10, మార్చి 2016, గురువారం

మా తమిళ నాడు యాత్రావిశేషాలు ... Day 01

మా తమిళ నాడు యాత్రా విశేషాలు ...  Day 01

చెన్నై లోని టూరిజమ్ వారి ఆఫీసు నుండి  27-02-2016 శనివారం ఉదయంబస్ 7.45 గం.లకి
బయలు దేరాక, గంట ప్రయాణం తరువాత TTDC  వారి హొటల్ దగ్గర బస్ ఆగింది.
టిఫిన్ లు అయ్యేక, తిరిగి బయలు దేరింది. పాండిచ్చేరికి ప్రయాణం. పాండిచ్చేరి పది పన్నెండు
కి.మీ దూరంలో ఉందనగా, మా గైడ్  బస్సు లోనుంచే 2004లో వచ్చిన పెను ఉప్పెనకు
గురయిన ప్రాంతాలను చూపించేడు. అవన్నీ మొత్తం ధ్వంస మయ్యాయిట. కానీ ఆ ఆనవాళ్ళేమీ
ఇప్పుడు కనిపించవు. ప్రజల సహకారంతో ప్రభుత్వం నిర్మించిన కొత్త కాలనీలు, వందలాది యిళ్ళు
కనిపిస్తాయి. వొక శ్మశాన వాటికలాంటి ప్రదేశాన్ని అనతి కాలంలోనే నందనోద్యానంగా మార్చిన
ప్రభుత్వం వారి కృషి, చిత్త శుద్ధి ఆనందం  కలిగిస్తుంది.

బస్ 9గటలకి పాండిచ్చేరి చేరింది. దీనినే పుదుచ్చేరి అని కూడా వ్యవహరిస్తారని తెలిసినదే కదా.
 పుదుచ్చేరి చాలా అంద మయిన పట్టణం. ఇది కేంద్ర పాలిత  ప్రాంతం. పుదుచ్చేరి వైశాల్యం 293 కి.మీ.లు.
 బంగాళా ఖాత తీరంలో తమిళ నాడు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది. మన ఆంధ్ర ప్రదేశ్ లో అతర్భాగంగా
 కేంద్ర  పాలిత ప్రాంత మయిన యానాం ఉంది. వొకటి రెండు పర్యాయాలు వెళ్ళాను. అది కూడా పాండిచ్చేరి
లాగే అంద మయిన ప్రాంతం. పాండిచ్చేరిలో విశాల మయిన అంద మయిన బీచ్ కనుల పండువు చేస్తుంది.
1673లో ఫ్రెంచి వారు ఇక్కడ ఈస్టిండియా కంపెనీ అనే వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ ప్రాతాన్ని
స్వాధీన పరుచు కున్నారు.
మాతృ భాష తమిళంగా కలిగి, ఇప్పటికీ ఫ్రెంచి వారసత్వం కలిగిన  చాలా మంది ఇక్కడ ఉంటున్నారు.
పూర్వం ఇక్కడ అగస్త్య ముని ఆశ్రమం ఉండేదిట. అరవిందుడు, ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి
నడయాడిన చోటు యిది.
పుదుచ్చేరిలోసముద్రపు అలలు నగరం లోనికి చొచ్చుకు రాకుండా  27 అడుగుల కరకట్ట నిర్మించారు.
 2004 లో వచ్చిన పెను ఉప్పెన నుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడినది ఈ కరకట్టేనట! ఆఉప్పెనలో
దాదాపు 24 అడుగుల ఎత్తు వరకూ అలలు విరుచుకు పడ్డాయిట.ఈ కరకట్టే కనుక లేక పోతే, ఆ రోజు
పాండిచ్చేరి సముద్ర గర్భం లో కలిసి పోయి ఉండేది!

పుదుచ్చేరిలో మొదట వినాయక గుడిని దర్శించు కున్నాం. ఆ విధంగా మా యాత్ర వినాయకుని
 దర్శనంతో మొదలయిందని చెప్పాలి! తదనంతరం ఏ విఘ్నాలూ లేకుండా యాత్ర పూర్తవడానికి ఇది
దోహద పడిందనవచ్చు. ఈ వినాయక గుడి పాతదే అయినా, ఇటీవల కాలంలో ఆధునీకరించి చాలా
అందంగా రూపొందించినట్టు కనబడుతోంది.విశాలంగా ఉంది. ఇక్కడ అందమయిన  రంగులతో  లెక్క లేనన్ని
 భంగిమలతో వినాయకుని బొమ్మలు ఉన్నాయి. తరువాత అరవిందాశ్రమం చూసాం. అరవిందుని
స్మృత్యర్థం నిర్మించిన వొక పవిత్ర మయిన, ప్రశాంత మయిన ఆధ్యాత్మిక అధ్యయన కేద్రం అది.
అక్కడ అరవిందుని పుస్తక భాండాగారం, వారు వినియోగించిన వస్తువులు, స్వాతంత్ర్య సమర ఘట్టానికి
చెందిన ఫొటోలు మొదలయినవి భద్ర పరిచేరు.
అరవిందాశ్రమం చూసాక కొంత సేపు బీచ్  లో గడిపేం. చాలా పొడవయిన బీచ్ ఇది. కనుచూపు
మేర  సముద్రమే.కరకట్ట అవతల అలలు కనుల పండువుగా ఉంటాయి.ఉత్సాహం ఉంటే, కరకట్ట
అవతల బండ రాళ్ళను దాటుకుంటూ అలల వరకూ వెళ్ళ వచ్చును.
 పాండిచ్చేరిలో వీధులన్నీ ఎక్కడా వంపులు లేకుండా తిన్నగా తీర్చి దిద్దినట్టు ఉన్నాయి.
ఇళ్ళు కూడా ఫ్రెంచి వారి కట్టడాల శైలిలో అందంగా  కనిపిస్తాయి. పరిశుభ్ర మయిన ప్రశాంత
 మయిన నగరం.
సరే, పాండిచ్చేరి అందాలనుమనసు పొరలలో నిక్షిప్తం చేసు కుంటూ బస్ ఎక్కాము.
మధ్యాహ్నం  1.30 అవుతూ ఉండగా కడలూరు అనే చోట భోజనాలకి బస్ ఆగింది. ఈ భోజనాల
ఖర్చు  మాదే, భోజనం  చాలా బాగుది. 95 రూ.లకి అంత మంచి భోజనం దొరకడం అదృష్టమే.
అందరం లంచ్ తీసు కోవడం అయ్యాక తిరిగి బస్ బయలు దేరింది. సాయంత్రం 2.30 గంటలకి
పిచ్చవరం చేరింది. ఇదొక అంద మయిన టూరిష్టు ప్లేసు.ఇక్కడ ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల
చిత్రీకరణ జరుగుతూ ఉంటుందిట. ఈ బ్యాక్ వాటర్స్ లో తెడ్డు వేసి నడిపే పడవలో వెళ్ళి రావాలి.
మర పడవలు కూడా ఉంటాయి, గంట, రెండు గంటలు, మూడు గంటలు ఇలా మనకి నచ్చిన
సమయం పడవలలో గడిపి రావచ్చును. ఒక్కో దానికీ ఒక్కో రేటు. మేమూ, మురళీ కృష్ణ
కుటుబ సభ్యులు ముగ్గురూ కలిసి మొత్తం ఐదుగురం వొక గంట తిరిగి రావడానికి టిక్కెట్లు
తీసు కున్నాము. ఒక్కొక్కరికీ రూ 63 చొ.నఅయిది. వారిచ్చిన  లైఫ్ జాకెట్ లు తప్పకుండా వేసు
కోవాలి. అవే మంత పరిశుభ్రంగా లేవనుకోండి. అయినా వేసుకోక తప్ప లేదు.ఆ ప్రాంతమంతా
బ్యాక్ వాటర్స్ లో మేంగ్రూ చెట్ల పొదలతో నిడి పోయి ఉంటుంది. అవి ఔషధ మొక్కలు.
గుబురుగా ఉండే ఆ చెట్లను దూరంగా చూస్తూ,వాటి ప్రక్కల నుండీ, క్రింద నుండీ పడవలో వెళ్ళి
 రావడంవొక అందమయిన అనుభవం!  దట్టమయిన ఆ అటవీ వృక్షాల వల్లనే ఆ ప్రాంతం
ఎన్నో తుఫానులనీ, ఉప్పెనలనీ ఎదుర్కొన గలిగినదని  చెబుతారు.
ఈ బోటు షికారుతో మాతొలిరోజు యాత్ర ముగియ లేదు. అక్కడి నుండి  బయలు దేరి సాయంత్రం
కోవెల తెరిచే వేళకి నాలుగు గంటలకి చిదంబరం చేరు కున్నాం.
చిదంబరం కడలూరు జిల్లాలో ఉంది. ప్రసిద్ధ శైవ క్షేత్రం. శివుడు ఆనంద తాడవం చేస్తూ నట రాజ
రూపంలో దర్శన మిస్తాడు. నేల, నీరు, నింగి,గాలి,అగ్ని అనే పంచ భూత లింగాలలో ఇక్కడ శివుడు
 ఆకాశ లింగ రూపంలో ఉంటాడు. ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉండేది కనుక ఆ ఆకాశ లింగం
లింగ రూపంలో ఖాళీ జాగాలో తెర మాత్రమే చూడ గలుగుతాం. శివుడు ప్రక్కన నటరాజ రూపంలో
 మాత్రమే  దర్శన మిస్తాడు.  అదే చిదంబర రహస్యం అని అంటారు. స్వామితో పాటు, శక్తి రూపిణి
 అయిన శివగామిని ప్రతిరూపగా డబల్లెని చూడగలం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ శైవ
క్షేత్రంలో గోవింద రాజ పెరియాళ్ కూడ తన దేవేరి పుడరీక వల్లీ సహితుడై కొలువై ఉండడం ! నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలో ఇది ఒకటిట. స్థితి కారుడినీ, లయ కారుడినీ ఒకే  ఆలయంలో దర్శించు కోవడం చిదంబరం ప్రత్యేకతలలో ఒకటి.

