6, జనవరి 2012, శుక్రవారం

ఈ ఏడాది జగన్నాథ శర్మకు చా.సో. స్ఫూర్తి అవార్డు ...


జగన్నాథ శర్మకి ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు లభించింది. తెలుగు కథకి తూర్పు దిక్కు శ్రీ చా.సో అవార్డు వీరికి లభించడం కథకి గర్వ కారణం.

శ్రీ జగన్నాథ శర్మ బుల్లి తెరకు (జెమిని, ఈ టి,వీ) కథా, మాటల రచయితగా చిర పరిచితులు. కొన్ని సినిమాలకు కథా సహకారం అందించారు, ప్రసిద్ధ పత్రికలకు సహ సంపాదకత్వ బాధ్యత వహించి, ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర జ్యోతి వారి నవ్య వార పత్రికను పాఠకుల పత్రికగానూ, రచయితల పత్రికగానూ కూడా సమర్ధ వంతంగా తీర్చి దిద్దడంలో వీరి కృషి అనన్య సామాన్య మైనది. నవ్యలో విశేష పాఠకుల ఆదరణ పొందిన పాలపిట్ట ప్రపంచ జానపద కథల ధారా వాహికం, కథా సరిత్సాగరం వీరి ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యాలు.
వీరి వచన మహా భారతం , జగన్నాథ రథ చక్రాల్ (మొదటి పేజీ సంపాదకీయ రచనలు) పాఠకులను విశేషంగా ఆకట్టు కొంటూ సాగుతున్నాయి.


అసంఖ్యాకంగా కథల పోటీలు పెడుతూ, కథా నీరాజనం శీర్షికను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ తెలుగు కథకు జయ కేతన మెత్తు తున్నారు. తెలుగు నాట ఎక్కడ కథా గోష్ఠులు నిర్వహించినా, వాటి వివరాలు ఫొటోలతో పాటు చక్కని వార్తా కథనాలు నవ్యలో ప్రచురిస్తున్నారు.

ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు ఎ.ఎన్ జగన్నాథ శర్మకు ఇస్తున్నట్టుగా చా.సో గారి కుమార్తె ప్రముఖ రచయిత్రి, చా.సో స్ఫూర్తి పురస్కార ట్రస్టు వ్యవస్థాపకురాలు చాగంటి తులసి ఈ క్రింది ప్రకటన చేసారు :

ప్రముఖ కథారచయిత చాగంటి సోమయాజులు (చాసో) 18వ స్ఫూర్తి పురస్కారం 2012, జనవరి నెల 17వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత అయ్యల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మకు వచ్చింది. . పేగు కాలిన వాసన కథలు, అగ్రహారం కథలు, మావూరి కథలు రచయితగా, అనువాదకుడిగా జగన్నాథశర్మ కథాభిమానులకు చిర పరిచితులు. ఆయన కథల్లో వాస్తవికత, మానవీయతల మేలుకలయిక కనిపిస్తుంది., వ్యవస్థలోని అవకతవకలకు అద్దం పట్టి , సామాన్య మానవుల పట్ల అపారమైన ప్రేమ ఉన్న రచయిత వీరు.. కథ అల్లి చెప్పే కౌశలంతో ఎదిగి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున చాసో స్ఫూర్తి పురస్కారానికి జగన్నాథ శర్మను ఈ అవార్డు వరించింది. జనవరి 17న చాసో 97వ పుట్టినరోజు , ఆరోజు సాయంత్రం విజయ నగరం మహారాజ లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో శ్రీ జగన్నాథ శర్మకి రూ. 10,000 ల నగదు పురస్కారంతో పాటు, ప్రశంసా పత్రం అంద.జేయడం జరుగుతుంది.

కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి ...



ఇంత వరకూ చా.సో అవార్డు అందుకొన్న రచయితలు :


ఇంత వరకూ పుస్తక రూపంలో వెలువడిన జగన్నాథ శర్మ రచనలు ...











5, జనవరి 2012, గురువారం

3, జనవరి 2012, మంగళవారం

వన్స్ మోర్ !! మా రాముడు వలస బుగత గారూ !



