9, ఏప్రిల్ 2014, బుధవారం

గాన గంధర్వుని గొంతులో జాషువా కవి గారి శిశువు ఖండ కావ్యం




శిశువు గురించి శ్రీ జాషువా కవి  పద్యాలు

గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

జాషువా పద్యాలకి వివరణ అక్కర లేదు. అయినా, కొద్దిపాటి వివరణ ...
పాట పాడితేనే కాని నిద్దుర పోడు. తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుకలాగా ఒరిగి పోతాడు. ఆ లేత వయసులోనే కండలు తిరిగిన పిల్ల వస్తాదులా ముద్దొస్తాడు. ఎంత భాగ్యవంతుడో ! ఉయ్యేల దిగకుండానే అన్ని పనులూ జరిపించుకుంటాడు. ఉ ఊ అనే రెండక్షరాలు నేర్చిన వింత చదువరి. సతిని తాకని సాంబ శివుడిలా ఉంటాడు. కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పర దేశి. తన యింటికి కొత్త యజమాని. ఈ భూమి మీదకి ఏ రాచ కార్యం చేడానికి వచ్చేడో కదా ? కొంచెం నడక రానీ, అప్పుడు అడుగుదాం. ముందు ముందు వయసు వచ్చేక ఎలాగ ఉంటాడో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం ఈ చిన్నారి శిశువుకి ఏ పాపం తెలియదు !!

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర


తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో అన్నం , నీరు లేకుండా గడిపి, ప్రయాణం చేసి వచ్చిన బాట సారి. చిమ్మ చీకటిగా ఉండు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణ స్వరూపుడు. నునుపైన చెక్కిళ్ళలో బోసి నవ్వులలో ముద్దులు కురిపించే మోహనాకారుడు. తరగని తల్లి పాలు అనే మధు ధారలను తన అన్నంగా తచ్చుకున్న అతిథి.బట్ట కట్టుకోడు. సిగ్గు పడడు. నేల తల్లి అనే బడిలో చేరి ఇంకా వారం అయిందో, లేదో, మా ప్రకృతి కాంత వీడికి ఆకలీ నిద్రా నేర్పించింది.

ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

పడుకున్న ఊయ్యేల తొట్టి వాడికి ఏం ఉపదేశం చేస్తందో కానీ, ఒంటరిగా ఊ కొడుతూ ఉంటాడు. తల్లితో ఏ జన్మల సంబంధమో కాని ఏడ్చి సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఆ దేవ దేవుడు అతనితో ఏ సల్లాపాలు చేస్తాడో తెలియదు భలే భలే అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటాడు
ఈ మూడు రోజులలో ఎప్పుడు నేర్చుకున్నాడో వెర్రి తండ్రి ఛీ ఫో అని సరదాకి అంటే ముఖం చిన్న బుచ్చు కుంటాడు. ఆ బుగ్గల లేతదనం తగ్గి, చదువు సంధ్యలు నేర్చకున్నాక ‘ నా బంగారు కొండ , నా రతనాల కొండ ’ అని తల్లి ముద్దుగా అంటూ ఉండే మాటలు నిలుపుకుంటాడో లేదో , చూదాం !

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు
దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?

తన చేతి గిలక పండుకి ముచ్చటలు చెబుతూ ఉంటాడు. అది తిరిగి పలక లేదని కోపం వచ్చి విసిరి కొడతాడు. పొరుగింటి ఆడవాళ్ళు చేర దీస్తే వెళ్ళడాని యిష్ట పడడు. తన పర భేద భావం వీడికి అప్పుడే తెలిసి పోయింది.  తేనె అంటే ఇష్టం రుచుల భేదం గ్రహించేస్తున్నాడు. పెద్ద చప్పుడుని వింటే చాలు భయంతో తల్లిని గట్టిగా కరుచుకు పోతాడు. ఇతనికి అరిషడ్వర్గాలు అనే ఆరుగురు శత్రువులలో ( కామం, క్రోధం, లోభం, మోహం, మదం , మాత్సర్యం) ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారు అప్పుడే వీడి మనసులో చేరుకున్నారు కదా ? వీడి జాతకంలో గొప్ప కీర్తిమంతుడవుతాడని ఉందో, బొత్తిగా అప్రతిష్ఠ పాలవుతాడని రాసి ఉందో కదా !!



8, ఏప్రిల్ 2014, మంగళవారం

పా.సీ. కొ.సా ...




‘‘తాతయ్యా, కథ చెప్పవూ ? ’’
‘‘ఎందుకు చెప్పన్రా బాబూ, విను ...’’
‘‘ అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వో రోజు వేటకెళ్ళారు. వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ... ... ...’’
‘‘ ఛీ ! ... తాతయ్యా, మళ్ళీ పాత కథేనా ? కొత్త కథ చెప్పూ ...’’
‘‘ అయితే విను. అనగనగా ఓ చక్రవర్తి. ఆ చక్రవర్తికి పది మంది కొడుకులు. పది మందీ ఓ రోజు సింగపూర్ వెళ్ళి పన్నెండు పీతల్ని తెచ్చారు. వాటిని ఎండ పెడితే వాటిలో ... ... ’’
‘‘ ఛీ ! తాతయ్యా, మళ్ళీ పాత కథే చెబుతున్నావు ...’’

‘‘ అదేంటిరా మనవడా అలాగంటావూ ! పాత కథలో రాజు ఈ కథలో చక్రవర్తి అయిపోయేడు కదూ ... వాడికి ఏడుగురు కొడుకులయితే, వీడికి పదిమంది ...వాళ్ళు వేటకి వెళితే, వీళ్ళు సింగపూర్ వెళ్ళారు కదా ? ... వాళ్ళు చేపలు తెస్తే, వీళ్ళు పీతలు తెచ్చారు ...అదీ కాక, పాత కథకి ఊరూ పేరూ లేదు ... కానీ ఈ కొత్త కథకి మాత్రం ఓ నేరుందిరా అబ్బీ ! ...’’

