13, నవంబర్ 2013, బుధవారం

శునక పురాణం



‘‘ ఛీ ! కుక్క వెధవా ! ’’ అని ఎవరి మీద నయినా కోపం వొచ్చి నప్పుడు తిడతాం కానీ, శునక పురాణం చదివితే శునక జాతిని అలా కించ పరుస్తూ తిట్టడం ఎంత తప్పో తెలుసు కుంటాం. మానవ జాతి చరిత్ర మనుషుల కున్నట్టే, కుక్కల చరిత్ర కుక్కలకూ ఉంటుంది.ఆ కుక్కల చరిత్ర అంతా వాటికి వన్నె తెచ్చేదే కాక పోయినా వాటికంటూ ఓ చరిత్ర ఉంది కదా. ఆ సంగతి తెలుసు కోవాలి.

శునక పురాణం అనే శీర్షికను చూసి కథా మంజరి తిక్కల బ్లాగరు అష్టాదశ పురాణాలనూ అపనిందలపాలు చెయ్య బోతున్నాడని మాత్రం అనుకో వద్దు. ఇది కేవలం శుకములను గూర్చిన గుది గుచ్చిన భోగట్టాల సమాహారం. అంతే.


కుక్కకు చాలా సర్యాయ పదాలు ఉన్నాయి. చూదాం. కుక్క. శునకము,జాగిలము, నాయి. వే(బే)పి లాంటి తెలిసిన పదాలే కాక, శ్వానము,అలిపకము,అస్తిభిక్షము,కుక్కురము ,సారమేయము

.సూచకము,జిహ్వానము,కౌలేయకము,కంకశాయము వృకరాతి ... లాంటి చాలా పదాలకు కుక్క అనే అర్ధం.దులో మరీ, అడ కుక్కకి కుక్కురి, శుని అని పేర్లున్నాయి. వేట కుక్కకయితే ఆఖేటికము,ఉడుప కుక్క,మోరపడము లాంటి పేర్లున్నాయి.కుక్క భౌ భౌ అని అరుస్తుందని మనకు తెలుసు కానీ, కుక్క అరుపును భషణము, మొఱగుడు అని కూడా అంటారు. వీటి మాట కేం గానీ, కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. చాలా జాతులు ఉన్నాయి
, దేశవాళీ కుక్కలు, విదేశీ జాతుల కుక్కలూ కూడా ఉన్నాయి. విదేశీ కుక్కలకే మన్నన ఎక్కు కదా !సౌమ్యాకారులూ, అతి భీకరాకరులూ అయిన కుక్కలూ ఉంటాయి. జాతి కుక్కలూ, వీధి కుక్కలూ. గజ్జి కుక్కలూ , పిచ్చి కుక్కలూ లాంటి శునక జాతి భేదాలూ ఉంటాయి.. పిల్లల కున్నన్ని కాక పోయినా కుక్కలకూ చాలా వరైటీ పేర్లు ఉంటాయి. అందులో టామీ అనే పేరు మన అప్పారావు అనే పేరులాగా చాలా ప్రసిద్ధం.
 కుక్కలు చాలా విశ్వాస  పాత్రమైన  జంతువులు అన్నమాట నిజమే కానీ అవి ఎంచేతనో తమ విశ్వాస గుణాన్ని కాస్సేపు ప్రక్కన పెట్టి, యజమానినే కరచిన సంఘటనలూ అక్కడక్కడ చోటు చేసుకోవడం కాదన లేని సత్యం.కారణాల కోసం పెద్దగా అన్వేషించ నక్కర లేదు. ఎంతయినా కుక్క బుద్ధి కుక్క బుద్ధే కదా ?!


మొరిగే కుక్క కరవదని ఒక సామెత. దీనికి రుజువులూ సాక్ష్యాలూ చూపడం కష్టం. మొరిగే కుక్కల దగ్గరకి వెళ్ళి కరుస్తుందో, లేదో గమనించే సాహసం చెయ్యలేం కదా,

కొన్ని కుక్కలు విస్సాకారంగా మన మీద ఓ లుక్కు వేసి ఊరుకుంటాయే కానీ మొరగవు. బోలెడు డబ్బులు పోసి పెంచు కుంటున్నా, జబ్బుల లొస్తే కుక్కల ఆసుపత్రులకు తీసికెడుతున్నా అవి మాత్రం కిమన్నాస్తిగా ఉండి పోతాయి. చిన్న గుర్రు కూడా పెట్టవు. దొంగలను చూసి మొరగని కుక్కలు అవేం కుక్కలు ? తిండి దండగ
 కాకపోతే.

వెనుకటికి వో చాకలి ఇంట ఓ కుక్కా, గాడిదా ఉండేవిట. యజమాని తనకి సరైన తిండి పెట్టకుండా. సరిగా చూడకుండా ఉన్నాడనే ఉక్రోషంతో ఓ రాత్రి చాకలి ఇంట దొంగలు పడితే మొరగ కుండా ఉండి పోయిందిట. దాంతో కుక్క చేయ వలసిన డ్యూటీ గాడిద తన నెత్తిన వేసుకుని యజమానిని నిద్ర లేపుదామని ఓండ్ర పెట్టిందిట. చాకలి నిద్రా భంగమైనందుకు కోపంతో గాడిదని చావబాదాడట. ఈ కథ వలన తెలుసుకోవలసిన నీతి మాట అటుంచితే, పెంపుడు కుక్కలకు కూడా కోపతాపాలు ఉంటాయనీ, యజమానికి అవి సర్వ కాల సర్వావస్థల లోనూ విశ్వాస పాత్రంగా ఉంటాయనీ గుడ్డిగా నమ్మడం కూడా పొరపాటే అని గమనించాలి.

కుక్కలకు ఏకైక ప్రబల శత్రువు మ్యునిసిపాలిటీ వారి కుక్కకల బండి. వీధిలో కనిపించే ప్రతి ఊర కుక్కనీ బండిలో  పడేసి పట్టుకు పోతూ ఉంటారు

గొప్పింటి వారు తమ ఇళ్ళ గేట్ల ముందు ‘‘ కుక్క లున్నవి జాగ్రత్త ’’ అని బోర్డులు  వేలాడదీస్తూ ఉంటారు.

పోస్టు జవాన్లకూ, పేపరు కుర్రాళ్ళకూ అలాంటి ఇళ్ళలో ఉండే కుక్కల వలన ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.

పోలీసు కుక్కలు ప్రత్యేక శిక్షణ  పొందిన కుక్కలు . నేర ప్రాంతాన్ని మూచూసి, వాసన పసిగట్టి నేరస్థులను పట్టు కోవడంలో ఇవి రక్షక భటులకు సహకరిస్తాయి

ఇన్ని కుక్కల గురించి చెప్పి, పాత కాలం నాటి హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ ఫోను ముందు కనిపించే కుక్క గురించి చప్పక పోతే భౌ ! భౌ ! మని కసురు కోదూ ?

మహా భారతంలో కనిపించే కుక్క పేరు సరమ. రాక్షసులనుండి తమ గోగణానికి కాపలాగా దేవేంద్రుడు సరమ అనే కుక్కను ఉంచేడు. అయితే రాక్షసులు దానికి పాలు పోసి మచ్చిక చేసుకుని గోవులను అపహరించుకు పోయే వారు. దానితో ఇంద్రుడు గోవులు ఏమౌతున్నాయని సరమను అడిగేడు. అది చెప్పడానికి భయపడి పోయింది. దానితో ఇంద్రుడు దాని డొక్కలో తంతే పాలన్నీ కక్కీసి, పారి పోయింది.ఇంద్రుడు దానిని తరుము కుంటూ హిమాలయాల వరకూ వెళ్తే అక్కడ రాక్షులు కనిపించేరు. వారిని వధించేడు. ఇదీ కథ. దీని వలన కూడా కుక్కలు మరీ అంత విశ్వాస పాత్రులైనవి కావేమో అనే సందేహం కలుగక మానదు. పైచ్చు అవి శత్రువు నుండి లంచాలు మేయడానికి కూడా సిద్ధ పడి పోతాయని అనిపిస్తోంది.

అందుకే లంచాలు మేసే వెధవలంతా కుక్కలతో సమానమని కథా మంజరి బ్లాగరు తీర్మానించు కున్నాడు.

మహా భారతంలో మరొక కుక్క ప్రస్తావన సుప్రసిద్ధమే. పరీక్షిత్తుకు పట్టం కట్టేక ధర్మరాజాదులు బొందితో కైలాసానికి బయలు దేరారు. వారిని ఓ శునకం వెంబడిస్తూ నడిచింది, మార్గ మధ్యంలో మొదట ద్రౌది, తరువాతసహ దేవుడు, నకులుడు,భీముడూ అర్జునుడూ వరసగా నేలకు కుప్పకూలి పోయేరు. ధర్మ రాజు వెను తిరిగి చూడ లేదు. వారంతా అలా పడి పోవడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఇంద్రుడు ఎదురొచ్చి తన నగరుకి రమ్మని ధర్మరాజుని ఆహ్వానించేడు. తన వెంట వస్తున్న కుక్కని విడిచి రాననీ. అది పాపమనీ ధర్మరాజు పలికేడు. అప్పుడా కుక్క తన నిజరూపు చూపి నిలిచింది. అతడే ధర్ముడు. ధర్మజుడు ధర్మ తత్పరుడు కనుక ధర్మం అతని తుదకంటా నిలిచిందని ఫలితార్థం.

కాల భైరవ స్వామి అంటే శునక రూపంగా భావించ కూడదు. కాలము అంటే నలుపు. నల్లని రూపు కలవాడు. విశ్వాసానికి పేరందిన ఒక కుక్క స్వామి వాహనం శునకం.