ఉద్యోగ విజయాలు నాటక ప్రదర్శన ముగిసింది. కొంత మంది ప్రేక్షకులు శ్రీకృష్ణ పాత్రధారిని చూడాలని ఉవ్వళ్ళూరారు.గ్రీన్ రూమ్ లోకి వచ్చేరు. అక్కడ మేకప్ తీసేసి, తన సహజమైన వస్త్రధారణలో - అంటే, చిన్న చిలక్కట్టు, భుజం మీద చిన్న తుండు గుడ్డ, నల్లని శరీరంతో బల్ల మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ నాటకాల గురించీ, మహాభారత భాగవత, రామాయణాల గురించీ, వివిధ పురాణాల గురించీ అనర్గళంగా మాట్లాడుతున్నారు వారు. ఆయనే శ్రీకృష్ణ వేషధారి పీసపాటి నరసింహ మూర్తి గారు అంటే ఎవరూ ఒక పట్టాన నమ్మ లేక పోయేరు. ఆయన నాటకం ముగిసిన తరువాత దాదాపు ప్రతీ ఊళ్ళోనూ జరిగే తంతే యిది !

వారి స్వగ్రామం రాముడు వలస . ఆ ఊరికి నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది. మా పార్వతీపురానికి దగ్గరే వారి ఊరు. విజయ నగరం సంస్కృత కళాశాలలో నాతో పాటు చదువుకున్న మంగిపూడి వేంకట రమణ మూర్తి ( ప్రముఖ హరి కథకులు) గారి తండ్రి గారూ, పీసపాటి వారూ దగ్గరి బంధువులు. అంచేత, నేను రాముడు వలస వెళ్ళి నప్పుడల్లా వారు నన్ను మా రమణ మూర్తితో పాటు ఎంతో ఆదరంగా పలకరించే వారు. సంస్కృత కళాశాల విద్యార్థులం అనే అపేక్ష వల్ల కూడానేమో ! ఎప్పుడు రాముడు వలస వెళ్ళినా, నాయనా ! అని ఆదరంగా పిలిచే వారు . ‘‘ ఎప్పుడు వచ్చితీవు ? ...’’ అంటూ రాగయుక్తంగా పలకరించే వారు. వారితో సహపంక్తి భోజనం చేసే అదృష్టం నాకు చాలా సార్లు కలిగింది. వారి భోజన కార్యక్రమం దైవ పూజ చేస్తున్నంత నిష్ఠగా సాగేది. చిన్న కావి రంగు ముతక గావంచా కట్టకొని, పై మీద నాగుల తువ్వాలుతో వారి రూపం చూస్తే - రంగ స్థలం మీద అపూర్వ తేజస్సుతో వెలిగి పోతూ, కమ్మగా పద్యాలు చదివే మహా నటుడు వారే నంటే ఎవరికీ నమ్మ బుద్ధి కాదు.

రాగాన్ని అర్ధ రహితంగా సాగదీసి, పద్యం పాడడమే నటన అని అటు నటులలోనూ, ఇటు ప్రేక్షకుల లోనూ ఉండే భావనకి అడ్డ కట్ట వేసిన ఘనత వారిదే. కాంట్రాక్టు నాటకాలు కాంబినేషన్ పద్ధతికి అలవాటు పడడంతో ఒకే నాటకంలో ముగ్గురు నలుగురు శ్రీకృష్ణులు వగైరా పాత్రధారులు కనిపించే వారు. అంతమంది కృష్ణులలో పీసపాటి వారే అపురూపంగా మెరిసి పోయే వారు. ఆయనకు పద్యమే గద్యం. గద్యమే పద్యం. ఆయన పాండితీ వైభవం అబ్బుర పరుస్తుంది. ఇంతటి ప్రఙ్ఞావంతుడి ఎడ్యు కేషనల్ క్వాలిఫి కేషన్ అయిదో తరగతి ఫెయిల్ కావడం !