‘‘ ఈ కథ పేరేంటి తాతయ్యా ? ’’

‘‘ ఎన్నికల మేనిఫెష్టో ’’

7, ఏప్రిల్ 2014, సోమవారం

చుక్కల సమావేశం ! ... పిల్లల కథ



చుక్కల సమావేశం!



ఒకసారి ఆకాశంలో చిన్న చుక్కలన్నీ కలిసి ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో అవి చాలా దీర్ఘంగా తమ కష్టాల గురించి చర్చించాయి.మరీ కొన్ని చిన్న చుక్కలయితే, మరింత ఉద్రేకంగా ప్రసంగించాయి. యుగ యుగాల నుండీ అవి తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి గొంతెత్తి సభలో ఘోషించాయి.

వాటి చర్చల సారాంశం ఏమిటంటే, గగన వీధిలో పెద్ద చుక్కలతో పాటు కోట్లాది సంఖ్యలో ఉన్న తమకి ఏ ప్రత్యేకతా లేక పోవడం అన్యాయం అని ... తమకు న్యాయం జరగాలని అవి గట్టిగా కోరుకుంటున్నాయి. పెద్ద చుక్కలు తమ ప్రియనాథుడు చంద్రుడికి దగ్గరగా ఉండడం, తాము మాత్రం దూరంగా ఎక్కడో విసిరివేయబడినట్టు కనీ కనిపించకుండా మిణుకు మిణుకుమంటూ కునారిల్లిపోతూ ఉండడం అవి సహించ లేక పోతున్నాయి. అంతే కాక, పెద్ద చుక్కల్లో కొన్నింటికి ఏవో మంచి పేర్లు కూడా ఉండడం, వాటిని గురించి పురాణాలలో కథలు ప్రసిద్ధిలో ఉండడం కూడా వాటికి అవమానకరంగా ఉంది. అందుకని చిన్న చుక్కలన్నీ కూడబలుక్కుని సమావేశమై తాము తీసుకున్న నిర్ణయాన్ని తమ రేడు చంద్రుడికి వినయంగా విన్నవించుకున్నాయి.

చంద్రుడు నవ్వి, అలాగే చూదాం ! అన్నాడు. ఇలాచాలాసార్లు జరిగింది. చిన్న చుక్కలకి న్యాయం జరుగ లేదు. అందుకు అవి తీవ్రంగా మనస్తాపం చెందాయి. కొన్ని చుక్కలయితే, ఏకంగా నేల మీదకి రాలి ఆత్మహత్యలు కూడా చేసుకున్నాయి.

చిన్న చుక్కలు తమ వారి బలిదానాలను భరించ లేక పోయాయి. వాటిఆందోళన నానాటికీ తీవ్రతరమవుతూ ఉండడంతో

చంద్రుడు వాటితో ఇలా అన్నాడు ‘‘ మీ అసంతృప్తిని గమనించాను. ప్రకృతికి కొన్ని నియమాలుంటాయి. వాటిని అధిగమించి ఉండడం ఎవరికీ సాధ్యం కాదు.అయినా, మీరంతా ఇంతలా కోరుకుంటున్నారు కనుక, మీ కోరిక నెరవేర్చాలనే నాకూ ఉంది. ముందుగా మీరు ఎంత మంది ఉన్నారో లెక్కగట్టి నాకు చెప్పండి. అప్పుడు మీ అందరికీ ఏయే పేర్లు పెట్టాలో, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నిర్ణయిస్తాను. ’’

చిన్న చుక్కలన్నీ సరే అంటే సరే అన్నాయి.

అప్పటి నుండీ ఆకాశంలో చిన్న చుక్కలన్నీ చుక్కల గణనలో తలమునకలయి పోయేయి.

యుగాలు గడుస్తున్నా వాటి లెక్క తేలడం లేదు.

మబ్బుల పరదా వెనుక ముసిముసి నవ్వులు చిందిస్తూ

చుక్కల రేడు వినోదం చూస్తూనే ఉన్నాడు !


29, మార్చి 2014, శనివారం

పద్యా లొక పన్నెండు ... ఉగాది శుభాకాంక్షలతో ...





సాహితీ మిత్రు లందరికీ ఉగాది శుభాకాంక్షలు ! ...

మీ ... కథా మంజరి.

ఉగాది సందర్భంగా ఒక కానుక. మీ కోసం రసవంత మయిన మంచి తెలుగు పద్యాలు వివరణలతో ఒకే చోట ...


వీటిలో కొన్ని లోగడ తెలుగు పద్యం వెలుగు జిలుగులు అనే శీర్షికన నవ్య వార పత్రికలో వెలువడ్డాయి.

ప్రస్తుతం ఇదే శీర్షిక తేనె లొలికే తెలుగు పద్యం పేరుతో ఆంధ్ర భూమి మాస పత్రికలో వెలువడుతోంది ...

వాటి లోనుండి ఓ డజన్ ఒకే చోట ... ( ఏ పద్యం చూడా లనుకుంటే దాని మీద నొక్కి చూడండి )

1.ఏమి తపంబు సేసెనొకొ ! ....
సోతన భాగవతం


2. శివుడిటు రమ్మటంచు ...
చేమకూర వేంకట కవి విజయ విలాసం


3. తగిలి మదంబుచే ...
మారద వెంకయ్య భాీస్కర శతకం

4. అంకముఁజేరి శైల తనయాస్తన ...
అ్లసాని పెద్దన మను చరిత్ర


5. కారే రాజులు రాజ్యముల్ కలుగవే ?
పోతన భాగవతం.

6. నానాసూన వితాన వాసనల ..
రామరాజ భూషణుడు వసు చరిత్ర


7. ఆతప భీతి నీడలు రయంబున ...
నన్నె చోడుడు కుమార సంభవం


8. కటకట లక్ష్మణా !
కంకంటి పాపరాజు  .. ఉత్తర రామాయణం

9. అజినాషాడ ధరుండు ...
శ్రీనాథుడు హర విలాసము

10. చింతా శల్యము వాసెనే ?
తిక్కన మహా భారతం

11. అదిగో ద్వారక !
తిరుపతి వేంకట కవులు పాండవోద్యోగం

12.నుతజల పూరితంులగు నూతులు ..
నన్నయ మహా భారతం.