దత్తాత్రేయ స్వామి వారి వద్ద ఎప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలకు ప్రతీకలు. స్వామి వేద మూర్తి. స్వామి మూడు ముఖాలూ  సృష్టి, స్థితి, లయకారుల స్వరూసాలు

బళ్ళారి రాఘవ ఒకసారి గుడివాడలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నప్పుడు కాటి సీనులో ఎక్కడి నుండో ఒక కుక్క స్టేజీ మీదకు అకస్మాత్తుగా ప్రవేశించిందిట. అంతా అవాక్కయి పోయేరు. ప్రేక్షకులు గొల్లున నవ్వేరు. రాఘవ సమయస్ఫూర్తితో నాటకంలో లేని ఓ డైలాగు ... ‘‘ ఓ శునక రాజమా !నీకును నేను లోకువయిపోతినా; పొమ్ము ’’ అని దానిని అదిలించే సరికి అది అక్కడి నుండి పారి పోయిందిట. ఈ విధంగా మహా నటుడు రాఘవ ఆ నాటి నాటకం రసాభాసం కాకుండా చేసారుట.

యండమూరి వీరేంద్రనాథ్ ఏ కంగా కుక్క అనే ఓ నాటికనే రాసేడు.

రావి కొండల రావు గారి కుక్క పిల్ల దొరికింది నాటిక చాలా మందికి తెలిసిన గొప్ప హాస్య నాటిక.
కుక్కలను విశ్వాసపాత్రంగా చూపించిన రాము లాంటి తెలుగు హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి.
Ramu-poster.jpg
 అలాగే విఠలాచార్య సినిమాలలో హీరోయో, హీరోయనో అకస్మాత్తుగా కుక్కగా మారిపోయే సందర్భాలూ ఉంటాయి.
విజయా వారి పాతాళ భైరవిలో కూడా ఒక  కుక్క మనకి  గుర్తండే ఉంటుంది. ఇలా తెలుగు సాహిత్యంలో కుక్కల ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది.

Telugucinemaposter patalabhairavi 1951.JPG

కుక్కలకి ప్రాధాన్యత ఇచ్చి తీసిన ఇంగ్లీషు  సినిమాలు కొల్లలు కనిపిస్తాయి.




మరి కొన్నింటిని చూద్దాం ...


కనకపు సింహాసనమున
శునకముఁగూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !

అని. బద్దెన సుమతీ శతకంలో కుక్క బుద్ధిని ఎండ గట్టేడు. ఆ వంకతో కొందరు మనుషులు నైజాన్ని చాటి చెప్పేడన్నమాట.

కుక్కలు చెప్పులు వెతుకును అని ఊరికే మనవాళ్ళు అన లేదు కదా ? అది దాని నైజ గుణం మరి.


భర్తృహరి సుభాషిత త్రిశతిలో ఒక శ్లోకంలో కుక్కల నైజం ఇలా వర్ణించి చెప్పాడు

లాంగూల చాలన మధుశ్చరణావఘాతం
భూమౌ నిత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చభుక్తే.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం చూడండి:

వాలము ద్రిప్పు, నేలబడి వక్త్రము, కుక్షియుఁజూపు, క్రిందట
బడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్రశుం

డాలము శాలితండు లగు పిండంబుల చాటు వచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్యగుణయుక్తిఁగఁజూచు మహోన్నత స్థితిన్

దీని భావం ఏమిటంటే, కుక్క తనకి ఆహారం పవడేసే వాడి ఎదుట నానా వికారాలూ పోతుందిట. వాడి ఎదుట నిలబడి తోక ఊపుతుంది. నేల మీద దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేలను తవ్వుతుంది. కాని భద్ర గజం అలా కాదు. ఆ తినేదేదో మురిపించుకుని మురిపించుకుని మరీ తింటుంది. అదీ ధీరుల లక్షణం అంటాడు కవి.

అంతే కదా, కుక్క కుక్కే , ఏనుగు ఏనుగే. దారంట ఏనుగు పోతూ ఉంటే కుక్కలు ఊఁ... అదే పనిగా మొరుగుతాయి. వాటి వలన ఏనుగుకి వచ్చే లోటు ఏమీ ఉండబోదుకదా,

శ్రీనాథుడు ఓ చాటువులో ఇదే చెప్పాడు

సర్వఙ్ఞ నామధేయము
శర్వునికే, రావుసింగ భూపాలునికే
యుర్విం జెల్లును, తక్కొరు
సర్వఙ్ఞుండనుట కుక్క సామజ మనుటే

ఈ పద్యంలో సర్వఙ్ఞుడనే పేరు శర్వునికే తప్ప సింగభూపాలుడికి చెల్లదనే గూఢార్ధం ఉందని, రాజాగ్రహం చల్లార్చడం కోసం శర్వునికీ, రావుసింగభూసాలునికి మాత్రమే సర్వఙ్ఞుడనే పేరు తగునని కవి సమర్ధన చేసాడనీ అంటారు.

కొంతమంది డబ్బుదేం ఉంది కుక్కను తంతే రాలుతుందనడం కద్దు. నిజానిజాలు పైవాడి కెరుక. పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు ఇవ్వాలన్నది మాత్రం ఖాయం. అందు వల్ల డబ్బులు రాలడం కోసం కుక్కలను తన్నే సాహసం చెయ్య వద్దని కథామంజరి విఙ్ఞప్తి చేస్తోంది.

సరే, కుక్కల ప్రస్తావన వచ్చిన మరో పద్యం చూడండి:

నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూర పంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.

కొంత మందికి అన్నింటి లోనూ దోషమే కనబడుతుందతి కానీ ఒక్క మంచీ కనబడదని దీని సారాంశం.

వేమన కూడా

అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డ వారి నెల్ల తొలగ గొట్టు
చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ

అని చెప్ప లేదూ ? !

శునక: పుచ్ఛమివ వ్యర్ధం లుబ్ధస్య పరి జీవనం
నహి గుహ్యా గోపాయచ, నచ దంశ నివారణే

అంటే, కుక్క తోక దాని సిగ్గును అది దాచు కోడానికీ, ఈగలను తోలుకోడానికీ కూడా పనికి రాదు. అలాగే లోభి వాడి ధనం కూడా ఎందుకూ పనికి రాదు. కుక్క తోక వంకర కదా

ఇదే భావాన్ని మా అన్నగారు పంతుల గోపాల కృష్ణరావు తన కందాలూ, మకరందాలూ లో ఆట వెలదుల అనుబంధంలో ఒక ఆట వెలది పద్యంలో ఇలా చెప్పేరు:

కుక్క తోక చూడ కటిలమై యుండును
దాని శీల మదిమె దాచ లేదు
తోల లేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె.

ఎంత ఇల్లాలయినా. వొసే పెద్దమ్మా, దరిద్ర గొట్టుదానా ! అని నర్మ గర్భంగా పిలిస్తే తెలివైన ఇల్లాలు ఊరుకుంటుందా ? అంతే దీటుగా నర్మ గర్భంగా తల వాచి నోయే లాగున బదులిస్తుంది.

ఆ వైనం చిత్తగించండి ...

పర్వతశ్రేష్ఠ నుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాముఅత్తను గన్న తల్లి
పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ,
సున్నమించుక తేగదే సుందరాంగి

సుష్ఠగా భోంచేసి తాంబూలం వేసుకోవాలనుకున్నాడు భర్త. పెట్టెలో అన్నీ ఉన్నాయి కానీ సున్నం లేదు. భార్యని ఇలా ముద్దుగా కేకేసి అడిగాడు
పర్వత నాజు పుత్రిక పార్వతీ దేవి. మె భర్త శివుడు. అతని విరోధి మన్మధుడు. అతని అన్న బ్రహ్మ. అతని భార్య సరస్వతి. ఆమె అత్త లక్ష్మి మెను కన్నతల్లి గంగ. ఆమె ముద్దుల బిడ్డ పెద్దమ్మ. ఒసే దరిద్రగొట్టు పెద్దమ్మా కాస్త సున్నం తేవే అని దీనర్ధం

ఆవిడ అంతే నర్మ గర్భంగా జవాబిస్తూ సున్నం తెచ్చి మగడికి అందించింది.

శతపత్రంబుల మిత్రుని
సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్
సతతముఁదాల్చెడు నాతని
సుతువాహన ! వైరి వైరి సున్నంబిదిగో !

శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు. అతని కుమారుడు కర్ణుడు. అతడిని చంపిన వాడు అర్జునుడు. వాని బావ శ్రీకృష్ణుడు,అతని కొడుకు మన్మధుడు. అతని మామ చంద్రుడు. అతనిని తలపై ధరించే వాడు శివుడు. అతని కొడుకు వినాయకుడు. అతని వాహనం ఎలుక. దానికి విరోధి పిల్లి. దానికి వైరి కుక్క ! ఒరే కుక్క వెధవా సున్నం ఇదిగోరా అని నర్మ గర్భంగా తిట్టి పోసిందా మహా ఇల్లాలు.

శునక పురాణం గురించి చెప్పేటప్పుడు అంతరిక్ష ప్రయాణం చేసొచ్చిన లైకా అనే కుక్క పిల్లను తలచుకోవడం ఎంత అవసరమో, మన పతంజలి గారి బొబ్బిలి అనే కుక్కని గురించి తలుచుకోక పోవడం చాలా దారుణం. దానంత దండగమారి కుక్క లోకంలో మరోటి ఉండబోదు. రాజుల లోగిళ్ళలో పడి తెగ మేసిన పనికిమాలిన కుక్క అది. రాజులతో వేట కెళ్ళి ఎన్ని దొంగ వేషాలు వెయ్యాలో అన్నీ వేసిన కుక్క అది. దాని వైభోగం, దాని బుద్ధికుశలత, దాని యవ్వారం వగైరాల గురించి తెలుసు కోవాలంటే పతంజలి గారి వీర బొబ్బిలి, గోపాత్రుడు చదవాల్పిందే మరి.

ఇక, చివరగా కుక్కల మీ ఉన్న సామెత లేమిటో కొంచెం చూదాం. చాలా ఉన్నాయి లెండి.

1.కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదుకదా
2.కుక్క అతి మూత్రం,బంధువైరం లేకుంటే గంటకు ఆమడ దూరం పోనా అందిట !