1920 జులై 10 వ తేదీన బొబ్బిలి తాలూకా, జలిజి పేట మండలం వంతరాం అనే గ్రామంలో పీసపాటి వారి జననం. చిన్న తనంల లోనే తల్లి దండ్రుల వియోగంతో కాకినాడలో వారి పిన తండ్రి గారింట పెరిగారు. కొంత కాలం పౌరోహిత్యం చేసారు. 1939 లో సామర్ల కోటకు చెందిన వాణీ నాట్య మండలి లో చేరి వశాంబి కృష్ణ మూర్తి గారి వద్ద నటనను అభ్యసించారు. ఆ సంవత్సరమే పాపమ్మ గారితో వారి వివాహం జరిగింది. 1945 లో శ్రీకాకుళం జిల్లా పొందూరు కి నివాసం మార్చారు. అక్కడ శ్రీరామ నాట్య మండలిని స్థాపించారు. 1949 లో గుంటూరులో తిరుపతి కవులలో ఒకరైన చెళ్ళపిల్ల వేంకట శాస్త్రి గారి ఆస్థాన కవి పట్ట ప్రదానోత్సవంలో జరిగిన పాండవోద్యోగ విజయాలు నాటక ప్రదర్శనలో శ్రీకృష్ణ పాత్రను అద్వితీయంగా ప్రదర్శించి కవిగారి చేతుల మీదుగా బంగారు కిరీటిన్ని బహుమతిగా అందు కున్నారు.

వారికి జరిగిన సన్మానాలకు, వారు పొందిన బిరుదులకు లెక్క లేదు.

1993 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఫెలోషిప్, తెలుగు విశ్వ విద్యాలయం వారి విశిష్ఠ పురస్కారం, రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి సత్కారం, 1949 లో టంగుటూరి ప్రకాశంపంతులు గారి చేతుల మీదుగా సువర్ణ నటరాజ విగ్రహం స్వీకరణ. నరసరావు పేటలో సువర్ణ ఘంటా కంకణం, 1950 లో విజయ నగరంలో బంగారు కిరీటం, సుదర్శన చక్రం , 1958 లో గుంటూరులో సుదర్శన చక్రం, సాలూరులో బంగారు సింహతలాటాలు. 1958 లో తెనాలిలో సువర్ణ పుష్పాభిఫేకం. స్థానం వారి చేతుల మీదుగా గండ పెండేరం బహూకరణ, 1972లో బాపట్లలో గజారోహణ, నటశేఖర బిరుదు ప్రదానం 1975 లో విశాఖ పట్నంలో తెన్నేటి విశ్వ నాథం గారి చేతుల మీదుగా గండపెండేరం, నటసమ్రాట్ బిరుదు ప్రదానం, 1976 లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాట్య కళా అకాడమీ వారి నుండి నాటక కళా ప్రపూర్ణ బిరుదు స్వీకరణ, .... ఇలా లెక్కకు మించిన బిరుదులు. సత్కారాలు వారిని వరించాయి.

198లో రంగూన్ రౌడీ అనే సాంఘిక నాటకంలో కృష్ణ మూర్తి పాత్ర పోషణతో వీరి రంగస్థల విజయ విహారం మొదలయింది.
ఎన్నో నాటక సంస్థలతో మమేకమై నాటక కళా పురోభి వృద్ధికి వీరు చేసిన సేవ అసామాన్యమైనది.

1979 లో విశాఖ పట్నంలో అక్టోబరు 12, 13, 14 తేదీలలో సాంబ మూర్తి కళామందిరంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జన సంద్రం ఉప్పొంగి పోయింది !

పద్య భావం పూర్తిగా అవగతం కానప్పుడు మాత్రమే నటుడు రాగాన్ని పట్టుకొని వేళ్ళాడతాడు ! అని కుండ బద్దలు కొట్టి నట్టుగా చెప్పిన పీసపాటి వారిని శ్రీ కృష్ణ పాత్రలో రంగస్థలం మీద చూడ లేక పోయిన వారిదే దురదృష్టమంతానూ !

ప్రేక్షక జన సందోహం నుండి నిరంతర ఘోషగా వెల్లువెత్తే ‘‘ వన్స్ మోర్ !’’ లతో నాటకంలోని కథ కించిత్తు కూడా ముందుకుజరగేది కాదనేది వీరి మీద వీరిని , వీరి పద్య పఠనాన్ని అమితంగా అభిమానించే వారు ముద్దుగా చేసే ఫిర్యాదు.

2007 సెస్టెంబరు 28 న ఈ మహా నటుడు శివైక్యం చెందారు. ఆంధ్ర నాటక రంగం ఆనాడు శోక సముద్రమే అయి రోదించింది. ఆంధ్ర జ్యోతి దిన పత్రిక సంపాదకీయమే ప్రచురించింది.