24, మార్చి 2014, సోమవారం

ఒక వీరాభిమాని విచార గాథ ...



మా తింగరి బుచ్చి కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. మరో పార్టీ విషయం ఎత్తితే కయ్యిమంటాడు. అలాంటి మా తింగరి బుచ్చి నిన్నటి వరకూ కాంగ్రెష్ ఖాళీ అయి పోతోందనీ, కాంగ్రెస్ పని ఖతమై పోయిందనీ తెగ బోలెడు విచార పడి పోతూ కనిపించాడు. అన్న పానాదులు మానేశాడు. గడ్డం పెంచీసాడు. ముఖం పీక్కు పోయింది. లంఖణాలు చేసిన వాడిలా నీరసించి పోయేడు. ఉలకడు .పలకడు. వాడేమయి పోతాడో అని మేం భయ పెట్టీసు కున్నాం.
అయితే ఇవాళ వాడు తేటదేరిన ముఖంతో కనిపించాడు. తేరు కున్నాడు. . హమ్మయ్య ! అను కున్నాం.
కాంగ్రెస్ పరిస్థితి ఏమయినా మెరుగు పడిందేమిటి ? కాస్త కులాసాగా కనిపిస్తున్నావు ? అనడిగేను.
దానికి మా తింగరి బుచ్చి ఏమన్నాడంటే ... అదేం లేదు ... కానీ మా వాళ్ళు చాలామంది పైకిలెక్కేసారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అంతా మా వాళ్ళ తోనే కిట కిటలాడి పోతోంది ...
ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పార్టీని తెలుగు కాంగ్రెస్ అనో, దేశ కాంగ్రెస్ అనో అనొచ్చని పిస్తోంది అదే నాకు కొంత ఊరట. అందుకే నా దిగులు కొంత తగ్గింది ...
ఒక వేళ ... జగన్ పార్టీ గెలుస్తేనో ? అన్నాను నంగిగా ..
ఆ పార్టీ పేరు లోనూ కాంగ్రెస్ అని ఉంది కదా . నాకది చాలును. అన్నాడు కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడూ, వీరాభిమానీ అయిన మా తింగరి బుచ్చి ...
మా తింగరి బుచ్చికి వేపకాయంత వెర్రి ఉంది లెండి. అది ఈ మధ్య గుమ్మెడు కాయంత అయిందని సమాచారం.
అందు వల్ల వాడి మాటలు మీరేమీ పట్టించు కోకండి..
లైట్ తీసుకోండి ..

21, మార్చి 2014, శుక్రవారం

అంతర్జాలమా !నీకు జోహార్లు ...



అంతర్జాలంలోో ఎందుకో వెతుకుతూ ఉంటే ఈ ఆడియో కంట పడింది. మనిషిని ఫొటో చూసి వెంటనే గుర్తు పట్ట లేక పోయేను. తంపెళ్ళ మహదేవ రావు అని పేరు చూసి తటాలున పోల్చు కున్నాను.

పార్వతీపురంలో  మా చిన్నప్పుడు మా ఇంటికి అతి సమీపంలోనే వీరి కుటుంబం ఉండేది. పెద్దాయనను తంపెళ్ళ మాష్టారు అనే వారు. సంగీతం టీచరు. నాకయితే వారు తెలీదు. నా చిన్నప్పటికే పోయేరను కుంటాను. నా చిన్నప్పటికే వారి కుటుంబం పార్వతీపురం విడిచి వెళ్ళి పోయినట్టు గుర్తు. కానీ ఈ తంపెళ్ళ మహదేవరావూ, వీరి తమ్ముడు తంపెళ్ళ సూర్య నారాయణ గారూ మా ఊరు తరుచుగా వస్తూ ఉండే వారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజులలో వచ్చే వారు.

అలా వచ్చి నప్పుడు తెలిసిన మా కుటుంబాలలో అందరినీ పలకరించడానికి ఇళ్ళకు వచ్చే వారు.

నాకు బాగా గుర్తు,  మహదేవరావు ఇలా ఓ సారి పండుగకు  మా ఊరు వచ్చి నప్పుడు మా మేనత్త గారి ఇంటి చావిడీలో మా కోసం, మా వీధి వారి కోసం  గాత్ర  కచేరీ  చేసేరు. అప్పటికే వారు ప్రసిద్ధులు. మా తాత గారి మాట కాదనలేక  ఆ కచేరీ చేసారు. వీరి తమ్ముడు సూర్య నారాయణ మూర్తి  మంచి వయొలనిష్టు. ఆ రోజుల లోనే రాష్ట్రపతి అవార్డు  గ్రహీత.

మహ దేవరావుని, సూర్య నారాయణనీ  చూసి  నలభై ఏళ్ళవుతోంది. ఇంకా ఎక్కువే నేమో.  వారి గురించిన వివరాలేమీ తెలియదు.

కాదు ... కాదు ... మహదేవరావుని   మాత్రం 72 లో   ఓసారి చూసాను. ఎందుకో మా ఊరు వచ్చేరు. పెద్ద భత్వోద్యోగి.ఇంటెలిజెన్స్ అనుకుంటాను ... ఏమో ... కానీ ఆ ఏడాది భోగీ నాటి రాత్రి మాతో ఆయన పేకాట కూడా ఆడేరు ...  అమ్మకి నచ్చిన మంచి పాట ఇక్కడ చూడండి..

సరే, ఇంతకీ నేను చెప్పే దేమిటంటే  అంతర్జాలం వల్ల గత కాలపు మధుర స్మృతులు ఎన్ని నెమరు వేసుకో వచ్చునో కదా ...అందుకే అంతర్జాలమా ! నీకు జోహోర్లు ...

13, మార్చి 2014, గురువారం

పార్వతీ పురంలో మా ఇంటి వీధరుగు ...