కనబడిన చోటెల్లా ఆగి, కాలెత్తి ఉచ్చ పోయడం కుక్కల అలవాటు. అలాగే దారంట కనబడిన ప్రతి కుక్కతోనూ జట్టీ పెట్టు కోవడం కూడా దాని అలవాటు. ( తానొచ్చిన దారి వాసన బట్టి గుర్తుంచు కోవడం కోసం అలా చేస్తుంది) కుక్కకున్న ఈ లక్షణాలను చూసి ఈ సామెత పుట్టింది.
3.కుక్క ఉట్టెలు తెంచ గలదు కాని కుండలు పగులకుండా ఆప గలదా ?
4.కుక్క గోవు కాదు. కుందేలు పులి కాదు.
5.కుక్క కాటుకి చెప్పు దెబ్బ
6.కుక్కకు ఏం తెలుసు మొక్క జొన్నప రుచి ?
7.కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు.
8.కుక్కకు కూడా కలసి వచ్చే కాలం ఉంటుంది.
9.కుక్కకు కూడు పెడితే కుండకు ముప్పు
10.కుక్కకు జరీ కుచ్చులు కట్టినట్టు
11.కుక్కలు చింపిన విస్తరిలా ఉంది కాపురం
12. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు
13.కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.
14.కుక్క బుద్ధి దాలికుంటలో ఉనేనంతసేపే
15.కుక్క కనబడితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క కనబడదు.
16. మొరగ నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందిట.

ఇవి కాక చివరగా ఓ ఏ సర్టిఫికేటు కుక్కల సామెత కూడా ఉంది.

16. కుక్క ఎక్క లేక కాదు చచ్చేది. పీక్కో లేక !

ఇక, కుక్క బతుకు, కుక్క చావు లాంటి జాతీయాలు మనకి తెలిసినవే.


అయ్యా, ఇదీ శునక పురాణం. చెప్పుకోవాలంటే ఇంకా చేంతాడంత ఉంది.

ఇక శలవ్.












22, అక్టోబర్ 2013, మంగళవారం

విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ


విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ ఇవాళ  ( 22.10.2013 ) అంగరంగ  వైభవంగా జరుగుతోంది. ప్రతి యేటా జారిగే ఈ జాతరకు రాష్ట్రం నలు మూలల నుండీ జనం అశేషంగా తరలి వస్తారు.

ఉత్తరాంధ్ర కల్ప వల్లి పైడి తల్లి






పైడి తల్లి అమ్మ వారి గుడి.. ఇది కోటకు సమీపంలో మూడు లాంతర్ల వద్ద ఉంది.



విజ యగరం కోట


ఇదే సిరిమాను. ఈ సిరిమాను అమ్మ వారి జాతర నాడు కోట నుండి అమ్మ వారి గుడి వరకూ ముమ్మారు తిరుగుతుంది, పూసపాటి రాజ వంశీయులు, ప్రజా ప్రతినిథులు, అధికారులు, అశేష ప్రజానీకం  ఈ సిరిమానునుని దర్శించు కోడానికి తహతహలాడుతారు.



విజయ నగరం గంట స్తంభం


సిరిమానోత్సవానికి చెందిన  వీడియో ( లోగడ తీసినది) చూడండి ....


8, సెప్టెంబర్ 2013, ఆదివారం

గణపతి కథ ..


అందరకీ వినాయక చవితి శుభాకాంక్షలు ... మీ కథా మంజరి.

మిత్రుడు ఓలేటి శ్రీనివాసభాను రాసిన గణపతి స్తుతి   చదవండి .. వినండి ..

ఇలాంటి చక్కని రచనలు మరిన్ని హాయిగా చదువుకొని ఆనందించాలంటే వెంటనే  గో తెలుగు డాట్ కామ్ కి    ( go telugu.com) కి వెళ్ళండి ...


అమ్మ పార్వతి జలకమాడగానెంచి
నలుగు పిండిని తాను బొమ్మగావించి
ఊపిరులు ఊదింది .. వాకిటను నిలిపింది
శంకరుని రాక తో కథ మలుపు తిరిగింది

అప్పుడే ఎదిగిన ఆ చిన్ని తండ్రి
తన కన్న తండ్రినే ద్వారాన నిలిపి
శూలి వేటుకు నేల కూలిపోయాడు
హస్తి ముఖమున తిరిగి లేచి నిలిచాడు

గుజ్జు రూపానికి బొజ్జొకటి  తోడు
వంకగా నెలవంక నవ్వుకొన్నాడు
గిరిజ కోపించింది శశిని శపియించింది
పాము మొలతాడుగా పనికి కుదిరింది

అన్ని లోకాలనూ తిరిగి రావాలి
తొలుత వచ్చిన వాడె నేత కావాలి
అమ్మ నాన్నలను  ముమ్మార్లు చుట్టి
గణనాథుడైనాడు పేరు నిలబెట్టి

చిటిబెల్లమిస్తేను  సిరులు కురిపించు
గరిక పోచే చాలు కరుణ చూపించు
ఇల లోన తొలి  పూజ  ఇంపుగా నీకె
విఘ్నాలు తొలగించి విజయాల నీవె




3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఏం దారి దేవుడా ...



కరవ మంటే కప్పకి కోపం

విడువ మంటే పాముకి కోపం

ఏం దారి దేవుడా.



ముందుకో వెనక్కో

ఒక్క అడుగు వేద్దామంటే

ముందు నుయ్యి

వెనుక గొయ్యి

ఏం దారి దేవుడా.



అత్త గారి కోక వొసిలిందంటే

కోపం

వొసల లేదంటే కోపం

ఏం దారి దేవుడా.



గోచీకి తక్కువా

గావంచాకి ఎక్కువా

ఏం దారి దేవుడా.



పది నెలల్లో పరిష్కారం

చెయ్య గలను లెమ్మంటాడు

తాయిలం ఇస్తే కానీ

ఆ కిటుకు లేవో

చెప్పను పొమ్మంటాడు

ఏం దారి దేవుడో.


ఇదిగో వస్తోంది

అదిగో వస్తోంది

మూతుల గుడ్డలు

మూల పడెయ్యొచ్చు

మూసిన తలుపులు తెరిచెయ్యొచ్చు


ఐతే గేరంటీ  లేదుట

ఆ పైన మీ ఖర్మం


ఏం దారి దేడుడా















28, ఆగస్టు 2013, బుధవారం

చొ ... చొ ... చ్చొ ...చ్చొ చ్చొ .. అను .. ఒక రాంగ్ షో కథ !


‘‘జై సమైక్యాంధ్రా ! ’’ అంటూ రాత్రి పడుకున్న భర్త, అర్ధ రాత్రి వేళ ‘‘ జై తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ ఉలిక్కిపడి లేచాడు. ‘‘కలొచ్చిందా ?’’ అడిగింది భార్య ఆవలిస్తూ, బద్ధకంగా .. ‘‘అవునే, మన అబ్బాయి దగ్గరకి హైదరాబాద్ వెళ్ళినట్టు కలొచ్చిందే .. ’’చెప్పాడు భర్త. ‘‘చాల్లెండి సంబడం. అర్ధ రాత్రి వేళ అంకమ్మ శివాలనీ, ఏఁవిటా నినాదాలూ మీరూనూ ... కళ్ళు మూసుకుని పడుకోండి ’’అంది భార్య. ‘సరే ’అని పడుకున్నాడు భర్త. మరో గంట గడిచేక ‘‘జై రాయల తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ నిద్ర లేచి కూర్చున్నాడు, ‘‘బావుంది వరస ... ఏఁవిటా కలవరింతలు ; మరో కలేఁవైనా వొచ్చిందేఁవిటి ? ’’ అడిగింది భార్య కాస్త కోపంగా. ‘‘అవునే ఈ సారి అమ్మాయి యింటికి అనంతపురం వెళ్ళినట్టు కలొచ్చిందే ...’’ చెప్పాడు భర్త నీరసంగా. ‘‘సరి..సరి.. ఎవరైనా వింటే నవ్వి పోతారు ..ఈ గొడవలన్నీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి ... ’’అంది భార్య. కాస్త కునుకు పట్టిందో లేదో, భర్త మళ్ళీ ఏదో కలవరిస్తున్నట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చుంది భార్య. భర్త నిద్రలో ‘ చొ..చొ..చ్చొ..చ్చొ ..’ అంటూ కలవరిస్తున్నాడు. ‘‘ ఏఁవయిందండీ .. ఆ చొచ్చొచ్చో లేఁవిటి ? ’’ అనడిగింది భర్తను తట్టి లేపుతూ .. తుళ్ళి పడి లేచాడు భర్త. ముఖం పీక్కు పోయి ఉంది. దెయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. ‘‘ఈసారి పేకాట రమ్మీ ఆడుతున్నట్టుగా కలొచ్చిందే ’’అన్నాడు నీరసంగా .. ‘‘ఖర్మ ! అయితే ఏఁవిటంటా ? ’’ అడిగింది భార్య. కాస్సేపు నసిగి చెప్పాడు భర్త దిగులుగా : ‘‘రాంగ్ షో డీల్ చూపించీసినట్టు కలొచ్చిందే .. ’’ అన్నాడు. అంతే. ఆ మొగుడూ పెళ్ళాలకి మరింక నిద్ర పట్ట లేదు.

18, ఆగస్టు 2013, ఆదివారం

చాప చుట్టెయ్య కూడదూ ? !



చాప చుట్టెయ్య కూడదూ ?!

నీ అసాధ్యం కూలా !
నీ మొహం మండా ...

నువ్వూ కూర్చోవు,
నన్నూ కూర్చో నివ్వవు

మరెందుకయ్యా

చాప చుట్టెయ్య కూడదూ ; !

15, ఆగస్టు 2013, గురువారం

హే, భగవన్ !



