17, మే 2015, ఆదివారం

సభకు నమస్కారం !

సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణమ్.

చక్కగా మాట్లాడ గలగడమే వ్యక్తికి అలంకారం. ఆకట్టుకునేలా ప్రసంగించ గల వారికి ఎప్పుడూ సంఘంలో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. సభలలో అయితే, వక్తలలో గొప్పగా ఉపన్యసించ గలడని పేరు పొందిన వక్తల ప్రసంగాలను కార్యక్రమం చివరిలో ఉండేటట్టుగా నిర్వాహకులు జాగ్రత్త పడుతూ ఉంటారు. దానికి కారణం సభకు వచ్చిన జనాలను వెళ్ళి పోకుండా కట్టడి చేయడానికే అనే విషయం సర్వ విదితమే.

సభలలో తరుచుగా మాట్లాడాల్సి వచ్చే వక్తలకు ఎదురయ్యే ప్రధాన సమస్య , ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించడం అనేది. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియ జేస్తూ, ప్రేక్షక మహాశయులకు అభివాదాలు చేస్తూ ప్రారంభించాలనుకున్న వారి ఉపన్యాసం, వేదిక ఒక్కో సారి పెద్దలతో క్రిక్కిరిసి పోయి ఉండే పక్షంలో ఈ ప్రారంభ వాక్యాలు ఎంతకీ తెమలవు. దాదాపు వందన సమర్పణలా ఉంటాయి వారి ఉపన్యాస ప్రారంభ వాక్యాలు.

ఏవో తంటాలు పడి మొదలెట్టాక, ఇక ఆగే పని లేదు. వినేవారి సహనాన్ని పరీక్షకు పెట్టడమే

మైకాసురులని వీరిలో కొందరు అప్పటికే పేరు పడిపోయి ఉంటారు. సహనం చచ్చిన నిర్వాహకులు వారి వాక్ప్రవాహానికి అడ్డ కట్ట వేయడానికి నానా హావభావ ప్రదర్శనలూ చేస్తూ ఉంటారు.

ఎట్టకేలకు, చివరిగా ఓ రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను అని భరోసా యిచ్చిన సదరు వక్త కచ్చితంగా ఆ పీకుడు మరో అరగంట దాకా కొనసాగించాడన్నమాటే.

ఇక, సభా కార్యకమాలలో చివరి వక్తగా ఉపన్యసించ వలసిన వక్త బాధ మరో రకంగా ఉంటుంది. అప్పటికే అతను చెప్ప దలచిన నాలుగు ముక్కలూ అంతకు ముందు మాట్లాడిన వక్తలలో ఎవరో ఒకరు చెప్పీసి ఉంటారు. ఇహ అతనికి కొత్తగా ఏమీ చెప్పడానికి మిగలక పోవడంతో ఉపన్యసించడానికి నానా తంటాలూ పడతాడు. విలువ చచ్చిన ఆ మాటలకు విసిగి పోయిన ప్రేక్షకులు ఒక్కోసారి ఉదాత్తంగానూ, ఒక్కోసారి భీకరంగానూ తమ అసమ్మతిని ప్రదర్శిస్తూ ఉంటారు.
బెదిరి పోయిన సదరు వక్త అర్ధాంతరంగా ఉపన్యాసం ముగించీసి, ఓ రైలు తప్పి పోయిన వాడి నవ్వు ముఖాన పులుముకుని, తిరిగి తన సీటులో కూలబడి, కర్చీఫుతో ముఖం రుద్దుకునే కార్యక్రమాన్ని మొదలెడతాడు.

ఉపన్యాసకులలో గండరగండలు కొందరుంటారు. వారికి వేదికతో పని లేదు. ప్రేక్షకులతో నిమిత్తంత లేదు. కార్యక్రమ అజెండాతో పని లేదు. సభా కార్య క్రమం దేనికి సంబంధించినదో వారికి తెలియ నక్కర లేదు. వస్తారు. అనర్గళంగా ఉపన్యాసంతో చితక్కొట్టేస్తారు. జరూరు పని ఉంది. మీరంతా మన్నించాలి అంటూ వారి అనుమతితో నిమిత్తం లేకుండా అక్కడ నుండి వెళ్ళి పోతారు. ఈ జబర్దస్తీ వక్తలు దేని గురించయినా మాట్లాడ గలరు. సాహిత్య సభలో కూరగాయల గురించీ, కార్మిక సభలో కథా సాహిత్యం గురించీ .....

ఇక, సభలలో దండల ప్రహసనం గురించి చెప్పు కోవాలంటే చాలా ఉంది. ఒక్కో తూరి కొన్ని సభలలో అప్పటి కప్పుడు దండలు వేసి సత్కరించాల్సిన వ్యక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోతూ ఉండడంతో నిర్వాహకులు చేసేదేమీ లేక నిర్మొహమాటంగా ముందు సత్కరించిన సన్మానితుని కాస్త ప్రక్కకి లాగి, ఒక్క ముక్క క్షమాపణలతో దౌర్జన్యంగా వారి మెడలోని దండలను, వారి చేతికిచ్చిన బొకేలను, కొండొకచో వారికి కప్పిన దుశ్శాలువాను కూడా ఒలుచుకు పోతారు. ఇంద్రడుకి తన సహజ కవచ కుండలాలు ఇచ్చిన దాన వీర శూర కర్ణుని భంగిమలో ఓ చిరు నవ్వు బలవంతాన విసిరి లోలోపల కుమిలి పోతూ ఆ దౌర్జన్య కాండకు తలొగ్గడం తప్పితే సదరు వక్త చేసేదేమీ ఉండదు.

సభల గురించి మాట్లాడు కునేటప్పుడు కురు సభలో శ్రీకృష్ణ రాయబారం గురించి తలచు కోకుండా ఉండలేం. ఒక నిండు సభలో అంత అర్ధవంతంగా ఉపన్యసించిన మహా వక్త ప్రపంచ చరిత్ర లోనే మరొకడు లేడు.

మన వివేకానందుడినీ,

వాళ్ళ చర్చల్ నీ ఓ సారి మనసారా తలుచుకుని కాసంత ముందుకు జరుగుదాం.

కల్పిత పాత్రే అయినా, మన జంఘాల శాస్త్రిని మరచి పోవద్దు సమా !

ఇంకా ఎందరో మహానుభావులు. వారందరకీ వందనాలు చెబుతూ నా ఎరికలో జరిగి సభావశేషాలు, సభా విశేషాలు ఒకటి రెండు మీ ముందుంచుతాను:


విశాఖ పట్నంలో శ్రీ,శ్రీ షష్టి పూర్తి సభలో కవి ఆరుద్ర అలిగేరు. వివరాల జోలికి నేనిప్పుడు పోదలచు కోలేదు. ఆ రోజు సాయంత్రం పెద్ద బహిరంగ సభ జరిగింది. తాపీ ధర్మారావు సభాధ్యక్షులు.
అలిగిన ఆరుద్ర గారూ, వారి శ్రీమతి రామ లక్ష్మి గారూ ముందు వరసలో కూర్చున్నారు. సభలో ఉపన్యసించేందుకు ఆరుద్ర సుముఖంగా లేరు.


తాపీ ధర్మారావుగారు, ఇహ ఊరుకో లేక, పెద్దాయన కనుక, పెద్దరికం వహించి ఆరుద్ర గారిని ఉపన్యసించడానికి వేదిక మీదకి ఆహ్వానించేరు. ఆరుద్ర కదల లేదు.

తాపీ వారు వదిలి పెట్ట లేదు. ‘‘ ఇప్పుడు సభను ఉద్దేశించి ఆరుద్ర గారు నాలుగు మాటలు మాట్లాడుతారు.’’ అని ఏకపక్షంగా ప్రకటించారు. దాంతో ఆరుద్రకి ఎక్కడో కాలింది. మౌనంగా వేదిక ఎక్కి,

‘‘ సభకు నమస్కారం ! ఇక సెలవు !’’

అని, నాలుగంటే నాలుగే ముక్కలు పలికి వేదిక దిగి పోయేడు. ఆరుద్ర చతురతకి సభ నివ్వెర పోయింది.

ఆ తర్వాత మెత్తబడిన ఆరుద్ర ఆనాటి సభలో అపూర్వమైన ప్రసంగం అనర్గళంగా చేసేడనుకోండి ...

నేను విన్న మరో సభా ముచ్చట:

ఓ పెద్ద సభలో దేశం పట్టనంత ఒక మహాకవికి సన్మాన కార్యక్రమం జరిపించేరు. ఎందు చేతనో కానీ దుశ్శాలువా విషయంలో కొంత ఉదాసీనత కనబరచి, చవక రకం శాలువా కవిగారికి కప్పేరు. అంతే, కవిగారికి ఒళ్ళు మండి పోయింది. ఆ అసంతృప్తిని అణుచుకుంటూ ఇలా అన్నారుట: ‘‘ ఈ కార్యక్రమ నిర్వాహకులు నాకు కప్పిన శాలువా మాకు చాలా ఉపయోగ పడుతుందని విన్నవిస్తున్నాను. చాలో రోజులుగా ఒడియాలు పెట్టేందుకు సరైన గుడ్డ లేదంటూ ఇటీవల మా ఆవిడ ఒకటే సణుగుతోంది. ఆలోటు దీనితో తీరిపోతుంది.’’

కవిగారి వ్యంగ్యంతో కంగు తిని, నిర్వాహకులు అప్పటికప్పుడు ఖరీదయిన మరో శాలువా తెప్పించి వారికి కప్పి, బ్రతుకు జీవుడా ! అని ఊపిరి పీల్చుకున్నారుట.

ఒక సారి ఓ పెద్ద సభలో ప్రముఖ నటులు శ్రీ గుమ్మడి వేంకటేశ్వర రావు గారు ఉపన్యసించడానికి లేచారు. సభ నానా గోలగా ఉంది. ఎంతకీ సద్దు మణగ లేదు. గుమ్మడి గారు చాలా సేపు నిరీక్షించేరు. కార్యక్రమ నిర్వాహకులు కంగారు పడి పోతున్నారు. వాలెంటీర్స్ ఎక్కడో తిరుగుతూ పట్టించు కోవడం లేదు. ప్రేక్షకుల మధ్యకి పరుగులు తీసి వారిని సద్దుమణిగేలా చేదామని ఒకరిద్దరు వేదిక మీదనుండి లంఘించ బోయారు. గుమ్మడి గారు వాళ్ళని కంటి చూపుతో నివారించి, కంచు కంఠంతో హాలు దద్దరిల్లిపోయే లాగున ‘‘ హలో, వాలంటీర్స్ ! ముందు మీరంతా నిశ్శబ్దంగా ఉండాలి ’’ అని అరిచేరు.

మొత్తం సభలోని వారంతా ఒక్క సారి ఉలిక్కి పడి, అందులో చమత్కారం అర్థం చేసుకుని చాలా సేపు పగలబడి నవ్వేరు. తర్వాత గుమ్మడి గారు అద్భుతమైన ప్రసంగం చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్ద వతావరణంలో చేసారు.