పల్లె తల్లి లాంటిది. పట్నం ప్రియురాలి లాంటిది ... అంటూ మొదలు పెట్టి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు వీధి అరుగు అనే గొప్ప వ్యాసం వీధరుగు గురించి రాసేరు.

 వీధి అరుగు ఆహ్వానం లాంటిది. నవ్వుతూ రమ్మని పిలుస్తుంది. వచ్చి కాస్సేపు కూర్చుని సేద దీర మంటుంది. కబుర్లు చెబుతుంది. కలత తీరుస్తుంది.కుశలాలు అడుగుతుంది. మంచి నేస్తంలా కలగలిసి పోతుంది.ఇప్పుడు వీధులే తప్ప వీధరుగులు లేవు.

వీధరుగులు లేని కొంపలు ముటముటలాడిస్తూ ఉండే ముఖాలతో ఉంటాయి.చిర్రు బుర్రులాడే కోపిష్ఠి మనిషిలా ఉంటాయి.స్వార్థపు గూళ్ళలా ఉంటాయి. 

అరుగు లన్నిటి లోన
ఏ అరుగు మేలు ?
పండితులు కూర్చుండు
మా అరుగు మేలు !

ఈ బాల ల గేయం  విన్నారు కదూ ?

పార్వతీపురంలో మా ఇంటి వీధరుగు మీద మహా పండితులు కూర్చునే వారని డప్పాలు కొట్టను కానీ, రాబోయే రోజుల్లో కాబోయే  ( తెలుగు ) పండితుడొకడు  నిక్కరూ , చొక్కా వేసుకుని  కూర్చునే వాడని మాత్రం ఘంటాపథంగా చెప్ప గలను.

పార్వతీ పురంలో మా యింటి ముందుండే ఈ వీధి అరుగును చూడండి

 దీని మీదే కదా, మా బాల్యం గడిచింది.

 దీని మీదనే కదా ఎన్టీవోడి గురించీ ఏఎన్నార్ గురించీ తగువులాడు కున్నది ?

 ఈ అరుగు మీదనే కదా ఎక్కాలు చదువు కున్నది ? 

ఈ అరుగు మీదనే కదా హోం వర్కులతో కుస్తీలు పట్టినది ?

 ఈ అరుగు మీదనే కదా, మనిషి చంద్రుడి మీద కాలు పెట్టాడన్న వార్తను విని విస్తు పోయినది ?

 ఈ అరుగు మీదనే కదా సినిమా కబుర్లూ, గణపతి మేష్టారు పెట్టిన తొడపాయసాల గురించీ ఒకరికొకరం చెప్పు కున్నది ?

 ఈ అరుగు మీర కూర్చునే కదా ఇంటికి వచ్చే అతిథుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినది ?

 ఈ అరుగు మీద నిలబడే కదా అమ్మ వారి జాతరలో సిరిమాను సంబరాన్ని చూసి పులకించి పోయినది ?

 ఈ అరుగు మీదనే కదా అమ్మ చేసి ఇచ్చిన జంతికలు గుప్పెటలో ఉంచుకుని కొసరి కొసరి తిన్నది ?

 అయ్యో, ఇప్పుడెలా ఉందో చూసేరా .? చిన్నప్పటి ఆటబొమ్మ చివికి పోయి దొరికినట్టు ...

 మాసి పోయిన సామ్రాజ్యాలకు చిరిగి పోయిన జెండా చిహ్నం ...

\
 ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు ?



మా వీధి ..

28, జనవరి 2014, మంగళవారం

ఛత్ర చరితమ్ ... .. అను గొడుగు కథ


చెప్పుల కథ చెప్పు కున్నాక, ఇక గొడుగుల కథ కూడాచెప్పు కోవడం సబవు. ఎందు కంటే గొడుగూ, చెప్పులూ కవల పిల్లల్లాంటివి. ఒకప్పుడు వీధిలోకి వెళ్ళే జనాలు, ముఖ్యంగా మగాళ్ళు చెప్పులు వేసుకుని గొడుగు పట్టుకుని, లేదా చంకలో పెటుకుని మరీ వెళ్ళే వారు. అయితే, గొడుగు పట్టు కోవడం నామోషీగా తలచే రోజు లొచ్చాక వీధుల్లో మనుషుల చేతుల్లో గొడుగులు అంతగా కనబడడం లేదు. ఎండా వానల నుండి కాపాడు కోవడం కోసం వాడే గొడుగులు, ఒకప్పడు అమ్మాయిలకు ఫేషన్ సింబల్ గా కూడా ఉపయోగ పడేవి.


చెప్పులకి ఉన్నంత కాక పోయినా, గొడుగులకి ఉన్న గొప్ప తనం గొడుగులకి ఉంది.

ఎవరి గొప్ప వారిది. అంచేత మనం గొడుగుల కథ చెప్పుకుందాం ...

వెనుకటి రోజుల్లో మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా కాళ్ళకి చెప్పులూ, చంకలో గొడుగూ ఉండేవి. హాదాని బట్టీ చేసే ఉద్యోగాన్ని బట్టీ కండువా తలపాగాలు అదనం. రైతువారీ అయితే చేతిలో కర్ర తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో రెయిన్ కోట్లు వచ్చేక గొడుగు అంతవిధాయకం కావడం లేదు, ఏ కాలం లోనయినా కాళ్ళకి చెప్పులు మాత్రం ఉండక తప్పదు. ఎండయినా. వానయినా గొడుగు పట్టు కెళ్ళడం కొంత అనాగరకంగా తలచే కాలమిది. కొంతకాలం క్రిందటి వరకూ సినిమాలలో హీరోయినూ. ఆవిడ వెనుక గ్రూపు డాన్సర్లూ రంగు  రంగుల గొడుగులు పట్టుకుని త్రిప్పుతూ హొయలు పోతూ విన్యాసాలు చేస్తూ ఉండే వారు. ఇప్పుడలా చూపించడం లేదు అనుకుంటాను.అన్నట్టు గొడుగుల్లో ఆడ గొడుగులూ, మగ గొడుగులూ అని జండర్ భేదం కూడా ఉందండోయ్. పువ్వుల గొడుగులు ఆడవారికే