హన్నా అయ్యారే అను నొక మహనీయుడు దేశమును రిపేరు చేయ దలచి, చాలా తీవ్రముగా ప్రయత్నించి సాధ్యము కాక ఉస్సురని ఉండి పోయెను. ఇక మానవ ప్రయత్నము వలన ఇది సాధ్యము కాదని తలచి, హిమాలయములకు పోయి ఘోరమైన తపస్సు చేసెను, అన్ సీజను కాబోలునేమో, దేవుడు త్వరగానే ప్రత్యక్ష మయ్యెను.

అయ్యారే కనుల ఆనంద బాష్పములు రాలుచుండ ‘‘ హే భగవన్ !నా జన్మ ధన్యమైనది. నాకొక్క వరము ప్రసాదింపుము ’’  అని వేడుకొనెను,

‘‘ భక్తా ! ఏమి నీ కోరిక  ’’ అని భగవంతుడడిగెను.

‘‘ మా దేశమున అవినీతిపరుల యొక్కయు, అసత్యములాడు వారి యొక్కయు తలల తక్షణమే వేయి వ్రక్క లగునట్లు వరము నిమ్ము ’’  అని అయ్యారే అడిగెను.

అది విని భగవానుడు మిక్కిలి ఖిన్నుడయ్యెను.

‘‘ నాయనా ! నీవడిగిన వరములో రెండు క్లాజులున్నవి. అవినీతి పరులను దండింప వలెనన్న చేతులు రాకున్నవి.అన్ని కోట్ల మందిని నేనే సృజించితిని. నాచేతులతో నాశనము చేయుట  ఎట్లో తెలియకున్నది.అట్లయిన ఈ జంబూ ద్వీపమున ఒకరో ఇద్దరో మాత్రమే మిగులుదురు కాబోలు. ఇక నీ వరము లోని రెండవ క్లాజు అసత్యపరులని దండించు మనుట. పొద్దున లేచినది మొదలు మీ ఖండము నంలి దురద దర్శనములందును, చిత్రికలందును ప్రతి వాడును తానే సత్యవాదినని, తాను చెప్పినదే నిజమని చెప్పు చున్పాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటిని. అందు చేత ఇవి కాక వేరొక వరము వేడి కొనుము. ప్రసాదించెదను.’’  అనెను.

ఇట్టిది కదా నా భాగ్యము అని నిట్టూర్చి, ఏమి చేయుదనని చింతించి తుదకు అయ్యారే వేరొక వరమును వేడెను.

‘‘ హే భగవన్ ! ఈ వరము తప్పక ప్రసాదింపుము. ఏమనిన, స్విస్ బ్యాంకులలో ఉన్న మా వారి నల్ల ధనమంతయు తృటి కాలములో మా దేశ ఖజానాలో పడునట్లు చేయుము. దానితో మా దేశ ప్రజల దరిద్రము తీరి పోయి నీతి నియమములతో, ప్రశాంతముగా బ్రతికెదరు ’’  అని కనులు మూసుకుని వేడుకొనెను.

భగవంతుడు ‘‘ తథాస్తు ! ’’ అని పలికి వరము నిచ్చి అంతర్ధానమొందెను.

అయ్యారే కనులు తెరచి చూచెను. దేవుడు కనిపించ లేదు. అంతియ కాదు. దేశ ఖజానా కూడా ఖాళీగా ఉన్నది.
 దేవుడు తనని మోసగించెనని   అయ్యారే  భావించి,  ఆగ్రహంచెను. తిరిగి ఘోరమయిన తపము  చేయ బోయెను.
,
మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమయ్యెను.

‘‘ నాయనా ! తిరిగి ఏవరము కోరి తపము చేయు చున్నావు  అను క్షణము నన్నిట్లు డిస్టర్బు చేయుట నీకు తగునా ? !  ? ’’  అని అడిగెను.

అయ్యారే కోపము దిగమ్రింగుకొని, ‘‘ దేవా ! నన్ను వంచించితివి. నల్లధనమంతయు దేశ ఖజానాలోకి వచ్చు నట్లు చేసెద నంటివి, కనులు తెరచి చూచు నంతలో మాయమైతివి. ఖజానా ఖాళీగా ఉన్నది, ’’ అనెను,

అందుకు దేవుడు నవ్వి ఇట్లనెను. ‘‘ నాయనా ! నీవెంత అమాయకుడవు ? నేను వరమ నిచ్చుట జరిగినది. మీ దేశ ఖజానా ఇబ్బడి ముబ్బిడిగా నిండుట కూడా జరిగినది.’’

మరి ... అడిగేడు అయ్యారే, సందేహంగా ..

‘‘ నీవు కనులు మూసి తెరచు నంత లోన మీ నాయకుల్దానిని క్షణకాలములో హోంఫట్ ! చేసినారు. నేనేమి చేయుదును ?   నల్లధనమును రప్పించమనియే వరమడిగితివి. మీవాండ్లు దానిని వెంటనే చప్పరించి వేసినచో నేనేమి చేయుదును ? ఈ పాటికి అదంతయు వారలకు  అరగి పోయే యుండును ... అదిగో ! ఆవురావురుమను గావు కేకలు నీ చెవిని బడుట లేదా ?’’  అని దేవుడు తన నిస్సహాయతను వెల్లడించెను.

ఫలశృతి :  దేవుని నిస్సహాయత అను నామాంతరము గల  హే, భగవన్ ! అను ఈ కథను చదివిన వారికి ఉన్న రోగములు అధికమగునేమో కానీ కొత్త రోగములు రావు. కుటుంబ నియంత్రణ వలన ఒక్క పుత్రుడు ఉదయించిన ఉదయించ వచ్చును. ఈతి బాధలు తగ్గక పోయిననూ వాటికి అలవాటు పడి పోయెదరు.మీ వంశమున వంద తరముల వారికి సరి పోవునట్లుగా  ధన కనక వస్తు వాహన సౌభాగ్యములు అక్రమ మార్గమున యత్నించిన దక్క వచ్చును. కానీ ముందుగా చర్లపల్లి జైలులోను , మరియు తీహార్ జైలులోనూ వేకెన్సీ పొజిషను వాకబు చేయ వలెను.

స్వస్తి.








14, ఆగస్టు 2013, బుధవారం

మా ముద్దుల ముసిలోడా ...



విజయ నగరం పెద్దలందరూ కలిసి ‘‘ మూడు యాభైల మన గురజాడ ’’ కార్యక్రమాన్ని జరిపించాలని తలపెట్టి, 2011 సెప్టెంబరు 21 నాడు శ్రీకారం చుట్టేరు. సాలు పొడుగునా వేడుకలూ సభలూ రాజాంలో జరిగేయి. తరవాత్తరువాత, 2012 సె్టంబరు 19, 20 తేదీలలో ముగింపు సభలు ఘనంగా నిర్వహించుకొన్నారు.

తర్వాత, విశాఖ పట్నం కళాభారతి ఆడిటోరియంలో కన్యాశుల్కం

యథాతధ పూర్తి నిడివి ప్రదర్శన జరిగింది. దానితో ఆ సంబరాలు ముగిసాయి.

సరే, ఆ సందర్భానికి కొనసాగింపుగా వెలుగు మిత్రులంతా కలిసి ‘‘మూడు యాభయిల మన గురజాడ’’ అనే 400 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు.ఇందులో ప్రముఖులు గురజాడ గురించి రాసిన 50 వ్యాసాలున్నాయి. శిసాగర్, సీరపాణి, రజనిలు రాసిన మూడు కవితలూ,ఆయా సభలకు చెందిన ఫొటోలూ ఉన్నాయి.

‘‘మూడు యాభయిల మన గురజాడ’’ పుస్తకాన్ని ప్రచురించి న వెలుగు మిత్రులు  గురజాడకి అంకితం చేస్తూ రాసిన గేయం ఇది ...

ఇక చదవండి ....

మా ముద్దుల ముసిలోడా


ఇప్పుడంటే మురిగ్గుంటై
డెంగూ ఫీవరుగా
వూరిని ఝడిపిస్తోంది గానీ
మా అయ్య కోనేరు



ఆరడుగుల లోతుల్లోకి
విసిరేసిన అణాకాసుని
నీటి మడుగున చందమామగా చెరిపించేది

కారణాలడక్కూడదు.
‘‘ వీడికి వెఱ్ఱికాబోలు’’ అనుకుంటారు,

కడుపికింత తిండి పెట్ట లేక పోయినా
అడుక్కున్నోడికి సైతం
చేతికి సెల్ ఫోనిచ్చాం
ఇదీ అడుగు నుండి మా అభివృద్ధి
కడుపుమండా ఏలుబడి అలా సాగుతోంది
నిలుచున్న చోటే దిక్కులు వెతుక్కుంటూ
చట్ట సభల్లో పొక్కుల చిక్కుకుంటూ

ఎవడితరం పులి మీద సవారీ !’’
అదీ మా ప్రయోజకత్వం
సిగ్గిడిసి అడిగేస్తున్నా
మైడియర్ ఓల్డు అప్పారావు
అన్నావన్నావు

‘‘ మంచి గతమున కొంచెమునోయి’’
మేమేమో గతం గొప్పలే
దుదదపత్తింగా గోక్కుంటున్నాం
అందని ఎత్తులో నిలిచిన నీ మనసు
‘‘పట్టుబడాలని నిదానిస్తున్నాం.’’
‘‘ మందగించక ముందు అడుగేయి’’
కదా నువ్వన్నది

‘‘ చిత్రం చిత్రం మహా చిత్రం’’
ఎన్నిమార్లు కన్నిమార్లు
నిన్ను చూస్తున్న కొద్దీ
కొత్త చిగుర్లేసి నిగారిస్తుంటావు

‘‘ వీర్య మెరుగక విద్య నేర్వక’’
కూడా అన్నావు కదా !

అమ్మ ముసిలోడా



అయితే ఇక చూడు మా తడాఖా
‘‘ అరె ఝాఁ , ఝాఁఝటక్ .. ఫటక్ ...’’
అదుగో నవ్వుతున్నావు
‘‘మనవాళ్ళు వొట్టి వెధవాయిలోయ్’’

నీ నోట్లో నోరెట్టలేం తండ్రీ

నీకో నమస్కారం

అందుకే నీకోసం ఈ పుస్తకం ...



