. అతని భార్య జరిత. ఒక లావుక పక్షి. వారి కుమారులు నలుగురు. జరితారి, సారిసృక్కు , స్తంబ మిత్రుడు, ద్రోణుడు వారి పేర్లు.

ఖాండ దహనం జరుగుతోంది. అగ్ని అడవంతా వ్యాపించింది. అక్కడ ,చిక్కుకు పోయారు, జరితారి, అమె నలుగురు కుమారులు. మందపాలుడు తన వారిని కాపాడుమని అగ్ని దేవుని వేడుకుని ముందే తపశ్చర్య కోసం వెళ్ళి పోయాడు. ఆ సంగతి వీరికి తెలియదు.

చుట్టు ముట్టే అగ్ని కీలలనుండి తన బిడ్డలను ఎలా కాపాడు కోవాలో తెలియక జరితారి విలపిస్తుంది. చివరకి వారిని ఒక బిలం లోనికి ప్రవేశించ మంటుంది . దానిని తాను దుమ్ము ధూళితో కప్పి వేసి కాపాడుతానంటుంది. అప్పుడు ఆమె కుమారులలో పెద్దవాడయిన జరితారి తల్లికి చెప్పిన ధర్మ సూక్ష్మం యిది.


అమ్మా, నీవు చెప్పినట్టుగానే మేము ఈ బిలం లోకి ప్రవేశిస్తే మమ్మలని అందులో ఉండే ఎలుక తిని వేస్తుంది. అది తప్పదు. ఎలుక చేత చంపబడటం కన్నా, అగ్ని దేవుడికి ఆహుతయి మేము పుణ్య లోకాలకి పోతాము.

కష్ట కాలంలో ఏది నియతకార్యమో ( అంటే, ఏది తప్పకుండా జరిగి తీరుతుందో ) అది చేయ కూడదు. దానిని విడిచి పెట్టాలి. మేము కన్నం లోకి వెళ్తే అందులో ఉండే ఎలుక మమ్మలని తిని వేయడం నియతం. కనుక మేము ఆ పని చేయ కూడదు. కష్ట కాలంలో ఏది అనియత కార్యమో ( అంటే ఏది అనుమానాస్పదమో.) ఆ పని చేయాలి. అది ఎలాగంటే, మేము ఇక్కడే ఉంటే అగ్నికి ఆహుతి కావడం నిజమే కానీ, ఒక వేళ గాలి వల్ల అగ్ని చెదిరి పోయి మేము బయట పడే వీలు కూడా ఉంది. అప్పుడు మేము బ్రతికే వీలు ఉంది. అగ్ని వలన భయం సందేహాస్పదం. కష్ట కాలంలో అనియత కార్యాలనే చేయాలి. నియత కార్యాలను విడిచి పెట్టాలి.

మరో విషయం ... నువ్వు చెప్పినట్టుగా మేము బిలం లోనికి వెళ్ళం. నీవు మామీద మమకారం విడిచి వెళ్ళిపో. ఒక వేళ మేము అగ్నికి ఆహుతి అయినా, నీవు జీవించి మళ్ళీ పుత్రులను కన వచ్చును. లేదూ, నీ పుణ్యఫలం వల్ల మేము బ్రతికామనుకో, అప్పుడు ఎప్పటి లాగే నీవు మమ్ములను సాకవచ్చును.

జరితారి ఈ మాటలన్నాక జరిత ఆకాశం లోకి ఎగిరి పోయింది. నలుగురు కుమారులూ అగ్ని దేవుని నాలుగు వేదాలలోని మంత్రాలతో నుతించారు. మందపాలుడు ముందే చెప్పడం వల్ల అగ్ని దేవుడు వారున్న ఆ చెట్టుని దహించి వేయకుండా పరిహరించాడు. జరిత తిరిగి వచ్చి తన కుమారులను కలుసుకుంది.

కష్ట కాలంలో మానవులకు కర దీపికలా ఉపయోగించే చక్కని ఈ సూక్తి నన్నయ గారి
నానా రుచిరార్ధసూక్తినిధిత్వానికి మచ్చు తునక !