తాటాకు గొడుగులూ ఉంటాయి. ఉత్తరాంధ్రలో వీటిని గిడుగులంటారు.  వీటినే ఏ ప్రాంతంలో అంటారో తెలియదు కానీ, జిడుగు అని కూడా అంటారని  తెలుస్తోంది. మామ్మూలు గొడుగులకి ఉండేలా పట్టు కోవడానికి కర్ర లేక పోవడం వీటి ప్రత్యేకత, తాటాకుతో చేసే గిడుగులు తల మీద పెట్టుకుని కదలకుండా తాడుని  బెల్టు లాగా మెడ క్రింద తగిలించు కుంటారు. పల్లెల్లో పొలాల్లో, తోటల్లో  పని చేసే వారికి దీని ఉపయోగం జాస్తి. పట్టుకో నక్కర లేదు కదా ! ఒకప్పుడు తాటాకుతో పల్లెల్లో మాత్రమే  వాడుకునే  ఈ గిడుగులు  విదేశీయులూ, వారిని అనుకరించాలని ఉబలాట పడే దేశీయులూ కూడా  నెత్తిని  పెట్టుకుని వీధుల్లో తిరగడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి చింపిరి జుట్టూ, అతుకుల పంట్లామూ అదనపు ఆకర్షణ కాబోలు.  ఈ నవతరం గిడుగులు రంగు రంగుల్లో ఖరీదయిన గుడ్డలతో తయారవుతూ ఆకర్షణీయంగా కూడా ఉంటాయి.
ఇక పోతే చిన్న పిల్లలకి రంగుల పువ్వుల చిన్న గొడుగులు ప్రత్యేకం.  నల్ల రంగు గొడుగులు మగాళ్ళవి.ఇవి కాక పెద్ద పెద్ద నగరాల్లో పేద్ధ రంగుల గొడుగులు పెట్టుకుని దాని క్రింద తాత్కాలిక వ్యాపారాలు .. సెల్ ఫోన్ లూ, వగైరాలు అమ్మడం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఫలితార్ధం ఏమిటంటే, ఎవరయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గొడుగు క్రిందకు రావలసిందే ... దీనిని మరింత విపులంగా తరచి చూద్దాం.

దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు. సినిమా చిత్రీకరణ వేళ హీరోలకి గొడుగు పడుతూ అతని వెనుకే నీడలా తచ్చాడే  వారుంటారు.  వినాయకుడి బొమ్మ వెనుక  మట్టి తోనో, రంగు కాగితాలతోనో చేసిన గొడుగు కొందరు భక్తులు పెడుతూ ఉంటారు. దేవుడికీ, పెద్ద వారికీ, నాయకులకూ గొడుగు పట్టడం ముక్తిదాయకం. లాభదాయకం.

రాజ్యం స్వహస్త ధృత దండ మివాత పత్రమ్ అంటాడు కాళిదాసు. అంటే రాజ్య పాలన సొంతంగా తాను పట్టుకున్న గొడుగు లాంటిదని అర్ధం. మనకి మరొకరు గొడుగు పట్టుకుంటే  గొప్స దిలాసాగా ఉంటుంది కానీ, మన గుబ్బ గొడుగు మనఁవే పట్టు కోవాల్సి వస్తే మాత్రం చచ్చే చిక్కే. హాయిగానే ఉంటుంది కానీ, జబ్బలు పీకఁవూ ! అదన్న మాట సంగతి. కాళిదాసు అందుకే రాజ్యాధికారాన్ని సొంత చేత్తో పట్టుకున్న గొడుగుతో పోల్చాడు.

గొడుగు అనే అర్ధాన్ని ఇచ్చే పదాలు చాలానే ఉన్నాయి. చూదాం ..

ఆత పత్రం, ఆతప వారణం,ఆలవట్టము, ఉత్కూటము,ఉష్ణ వారణమ, ఎల్లి, కావారి, ఛత్రము, జనత్ర, తొంగలి, .. లాంటి పర్యాయ పదాలు చాలానే ఉన్నాయి కానీ వాడుకలో కనిపించవు కనుక చెప్పు కోవడం కంఠశోష. వదిలేద్దాం,
గొడుగులో  ఒక్కో భాగానికీ ఒక  పేరుంది, గుడ్డ , కమాను, కమాను పుల్లలు లాంటి తెలుగు పదాల సంగతి తెలిసిందే    ఇంగ్లీషు వాళ్ళేమంటున్నారో  ఈ చిత్రం చూడండి ..


గొడుగు ప్రస్తావన వచ్చిన పద్యాలూ, శ్లోకాలూ కొన్ని చూదాం.


వెనుకటి రోజులలో అయ్య వారికి చాలు అయిదు వరహాలు, పిల్ల వాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ ఇంటికి వచ్చి, దసరా పద్యాలు చదివే పిల్లలు విధిగా చదివే పద్యం ఒకటుంది.

ధర సింహాసనమై నభంబు  గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై
సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై
వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

భూమి సింహాసనం, ఆకాశం గొడుగూ, దేవతలు సేవకులూ, వేదాలు వందిమాగధులూ,బ్రహ్మాండమే ఆకారం,లక్ష్మీ దేవి భార్య, బ్రహ్మ కొడుకూ, గంగా దేవి కుమార్తె, అయి నరాయణుడు వర్ధిల్లు గాక అంటారు పిల్లలు.

శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని గొడుగులా ఎత్తి, గోగణాన్నీ, గోపాలురనూ కాపాడాడని పోతన భాగవతంలో చక్కని పద్యంలో వర్ణించాడు.