సభా కార్యక్రమాలలో వక్తల తొట్రుపాటుల వల్లనయితే నేమి, తెలియమి వల్ల నయితే నేమి జరిగే సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి కూడా. బరువైన పదాన్ని వాడాలనే దుగ్ధతో సన్మానితునికి శ్రద్ధాంజలి ఘటించే వారూ, సంతాప సభలో ప్రసంగించే అదృష్టం దక్కినందుకు తనకా రోజు అమితానందంగా ఉందంటూ వాక్రుచ్చే వారూ కూడా కనిపిస్తూ ఉంటారు.

నొక్కి వక్కాణించడాలూ, బల్ల గుద్ది చెప్పడాలూ సభలలో సర్వసాధారణం.


కవితా పఠనం జరిగే సాహితీ సభలలో అయితే ఒక్కో సారి పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి.

ఏ కవీ తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూస్తూ ఉంటాడే కాని. తన ముందు వాడి కవిత్వం శ్రద్ధగా విన్న దాఖలాలు ఎక్కడో కానీ కనిపించవ్.


సభలలో వక్తల హావ భావ చేష్టల వల్ల కూడా ఒక్కో సారి నవ్వులు పూస్తూ ఉంటాయి.

వక్తలలో కొందరకి కొన్ని పదాలు అలవాటుగా పదే పదే దొర్లిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం, అవి వారి ఊత పదాలు మరి.

ఒక సారి ఒక ప్రాచ్య కళాశాలలో వార్షికోత్సవ సభ జరుగుతోంది. సభాధ్యక్షత వహించిన వారు పెద్ద పోలీసు ఆఫీసరు. ఆమెకు తెలుగు అంతగా రాదు. కళాశాల ప్రిన్సిపాల్ గారు మహా పండితులు. వారికి మాట మాటకీ ‘‘ దీని పేరేమిటీ ...‘‘ అనే ఊత పదం వాడడం అలవాటు. అలవాటు ప్రకారం, ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మాటి మాటికీ దీని పేరేమిటీ ... అనడం మొదలు పెట్టారు. అలా అన్న ప్రతి సారీ ఆయన చూపుడు వేలు అనుకో కుండా ఆవిడ గారి వేపే చూపెడుతూ ఉండడంతో సభలో అంతా క్షణానికో సారి పెద్ద పెట్టున నవ్వుతూ గోల చేసారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో కళాశాల అధ్యక్షుల వారికీ తెలియ లేదు .సభాధ్యక్షురాలికీ అవగతం కాలేదు !

వక్తలకు ఇలా ఊత పదాలు లేనిదే మాట్లాడ లేని బలహీనత ఉంటే మాత్రం సభల్లో హాస్యరసం చిప్పిల్లక తప్పదు.

సరే, కథా మంజరి అలవాటు ప్రకారం సభ గురించిన ప్రస్తావన ఉన్న ఒకటి రెండు శ్లోకాలను ప్రస్తావించాలి కదా ?

చూడండి:

న సా సభా యత్ర న సంతి వృద్ధా:, న తే వృద్ధా యే న వదంతి ధర్మం
నా సౌ ధర్మో యత్ర న సత్యమస్తి, న తత్సత్యం యచ్చతే నాభ్యుపేతమ్

ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు. ఎవరు ధర్మాన్ని చెప్పరో, వారు వృద్ధులు కారు. దేని యందు సత్యం లేదో, అది ధర్మం కాదు. దేని వలన లోక కల్యాణం జరుగదో అది సత్యం కాజాలదు. అని మహా భారతం చెబుతోంది. అంటే, లోక కల్యాణం చేసే సత్య ధర్మ ప్రవచనం చేసే పండితులు ఎక్కడ ఉంటారో, అదే మంచి సభ అని భావం.

మరో శ్లోకం చూడండి:

యత్ర ధర్మో హ్యధర్మేణ, సత్యం యత్రానృతేన చ,
హన్యతే ప్రేక్షమాణానాం, హతా స్తత్ర సభాసద:

ఏ న్యాయ సభలో ధర్మం అధర్మం చేతను, సత్యం అబద్ధం చేతను బాధింపబడుతోందో ఆ సభలోని సభాసదులు జీవచ్ఛవాల వంటి వారే అవుతున్నారని దీని భావం.

ఇక్కడ మరో చిన్న అంశం - సభలోని వారిని సభాసదులు అని వాడడం జరిగింది. సాధారణంగా సభలోని వారిని సభికులు అనడం కద్దు. కానీ, సభికులు అంటే సభలో ధర్మం తెలిసిన వారే అనే కాక, జూదరులు అనే మరో అర్ధం కూడా ఉండడంతో ఆ పదం వాడడం అంత సబవుగా తోచదు.

మరొకటి చూడండి:

విపది ధైర్య మధాభ్యదయే క్షమా, సదసి వాక్పటుతా యుధి విక్రమ:
యశసి చాభిరతి ర్వ్యసనం శ్రుతౌ, ప్రకృతి సిద్ధ మిదం హి మహాత్మనామ్


ఈ శ్లోకంలో కవి కష్టంలో ధైర్యాన్ని, ఐశ్వర్యం కలిగి నప్పుడు ఓర్పు, యుద్ధంలో భుజబలం, కీర్తియందు ఆసక్తి విద్యయందు కోరిక సజ్జనుల సహజ గుణాలుగా చెబుతూ సభలలో సంపూర్ణమైన వాక్ నైపుణ్యం కలిగి ఉండడం కూడా సజ్జనుల సహజ గుణ మని చెబుతున్నాడు.

న సా సభా యత్ర న భాతి కశ్చిత్, న సా సభా యత్ర విభాతి చైక:
సభా తు సైవా2స్తి యథార్హరూపా, పరస్పరం యత్ర విభాంతి సర్వే.

ఒక్కడూ ప్రకాశించనిది, అది సభ అనిపించు కోదు. అంటే ప్రసంగించిన వక్తలందరూ చెత్తగా మాట్లాడితే అది మంచి సభ అనిపించు కోదుట. పోనీ, ఏ ఒక్కరో ప్రకాశించినా అదీ మంచి సభ అనిపించు కోదుట. అంటే, సభలో వక్తలంతా చెత్తగా ప్రసంగించి , ఏ ఒక్క వక్తో గొప్పగా మాట్లాడినంత మాత్రం చేత ఆ సభ మెచ్చుకో తగినది కాదని భావం. ఎక్కడయితే, ఉన్న వారందరూ ఒకరి వల్ల ఒకరు అధిక తరంగా ప్రకాశిస్తారో, అదే సభ అనే పేరుకి తగినది అని కవి భావం.


సభ గురించిన మరో మంచి శ్లోకం చూడండి:


సభా కల్పతరుం వందే, వేదశాఖోపజీవితం
శాస్త్రపుష్ప సమాయుక్తం, విద్వద్భ్రమర శోభితమ్.

వేదాలు అనే శాఖలతో, శాస్త్రాలు అనే పువ్వులతో, విద్వాంసులు అనే తుమ్మెదలతో ప్రకాశించే సభ అనే కల్ప వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని దీని భావం.

చివరిగా గుర్తొచ్చిన ఓ జోక్ తో ముగిస్తాను ...


‘‘ నిన్న టౌన్ హాలులో మావారికి సన్మాన సభ జరిగింది. ఎంత ఘనంగానో జరిగిందిట ! టౌను హాలు సగం జనంతో నిండి పోయిందిట. తెలుసా !?’’ అంది మీనాక్షి దర్పంగా స్నేహితురాలు కామాక్షితో.

దానికి కామాక్షి మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ’’ పోదూ, మరీ బడాయి కాక పోతే ... ఆ సభకు మా వారూ వచ్చేరు. సగం హాలంతా ఖాళీయేనట కదా ? ’’ అంది.

స్వస్తి.




15, మే 2015, శుక్రవారం

అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ !



ఇదేమయినా బావుందా , చెప్పండి ..‘కట్నం తీసుకునే వాడు  గాడిద ’ అని ఓ టీ.వీ ఛానెల్ అడపా దడపా హెచ్చరించడం మా గాడిదల దృష్టికి వచ్చింది. మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఏ గాడిదయినా నవ్వి పోతుంది. గాడిదలు కట్నం తీసు కోవడమేమిటి ! గాడిదలు కట్నం తీసుకున్న వైనం ఎక్కడయినా చరిత్రలో విన్నామా ? కన్నామా ? మరి కట్నం తీసుకునే వాడిని మాతో పోలిక తేవమేఁవిటి ? చోద్యం కాక పోతేనూ ! మధ్యలో మా వూసెందుకూ ఎత్తడం మేఁవంటే చులకన కాక పోతేనూ ? వెనుకటి కొక తండ్రి కూడా ఆడిన మాటను తప్పిన కొడుకుని గాడిదా ! అని తిట్టడం, వీడా కొడుకని గాడిద ఏడవటం జరిగింది. ఇలా ప్రతీ వాళ్ళకీ అలుసై పోవడం మాకు చాలా కష్టంగా ఉంది.

అందుకే త్వరలో జరగబోయే మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలో ఈ దారుణాన్ని నిరసిస్తూ ఓ తీర్మానం పెట్టబోతున్నాం. మానవ హక్కుల వారి దృష్టికి ఈ విషయం తీసికెళతాం. హన్నా ! గాడిద లంటే అంత చులకనా ; అంటే కొంత చులకన ఉండొచ్చని అర్ధం కాదు. గానానికి మేఁవూ, అందానికి లొటిపిటనూ చెప్పు కోవాలని మా మధురవాణి అక్కయ్య చెప్ప లేదూ ...ఏఁవిటీ ... వెక్కిరింతగా చెప్పిందంటారా ? ఎలా చెప్పిందని కాదు ... చెప్పిందా లేదా ? అంటే లోకంలో మా అందం గురించి ఎంతో కొంత చర్చ ఉండడం బట్టే కదా ? నిజానిజాలు పైవాడి కెరుక. చూసే అందం చూసే వాడి కళ్ళలో ఉంటుంది. గాడిద పిల్ల గాడిదకి ముద్దు. అలాగే గాడిదల అందం గాడిదలకే సొంతం. మా వినయ గుణమే మాకు అందం. గుర్రాన్నీ గాడిదనూ ఒక తాట కట్టొద్దని చెప్పడం గురించి అంటారూ ? దాని గురించి కూడా మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్రాల దేం అందం లెద్దురూ . గాడిద గుడ్డు అందం. అదిగో... ఈ ధూర్త మానవుల మాటలు చెవిని పడి పడీ మాకూ అనుకోకుండా అవే మాటలు వచ్చేస్తున్నాయి కదూ ? గాడిద గుడ్డేఁవిటి ? గాడిద గుడ్డు.

గాడ్ ద గుడ్ అనే దానికి వచ్చిన పాట్లు అవి. ఈ మాటని కూడా లోక వ్యవహారం లోనుండి తరిమేసేలా మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ చర్యలు తీసుకుంటుంది.

గంగి గోవు పాలు గరిటడైనా చాలుట. కడివెడైనా ఖరము పాలు శుద్ధ దండగ అంటాడు ప్రజాకవి, గోవు మా లచ్చిమి అంటే మాకూ గౌరవమే కానీ మా పాల గురించి అలా అనడం ఏమన్నా బాగుందా చెప్పండి ? ఏమీ, మా బిడ్డలు మా పాలు తాగి ఏపుగా పెరగడం లేదా ? మమ్ములనూ, , మా పాలనూ హేళన చేస్తూ మా మనోభావాలను కించ పరచడం బాగుందా ?

