5, డిసెంబర్ 2019, గురువారం

అధికారం పోయాక చూడాలి ..అయ్య గారి వైభవం..




అధికారాంతమునందు చూడవలె..

ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే

ఈ శ్లోకంలో కవి అన్నింటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నావు కదా !

త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తువులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !

ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !

నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.

ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !


4, డిసెంబర్ 2019, బుధవారం

ఆరు ముఖాలూ , ఆరు ముద్దులూనూ...




ఆరు ముఖాలూ, ఆరు ముద్దులూనూ

బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖ శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచుకొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !అని దీని అర్ధం.

వెళ్ళి గంగలో దూకు అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు ముద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?




2, డిసెంబర్ 2019, సోమవారం

తిక్కలోడి సామాజిక స్పృహ

‘‘ ఎటు వేపేనా వెళ్ళు, కానీ, ఉత్తరం దిక్కు వేపు మాత్రం వెళ్ళకు ! ’’ అని ముసలి రాజు మరీ మరీ చెప్పి పంపిస్తాడా ? రాకుమారుడు అటు వేపే వెళ్తాడు.

ఇచ్చట నోటీసుల అంటించ రాదు అనే బోర్డు మీది అక్షరాలు రకరకాల వాల్ సోష్టర్ల నడుమ బిక్కు బిక్కుమంటూ కనిపిస్తూ ఉంటాయి.

ఇచ్చట మూత్రము చేయ రాదు ( మా హైదరాబాదులో అలాగే రాస్తారు మరి) అని ఉంటుందా ? అక్కడంతా ముక్కులు బద్దలయ్యేంత దుర్వాసన గుప్పు మంటూ ఉంటుంది.

నిశ్శబ్దమును పాటించుము అనే చోట నయాగరా జలపాత హోరు వినిపిస్తున్నా , లైబ్రేరియన్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసి నిస్సహాయంగా చేతులెత్తేస్తాడు.

వాహనములకు ప్రవేశము లేదు అని వ్రాసి ఉన్న హెచ్చరికను తుంగలో తొక్కి ఏ పోలీసో ఎదురయ్యే వరకూ ఆకతాయి వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి.

ప్లేట్లలో చేతులు కడగరాదు అని మా ఊళ్ళో చిన్న చిన్న హొటళ్ళలో బోర్డు రాసి పెట్టే వారు. అందు చేత జనాలు ఆ వినతిని  మన్నించి, టిఫిన్ తిన్నాక, చేతులు గ్లాసులలో ముంచి చక్కా పోయే వారు.

స్త్రీలకు మాత్రమే అని కనిపిస్తున్నా కొందరు జబర్దస్తీ రాయుళ్ళు బస్సులలో ఆ సీట్ల లోనే కూర్చోడం అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే.

మెడలు పక్కకి వాల్చి వాహనాలు నడిపే చోదకుల విన్యాసాలూ,పట్ట పగలు కూడా వెలిగే వీధి దీపాలూ, బస్సుల్లో వ్రేలాడుతూ ప్రయాణం చేసే ఫుట్ బోర్డు వీరుల సర్కస్  ఫీట్లూ  ...

ఇలా చెప్పు కుంటూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. మన సామాజిక  సామాజిక స్పృహ  అలాంటిది మరి !

ఈ మేడే నాడు సామాజిక స్పృహ  గుర్తుకు రావడం యాదృచ్ఛిక మేమీ కాదు.

దానితో పాటు మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్పృహ గురించి మీకు చెప్పాలనిపించడం కూడా సహజమైన విషయమే.

మా తింగరి బుచ్చిగాడు గుర్తున్నాడు కదూ ?  పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా తింగరి బుచ్చిగాడు ఆరేడేళ్ళ వయసు లోనే గొప్ప  సామాజిక స్పృహ సంతరించు కున్నాడు. అది విశేషమే కదా ?


ఆ ముచ్చట చెప్పాలనే ఈ టపా పెడుతున్నాను.

నేనూ , మా తింగరి బుచ్చిగాడూ ఎలిమెంటరీ బడిలో చదువుకునే రోజులవి. మా బడి పేరు జంగం బడి. మా బడి పోలీసు స్టేషను వీధికి దగ్గరలోనే ఉండేది. మా బడికి ఎదురుగా ఒక చేకు గోడౌను ఉండేది. అంటే తెలుసు కదా ? గోగు నారని అక్కడ మిషన్ల లో పెట్టి పెద్ద పెద్ద బేళ్ళగా కట్టి ఎక్కడికో ఎగుమతి చేసే వారు.

ఆరోజుల్లో అక్కడ తయారయే చేకు బేళ్ళు మాకంటికి ఆకాశమంత ఎత్తుగా కనిపించేవి. ఆ తయారీ కూడా మాకు చాలా వింతగా కనిపించేది. నార బేళ్ళు కట్టే మిషన్లు ఒకటో, రెండో ఉండేవి. వాటిలో నార వేసి మనుషులు తొక్కే వాళ్ళు.  తర్వాత పెద్ద పెద్ద చక్రాలను నలుగురైదుగురు మనుషులు బలంగా పట్టుకుని తిప్పే వారు. పెద్ద పెద్ద తాళ్ళతో ఆ మిషన్లోనే వాటిని పెద్ద బేళ్ళుగా కట్టే వారు. అలా కట్టిన బేళ్ళ నుండి ఒక్క చిన్న నార పీచు లాగి తియ్యడం కూడా మాకు చాతనయ్యేది కాదు. మా శలవు రోజులన్నీ ఆ గోడౌను లో ఉండే రావి చెట్టు కిందే గడిచి పోయేవి.