బాలుండాడుచు నాత పత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేలఁ దాల్చి, విపులచ్చత్రంబుగాఁ బట్టె నా
భీలాభ్రచ్చుత దుశ్శలా చకిత గోపీగోప గోపంక్తికిన్

అంటే, గోవర్ధన పర్వతాన్ని ఆడుతూ పాడుతూ పూల గుత్తిని గొడుగులా భావించి, బాలుడైన శ్రీకృష్ణుడు చిరు నవ్వుతో మీదకు ఎత్తాడు. దారుణ మైన ఆ జడివాన నుండి గోగణాన్నీ, గోపికలను, గోపాలకులనూ కాపాడడానికి ఆ కొండను ఒక పెద్ద గొడుగులా పట్టుకున్నాడు.

పోతన గారి పద్యమే, వామన చరిత్రలోనిది. వామనుడు బలిని అంతమొందించే పనిలో వటువుగా బలి వద్దకు వచ్చాడు.బలి ఆతిథ్య మిచ్చి ఏం కావాలని అడిగాడు. మూడడుగుల నేలనిమ్మని కోరాడు వామనుడు. ఓసింతేనా ! అని ఆశ్చర్య పోయాడు బలి చక్రవర్తి, అసలు కికిరీ తెలియక.

ఏమిటయ్యా, భూభాగాన్ని అడిగావా ? ఏనుగులూ గుర్రాలూ కావాలన్నావా ?జవరాండ్రను అడిగావా ?నువ్వు పసి వాడివి. అడగడం కూడా తెలియదు.నీ అదృష్టం అంతే కాబోలు అంటూ నవ్వేడు.

అప్పుడు వామనుడు  అవన్నీ నాకెందుకయ్యా రాజా అంటూ ఇలా పలికాడు ...

గొడుగో, జన్నిదమో,కమండులవొ,నాకున్ ముంజియో, దండమో,
వడుగే నెక్కడ ? భూము లెక్కడ ? కరుల్. వామాక్సు, లశ్వంబు లె
క్కడ ? నిత్యోచిత కర్మ మెక్కడ ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

నువ్వు చెప్పిన భూములూ, ఏనుగులూ, గుర్రాలూ, ఆడువారూ నాకుంకయ్యా, నును వటువును. నాకు గొడుగో. జంద్యమో, కమండలమో. మొలత్రాడో కర్రో చాలును. నాకు మూడడుగుల నేలను ఇస్తే అదే నా పాలిట బ్రహ్మాండం

నిజంగానే మూడడుగుల నేలను దానం తీసుకుని బ్రహ్మాండాలన్నీ ఆక్రమించి బలిని పాతాళానికి త్రొక్కేసాడు వామనుడు.

అంతర్జాలంలో లభించిన గొడుగుల కథ (వారికి ధన్యవాదాలతో )పెడుతున్నాను చూడండి ..

వర్షాకాలం మొదలవగానే గొడుగుల దుమ్ముదులుపుతాం. నిజానికి, ఇవి ఎండాకాలం ఉపయోగించటానికే తయారయ్యాయి. అసలు గొడుగును ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ వీటిని 11వ శతాబ్దం నుంచే చైనాలో వాడిన దాఖలాలున్నాయి. ప్రాచీన ఈజిప్ట్, బాబిలోనియాల్లో గొడుగులు హోదాకు గుర్తుగా వాడేవాళ్లు.

ఐరోపాలో గ్రీకులు గొడుగును ఎండకు రక్షణగా ఉపయోగించేవాళ్లు. ఉన్నత వర్గాలు, రాజ కుటుంబీకులు మాత్రమే గొడుగులను నీడకోసం వాడేవాళ్లు. వీళ్లందరికీ విరుద్ధంగా గొడుగును వానకు తడకుండా ఉపయోగించే వాళ్లు.... ప్రాచీన రొమన్లు. 1680లో ఫ్రాన్స్‌లో, తర్వాత ఇంగ్లండ్‌లో గొడుగు వాడకం మొదలైంది. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటా వానకు రక్షగా గొడుగును వాడటం మొదలుపెట్టారు. ఇదీ గొడుగు కథ 

పాదచారులకు చెట్టు నీడే గొడుగు. ఖర్వాటుల ఖర్మకి మనం చెయ్యగలిగేదేమీ లేదు.



పుట్ట గొడుగులు గొడుగులు కావు. ఒక రకం మొక్కల జాతికి చెందినవి. 

వీటిలో కొన్ని రకాల పుట్ట గొడుగులను మహా ప్రీతిగా కూరొండుకు తింటారు కూడా. పతంజలి గారి రాజుగోరు నవలలో నాయురాలు అల్లుడు అప్పలనాయుడిని ఒక వంక తిడుతూనే, వాడికి పుట్ట గొడుగుల కూరంటే బెఁవత ... చేసి పెట్టమ్మా ! అని కూతురిని పురమాయిస్తుంది...

ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే సమయాను కూలంగా  జంప్ జిలానీల మై పోవడం. లేదా, అందరి దగ్గరా వారికి నచ్చిన విధంగా నడచు కోవడం.

అన్నీ ఒక గొడుగు కిందకే తేవడం అంటే సింగిల్ విండో పధకం లాంటిదన్నమాట.

అప్పుల వాళ్ళ నుండి ముఖం చాటేయడానికి  గొడుగు కన్నా సుఖమైన సాధనం మరొకటి లేదు.
దేనికదే చెప్తుపు కోవాలి. తుఫాను గాలిలో గొడుగులు విరిగి పోవడం తప్ప ఉపయోగ పడవు.
ప్రేమికు లిద్దరూ   వర్షంలో ఒకే గొడుగు క్రింద నడవడం మంచి అనుభవమంటారు ప్రేమ పండితులు.

‘‘ చూసావే ... ఎప్పుడూ తిడుతూ ఉంటావు ... గొడుగు మరిచి పోతున్నానంటూ ...చూడు ... ఇవాళ మరిచి పోకుండా ఆఫీసు నుండి వస్తూ గొడుగు తీసుకొచ్చేను ..’’ అన్నాడు భర్త తన మతి మరుపును వెక్కిరించే భార్య నోరు మూయిద్దామని.

‘‘ అయ్యో ! మీరివాళ అసలు గొడుగే పట్టు కెళ్ళ లేదండీ !’’ అని నెత్తి కొట్టుకుంది భార్య.