వసుదేవుడంతటి వాడు మా జాతివాని కాళ్ళు పట్టు కొన్నాడే ! తెలుగు సంవత్సరాలలో ఖరనామ వంవత్సరంగా అజరామరంగా నిలిచేమే ? ఒక దేవజాతి ముఖాకృతిగా కలవారమే ! అట్టి మాకా ఈ దుర్గతి ... మా పట్లనా ఇంత చులకన భావం. ?

అధికారికి ముందూ, గాడిదకు వెనుకా ఉండ కూడదంటారు. అలా వాటంగా వెనక్కాళ్ళు రెండూ ఒకేసారి ఎత్తి తన్నగల మరో ప్రాణి లోకంలో ఉందా చెప్పండి ? అదీ మా ఘనత ! దానిని గుర్తించ రేమీ ?

మాలో కంచర గాడిదలూ, అడ్డ గాడిదలూ ఉన్నాయంటారు, సార్ధవాహుల సామాన్లు మోసే కంచర గాడిదల ఉన్నాయి కానీ నిజానికి అడ్డ గాడిదలంటూ మాలో వేరే జాతి గాడిదలంటూ ఏవీ లేవు. అట్టివి నరజాతిలో ఉన్నట్టు వినికిడి.

ఎందుకంటే, వెనుకటికి ఓ కవి సభలో ఓ సమస్యను పూరిస్తూ, ‘‘ కొందరు భైరవాశ్వములు ... అంటూ చెబుతూ .. కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు అని మమ్మల్ని కూడా పేర్కొన్నాడు. అంచేత నరజాతిలో అడ్డగాడిదలు ఉన్నట్టు రూఢి అయినట్టే కదా !

మునిమాణిక్యం నరసింహారావు గారు బడి పంతులు. ఓ రోజు పిల్లల కాంపోజిన్ పుస్తకాల కట్ట  చంకన పెట్టుకుని వస్తున్నారు. ఓ కొంటె విద్యార్ధి  వారిని అల్లరి పెడదామని, ‘‘ఏఁవిటి మాష్టారూ ? గాడిద బరువు మోస్తున్నారూ ?’’ అన అడిగేడు. దానికాయన వాడి మాడు పగిలేలా జవాబిచ్చేరు. ‘‘  అవున్నాయనా ! ఇది ఒక గాడిద బరువు కాదు నాయనా ! నలభై గాడిదల బరువు ! ’’ అని ...

అలాగే  ఓసారి ముట్నూరు కృష్ణారావు గారి మనవరాలు  చుట్టపు చూపుగా బందరు వచ్చి, తాతగారితో హాస్యమాడదామని, ‘‘ ఏఁవిటి తాతగారూ ! మీ ఊరినిండా గాడిదలే  కనిపిస్తున్నాయి ! ’’ అంది. దానికాయన తాపీగా ‘‘ అవునమ్మా, ఉన్నవి చాలక ఈ మధ్య పై ఊళ్ళ నుండి కూడా వచ్చి చేరుతున్నాయి ... ’’అని జవాబిచ్చి మనవరాలి కోణంగి తనానికి ధీటైన జవాబిచ్చేరు.
చూసారా ? జోకులు బావున్నాయి కానీ, అవీ మాతోనే ముడిపడి ఉన్నాయి.  మా బతుకు అలాంటిది మరి.

మేం మోసేవి పాత బట్టల మూటలే కావొచ్చు. కానీ పాత మాటల మూటలు మోసుకుంటూ గొప్ప కవులమని విర్రవీగుతూ తిరిగే కుకవుల కన్నా మేం గొప్పే కదా ?

మా బాధ్యత మేం చేస్తున్నామంతే.  మనకి చెందని పనుల్లో జోక్యం చేసుకుంటే చావు దెబ్బలు తప్పవని మా జాతి వాడే లోగడ నిరూపించేడు కూడానూ.

గుర్తుందా ? ఒక మడివేలు ఇంట ఓ కుక్క గాడిద ఉండేవి.  ఓ రోజు రాత్రి యజమాని ఇంట దొంగ పడ్డాడు. కుక్కా, గాడిదా కూడా దొంగ  పడడం చూసేయి.  చాకలి తనని బాగా చూడడం లేదనే ఉక్రోషంతో కుక్క తన కర్తవ్యం మరచి, అరవడం మానేసింది.గాడిద ఎంత చెప్పినా కుక్క అరవ లేదు. గాడిద తన యజమానికి మేలు చేయాలనే ఆలోచనతో తనకు మాలిన పనికి పూనుకొని గట్టిగా  ఓండ్ర పెట్టింది. గాఢ నిద్రలో ఉన్న చాకలి దాని అరుపులకి మేల్కొని కోపంతో దుడ్డు కర్ర తీసుకుని దానిని చావమోదాడు. త్యాగశీలి అయిన ఆ గాడిద తాను చావు దెబ్బలు తిని కూడా లోకానికి  ఎంత గొప్ప నీతిని తెలిపిందో కదా ! అలాంటి త్యాగధనుల జాతి మాది.


వెనుకటి రోజులలో ఇళ్ళలో ఆవకాయలు పెట్టేడప్పుడు అమ్మలూ. అత్తలూ. పిన్నమ్మలూ వగైరాలు మావిడి కాయలు ముక్కలుగా తరుగుతూ ఉంటే పిల్లలు వాటి జీళ్ళు పట్టుకు పోయి ఇంట్లో గోడల మీద కుడ్య చిత్రాలు వేసేవారు. గోడ పత్రికలతో  గో డలన్నీ ఖరాబు చేసే వారు.

ఆరాతల్లో దడిగాడు వానసిరా అనే మాట తరచుగా కనిపిస్తూ ఉండేది. వాళ్ళ రాతల్లో మాప్రస్తావన రావడం కొంచెం నొచ్చుకునే అంశమే అయినా, పిల్ల చేష్టలు ఎంతో మురినెం కదా. ఇప్పుడా బాధ లేదు. ఇళ్ళకు

రంగులు  వేద్దామన్న ఆలోచన రాగానే ముందుగా మీటింగ్ పెట్టి గోడల మీద పిచ్చి రాతలు రాసేరో. తాట  ఒలిచేస్తాం గాడిదల్లారా ! అనే హెచ్చరిక మా పేరు సాక్షిగా వెలువడుతుంది.

కరభము, ఖరము, గార్ధభము, గాలిగాడు ... లాంటి చాలా పేర్లు మాకున్నాయి. వాటిలో గాడిద అనే పేరే ముచ్చటగా ఉంటుంది.

అదలా ఉంచితే ...

క్షుద్ర మానవ జాతి మా పేర ఎన్ని సామెతలు పుట్టించిందో  కాస్త చూడండి ...

1.గాడిదకు గడ్డి వేసి, ఆవును పాలిమ్మన్నట్టు.

2.గాడిద కూత ( ఓంఢ్ర ) గాడిదకు కమ్మనిదే కదా

3.గాడిదకు పులి తోలు కప్పితే కఱవ గలదా ?

4.గాడిదకు మంగళ స్నానం చేయిస్తే, బూడిదలో పొర్లిందిట !

5.గాడిద కేమి తెలుసు గంధపు వాసన.

6.గాడిద కొడకా ! అంగే మీరు తండ్రులు, మేము బిడ్డలం అన్నాడట.

7.గాడిద గుడ్డు గరుడ స్తంభం.

8.గాడిదలతో వ్యవసాయం చేస్తూ, కాలి తాపులకు  దడిస్తే ఎలా ?

9.గాడిదతో స్నేహం కాలి తాపులకే

10.గాడిద పుండుకు బూడిద మందు.

11.గాడిద మోయదా గంధను చెక్కలు ?

12.గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్

13. గాడిదల మోత, గుఱ్ఱాల మేత

14, గాడిదలు దున్నితే, దొమ్మరులు పంటకాపులు కారా ?

15. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందిట !

ఇహ చాలు. త్వరలో జరుగబోయే అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలకు స్వాగత గీతం రాసే పనిలో బిజీగా ఉన్నాను. శలవ్...

12, మే 2015, మంగళవారం

చప్పట్ల బాబా !




చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.

‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.

‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్ప కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’

‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.

‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరిగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు,

ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిష్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి

మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.

అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ ఉండడా ? ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం. అంతే. ’’

ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.

ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?

‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’

ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీపాను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.

చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...

ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్

ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?

తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో

పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !

అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.

‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.

సత్యాన్ని మించిన అసత్యం లేదు,

హింసను మించిన అహింస లేదు.

ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు,

ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు

అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా ! అని మూయిస్తాం.

మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...

మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మంచి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట మన తాత్విక బోధనలు. మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.

నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించి . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది. ధన్యోస్మి.

జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.

చప్పట్ల బాబా తన తొలి భక్తుడిని చూస్తూ చిరు నవ్వులు చిందించారు.



1.


















































10, మే 2015, ఆదివారం

గొప్ప గొప్ప రచయితలూ, అసంపూర్ణ రచనలూనూ !



ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.

ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు.

ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.

పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వెయ్య మంటారా అన్నయ్య గారూ ? ! ’’ అని మా ఆవిడ అడిగితే సిగ్గు , మొహమాటం వగైరా వగైరాలని తెగ అభినయిస్తూ, ‘‘ఒ క్ఖటి ... ఒక్కటంటే ఒఖ్ఖటి ... ’’ అని ఇదై పోయే వాడు. ( ఏదయి పోయే వాడని మీరు నన్ను నిలదీస్తే చెప్పడం కష్టం. )

అలాంటిది, కొంత పరిచయం పెరిగాక ( అంటే వాడే మాతో పెంచు కున్నాక, ) ‘‘ చెల్లాయ్ ! ఇవాళ టిఫి నేమిటో ? ’’ అని ఆరా తీసే స్థాయికి ఎదిగాడు. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి పోయి, తనకి ఏ టిఫిను కావాలో అడిగి ( హొటల్లో మాదిరి ) ఆర్డరు వేసి చేయించుకునే స్థాయికి చేరి సోయేడు.

నిజం చెప్పొద్దూ ?! మా తింగరి బుచ్చి గాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు, నేను వేరే ఎవరో పరాయి కొంపలో ఉన్నట్టుగా ఉంటుంది !

అంత చనువు సంపాదించేసాడు మాయింట్లో.

వాడి వాలకం నచ్చక మాఆవిడకు నచ్చ చెప్పబోతే, నా మాట వినడం మానేసింది. అందుకు వాడు వేసిన మంత్రం ఏమిటంటే, ‘మా చెల్లాయి చేతి వంట అమృతమే ! ’ అంటూ ఆమెను ఉబ్బేయడమే. అన్నీ అబద్ధాలే ... ఆకాడికి అమృతం వాడేదో రుచి చూసినట్టు అని లాజిక్కు వినిపించాను. ‘‘ ఊరుకోండి ! మీకంతా కుళ్ళు ... మీరు తప్ప నా చేతి వంట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చు కుంటారు ... మీరే ఎంపుళ్ళు పెడతారు ’’ అని మూతి మూడు వంకర్లుతిప్పింది. నాలో పురుషాహంకారం విజృంభించి, ‘‘ ఆకాడికి నీ చేతి వంటని లోకం లోని ప్రజానీకమంతా తిన్నట్టు ! బిల్ గేట్స్ తిన్నాడా ? బిల్ క్లింటన్ తిన్నాడా ?