సరే, ఇదంతా అలా ఉంచితే, ఒక రోజు మా తింగరి బుచ్చి నన్ను రహస్యంగా ప్రక్కకి పిలిచి, ‘‘ నీకో రహస్యం చెబుతాను. మన చేకు గోడౌనులో దొంగతనం జరుగుతోంది. తెలుసా ! ’’ అనడిగేడు.

‘‘ దొంగతనమా !’’ అన్నాను భయంగా.

‘‘ అంటే, దొంగ వ్యాపార మన్న మాట.’’ అని వివరించేడు. కల్తీ , దొంగ వ్యాపారం, దోపిడీ లాంటి పదాలు వాళ్ళ అన్నయ్య తరుచుగా అంటూ ఉంటాడు. అవే వీడికీ వంట బట్టేయి.

‘‘ మనం ఈ విషయం పోలీసులకి చెప్పాలి. పోలీసు స్టేషన్ కి వెళదాం పద !‘‘ అన్నాడు.

నా నిక్కరు తడిసి పోయింది.

‘‘ అమ్మో ! నాకు భయం’’ అన్నాను.

‘‘ నీకు సామాజిక స్పృహ లేదు.’’ వెక్కిరించాడు వాడు. ఈ పదం కూడా వాడు వాళ్ళ విప్లవ అన్నయ్య నుండి నేర్చుకున్నదే. అసలీ విప్లవమనే పదం కూడా వాడికి అలాతెలిసిందే. ‘‘ అంటే ఏమిటి ’’ అనడిగేను. ‘‘ నాకూ సరిగా తెలియదు. తిరగ బడడంట.’’ అన్నాడు. మా అవ్వ ఆ మధ్య నీరసంతో కళ్ళుతిరిగి నేలకు తిరగ బడి పోయింది. ఇది సామాజిక స్పృహ  అవునో కాదో నాకు తెలియదు. నిజంగా. నిజం. సరస్వతి తోడు.

నాకు సామాజిక స్పృహ లేదని ఖాయమై పోయేక, వాడొక్కడూ పోలీసు స్టేషన్కి బయలు దేరాడు.



 అక్కడ జరిగిన బోగట్టా అంతా నా మనో నేత్రంతో ( అంటే ఏఁవిటో నాకు సరిగ్గా తెలియదు. మా కథా మంజరి బ్లాగరు అంకుల్ చెప్పాడు ) చూసాను కనుక మీకు చెబుతున్నాను.



మా తింగరి బుచ్చి గాడు వీరోచితంగా పోలీసు స్టేషను వరకూ వెళ్ళి , అక్క డ చాలా సేపు తటపటాయించి, ఎలాగయితేనేం, స్టేషను లోకి ప్రవేశించాడు.

అక్కడింకా పోలీసు బాబాయిలు మేలుకో లేదు. మేలుకునే ఉన్నా,  అంటే,  ఉత్త బాబాయిల్లా గానే ఉన్నారు.

కానీ, పోలీసు బాబాయిల్లా లేరన్న మాట.

అంచేత, ఏం కావాలి బాబూ ! అనడిగేరు లాలనగా.

‘‘ కంప్లయంటు ఇవ్వడానికి వచ్చానండీ’’ అన్నాడు వీడు.

‘‘ మీ నాన్న మీదా ?’’

‘‘ కాదండీ ...’’

‘‘ మీ అమ్మ మీదా ?‘‘

‘‘ కాదండీ ..’’

‘‘ పోనీ, ఇంకెవరయినా మీ ఇంట్లో వాళ్ళ మీదా ? లేక మీ పక్కింటి అంకుల్ గారి మీదా ’’

’’ఉహూఁ !  కాదండీ ...’’

‘‘ నీ జేబులో అయిదు పైసల బిళ్ళ పోయిందా ?’’ చివరి ప్రయత్నంగా కొంచెం లాలనగానే అడిగాడు పో.బా.

‘‘ కాదండీ ..’’ అంటూ, ఎందుకయినా మంచిదని నిక్కరు జేబు ఓసారి తడిమి చూసుకున్నాడు మా తింగరి బుచ్చి గాడు.

అప్పటికి పోలీసు  బాబాయిలో నిజమైన పోలీసు బద్ధకంగా నిద్ర లేచాడు.

‘‘ మరెవరి మీదరా నా కొడకా  ?’’ విసుగ్గా అడిగేడు. అయినా, ముద్దుగానే అడిగాడు. మన వాడికి  కాళ్ళలో సన్నని వణుకు మొదలయింది.

’’ మా బడి దగ్గర గోడౌన్ వాళ్ళ మీదండీ ....వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు ...’’అన్నాడు, ఎలాగో కొంచెం ధైర్యం చిక్కబట్టుకొని.


పో.బా కి ఓ క్షణం తను  ఏం విన్నాడో అర్ధం కాలేదు.

‘‘ సరేలే ... నువ్వు మీ ఇంటికి పోయి, మీ పెద్ద వాళ్ళు ఎవరి నయినా పంపించు. వాళ్ళొచ్చి రిపోర్టు ఇస్తారు ’’ అన్నాడు.

‘‘ వాళ్ళకంత సామాజిక స్పృహ  లేదండీ !’’ అన్నాడు టక్కున మా తింగరి బుచ్చిగాడు.