వన్స్ మోర్ ! పీసపాటి వారూ, మళ్ళీ మా కోసం పుట్టరూ ? ‘‘ నాయనా !’’ అని నన్ను ఆదరంగా పిలవరూ ?
‘‘ ఎప్పుడు వచ్చితీవు ’’ అంటూ చిలిపితనంతో, ముద్దుగా రాగయుక్తంగా పలకరించరూ ?

ముఖాన రంగేసుకొని పద్యాలు వినిపించరూ ? మీరు సరేనంటే వన్స్ మోర్ !! లు పలకడానికి వేలాది గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి .

రంగ స్థల పద్య పఠనానికి రంగూ , రుచీ, వాసనా అద్దిన మీరు మళ్ళీ రావొచ్చు కదా ?

పోనీ,‘‘ మా బుగతేడీ ? ’’ అని బిత్తర పోయి అడిగే మీ రాముడు వలస రైతువారీ జనం కోసమయినా
రాకూడదూ ?


1, జనవరి 2012, ఆదివారం

కొత్త జీవితానికో కొండ గుర్తు !




అందరికీ నూతన సంవత్సర ( 2012 ) శుభాకాంక్షలు ... ... మీ కథా మంజరి.

ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభపు దినాన ( ఆమాట కొస్తే, ప్రతి ప్రత్యేక మైన దినాన కూడా ) మనలో చాలా మందిమి ఏవేవో కొ్త్త నిర్ణయాలు మన జీవితంగురించి తీసుకుంటూ ఉంటాము. ( వాటిని అమలు పరచ గలగడం, లేక పోవడం మన సంకల్ప బలం మీద ఆధార పడి ఉంటుంది. అలాగని కొత్త నిర్ణయాలను సంకల్పించు కోకుండా ఉండ లేం కదా! ఉండ కూడదు కూడా!

ఈ అంశం ప్రధాన ఇతి వృత్తంగా తీసికొని 11.4.1979 లో ఆంధ్ర ప్రభ సచిత్రవార పత్రికలో ప్రచురించబడిన నా కథ తిరిగి కథా మంజరి అభిమానుల కోసం ....


31, డిసెంబర్ 2011, శనివారం

సత్య వాక్కు మహిమ



నవ్య వార పత్రిక తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 5-10-2011 దీ సంచికలో ప్రచురితం.




30, డిసెంబర్ 2011, శుక్రవారం

తెనాలి కవి గారి తెలుగింటి అక్క

నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 7-9-2011 దీ సంచికలో ప్రచురితం



29, డిసెంబర్ 2011, గురువారం

గోవర్ధన గిరిధారీ ... !


తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన నవ్య వార పత్రికలో తే 16.11.2011 దీ సంచికలో ప్రచురణ.


28, డిసెంబర్ 2011, బుధవారం

చెప్పండి చూద్దాం ! -3


ఈ క్రింది చిత్రాల ఆధారంగా ఓ ఆరు పదాలకు నానార్ధాలు చెప్పండి చూద్దాం !

1. ఒక్కో పదానికీ రెండేసి నానార్ధాలు చెప్పాలి. కొండొకచో అంత కంటె ఎక్కువ పదాలు కూడా.

2. ఎప్పటి లాగే చిత్రాలు ఒక క్రమంలో ఉంచడం లేదు.
3. చిత్రాలు పూర్తిగా కానీ, చిత్రం లోని కొంత భాగాన్ని కానీ ఆధారంగా తీసుకోవాలి.
4. ఒక పదానికి రెండు కాని అంత కంటె ఎక్కువ కానీ అర్ధాలు కలిగిఉంటే వాటిని నానార్ధాలని అంటారని తెలిసినదే కదా.

ఆరు పదాలూ, వాటికి నానార్ధాలూ చెప్పి అందుకోండి వీరతాడు !

ఇదేం బాగు లేదయ్యా నస బ్లాగరూ ! అంటారా ? సరే, ఇక మానేద్దాం.

ప్రకటన : తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర అతి త్వరలో విడుదల !