మరి కొన్ని తదుపరి హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.

15, జూన్ 2010, మంగళవారం

మంచి మాట


(మహా భారతం ఆది పర్వం పంచమాశ్వాసం నుండి )

కిందముడు భార్యతో మృగ రూపంలో క్రీడిస్తూ ఉండగా పాండు రాజు వధించాడు. పాండు రాజునకు శాపమిచ్చి మృగ రూపంలోని ఆ ముని దంపతులు మరణించాక పాండు రాజు చింతిస్తూ ఆత్మగతంలో ...
మానవులు ఎంతటి ఉత్తమ వంశంలో పుట్టినా, మంచి చెడ్డలను గురించిన ఙ్ఞానం కలిగి ఉన్నప్పటికీ పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు.

శరీరం నశించిన వెంటనే అన్ని ఋణాలూ తీరి పోతాయి. కాని పితరుల ఋణం మాత్రం శరీరం నశించినా తీరదు.

దానాలు చేసినా, తపస్సులు చేసినా, భూరి దక్షిణలతో యఙ్ఞాలు చేసినా, సంతానం లేని వారికి పుణ్య లోకాలు లభించవు. సంతానం కల వారే పుణ్యాత్ములు.

సత్యవతితో వ్యాసమహర్షి :

ఆలోచించి చూస్తే ఎండ మావి లాగా ఈ సంసారం అతి చంచలం. సంపదలు అశాశ్వతాలు. రాబోయే రోజుల కంటె గడచి పోయిన రోజులే మేలు.

( షష్ఠాశ్వాసము నుండి కొన్ని హిత వచనాలు,)

కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం సందర్భంగా కర్ణుని కుల గోత్రాలు అడిగిన కృపునితో
దుర్యోధనుడు :

లోకంలో రాజు అనే పేరు ఎవరికి ఉంటుంది? కులం గల వాడికి , శౌర్యం కల వాడికి , అధిక సేవా బలం ఉన్న వాడికి.

ఇదే సందర్భంలో దుర్యోధనుడు భీమునితో పలికిన మాటలు :

శూరుల పుట్టుక , దేవతల పుట్టుక , నదుల పుట్టుక తెలిసి కొనడం సాధ్యం కాదు. దేవేంద్రుని వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి పుట్ట లేదా ? గంగ కుమారునిగా, కృత్తికల కొడుకులగా, అగ్ని కుమారునిగా, రెల్లు పొదలలో కుమార స్వామి పుట్ట లేదా? ధర్మం తెలిసిన కృపుడు రెల్లు గడ్డి వాములో పుట్ట లేదా ? ద్రోణుడు కుంభ సంభవుడు కాదా ? ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణుల వలన పుట్ట లేదా ? మీ ( పాండవుల ) పుట్టుకలు కూడ యిలాంటివే కదా ?

పాండు పుత్రుల పరాక్రమాన్ని ఓర్వ లేక ఖిన్నుడై ఉన్న దుర్యోధనునితో శకుని మంత్రి కణికుడు పలికిన మాటలు. భారతంలో ఇవి కణిక నీతులుగా ప్రసిద్దాలు.

ప్రభువు గొప్ప అధికారం కలవాడై, తగిన విధంగా దండ నీతిని అవలంబిస్తూ, ప్రజలను ధర్మ మార్గాన నడిపించాలి. మంచి ప్రవర్తన కలవాడై ఉండాలి. దండనీతిలో స్వపర భేదాలు చూపించ కూడదు. సమ బుద్ధితో ప్రవర్తించాలి. అలా ఉంటే ప్రజలు కూడ తమ జాతి ధర్మాలు ఉల్లంఘించ కుండా మెలుగుతారు.

ఇవి చేయ దగిన పనులు , ఇవి చేయ కూడని పనుల అని తెలుసుకోవాలి. అలా కాక, చెడు నడవడికతో, ప్రజల మేలు కోరకుండా, ఉంటే అతడు తండ్రయేది, గురువయేది రాజు విడిచి పెట్టకుండా వానిని శిక్షించాలి. ఆ శిక్ష ప్రజలందరికీ తెలిసేలా అమలు చేయాలి.