ఈ సారి పోలీసు బాబాయిలందరికీ నిజంగానే మతి పోయింది ! కాసేపు మాట పడి పోయింది.



‘‘ సరేలే, పద ...ఓయ్, 110 నువ్వు వీడి వెంట వెళ్ళి ఆ సంగతేమిటో చూడు ...’’ అన్నాడొక పెద్ద పో.బా.



తింగరి బుచ్చి గాడికి ఏనుగు నెక్కి నంత సంబర మనిపించింది.



110 పో.బా తనని తన సైకిలు వెనుక కూర్చుండ పెట్టుకొని తొక్కడం వాడికి మరింత గర్వ మనిపించింది.





సామాజిక స్పృహ ఉండడం వల్ల ఎంత గౌరవమో కదా అనుకున్నాడు.



పో.బా ని మన వాడు నేరుగా గోడౌను లోకి తీసుకు వెళ్ళి అక్కడ దొంతరలుగా ఉన్న చేకు బేళ్ళను చూపించాడు.

‘‘ ఇక్కడ ఎన్ని బేళ్ళు ఉన్నాయో చూసారు కదండీ ...’’

‘‘అయితే ? ...’’ బిక్క మొహంతో అడిగాడు పో.బా.

‘‘ రండి చెబుతాను.’’ అని పో.బా ను మా తింగరి బుచ్చి గాడు గోడౌను గేటు వెలుపలి గోడ దగ్గరకు తీసుకు వచ్చాడు. అక్కడ గోడ మీద రాసి ఉన్న అక్షరాలు చదవమన్నాడు.



పో.బా కూడ బలుక్కో కుండానే వీజీగానే చదివేసాడు :  ‘‘STICK NO BILLS  ... ’’

అప్పుడు మా తింగరి బుచ్చి గాడు విజయ గర్వంతో తల ఎగరేస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. ‘‘ చూసారా సారూ ? గోడౌన్ లోపల అంత స్టాకు ఉంచుకొని , ఇక్కడ చేకు బేళ్ళు స్టాకు లేవని బోర్డు పెట్టారు. ఇది దొంగ వ్యాపారమే కదా ? మీరు వీళ్ళని జైల్లో పెట్టాలి.’’ అన్నాడు .



పో.బా కి తల తిరిగి, మూర్ఛ వచ్చినంత పనయింది. పోలీసు ఉద్యోగం వదిలేసి ఎక్కడి కయినా పోవాలన్నంత విరక్తి  కలిగింది.



Stick no bills  అనే బోర్డుని మా తింగరి బుచ్చి గాడు తన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని ఉపయోగించి,కూడ బలుక్కొని,

 ‘‘ స్టాక్ నో బేల్స్   ’’ అని చదువు తున్నాడని అర్ధం కావడానికి  అతనికి  కొంత సేపు పట్టింది. అతనా షాకు నుండి తేరుకునే లోపల మా తింగరి బుచ్చిగాడు ‘‘ మీకు సామాజిక స్పృహ  కానీ ఉంటే వెంటనే ఈ దొంగ వ్యాపారులను జైల్లో పెట్టాలి ! ’’ అని   ఒకటే సతాయిస్తున్నాడు.



పోలీసు బాబాయి ‘‘ సరే ... సరే ..నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, వీళ్ళందరినీ నేను జైల్లో పెడతానుగా ! ’’ అన్నాడు.



విజయ గర్వంతో విజిలు వేస్తూ మా తింగరి బుచ్చి గాడు  జారి పోతున్న నిక్కరును మీదకి లాక్కుంటూ ఇంటి ముఖం పట్టాడు.



వాడు నాలుగడుగులు వేసాడో లేదో, వెనుక నుంచి ’’ మళ్ళీ మా పోలీసే స్టేషను వేపు వచ్చావంటే ముందు నిన్ను బొక్కలో పడేసి మక్కలు విరిచేస్తాను జాగ్రత్త ! ’’ అన్న పో.బా. మాటలు వినిపించి వాడి నిక్కరు తడిసి పోయింది.   అవి పో.బా. తనని గురించి అన్న మాటలేనని వాడు వెనక్కి తిరగ నక్కర లేకుండానే పోల్చుకున్నాడు.



 అంతే ! ... ఇల్లు చేరే వరకూ పరుగో ... పరుగు !  పరుగో, పరుగు !!



ఇదండీ మా తింగరి బుచ్చిగాడి సామాజిక స్పృహ అను ఇంగ్లీషు పాండిత్యం !

30, నవంబర్ 2019, శనివారం

పులి జూదం



అశ్వం నైవ గజం నైవ
వ్యాఘ్రం నైవచ నైవచ
అజా పుత్రం బలిం దద్యాత్
దైవో దుర్బల ఘాతక:

గుఱ్ఱాన్నీ, ఏనుగునీ బలి యివ్వరు. బలం లేని మేకనే బలి యిస్తారు. దేవుడు దుర్బలులనే శిక్షిస్తాడు కదా !
చరిత్ర గతిని పరిశీలిస్తే , యిది నిజమే అనిపిస్తుంది కదూ ! ఈ పర పీడన పరాయణత్వం అంతటా కనిపిస్తూనే ఉంటుంటుంది.
‘‘ బలవంతులు దుర్బల జాతిని
బలహీనుల కావించారు
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం ?
నర జాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం ... ’’ అని శ్రీ.శ్రీ అన లేదూ ?