పంచ భూత లింగాలు ఇవి:
1.        చిదంబరం  ...  నటరాజ స్వామి రూపంలో ...ఆకాశ లింగం
2.        కంచి ... ఏకాంబరేశ్వరుడు  ..  భూ లింగం
3.        జంబుకేశ్వరం  ... జల లింగం
4.        తిరువణ్ణామలై  ( అరుణాచలం)  .. అగ్ని లింగం
5.        శ్రీకాళహస్తి ... వాయు లింగం.
చిదంబరంలో మొత్తం 9 పెద్ద గాలి గోపురాలతో విశాల మయిన ప్రాకారంలో కట్టబడిన అతి ప్రాచీన మయిన శైవాలయం. అయితే ఇందులో నాలుగు గాలి గోపురాలు మరీ ప్రత్యేక మయినవి. వాడుకలో ఉన్నవి. ఇక్కడ రాతి గొలుసులు,పెద్ద పెద్ద స్తంభాలు  వారి శిల్ప కళా నిర్మితికి వొక చక్కని ఉదాహరణ.
చిదంబరం నటరాజ స్వామి దర్శనం చేసుకున్నాక, వో గంట సేపు అక్కడ గడిపి మా తొలి రోజు యాత్రలో చివరిదయిన వైథీశ్వరన్ కోయిల్ చేరు కున్నాం.

వైథీశ్వరన్ కోయల్ . చిదంబరం నుండి 27 కి.మీ. దూరంలో ఉంది.శివుడు వైథీశ్వరునిగా అవతరించాడు. పూర్వం వొక రాజు  కుష్ఠు రోగ పీడితుడై అంగారక పూజలు జరిపించగా రోగ విముక్తు డయ్యాడని ఐతిహ్యం. అతడే ఈ దేవాయం నిర్మించినట్టు చెబుతారు.
ఇక్కడ వెలిసిన వైథీశ్వరుడు ఆరోగ్య ప్రదాత అని అంటారు. ఈ ప్రాంతంలో
నాడీ వైద్యం ప్రముఖంగా చేస్తూ ఉంటారుట.
దీనితో మా 8 రోజుల తమిళ నాడు యాత్రలో మొదటి రోజు యాత్ర  సంతృప్తికరంగా ముగిసింది. బస్ టూరిజమ్ వారి హొటల్ కి చేరు కుంది. అక్కడే రాత్రి డిన్నర్ చేసాం.
హొటల్ వారి ఆతిథ్యం గురించీ, భోజనాల గురించీ చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది.

మా రెండో  రోజుయాత్రా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శలవ్.





















9, మార్చి 2016, బుధవారం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు .. .. చెన్నై దేవాలయ దర్శనం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు  -  చెన్నై దేవాలయ దర్శనాలు
తమిళ నాడు వారి టూరిజమ్ పేకేజిలో మా యాత్ర ఫిబ్రవరి 27 తో మొదలవుతుంది. కాని,
తమిళ నాట మా దేవాలయ దర్శనాలు 26 వ తేదీ నుండే మొదలయ్యాయని చెప్పాలి. ఎదురు చూసిన
ప్రయాణపు తేదీ దగ్గర పడుతూ ఉండడంతో 24 వ తేదీ నాటికే రెండు  చిన్నసూట్ కేసులూ, వొక బేగ్ తో
బట్టలూ అవీ సర్దుకుని సిద్ధ మయ్యాము. రానే వచ్చింది 25 వ తేదీ. ట్రైన్లో రాత్రీ, మరునాడు ఉదయమూ
తినడానికి మా ఆవిడ టిఫిన్ పేకెట్ లు సిద్ధం చేసింది.
మేం ఎక్క వలసిన భువనేశ్వర్ – చెన్నై సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్ సరైన సమయానికే అంటే, సాయంత్రం
 5గ.50 ని.లకి వచ్చింది. మా ఇద్దరివీ కూడా అప్పర్ బెర్తు లే! కానీ మిడిల్ బెర్తు  వ్యక్తి మా ఆవిడకు
అది యిచ్చి, తను అప్పర్ బెర్తులో సర్దుకున్నాడు.
 రాత్రి ఎనిమిదికి టిఫిన్ లు కానిచ్చి, నిద్రకు ఉపక్రమించాం, మర్నాడు ఉదయాన్నే లేచి ముఖాలు కడుక్కుని కాఫీలు సేవించి
కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే 8.50ని.లకి చెన్నై సెంట్రల్ స్టేషనులో సరైన టైముకే  ట్రైన్ చేరింది.

చెన్నైలో స్టేషనుకి అర కిలో మీటరు దూరం లోనే సిటీ హోమ్ హొటల్ లో వొక ఎ.సి రూమ్ ముందుగానే
నెట్ లో బుక్ చేసి ఉన్నాను కనుక, రైలు దిగి, కూలీని మాట్లాడుకుని స్టేషను వెలుపలికి వచ్చి, ఆటోలో
హొటల్ కి  చేరాం. గదిలో ప్రవేశించి స్నానాదికాలు ముగించుకుని టిఫిన్  కానిచ్చేం. ఇక మర్నాడు ఉదయం
వరకూ మాకు తీరికే. కనుక, మద్రాసులో ప్రసిద్ధ మయిన ప్రాచీన దేవాలయాలు చూసి వద్దాం అని
 నిర్ణయించు కున్నాం. మేం దిగిన సిటీ హోమ్ హొటల్ వారే ట్రావెలింగు ఏజెన్సీనిర్వహిస్తూ ఉండడంతో
వాళ్ళ టారిఫ్    సరి చూసుకుని, 5 గంటలకి వొక ఇండికా ఎ.సి. కేబ్ బుక్ చేసాను. రేటు 900లు.
కేబ్ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఉండాలని చెప్పేను. రెండింటికి భోజనాలు కానిచ్చి, పేపరు చదువుకుంటూ
 విశ్రాంతి తీసుకున్నాం. మూడు గంటలకి బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నాం.
చెప్పిన టైముకి కేబ్ వచ్చింది. బయట ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎ.సి కేబ్ బుక్ చెయ్యడంతో
మాకు అలసట తెలియ లేదు.
ముందుగా అష్ట లక్ష్మీ దేవాలయానికి వెళ్ళాం. అంతస్థులుగా ఉండే ఈ దేవాలయం చాలా బాగా ఉంది.
మెట్లెక్కుతూ అష్ట లక్ష్ములనూ దర్శించు కున్నాం. అక్కడి నుండి ఎదురుగా సముద్రం కనబడుతూ
వాతావారణం ఆహ్లాదకరంగా అనిపించింది. తర్వాత పార్ధ సారధి టెంపుల్,  ఆ తరువాత కపాలేశ్వర స్వామి
దేవాలయాలను దర్శించు కున్నాం. ఈ మూడు దేవాయాలూ చెన్నై లో  చాలా ప్రసిద్ధ మయినవే కాక
తప్పకుండా చూడ తగినవి. వీటి గురించి మేం ముందుగానే విని ఉన్నాం.
దేవాలయాలను దర్శించు కున్నాక, మెరీనా బీచ్ కి వెళ్ళాం. అప్పటికి చీకటి పడింది. సముద్రం మసక
 మసకగా  కనిపిస్తోంది. అయితే నేం, సముద్రపు గాలి చల్లగా హాయిగా ఉంది.
ఎంత చూసినా తనివి తీరదు. ప్రతి సారీ కొత్త కొత్త పాఠా లేవో చెబుతూనే ఉన్నట్టుగా ఉంటుంది. కెరటాల
 చేతులతో ఆశీర్వదిస్తూ. తెల్లనినురుగు నవ్వులతో  సమ్మోహనపరుస్తూ, చల్లని గాలుల్తో సేద దీరుస్తూ,
 ఆ సంజె చీకట్లలో చీకట్ల దుప్పటీ కప్పుకుని సముద్రం మరింత కొత్తగా కనిపించింది. గరికపాటి వారి
 సాగర ఘోష కావ్యం లోని  కొన్ని చరణాలను గుర్తు చేసు కున్నాను. దానితో మనసు మరింత ప్రఫుల్ల
మయింది.
బీచ్ లో  రాత్రి ఎనిమిది వరకూ గడిపి హొటల్ కి చేరు కున్నాము. రాత్రి పెద్దగా ఆకలి లేక పోవడంతో
కొద్దిగా పెరుగన్నాలు మాత్రం తిని, నిద్రకు ఉపక్రమించాం.

27 – 02 -2016.
ఉదయాన్నే లేచి, 5.30కల్లా తయారయి పోయాం. కాఫీలు త్రాగి, ఆటోలో తమిళ నాడు టూరిజమ్ వారి
 ఆఫీసుకి  చేరు కున్నాం.