ఏ పని చేసినా, ముందుగా బుద్ధిమంతులతో ఆలోచించి చేయాలి. ముందుగా విచారించి చేసిన పని ఎప్పుడూ చెడి పోదు.

రాజు నేర్పుతో మెత్తని పని చేత కాని, భయంకరమయిన పని చేత కాని మొదట తనని తాను కాపాడు కోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని పిమ్మట రాజ ధర్మాలు నడపాలి.

స్వచ్ఛమయిన బుద్ధితో తన లోపాలు ఇతరులు తెలిసికోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ , దేశ కాల పరిస్థితులను గమనిస్తూ మిత్ర బలాన్ని సమకూర్చుకుంటూ రాజు తన రాజ ధర్మాలు నిర్వర్తించాలి.


శత్రువు బలహీనమయినప్పుడే చంపడం రాజ నీతి. వాళ్ళు అధిక బలురై. మిత్ర బలం కూడ కూర్చుకున్నాక వారిని చంపడం సాధ్యం కాదు సుమా !

రాజు ఎప్పుడూ దూతల వలన అన్ని విసయాలూ తెలుసుకుంటూ ఉండాలి. విసుక్కో కూడదు. తన పనుల గురించే కాక, శత్రువుల పనులను గురించి కూడ తెలుసుకుంటూ ఉండాలి. శత్రు దేశ విషయాలు తెలుసుకుని రావడం కోసం వీలయినంతమంది ఎక్కువ సంఖ్యలో పాషండులను
( వేద బాహ్యులను) పంపాలి.

రాజు చాలా చోట్లకు వెళ్తూ ఉంటాడు. అందుకని రాజు ఎక్కడికి వెళ్ళబోతున్నా, ముందుగా ఆ ప్రదేశాలని క్షుణ్ణంగా పరిశీలించేలా చేయాలి. ఆయా ప్రదేశాలు పరిశీలించి, రాజుకి ఆపద కలిగించే వ్యక్తులు కానీ , ఆయుధాలు కానీ ఉంటే ముందుగానే తొలిగించేలా చర్యలు తీసుకోవాలి.

రాజైన వాడు ‘ వీడు నమ్మ దగిన వాడు ’ , ‘ వీడు నమ్మ రాని వాడు ’ అని అనకూడదు. నిశ్చయ బుద్ధితో తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ఎవరినీ అంతగా నమ్మెయ్య కూడదు.

మరో విషయం. రాజు తనని తాను కాపాడు కోవడమే కాదు - తన రహస్యపుటాలోచనలనీ కూడ జాగ్రత్తగా కాపాడు కోవాలి.రహస్యపుటాలోచనలు రాజు ఎంతాగా కాపాడు కుంటాడో అంతగా అతని పనులు విజయవంతాలవుతాయి. రహప్యాలను కాపాడు కోలేక పోతే ఆ బృహస్పతి పనులు కూడ ఫలవంతాలు కావు సుమా !

ఇక మనుషుల నైజం గురించి చెబుతాను. చెడ్డ వాళ్ళు మాటి మాటికీ ఒట్లు పెడుతూ ఉంటారు. చేతులు జోడించి దండాలు పెడుతూ ఉంటారు. తియ్యగా మాటలాడుతూ ఉంటారు. నక్క వినయాలు చూపిస్తూ ఉంటారు.

దుర్మార్గుడు తనకు అనుకూలమయే వరకూ మిత్రుడి వలె నటిస్తాడు. అనుకూలత ఏర్పడిన వెంటనే పాము లాగా తనక్రూరమయిన పనులనే కోరలతో కాటు వేస్తాడు.

పిడుగు పడడం , గాలి వీచడం - ఇవి ప్రజలకు ఎప్పుడు తెలుస్తాయి ? అవి జరిగి నప్పుడే
కదా ? అలాగే మిక్కిలి కోపం కాని, స్నేహం కాని ఇతరులకు వాటి అనుభవ కాలానికే తెలియాలి. రాజు అలా మసలుకోవాలి.