---- వెలుగు మిత్రులం.




10, ఆగస్టు 2013, శనివారం

భలే వాడి వయ్యా !



పారావారము నందు న
నారని పెను చిచ్చు వోలె హాలాహలమే
పారఁగ నద్దానిని మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై



భావం : పాల సముద్రంలో మహా అగ్ని లాగున విషం పుట్టింది. అది ఎంతకీ ఆరేది కాదు. లోకాలను కాపాడడం కోసం శివుడు దానిని మనసారా మ్రింగాడు.

పరమేశ్వరుడు లోకసంరక్షణార్థం   మద్యం పుచ్చు కొన్నాడని సమస్య. దానిని  అవధాని గారు  మనసారా అనే విరుపుతో చక్కగా పూర్తి చేసాడు.
అమృతం కోసం దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధించారు. వాసుకిని తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. పాల కడలిని చిలకడం మొదలు పెట్టారు. అందు లోనుండి కామ ధేనువు, కల్ప వృక్షమూ, ఐరావతమూ, శ్రీమహా లక్ష్మీ, కౌస్తుభమూ, అప్సరోంగనలూ వెలువడ్డారు. చివరగా కాలకూటం వెలువడింది. దానిని ఏం చేయాలో దేవ దానవులకు తెలిసింది కాదు. చివరకు ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్ధించారు. లోక రక్షణ కోసం  శివుడు దానికి సిద్ధ పడ్డాడు.

ఆ సందర్భంలో పోతన గారు చాలా గొప్ప పద్యాలు రాసారు. వాటిని కూడా ఒకింత గుర్తు చేసు కుందాం. మంచి కవిత్వాన్ని మననం చేసు కోడానికి ముహూర్తం అక్కర లేదు కదా.
కంటే జగముల దు:ఖము
వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ
శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది.
పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.
శుకుడు అందుకే అంటాడు :
మ్రింగెడు వాడు విభుండని
మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ,
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా.
పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ...

కదలం బారవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు,నేత్రంబులు నెఱ్ఱగావు, నిజజూటార్ధేందుఁడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో, డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో, భక్షింపుచో, మ్రింగుచోన్.
పరమ శివుడు హాలాహలాన్ని రారమ్మని కవ్వించి పిలిచాడు. తనూ ఓ అడుగు ముందుకు వేసి సమీపించేడు. ఆ విషాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసాడు.కిందకి లాగాడు. నోట పెట్టుకుని మ్రింగాడు.
అలా శివుడు విషాన్ని భక్షిస్తూ ఉంటే, వొంటి మీద హారాలలా వేలాడుతున్న పాములు బెదరడం లేదు. కదలడం లేదు. ఆ మహా తాపానికి పరమ శివుని ఒంటి మీద ఒక్క చుక్క చెమట పుట్టడం లేదు. కనులు ఎఱ్ఱ బడడం లేదు. జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ వేడిమికి కంది పోలేదు. శివుని పద్మంలాంటి ముఖం వాడి పోలేదు.,
భలే వాడివయ్యా, భోలా శంకరా !






3, ఆగస్టు 2013, శనివారం

కళ్ళున్న కబోదులూ ... చెవులున్న బధిరులూ ...



పదవీ లాలస, పెదవీ లాలస పట్టు కుంటే వొక పట్టాన వొదిలేవి కావు.లోకంలో ప్రతి మనిషికీ ఆహార నిద్రా భయ మైధునాలతో పాటూ అమిత జీవితేచ్ఛగా ఉండేది ఏదో ఒక ఉన్నతమైన పదవి పొందాలని ఉంటుంది. ఎదుటి వాడి కంటె వొక మెట్టు అధికంగా ఉండాలని ఉంటుంది. ఏదో వొక పదవి కాలవాలని తాపత్రయ పడతాడు. అందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు కానీ, ఆ కోరిక దురాశగా మారి పోతేనే ప్రమాదం. అదే అన్ని అనర్ధాలకూ హేతువవుతుంది.
ఈ దురాశ ఎలాంటిదంటే ..
ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీమతే
లక్షాథిపస్తథా రాజ్యం. రాజ్యస్థ: స్వర్గ మీహతే

అంటే ... వంద ఉన్న వాడు వెయ్యి కావాలను కుంటాడు. వెయ్యి ఉన్న వాడు లక్ష కోరు కుంటాడు. లక్షాథికారి
 ( ఇప్పుడు ఎన్ని లక్షలూ చాలవను కోండి, అది వేరే మాట) ప్రభుత్వం, పదవి కావాలను కుంటాడు. రాజు స్వర్గాన్నీ, స్వర్గ సుఖాలనూ ఆశిస్తాడు ...

కానీ, కవి ... కారే రాజులు రాజ్యముల్ కలుగవే ... అంటూ గర్వించిన వారంతా సిరి మూట కట్టుకుని పోగలిగేరా ? అని నిలదీసాడు.... కానీ ఆశాపాశము కడున్ నిడుపు .. లేదంతంబు రాజేంద్ర !

ఎప్పటికయినా సుకవి ప్రజల నాలుకల మీద నిలిస్తే, రాజు శిలా ప్రతిమలా ఉండాల్సందే కదా ...


ధూర్జటి  పదవీ కాంక్ష ఎలాంటిదో చెప్పాడు కదా ... .

ఒకరిం జంపి పదస్థులై బ్రదుక  తా మొక్కొక్కరూహింతు రే
లకొ ? తామెన్నడు జావరో ? తమకుఁబోవో సంపదల్ ? పుత్ర మి
త్ర ళత్రాదుల తోడ నిత్య సుఖముంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నఁడుం కటకటా శ్రీకాళ హస్తీశ్వరా !

భావం: ఎవడినో ఒకడిని తుదముట్టించి, తాము వాడి పదవిని దక్కించు కోవాలని కొందరు చూస్తూ ఉంటారు. ఏమీ, తాము మాత్రం ఎప్పుడూ చావరా ? తమకు సంపదలు పోవా ? భార్యా పిల్లలూ, స్నేహితులతో ఎల్లకాలం సుఖంగా ఉంటారా ? బతికి ఉన్న వారికి  చావు రాదా ?

కానీ వారికి అదేమీ పట్టదు, ఒక్క రోజు రాజు చెయ్యి గణనాథా ! అంటూ తహతహలాడి పోతూ ఉంటారు.

రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు ... అనికూడా కవి చెప్పాడు. అంతే కాదు. ఒక సారి . పదవి అంటూ లభించేక వాడెలా మారి పోతోడా కూడా విపులంగానే వివరించాడు:

చూడండి:
రాజన్నంతనె బోవునా కృపయు, ధర్మం బాభిజాత్యంబు,వి
ద్యాజాత క్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సంరక్షయున్
సౌజన్యంబు, కృతం బెఱుంగుటయు,విశ్వాసంబుగాకున్న దు
ర్భీత శ్రేష్ఠులు గాఁ కతంబు కలదే శ్రీకాళ హస్తీశ్వరా !

రాజు అయ్యాడంటే చాలు, దయావిహీనుడైపోతాడు. ధర్మం మరచి పోతాడు. ఆభిజాత్యం పెరిగి పోతుంది, పండితులంటే లెక్క చేయడు. సత్యం పలుకడు, మంచి వారిని కాపాడడు, మంచి తనం అసలే ఉండదు, చేసిన మేలు మరచి పోతాడు, విశ్వాసహీనుడవుతాడు. ఏం కారణమో కదా ...

నిజమే ఓ సారి పదవి లభించేక చాలా మందిలో లేని కొమ్ములు మొలుస్తాయి. తామేదో దైవాంశ సంభూతుల మనుకుంటారు. కన్నూ మిన్నూ కానరు. యుక్తా యుక్త విచక్షణా ఙ్ఞానం నశించి పోతుంది. లభించిన పదవిని నిలుపు  కోడానికి ఎంత కయినా తెగిస్తారు. లోకంలో చూడ్డం లేదూ ?
రాజ్యపాలన అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
.
కాళిదాస మహా కవి అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో రాజ్యం గురించి చెబుతూ ...

నాతి శ్రమాపనయనాయ, నచ శ్రమాయ
రాజ్యం స్వ హస్త ధృత దండ మివాతపత్రమ్.  ... అంటాడు.

రాజ్య సుఖం ఎలాంటి దంటే, తన చేత్తో స్వయంగా పట్టుకున్న గొడుగులాంటిది. అంతగా శ్రమను పోగోట్టదు, అలాగని శ్రమని కలిగించదు.

అయితే, రాజుకి నిజమైన ప్రజాభి మానం అంటూ ఉంటే, అది చేతి గొడుగు లాంటిదని మరో కవి చెబుతున్నాడు చూడండి:

ప్రజాగుప్త శరీరస్య కిం కరిష్యతి సంహతా:
హస్త న్యస్తాతపత్రస్య వారిధారాఇవారయా.

ప్రజాభిమానం చేతి గొడుగులాంటిది. వర్షం ఏం చేయ గలదు ?

అందు చేత రాజైన వాడు ప్రజాభిమానం సత్య మార్గంలో పొందాలి. అలాంటి నాయకులను ప్రజలు ఎన్నటికీ మరచి పోరు. అలాంటి ప్రభువులే   ప్రాత: స్మరణీయులు.

పాలకుడైన రాజు పూలు కోసి, దండలు కట్టే తోటమాలిలా ఉండాలి. కానీ, చెట్లు నరికి బొగ్గులు చేసే వాడిలా ఉండ కూడదని శ్లోక కారుడు చెబుతున్నాడు. చూడండి:

పుష్పమాత్రంవిచినియాత్
మూలచ్ఛేదం నకారయేత్
మాలాకారయివారామే
న యథాంగార కారక:.

మహా భారతంలో రాజనీతి ధర్మాలు విదురుడూ, ధౌమ్యుడూ , నారదుడూ,  భీష్ముడూ వంటి  పెద్దలు చాలానే చెప్పారు
.
ధౌమ్యుడు  పాండవులకు చెప్పిన సేవా ధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.