ఒకే గొడుగు కింద పదిమంది వెళ్తూంటే వారిలో ఎందరు తడిసే అవకాశం ఉందంటూ అడిగాడు ఒక ఆసామీ. తన మిత్రులని.

ఇద్దరనీ, ముగ్గురనీ, ఐదుగురనీ, ఇలా తలొక్కరూ తలో జవాబూ చెప్పేరు.

‘‘ అసలు వానే పడనప్పుడు ఎవరూ తడిసే అవకాశమే లేదు కదా ! అని భళ్ళున నవ్వుతూ వెళ్ళి పోయాడు ఆ ఆసామీ.


ఇదండీ గొడుగుల కథ.

శలవ్.





22, జనవరి 2014, బుధవారం

చెప్పుకుందాం ... చెప్పుల కథ ...


ఛెప్పు కోడానికేముందిలే, చెప్పుల కథ - అనుకుంటాం కానీ, చెప్పడానికి చాలానే ఉన్నట్టుగా ఉంది ...

వెనుకటి రోజుల్లో మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా కాళ్ళకి చెప్పులూ, చంకలో గొడుగూ ఉండేవి. హాదాని బట్టీ చేసే ఉద్యోగాన్ని బట్టీ కండువా తలపాగాలు అదనం. రైతువారీ అయితే చేతిలో కర్ర తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో రెయిన్ కోట్లు వచ్చేక గొడుగు అంతవిధాయకం కావడం లేదు, ఏ కాలం లోనయినా కాళ్ళకి చెప్పులు మాత్రం ఉండక తప్పదు. ఎండయినా. వానయినా గొడుగు పట్టు కెళ్ళడం కొంత అనాగరకంగా తలచే కాలమిది. కొంతకాలం క్రిందటి వరకూ సినిమాలలో హీరోయినూ. ఆవిడ వెనుక గ్రూపు డాన్సర్లూ రంగు ర్గుల గొడుగులు పట్టుకుని త్రిప్పుతూ హొయలు పోతూ విన్యాసాలు చేస్తూ ఉండే వారు. ఇప్పుడలా చూపించడం లేదు అనుకుంటాను.అన్నట్టు గొడుగుల్లో ఆడ గొడుగులూ, మగ గొడుగులూ అని జండర్ భేదం కూడా ఉందండోయ్. పువ్వుల గొడుగులు ఆడవారికే . కాక పోతే చిన్న పిల్లలకి. నల్ల రంగు గొడుగులు మగాళ్ళవి.ఇవి కాక పెద్ద పెద్ద నగరాల్లో పేద్ధ రంగుల గొడుగులు పెట్టుకుని దాని క్రింద తాత్కాలిక వ్యాపారాలు .. సెల్ ఫోన్ లూ, వగైరాలు అమ్మడం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఫలితార్ధం ఏమిటంటే, ఎవరయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గొడుగు క్రిందకు రావలసిందే ... దీనిని మరింత విపులంగా తరచి చూద్దాం.

దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు.

రాజ్యం స్వహస్త ధృత దండ మివాత పత్రమ్ అంటాడు కాళిదాసు. అంటే రాజ్య పాలన సొంతంగా తాను పట్టుకున్న గొడుగు లాంటిదని అర్ధం. మనకి మరొకరు గొడుగు పట్టుకుంటే దిలాసాగా ఉంటుంది కానీ, మన దిబ్బ గొడుగు మనఁవే పట్టు కోవాల్సి వస్తే మాత్రం చచ్చే చిక్కే. హాయిగానే ఉంటుంది కానీ, జబ్బలు పీకఁవూ ! అదన్న మాట సంగతి. కాళిదాసు అందుకే రాజ్యాధికారాన్ని సొంత చేత్తో పట్టుకున్న గొడుగుతో పోల్చాడు.

చెప్పుల కథ చెప్పుకుందామంటూ బయలుదేరి కొంత శాఖా చంక్రమణం చేసి గొడుగుల కథలోకి వెళ్ళినట్టున్నాం. గొడుగు చెప్పుకి అగ్రజుడు మరి. సరే, గొడుగుల కథ కాస్సేపు మడిచి ప్రక్కన పెట్టి మళ్ళీ చెప్పుల కథ లోకి వద్దాం !

చెప్పులకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అగనాళ్ళు, అడివొత్తులు, ఉద్దాలు, ఉపానము, ఊడుపు, పాదుకలు, జోళ్ళు, పాదరక్షలు, పాదుకలు, మలకడాలు, ముచ్చెలు, మెట్లు, వగైరా ఇంకా చాలా పదాలకి చెప్పులు అనే అర్ధం, వీటిలో పాదకలను మళ్ళీ అడిగఱ్ఱ, పావకోడు, యోగవాగలు, వాగెలు, వగైరా పేర్లతో పిలుస్తారు.

చెప్పులలో రకాలకీ మనవాళ్ళు పేర్లు పెట్టారు. ఓరట్టు చెప్పులు, కిర్రు చెప్పులు, ఓరచ్చులు,కిఱ్ఱు పావుకోళ్ళు, కిఱ్ఱు బాగాలు,పిడివారులు వగైరా పేర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ మనకు తెలియవు, కనీసం నాకు తెలియదు. కిర్రు చెప్పుల గురించి మాత్రం మనలో చాలా మంది వినే ఉంటారు. సాధారణంగా ఇవి తోలు చెప్పులు. నడుస్తూ ఉంటే కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తూ ఉంటాయి. ఇక పావుకోళ్ళయితే కర్రతో చేస్తారు. పాంకోళ్ళు అనికూడా వ్యవహారం. మునులు వీటినే ధరించేవారు.