రాజు, తనకు ఇంతకు ముందు అపకారం చేసిన వాడిని, తక్కువ వాడే కదా అని ఆదరించ కూడదు. ముల్లు చిన్నదే కావచ్చు. అది పాదంలో గుచ్చుకుని ఉండగా నడవ గలమా ?

శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్య కూడదు. బాలుడని చులకన భావంతో అతనితో కలిసి ఉండ కూడదు. భయంకరమయిన పర్వతాలను, అరణ్యాలను కాల్చిపారెయ్య డానికి ఒక చిన్న నిప్పు కణికె చాలదూ ?


తనకి అపకారం చేసిన వాడిని చేర దీసి, దగ్గర ఉంచుకునే వాడు బుద్ధి హీనుడు. వాడెలాంటి వాడంటే, ఎత్తయిన చెట్టు కొమ్మ మీద ఏమరుపాటుతో నిద్రించే వాడితో సమానం !

మరో ముఖ్య విషయం ... రాజా, అపకారాలు చేసే వాళ్ళని, సామ దానభేద దండోపాయాల చేత కాని , దయ చూపడం చేత కాని, వారికి నమ్మకం కలిగేలా చేయి. అలా మాటలాడి వారిని నమ్మించు. కావాలంటే ఒట్టు పెట్టు. వారికి నమ్మకం కలిగించి, తర్వాత ఏమాత్రం ఆలస్యం చేకుండా చంపెయ్యి. శుక్రుడు కూడ ఇదే చెప్పాడు. అందు చేత ఏ విధంగానయినా రాజ నీతితో శత్రువులను హతమార్చాలి.

అందు చేత అపకారాలు చేసే వాళ్ళు శత్రువులయినా, బంధువులయినా సరే, అశ్రద్ధ చేయ కూడదు. ఆత్మ రక్షణ కోసం వాళ్ళని హతమార్చాల్సిందే సుమా !

ఇది కణిక నీతి.

ఇక, ఏకచక్రపురంలో పాండవులు భిక్షాటనం చేస్తూ ఉండిన సందర్భంలో, ఆ యింటి గృహస్థుకి వచ్చిన ఆపదను విని కుండి బాధ పడుతూ ఆత్మగతంలో ....

బుద్ధిమంతులు తమకి ఎదుటి వాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించాలి. అదే ఉత్తమమయిన పుణ్య కార్యం. మంచి బుద్ధితో దానికి సమానమయిన ప్రత్యుపకారం చేయడం మధ్యమ మార్గం,
అలా కాకుండా పొందిన మేలు కంటె ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమ పద్ధతి.

ఆ బ్రాహ్మణుడు తన వారితో పలికినది:

ఈ సంసారం గడ్డిలాగా చాల నిస్సారమయినది. దు:ఖాన్ని కలిగించేది. భయానికి నెలవయినది. కడు చంచలమయినది. ఇతరులకు లొంగేది. పండితు ఈ సంసార జీవనం సత్యమయినదని ముమ్మాటికీ నమ్మరు

ఇదే ఘట్టంలో కుంతి:

ధైర్యం కొలు పోయి వేడుకునే వాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయ వడే వాడిని, శరణే వేడిన వాడిని చంప కూడదు. అలా చేసే వాడికి ఇహపర లోక సుఖం ఉండదు.

ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దు:ఖాలను తొలతగించడానికి పుట్టిన ధర్మ శీలుడు. మృత్యుభయం కలిగిన బ్రాహ్మణుడిని కాపాడితే పుణ్య లోకాలు కలుగుతాయి. దయతో క్షత్రియుడుని కాపాడితే కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను కాపాడితే ప్రజలందరి మన్ననలు పొందుతాడు. ఈ విషయం వేదవ్యాసుడు చెప్పాడు.

మరి కొన్ని తదుపరి ‘ హిత వచనమ్ ’ డాట్ కామ్ లో చూదామా ?


ఇప్పటికి స్వస్తి.