భాస్కర శతకంలోని పద్యం అదే చెబుతోంది కదూ !

తగిలి మదంబుచే నెదిరిఁదన్ను నెఱుంగక దొడ్డ వారితోఁ
బగఁగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు ; టింతెఁగాక, తా
నెగడి జయింప నేరడిది నిక్కము ; తప్పదు ; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా !

తన బలమేమిటో గ్రమించుకో లేక, ఎదిరి బలాన్ని ( శత్రువు బలాన్ని) అంచనా వేసుకోకుండా, బలవంతుడితో ఢీకొట్టి పోరుకి సిద్ధ పడిన వాడు చెడి పోతాడనడంలో సందేహం లేదు...
లోకంలో కొండని మదంతో ఢీ కొట్టిన పొట్టేలు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా ! కొండ అలాగే ఉంటుంది. పొట్టేలు మాత్రం ఛస్తుంది.

ఈ చెప్పిన విషయాలు కొంత నిరాశా వాదాన్ని ప్రోది చేస్తున్న వేమో అనుకునే పని లేదు. వ్యష్టి శక్తి సమిష్టి శక్తిగా రూపు దాల్చడం జరుగని రోజులవి. అయినా, దోపిడీ వర్గ స్వభావాన్నీ, బలాన్నీ చక్కగానే అంచనా వేసాయనే చెప్పాలి.
చీమలు పెట్టిన పుట్టలు పాముల ఆక్రమణకి లోను కావడం ఈ దోపిడీనే తెలియ జేస్తుంది.

అయితే, మన బద్దెన కవి హెచ్చరిక చేయనే చేసాడు కదూ ! ...

బలవంతుఁడ నాకేమని
బలువురితో నిగ్రహించి పలుకుట మేలా ?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతఁజిక్కి చావదె సుమతీ !

29, నవంబర్ 2019, శుక్రవారం

అవును కదూ !

అవును కదూ

ఆరంభ గుర్వీక్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృధ్ది ముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా, ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం


మొదల చూసిన కడు గొప్ప పిదప కుఱుచ
ఆది కొంచెము తర్వాత నధిక మగుచు
తనరు దిన పూర్వ పర భాగ జనిత మైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి


కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తర్వాత తగ్గి పోతుంది .
మంచి వారితొ స్నేహం మొదట తక్కువగా ఉండి పిదప పెరుగుతుంది.

కుజనులతొ మైత్రి ఉదయకాలపు నీడ లాగున, సజ్జనులతొ మైత్రి సయంకాలపు నీడ లాగున ఉంటాయి .

28, నవంబర్ 2019, గురువారం

పదవి పోయేక...

అధికారాంతమునందు చూడవలె..

ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే

ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !
త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !

ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !

నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !

27, నవంబర్ 2019, బుధవారం

అలకల కొలికి...


ఉ.  మాసిన చీర గట్టికొని మౌనముతోడ నిరస్త భూషయై
      వాసెనకట్టు గట్టి నిడువాలిక కస్తురిపట్టు వెట్టి లో
       గాసిలి చీకటింటికడ కంకటిపై జలదాంతచంద్ర రే
       ఖాసదృశాంగి యై పొరలె గాఢమనోజవిషాద వేదనన్.

భావం: ( కోపించిన సత్యభామ ) మాసిన చీర కట్టుకుంది. ఒంటి మీది నగలన్నీ తీసి వేసింది.తలకి  గుడ్డ కట్టుకుంది. నుదుట దట్టంగా కస్తూరిపట్టు పెట్టింది. మేఘాల చాటున చంద్ర రేఖలా తీవ్ర మయిన మన్మథ వేదనతో చీకటి గదిలో మంచం మీద  అలవిమాలిన దుఃఖంతో, బాధతో దొర్లింది.

   ఈ పద్యం నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధం లో  సత్య భామ కోపగృహంలో ప్రవేశించిన ఘట్టం లోనిది. కోపం వస్తే అయినింటి ఇల్లాళ్ళు అందరూ ఏం చేస్తారో, ఈ రాణి వాసపు  స్త్రీరత్నం  సత్య భామ కూడా అదే చేసింది! మాసిన చీర కట్టుకుంది. నగలన్నీ తీసేసింది. తలకి గుడ్డ చుట్టుకుంది. శిరో వేదనకి  వేసుకునే కస్తూరి పట్టు వేసుకుంది. చీకటి గదిలో మంచం మీద అశాంతిగా దొర్లింది !

      సత్య కోప కారణానికి ముందు చాలా గ్రంథమే నడిచింది. శ్రీకృష్ణుడు తన పట్టపు రాణి రుక్మిణి ఇంట ఉండగా, కలహభోజనుడు నారదుడు పారి జాత పుష్పాన్ని తెచ్చి ఇచ్చాడు. అంతటితో ఊరు కోక, నచ్చిన చెలికి ఇమ్మన్నాడు. కృష్ణుడు ఇరుకున పడ్డాడు !  సత్యకి తెలిస్తే ఏమవుతుందో అని శంకిస్తూనే, రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణి ఆనందంగా దానిని అందుకుంది. ఇక నేం ! తగవులమారి  నారదుడు సవతుల మధ్య అగ్గి రాజేసే మాటలు చాలా అన్నాడు.ఆ పారిజాత పుష్పం ఎన్నటికీ వాడదనీ. సువాసన వీడదనీ చెప్పాడు. కృష్ణుడు  దానిని రుక్మిణికే ఇవ్వడంతో సవతులలో  అతనికి ఆమె పట్లనే అనురాగం ఎక్కువ అని తెలుస్తోందన్నాడు. ఇక సవతులందరూ ఆమెకు దాసీ లవడం ఖాయం అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా ! శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడనే మాట కల్ల అని దీనితో తేలి పోయిందని కూడా అన్నాడు !