 TTDC  వారి ఆఫీసు మేం దిగిన హొటల్ కి నాలుగు కి.మీ.ల దూరంలో ఉంది.
No.2 Wallajah Road, Triplicane  లో ఉంది.మేము అక్కడకి చేరుకునే సరికే మా సహ ప్రయాణికులు
కొందరు అక్కడికి చేరుకుని ఉన్నారు. మేం వచ్చి నట్టుగా రిపోర్టు చేసి, వారిచ్చిన టిక్కెట్ అసలు
ప్రతి తీసుకున్నాం. దాని మీదే మా కోచ్ నబరు వేసి ఇచ్చారు. ఎ.సి కోచ్. 18 సీటర్ బస్.
ఐతే, 17 మంది మాత్రమే అయ్యేము.
మా సహ ప్రయాణికుల గురించి ఇక్కడ కొంత చెబుతాను. పాట్నా నుండి వచ్చిన బీహారీ కుటుంబ
సభ్యులు  3 జంటలూ, బొంబాయి నుండి వచ్చిన వొక జంట, వారి అమ్మాయి,కలకత్తా నుండి
బెంగాళీ దపతులు, ఢిల్లీ నుండి వొకామె, హైదరాబాదు నుండి అయ్యగారి మురళీ కృష్ణ, వారి శ్రీమతి రాధ
మరదలు విజయ లక్ష్మి ఉన్నారు. మాతో పాటు వొక తెలుగు కుటుంబం, మా సమ వయస్కులయిన వారు
ఉండడంతో చాలా సంతోషించేము. బస్ లో కూడా మా ముందు సీట్లే వారి వి కావడంతో  కబుర్లు
చెప్పుకుంటూ  కలసి పోయి మొత్తం టూర్ అంతా అందరం బాగా ఎంజాయ్ చేసాం.
(యాత్ర ముగిసేక, చివరి రోజు కూడా రైల్వే స్టేషన్ వరకూ మేమూ, మురళీ కృష్ణ గారి కుటుంబమూ,
బొంబాయి నుండి వచ్చిన దంపతులూ, వారి కుమార్తె ప్రియాంక అందరం కలిసే తిరిగేం. ఆరోజు
మా ట్రయిన్లు రాత్రి పదీ, పన్నెండు  గంటల మధ్య ఉండడంతో  మేమంతా మద్రాసులో ఎగ్జిబిషన్,
 మెరీనా బీచ్ లు తిరిగి వచ్చేము.  బాగా కాక్షేపం అయింది.ఆ విశేషాలు చివర్లో రాస్తాను.)

సరిగ్గా ఉదయం 7.30కి మా బస్ వచ్చింది. సామాన్లు డిక్కీలో పెట్టించి అందరం బస్ ఎక్కాం.
భాషలు వేరయినా, వొకరి నొకరు నవ్వుతూ పలకరించుకుని సీట్లలో కూచున్నాం. మాగైడ్ గణేశ్ తన
 గురించి పరిచయం చేసుకుని , డ్రైవరునీ, అతని సహాయకునీ మాకు పరిచయం చేసాడు.
మమ్మల్ని అందరినీ  పరిచయం చేసుకున్నాక 7.45 ని.లకి మా తమిళ నాడు యాత్ర మొదలయింది.
బస్ బయలు దేరింది. మొదటి రోజు యాత్రా విశేషాలు యిప్పటికి సశేషమ్!





























8, మార్చి 2016, మంగళవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... ప్రస్తావన

మా 8 రోజుల తమిళ నాడు యాత్రాదర్శన విశేషాలు
ప్రస్తావన
గత 2015 అక్టోబరు నెలలో మా అన్నదమ్ములం నలుగురమూ ( ఆఖరి వాడు రాలేక పోయాడు)
శ్రీమతులతో సహా కాశీ, గయ, ప్రయాగ యాత్రలు చేసి వచ్చేం. మాతో మా మరదలు హైమ కూడా వచ్చింది.
ఆ యాత్రా విశేషాలన్నీ మా అన్నయ్య ‘‘ మా కాశీ యాత్ర విశేషాలు’’ పేరిట ముఖ పుస్తకంలో వివరగా చక్కగా రాసేడు.
ఈ ఫిబ్రవరి 25 వ తేదీన నేనూ, నా భార్య విజయ లక్ష్మి తమిళనాడు యాత్రలు చేసి వచ్చేము.
తమిళ నాడు టూరిజమ్ వారు ఏర్పాటు చేసిన 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శిని లో బయలు దేరి వెళ్ళి వచ్చేము. అసలు తమిళ నాడు టూరిజమ్ వారి ( ఇక నుండిదీనిని ttdc అని పేర్కొంటాను) ఈ పేకేజీ గురించి, మేము హైదరాబాద్ లో ఉండే రోజులలోనే, ఐదేళ్ళ క్రిందటే మా తమ్ముడు క్ష్మణ్, మరదలు
శారద చాలా బాగుంటుందని చెప్పేరు. వాళ్ళు అప్పటికే వెళ్ళి ఉండడంతో వాళ్ళ అనుభవం మాకు అక్కరకొచ్చింది. ఐతే, ఎప్పటి కప్పుడు వెళ్దాం అనుకుంటూనే తాత్సారం చేసాక, దైవ సంకల్పం వల్ల ఇప్పటి కయింది. ఆ 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలనూ 8 భాగాలలో మీ తో పంచు కోవాలని అనుకుంటున్నాను. సూక్ష్మాంశాలతో పాటూ సవివరంగా రాదామని నాప్రయత్నం. వెళ్ళ దలచు కున్న
వారికి ఉపయుక్తంగా ఉండే లాగున పేకేజీవిరాలూ, ధరవరలూ, వసతులూ, భోజన సదుపాయాలూ షాపింగ్ స్థలాలూ వాటి గురించి చెబుతాను. ఆ యాత్రాస్థలాల గురిచి క్లుప్తంగా నయినా తెలియ జేస్తాను. ఆసక్తి కలవారు అంతర్జాలంలో గూగులమ్మని అడిగితే ఆ యమ ఎలాగూ చెబుతుంది!
పేకేజీ వివరాలు:
తమిళనాడు గవర్నమెంట్ టూరిజమ్ వారి 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శినిలో రాత్రి పూట ప్రయాణాలు ఉండవు. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి వారి టూరిజమ్ హొటళ్ళు ఉండే ప్రాంతాలకి చేరుస్తారు. ఆ హొటళ్ళ లో బస. మళ్ళీ మరు నాడు ఉదయంబ్రేక్ ఫాస్టు అయ్యాక మరో యాత్రా స్థలానికి ప్రయాణం. AC Non Ac బస్సులూ, టూరిజమ్ వారి హొటళ్ళూ ఉంటాయి.
మేము టూర్ కి A C కోచ్ నీ, బసకి AC రూమునీ బుక్ చేసుకున్నాము. ఒక్కో టిక్కెట్టు ధర రూ.14,050. మొత్తం 28,100 ఇచ్చి నెట్లో బుక్ చేసుకుని ప్రింటవుట్ తీసుకున్నాను. ( మనం సీనియర్ సిటిజన్ల మయినా, వికలాంగుల మయినా ఒక్కో టిక్కెట్ కి 20 శాతం నగదు రిఫండ్ యాత్ర పూర్తయాక వెంటనే ఇచ్చేస్తారు !)
ఈ పేకేజీలో మనకి చూపించే యాత్రా స్థలాలు ఇవి:
1పుదుచ్చేరి,2 పిచ్చ వరం 3.చిదంబరం 4.వైదీశ్వరన్ కోయిల్ 5నాగ పట్నం ( నాగూర్) 6 వేలంకిని 7.తంజావూరు 8.రామేశ్వరం 9.కన్యా ుమారి10.సుచీంద్రం11. మధురై12.కొడైకెనాల్ 13.తిరుచ్చి (శ్రీరంగం)
ఇవి కాక దారిలో అదనంగామరో ఇవి కాక పేకేజీలో లేని నాలుగయిదు ముఖ్య స్థలాలను కూడా చూపెడతారు. వీటిలోవైదీశ్వరన్ కోయిల్,
తంజావూర్ ,రామేశ్వరం, కన్యా కుమారి, మధురై, కొడైకెనాల్, తిరుచ్చి లలో రాత్రి బస.
టూరిజమ్ వారి కేంటీన్లలో ప్రతి చోటా ఉదయం స్వీటుతో పాటు నాలుగయిదు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి స్వీటుతో పాటు చక్కని రుచికర మయిన భోజనాలు కొసరి కొసరి వడ్డించేరు. ఎక్కడి క్కడ వాటర్ బాటిళ్ళు కొనుక్కునే వాళ్ళం. పేకేజీ నిబంధనల ప్రకారం ఉదయం టిఫిను తప్పని సరిగానూ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టూరిజమ్ వారే ఇస్తారు. ఏదో ఒక పూట మంచి హోటల్ వద్ద ఆపుతారు. మన ఖర్చుతో నచ్చినవి తీసుకో వచ్చును.
పగటి పూట యాత్ర ముగించుకుని టూరిజమ్ వారి హొటల్ కి చేరు కోగానే రూమ్ బాయస్ మన సమాన్లు భద్రంగా మనుకు కేటాయించిన గదులకు చేరుస్తారు.
అలాగే మరు నాడు ఉదయమే బస్ వద్దకు చేరుస్తారు. ఎక్కడా టిప్ కోసం చేయి చాపిన దాఖలాలు లేవు.
టూరిజమ్ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం, వారి టూరిజమ్ శాఖ తీసుకుంటున్న శ్రద్ద ఎంతయినా మెచ్చుకో తగినదే. మనతో పాటు ఒక గైడూ, కోచ్ డ్రైవరూ, అతని సహాయకుడూ ఉంటారు. మా గైడ్ పేరు గణేశ్.
మా యాత్ర చెన్నై లో ఫిబ్రవరి 27 శనివారం ఉదయం 7 గంటలకి మొదలై మార్చి 5వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటకి ముగుస్తుంది. కనుక, మేం ఒక రోజు ముందుగా అంటే 26 వ తేదీ నాటికే చైన్నై చేరు కోవాలి. అందుచేత మేం 25 సాయంత్రం 5.45ని.కి విజయ నగరంలో ఎక్కడానికి వీలుగా భువనేశ్వర్,
చైన్నై సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ లో 3rd AC టిక్కెట్లు బుక్ చేసు కున్నాము. అలాగే తిరుగు ప్రయాణానికి చెన్నైలో 5 వ తేదీ రాత్రి 11.45 కి బయలు దేరే హౌరా మెయిల్ లో టిక్కెట్లు బుక్ చేసు కున్నాము.
ఐతే, స్లీపరు క్లాసు తప్ప ఎ.సి దొరక లేదు. సరే లెమ్మనుకున్నాం.టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇక ప్రయాణం తేదీ కోసం ఎదురు చూడడమే !
మద్రాసుకి ప్రయాణంతో మొదలయ్యే మా తమిళ నాడు యాత్రా దర్శిని రోజు వారీ వివరాలు సశేషమ్!