14, జూన్ 2010, సోమవారం

మంచి మాట


(ఆంధ్ర మహా భారతం ఆది పర్వం చతుర్ధాశ్వాసం నుండి ... )

శకుంతలోపాఖ్యానం లో శకుంతలతో కణ్వ మహా ముని:

ఎటు వంటి పతివ్రతలకయినా, పుట్టినిళ్ళలో ఎక్కువ కాలం ఉండడం ఎంత మాత్రం తగదు సుమా ! ఇళ్ళాళ్ళకు భర్తల దగ్గర ఉండడమే ధర్మం. భార్యలకు భర్తలే ఏడుగడలు ( సర్వ రక్షకులు.)

తనను గుర్తించ నట్టుగా ఉన్న దుష్యంతుని గురించి శకుంతల ఆత్మగతంలో అనుకున్నది:

ఎవరయినా నిజంగా మరచి పోతే ఙ్ఞాపకం చేయ వచ్చును. అసలు తెలియనప్పుడు తెలియ చెప్ప వచ్చును. కాని, తెలిసి కూడ తెలియని వానివలె నటించే మోసగాడికి తెలియ జేయడం ఆ బ్రహ్మ దేవుడి వశం కూడా కాదు.


శకుంతల దుష్యంతునితో పలికినది:

వివేకంతో బాగా ఆలోచిస్తే, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే వాడికి ఇహపరాలు రెండూ ఉండవు.

అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు చక్కగా ఆచరించ గలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించ గలుగుతాడు. పుత్ర సంతానాన్ని పొంద గలుగుతాడు. గృహస్థ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగిగే ఫలాన్ని పొందుతాడు.

అంతే కాక, భార్య అంటే ఎవరనుకున్నావు? ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సాధించడానికి అనువైన సాధనం. గృహనీతి అనే విద్యకు నెలవైనది. శీలాన్ని ప్రబోధించే గురువు. వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమ గతులు పొందడానికి ఊత కర్రలా ఉపయోగ పడుతుంది. మన్ననకు ముఖ్య హేతువు. ఆదర్శ ప్రాయాలు, కలకాలం నిలిచేవీ అయని రత్నాల లాంటి గుణాలకు నెలవైనది. హృదయానందాన్ని భర్తకు కలిగించేది భార్యయే సుమా !

మగనికి ఇల్లాలి కంటె ఇంపైనది వేరొకటి లేదు. భార్యా పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడయినా, ఎలాంటి పరిస్థితిలోనయినా, ఎలాంటి ఆపదలోనయినా, ఏ తీరాలలోనయినా చుట్టుముట్టినా ఆపదలన్నీ తొలిగి పోతాయి.

అంతే కాక, భార్య భర్తలో సగం. అందు వల్ల భర్త కంటె ముందుగానే మరణించిన భార్య పర లోకంలో అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందుగానే చనిపోతే అతనిని అనుగమిస్తుంది. అట్టి స్త్రీని అవమానించడం ధర్మవిరుద్ధం. మరో ముఖ్య విషయం. భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు. కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది. దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు.

గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు.

మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు.

‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం. కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు.

ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు.

రాజా ! విరుద్ధాలయిన మాటలు ఎందుకు? ఈ నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ
లేవు సుమా !

సత్య వాక్యం గురించి శకుంతల ...

ఓ రాజా ! మంచి నీటి ,చేదుడు బావులు నూరిటి కంటె ఒక దిగుడు బావి మేలు. కాగా బావులు నూరిటి కంటె కూడ ఒక మంచి యఙ్ఞం మేలు. అలాంటి యఙ్ఞాలు నూరిటి కంటె కూడ
ఒక కుమారుడు మేలు. అట్టి పుత్రులు నూరుమంది కంటె కూడ ఒక సత్య వాక్యం మంచిది సుమా !

వేయి ఆశ్వ మేథ యాగాలు చేసిన ఫలితం ఒక వైపు, ఒక్క సత్యాన్ని మాత్రమే ఒక వైపు త్రాసులో వేసి ఉంచి తూచి చూస్తే, సత్యం వేపే త్రాసు ముల్లు చూపిస్తుంది. సత్యం అంత గొప్పది.