 నారదుడు చెప్పిన రాజధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.

భీష్ముడు  ధర్మ రాజుకి చెప్పిన  మంచి మాటలు కొన్ని ఇక్కడ నొక్కి చదవొచ్చును.

రాజు నడచిన బాటలోనే ప్రజలూ నడుస్తారని యథా రాజా తథా ప్రజా: అనే నీతి వాక్యం కూడా  బోధిస్తోంది.


పదవి కాస్త ఊడిపోయేక ప్రభువు పని ఏమవుతుందో తెలుసా ?

పద్యం చూడండి:

విధి సంకల్పముచే నొకానొకఁడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదాభాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధికారాంతము నందు చూడ వలెగదా నయగారి భాగ్యముల్ !

అదృష్ట వశావ్న అధికారం లభించి, రాజ్య పాలన చేయడం మొదలెడితే, చెవిటి వాడవుతాడు. అంటే మంచి మాటలు చెవికెక్కవు, కన్నూమిన్నూ కానడు. మదం పెరిగి పోతుంది. అన్ని వ్యసనాలూ అలవడతాయి. మాట్లాడితే అన్నీ చెడ్డ మాటలే. పదవి ఊడేక వాడి సౌభాగ్యం చూడాలి మరి ...


మరి, ఇప్పుడున్న వారిలో పలువురు ప్రజా సేవకులా ? ప్రజా కంటకులా ?

కాలమే నిర్ణయిస్తుంది కదూ ...

నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే ...

స్వస్తి.










1, ఆగస్టు 2013, గురువారం

చిన్నప్పటి నుండీ వాడు తేడాయే !



ఒక చక్కని దత్త పది ...




పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం లోగడ చూస్తే సరే. లేదా వినండి ...

పాలు పంచడు రారాజు పాండవులకు

పెరుగు చున్నది వానిలో దురితము గన

నేయిలను గల్గ దిట్టియహితము వాని

నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !



భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)

వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.

ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.

వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.

ఇక భారత యుద్ధం తప్పదు !



వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :

రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను   కననే ? మూర్ఖత వానిని  ఊనెను



కనన్, ఏ + ఇలన్   =  ఏ లోకంలో నయినా ఉందా ?

వానిన్ + ఊనెన్.    =  వానిని మూర్ఖత్వం  పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
  



26, జులై 2013, శుక్రవారం

తెలుగు పద్యం చిరంజీవి



కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అంటూ లోగడ ఓ బ్లాగు టపా రాసేను. దానిని  ఇక్కడ నొక్కి చదవొచ్చును. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ పద్యం మీద ఓ రెండు పద్యాలు చూడండి ...

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెదనంచు
నున్మాదియై ప్రేలుచున్నవాడు ?

పద్యమ్ము నెవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగు వాడు ?

పద్యమ్ము ఫలమురా ! పాతిబెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసఁగు !

పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితి మేము
లోకుల హృదయాల లోతులందు !

ఇప్పుడద్దానిఁబెకలింప నెవరి తరము ?
వెలికి తీసి పాతుట యెంతటి వెఱ్ఱితనము ?
నిన్నటికి మున్ను మొన్ననే కన్నుఁదెఱచు
బాల్య చాపల్యమున కెంత వదఱుతనము !?


( కడిమెళ్ళ వర ప్రసాద్ )

పద్యం మీద మరో పద్యం చూడండి ...

పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ సం
హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.

( వద్దిపర్తి పద్మాకర్ )

                                              తెలుగు పద్యం చిరంజీవి..






20, జులై 2013, శనివారం

చప్పట్ల బాబా ...





చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.

‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.

‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్ప కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’

‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.

‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరిగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు,

ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిష్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి

మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.

అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ ఉండడా ? ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం. అంతే. ’’

ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.

ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?

‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’

ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీపాను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.

చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...

ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్

ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?

తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో

పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !

అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.

‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.

సత్యాన్ని మించిన అసత్యం లేదు,

హింసను మించిన అహింస లేదు.

ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు,

ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు

అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా ! అని మూయిస్తాం.

మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...

మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మంచి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట మన తాత్విక బోధనలు. మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.

నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించి . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది. ధన్యోస్మి.

జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.

చప్పట్ల బాబా తన తొలి భక్తుడిని చూస్తూ చిరు నవ్వులు చిందించారు.



1.































































8, జులై 2013, సోమవారం

ఖర విలాపం ...




ఇదేమయినా బావుందా , చెప్పండి ..‘కట్నం తీసుకునే వాడు  గాడిద ’ అని ఓ టీ.వీ ఛానెల్ అడపా దడపా హెచ్చరించడం మా గాడిదల దృష్టికి వచ్చింది. మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఏ గాడిదయినా నవ్వి పోతుంది. గాడిదలు కట్నం తీసు కోవడమేమిటి ! గాడిదలు కట్నం తీసుకున్న వైనం ఎక్కడయినా చరిత్రలో విన్నామా ? కన్నామా ? మరి కట్నం తీసుకునే వాడిని మాతో పోలిక తేవమేఁవిటి ? చోద్యం కాక పోతేనూ ! మధ్యలో మా వూసెందుకూ ఎత్తడం మేఁవంటే చులకన కాక పోతేనూ ? వెనుకటి కొక తండ్రి కూడా ఆడిన మాటను తప్పిన కొడుకుని గాడిదా ! అని తిట్టడం, వీడా కొడుకని గాడిద ఏడవటం జరిగింది. ఇలా ప్రతీ వాళ్ళకీ అలుసై పోవడం మాకు చాలా కష్టంగా ఉంది.

అందుకే త్వరలో జరగబోయే మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలో ఈ దారుణాన్ని నిరసిస్తూ ఓ తీర్మానం పెట్టబోతున్నాం. మానవ హక్కుల వారి దృష్టికి ఈ విషయం తీసికెళతాం. హన్నా ! గాడిద లంటే అంత చులకనా ; అంటే కొంత చులకన ఉండొచ్చని అర్ధం కాదు. గానానికి మేఁవూ, అందానికి లొటిపిటనూ చెప్పు కోవాలని మా మధురవాణి అక్కయ్య చెప్ప లేదూ ...ఏఁవిటీ ... వెక్కిరింతగా చెప్పిందంటారా ? ఎలా చెప్పిందని కాదు ... చెప్పిందా లేదా ? అంటే లోకంలో మా అందం గురించి ఎంతో కొంత చర్చ ఉండడం బట్టే కదా ? నిజానిజాలు పైవాడి కెరుక. చూసే అందం చూసే వాడి కళ్ళలో ఉంటుంది. గాడిద పిల్ల గాడిదకి ముద్దు. అలాగే గాడిదల అందం గాడిదలకే సొంతం. మా వినయ గుణమే మాకు అందం. గుర్రాన్నీ గాడిదనూ ఒక తాట కట్టొద్దని చెప్పడం గురించి అంటారూ ? దాని గురించి కూడా మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్రాల దేం అందం లెద్దురూ . గాడిద గుడ్డు అందం. అదిగో... ఈ ధూర్త మానవుల మాటలు చెవిని పడి పడీ మాకూ అనుకోకుండా అవే మాటలు వచ్చేస్తున్నాయి కదూ ? గాడిద గుడ్డేఁవిటి ? గాడిద గుడ్డు.

గాడ్ ద గుడ్ అనే దానికి వచ్చిన పాట్లు అవి. ఈ మాటని కూడా లోక వ్యవహారం లోనుండి తరిమేసేలా మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ చర్యలు తీసుకుంటుంది.

గంగి గోవు పాలు గరిటడైనా చాలుట. కడివెడైనా ఖరము పాలు శుద్ధ దండగ అంటాడు ప్రజాకవి, గోవు మా లచ్చిమి అంటే మాకూ గౌరవమే కానీ మా పాల గురించి అలా అనడం ఏమన్నా బాగుందా చెప్పండి ? ఏమీ, మా బిడ్డలు మా పాలు తాగి ఏపుగా పెరగడం లేదా ? మమ్ములనూ, , మా పాలనూ హేళన చేస్తూ మా మనోభావాలను కించ పరచడం బాగుందా ?

వసుదేవుడంతటి వాడు మా జాతివాని కాళ్ళు పట్టు కొన్నాడే ! తెలుగు సంవత్సరాలలో ఖరనామ వంవత్సరంగా అజరామరంగా నిలిచేమే ? ఒక దేవజాతి ముఖాకృతిగా కలవారమే ! అట్టి మాకా ఈ దుర్గతి ... మా పట్లనా ఇంత చులకన భావం. ?

అధికారికి ముందూ, గాడిదకు వెనుకా ఉండ కూడదంటారు. అలా వాటంగా వెనక్కాళ్ళు రెండూ ఒకేసారి ఎత్తి తన్నగల మరో ప్రాణి లోకంలో ఉందా చెప్పండి ? అదీ మా ఘనత ! దానిని గుర్తించ రేమీ ?

మాలో కంచర గాడిదలూ, అడ్డ గాడిదలూ ఉన్నాయంటారు, సార్ధవాహుల సామాన్లు మోసే కంచర గాడిదల ఉన్నాయి కానీ నిజానికి అడ్డ గాడిదలంటూ మాలో వేరే జాతి గాడిదలంటూ ఏవీ లేవు. అట్టివి నరజాతిలో ఉన్నట్టు వినికిడి.

ఎందుకంటే, వెనుకటికి ఓ కవి సభలో ఓ సమస్యను పూరిస్తూ, ‘‘ కొందరు భైరవాశ్వములు ... అంటూ చెబుతూ .. కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు అని మమ్మల్ని కూడా పేర్కొన్నాడు. అంచేత నరజాతిలో అడ్డగాడిదలు ఉన్నట్టు రూఢి అయినట్టే కదా !