28, నవంబర్ 2015, శనివారం

అనుకోని అతిథితో అర క్షణం సేపు ...





ఇవాళ మా ఇంటికి వో అనుకోని అపురూప మయిన అతిథి రావడం జరిగింది. ఆ అతిథితో  కాస్సేపు జనాంతికంగా సాగిన సంభాషణ సారం మీ ముందు ఉంచుతున్నాను.
అతిథి :  ‘‘ బావున్నారా ? ! ’’
నేను : ‘‘ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ! నన్ను నేనే నమ్మ లేక పోతున్నా ననుకో !
నా కళ్ళు నిజమే చెబుతున్నాయా ! ఎప్పుడో, చిన్నప్పుడు  పల్లెటూర్లో మా యింటి నడి వాకిలిలో  మీరంతా పిల్లా పీచూతో సమావేశ మవుతూ ఉండే వారు కదూ !  అప్పుడు మురిపెంగా మిమ్మల్ని చూసే వాళ్ళం ! తరువాత చూడ్డమే అరుదయి పోయింది ... ఎలా ఉన్నారు ? ’’
అతిథి : ‘‘ ఎందుకులే, చెప్పు కుంటే కడుపు తరుక్కు పోతుంది. ఎందుకో తెలీదు కానీ,  మేం పిట్టల్లా రాలి పోతున్నాం ! మా కుటుంబాలకు  కుటుంబాలే కూలి పోతున్నాయి. ఆ దేవుడికి మా మీద దయ లేదు ! అక్కడా అక్కడా ఒకటీ అరా మిగిలేం.’’
నేను: ( బాధగా ) అవును .. నేనూ విన్నాను,  అంతర్జాలంలో ఆ వివరాలు చదివేను కూడా
అతిథి : ‘‘  ఏం రాసేరేం ? ’’
నేను: అంతర్జాలం నుండి నేను సేకరించిన కథనం ఇలా ఉంది చూడు ...

‘‘పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేనుఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులోకిటికీ తలుపులపైనాస్కూలు గది గోడలపైనాచెట్ల కొమ్మల చివర్లలోబట్టలు ఆరేసుకునే దండేలపైనాపొట్ట పోసుకున్న వరి చేలల్లోబిళ్లంగోడు ఆడే తుమ్మ తోపుల్లోఎండాకాలపు సీతమ్మ చెట్లపైనాగుళ్ళు గోపురాలపైనా ఎక్కడికెళ్ళినా పలకరిస్తుండేవి.
పరిశీలనా పరులకి పిచ్చుకల జీవనం ఆసక్తిగా ఉండేది. స్నేహం చేయడంజంట కట్టడంసందర్భానికి తగినట్లు కిచ కిచ’ చప్పుళ్లు మార్చడంఆడ మగ పిచుకలు ఊసులాడుకోవడంచిన్న చిన్న పురుగుల్ని ముక్కున పట్టి పిల్ల పిచ్చుకల నోట్లోకి నెట్టడంనిపుణులైన ఆర్కిటెక్చర్ ఇంజనీర్లలా ఒక్కో పుల్లాపీచూ తెచ్చి గూళ్లు అల్లడం… ఎన్ననిపరిసరాల్ని మర్చిపోయేలా చేసేవి. ఒక్కో మనిషీ పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ సందర్భాల్లో పిచ్చుకలతో అనుభవం కొండ గుర్తులుగా ఉండేవి.
ఇప్పుడు పిచ్చుకలు దాదాపు కనుమరుగైనాయి. ప్రకృతినంతటినీ అదుపులోకి తెచ్చుకున్న మనిషి అవసరాలకు మించి ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసేస్తున్నాడు. ఇతర పశుపక్షు జాతులకి ప్రకృతిని దూరం చేస్తున్నాడు. భూ వాతావరణాన్ని తోటి జీవజాలానికి పనికి రాకుండా చేస్తున్నాడు. పరిమితికి మించి వనరుల్ని తవ్వి తీస్తూ వాతావరణ వ్యవస్ధని అస్తవ్యస్తం చేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పిచ్చుకలకి మరణ శాసనంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన సెల్ టవర్లు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారనమని పరిశోధనలు చెబుతున్నాయి. టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ధాటికి సున్నిత ప్రాణులైన పిచ్చుకలు చనిపోతున్నాయని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచం మొత్తం మీద పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం పడిపోయిందని ఆర్నితాలిజిస్టులు సర్వే చేసి లెక్కతేల్చారు. పిచ్చుకల దైన్యానికి ఇక్కడ మనిషి’ కారణంగా జనరలైజ్ చెయ్యడం కూడా సరికాదేమో. ఎందుకంటే మనుషుల్లో తొంభై శాతం మంది పశు పక్ష్యాదులకు స్నేహ శీలురే. భూములూకంపెనీలు అదుపులో పెట్టుకున్న కొద్ది మందే భూ వినాశనానికీవాతావరణ విధ్వంసానికీ కారణం అవుతున్నారు. వీరి లాభాపేక్ష మెజారిటీ ప్రజలతో పాటు ఇతర జీవ జాలానికి కూడా ప్రాణాంతకంగా మారింది.
ఈ నేపధ్యంలోనే 2012, మార్చి 20 తేదీని ప్రపంచ పిచ్చుకల రోజు’ గా ప్రకటించారు. ఎన్ని రోజులు’ ప్రకటించినా పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్ధిక దోపిడీ విధానాలు అంతం అయ్యేవరకూ ఈ పరిస్ధితి కొనసాగుతూనె ఉంటుంది. మనిషి సుఖ జీవనానికి పశుపక్ష్యాదులు కూడా దోహదం చేస్తున్నాయన్న స్పృహ లాభాపేక్ష కు ఉండదు. ఏం చేసయినాశ్రామికుల సుఖ సంతోషాల్నీ ప్రాణాల్నీ కబళించయినాపశు పక్ష్యాదుల వాటాని లాక్కునయినా లాభ శాతం పెంచుకోవాలని చూసే పెట్టుబడిదారీ వ్యవస్ధకు తనకు తాను మరణ శాసనం లిఖించుకుంటోదన్న సృహ కూడా ఉండదు. మేల్కోవలసిందే శ్రామికులే. ’’

అతిథి: ‘‘ ఇంత  చక్కని సమాచారాన్ని అందించిన వారికి నీతో పాటూ మేము కూడా ఋణ పడి ఉంటాము. సరే ... మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకునేందుకు వచ్చేను. ఇక్కడ మీ జనావాసాల మధ్య ఈ మధ్య వో సెల్ టవరు కట్టేరు. పూర్తయిన ఆ టవరుని ఏమయిందో, ఏమో నాలుగు రోజులకే  తొలిగించి వేసారు కదూ ... ఇక్కడి వాళ్ళంతా అంగీకరించక పోవడంతోనే దానిని తొలగించారని చెబుతున్నారు.  అందుకే మీకు ధన్యవాదాలు చెప్పు కుందామని ఇలా వచ్చేను. మరి వెళ్తాను ...’’
నేను : ‘‘ అదేం, వచ్చి అర క్షణం కాలేదు ..కాస్సేపు ఉండ రాదూ ; ...’’
నా మాటలు ఇంకా పూర్తి కానే లేదు, మా  ఇంటి కొచ్చిన అపురూప అతిథి తుర్రున ఎగిరి పోయింది !
మా చిన్నప్పుడు మా పల్లెలో మా ఇంటి నడి వాకిలిలో మా నాయనమ్మ కట్టిన వరి కంకుల మీద గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. మా రైతులు బళ్ళతో ధాన్యాన్ని తోలు కొచ్చి, మా వీధిలో మా ఇంటి ముందు  నిల బెట్టే వారు. మా ఇంట్లో ముత్తయిదువులు ఎద్దులకి పసుపు కుంకుమలు పూసి, హారతి ఒచ్చి పూజలు చేసాక, ధాన్యం బస్తాలను ఇంట్లోకి తెచ్చి, గాదె గదిలో కుమ్మరించే వారు . ధాన్యం బస్తాలతో పాటు ఆనప కాయలూ, బీర కాయలూ వంటి కూరలు కూడా  తెచ్చే వారు. ధాన్యం బస్తాలన్నీ ఇంట్లో చేరాక, పెరట్లో నుయ్యి దగ్గరకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునే వారు రైతులు . నలుగు రయిదుగురు ఉండే వారనుకుంటాను. ఒక ప్రక్క ధాన్యం బస్తాలు ఇంట్లోకి పెరుగుతూ ఉండగానే ఇంట్లో మా నాయనమ్మా , వాళ్ళూ రైతుల కోసం వేడి వేడి అన్నం, సాంబారూ  ( పప్పు పులుసునీ ) వండి సిద్ధం చేసే వారు. పెరటి వాకిలి గచ్చు మీద విస్తరాకులు వేసి వడ్డించే వారు. ఆ వంటని మా రైతులు ఎంత ఇష్టంగా తినే వారో ! ‘ బుగతమ్మ చేతి వంట అమృతం ! ’ అంటూ మెచ్చుకునే వారు. మా నాయ నమ్మ పోయాక, మా మురళీ పిన్నీ, తర్వాత, మా ఆవిడా, కటి రెండేళ్ళు ఆ బాధ్యత కొత్తగా కాపురాని కొచ్చిన మా ఆవిడ తీసు కుని చేసేరు


ఇదంతా చెప్పడం దేనికంటే, ఇంటికి ధాన్యం బస్తాలు వచ్చిన రోజునే, పొలం నుండి రైతులు తెచ్చిన వరి కంకుల గుత్తులను మా వాళ్ళు మా ఇంటి నడి వాకిట్లో కట్టే వారు. అది మొదలు ! ఆ రోజు నుండీ పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి.  అలా,  అప్పుడు మా ఇళ్ళలోనూ. పెరళ్ళలోనూ విరివిగా కనబడే పిచ్చుకలు ఇప్పుడు  చాలా ఏళ్ళుగా  కనబడడమే మానేసాయి. పొలాలు అమ్ము కున్నాక, మా నడి వాకిలిలో రైతులూ లేరు, ధాన్యం బస్తాలూ లేవు, వరి కంకులూ లేవు. పిచ్చుకలూ లేవు !. 
చాలా ఏళ్ళకి మా కంట పడిన అపురూప అతిథిని మీకూ చూపించాలని ముచ్చట కొద్దీ ఇంత వివరంగా రాసేను.