  ఇంకే ముంది !  ఒక చెలికత్తె ద్వారా ఈ మాటలన్నీ సత్యచెవిని పడ్డాయి . ఆమె కర్ర దెబ్బతిన్న పామే అయింది. నెయ్యి పోస్తే భగ్గున మండే అగ్ని కీలలా లేచింది! భర్త అనాదరం చూపితే అభిమానవతులలో వచ్చే కళ్ళు ఎర్రబడడం,గొంతు బొంగురు పోవడం వంటి  శారీరక మార్పులన్నీ వచ్చేయి. తటాలున పడకటింటికి చేరింది. మాసిన చీర కట్టుకోడం, నగలు తీసి పారెయ్యడం,తలకి గుడ్డ బిగించడం,కస్తూరి పట్టు పెట్టుకోడం, మంచం మీద ఆశాంతిగా దొర్లడం, ఇవన్నీ కోప గృహం వాతావరణాన్ని మరింత వేడెక్కించేవే!  చివరకి రానే వచ్చేడు కృష్ణుడు.  అనునయ వాక్యాలతో ఆమెను ఓదార్చాలని చూసేడు. చివరకు ఆ జగన్నాటక సూత్రధారి ఆమె పాదాల మీద తల వాల్చి మ్రొక్కాడు! బ్రహ్మాది  దేవతలచే పూజింప బడే ఆ శిరస్సును  సత్య ఎడమ కాలితో తన్నింది.
నాథుల అపరాధాన్ని సహించని స్త్రీలు ప్రణయ కోపంలో ఉచితానుచితాలు చూస్తారా !

         ఈ సరస శృంగార కావ్యం అంటే తెలుగు వారికి ఎంత మక్కువో చెప్పలేం!

26, నవంబర్ 2019, మంగళవారం

మీ వాడితో మేం ఇక పడలేం తల్లీ ..



మత్త.   పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలఁబోయి మా యిలు సొచ్చి తా
           నుట్టి యందక రోళ్ళుఁబీటలు నొక్క ప్రోవిడి యెక్కి చే                           
            వెట్టఁ జాలక కుండ క్రిందొక తూఁటొనరించి మీ
             పట్టి మీఁగడ పాలుఁ జేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ !


భావం: అమ్మా, యశోదమ్మా ! ఏం పిల్లడమ్మా, మీ పిల్లడు ! నిన్న గాక మొన్న పుట్టాడో, లేదో, దొంగ తనాలు మొదలు పెట్టాడు !ఇవాళ మా ఇంట జొరబడ్డాడు. ఉట్టి అందక, రోళ్ళు, పీటలు ఒక దాని మీద ఒకటి పేర్చి వాటి మీద ఎక్కి అందుకోవాలనుకున్నాడు. వాడలా చేస్తాడని ఊహించి,ఉట్టి అందకుండా ఎత్తుగా కట్టేం. కన్నయ్యకి ఉట్టిలో చేయి పెట్టడం సాధ్యం కాలేదు. ఇక లాభం లేదనుకున్నాడేమో, కిందనుంచే  కుండకు పెద్ద చిల్లు పెట్టి, మీగడ పాలను దోసిళ్ళతో పట్టి త్రాగాడు !

      చేత వెన్న ముద్దతో,బోసి నవ్వులు చిందిస్తూ బంగురుతూ ఉండే కన్నయ్య వర్ణ చిత్రం తెలుగు లోగిళ్ళలో ఒక అపూర్వ ఆకర్షణ. పసి బిడ్డలున్న ఇంట, చిన్ని కృష్ణుడితో తమ బిడ్డను సరి పోల్చుకుని మురిసి పోని తల్లి దండ్రులూ ఉండరు. వెన్న దొంగ దుడుకు చేష్టలను పోతన మహా కవి తన ఆంధ్ర మహా భాగవతం దశమ స్కంధంలో కమ్మని పద్యాలలో పటం కట్టి  పద్యరూప వర్ణ చిత్రాలుగా ఆవిష్కరించేడు.!