సర్వ తీర్ధాలూ సేవించడం, అన్ని వేదాలనూ అధ్యయనం చేయడం కూడ సత్యంతో సాటి రావు ! ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటె సత్యము గొప్పదని అంటారు.



మరి కొన్ని ... తదుపరి హిత ‘ వచనమ్ ’ . కామ్ లో

స్వస్తి

13, జూన్ 2010, ఆదివారం

మంచి మాట


( ఆంధ్ర మహా భారతం ఆది పర్వం. ద్వితీయాశ్వాసం నుండి ... నన్నయ రచన)

శమీక మహర్షి పరీక్షిన్మహా రాజునకు శాపమిచ్చిన తన కుమారుడు శృంగితో పలికినది ...


నాయనా ! కోపమే తపస్సును చెడ గొడుతుంది. అణిమాది అష్ట సిద్ధులను నాశనం చేస్తుంది. కోపం ధర్మ కార్యాలకు విఘాతం కలిగిస్తుంది. కనుక తపస్సు చేసుకునే మునికి కోపం తగదు సుమా !

పగిలిన కుండలో నీళ్ళు నిలుస్తాయా చెప్పు ? అలాగే , ఏమాత్రం ఓర్పు అనేది లేని ముని చేసే తపస్సు , అజాగ్రత్తగా ఉండే వాడి ధనం, ధర్మాన్ని విడనాడిన రాజు యొక్క రాజ్యం యివన్నీ నిలవవు.

( ద్వితీయాశ్వాసం నుండి ...)

కచ దేవయాని కథలో శుక్రాచార్యుడు మద్యపానాన్ని నిషేధిస్తూ చెప్పినది ...

మనం ముందు జన్మలలో చేసిన పుణ్యమంతా , పొందిన వివేకమంతా మద్యపానం చేయడం వల్ల యిట్టే పోతుంది. అందు చేత మద్యపానం చేయడం తగదు. నేటి నుండి బ్రాహ్మణులాదిగా గల జనులు మద్యాన్ని సేవిస్తే ఘోరమయిన నరకంలో పడతారు అని కట్టడి చేస్తున్నాను.

రాచబిడ్డ శర్మిష్ఠతో వైరం పొంది అలిగిన కుమార్తె దేవయానితో శుక్రుడు పలికినది ...

సాటి లేని గొప్ప నియమాలతో కూడిన వారై, భూరి దక్షిణలిచ్చి వేల కొద్దీ క్రతువుల చేసిన వారి కంటె కూడ ఎవడు కోపం లేకుండా ఉంటాడో, వాడే మిక్కిలి గొప్ప వాడని పరమార్ధం తెలిసిన వాళ్ళు చెబుతారు.

ఇతరులు కోపిస్తే కోపించ కుండా, ఇతరులు నిందలు పలికితే వాటిని విననట్లే మారు పలక కుండా, అవమానం పొంది ఉండి కూడ మనసులో పెట్టుకోకుండా ఉన్న వాడే లోకంలో ధర్మాన్ని తెలిసిన వాడు. కాబట్టి బుద్ధిమంతులకు కోపం తగదు.

శర్మిష్ఠ యయాతితో పలికినది :

ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడూ, సమస్త ధనమూ అపహరించబడుతున్నప్పుడూ, వధించబడుతున్న బ్రాహ్మణుడిని కాపాడేటప్పుడూ , స్త్రీలతో సమాగమం చేసే విషయం లోనూ, వివాహ సమయాలలోనూ అసత్యం చెప్ప వచ్చును.

భాగవతంలో వారిజాక్షులందు, వైవాహికములందు ... అనే పద్యంలో ఇలాంటి మాటలే చూస్తాం. అక్కడ స్త్రీల విషయం లోను, మాన భంగం జరిగే సమయంలోనూ, భీతిల్లిన గోవులను కాపాడే సందర్భంలోను అసత్యం చెప్పినా దోషం లేదని చెప్పగా, యిక్కడ వధూజన సంగమ విషయంలో కల్ల పలికితే తప్పు లేదనడం కనిపిస్తుంది. ( సందర్భం అది, మరి.)