అక్కినేని నాగేశ్వర రావు తిన్నాడా ? అమితాబ్ బచ్చన్ రుచి చూసాడా ?... ఘంటసాల తిన్నాడా ? పెంటగాన్ ప్రజలు చవి చూసేరా !... చైనా వాడు తిన్నాడా ? నానీ పాట్కర్ తిన్నాడా ! ...’’ అంటూ వర్లించేను. ఆ దెబ్బకి మా ఆవిడ వారం రోజులపాటు నాతో మాట్లాడడం మానీసింది. అప్పటి నుండి మా తింగరి బుచ్చి గాడొస్తే, వొళ్ళు మండి పోతున్నా సరే, ఓర్చుకుని మౌనంగా ఉండడం మొదలెట్టాను. కన్యా శుల్కంలో చెప్పినట్టు పేషెన్ప్ ఉంటే కానీ లోకంలో బతకలేం ! ( పూర్ రిచర్డ్ ఉవాచ. గిరీశం నోటంట)

సరే, అదలా ఉంచితే , తింగరి బుచ్చి గాడి బలహీనతా, బలమూ కూడా ఒక్కటే. ! అది ... వేదికను చూస్తే వెర్రెత్తి పోవడం ! మైకుని చూస్తే మైమరచి పోవడం ! ప్రజా సమూహాన్ని చూస్తే పరవశించి పోవడం !

ఎవరెంత వెనక్కి లాగినా కించ పడకుండా అనర్గళంగా ఉపన్యాసం దంచడం ...

చాలా సార్లు వాడిని జనాలు బలవంతంగా వాడి చేతి లోని మైకుని లాక్కుని, వేదికి మీద నుండి లాగి పడేసారు. దాని కతడు ఏమాత్రమూ అవమాన పడి నట్టు లేదు. పైగా, ‘ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బ లన్నట్టు ’ అనే ఉదాత్త మయిన ఉపమానంతోనూ. ‘ మొరిగే కుక్కకే కాలి దెబ్బ లన్నట్టూ ’ అనే నీచోపమానంతోనూ సమర్ధించు కునేవాడు.

‘‘ నువ్వు గిరీశానికి తక్కువా, గణపతికి ఎక్కువా నయ్యా ’ అన్నాను ఓసారి నేరక పోయి. దాని కతడు సంతోషించేడు. గిరీశం వంటి మహాను భావుడి సంగతి ప్రక్కన పెడితే గణపతితో సమానం చేసి మన్నించడం నాకు చాలా సంతోషంగా ఉంది కథా మంజరీ !’’ అని ఆనందాశ్రువులు రాల్చేడు. ముద్దొచ్చి నప్పుడల్లా వాడు నన్నలాగే సంబోధిస్తాడు. అప్పటికి గానీ నేనెంత తప్పు చేసానో నాకు స్ఫురించ లేదు. సాహితీ ప్రియుల మనోభావాలు ఎంతగా దెబ్బ తింటాయో కదా ! అని మనసు విలవిల లాడి పోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు ‘‘ అంతే కాదు ... నువ్వు జంఘాల శాస్త్రికి తక్కువా, జన్ని వలస కన్నయ్యకి ఎక్కువానోయీ !’’ అనేసాను. ఈ సారి కూడా వాడు అమందానంద కందళిత హృదయారవిందు డయ్యేడు ....‘‘‘

‘‘ఎంత మాట !

జంఘాల శాస్త్రి గారితోనా పోలిక ! .. అపరాధం ! కానీ, ఆ జన్ని వలస కన్నయ్యగా రెవరోయీ ’’ అన్నాడు తన్మయంగా ... వీడికి వాడి గురించి తెలియక పోవడం నా అదృష్టం.

( వాడో పిచ్చోడు . తనలో తనే ఎప్పుడూ ఏదో వదరుతూ తిరుగుతూ ఉంటాడనే సత్యం నేను తింగరి బుచ్చికి చెప్ప దల్చుకోలేదు. )

అయిందా ?
అలాంటి తింగరి బుచ్చి అనే శాల్తీ నా ప్రారబ్ధం కొద్దీ ఈ ఉదయం మా ఇంటికి ఊడి పడి ... ‘‘ బావా ! ఎలాగయినా నువ్వో అసంపూర్ణ రచన ఒకటి వేగిరం రాసి పడెయ్యాలి !’’ అని భీష్మించుకు కూర్చున్నాడు. నేను అవాక్కయ్యాను. ( కొందరు కొన్ని విపత్కర పరిస్థితులందు ఇట్లు అవాక్కగు చుందురు కదా )

‘‘ అసంపూర్ణ రచనలంటూ ఎవరూ చెయ్యరోయి ! వివిధ కారణాల చేత వారి రచనలలో ఒకటో రెండో అలా అసంపూర్ణంగా మిగిలి పోతూ ఉంటాయంతే ...’’ అని ఙ్ఞాన బోధ చేయ బోయాను.

వాడు నవ్వి, ‘‘ నువ్వెంత అమాయకుడివి బావా ! అవి నిజంగా అసంపూర్ణ రచనలనుకుంటున్నావా ? కాదు ... కాదు ... కమ్మన్నా కాదు ! కొందరు ప్రముఖ రచయితలు మొదట్లో ఎడా పెడా రచనలు చేసి పారేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించీసుకుని, వాటిని కలకాలం పదిలంగా నిలబెట్టు కోవడం కోసం ఓ అసమగ్ర రచన రాసి పారేసి, లోకం మీద పడేస్తారు. కావాలనే ఆ రచనను అసంపూర్ణంగా రచిస్తారు. ఆ లోగుట్టు తెలీక మనం వెర్రి వెంగళప్పల్లాగా, ఫలానా ప్రముఖ రచయిత గారి అసంపూర్ణ రచన యిదీ ! అంటూ లొట్ట లేసుకుంటూ పదే పదే చదువుతాం! తెలుసా !అసలు కంటే కొసరు ముద్దనీ ... ఈ అసంపూర్ణ రచనలే వారు ముందు సంపాయించుకున్న కీర్తి ప్రతిష్ఠలను కలకాలం నిలబెడతాయ్ ఆ రహస్యం తెలియక నీబోటి వాళ్ళు ఆహా, ఓహో ! అంటూ వాటిని చదువుకుంటూ ఊఁ ... ఇదై పోతూ ఉంటారు ! ’’ అని తేల్చేసాడు.

‘‘ గోపీ చంద్ యమపాశం, రావి శాస్త్రి రత్తాలూ రాంబాబూ. అంతెందుకూ, మన అలమండ గాంధీ బాబు, అదే మన పతంజలి రాజుల లోగిళ్ళూ అలా రాసిన అసంపూర్ణ రచనలే ! కాక పోతే వాళ్ళు వాటిని పూర్తి చెయ్ లేకనా ! ’’ అని తీర్మానించీసేడు.

నా నోట్లో తడారి పోయింది. నిలువు గుడ్లేసుకుని ఉండి పోయేను.

ఈ తింగరోడి మాటలకి బదులు చెప్పే సాహసం చెయ్య లేను కదా !



’‘‘ అంతెందుకూ, నీకో పరమ రహస్యం యెబుతాను విను ! అసలు ఆనాడు నన్నయ్యగారూ. పోతన గారూ కూడా ఈ ట్రిక్కు ఉపయోగించే అసంపూర్ణ రచనలు చేసి వదిలారు తెలుసా ? ’’

ఈ వదరుబోతు మాటలకి నా జవజీవాలూ కృశించి పోయేలా ఉన్నాయి.

నా పరిస్థితిని పట్టించు కోకుండా తింగరి బుచ్చి తన ఉపన్యాసం కొనసాగించేడు.

ఆ విధంబెట్టి దనిన ...

‘‘ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతా మణితోనే అఖండ మయిన కీర్తి ప్రతిష్ఠలను మూట కట్టుకుని కూడా దానిని పదిలంగా నిలుపు కోవడం కోసం భారతం అనే అసంపూర్ణ రచన చేసాడు. రెండో, రెండున్నర పర్వాలో రాసి ఊరు కున్నాడు. అలాగే పోతన గారు కూడా ముందుగా రాసిన భోగినీ దండకంతోనే కీర్తి కాంతను స్వంతం చేసుకుని దానిని నిలుపు కోవడం కోసం భాగవతం అనే అసంపూర్ణ రచన చేసాడు ! అయితే, వారి రచనలకు మూల రచనలంటూ ఉండబట్టి ఆతర్వాత భారతాన్ని తిక్కన, ఎర్రనలూ. భాగవతాన్ని పోతన గారి కుమార రత్నమూ, శిష్య రత్నమూ పూర్తి చేసి పారేసారు ! ఆ విధంగా అసపూర్ణ రచనలుగా ఉంచేద్దామనుకున్న వారి ఆశలు కల్ల లయ్యాయి, ఆ విషయం బతికుండగా వారికి తెలియ దనుకో ... గతించేక తెలిసే అవకాశం ఎలానూ లేదు ! ...

అసంపూర్ణ రచనల వల్లనే కిర్తి ప్రతిష్ఠలు చిరకాలం ఎలా నిబెడతాయని నీ సందేహం. అవునా ? !

చెబుతా విను ! ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ... విను ...

’’ అని గుక్క తీసు కోడానికి కాస్సేపు ఆగేడు.

ఆసరికి చేతిలో అట్లకాడతో సహా మా ఆవిడ బిగ్గరగా సాగుతున్న వాడి ఉసన్యాస ధోరణికి ముగ్ధురాలై యాంత్రికంగా నడుచుకుంటూ అక్కడకి వచ్చి నిలుచుంది.

వాడు తిరిగి తింగర్యోపన్యాసం మొదలెట్టాడు :

‘‘ నువ్వంతకు ముందెన్నడూ చూడని ఓ ఊరికి వెళ్ళా వనుకో ... అక్కడ అంద మయిన ఓ పదో ఇరవయ్యో ఇళ్ళ వరస కనిపించి. సంతోష పడతావు. ఆ భవన నిర్మాణ కౌశలాన్ని మెచ్చు కుంటావు. సరే వాటి మధ్య ఖర్మ కాలి ఓ అసంపూర్ణ కట్టడం కనిపించిందనుకో. నివ్వెర పోతావు. అయ్యో అనుకుంటావు. సరే, మళ్ళీ ఆఊరెళ్ళే పని నీకు పడక పోయినా ... తర్వాతి రోజులలో ఎప్పటికీ నీకా ఊరు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ముందుగా ఆ అసంపూర్ణ కట్టడమే మదిలో మెదులుతూ ఉంటుంది. ఇందులో గొప్ప సైకాలజీ ఉంది. దానికి జర్మన్ లోనో, లాటిన్ లోనో, అధవా ఇంగ్లీషులోనో బారెడు పేరొకటి ఉండే ఉంటుంది. మనకికంకా తెలీదనుకో ! ఙ్ఞానం అసంపూర్ణంగా ఉండడం కూడా మనకి ఓ చక్కని అలంకారమే అనుకో ! ...