     నల్లనయ్య అల్లరి చేతలు చూసి వ్రేపల్లె లోని ఇళ్ళాళ్ళకు ఓర్పు నశించి పోయింది. అంతా కలసి కట్టుగా నందుని యింటికి వచ్చి యశోదమ్మతో పిల్ల వాని ఆగడాలను ఏకరువు పెట్టారు. నల్లనయ్య బాల్యక్రీడలన్నీ అతని లీలా విలాసాలే !    ‘‘బాలురకు పాలు లేవని బాలింతలు మొత్తు కుంటూ ఉంటే,  నీ బిడ్డ లేగల త్రాళ్ళు విప్పి ఆవుల దగ్గరకి వదిలేస్తూ ఉంటాడు. చక్కగా కాగిన పాలను తన నేస్తాలకు పోస్తాడు. అంతటితో ఊరుకోకుండా కడవలు పగుల కొట్టి మరీ జారుకుంటాడు! ఎప్పుడు ఇంట్లో జొరబడతాడో, పాలు, వెన్న దొంగిలించి ఎప్పుడు బయటకి మాయమవుతాడో తెలియదు. వెళ్తూ వెళ్తూ , యింత వెన్నను నిద్ర పోతున్న కోడలి మూతికి రాస్తాడు. దానితో అత్త కోడలిని దండిస్తుంది.అలాగే పాలూ, నెయ్యీ జుర్రుకున్నాక పగుల కొట్టిన కడవలను  ప్రక్కనున్న యిళ్ళలో పడేసి పోతాడు. దానితో యిరుగు పొరుగులకి తగువులే, తగువులు . ఆ గదులకు భద్రంగా తాళాలు వేస్తే, వేసిన తాళాలు వేసినట్టే ఉండేవి. నీ కొడుకు లోపల నాట్యం చేస్తూ ఉన్నాడమ్మా! కడవలు అందకుండా ఉండడం కోసం మా యిళ్ళలో ఉట్లు ఎత్తుగా కట్టి ఉంచేం. అయినా ,పీటలు, రోళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి అందుకోవాలని చూస్తాడు. అది వీలు కాకపోతే కడవలకి తూట్లు పెట్టి పాలూ, వెన్నాత్రాగేస్తున్నాడు. యశోదమ్మా, యింక మా ఇళ్ళలో నీ కుమారుడు పాలూ పెరుగూ ఉండ నివ్వడు. ఎక్కడికయినా వెళ్ళి పోతాం. నంద ప్రభువుల వారి ఆవుల మీద ఆన !’’  అని గోపికలు వాపోయేరు.
ఇంత చెప్పినా యశోదమ్మ కన్నయ్యనే వెనకేసు కొచ్చింది !  చనుబాలు త్రాడం వదలని తన పసి బిడ్డపై నిందలు వేయ వద్దని బ్రతిమాలుకుంది.    

 మాతృత్వపు మాధుర్యానికి  ఆకాశమే హద్దు మరి!

23, నవంబర్ 2019, శనివారం

సత్యమేవ జయతే

చం.  మును మునుఁబుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
       డెనిమిది నాళ్ళ పాటి గలఁడింతియ పూరియ మేయ నేరఁడేఁ
        జని కడుపార చన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
         మ్మని సుకృతంబు గట్టి కొనవయ్య దయా గుణ ముల్లసిల్లఁగన్.
భావం:  నిన్న గాక మొన్న నాకొక ముద్దుల కుమారుడు పుట్టాడు. వాడు పుట్టి ఇంకా ఏడెనిమిది రోజులు కాలేదు.  ఇంత గడ్డి కూడ తిన లేడు.నేను ఇంటికి పోయి వాడికి కడుపు నిండా పాలిచ్చి ఇక్కడున్నట్టుగా వేగంగా వచ్చేస్తాను. దయతో నన్ను పోయి రమ్మని పుణ్యం కట్టుకోవయ్యా పులి రాజా!
     ‘‘అవు – పులి’’  కథ  చెప్పని పెద్దలూ, వినని బిడ్డలూ తెలుగు నాట ఏ ఇంట్లోనూ ఉండరు. ఈ కథని అనంతామాత్యుడు భోజరాజీయం లో పద్య రూపంలో  చాలా ఆర్ద్రంగా వ్రాసాడు.. ఈ కథా కావ్యంలో మూడు పెద్ద కథలూ, మరెన్నో ఉప కథలూ ఉంటాయి. అనంతుడు ఇదే కాక, రసాభరణం అనే ఆలంకారిక గ్రంథమూ, ఛందో దర్పణం అనే ఛందో గ్రంథమూ కూడా వ్రాసాడు. 
       ఒక అడవిలో మేతకు వెళ్ళిన ఒక ఆవు దారి తప్పి పోయింది. ఒక పెద్ద పులి ఎదురు పడి, దానిని తిని వేస్తానంటుంది.  ఆకొన్న వారికి ఆహారం పెట్టడం కన్నా పుణ్యం లేదని, పులికి ఆహార మవడానికి  సిద్ధ పడుతుంది ఆవు. కాని, ఒక్క సారి ఇంటికి పోయి, ఏడెనిమిది రోజుల వయసున్న తన బడ్డకు కడుపు నిండా పాలిచ్చి రావడానికి అనుమతి కోరింది. అంతే కాదు, ‘‘ ఈ ఉదయం పాలిచ్చి వచ్చాను. నా బిడ్డ అటూ, యిటూ గెంతులు వేయడంతో ఆ పుడిసెడు పాలు ఈపాటికి అరిగి పోయి ఉంటాయి. ఇప్పుడు వాడి కేది దారి?’’ అని దిగులు చెందింది. ‘‘ గుమ్మెడు పాలు నా బిడ్డకి తృప్తి నిచ్చి వాడి ఆకలి తీరుస్తాయి. నా ఒంట్లో మాంసం అంతా తిన్నా సరే, నీ జఠరాగ్ని చల్లారదు. కనుక ఇందులో మొదట చేయ దగిన పని ఏదో నీకు తెలయదా ! అన్నా! పులి రాజా! నన్ను పోయి రమ్మను. ఇలా వెళ్ళి అలా వస్తాను’’ అని కూడా ప్రార్ధించింది. ఆ మాటలతో కూడ పులి మనసు కరగ లేదు. గోవుని చూసి అపహాస్యం చేసింది. ‘‘ నన్ను బేల్పరచి, నీ కొడుకు దగ్గరకి పోయి, నేను తినేస్తానని తెలిసి కూడా తిరిగి వస్తావా ?! చెప్పే వారు ఎన్నయినా చెబుతారు. వినే వారికి వివేకం ఉండొద్దూ !’’ అని వెక్కిరించింది. ‘‘ అడవిలో  ఉన్నంత మాత్రం చేత పులి అంత తెలివి మాలిన దనుకున్నావా !’’ అని కూడ నిష్ఠర మాడింది. అప్పుడు ఆవు తన మాట నమ్మమని ఎన్నో ఒట్లు పెట్టి మరీ చెప్పింది. మాట జవదాటితే తనకు ఎలాంటి దుర్గతి పడుతుందో చెప్పింది. ఎలాగయితేనేం చివరకి పులి అంగీకరించి ,ఆవును సత్వరమే  తిరిగి రమ్మని పంపించింది. సత్య నిష్ఠ గల ఆవు ఆడిన మాట తప్ప లేదు!  బిడ్డకి పాలిచ్చి, నీతులు చెప్పి, పులి దగ్గరకి  తిరిగి వచ్చి, తనని తిని, ఆకలి చల్లార్చు కొమ్మంది.     విభ్రమం కొలిపే ఆ సత్య సంధతకి  నివ్వెర పోయిన పెద్ద పులి ఆవుని  శ్లాఘించి, విడిచి పెట్టింది!
     సత్య వాక్కుకి ఉన్న శక్తి అలాంటిది మరి ! ఈ కథ ప్రతిపాదించే విశ్వజనీన మయిన నీతి అదే !