ఇదిగో  ! మా ఇంటి కొచ్చిన అపురూప అతిథి ఫొటో ... చూడండి ....



నిర్మాణం పూర్తయి, తిరిగి నాలుగు రోజులలోనే తొలగించిన సెల్ టవర్ అవశేషాలు యివే ... ( దీనిని తొలగించిన మరు నాడే అతిథి రావడం  జరిగింది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ అదొక అందమయిన భావనకు బీజం వేసింది ) చిత్రం  చూడండి.










13, నవంబర్ 2015, శుక్రవారం

అదీ, అలా ఉండాలి !



కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలంటారు.
ఆధునిక కవి కూడా కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలీ ... అని తెగేసి చెప్పాడు.

ఈ శ్లోకం చూడండి:

దధతో యుధ్యమానస్య, పఠత: పులకో2థ చేత్
ఆత్మనశ్చ పరేషాం చ , తద్దానం సౌరుషమ్ స్మృతమ్ .

దానమంటూ చేస్తే ఎలా చేయాలయ్యా, అంటే, ఇచ్చే వాడికీ, పుచ్చుకునే వాడికీ, ఇతరులకీ కూడా ఆ దాన వైభోగం చూసి గగుర్పాటు కలగాలి ! ఇంకోలా చెప్పాలంటే తల దిమ్మెత్తి పోవాలి దానం చేడమంటే ఇలాగుండాలి అని ఒక మేలు బంతిలాగ ఉండాలంతే. కుర్రకారు భాషలో చెప్పాలంటే కెవ్వున కేక పెట్టించాలన్న మాట.

అలాగే, యుద్ధం చేస్తే ఆ రణనైపుణ్యం తనకీ, శత్రువుకీ, చూసే వారికీ కూడా ఆశ్చరానందాలను కలిగించేలా ఉండాలి.

అలాగే, దేనినయినా చదివితే చదువరులకు మైమరుపు కలిగించాలి.

అలా ఉండని ఆ దానమూ, ఆ పౌరుషమూ, ఆ పఠనమూ ఒట్టి దండగ మాలి పనులు.

ముందుగా ఒళ్ళు జలదరించే దాన విశేషం గురించి చూదాం ...

వామనుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని కేవలం మూడడుగు నేల దానమడిగాడు. సరే ఇస్తానని ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు బలి. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డు తగిలాడు. అడిగింది ఎవరను కున్నావ్? అడిగింది ఏమిటనుకున్నావ్? అంటూ హెచ్చరించాడు.

మహా దాత బలి వెనక్కి తగ్గ లేదు. ఇలా అన్నాడు. భాగవతంలో పోతన వ్రాసిన గొప్ప పద్యాలలో ఇదొకటి.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జములపైఁగపోల తటిపైఁబాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే !?

ప్రియ సతి లక్ష్మీ దేవి శరీర భాగాలను నూతన మర్యాదతో తాకిన ఆ చేయి ఇప్పుడు దానం స్వీకరించడానికి క్రింద ఉంది. దానమిచ్చే నా చేయి ఇప్పుడు మీద ఉంది. ఇంత కంటె భాగ్యం వేరే ఏముంది? ఈ రాజ్యాలూ గీజ్యాలూ ఎల్ల కాలం ఉండి పోతాయా ? దేహం నశించ కుండా శాశ్వతంగా నిలిచి పోతుందా?

ఎంత గొప్ప దానశీలత్వమో కదూ ! దానం అంటే అలా ఉండాలి.

వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా , సహజ కవచ కుండలాలను ఇచ్చిన కర్ణుడూ. తన శరీర భాగాన్నే కోసి ఇచ్చిన శిబి, తన వెన్నెముకను ఒక మహత్తర దేవ కార్యం కోసం అర్పించిన దధీచి, చాలా దినాలు క్షుద్బాధను అనుభవించి, తరువాత క్షుధార్తుడయిన తనకు లభించిన ఓగిరాన్ని కూడా అర్ధికి ఇచ్చి వేసిన రంతి దేవుడూ .... వీళ్ళూ దాతలంటే. దానం చేయడమంటే అలాగుండాలి.

ఇక యుద్ధం సంగతి చూదాం.

శ్రీనాథుడు చెప్ప లేదూ?

ఎవ్వనితో నెచ్చోటన్
చివ్వకు చేసాచ వలదు. చే సాచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగ పగ సనన్ తీర్పదగున్

ఎవరితోనూ ఎక్కడా కూడా యుద్ధానికి తలపడనే వద్దు. ఒక వేళ యుద్ధం చేయవలసిన అక్కర పడితే మాత్రం పగ వాడి అంతు చూడనిదే వదల వద్దు సుమా ! చుట్టు ప్రక్కల ఎవరికీ పరిహాస పాత్రమయ్యే లాగున మాత్రం రణం చేయ వద్దు.
యుద్ధ రంగంలో పగవారికి వెన్ను చూపడం కన్నా హీనం మరొకటి లేదు.

ఉత్తర కుమారుని యుద్ధ ప్రాగల్భ్యం తెలిసినదే కదా ?

యుద్ధం చేయకుండా మగిడి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి, రోసి, అతని తల్లి, భార్య వానికి పౌరుషం కలిగించేలాగున ప్రవర్తించారుట. తానమాడడానికి మరుగు, పసుపు ముద్ద సిద్ధం చేసి అవమానించారుట. భోనాల వేళ విరిగిన పాలు పోసారుట. ఎన్నడూ లేని ఈ అనాదరణకి విస్తు పోయి ఖిన్నుడయిన తిక్కనకు తల్లి సమాధానం చూడండి:
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్?
ముగురాడవార మైతిమి !
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ ?!

అసదృశముగ నరివీరుల
మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
గసవున్ మేయగఁబోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.

యుద్ధంలో పగ వారితో పోరాడ కుండా వారికి వెన్ను చూపి పారి వచ్చిన వాడికి మగతనం ఉండదు కదా నాయనా ! వీరత్వం ఉన్న వారు అలాంటి పందలను మెచ్చుకోరు. ఇప్పుడు ఇంట్లో నీతో కలిపి ముగ్గురం ఆడువారమైనాము కదా ?
ఆడుదానివలె తడికె చాటున ఆ పసుపు రాసుకుని తానమాడి రావయ్యా అని వెటకారం.

పగ వారిని వీరోచితంగా ఉక్కడగించి రానట్టి పిరికి పందని చూసి, పశువుల మనసులు విరిగి పోయాయి. అవి ఇచ్చిన పాలు కూడా విరిగి పోయాయి. ఈవేళకి విరిగిన పాలతో భోజనం కానిద్దూ ! అని అవహేళన.

ఇక, పఠనయోగ్యాలయిన గ్రంథాల గురించి.

మంచి పుస్తకం చదివితే, చదవడం పూర్తయాక కూడా అది మనల్ని వెంటాడి వేధించాలి. ఆలోచింప చేయాలి. అలజడి కలిగించాలి. ఆహా !అనిపించాలి. కానప్పుడు కాల హరణం తప్ప ప్రయోజనం ఉండదు.

అదండీ సంగతి !

స్వస్తి.

12, నవంబర్ 2015, గురువారం

ప్రయత్నించి చూస్తే పోయే దేముంది చెప్పండి ?!



విజయ విలాసం లో చేమకూర వేంకట కవి ధర్మ రాజు సుగుణాలను ఎలా వర్ణించాడో చూడండి.

దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హితశిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి, యజాత శత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్.

దేవ బ్రాహ్మణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రియమైన మాటలు పలుకుతాడు. విద్యా వైదుష్యాలకు గతి. ధర్మానికి అతడే ఉదాహరణ ప్రాయుడు. మర్యాద ,ఔచిత్యాలు ఎరిగిన వాడు. మంచి వారినీ, సజ్జనులనూ కాపాడే వాడు, శత్రువులంటూ ఎవరూ లేని వాడు. లోకంలో సాధారణ రాజులలాంటి వాడు కాదు.

ఆవలబోయిన వెన్క నాడుటెన్నడు లేదు
మొగము ముందఱ నంట మొదలె లేదు

మనవి చెప్పిన చేయ కునికి యెన్నడు లేదు
కొదవగా నడుపుట మొదలె లేదు

చనవిచ్చి చౌక చేసినది యెన్నడు లేదు
పదరి హెచ్చించుట మొదలె లేదు

మెచ్చినచో కొంచె మిచ్చుటెన్నడు లేదు
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు.

మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్ని
యితఁడె పో సార్వ భౌముఁడత్ప్రతిముఁడనఁగ
బ్రజలఁబాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు, పాండ వాగ్రేసరుండు

ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట అనే దుర్లక్షణం లేదు. కాస్త ముఖం చాటు కాగానే ఆడిపోసుకోడం లేదు. అలాగని ముఖం మీదనే ఫెడీల్మనేలా కటువుగా పలకడం కూడా లేదు.
మనవి చేసుకుంటే, సహాయం చేయక పోవడం ఎప్పుడూ లేదు. అలాగని ఎంతో కొంత ఇచ్చి, చేతులు దులుపు కోవడం కూడ లేదు. ఇచ్చెనా, ఏనుగు పాడి అన్నట్టుగా, ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ చేయడు.

ముందు బాగా చనువు ఇవ్వడం. ఆతరువాత చులకనగా చూడడం ఎన్నడూ లేదు. అలాగే, ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేయడు.

మెచ్చు కుంటే ఏదో కొంచెం ఇచ్చి పొమ్మనే రకం కాదు. అలాగని ముఖ ప్రీతి మాటలాడడం, ఇచ్చకాలు పలకడం అసలే లేదు.

వెనుకటి రాజుల గొప్పతనాలు ఎటువంటివో ఆలోచిస్తే, ధర్మ రాజు మాత్రమే చక్రవర్తి అని అర్ధమౌతుంది.

ఎంత లెస్సగ నున్న నంత వేడుక కాని,
ప్రజలకల్మి కసూయ పడుట లేదు

తనుఁగొల్వ వలె నందఱను ప్రియంబె కాని
మానిసి వెగటించుకైనను లేదు

నిచ్చ వేడిన నర్ధి కిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుట లేదు

రేవగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని,
న్యాయంబు దప్పిన నడక లేదు

కలడె యిటువంటి రాజు లోకమున నెందు !
జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల
యేల వలె శాశ్వతముగాఁగ నీఘనుండె
యేల వలె నన్యు లన నృపాలుఁడలరె

తన పాలనలో ఉన్న ప్రజలు ఎంత సంపన్నులయితే, ధర్మ రాజు అంతగా సంతోషించే వాడు. అంతే కాని, తన ఏలుబడిలో ఉండే వారికి ఇంత సంపదా ? అని అసూయ పడే వాడు కాదు. అందరూ తన పాలనలో తనని సేవిస్తూ ఉండాలనే రాచరికపు వేడుకే తప్ప, మనుషులంటే ద్వేషం ఎప్పుడూ లేదు. అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే కాని, లోగడ ఇంత ఇచ్చేను కదా, మళ్ళీ అడుగుతావేం !అంటూ కసురు కోవడం లేదు. రాత్రీ పగలూ ధర్మ బద్ధంగా ఉండాలనే ఆలోచనే తప్ప ఎన్నడూ న్యాయ మార్గాన్ని తప్పి ఎఱుగడు.

లోకంలో ఎక్కడయినా ఇంత గొప్ప రాజు ఉన్నాడా? సముద్ర వేలా సర్యంత మయిన ఈ భూమండలాన్ని ఈ ఘనుడైన ధర్మ రాజే శాశ్వతంగా పాలించాలి. వేఱొక ప్రభువు మన కేల? అని ప్రజలు అనుకునే లాగున ధర్మజుడు ఒప్పుతున్నాడు.

కోపమొకింత లేదు, బుధ కోటికిఁగొంగు పసిండి, సత్య మా
రూపము, తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు, నూతన ప్రియా
టోపము లేని నిశ్చలుఁడిటుల్ కృత లక్షణుఁడై చెలంగగా
ద్వాపర లక్షణుండనఁగ వచ్చునొకో యల ధర్మ నందనున్

కోపం ఇసుమంతయినా లేదు. పండిత వర్గానికి కొంగు బంగారం. సత్యమే ఆకారంగా రూపు దాల్చిన వాడు. మంచి చెడ్డలు, బాగోగులు బాగా తెలిసిన వాడు. ఎవరో చెబితే చెప్పుడు మాటలు తలకెక్కించు కోకుండా స్వతంత్రమైన భావాలు కలవాడు.నూతన ప్రయాడంబరాలు లేని వాడు.రాజానో బహు వల్లభా: కదా? కొత్త రుచుల కోసం వెంపర్లాడే వాడు కాదు.ధృడ చిత్తం కలవాడు. ఇన్ని కృత లక్షణాలు కల ధర్మ రాజుని ద్వాపర లక్షణాలు కల వాడని అనడం ఏమి సబవు? కృత యుగంలో వ్యక్తులకు ఉండే లక్షణాలు అన్నీ సంతరించుకున్న వాడని చమత్కారం.

చూడండి. ధర్మ రాజు ఎన్ని గొప్ప సల్లక్షణాలు కల వాడో ! అందులో అన్నో, కొన్నో మంచి లక్షణాలు మనమూ అలవరుచు కోడానికి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది చెప్పండి?

2, నవంబర్ 2015, సోమవారం

పూల బాసలు !


తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది.
ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అందాలు పేర్చి అందించిన ఆ అదృశ్య హస్తం ఎవ్వరిదా అని విస్తు పోతాం!
పూలు పలకరిస్తాయి. పూలు ఊసులు చెబుతాయి. కొన గోటితో త్రుంచ బోతే విలపిస్తాయి. తల్లి కొమ్మనుండి, తండ్రి రెమ్మ నుండి , నిర్దయగా వేరు చేయ బోతే, వద్దని వేడుకుంటాయి. దీనంగా అర్ధిస్తాయి.

అలాంటి పువ్వులను గురించి కొన్ని కబుర్లు ఇవాళ చెప్పుకుందామా?

అలరు, కుసుమము, నన, విరి, పుష్పము, పూవు, ప్రసవము, ప్రసూనము, ఫల్యము, లతాంతము, సుమము, సూనము, సౌమనస్యము ...వీటన్నింటికీ పువ్వు అనే అర్ధం

( ఇంకా ఉన్నాయి లెండి !)

పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు స్వీకరిస్తాయి. అందుకే కవి ‘ పూల కంచాలలో రోలంబులకు, రేపటి భోజనము సిద్ధ పరచి పరచి ... ’ ఆ దేవ దేవుడు ఎంత అలసి పోయాడో అని బెంగ పడతాడు.

విరహతాపాన్ని పెంచి, స్త్రీపురుషులను ఏకశయ్యానువర్తులుగా చేసే మన్మథుడికి కుసుమాయుధుడు, పుష్పబాణుడు, అలరు విల్తుడు ... ఇలాంటి పేర్లు ఉన్నాయి. పూల బాణాలు ధరించిన వాడు అని వాటి అర్ధం,

మదనుడు పంచ బాణుడు. ఐదు రకాల పూలను బాణాలుగా ఉపయోగించే వాడు. ఆ అయిదు రకాలూ ఏమిటో తెలుసా?

అరవిందము, అశోకము , చూతము , నవ మల్లిక, నీలోత్పలం.
సరే, పూలు పలకరిస్తాయి అనుకున్నాం కదూ? ... చూడండి :

పూల బాసలు తెలుసు యెంకికీ, తోట
పూల మనసు తెలుసు యెంకికీ!
పూల మొక్కల నీటి జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది !

పూల బాసలు తెలుసు యెంకికీ ...అని, నండూరి వెంకట సుబ్బారావు గారు ఎంకి పాటల (కొత్త పాటల) లో పూల బాసల గురించి చెప్పారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో తనని త్రుంచబోయిన వాని గుండె కరిగి పోయేలా విలపిస్తూ తన గోడు చెప్పుకున్నది. మా ప్రాణము తీతువా ! అని బావురుమన్నాయి. తల్లి ఒడిలో చిగురుటాకుల శయ్య మీద హాయిగా నిదురించే మమ్ము చిదిమి, అమ్ముకుంటావా? మనసు లేని నీ పూజ లెందుకోయి ? అని అడిగాయిట, పూలు...
మా ఆయువు నాలుగు గడియలే కదా, ఆయువు కలిగినంత దాక మా తీవ తల్లి చేతులలో హాయిగా ఊయలలూగుతూ మురిసి పోతూ ఉంటాము. ఆయువు తీరాక ఆ తల్లి పాదాల చెంతనే రాలి పోతాము

మా పూల సువాసనలతో గాలి పరిమళిస్తుంది. తుమ్మెదలకు తేనెల విందు చేస్తాము. మీ వంటి వారి కన్నులకు కనువిందు చేసి హాయిని కలిగిస్తాము. అలాంటి మమ్మలని చిదిమి వేయడం తగునా ? తల్లీ బిడ్డలని వేరు చేస్తావా ?

మమ్ములను త్రుంచడం వల్ల నీ చేతులు మా రక్తధారలతో తడిసి పోతాయి. అలాంటి నెత్తురు పూజని పరమేశ్వరుడు స్వీకరించడు సుమా!

నువ్వే కాదయ్యా, మీ ఆడువారూ మాకు హాని చేయడంలో ఏమీ తక్కువ తిన లేదు ...

ఊలు దారాలతో గొంతుకురిబిగించి,
గుండె లోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ! దయ లేని వారు మీ ఆడువారు !

మా నెత్తురులతో చేసిన అత్తరులను మీ కంపు గొట్టు దేహాల మీద అలము కుని శయ్యల మీద వెద జల్లు కుని రాత్రంతా దొర్లుతారు. సిగ్గు లేదూ?

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి, నశించి పోయె , మా
యౌవన మెల్ల కొల్ల గొని ఆ పయి చీపురు తోడ చిమ్మి, మ
మ్మావల పార బోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా?