అసంపూర్ణ రచనలు చేసి లోకం మీద వదిలేసిన మహా రచయితలంతా ఈ సైకలాజికల్ పాయింట్ మాబాగా పట్టు కొన్నారు.

అందుచేతనే, గొప్ప వాళ్ళంతా అధమ పక్షం ఒకటయినా అసంపూర్ణ రచన చేస్తున్నారు. చెయ్యాలి కూడా. మరంచేత, నువ్వూ వెంఠనే ఓ అసంపూర్ణ రచన రాయాలి బావా ! ’’ అని ముగించాడు. ఆ వాగ్ధోరణికి మా ఆవిడ పరవశించి పోయి చప్పట్టు కొట్టింది. దాంతో రెచ్చి పోయి తింగరి బుచ్చి మరి కొంత సేపు  ఇలా ప్రసంగించాడు :

‘‘ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి రోజూ రుచి కరమైన వంటలు చేసి పెడుతున్నా, ఖర్మ కాలి ఓ రోజు ఉడకని అన్నమో, ఉడికీ ఉడకని కూరో చేసి, ఆ అసంపూర్ణ వంటకాన్ని మన ముఖాన తగ లేసారనుకో ! అదే మనకు చిరకాలం గుర్తుండి పోతుంది !

అసలా బ్రహ్మ దేవుడు కూడా కొన్ని అసంపూర్ణ రచనలు చెయ్య బట్టే, లోకంలో అర్ధాంతర చావులూ ... అల్పాయుష్క మరణాలూ సంభవిస్తున్నాయి. అందరికీ నూరేళ్ళే నుదుటన రచిస్తే, ఇక ఆ వెర్రి బ్రహ్మని తలుచు కునే దెవరు చెప్పు ? ...’’ అని ముగించాడు.
అప్పటికి నా ప్రాణాలు కడతేర్చుకు పోతున్నాయి.

సిగపాయ తీసి తందును కదా ! అనిపించింది కానీ మనకంత ధైర్యమేదీ ?!

అదీ కాక మా అమాయకపు శ్రీమతి వాళ్ళ అన్న గారి దివ్యమైన సలహాకి పొంగి పోయి : ‘‘ అవునండీ ... మీరు కూడా ఓ అసంపూర్ణ రచన చేద్దురూ ! ’’ అని ముందు గోముగానూ , తర్వాత శాసిస్తూనూ నిలదీసేప్రమాదం ఎలానూ పొంచి ఉంది. హతోస్మి !
ఇంతలో ... ... మా ఆవిడకు తటాలున  ఏదో గుర్తుకొచ్చి. కెవ్వున అరచినంత పని చేసి చేతిలో అట్లకాడతో వంటింట్లోకి పరిగెత్తింది.

వెనుక మేమూ గాభరాగా పరిగెత్తాం.
అక్కడ ... ... పెనం మీద ఆవిడ రచించిన ఓ అసంపూర్ణ రచన --- మాడి పోయిన అట్టు రూపంలో పొగలు కక్కుతోంది. ! 



తింగరి ఉపన్యాసమ్  ప్రస్తుతానికి సమాప్తమ్.

ఇట్లు విధేయుడు,

ఖర్మకాలిన కథామంజరి బ్లాగరు, మరియు తింగరి బుచ్చి గాడి బాధితుడు .




















































28, ఏప్రిల్ 2015, మంగళవారం

డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేరు ...


డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేరు !

విజ నగరానికి చెందిన ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకుడు, వక్త, బహు గ్రంధ కర్త డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేదు.

బహు ముఖీన మయిన వారి ప్రతిభ సాహితీ లోకం ఎరిగినదే. కన్యా శుల్కం - 19 వ శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలు  - తులనాత్మక పరిశీలన అనే వీరి బృహత్ గ్రంథం  వీరి ప్రతిభకు గీటురాయి. చర్వణ సాహిత్య సమాలోచన, చా.సో స్ఫూర్తి మొదలయిన సాహిత్య విమర్శనా గ్రంధాలు దాదాపు 25కి పైగా రచించారు.

విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (యూఏ నరసింహమూర్తి)కి ప్రతిష్ఠాత్మకమైన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జాతీయ ఫెలోషిప్‌ లభించింది. ఈ ఫెలోషిప్‌ను అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఈ ఫెలోషిప్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖనుంచి పొందారు. ఫెలోషిప్‌కింద నెలకు రూ. 50 వేలు ఇస్తారు. ఉన్నత సాహిత్య ప్రమాణాలు గల రచయితలకు మాత్రమే ఈ అత్యున్నత ఫెలోషిప్‌ లభిస్తుంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆసియా ఖండపు ఇతిహాసాలు- సాంస్కృతిక అంశాలపై తులనాత్మక పరిశోధన చేసి పుస్తకంగా సమర్పించాల్సి ఉంటుంది.

నవ్య వార పత్రికలో ‘‘ మా గురువులు బోధిస్తే  గోడలకు కూడా పాఠాలు వస్తాయి !’’ అనే శీర్షికతో నేను చేసిన  ఇంటర్వ్యూ ఈ లింక్ లో లో చూడ వచ్చును.  
http://kathamanjari.blogspot.in/2013/03/blog-post_15.html
మేం యూైఏ ఎన్ గా పిలుచుకునే ఈ సాహితీ స్రష్ఠ మరి లేరనే వార్త తలచు కుంటేనే గుండె బరువెక్కి పోతోంది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం .

9, ఏప్రిల్ 2015, గురువారం

అన్న దాతా, సుఖీ భవ అనబడు తిండి గోల


వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోంది, అక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.
‘‘ పకోడీలు కావయ్యా, బజ్జీలు ...’’ అన్నాను.
‘‘ ఏవో ఒకటి, అక్కయ్య గారూ, వేగిరం తెండి , నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.
అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:
పంక్తిభేదే పృథక్పాకే, పాకభేదే తథా2కృతే,
నిత్యం చ గేహకలహే, భవితా వసతి స్తవ.
ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటే, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ ? అలాగన్న మాట.
వడ్డించే వాడు మన వాడయితే, కడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితే, ఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువా, కొందరకి కొంచెం తక్కువా, కొందరకి కొసరి కొసరి, కొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.
అలాగే, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయి, ఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.
అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.
అలాగే, నిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.
అంటే, పంక్తి వడ్డనలో భేదం పాటించే వారింట, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింట, అసలే వండు కోని వారింట, నిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.
లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.
అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.
నింపాదిగా, శ్రద్ధగా భోజనం చేయాలి.
భుంజానో న బహు భ్రూయాత్, న నిందేదపి కంచన
జుగుప్పసితకథాం నైవ, శ్రుణుయాదపి వా వదేత్.
భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.
చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:
ఉష్ణ మశ్నీయాత్, స్నిగ్ధ మశ్నీయాత్, మాత్రావ
దశ్నీయాత్, జీర్ణే2శ్నీయాత్, వీర్యా2విరుద్ధ మశ్నీయాత్
ఇష్టే దేశే2శ్నీయాత్, నాతిద్రుత మశ్నీయాత్, నా2తి
విలంబిత మశ్నీయాత్, అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,
ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.
వేడి పదార్ధాలనే తినాలి.
చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )
మితంగా భుజించాలి.
ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.
ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.
మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోట, శుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.
త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.
అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.
అతిగా మాటలాడుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.
ఏకాగ్ర చిత్తంతో తినాలి.
ఏ పదార్ధం ఎంత అవసరమో, హితమో తెలుసుకుని అంతే తినాలి.
ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.
అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.
ఏకఏవ నభుంజీత, యదిచ్ఛేత్సిద్ధి మాత్మన:
ద్విత్రిభి ర్బహుభి స్సార్ధం, భోజనం తు దివానిశమ్,
పగలు కానీ రాత్రి కానీ, ఒంటరిగా తిన కూడదు. ఇద్దరో, ముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.
ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.
విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.
ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.
కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:

పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన
ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు
ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు
ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత
మని జాగు సల్పెడి యల్పుఁడొకడు
ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని
కడను రాఁజూచు ముష్కరుఁడొకండు
కుడి యింటను హాయిగా కూరుచుండి
వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు
వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు
ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.
పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.
ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.
తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.
ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.
హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.

ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.
ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.
( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)
పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.
వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.
ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.
ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.
ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.
కిం తు మద్యం స్వభావేన, యథైవా2న్నం తథా స్మృతమ్
ఆయుక్తియుక్తం రోగాయ, యుక్తాయుక్తం యథామృతమ్
మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)
స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.
తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.
మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !!
అంటాడు గురజాడ.
ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.
అలాగే, నాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.
దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.
మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం
ఇక,.
భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -
భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్
అని తొలి పాదం రాసేక , ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపం, అని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:
ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,
నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.
నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.
వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.
ఒక సారి, పండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూ, టై, హేటూ, బూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.
పండితుడు నవ్వి, అది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.
ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.
‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీ, భోజనం ముందొకటీ, తర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.
కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.
‘‘నా సలహా పాటించావా ? ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.
‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూ, రోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.
ఇదిలా ఉంచితే, తిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం
తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.
తినగ తినగ వేము తీయనుండు.
అన్నమో రామచంద్రా !
అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.
వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.
ఇక,
తిండి అంటే అన్నం తినడమే కాదు.
లంచాలు తినడం, బుర్ర తినడం, సమయం తినడం, క్రికెట్ లో ఓవర్లు తినడం, దేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓ, ఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.
మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.
‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.
మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.
తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.
స్వస్తి.

5, ఏప్రిల్ 2015, ఆదివారం

సాహసం శాయరా డింభకా


సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.


పిరికి గొడ్డులా ఉంటే లోకం తరిమి కొడుతుంది. అదే, బోర విరుచుకుని తిరిగేవనుకో లోకం సాగిల పడుతుంది. వెనుక బడితేను వెనకేనోయ్ అన్నాడు కవి. సాహసం చేయ లేక పోతే ఏదీ సాధించ లేం.‘ చెట్టు లెక్క గలవా ? పుట్ట లెక్క
గలవా ?..’’ అంటూ చెంచు లక్ష్మి కూడా ఓ క్వశ్చనీర్ హీరో గారి ముఖాన కొట్టడం తెలిసిందే కదా.

మా చిన్నప్పుడు ఊళ్ళోకి సర్కస్ కంపెనీ వచ్చిందంటే పండుగే, పండుగ ! పొద్దస్తమానం ఆ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండే వాళ్ళం. సర్కసు చూసొచ్చిన కుర్రాళ్ళు ఇంటి వెనుక పెరళ్ళలో ఏవో ఫీట్లు ప్రాక్టీసు చేయబోవడం రివాజు. అలా, మా వీధి పిలగాయలు నలుగురైదుగురు కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్న వాళ్ళూ లేక పోలేదు. సింహాలూ. పెద్ద పులులూ దొరికే ఛాన్సు ఎలాగూ లేదు కనుక,సీమ పందికి తర్ఫీదు ఇవ్వ బోయి అది భీకరంగా నిరాకరించడంతోను, తొడ కండ పీకేలాగున తన అసమ్మతి చూపడంతోను మంచాన పడిన కుర్రాళ్ళూ ఉండే వారు.