మునిమాణిక్యం నరసింహారావు గారు బడి పంతులు. ఓ రోజు పిల్లల కాంపోజిన్ పుస్తకాల కట్ట  చంకన పెట్టుకుని వస్తున్నారు. ఓ కొంటె విద్యార్ధి  వారిని అల్లరి పెడదామని, ‘‘ఏఁవిటి మాష్టారూ ? గాడిద బరువు మోస్తున్నారూ ?’’ అన అడిగేడు. దానికాయన వాడి మాడు పగిలేలా జవాబిచ్చేరు. ‘‘  అవున్నాయనా ! ఇది ఒక గాడిద బరువు కాదు నాయనా ! నలభై గాడిదల బరువు ! ’’ అని ...

అలాగే  ఓసారి ముట్నూరు కృష్ణారావు గారి మనవరాలు  చుట్టపు చూపుగా బందరు వచ్చి, తాతగారితో హాస్యమాడదామని, ‘‘ ఏఁవిటి తాతగారూ ! మీ ఊరినిండా గాడిదలే  కనిపిస్తున్నాయి ! ’’ అంది. దానికాయన తాపీగా ‘‘ అవునమ్మా, ఉన్నవి చాలక ఈ మధ్య పై ఊళ్ళ నుండి కూడా వచ్చి చేరుతున్నాయి ... ’’అని జవాబిచ్చి మనవరాలి కోణంగి తనానికి ధీటైన జవాబిచ్చేరు.
చూసారా ? జోకులు బావున్నాయి కానీ, అవీ మాతోనే ముడిపడి ఉన్నాయి.  మా బతుకు అలాంటిది మరి.

మేం మోసేవి పాత బట్టల మూటలే కావొచ్చు. కానీ పాత మాటల మూటలు మోసుకుంటూ గొప్ప కవులమని విర్రవీగుతూ తిరిగే కుకవుల కన్నా మేం గొప్పే కదా ?

మా బాధ్యత మేం చేస్తున్నామంతే.  మనకి చెందని పనుల్లో జోక్యం చేసుకుంటే చావు దెబ్బలు తప్పవని మా జాతి వాడే లోగడ నిరూపించేడు కూడానూ.

గుర్తుందా ? ఒక మడివేలు ఇంట ఓ కుక్క గాడిద ఉండేవి.  ఓ రోజు రాత్రి యజమాని ఇంట దొంగ పడ్డాడు. కుక్కా, గాడిదా కూడా దొంగ  పడడం చూసేయి.  చాకలి తనని బాగా చూడడం లేదనే ఉక్రోషంతో కుక్క తన కర్తవ్యం మరచి, అరవడం మానేసింది.గాడిద ఎంత చెప్పినా కుక్క అరవ లేదు. గాడిద తన యజమానికి మేలు చేయాలనే ఆలోచనతో తనకు మాలిన పనికి పూనుకొని గట్టిగా  ఓండ్ర పెట్టింది. గాఢ నిద్రలో ఉన్న చాకలి దాని అరుపులకి మేల్కొని కోపంతో దుడ్డు కర్ర తీసుకుని దానిని చావమోదాడు. త్యాగశీలి అయిన ఆ గాడిద తాను చావు దెబ్బలు తిని కూడా లోకానికి  ఎంత గొప్ప నీతిని తెలిపిందో కదా ! అలాంటి త్యాగధనుల జాతి మాది.


వెనుకటి రోజులలో ఇళ్ళలో ఆవకాయలు పెట్టేడప్పుడు అమ్మలూ. అత్తలూ. పిన్నమ్మలూ వగైరాలు మావిడి కాయలు ముక్కలుగా తరుగుతూ ఉంటే పిల్లలు వాటి జీళ్ళు పట్టుకు పోయి ఇంట్లో గోడల మీద కుడ్య చిత్రాలు వేసేవారు. గోడ పత్రికలతో  గో డలన్నీ ఖరాబు చేసే వారు.

ఆరాతల్లో దడిగాడు వానసిరా అనే మాట తరచుగా కనిపిస్తూ ఉండేది. వాళ్ళ రాతల్లో మాప్రస్తావన రావడం కొంచెం నొచ్చుకునే అంశమే అయినా, పిల్ల చేష్టలు ఎంతో మురినెం కదా. ఇప్పుడా బాధ లేదు. ఇళ్ళకు

రంగులు  వేద్దామన్న ఆలోచన రాగానే ముందుగా మీటింగ్ పెట్టి గోడల మీద పిచ్చి రాతలు రాసేరో. తాట  ఒలిచేస్తాం గాడిదల్లారా ! అనే హెచ్చరిక మా పేరు సాక్షిగా వెలువడుతుంది.

కరభము, ఖరము, గార్ధభము, గాలిగాడు ... లాంటి చాలా పేర్లు మాకున్నాయి. వాటిలో గాడిద అనే పేరే ముచ్చటగా ఉంటుంది.

అదలా ఉంచితే ...

క్షుద్ర మానవ జాతి మా పేర ఎన్ని సామెతలు పుట్టించిందో  కాస్త చూడండి ...

1.గాడిదకు గడ్డి వేసి, ఆవును పాలిమ్మన్నట్టు.

2.గాడిద కూత ( ఓంఢ్ర ) గాడిదకు కమ్మనిదే కదా

3.గాడిదకు పులి తోలు కప్పితే కఱవ గలదా ?

4.గాడిదకు మంగళ స్నానం చేయిస్తే, బూడిదలో పొర్లిందిట !

5.గాడిద కేమి తెలుసు గంధపు వాసన.

6.గాడిద కొడకా ! అంగే మీరు తండ్రులు, మేము బిడ్డలం అన్నాడట.

7.గాడిద గుడ్డు గరుడ స్తంభం.

8.గాడిదలతో వ్యవసాయం చేస్తూ, కాలి తాపులకు  దడిస్తే ఎలా ?

9.గాడిదతో స్నేహం కాలి తాపులకే

10.గాడిద పుండుకు బూడిద మందు.

11.గాడిద మోయదా గంధను చెక్కలు ?

12.గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్

13. గాడిదల మోత, గుఱ్ఱాల మేత

14, గాడిదలు దున్నితే, దొమ్మరులు పంటకాపులు కారా ?

15. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందిట !

ఇహ చాలు. త్వరలో జరుగబోయే అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలకు స్వాగత గీతం రాసే పనిలో బిజీగా ఉన్నాను. శలవ్...


26, జూన్ 2013, బుధవారం

ఇల్లు కొంప ఎప్పు డవుతుంది గురూ ...



సమ్యక్ భాషణం వ్యక్తికి భూషణం.

కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:

నాన్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతే2ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్.

ఎన్ని మణిమయ హారాలు ధరించినా అవి మనుషులకు అలంకారాలు కావు. ఎన్ని సుగంధాలు పూసుకొన్నా, ఎన్ని పూవులు ధరించినా, అవి మనిషికి అలంకారాలు కావు. చక్కని వాక్కుకి మించిన అలంకారం లేదు సుమా ! వాక్ భూషణమే భూషణం.

ఈ సంస్కృత శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం :

భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్

భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ కలాభిషేకముల్

భూషలు కావు, పూరుషుని భూషితుఁ జేయు ( బవిత్రవాణి వా

గ్భూషణమే భూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

అంచేత, మంచిగా మాట్లాడడమే మనిషికి అలంకారం. దేవుడు నోరిచ్చాడు. మాట యిచ్చేడు, ఆలోచన యిచ్చేడు ... కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడితే పోయేదేమీ లేదు కదా.

నోరు నొచ్చేలా శ్రీహరిని కీర్తించవయ్యా మగడా అని చెప్పేడు పోతన. మనం వింటామా. అంత సీన్ లేదు కానీ, రోజూ నాలుగు మంచి మాటలయినా పలుకుతున్నామా ? ఆలోచించాలి.

మృదువుగా మాట్లాడితే ఎవరయినా వింటారు. అలాగని పలుకులలో తేనె లొలుకుతూ, మదిలో విషాన్ని నింపుకొని ఉండడంకూడా సరికాదు.

అసలు మన మూడ్స్ బట్టి మనం మాట్లాడే ధోరణి కూడా ఉంటుందేమో ...

విసుగ్గా ఉన్నప్పుడు ఇల్లు కాస్తా కొంప అవుతుంది !

భోజనం కాప్తా పిండాకూడవుతుంది !

ఊరు కాప్తా వల్లకాడవుతుంది !

ఎదుటి వాళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే అవుతారు !

అంచేత విసుగుని తగ్గించు కొని శాంతంగా అందరితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.












22, జూన్ 2013, శనివారం

ఆపాత మధురం ... రావు బాల సరస్వతి గానం !



హిమవత్పర్వత సానువుల్లో మును పెన్నడూ ఎరుగని ఘోర విపత్తు సంభవించింది. వేలాది మందిని గంగమ్మ          పొట్టన పెట్టు కుంది. ఆ విపత్తు వివరాలు అందించడంలో మన తెలుగు టి.వి లు అత్యుత్సాహంతో కొంత మదర్యాద కోల్పోతున్నాయి. వాటికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడో, చర్చా కార్యక్రమాలు నిర్వహించే టప్పుడో తమ పైత్యం ఒలకబోస్తూ పెడుతున్న పేర్లు అభ్యంతర కరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నిన్న దానికి చెందిన ఒక కార్యక్రమానికి యమలోకం అని శీర్షిక ఉంచేరు. చర్చలో పాల్గొన్న ఒక పెద్దాయన అది దేవ లోకం కానీ యమ లోకం కాదనీ అసలే ఆ ప్రాంతమంతా అనుకోని ఘోర విపత్తుతో దయనీయంగా ఉంటే ఇలాంటి పేర్లు పెట్టడం తగదని హెచ్చరిండం జరిగింది. అలాగే వరద బీభత్సానికి బదరీనాథ్ అంతా బురద మయమై పోయిందని చెబుతూ ‘‘ బురదీనాథ్’’ అని శీర్షిక ఉంచి తన అతి తెలివిని మరో టీ.వీ. ప్రకటించుకుంది. ఈ జాడ్యం మన వాళ్ళకి వదిలేదెలా ? మీరూ ఆలోచించండి ...