22, నవంబర్ 2019, శుక్రవారం

రామ ! రామ!

చిలుకా పలకవే

సద్విద్యా యది కా చింతా

వరా కోదర పూరణే
శుకోప్యశన మాప్నోతి
రామ రామేతి చాబ్రువన్

ఎంత చక్కని శ్లోకమో చూడండి ...

రామ రామ అనే రెండు మాటలు నేర్చిన చిలుకే తన తిండిని తాను సంపాదంచుకో గలుగుతోంది. హాయిగా బ్రతుకుతోంది.
మరి, బాగా చదువుకున్న వారికి ఎందుకంత బెంగ ?

బాగుంది కదూ ! ఇలాంటి చక్కని శ్లోకాల నీ, మంచి పద్యాలనీ ఇక నుండీ ఈ టపాలో మీరు చూడ వచ్చును ...

మూడే, మూడడుగులు...



మ. వడుగా ! యెవ్వరి వాఁడ? వెవ్వఁడవు? సంవాస స్థలం బెయ్య? ది
      య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్;                            
       గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
        గడతేఱెన్ ! సుహుతంబులయ్యె శిఖులుం ! గల్యాణ మిక్కాలమున్.

భావం: ఓ బ్రహ్మచారీ !నీ పేరేమిటి? ఎవరి కుమారుడవు? నీ నివాసం ఎక్కడ?నీ రాక వల్ల నా వంశం, జన్మ ధన్యమయ్యాయి. నేను చేస్తున్న ఈ యాగం కృతార్ధ మయింది. నా కోరికలు నెర వేరాయి.అగ్నులు చక్కగా వ్రేల్చ బడ్డాయి.(  దేవతలకు సమర్పించ బడిన హవిస్సులు సఫల మయ్యాయి) ఈ సమయం మిక్కిలి శుభప్రదం!
   రాక్షస ప్రభువైన బలి చక్రవర్తి ఆడి తప్పని వాడు. సద్ధర్ముడు అమరావతి నుండి దైత్య కులానికి శత్రువయిన ఇంద్రుడినీ ఇతర దేవతలనూ వెళ్ళ గొట్టాడు.ముల్లోకాలకు ప్రభువయ్యాడు.దేవతలకు చేటు కాలం దాపురించింది. దేవతల తల్లి అదితి  వారి దురవస్థను చూడ లేక పోయింది. భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు శ్రీహరిని ధ్యానించింది. ఆమె ప్రార్ధన మన్నించి బలిని సంహరించి దేవతలను కాపాడడానికి  శ్రీహరి ఆమె గర్భాన  వామనుడై జన్మించాడు.తండ్రి కశ్యపుడు వామనునికి వడుగు చేసాడు.ఆ సందర్భంగా వటువుకి సూర్యుడు గాయత్రినీ, బృహస్పతి జంద్యాన్నీ,కశ్యపుడు ముంజ దర్భల మొల త్రాడునీ,అదితి కౌపీనాన్నీ,భూ దేవి నల్లని జింక చర్మాన్నీ,దండాన్ని చంద్రుడూ, గొడుగును ఆకాశమూ,బ్రహ్మ కమండలాన్నీ, సరస్వతి జపమాలనూ, సప్తర్షులు దర్భలనూ  ఇచ్చారు!  భిక్షాటనకు వటువుకి అన్నీ అమిరాయి !
 
   
    ఆ పిమ్మట వటువయిన వామనుడు బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలి వామనుని భక్తితో సత్కరించి, కుశల ప్రశ్నలు అడిగిన ఈ పద్యం పోతన భాగవతంలోని వామనావతార ఘట్టం లోనిది.