అలాగని సాహసాలు చెయ్యకుండా ఎలా ఉంటాం చెప్పండి?

సాహసాలంటే మంటల్లో దూకడాలూ, ఎత్తుల మీంచి దూకడాలూ మాత్రమే కానక్కర లేదు.

మా డింగరి బుచ్చబ్బాయ్ తనకి సున్నా మార్కులు వేసిన లెక్కల మాష్టారి మీదకి చాటుగా గురి చూసి మెట్లంగి రాయొకటి విసర లేదూ ? అప్పుడు వాడి సాహసానికి మేఁవంతా నోళ్ళు వెళ్ళబెట్టేం కదా. సాహసం కోసం మరీ ఇంతలేసి అకృత్యాలు చెయ్యమనడం లేదు కానీ, మీ పరిధిలో మీరు ఏవో ఒకటి రెండు సాహసాలయినా చేయక తప్పదు,జీవిత కాలంలో.

తెలుగు వర్ణమాల తెలిసిందే కదా, మరింకేం - ఏ కవితో రాసి పారెయ్యండి. ధైర్యంగా ఏ తలమాసిన పత్రికకో పంపించెయ్యండి. అచ్చోసిన వాడూ, చదివిన వాడూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళు పోతారు. ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ఇతరులకే కానీ మనకి ప్రమాదమేమీ లేదని ఢంకాభజాయించి చెబుతున్నాను.

ఇంటావిడ ధాం ధూమ్ లాడుతూ ఉంటే , పిరికి వాడిలా ముంగిముషాణంలా కూచో వద్దు. ఒక సారయినా సాహసోపేతంగా నోరు విప్పండి. మా సత్రాయిగాడు ఓ సారి ఇలాగే ధైర్యం చేసి వాళ్ళావిడ కన్నా పెద్ద నోరు పెట్టి ’’ నవ్వన్నది నిజమేనే ...‘‘ అని గాఠిగా అరిచేడు. వాడి ధైర్యానికి ఆవిడ మ్రాన్పడి పోయింది తెలుసా?

ఓ సారి మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చిత్రరాజాలను గుర్తుకు తెచ్చు కోండి.



మన ఎన్టీవోడినీ,





కాంతారావునీ,


రాజనాలనీ




వీళ్ళందరినీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ( దేశ వాళీ వీరులనే కాక విదేశీ వీరులని కూడా స్మరించడం మీ యిష్టం)

సాహస వీరుడు, సాగర కన్య లాంటి సినిమాలు చూసి పిరికి తనం ఏ మూలనయినా ఉంటే పోగొట్టుకోండి అని నా ఉచిత సలహా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరింత వివరంగా చెబుతూ మీ సహనాన్ని పరీక్షించే సాహసం చేయ లేను.

నా బ్లాగే కదా అని ఇలా నానా చెత్తా రాసే సాహసం చేస్తున్నానని మీరనుకుంటున్నారు కదూ.అవున్నిజమే. ఇంతకీ సాహసం చెయ్యమని ఒక కవి శ్లోకంలో చెప్పిన విషయమే మీముందు ఇవాళ ప్రస్తావించ బోతున్నాను. చూడండి:

న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి
సాహసం పున రారుహ్య, యది జీవతి పశ్యతి.

ప్రమాదాలు ఎదుర్కోనిదే మానవులు కార్య సాఫల్యాన్ని పొంద లేరు .విజయాన్ని అందు కోలేరు.అందు చేత, సాహసం చేసి, జయించి, బ్రతికి ఉంటే శుభాలు పొంద గలరు అని దీని భావం.

బ్రతికి యుండిన శుభములు బడయ వచ్చు ... అనుకుంటూ ఏ సాహస కృత్యమూ చేయకుండా పిరికి తనంతో బతకొద్దని కవి ఉవాచ. సహసం చెయ్. శుభాలు పొందు. ఆ సాహసం చేయడంలో ఛస్తే పాయె. బతికి ఉంటే శుభాలు పొంద గలవు అని కవి గారు హామీ యిస్తున్నారు.

వెన్ను చూపడం, మడమ త్రిప్పడం ... వంటి జాతీయాలు కదన రంగంలో సాహసోపేతంగా ముందుకు పొమ్మని ప్రోత్సహించేవే కదా.

బ్రేవో. గో ఎ హెడ్.

1, ఏప్రిల్ 2015, బుధవారం

ప్రియురాలు ఎంత కఠినం !


ప్రియురాలి సొగసు చూడ తరమా ? అపురూప లావణ్యవతి. ముగ్ధ మోహన రూపం. ఒప్పుల కుప్ప. ఒయ్యారి భామ.
లోకోత్తర సౌందర్యం. బాపూ బొమ్మ....
ప్రియుడు ప్రియురాలి సౌందర్యం చూసి పరవశించి పోయాడు. ‘నిన్ను చూడకుండాఒక్క క్షణం నేనుండ లేను ’ అనడాలూ, ‘నువ్వు నాకు లభించడం నా అదృష్టం’ అనడాలూ, ‘ దేవ కన్యలు కూడా నీ కాలి గోటికి సరిపోరు ’ అని పొగడడాలూ, ‘అచ్చం బాపూ బొమ్మలా ఉన్నావు సుమా !’’ అని మురిసిపోవడాలూ, సినిమాలూ, షికార్లూ, పార్కులూ, షాపింగులూ,రెండు స్గ్రాలతో ఒకే కొబ్బరి బొండమో, కూల్ డ్రింకో తాగడాలూ ... కను రెప్పలు బరువుగా వాలి పోవడాలూ, ఛాతీలు గర్వంతో పెరిగి పోవడాలూ , కలల విహారాలు చెయ్యడాలూ, బేంకు బేలన్సు తరిగి పోవడాలూ ...
అన్నీ అయ్యేక ప్రియుడుకి ప్రియురాలి అసలు స్వరూపం తెలిసి వచ్చింది. ఇలా వాపోతున్నాడు:
ఈ చాటు పద్యం చూడండి:
పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
సద్మగర్భుడు లాదీసి వా గుడిచ్చి
మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
డెంద మొనరించె సందేహమందనేల ?
ఆ బ్రహ్మ దేవుడు ఈమె శరీరాన్ని లేత చిగురాకులతో తయారు చేసాడు. అందుకే అంత మృదుత్వం ! అంత సౌకుమార్యం !
అంత వరకూ బాగుంది. కానీ అక్కడే పాడు బ్రహ్మ దేవుడు పెద్ద కిరికిరీ చేసాడు ...
అదేమంటే ...
పల్లవము అనే పదంలో ‘‘ లా ’’ తీసేసాడు. దానితో ‘‘ ల్ల’’ అనే అక్షరం ఎగిరి పోయింది.
తర్వాత వా గుడిచ్చాడుట ! ‘‘ వ’’ కి గుడి ఇస్తే ‘‘ వి ’’ అయింది !
అక్కడితో ఊరుకోకుండా ‘‘ ము’’ అనే అక్షరాన్ని విడిచి పెట్టాడుట !
సరే, మరి ఇప్పుడు ఇన్ని తీసి వేతలూ, కలపడాలూ, జరిగేక, ‘‘ పల్లవము ’’ అనే పదంలో మిగిలినదేమిటీ ?!
‘‘ పవి’’ అనే పదం మిగిలింది ! ‘‘ పవి ’’అంటే ఇంద్రుని వజ్రాయుధం !
ప్రియురాలి  తనువు  దిరిసెన పువ్వులా  కోమలమే కానీ,  మనసు మాత్రం ఇంద్రుని వజాయుధంలా  అంత కఠినం అన్నమాట !

28, మార్చి 2015, శనివారం

వాగుడుకాయలకు వో ఝలక్ !


అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

సుప్రసిద్ధ మయిన ఈ వేమన పద్యం వివరించే అర్ధమే కలిగిన ఒక సంస్కృత శ్లోకం చూదామా ?

నిస్సారస్య పదార్ధస్య, ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ధ్వని స్తాదృక్ , యాదృ క్కాంస్యే ప్రజాయతే.

నిస్సారములయిన అల్ప వస్తువులకు ఆడంబరం ఎక్కువగా ఉంటుంది.
కంచు మ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా !

20, మార్చి 2015, శుక్రవారం

నటనాలయమ్


జీవితమే ఒక నాటక రంగం అనే విషయాన్ని భర్తృహరి తన వైరాగ్య శతక విభాగంలో ఇలా వివరించాడు:

క్షణం బాలో భూత్వా క్షణ మపి యువా కామరసిక:
క్షణం విత్తైర్హీన: క్షణమపి చ సంపూర్ణ విభవ:
జరాజీర్ణై రంగై: నట ఇవ వలీమండితతను:
నర స్సంసారాంతే విశతి యమధానీయవనికామ్.

మానవులు నటుల వలె రకరకాల పాత్రలు కొంత సేపు ధరిస్తారు. ఆ తర్వాత, ఆ వేషం కాస్త తీసివేసి, చివరకి రంగస్థలం నుండి నిష్క్రమిస్తారు. మీది శ్లోకం ఆ విషయమే చెబుతోంది:

కొంత కాలం పసి వారుగా , కొంత కాలం రసికులయిన యువకులుగాను, కొంత కాలం పరమ దరిద్రులుగానూ, మరి కొంత కాలం గొప్ప సంసన్నులుగానూ నటిస్తారు. చివరకు అవయవాలన్నీ అశక్తాలయిపోయాక, శక్తులన్నీ ఉడిగి పోయాక, ఒళ్ళంతా ముడుతలు వారి, వణుకుతూ దీనులుగా నటిస్తారు. లోకంలో తమ పాత్ర పూర్తయేక,యమపురికి చేరుకుంటారు.

ఈ శ్లోకంలో కవి మానవుల జీవిత కాలంలో వచ్చే వివిధ దశలను గురించి ప్రస్తావించేడు. ఆయా దశలలో సంభవించే పరిణామాలను విశదీకరించేడు. జీవన గమనంలో ఎదురయ్యే పతనాభ్యుదయాలను ఎత్తి చూపాడు. కడకు మానవ జీవిత నాటకానికి మరణమనే యవనిక ఎలా పడుతుందో నిరూపించేడు.

వార్ధక్యం అనివార్యం అనీ తెలుసును. మరణం అవశ్యం అనీ తెలుసును. కానీ, విషయ వాంఛలకు మాత్రం దూరంగా జరగడం మానవులకు రుచించదు.

దానికి సంబంధించిన శ్లోకం చూసే ముందు సరదాగా ఈ బాపు గారి కార్ట్యూన్ చూసి. పడి పడి నవ్వుకోండి:



చూడండి:

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయు: పరిశ్రవతి భిన్నఘటా దివాంభో,
లోక స్తథా ప్యహిత మాచరతీతి చిత్రమ్ !