ఒక సుళువు: ముందుగా ఈ చిత్రాల లోని సూర్యుడు, ఆకాశం, పద్మం, చెయ్యి, విష్ణువు, తోడేలు ... ఈ పదాలకు పర్యాయ పదాలు చూడండి. అప్పుడు ఆ పదాలకు ఉన్న నానార్ధాలు చెప్పండి చాలు. అంతే. ఎంత వీజీవో కదా !




చెప్పుకోండి చూద్దాం ! - 2


గతంలో ఇలాంటి చిత్ర సమస్యే ఒకటి ఇస్తే, కొంచెం సుళువుగా ఇవ్వొచ్చు కదా ! అని కోప్పడ్డారు.
అంచేత ఇప్పుడు మరీ సుళువుగా ఇచ్చాను. ( మరీ పీ.జీ నుండి కే.జీకి దిగిపోయానేమో)

సమస్య సుళువైనది కనుక క్లూ ఇవ్వడం అనవసరం.

1.చిత్రాలు వరుసగా లేవు. వాటి ఆధారంగా పద్యాన్ని పోల్చుకోండి.
2. ఒకే చిత్రాన్ని అవసరార్ధం మరోమారు ఉపయోగించు కోవచ్చును.
3. చిత్రాన్ని పూర్తిగా కానీ, చిత్ర భాగాన్ని కానీ ఉపయోగించు కోవడం మీ ఇష్టం.












25, డిసెంబర్ 2011, ఆదివారం

హాలాహల భక్షణమ్



నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన వచ్చిన కొన్ని పద్యాలను కథా మంజరిలో లోగడ ప్రచురించాను. ఇప్పుడు దీనిని చూడండి.

తే 07-12-20110 దీ నవ్య వార పత్రికలో ప్రచురణ.


11, డిసెంబర్ 2011, ఆదివారం

కవి గారి రీజనింగు !


మన కవులు వాడే కవి సమయాలు బోలెడు.
స్త్రీలను వర్ణించేటప్పుడు ... అందమైన ముఖాన్ని చంద మామతోనూ, అరవిందం తోనూ పోలిక తెస్తారు.
వారి కురులు మేఘ మాలికలు
నేత్రాలు బేడిస చేపలు. చూపులు తూపులు. కనుబొమలు ధనుస్సులు . నడుము ఆకాశం. దంతాలు తారకలు. తొడలు అరటి బోదెలు. పాలిండ్లు పూర్ణ కుంభాలు. వేణి ఫణి. అధరాలు మధుశాలలు. పెదవులు దొండ పండ్లు. నాసిక సంపెంగ. ఇలా చాలా ఉన్నాయి లెండి. అంగాంగాలకూ ఎవరికి తోచిన పోలికలు వారు చెబుతారు.

ఆ సంగతి అలా ఉంచితే మనం కూడా నిత్య వ్యవహారంలో చాలా పోలికలను వింటూ ఉంటాం.
పొడుగ్గా ఉండే వారిని గెడ కర్రలా ఉన్నాడంటారు. తెలివి హీనుడిని మొద్దు రాచ్చిప్ప అంటారు. లంచాలడిగే వారిని జెలగలంటారు. కష్టపడి పని చేస్తే గాడిద చాకిరీ అంటారు. కష్టాలను కొండలంటారు. నీచులను పాములంటారు.
చక్కని జంటను రతీ మన్మథులంటారు. ముసలి ముత్తయిదవుల జంటను పార్వతీ పరమేశ్వరులాంటారు.
అతి వాగుడిని సుత్తి దెబ్బలంటారు. అందమైన భార్యకు అందవిహీనుడయిన భర్తను చూసి, కాకి ముక్కుకి దొండ పండు అంటూ ఎద్దేవా చేస్తారు. నచ్చని తిను బండారాన్ని ఒట్టి గడ్డి అంటారు. నాయకుల దృష్టిలో జనాలు గొర్రెలు.
చదువూ సంధ్యా లేని వారు అడ్డ గాడిదలు. గయ్యాళి పెళ్ళాలు చుప్పనాతి శూర్పణఖలు. చలి పులిలా మీద పడుతోందంటారు. ధారాపాత వర్షాన్ని కుంభపోత అంటారు. కదలని ఫైళ్ళవి నత్త నడకలంటారు. కొందరు ఆఫీసర్లని అగ్గి రాఁవుళ్ళంటారు అబద్ధాలాడే వారిని అబద్ధాల పుట్ట అంటారు. దీర్ఘ కోపిది పాము పగ అంటారు. పేరు గొప్పా ఊరు దిబ్బా అయితే నేతి బీర కాయ చందం అంటారు. ఎప్పుడూ తన లోకం తనదేలా ఉండే వాడిని నూతి లోని కప్ప అంటారు. నిరక్షర కుక్షిని పశువంటారు. వాచాలుని వస పిట్టతో పోలుస్తారు. మౌనంగా ఉండే వాడిని ముని అనో, ముంగి ముషాణమనో అంటారు.