అని పూలు చీవాట్లు పెట్టాయి ....

గౌతమీ కోకిల బిరుదాంకితులు వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి కాంక్ష కవితా ఖండికలో పూల మనోభావాలు ఎలా ప్రతి ఫలించాయో, చూడండి ... మచ్చుకి ఒకటి రెండు పద్యాలు ...

పేదల రక్త మాంసములఁబెంపు వహించి, దయా సుధా రసా
స్వాద దరిద్రు లైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదర వోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నాయెదన్

పేదల రక్తమాంసాలతో బలిసి, దయ ఒక్కింత కూడ లేకుండా, మతోన్మాదాన్ని ఎక్కువ చేస్తూ, దేవుడి పేరుతో నిలబెట్టిన రాతి బొమ్మల మెడలలో పూజకై నిలిచి, వాడి పోయే ఆ పాడు బ్రతుకు నాకు వద్దు.

కానుకనై ధరాధిపుల కాళ్ళ కడం బొరలాడి వాడి పో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వార తోరణా
స్థానము నందురింబడఁగ జాలను, దోసిట పేరి ఘోర కా
రా నరకమ్ము నందుసురు రాల్పగ లేను నిమేష రక్తికై

మీ క్షణికానందం కోసం - రాజుల కాళ్ళ దగ్గర కానకనై పొర్లి వాడి పోవడం నాకు సమ్మతం కాదు.
ధూళి ధూసరితమైన ద్వారాలకు తోరణాన్నయి ఉరి వేసు కోవడం నాకు నచ్చదు.
మీ చేతుల కారాగారంలో మ్రగ్గి పోలేను.

మరి పువ్వు ఏమి కోరుకుంటున్నది? ... చూడండి ...

నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృ దేశ సే
వా చరణమ్ము నందసువు లర్పణఁజేసిన పార్ధివ
శ్రీ చెలువారు చోటఁ దదసృగృచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలి పోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్

దేశం దాస్యంలో మ్రగ్గి పోవడం సహించ లేక, ధేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి పార్ధివ శరీరాలు ఉండే సమాధుల మీద వాసనలు వెదజల్లుతూ వికసించి, అక్కడే, ఆ పవిత్రమైన మట్టి లోనే వాడి వత్తలై పోవడం నాకు చాలా ఇష్టం ...

ఎంత గొప్ప భావనో కదూ , యిది?

మరి కొన్ని పూల ముచ్చట్లు చూడండి ...

పూల కయ్యాలు:

అరణపు కవి నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లో పారిజాతపుష్పం కోసం ఎంత రచ్చ అయి పోయిందో మీకు తెలిసినదే కదా!

తగవుల మారి నారదుడు ఒకే ఒక్క పారిజాతం తెచ్చి ,శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దానినతడు దేవేరి రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి సత్యభామకి తెలిసి పోయింది. ఇంకేముంది ! ఆవిడ అలగడం, పతి నుదుటున తన్నడం, అతడామెను బుజ్జగించి, దేవేంద్రుని ఎదిరించి మొత్తం పారిజాతవృక్షాన్నే దేవ లోకం నుండి పెకలించుకుని వచ్చి సత్య ఇంటిలో పెరటి చెట్టుగా నాటడం ... చక చకా జరిగి పోయాయ్ ...

ఆ పారిజాతం మహిమ ( నారదుని మాటల్లోనే ) ఎలాంటిదంటే,

పరిమళము సెడదు, వాడదు
పరువము దప్పదు పరాగభర భరితంబై
నిరతము జగదేక మనో
హరమగు నీకుసుమ రాజమంబుజ వదనా.

ఆ పువ్వుని తనకివ్వక తన సవతి రుక్మిణికి యిచ్చినందుకు కోపించి, ఒళ్ళూ మీదా కానక అలక పానుపు మీద పరుండి, అనునయించ బోయిన మగని కాలితో తన్నిందిట సత్య.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్లయగు ; నాధల్నేరముల్సేయఁబే
రలుకం జెందిన  కాంత లుచిత వ్యాపారమల్నేర్తురే ?

తన తప్పు సైరింపుమని ఆమె పాదాల కడ తల పెట్టిన నాధుని తలని సత్య ఎడమ పాదంతో తన్నిందిట ! ప్రియ నాధులు తప్పులు చేస్తే, అలక చెందిన ఆడువారు ఉచితానుచితాలు చూడరు కదా ? ... అని, కవి సమర్ధన.

ఈ పద్యం చూడండి:

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ?

భాగవతంలో పోతన గారి పద్యం ఎంత మనోహరమైనదో చూడండి.

నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ ? ... ... అని గోపికలు పూలతో చేసే సంభాషణ ప్రసిద్ధమే కదా.

పూలు కూడా ఊసులాడుతాయని దీని వలన తెలుస్తోంది కదూ?

మహా భారతంలో మరో పూల కయ్యం మీకు తెలిసినదే కదా?

ద్రౌపది ముచ్చట పడిందని, భీముడు సౌగంధికాపహరణం చేయడం, ఆ క్రమంలో హనుమతో చిన్న పాటి కయ్యం, తర్వాత ఆ పువ్వుల కోసం కాపలాదారులతో చేసిన యుద్ధం ... అదో పెద్ద కథ. పూల కధ.

మరొకటి రెండు పూల ముచ్చట్లు .....

పూల చెండుతో ఫ్రియుడొకటంటే, పేము కర్రతో తా రెండనే గడుగ్గాయలూ ...

రాచరికపు రోజులలో గడసరి విటులతో పుష్ప లావికల సరసోక్తులూ ...

చెప్పాలంటే చాలా ఉన్నాయి ....

చెవిలో పువ్వు పెట్టడం ... వంటి నానుడులూ ...

పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మడం వంటి సామెతలూ ...

ఇలా చెప్పుకుంటే పూల బాసలు అనంతం కదూ!

పువ్వులనీ, పసి బిడ్డల బోసి నవ్వులనీ, ఇంద్రధనుస్సులనీ, పురి విప్పిన నెమలి పింఛాలనీ,
చిగురించిన కొమ్మలనీ, రెమ్మలనీ, తలిరాకు తల్పాన మెరిసి పోయే తుహినకణాలనీ, చంద్ర కిరణాలనీ , కోకిలల గొంతులనీ, పిట్టల కువకువలనీ, అందమైన వేకువలనీ, చల్లని సాయంత్రాలనీ, జలపాతాలనీ, ... ఇలా ఎన్నో అందాలని ప్రసాదించిన ఆ దయామయుడికి నమోవాకములతో ..

ఇప్పటికి స్వస్తి.

`

10, అక్టోబర్ 2015, శనివారం

మనం మేకలం కాదు కదా ?



ఈ శ్లోకం చూడండి:

ఏకస్య కర్మ సంవీక్ష్య, కరోత్యన్యో2పి గర్హితమ్
గతాను గతికో లోక: నలోక: పారమార్ధిక:

ఎవడయినా ఒక పని చేస్తే, వాణ్ణి చూసి, అది గర్హించ తగినిదే అయినా, మరొకడున్నూ అదే పని చేస్తాడు !

లోకం గతానుగతికమైనది. అంతే తప్ప పరమార్ధం ఏమిటా అని, ఆలోచించేది కాదు. ఇదీ శ్లోకార్ధం.

మనలో చాలా మంది ( నాకేమీ మినహాయింపు నిచ్చు కోవడం లేదు) చాలా తరుచుగా తలకాయని ఇంట్లో ఏ చిలక్కొయ్యకో తగిలించి కానీ బయటకి రాం కదా.

అసలు దానితో పని పడుతుందని కూడా ఎంచేతో అనుకోం కూడా. మరీ విరివిగా వాడేస్తే పదును తగ్గి పోతుందని మనకి లోలోపల భయం కాబోలు !

ఒకడు చేసే దానిలో ఔచిత్యం ఉందో లేదో ఆలోచించే తీరికా మనకి ఉండదు. భేషుగ్గా వాడు నడచిన దారిలోనే నడిస్తే ఓ పనై పోతుందని నమ్ముతాం. కొత్తదీ, సమస్యాత్మక మయినదీ, క్లిష్ట మయినదీ, శ్రమతో కూడు కున్నదీ అయిన త్రోవన వెళ్ళడానికి సుతరామూ మనం చాలా వరకు ఇష్ట పడం.
చక్కని రాజ మార్గ ముండగా ... అనుకుంటూ ఆ త్రోవనే గుడ్డిగా పోవడానికే యిష్ట పడతాం.

అనుసరణ తప్పేమీ కాదు. మేలు బంతి లాంటి ఒరవడిని అనుసరిస్తూ పోవడం అభిలషణీయమే.
పెద్దలు చూపిప బాటలో పయనించడం సముచితమే. కాని, అంధానుకరణ, అంధానుసరణ తప్పేమొ కాస్త ఆలోచించాలి.

ఒక మేక పోయి గోతిలో పడితే మిగతా మేకలు కూడా దానినే అనుసరిస్తూ పోయి అదే గోతిలో పడతాయంటారు.

మనం మేకలం కాదు కదా ?

లోకం గతాను గతికం అనడానికి ఎన్నో ఉదాహరణలు చూపించ వచ్చును.

నా వరకు, ఒక ప్రాక్టికల్ జోక్ చెబుతాను.

ఒక పుణ్య క్షేత్రానికి మేము వెళ్ళి నప్పుడు, అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. చిన్నవీ, పెద్దవీనూ.

నాకెందుకో చప్పున మీది శ్లోకం గుర్తుకు వచ్చింది. సరే, ప్రాక్టికల్ గా ఆ శ్లోకం లో ఎంత వాస్తవం ఉందో చూదామన్న చిలిపి ఊహ వచ్చింది, (అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి లెండి.)