ముసలితనం ఆడుపులిలా బెదిరిస్తూ మీద పడుతోంది.
వ్యాధులు శత్రువులాగున శరీరాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఆయువు పగిలిన కుండ లోని నీటిలాగా తరిగి పోతోంది.
అయినా, లోకం తనకు ఏది హితం కాదో దానిని విడిచి పెట్టకుండా చేస్తూ ఉంది.
ఏమి చిత్రం !

మానవుల విషయ వాంఛల తీవ్రత ఎలాంటిదో మరొక శ్లోకంలో కూడా ఇలా వివరించాడు:

వలిభి ర్ముఖ మాక్రాంతం, పలితై రంకితం శిర:
గాత్రాణి శిధిలాయంతే, తృష్ణైకా తరుణాయతే.

ముఖం ముడుతలు పడిపోయింది. జుట్టు నెపి పోయింది. ముగ్గు బుట్టలా తయారయింది. అవయవాల బిగి సడలి పోయింది. అన్నింటా ముసలితనం దాపురించింది.

ఇక, పరువంలో నవనవలాడుతూ ఉన్నదేమిటయ్యా, అంటే, కోరిక ఒక్కటే.


స్వస్తి.


17, మార్చి 2015, మంగళవారం

పోనిద్దురూ ...!!

ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా:
ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాం
గిరిశిఖరగతా2పి కాక పంక్తి:
పులినగతై ర్న సమత్వమేతి హంసై:

లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు.మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు.
కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి.
మరి హంసలో ? నేల మీద నదీ పులినతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !
ఇదీ ఈ శ్లోకార్ధం.
నిజమే కదా, ఉన్నతులు నిగర్వులై, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇడుములు పడుతూ ఉండడం, కుసంస్కారుల చేత నిదాదరణ. తిరస్కారాలు పొందుతూ ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాం.
అలాగే, అధములు ఆడంబర జీవనం గడపడమూ మనకి తెలిసినదే. నిజానికి ఈ పాడు లోకంలో అలాంటి వారికే మన్నన ఎక్కువగా ఉండడం బాధాకరం. కాని, అది లోక రీతి.
ఏం చేస్తాం చెప్పండి?
యస్యాస్తి విత్తం స నర: కులీన: స పండిత: స:శ్రుతవాన్ గుణఙ్ఞ:
స ఏవ వక్తా సచ దర్శనీయ: సర్వే గుణా: కాంచన మాశ్రయన్తి.
ఎవడు ధనవంతుడో వాడు కులీనుడు. పండితుడు. వివేకి. ధన్యుడు. నేర్పరి. ఆహా, అన్ని గుణాలూ బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా !
అయితే, కాలాంతరంలో నయినా ఎవరి విలువలు ఎలాంటివో విశదం కాక తప్పదు. కాకులు కొండ కొనన ఉన్నా, హంసలతో సరి కావు కదా !
పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొన కొమ్మలనుండగ గ్రింద గండభే
రుండ మదేభసింహ నికురంబములుండవె? చేరి భాస్కరా !
చెట్టు క్రింద గండ భేరుండాలు, మదించిన ఏనుగులు, సింహాలు ఉంటూ ఉండగా, ఒక కోతి మాత్రం చెట్టు కొమ్మల చివరన ఎక్కి కూర్చున్నదట. అంత మాత్రం చేత, ఆ మృగములకు వచ్చిన తక్కువతనం ఏమీ లేదు.
అలాగే, మహా పండితులందరూ నేల మీద సుఖాసీనులై ఉంటే, ఒక అల్పుడు ఉన్నతాసనం ఎక్కి కూర్చుంటే ఆ పండితుల గొప్పతనమేమీ తరిగి పోదు.
మణిలాగ కనిపించినంత మాత్రం చేత గాజు పూస మణి కాజాలదు. గాజు గాజే.మణి మణే
అలాగే, వసంత కాలం వచ్చినప్పుడు కదా, కాకి ఏదో, కోకిల ఏదో తెలియవచ్చేది ?!


14, మార్చి 2015, శనివారం

ఎందుకయ్యా , వెక్కి వెక్కి ఏడ్చినావూ ?


యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.




10, మార్చి 2015, మంగళవారం

కోలుకో లేని దెబ్బకు అప్పుడే ఆరేళ్ళా ?....



కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి (29-3-1952  -  11 -3 -2009 ).
 రాయాల్సిందేదో రాసేసి, చెప్పాల్సిందేదో చెప్పేసి, నిరాడంబరంగా,నిశ్శబ్దంగా, ఒకింత నిర్లక్ష్యంగా, వెళ్ళి పోయేరు. రచయితగా రావలసినంత పేరు తన ఖాతాలో జమ అయిందో లేదో చూసుకునే ఓపికా, ఆసక్తీ కూడా లేని పతంజలి ‘ అవుతే నాకేటి’ అని నవ్వేసి, వెళ్ళి పోయేరు. ప్రపంచ సాహిత్య ప్రమాణాలతో సరితూగే గొప్ప రచనలను చేసి, వెళ్ళి పోయేరు. కన్యాశుల్కం తర్వాత, అంత వాటంగా హాస్య బీభత్స రసాలను ప్రదర్శించ గలిగిన తెలుగు రచయితలు లేరనే చెప్పాలి.
 సన్నగా , రివటలా పొడుగ్గా, కొనదేరిన రాచ ముక్కుతో , సూటిగా, దయగా చూసే చూపులతో, అవతలి వాడి వివేకాన్నీ, వెకిలి తనాన్నీ కూడా సరిగానే అంచనా వెయ్య గలిగిన ధీమాతో కూడిన చిరునవ్వు - యిదీ స్థూలంగా పతంజలి రూపం ! తెలిసిన వాళ్ళకి, అత్యంత వైవిధ్య భరితమూ, అద్భుతమైన హాస్య వ్యంగ్య శైలీ, విభిన్న మానవ మనస్తత్వాలను ఆవిష్కరించే కథనాలతో - ఇంత సాహిత్యాన్ని యీ బక్క మనిషి ఒక్కడూ అందించేడా ! అని, ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు చిన్న కథ తొలి ఊపిరులు పోసుకున్న విజయ నగరానికి అతి చేరువలో అలమండ గ్రామంలో పుట్టిన పతంజలి డిగ్రీ చదువు విజయ నగరంలోనే సాగింది. పాత్రికేయునిగా విశాఖ పట్నం, విజయ వాడ, తిరుపతి, హైదరాబాద్ లలో శాఖా చంక్రమణం చేసారు. బతుకు బాటలో ఎన్నో ఉత్థాన పతనాల్ని చవి చూసేరు. ఒక అపూర్వమైన స్వీయ వ్యక్తిత్వంతో నిబ్బరాన్ని కోల్పో లేదు. బెదిరి పోలేదు. ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి, సాక్షిలలో సంపాదకునిగా బాధ్యతలు ... మధ్యలో అవి వదులుకున్న సంధి కాలంలో సొంత పత్రిక పేరుతో చేతులు కాల్చకోవడం ... పచ్చళ్ళు, ఆయుర్వేద మందులు అమ్ముకోవడం, వైద్యం ... ఏవీ ఆయన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయ లేదు. ఆ యోగ పతంజలి యిక లేరు అనే నిజాన్ని జీర్ణించుకో లేక, యీ కొద్ది పాటి మాటలూ ... మొలకెత్తిన మైత్రీ బంధం పతంజలితో నా తొలి పరిచయం చిత్రంగా జరిగిందనే చెప్పాలి. ఆ రోజులూ, అప్పటి ఉద్వేగాలూ, దుందుడుకుతనాలూ వేరు. పతంజలి, ఆయన తమ్ముడు కలిసి, విజయ నగరంలో ఓ గదిలో ఉండి, మహా రాజా వారి కళాశాలలో చదివే వారు. పతంజలి డిగ్రీ మొదటి సంవత్సరం. అదే రోజుల్లో, అంటే, డెబ్భయ్యవ దశకం తొలి రోజులలో, నేను అక్కడే, మహా రాజా ప్రాచ్య కశాశాలలో భాషా ప్రవీణ చదివే వాడిని. కథా రచయితలుగానే తప్ప , పతంజలితో నాకు అప్పటికి ముఖ పరిచయం లేదు. పతంజలి మహా దూకుడుగా ఉండే వాడు. మా వూరి వాడే, ఓ అబ్బాయి, నా గురించి పతంజలితో చెడ్డగా చెప్పాడు. నాకు రచయితనని పొగరనీ, ఎవరితోనూ మాట్లాడననీ... యిలా ఏవో చెప్పాడు. దాంతో పతంజలి ‘‘ అలాగా ! ఆ పొగరేదో అణిచేస్తాను ... నా దెబ్బ రుచి చూపిస్తాను ...’’ లాంటి శపథాలేవో చేసాడుట. తీరా, సాయంత్రం అలాంటి ఉద్దేశంతో నన్ను ప్యారిస్ కార్నర్ దగ్గర కలిసేడు. కలిసేక సీను మారి పోయింది ! విజయనగరం కోట దగ్గర, బొంకుల దిబ్బ సమీపంలో,రోజూ సాయంత్రాల వేళ. ఊళ్ళోని రచయితలూ, కవులూ గుంపులుగా చేరి, కాళ్ళు పీకేలా , నిలబడి - సాహిత్య చర్చల్లాంటివి చేసే స్థలానికే ముద్దు పేరు ‘ ప్యారిస్ కార్నర్’ ! అక్కడ తొలి సారిగా కలిసేం - నేనూ, పతంజలీ. కాస్సేపు నన్ను దెబ్బ తీసే కార్యక్రమాన్ని వాయిదా వేసి, నా అభిరుచులూ, అభిమాన రచయితలూ, రచనలూ గట్రా యింటర్వ్యూ చేస్తున్నట్టుగా ఏవేవో అడిగేడు. నేను భయ పడుతూనే .వాబులు చెప్పేను. ఎంతయినా అతను రాజా కాలేజీ స్టూడెంటూ, నేను ప్రాచ్య కళాశాల విద్యార్ధినీ కదా ! అంతే ! పతంజలి నన్ను వాటేసుకుని, ‘ మిమ్మల్ని దెబ్బతీయాలనే వచ్చేను. కానీ యిక నుండీ మనం నేస్తాలం ... ఏం . ’’ అనడిగేడు. మొన్న ఆగష్టు నెలలో కలిసినప్పుడు ఆ ముచ్చట్లు చెప్పుకుని యిద్దరమూ ఎంత నవ్వుకున్నామో ! అలమండ రాజు గారి అబ్బాయి ఆ వయసులోనే అందించిన స్నేహానుభవం - నిత్య హరితమై ఏళ్ళు గడుస్తున్నా, మధురంగా మనసులో మెదులుతూనే ఉంది. మా రహస్య అజెండా మా స్నేహం, కలిసేక విజయనగరంలో ఉన్నన్ని రోజుల్లోనూ వొకరిని విడిచి వొకరం ఉండ లేదు. అప్పుడప్పుడు మాతో కవి సీర పాణీ, రచయిత దాట్ల నారాయణ మూర్తి రాజూ వొచ్చి కలిసే వారు. రోజూ నియమం తప్పకుండా మహా రచయిత చాసో గారిని కలవడానికి పోయే వాళ్ళం.చిన్ని పల్లి వారి వీధిలో చాగంటి వారి హవేలీ లోనో, కస్పా బజారులోనో కలిసే వాళ్ళం.ఆయన వెంట మహా శ్రద్ధా భక్తులతో వ్యాస నారాయణ మెట్ట వరకూ వెళ్ళే వాళ్ళం. ఆ కథా శిల్పి ఎన్ని గొప్ప విషయాలు చెప్పే వారో ! నోట్లో చుట్ట ఎర్రగా కాలుస్తూ, చురుకయిన చూపులతో , మా వేపే చూస్తూ సాహితీ ప్రసంగం చేస్తున్నట్టుగా ఉండేది వారి ధోరణి. మా కథలు ఆయనకిచ్చి అభిప్రాయం అడిగే వాళ్ళం. అంత పెద్దాయనా, ఏ మాత్రం విసుక్కోకుండా, మా కథల్లో మంచి చెడ్డలు విపులంగా చర్చించే వారు. మంచేఁవిటి ! నా ముఖం ! ... మా కథల్లో లోపాలు ఎత్తి చూపిస్తూ ఎండ గట్టే వారు. ఉడుక్కునే వాళ్ళం. ‘‘ ఈ ముసిలాయనతో మనం పడలేం బ్రదరూ ! ... అంచేత మన కథలింక ఈయనకి చూపించొద్దు ...ఎప్పటికయినా చాసో రాసిందానికన్నా గొప్ప కథ రాసి చూపిస్తాను ... ’’ అనే వాడు. అంత లోనే , గొంతు తగ్గించి, ‘‘ అబ్బే, అది వీలయ్యే పని కాదు . ఆ స్థాయిని మనం జీవిత కాలంలో అందుకో లేం . .. పోనీ ...ఆయన తన చుట్ట నోటొతో ఒక్క సారయినా , ‘ బాగుందయ్యా ! ’ అనే అనే కథ రాయాలి ... అందాక ... రోజుకో కథయినా చదవమని మన చుట్టల తాత గారిని కందిరీగల్లా కుడదాం ... ఏం . ’’ అని మా మధ్య ఓ రహస్య ఒప్పందం ఖరారు చేసాడు. ఆ తర్వాత, నా సంగతి అటుంచండి కానీ ... మా పతంజలి మాత్రం చా.సోనీ, అలాంటి ప్రసిద్ధ రచయితలనీ మెప్పించే రచనలు అనేకం చేసాడు. చా.సో గురించీ , అతని కథల గొప్పదనం గురించీ ఎంత విశ్లేషిస్తూ చెప్పే వాడో ! ఆ కథా శిల్పి చెక్కిన అపురూప కథకుడు - ఆ మధ్య చా.సో స్ఫూర్తి అవార్డుని సొంతం చేసుకున్నాడు ... అదీ పతంజలి ! పూర్వీకుని పరిచయం పతంజలితో సాగిన నా స్నేహ ప్రస్థానంలో మరో అబ్బుర పరిచే ముచ్చట. ఆయన విశాఖలో ఈనాడులో పని చేసే రోజులలో తరుచుగా కలిసే వాడిని. ‘ రాజుగోరు’ రాసిందప్పుడే. విజయ వాడలో ఉండేటప్పుడు ఓ సారి ఆఫీసులో కలిసాను. ఎప్పటిలాగే ఆత్మీయంగా పలకరించేడు. ఎన్నో కబుర్లు కలబోసుకున్నాం. ఆ రోజు నాకు ఆయన యింట్లోనే ఆతిధ్యం. ‘‘ మా యింటికి రండి... మా పూర్వీకుడ్ని ఒకరిని పరిచయం చేస్తాను ...’’ అని తీసికెళ్ళాడు. ఏ శతాధిక ముది వగ్గో అనుకున్నాను. చిత్రం ! అయన చూపించింది ఓ కోతిని. బజార్లో కోతులాడించే మనిషి దగ్గర కొని పెంచుతున్నాడుట ! ఆ చమత్కారం అతనికే చెల్లింది ! చేపల్ని పెంచిన పతంజలీ, పిట్టల్ని పెంచిన పతంజలీ చాలా మందికి తెలిసుండ వచ్చు. కోతుల్ని పెంచిన పతంజలి తెలీక పోవచ్చు. కదూ? అమ్మ దొంగా ! ఆ తర్వాత ఫోన్లూ, అప్పటప్పట ఉత్తరాలూ తప్ప మేం కలుసుకున్న సందర్భాలు తక్కువే. కథా, నవలా సాహిత్యంలో మా పతంజలి విరాడ్రూపాన్ని చూసి, మురిసి పోతూనూ ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు చెప్మా కలుసుకున్నాం ? ఆఁ! ... ఓ సారి విశాఖ పట్నంలో కలిసేం. నేను మా సాలూరు ( నేను ఉద్యోగ రీత్యా ఉండే వూరు) వెళ్ళడానికని బయలు దేరాను. దార్లో ఓ పుస్తకాల షాపులో దూరేను. పుస్తకాలు చూస్తున్నాను. వెనక నుండి బలమైన ఓ రెండు చేతులు నన్ను బలంగా వాటేసుకుని , ఉక్కిరి బిక్కి రి చేసాయి. చూద్దును కదా ... మా పతంజలి ! ‘‘ రాత్రికి ఉండి పోండి ... మన చిన్నప్పటి కబుర్లతో రాత్రిని కరిగిద్దాం ... ఏం ? ...’’ అనడిగేడు. అక్కడే, అమ్మకానికి ఉంచిన పుస్తకాలలోనుండి తనపుస్తకాన్ని ఒక దానిని తీసి, దాని మీద ‘ నాకెంతో ప్రియమైన మా పంతుల జోగారావు గారికి’ అని రాసి నాకిచ్చేడు.తీయని గుర్తుగా అది నా దగ్గరింకా పదిలమే. ‘పతంజలి భాష్యం’ దాని పేరు. ఆ రాత్రి ఎన్ని విశ్వ సాహివత్య వీధుల్లో పచార్లు చేయించేడో! ఆ విషయ సంపదకీ, సాధికారతకీ చకితుడినయి పోయేను. దగ్గర్లోనే ఉండి ఒక్క సారి కూడా కలవ లేదని నిష్ఠరమాడేడు. ‘ ఇప్పుడయినా, దొంగ ని పట్టుకున్నాను కనుక సరి పోయింది! సరే ... ఇక్కడ ఓ పత్రిక పెట్టాను ... తెలుసా ? ...’’ అనడిగేడు. ‘‘ తెలీదు.’’ అన్నాను నిజాయితీగా. ‘‘సరే లెండి! ... దాని గురించి నాకే తెలీదు ! ’’ అని నవ్వేసాడు. ఆ హాస్య ప్రియత్వమే అతని పుస్తకాలనిండా వెన్నెలలా పరుచుకుని ఉంది మరి ! ఆ సౌజన్యం అపురూపం పతంజలిని కలిసింది నా ‘ అపురూపం’ కథల సంపుటి ఆవిష్కరణ సభలోనే. నాకుగా నేను కోరక పోయినా , నా ప్రచురణ కర్త మాట మేరకు, నామీద గల అభిమానంతో నా పుస్తకానికి ముందు మాట రాయడమే కాక, ఆ రోజు సభకి వచ్చి పలకరించి వెళ్ళాడు నా గురించి అతను రాసిన నాలుగు ముక్కలూ ఎప్పటికీ నాకు నా కథలకంటే కూడా ప్రీతి పాత్రం. అవీ, యివీ ... మరి కొన్ని ... దు:ఖోద్వేగంలో గుర్తుకు రావడం లేదు... గుర్తున్నంత వరకూ మరి కొన్ని ... చదువుకునే రోజులలో అలమండ నుండి వచ్చే కేరియర్లలోంచి వంటకాలను బలవంతంగా రుచి చూపించడం ... ‘దిక్కుమాలిన కాలేజీ’ కథ రాసి, తను చదువుకునే కాలేజీ రాజకీయాలను ఎండ గట్టి కూడా ... ధైర్యంగా బోర విరుచుకుని నడవడం, నవ్వడం ...చతురలో నవలకి వెయ్యి రూసాయలొస్తున్నాయని ఎడాపెడా అప్పులు చేస్తున్నానని చెప్పడమూ ... కడసారి కలిసింది మొన్న ఆగష్టు పన్నెండవ తేదీన చివరి సారిగా పతంజలిని కలిసేను. అతని ఆరోగ్యం గురించి నేనూ అడగ లేదు... పతంజలీ చెప్ప లేదు ... కబుర్లు కలబోసుకున్నాం. విజయ నగరం కబుర్లు ... పతంజలికి అలమండ అన్నా, విజయ నగరం అన్నా అవధుల్లేని అభిమానం ! అక్కడి మిత్రులు ఎవరు పలకరించినా పులుకరించి పోతాడు. అప్పుడెప్పుడో వో సారి కలిసినప్పుడు విజయ నగరం గురించి చెబుతూ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి ... ‘‘ ఆ ఊరి కోట, కందకం,కస్పా బజారు, బొంకుల దిబ్బ,మూడు మూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు, మచ్చ కొండ, గంట స్థంబం, పెద్ద చెరువు ... చివరికి పెద్ద చెరువులో దోమలు కూడా నాకు మంచి నేస్తాలే ! ... ఎందుకంటే ...రాత్రి పూట నన్ను తెగ కుట్టి మేలుకుని ఉండేలా చేసి, కథలూ గట్రా రాసుకునేలా ప్రోత్సహించినవి , పాపం, అవే కదా ! ...’’ మరింక రాయ లేను ...  రక్తం ఉత్సాహంతో ఉరకలేసే వయసులో నన్ను దెబ్బ తీయాలని వచ్చి స్నేహ లతలా అల్లుకు పోయేడు - మా పతంజలి ! ... ప్రసార మాధ్యమాలలో పతంజలి ఇక లేరని విని , చూసి , అవాక్కయాను. అయ్యో మిత్రమా ! ఇప్పుడీ వయసులో ఎంత కోలుకో లేని దెబ్బ తీసావయ్యా ....
  పతంజలి రచనలు
 ఖాకీ వనం
 పెంపుడు జంతువులు
రాజు గోరు
 వీర బొబ్బిలి
 గోపాత్రుడు
 పిలక తిరుగుడు పువ్వు
 అప్పన్న సర్దార్
 ఒక దెయ్యం ఆత్మ కథ
 నువ్వే కాదు
 వేట కథలు
 రాజులు లోగిళ్ళు,
 చూపున్న పాట,
 పతంజలి భాష్యం,
 దిక్కు మాలిన కాలేజీ కథల సంపుటి ...
 డా. కె.వి.నరసింహా రావు వీరి ఖాకీ వనం నవలని హిందీ లోకి అనువదించేరు. రాజకీయ,పోలీస్, న్యాయ, పత్రికా వ్యవస్థల మీద కొరడా ఝళిపిస్తూ శక్తి వంతంగా తెలుగులో రాసిన ఒకే ఒక్క రచయిత పతంజలి గారు.