శుక్రుడు యయాతికి శాపం యిచ్చే సందర్భంలో యయాతి పలికిన పలుకులు :

పుష్పవతియై , భర్త సమాగమాన్ని పుత్రార్ధం కోరిన భార్య ను వలదని తిరస్కరించి, ఆమె యెడ అననుకూలంగా ప్రవర్తించి, రుతుకాలాన్ని ఎవడైతే వ్యర్ధం చేస్తాడో, అట్టి వానికి గర్భస్థ శిశువును చంపిన పాపం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు.

యయాతి తన వార్ధక్యాన్ని గ్రహించి, తనకు యవ్వనం వచ్చేలా చేయమని కొడుకులను అడిగితే వారు నిరాకరించడమే కాక తండ్రితో యిలా అంటారు :

లోకంలో ముసలితనం, రోగం ఎవరికయినా విధివశాత్తు కలిగినా వాటిని వారే అనుభవిస్తారు. కాని, తెలిసి తెలిసి ఎవరూ కావాలని ఆ రెండింటినీ ఇతరుల నుండి తీసుకోరు. అలాంటి బుద్ధి హీనులెవరూ ఉండరు కదా ?
మన్మథుడే కావచ్చు , అతడు వెండ్రుకలు నెరిసి పోయి ఉంటే యౌవ్వన వతులు అతనిని సమీపించడానికి అసహ్యించుకుంటారు. మగ వాడు ఎంత కుబేరుడయినా, వృద్ధత్వం వల్ల కలిగిన రోత చేత యిష్ట భోగాలను పొంద లేడు.

తన జరాభారాన్ని గ్రహించి తనకి యవ్వనాన్ని యిచ్చిన కుమారుడు పూరునకు యయాతి రాజ్యభారాన్ని అప్పగించడంతో పాటు కొన్ని హిత వచనాలు చెప్పాడు. చూడండి ....

ఙ్ఞానం కలవారి చరిత్రలు తెలుసుకుంటూ, నిశ్చలంగా సజ్జన సల్లాపం చేస్తూ ధర్మాన్ని గ్రహిస్తూ తెలిసుకున్న దానిని మరిచి పోకుండా న్యాయ బుద్ధితో ఆచరించాలి.

ఎవడు తగిన వాడో , వానికి వాని అర్హతను గుర్తించి తగిన విధంగా ధనాన్ని యివ్వాలి. మనం యిచ్చాక అతడు మరి వేరొకరిని అడగనవసరం లేని విధంగా యివ్వాలి. మన ఎదుట యాచిస్తూ నిలిచిన యాచకులను నిరాశ పరచ కూడదు. సకల జీవులకూ తృప్తిని కలిగించాలి.

సభలలో మాటలాడేటప్పుడు మంచి మాటలే పలకాలి. మనసునకు ప్రీతిని కలిగించేదీ, మేలైనదీ, తగినదీ, సత్యమైనదీ, తీయనిదీ, అయిన మాటలు మాట్లాడాలి. ఆ మాటలు కూడా వీలయినంత క్లుప్తంగా ఉండాలి. ముఖ్యంగా సభలో పలికి పలుకులు ధర్మ బద్దంగా ఉండాలి.

కొంత మంది చాల దుర్మార్గంగా మాటలాడుతూ ఉంటారు. వారి చెంత నివసించ కూడదు.
ముఖం అనే వింటికి మాటలనే వాడి బాణాలను సంధించి, ఇతరుల మర్మాలనే లక్ష్యాలను చీలుస్తూ ఉండే దుష్ట యోధులకు దూరంగా ఉండాలి. దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, సత్యం, బహిరింద్రియ నిగ్రహం, శుచిత్వం, అనే వాటిని మనసులో నిలపాలి. పాటించాలి. నిర్మల మైన శాంత బుద్ధితో కామ క్రోధాదులను జయించాలి. ఈ అంత: శత్రువులను జయించ గల వాడే బహిశ్శత్రువులను కూడ ఏమాత్రం శ్రమ లేకుండా ఓడించ గలుగుతాడు.