ఇలా చెబుతూ పోతే, చాలా ఉంటుంది. చెప్పడానికి చేంతాడంత !

ఇంత వరకూ రాసిన టపాని ఎప్పటి లాగే నా వెనుక వంగుని చూస్తున్న మా తింగరి బుచ్చి‘ బాగుందిరా ! ’అని మెచ్చుకున్నాడు. మా యింట కాఫీ టిపిన్లు సేవించి కబుర్లు చెప్పే వాడి నోట మొదటి సారి మెచ్చుకోలు మాట విని నేను ఆనంద పరవశుడి నయ్యాను. ఇంత లోనే,‘‘ అవును ! మన వాళ్ళు భలే పోలికలు తెస్తార్లే. కవులను ఎద్దులతో పోలుస్తారు కదా ! ’’ అని తనవిఙ్ఞాన భాండారంలో నుండి ఒక అమూల్యమైన విషయాన్ని ప్రస్తావించేడు. నా తల తిరిగి పోయింది.

‘‘ ఏఁవిటీ, కవులను ఎద్దులంటారా! ’’ అన్నాను, కంగారుగా.

‘‘ మరే, కవి వృషభులనే మాట నువ్వు విన లేదా ! ’’ అని నా తెలివి తక్కువ తనం మీద జాలి చూపించాడు.

కథా మంజిరి (ఏకైక నస బ్లాగు) బ్లాగుని మూసెయ్యా లన్నంత విరక్తి కలిగింది నాకు !

మా తింగరి బుచ్చి గాడి గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ, ఒక కవి గారు ఒక శ్లోకంలో ఎలాంటి రీజనింగు తీసారో చూడండి:

మనం లోకంలో మంచి వారి మనసు వెన్నతో సమానం అంటూ ఉంటాం కదూ. ఆ కవి కాదు పొమ్మంటున్నాడు.

కవి గారి రీజనింగు ఏమిటో మీరే చూడండి:


సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయ స్తదళీకమ్.

దీని అర్ధం : మంచి వారి మనస్సు వెన్న లాంటిదని కవులు చెబుతూ ఉంటారు. ఆ మాట అబద్ధం !
ఎందు కంటే, ఇతరుల మనో దుఃఖానికి మంచి వారి మనసు కరిగి పోతుంది. కానీ, కానీ, వెన్న కరుగదు కదా !

ఈ రీజనింగు చూసి ఈ కవి గారు మా తింగరి బుచ్చికి తమ్ముడనుకునేరు ! కాదు సుమా !

ఇది వినోక్త్యలంకార భేద మనుకుంటాను.



8, డిసెంబర్ 2011, గురువారం

పరీక్షా సమయమ్ - 1.


‘‘ ఎప్పుడూ శ్లోకాలూ , పద్యాలూ, కవితలూ కథలేనా ? నీ కథా మంజరిలో మామూలు విషయాలేవీ పెట్టవ్
కదా ! ’’ అని విసుక్కున్నాడు మా తింగరి బుచ్చి.

‘‘ ఏం పెట్టమంటావ్ ? ’’ అడిగేను కొంచెం నీరసంగా.

‘‘ పోనీ నా జీవిత చరిత్ర రాసి పెట్టెయ్ ’’ అని సలహా ఇచ్చేడు. ‘‘తింగరి బుచ్చి జీవిత ప్రస్థానం’’అని దానికి వాడే ఓ పేరు కూడా పెట్టీసేడు.

తన జీవిత చరిత్ర రాయక పోతే కథా మంజరి జన్మ చరితార్థం కానేరదని దబాయించేడు కూడానూ.