బలి ఇవ్వ జూపిన సకల భోగోపకరణాలనీ కాదని మూడడుగుల నేల దానమిమ్మని వామనుడు కోరాడు. అదే తనపాలిట బ్రహ్మాండమని పలికాడు ! రెండడుగులతో భూనభోంతరాలను ఆక్రమించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా మహా దాత అయిన దైత్య రాజు మూడో అడుగు తల దాల్చి వటువు చేత పాతాళానికి అణచి వేయబడ్డాడు.    ఆ దాన వైభవం అపూర్వం !  అజరామరం . అనితర సాధ్యం !

        ‘‘ కారే రాజులు ...’’,  ‘‘ ఆదిన్ శ్రీసతి కొప్పుపై ..’’ ‘‘ ఇంతింతై వటుడింతయై ...’’, ‘‘ రవి బింబంబుపమింప ..’’ మొదలయిన పద్యాలతో   పోతన గారి భాగవతంలో  వామనావతార ఘట్టమంతా ఒక తేనె వాక లాగ మధురాతి మధురం ! రస బంధురం ! తెలుగు వారి భాగ్య వశాన పోతన కవి ప్రసాదించిన కవితా స్వాదు ఫలం !
                                                                                                         

21, నవంబర్ 2019, గురువారం

తెలుగు మధురిమలు


మ. తన వెంటన్ సిరి,లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
      న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ                            
       క్ర నికాయంబును, నారదుండు,ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
       య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్ !

భావం: మొసలి బారిన పడి, శరణు వేడుతూ ఆక్రోశిస్తున్న భక్తుడయిన గజేంద్రుని మొర విని, వైకుంఠ వాసుడయిన విష్ణువు బయలు దేరాడు. అతని వెంట లక్ష్మీ దేవి, ఆమె వెనుక అంత:పుర కాంతలూ బయలుదేరారు. వారి వెంట గరుడుడూ,  ఆతనిని అనుసరిస్తూ విల్లూ, గదా, చక్రమూ, శంఖమూ వచ్చాయి. వాటి వెంట నారదుడూ, విష్వక్సేనుడూ వచ్చారు. వారి వెంట మొత్తం వైకుంఠ వాసులంతా శీఘ్రంగా బయలుదేరి వచ్చారు.
      
        త్రికూట పర్వత శ్రేణిసమీపాన ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో   తిరిగే ఏనుగుల గుంపు లోనుండి  ఒక రోజు ఒక గజ రాజు  మంద నుండి విడి పోయి దారి తప్పాడు. భార్యలతో తిరుగుతూ బాగా డస్సి పోయాడు. అక్కడొక మడుగు కనిపించి ఆనందంతో  మడుగు నీటిలో దిగి క్రీడిస్తూ అక్కడే ఉండే ఒక మొసలి బారిన పడ్డాడు. శక్తి కొలది మొసలితో పోరాడాడు.  ఆ నీరాట వనాటాలకు పోరు వెయ్యేండ్లు అతి భీకరంగా సాగింది. గజరాజు బాగా అలసి సోయాడు.మొసలితో పోరాడే ఓపిక సన్నగిల్లి పోయింది.      ఇక తనకు దిక్కు ఆ మహా విష్ణువే అనుకున్నాడు. ఈ లోకం ఎవని వలన పుడుతుందో, ఎవని వలన లయమవుతుందో,ఈ విశ్వానికి ఎవడు మూలకారకుడో, అన్నీ తానైన వాడెవ్వడో అట్టి భగవంతుడినే శరణు కోరుకోడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘ దేవా ! నాలో మరింక పోరాడే శక్తి లేదు. ధైర్యం సన్నగిల్లి పోయింది.ప్రాణాలు కడతేరుకు పోతున్నాయి.మూర్ఛితుడనవుతున్నాను.నీవే తప్ప అన్యు లెవరూ నన్ను రక్షింప లేరు. నన్ను కాపాడు !’’  అని ఎలుగెత్తి విలపించాడు

    గజరాజు మొర శ్రీమహా విష్ణువు చెవిని పడింది. అప్పుడా పురుషోత్తముడు అల  వైకుంఠ పురంలో రమా దేవితో క్రీడావినోదియై ఉన్నాడు.  గజేంద్రుని మొర ఆలకించాడు. ఆ భక్త జన రక్షకుడు వెంటనే కదిలాడు. లక్షీ దేవికి మాట మాత్ర మయినా చెప్ప లేదు.ఆయుధాలయిన శంఖ చక్రాలను చేతులలోకి తీసుకో లేదు.సేవకులనూ.గరుడ వాహనాన్ని పిలువ లేదు.జారి పోయిన జుట్టు ముడిని సవరించుకో లేదు. చివరకి చేతిలో ఉన్న రమా దేవి పైట కొంగును కూడా ఆ తొందరలో విడిచి పెట్ట లేదు.! పోతన గారి ఆంధ్ర మహా భాగవతం గజేంద్ర మోక్షణం లోని ఈ ఘట్టం లోనిదే మీది పద్యం !   కరి రాజును కాపాడడానికి బయలు దేరిన హరి వెంట లక్ష్మీ దేవి,రాణివాసం, శంఖ చక్రాది ఆయుధాలూ,నారద విష్వక్సేనులూ, మొత్తం వైకుంఠమే కదిలి వచ్చిన దృశ్యాన్ని కనుల ముందు మత్తేభ వృత్తంలో సాక్షాత్కరింప చేసిన  మధుర  మనోహర మయిన కల్పన యిది !


      మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవ సహాయం భక్తులకు తప్పక లభిస్తుందని చెప్పే కథ గజేంద్రమోక్షణం!