14, జూన్ 2013, శుక్రవారం

చూసే వాళ్ళు మంచి వాళ్ళయితే ఎన్ని వేషాలయినా వెయ్యొచ్చు



నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...

విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ చేసుకునే వాళ్ళం. చివర్లో మూడు నాలుగేళ్ళపాటు కాలేజీ, హైస్కూలూ విడి పోయినా, పని వేళలలో మాత్రం మార్పు లేదు.

సరే, దీనికేం గానీ, సాలూరి ప్రజలు మమ్మల్ని ఎంతగా ప్రేమించే వారంటే, మాలో చాలా మందిమి, ముఖ్యంగా హైస్కూలు టీచర్లం సాలూరు వచ్చేక మరి కదిలే వారం కాము. ఎవళం పది పన్నెండు ఏళ్ళకి తక్కువ అక్కడ పని చేయ లేదు, అందరిలోకీ నేను మరింత సుదీర్ఘ కాలం పని చేయడం వల్లనూ, కథలూ కాకర కాయలూ రాసే వాడిని కనుకనూ, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడిని కావడం చేతనూ నన్ను మా సాలూరి వాళ్ళు మరింతగా అక్కున చేర్చు కున్నారు. అందుకే అక్కడి నుండి 24వ ఏట ట్రాన్సఫర్ అయి వెళ్ళి పోతూ ‘‘ మంచి గంధము సాలూరి మంచి తనము ’’ అన్నాను. ఇందులో రవంత అతిశయోక్తి లేదండీ.

ఆరుద్ర నవరసాలూరు సాలూరు ! అన్నారు. సాలూరి రాజేశ్వరరావూ , ఘంటసాల మాష్టారూ. సాలూరి చిన గురువు గారూ ఆ మట్టి వాసన పీల్చిన వారే కదా !

ఆ రోజుల్లో మా విద్యా సంస్థ ప్రతియేడూ ఠంచనుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేది.

మా మినిష్టీరియల్ స్టాఫ్ లో చుక్కా దంతేశ్వర రావు అని ఒకాయన జూనియర్ అసిస్టెంట్ ఉండే వారు. అయనకు నాటకానుభవం మెండు. మంచి నటులు, పరిషత్ పోటీలలో కూడా చాలా బహుమతులు గెల్చకున్ననటులు. ఓ ఏడాది మా మేష్టర్లతో ఓ నాటిక కాలేజీ వార్షికోత్సవంలో వేసి తీరాలని పట్టు బట్టేరు. నాటిక పేరు ఇప్పుడు నాకు గుర్తు లేదు. కాలేజీ స్టాఫ్ నుండీ, హైస్కూలు సిబ్బంది నుండీ, ఆఫీసు సిబ్బంది నుండీ నటులను ఎన్నిక చేయడం జరిగింది. అంతా ఉత్సహంగా ముందు కొచ్చేరు.

‘‘ జోరా మేషారూ ! మీరూ ఓ వేషం వేసి తీరాలండీ ’’ అన్నాడు మా దంతేశ్వరరావు.

నా పేరు అసలే చాలా కురచ. నాలుగే అక్షరాలు . జో –గా – రా – వు. అంతే ! దానిని మా మేష్టర్లు మరింత కుదించి, జోరా మేషారూ అని పిలిచే వారు. నా పేరులో రెండక్షరాలు ఎలాగూ మింగేస్తున్నారాయె ! కనీసం మేష్టారులో ష కింద ట కూడా తినెయ్యాలా చెప్పండి అనేవాడిని.

ఎవరూ వినేవాళ్ళు కారు. నేను ఎప్పటికీ వాళ్ళకి జోరా మేషారినే.

‘‘ పోదూ, నేను వేషం వెయ్యడ మేఁవిటి ?’’ అన్నాను.

‘‘ మీరు వెయ్యందే మేమూ వెయ్యం, మీరు కాదంటే ప్రన్సిపాల్ గారితో చెప్పించి మరీ ఒప్పిస్తాం ’’ అని ముద్దుగా బెదిరించేరు.

‘‘ ఆ డైలాగులూ అవీ బట్టీ పట్టడం నా వల్ల కాదు. అదీ కాక మీకు తెలుసు కదా. నాకు మతి మరపు జాస్తి. ఏ డైలాగు తరువాత ఏది చెప్పాలో నాకు గుర్తుండి చావదు. నామానాన నన్నొదిలేద్దురూ ! ’’ అన్నాను.

అదేం కుదర్దు అన్నారంతా. ఏపుగా ఉంటారు కదా ఎస్ ఐ వేషం వెయ్య మన్నారు. నాటిక చూసేను. ఆ పాత్రకు డైలాగులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా వల్ల కాదు పొమ్మన్నాను. ఓ బంట్రోతు పాత్ర చాలా తక్కువ డైలాగులతో ఉన్నట్టుంది. అదయితే చేస్తానన్నాను.

‘‘ అదా ! పెద్దవాళ్ళు ... మీకు బావోదేమో ’’ అన్నాడు.

‘‘‘‘ నటన ప్రథానం కానీ వేషంతో పనేమి ’’ టన్నాను ఏదో తెలిసినట్టు.

‘‘ఏదో, మీరూ మాతో పాటే స్టేజీ ఎక్కుతున్నారు. అదే చాలు ’’అని అంతా సరే అన్నారు.

అందులో నావి మొత్తం ఆరు డైలాగులు.

1. చిత్తం

2. చిత్తం బాబయ్యా

3. చిత్తం ..అలాగే నండయ్యా, అలాగే కానియ్యండి

4. చిత్తం ... చిత్తం

5. చిత్తం ..అలా అనకండయ్యా ...

6. చిత్తం .. దండాలయ్యా.

సరిగ్గా ఇవే కాక పోవచ్చును కానీ, దాదాపు ఇవే పొడిమాటలు.

మరో సౌలభ్యం ఏమిటంటే, ఇవన్నీ వేరు వేరు చోట్ల ఒకేనటుడితో, అదే ఇంటి యజమాని వేషం వేస్తున్న మా దంతేశ్వరరావుతో నేను అనాల్సిన డైలాగులు.

‘‘ మొత్తం ఆరు చిత్తాలున్నాయి. ఏవి ఎక్కడ అనాలో గుర్తుకు రాక పోతే నన్నేం అనకూడదు. ’’ అని ముందే చెప్పాను.

నాటకం మొదలయింది. మేష్టర్లు నాటిక వేస్తున్నారని చెప్పి సాలూరి జనం విరగబడి పోయేరు.

నాపని రంగస్థలం మీదున్న బల్లలనీ వాటినీ తుడుస్తూ ఉండడమే

‘‘ జోరా మేషారూ ! ... జోరా మేషారూ ! ’’ అంటూ మా పిల్లలూ, ప్రేక్షకులూ ఒకటే చప్పట్లు. నాలో నటుడు పెట్రేగి పోయేడు. గబగబా అన్నింటినీ తుడిచేస్తూ వీర లెవెల్లో నటించేస్తున్నాను.

నాటిక మేం ఎంత ఛండాలంగా వేసినా, ఇక్కడి జనాలు అల్లరి చెయ్యరనీ, పైపెచ్చు సరదాగా చూస్తారనీ తెలిసి పోయేక ఇక నాకు ధైర్యం వచ్చీసింది.

ఆరు చిత్తాలు కాస్త పదిహేను ఇరవై చిత్తాలు వరకూ పెరిగి పోయేయి. లెక్క చూసుకో లేదు. సరదా పుట్టి నప్పుడల్లా చిత్తం అనేస్తున్నాను. నాలోని నటుడ్ని ఎవరూ ఆప లేక పోయేరు.

ఒక చోట టేబిలు మీద ఉన్న టెలి ఫోన్ ని రిసీవర్ మీదకెత్తి తుండు గుడ్డతో తుడుస్తున్నాను. . ఆ సన్నివేసంలో ఇంటి యజమానికి ఒక ముఖ్యమైన పోన్ కాల్ రావాలి. ఆ ఫోన్ కాల్ కథని మలుపు తిప్పుతుంది. రిసీవర్ ని మీదకెత్తి తుడుస్తూ ఎంతకీ క్రెడిల్ చేయడం లేదు నేను. నౌకరు పాత్రలో జీవించేస్తున్నాను. మా దంతి ‘‘ ఫోను పెట్టండి జోరా మేషారూ ’’ అని సైగలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకి నేను రిసీవరు పెట్టకుండానే తెర వెనుక నుండి కాలింగ్ బెల్ మ్రోగడం, నా చేతిలోని రిసీవరుని మా దంతేశ్వర రావు అందు కోవడం జరిగి పోయేయి. అంతా ఒకటే నవ్వులే నవ్వులు !

‘‘ నేనింక ఈ బాధలు పడ లేనురా ... ఏ రైలు కిందో తల పెట్టీవాలనుందిరా ... ’’ అని ఇంటి యజమానిగా మా దంతి డైలాగుకి ... నేను మరో చోట చెప్పాల్సిన ‘‘ చిత్తం ... అలాగేనండయ్యా ... అలాగే కానియ్యండి ... ’’ అనీసేను.!

దాంతో మా దంతి తెల్ల బోవడం, జనాలు కేరింతలు కొట్టడం ... మరడక్కండి ...

మొత్తం మా మేష్టర్ల నాటిక రసాభాసగా ముగిసింది.

వెన్న పూసలాంటి మనసున్న మా సాలూరి జనాలకి అదేమీ పట్ట లేదు. మేం నాటిక వేయడమే చాలునన్నంతగా ముచ్చట పడి పోయేరు.

ఇలా జరిగింది నా నాటక రంగ ప్రవేశం. మరెప్పుడూ నటుడిగా స్టేజి ఎక్కింది లేదు. అందు వల్ల తెలుగు నాటక రంగం ఇప్పటిదాకా బతికి బట్ట కట్టిందను కుంటాను.





స్వస్తి.