నా పుణ్యం పుచ్చి పోయి, నా పాపం పండి, నా మెదడు మొద్దుబారి పోయి, ఏం రాయడానికీ తోచక ఆలోచన గడ్డకట్టి నప్పుడు - అప్పుడు రాస్తాను కాబోలు , మా తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర.

సరే, వాడి దాడి నుండి తాత్కాలికంగా నయినా తప్పించు కోడానికి ఈ పరీక్షా సమయమ్ - 1 పెడు తున్నాను.

ఇప్పు డంటే బ్లూ టూత్ లూ, సెల్ ఫోన్లూ లాంటి అత్యాధునిక పరికరాలేవో ( నాకు తెలీనివి) వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో పరీక్షలు రాసే పిలకాయలకి పాపం ఇవేమీ అందు బాటులో ఉండేవి కావు.

చిన్న చిన్న కాగితాలు చింపుకొని వాటి మీద జవాబులు ఓపిగ్గా రాసుకొచ్చే వారు. వాటిని స్లిప్పులనీ, చిట్టీలనీ అంటారు.

రహస్యంగా వాటిని తమ శరీరాల మీద బట్టల్లోనో, చెప్పుల్లోనో, చొక్కా మడతల్లోనో - వివిధ రహస్య స్థావరాలలో దాచుకొచ్చే వారు. సంప్రదాయానికి విలువ నిచ్చే విద్యార్ధులు ఇప్పటికీ ఈ ప్రాచీన పద్ధతులనే అవలంబిస్తున్నారనుకోండి ! అలా తెచ్చిన చిట్టీలని దొంగ చాటుగాతీయడం ఓ కళ. పట్టుబడితే కాళ్ళా వ్రేళ్ళా బ్రతిమాలడం . జాలీ దయా లేని దుర్మార్గులైన వాచర్లయితే డిబారయి పోవడం.

చిట్టీలు రాసే విద్యార్ధి కళా కారుల హక్కులను కాపాడడం కోసం ఉద్యమించాలని ఉందని మా తింగరి బుచ్చి గాడు లోగడ ఓ సారి ఎప్పుడో అన్నట్టు గుర్తు.

విద్యార్ధులకు ఈ చిట్టీలు అందించే పనిలో చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. పరిగెత్తడం, గోడలు దూకడం, అటెండర్లను మంచి చేసు కోవడం లాంటి చాలా నైఫుణ్యాలు వీరికి ఉండాలి.

ఇక, పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ మనం పాపం పిలకాయలనే ఆడి పోసుకుంటూ ఉంటాం కానీ, ఈ విషయంలో కాపీయింగ్ చేయించడానికి అత్యుత్సాహం ప్రదర్శించే టీచర్లూ ఎక్కువే.

పరీక్షల్లో విద్యార్ధులకు జవాబులు అందిస్తూ వారికి మంచి మార్కులు వచ్చేలా చూసి, వారి నుండి మంచి మార్కులు కొట్టెయ్యాలనే యావ కొంతమంది టీచర్ల లో ఉంటుంది. వారు పరోపకార పరాయణుల గానూ, మంచి సారు వారుగానూ, పిల్లలంటే దయాపరులుగానూ మన్ననలు అటు విద్యార్ధులనండీ, వారి తల్లి దండ్రలు నుండీ తరుచుగా పొందుతూ ఉంటారు ( అడపా దడపా క్వార్టరో, హాఫో బాటిల్స్ , చిరుకానుకలతోసహా)

ఇలాంటి పరోపకారి పాపన్నలాంటి ఓ టీచరు పరీక్ష హాల్లో ఇంగ్లీషు పరీక్ష నాడు ఇన్విజిలేషను చేస్తున్నాడు.
తన ఉదారతనూ, వివేకాన్నీ, ఇంగ్లీషు భాషా ప్రావీణ్యాన్నీ పరీక్ష గదిలో పిలకాయల ముందు ప్రదర్శించాలని మనసు ఒకటే తొందర పడుతోంది. నోరు మహా దురద పెడుతోంది.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు ఇచ్చే వేళవుతోంది. రెడీగా ఉండండి. జవాబులు చెబుతాను. మళ్ళీ చెప్పమని అడగకుండా గబగబా రాసెయ్యాలి. ’’ అని హెచ్చరించాడు.