మహా మునుల తపస్సులను తక్కువ చేసి మాట్లాడినందుకు కోపించి, ఇంద్రడు యయాతిని అథో లోక భ్రష్టునిగా చేసి, పిమ్మట అతడి అభ్యర్ధనను మన్నించి యయాతిని నక్షత్రగణాలు ఉండే చోటు పొందేలా అనుగ్రహిస్తాడు. అక్కడ అతని దౌహిత్రులయిన అష్టకాదులు అడిగిన దానికి పలికిన హిత వచనాలు చూడండి ...

సమస్త జీవులకి దయ కలిగి ఉండడం కంటె, సత్యం పలకడం కంటె, శ్రేష్ఠమయిన ధర్మం మరొకటి లేదు. సంకోచం లేకుండా యితరులను బాధించడం, వారికి సంతాపం కలిగించడం చాల అధర్మం అని పండితులు చెబుతారు.

వేద విహిత కార్యాలను ఆచరించడమే ఉన్నత గతికి మార్గం. వేద ధర్మాన్ని అతిక్రమించి నిషేధించబడిన వాటిని ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా చేయడం పాప హేతువు. అట్టి వారు దుర్గతి పాలవుతారు సుమా !

అంతే కాదు ...గర్భయోనిలో రుతు కాలం లోని స్త్రీ రజస్సుతో కూడినదై, పురుషుడి రేతస్సు గాలి చేత ప్రేరేపించబడినదై కలియగా ఆ గర్భ యోనిలో శబ్దస్పర్శాదులైన తన్మాత్రలు ఐదూ రూపొంది క్రమంగా జీవం పొంది, అవయవాలు ఏర్పడి, పుట్టడం జరుగుతుంది.

తరువాత చెవుల చేత శబ్దాన్నీ, నేత్రాల చేత రూపాన్నీ, ముక్కు చేత వాసననీ, నాలుక చేత రుచినీ చర్మం చేత స్పర్శనీ , మనస్సు చేత సమస్తాన్నీ తెలుసుకుంటారు. ఆ పిమ్మట పూర్వ జన్మ కృత పుణ్య పాప పరిపాక ఫలం చేత చెడ్డ పనులు చేస్తూ మతి మాలి పశుపక్ష్యాదులుగా పుడతారు. పుణ్య ఫలాధిక్యత చేత, పుణ్య కార్య నిర్వహణ చేత మానవ జన్మ ఎత్తుతారు. ఆచారవంతులై, నిర్మలఙ్ఞాన సంవద చేత మోక్షాన్ని పొందుతారు.

ఇక, మంచి ఆచారవంతులెవరయ్యా, అంటే....

గురువులను సేవించే వారు , నిత్యం వేదాధ్యయనం చేసే వారు, ఏమరక అగ్ని హోత్రాలను నిర్వర్తించే వారు, అంతర్ బహిరింద్రియ నిగ్రహాన్ని పాటించే వారు, శుచిగా బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించే వారు, పాపకార్యాలు చేయకుండా, పరులను పీడించకుండా ధర్మ మార్గాన సంపాదించిన ధనంతో అతిథి సేవ చేసే వారూ, ఆహారం నియమంగా తీసుకునే వారూ, శీతోష్ణ సుఖ దుఖాలను, సర్వ ద్వంద్వాలను జయించి అన్ని ఆసక్తులు విడిచి పెట్టి ఒంటరిగా తిరుగుతూ ఉండే యోగులు ... వీరు యుక్తాచారులు. వీరు తమ పుణ్యాచారాల చేత అటు వది వేల తరాల పూర్వులనూ, యిటు పది వేల తరాల వారినీ ఉద్ధరిస్తారు.

గర్వంతో అగ్ని కార్యం చేసినా, ఆడంబరం కోసం వేదాధ్యయనరం చేసినా మదంతో కూడిన మౌనాన్ని వహించినా, అఙ్ఞానంతో , ఆడంబరంగా యఙ్ఞం చేసినా ఫలితం ఉండదు.అట్టివి అయోగ్యాలు సుమా .



మరి కొన్ని ... తదుపరి హిత ‘వచనమ్ ’ . కామ్ లో చూదాం .......


ఇప్పటికి స్వస్తి.