వెంటనే కిందకి వంగి, ఒక చిన్న పాటి రాయిని ఎంచి, మరీ తీసి, కళ్ళకి అచ్చం మూడు సార్లు అద్దు కున్నాను. తర్వాత, దాన్ని మూడు పర్యాయాలు ముద్దు కూడా పెట్టు కున్నాను. ఆ పిమ్మట దానిని భద్రంగా, భక్తిగా, నా చేతి సంచీలో ఉంచి, ముందుకు సాగేను.

కొంత దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసేను.

అంత వరకూ ఆ దారమ్మట మామూలుగా నడుస్తున్న వాళ్ళలో చాలా మంది నాలాగే కిందకి వంగడం, ఓ రాయిని తీయడం, దానిని మూడు సార్లు కళ్ళకి అద్దు కోవడం, మూడు సార్లు ముద్దు
పెట్టు కోవడం, తర్వాత, దానిని వారి జేబులోనో, బేగ్ లోనో, భద్రంగా ఉంచి ముందుకి కదలడం !

(అచ్చం, నేను చేసినట్టుగానే !) ... ఇదీ వరస !

అక్కడ ఆ రోజున నేను తప్ప నా ముందు నడిచిన వారెవరూ అలా చేయ లేదు.

నా తరవాత వచ్చిన వారిలో చాలా మంది మాత్రం నాలాగే చేసారు !

ఇప్పుడు చెప్పండి, గతాను గతికో లోక: కదూ ?




స్వస్తి.

8, అక్టోబర్ 2015, గురువారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?! హన్నా !





నీ ముఖ పుస్తకం తగలెయ్యా, మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?! హన్నా !


ఒక శ్లోకం చూడండి:


అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే

శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:


నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !


ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.


అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.


పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.


సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.


వానర ఉవాచ :


బావుందిరా నాయనా, బావుంది. ఏవో శ్లోకాలూ గట్రా పెట్టుకుని పిచ్చి రాతలేవో రాసుకుంటూ ఉంటే సరే లెమ్మని ఊరు కున్నాను.


ఏం చేస్తాంలే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం.


కొందరికి సెల్ఫీల పిచ్చి


కొందరికి సింగపూర్ పిచ్చి


కొందరికి ర్యాంకుల పిచ్చి


కొందరికి బ్యాంకుల పిచ్చి


కొందరికి కవితల పిచ్చి


కొందరికి కోకల పిచ్చి


కొందరికి బైకుల పిచ్చి


కొందరికి లైకుల పిచ్చి


కొందరికి తాగుడు పిచ్చి


కొందరికి వాగుడు పిచ్చి


అందు చేత నీ రాతలేవో నువ్వు రాసుకుంటూ, నీ ఏడుపేదో నువ్వుడువ్


కానీ,


మధ్యలో నన్నెందుకు లాగుతావూ !?


హన్నా !

3, అక్టోబర్ 2015, శనివారం

శేషం కోపేన పూరయేత్ !



ఫ్రశ్నించడం మానవ నైజం, అది నైజమే కాదు; హక్కు కూడా. నిలబెట్టి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది? ప్రశ్నించడం లోనుండే కదా, ప్రగతి ప్రభాత కిరణాలు పొడసూపేది?

కాదంటే ఎలా ? కోపగిస్తే ఎలా ? ఎందుకు? అనడిగే వారుంటేనే కదా, ఎందుకో తెలిసేది ?

అలా అడిగిన సందర్భాలు కొన్నింటిని ఇక్కడ చూదాం ...

అన్నమయములైన వన్ని జీవమ్ములు
కూడు లేక జీవ కోటి లేదు
కూడు తినెడి కాడ కుల భేద మేలకో?
కాళికాంబ ! హంస ! కాళికాంబ !

(కాళికాంబ శతకం - పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి)

లోకాన జీవ రాసులన్నీ తిండి తిని బతికేవే. తిండి లేక పోతే జీవ కోటి ఉనికే లేదు. మరి, మన మానవులలో తిండి తినేటప్పుడు కుల భేదం ఎందుకు చూపుతారో, తెలియదు.

ఎక్కడి మంత్రతంత్రము లవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషంబులవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక, పూర్వ కృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్ట కూటికిది వేషమయా శరభాంక లింగమా !

మంత్రాలంటావు , తంత్రాలంటావు ! అన్నీ ఒట్టి అబద్ధాలు. చక్రాలు వేస్తావు.భవితవ్యాన్ని చెబుతానంటావు. పాచికలతో పరమార్ధం తెలిసి పోతుందంటావు. జ్యోతిషం చెబుతావు, జరిగినదీ, జరగబోయేదీ .. అంతా ట్రాష్. హేతువులంటావు, ప్రశ్నలు అడిగితే కనులు అరమోడ్చి, ఎక్కడికో వెళ్ళి పోయినట్టు అభినయించి, ఠక్కున భూత భవిష్యద్వర్తమానాలకు చెందిన వాటి గురించి జవాబులు చెబుతానంటావు. ఇదంతా మోసం. దగా. కుట్ర. మనం చేసుకున్న ధర్మాల పుణ్యమే సత్యం (?) ఈ మంత్రాలూ, తంత్రాలూ, చక్రాలూ, పాచికలూ, ప్రశ్నలు వేయడాలూ, జ్యోతిషాలు చెప్పడాలూ, అన్నీ కొంత మంది పొట్ట పోసుకోవడం కోసం వేసే వేషాలు తప్ప మరొకటి కాదు. అది నిజం. అంటాడు శరభాంకుడు.

ధూమ కేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా !

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా ...

అంటూ తోక చుక్క కనిపించడం అనర్ధదాయకంగా భావించడాన్ని గురజాడ నిరసించాడు.
అదంతా కవుల కల్పన అన్నాడు. తోక చుక్క భూమికి దూరపు చుట్టం అని చెప్పాడు. దారిన పోతూ చుట్టపు చూపుగా చూసి పోయే తోక చుక్క గురించి ఆందోళన ఎందుకని అడిగేడు.

తుదకు, వర్ణ భేదాలు చెరిగి పోయి, మతము లన్నీ మాసి పోయి,తెలివి ఒక్కటే నిలిచి వెలుగుతుందనీ, ఎల్ల లోకం ఒక్క ఇల్లవుతుందనీ ఆశించేడు. కవి కామన ఇంకా సుదూర తీరం లోనే ఉన్నట్టుంది. అదలా ఉంచండి ...
ప్రశ్నించే సోక్రటీస్ ను, కందుకూరిని, రాజారామ మోహనుడిని, త్రిపురనేనిని ... ఇలా చాలా మందిని ఒక్క సారి స్మరించుకుని, మరి రెండు మూడు సంధించిన ప్రశ్నాస్త్రాలను కూడా చూదాం,

పశుశ్చే న్నిహిత: స్వర్గం , జ్యోతిష్ఠోమే గమిష్యతి,
స్వపితా యజమానేన, తత్ర కస్మా న్న హింస్యతే

స్వర్గం లభించాలని, యాగ పశువులను బలి చేస్తున్నావు. అవి నేరుగా స్వర్గానికే పోతాయని దబాయిస్తున్నావు. మరయితే, నోరు లేని ఆ జీవాలను బలి పేరిట చంపడం కన్నా, యాగంలో స్వయంగా నీ తండ్రి గారినే బలి ఇవ్వరాదూ ? చక్కా, సరాసరి స్వర్గానికి పోతాడు కదా ? అలా ఎందుకు చేయవయ్యా ?

స్వర్గ: క ర్తృ క్రియా ద్రవ్య , వినాశో యజ్వనాం,
తతో దావాగ్ని దగ్ధానాం , ఫలం స్యాద్భూరి భూరుహామ్

యఙ్ఞం లో సమిధలు, ఆజ్యం లాంటి హోమ ద్రవ్యాలను ఎన్నింటినో వ్రేల్చుతావు. అవి హుతమై, మీది కెగిసి, నీకు స్వర్గాన్ని ఇస్తాయంటావు ? తెలిక అడుగుతానూ , అలా చేయడం వల్ల నీకే స్వర్గం వస్తే, అడవిలో కార్చిచ్చు
చెల రేగినపుడు ఎన్నో చెట్లు అగ్నికి ఆహుతయి పోతూ ఉంటాయి. వాటన్నింటికీ అదే స్వర్గ ఫలం వస్తుందంటావా?

మృతానామపి జంతూనాం , శ్రాద్ధం చే తృప్తి కారణమ్
నిర్వాణస్య ప్రదీపస్య, స్నేహ: సంవర్ధయేచ్ఛిఖామ్

చచ్చిన వారికి పిండాలు పెట్టి, శ్రాద్ధ కర్మలు చేస్తే ఆ మృతులకు తృప్తి కలుగుతుందంటావు. మరయితే, ఆరి పోయిన దీపం నూనె పోయగానే వెలిగించకుండానే వెలగాలి కదా ?

(మీది మూడు శ్లోకాల కర్త కృష్ణ మిశ్రుడు - ప్రబోధ చంద్రోదయం)

ఇది చార్వాకం. వీటికి మన వాళ్ళు ఘూటుగానే జవాబులు చెప్పారనుకోండి ... ఏమయినా, నిలదీసి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది?

జవాబులు చెప్పలేని చిక్కు ప్రశ్నలే అడిగాడనుకో, ఈ సూత్రం ఎలానూ ఉంది:
శేషం కోపేన పూరయేత్ ! ... ... ...





29, సెప్టెంబర్ 2015, మంగళవారం

మనం రూపాయి బిళ్ళలం కాదు కదా ?!



మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.



గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?