బిట్ పేపరు అందరికీ పంచేడు. గుసగుసల స్వరంతో జవాబులు చకచకా చెబుతున్నాడు. ఆ ఇంగ్లీషు బిట్ పేపరులో ఓ నాలుగు ఖాళీలలో ప్రిపోజిషన్స్ ( Prepositions ) నింపాలి. టీచరు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఖాళీల్లో వరుసగా
In,TO,IN,TO లు రాయండ్రా అని చెప్పాడు. ఇంకే ముంది, విధేయులైన పిలకాయలు గబగబా రాసి పారేసారు.
చూస్తే అందరి పేపర్ల లోనూ ఆ ఖాళీలలో నాలుగింటి లోనూ X గుర్తులే వేసి ఉన్నాయి !

మరో సారి మరో వాచరు గారు పిల్లలకి మామ్మూలుగా చెప్పే హెచ్చరికలతో పాటూ ఇంకా ఇలా చెప్పాడు.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు జవాబులు చెబుతాను గానీ బొత్తిగా అందరకీ ఒకేలా 20 కి 20 వస్తే బాగోదు. అంచేత కావాలనే రెండో, మూడో నేను చెప్పినవి కాకుండా తప్పు జవాబులు రాసెయ్యండి. ఏం ?’’ అని చెప్పి అలా చెయ్యని వాళ్ళ తాట వలిచేస్తానని ప్రతి ఙ్ఞ కూడా చేసాడు.

ఆరోజు సోషలు పేపరు. ఖాళీలు పూర్తి చేయవలసిన వాటిలో ఒక ప్రశ్న ఇలా ఉంది : ‘‘ ఒరిస్సాలో ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి వారి ఆలయం ----- లో ఉంది.’’

ఆ ఖాళీలో ‘‘ పూరీ’’ అని రాయమని మన మంచి సారు వారు చెప్పడంతో అంతా మహదానందంతో అలాగే రాసేసారు.

కొంత మంది పిల్లలు మాత్రం , టీచరుగారి హెచ్చరికల మీద, మాట మీద గౌరవంతోనో, వారి గుస గుసల స్వరం వినిపించక పోవడంచేతనో, తెలీక పోవడం చేతనో, టీచరు ముందుగా చెప్పిన విధంగా పూరీ అని కాక, దానికి బదులుగా చపాతీ అని రాసేరు.

పేపర్లు దిద్దే స్పాట్ వేల్యుయేషన్ లో వాటిని దిద్దుతున్న టీచరు గారు పూరీ అనే ఆన్సరున్న వాటికి వరసగా రైట్ టిక్కు పెట్టి మార్కులు వేస్తున్నాడు. ఆ పనిలో అతను చాలా బిజీగా ఉన్నాడు. యంత్రంలా పని చేసుకు పోతున్నాడు. కొన్ని పేపర్లో ఆ బిట్ కి కొందరు పూరీ అనీ కొందరు చపాతి అని రాయడంతో జెట్ వేగంతో కదులుతున్న అతని ఎర్ర ఇంకు కలానికి బ్రేకు పడింది. చికాగ్గా దిద్దడం ఆపి, ఛీఫ్ ఎగ్జామినర్ ని అడిగాడు : ‘‘ సారూ ! ఈ బిట్ కి కొందరు పూరీ అనీ, కొందరు చపాతీ అని జవాబులు రాస్తున్నారు. దేనికి మార్కులు వేయమంటారు ?’’ అని.

పరాగ్గానో, చిరాగ్గానో ఉన్న ఆ ఛీఫ్ సారు :

‘‘ రెండూ తయార్యేది ఒకే పిండితో కదా. ఎలా రాసినా మార్కు ఇచ్చెయ్యండీ ’’ అని జవాబిచ్చేరు.

అయ్యా ఇదీ సంగతి.

చివరిగా ఒక కొంటె కవిత:

ముందు వాడు రాసిందంతా
మక్కీకి మక్కీ కాపీ కొట్టేడు పుల్లారావు
అయినా జీరో మార్కుల కన్నా ఎక్కువ రానే రావు !
ఎందుకబ్బా ! అని ఆశ్చర్య పోకండి.
ముందు వాడు రాసిందంతా క్వశ్చెన్ పేపరే కదండి !

మరిన్ని ముచ్చట్టు పరీక్షా సమయమ్ - 2 లో.