వెనుకటి రోజులలో పెళ్ళి వేడుకల్లో పెళ్ళి కొడుకు కాశీ ప్రయాణ ఘట్టంలో పాంకోళ్ళు ఇచ్చే వారు

. ఇప్పటికీ పెళ్ళి తంతులో కాశీయాత్ర ముచ్చట సజావుగానే ఉంది. నాకీ పెళ్ళొద్దని వరుడు కాశీ ప్రయాణం కట్టడం, బావమరిది బతిమాలి కాలికి చెప్పులూ, గొడుగూ, కర్రా, కొత్త బట్టలూ ఇచ్చి పటిక పంచదార ముక్క తినిపించి కాశీ ప్రయాణం మానుకుని తమ సోదరిని పెళ్ళి చేసుకొమ్మని అడగడం, వరుడు మనసు మార్చుకుని తిరిగి కళ్యాణమండపం మీదకి రావడం ... ఇదీ తంతు. పోతే పోవోయ్ అని ఊరుకుంటే ఏంజరుగుతుంది చెప్ప్మా ! అని నాకొక చిలిపి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ వేడుక సమయంలో వరుడికి లోగడ పావుకోళ్ళు ఇచ్చే వారనుకున్నాం కదా ... తర్వాత వాటి స్థానంలో చాలా రోజుల వరకూ హవాయి చెప్పులు. లేదా మామూలు బాటా చెప్పులూ ఇవ్వడం మొదలెట్టారు. కొంతమందయితే వేడుక కోసం మామ్మూలు చెప్పులు పెట్టినా, వరుడికి ఖరీదయిన బూట్లు ఇస్తున్నారు. లేదా మగ పెళ్ళి వారే అడిగి మరీ కొనిపించు కుంటున్నారు.


నిన్నా మొన్నటి వరకూ అగ్రవర్ణాల వారుండే వీధిలోకి కాలి చెప్పులతో కడజాతి వాడు రావడం నిషిద్ధంగా ఉండేది. ఇప్పుడా మాటంటే చెప్పు తీసుకుని కొడతారు. కొట్టాలి కూడా.

చెప్పుల కథ చెప్పుకేనేటప్పుడు విధిగా పాదుకా పట్టాభిషేకంతో మొదలు పెట్టడం సబవు. రాముడు అరణ్య వాసంకి వెళ్ళాక, భరతుడు తల్లి చేసిన పని తెలిసి, బాధపడి, అడవికి వెళ్ళి అన్నగారిని తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చేయమని బ్రతిమాలుకుంటాడు. సత్యవాక్పాలకుడు శ్రీరాముడు విన లేదు. చివరకి రాముడు లేని రాజ్యాన్ని తాను పాలించననీ, అందుకు అర్హత తనకి లేదనీ, రాముడి పాదుకలను అడిగి పుచ్చుకుని వాటిని సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం చేసి అన్న గారి పట్ల తన ప్రభు భక్తిని ప్రకటించు కున్నాడు భరతుడు. అయితే, అసలే అరణ్యవాసం తప్పని రాముడికి ఆ ఘోరారణ్యంలో కనీసం పాదుకలయినా లేకేండా చేసాడని ఒక తరహా మేధావులు గోల పెడుతూ ఉంటారు. ఇదీ పాదుకలకి ఉన్న మహిమ. చెప్పుల చరిత్రలో స్వర్ణయుగమది.

దేవుళ్ళ పేరిట దర్శనమిచ్చే పాదుకలను భక్తులు పరమ భక్తి శ్రద్ధలో కొలుస్తారు.







 కనకపు సింహాసనమున శునకం ఎక్కిందో లేదో కానీ పాదుకలు ఎక్కాయి. 

అల్లసాని పెద్దన గారి ప్రవరుడు ఏ చెప్పులూ ధరించకుండానే వొట్టి కాళ్ళతో హిమాలయాలకి వెళ్ళి ఉంటాడని మా తింగరి బుచ్చి పరిశోధనలో తేల్చాడు. సిద్ధుడు కాలికి పూసిన పాద లేపనం కరిగి పోయిందంటే ప్రవరుడు ఏ చెప్పులూ వేసుకుని ఉండడని తింగరి బుచ్చి సూత్రీకరించేడు. దీని నెవరయినా పూర్వపక్షం చేస్తే నాకు అభ్యంతరం లేదు.

ఇక చెప్పుల పద్యాలు ఒకటి రెండు చూద్దాం ...

అల్ప బుద్ధి వానికి అధికార మిస్తే దొడ్డ బుద్ధి వారిని తన్ని తరిమేస్తాడని చెబుతూ వేమన గారు ‘‘చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?’’ అంటాడు.

ఇలాగే వేమన పద్యాలలో చెప్పుల ప్రస్తావన మరో చోట ఉంది. చెప్పు లోని రాయి, చెవి లోని జోరీగ, కంటి లోని నలుసు, కాలి ముల్లు, ఇంటి లోని పోరు ఇంతింత కాదయా ! అంటాడు. వెల్ సెడ్ కదూ ? వాటి బాధ అనుభవించే వాడికే తప్ప మరొకడికి తెలియదు మరి ! ఈ పద్యానికి లోని రాయి గురించి చెప్పు ( ఆత్మ వివేచన చేసుకో !) లాంటి వేదాంత పరమైన అర్ధాలు  కూడా మన పెద్దలు చెప్పారు కానీ, అంత సీను మనకి లేదు. దాని సంగతి వదిలేద్దాం.

వెనుకటికో అవధానిగారికి ఓ పృచ్ఛకుడు ‘‘ కప్పను గని ఫణివ వరుండు గడగడ

వణికెన్ ’’ అని సమస్య ఇచ్చేడు. దానిని అవధాని పూరించిన పద్యంలో చెప్పుల ప్రస్తావన ఉంది కనుక అదీ చెప్పుకుందాం.
కుప్పలు కావలి కాయఁగ
చెప్పులు కఱ్ఱయును బూని శీఘ్ర గతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణి వరుండు గడగడ వనికెన్ !

ఇదీ పూరణ. పొలంలో వరి కుప్పలు కాపాలా కాయడానికి వెంకప్ప అనే రైతుచేతిలో కర్ర, కాలికి కిర్రు చెప్పులూ వేసుకుని వచ్చేడుట. వాటి చప్పుడుకి పాము బెదిరి పోయి గడగడా వణికి పోయిందిట.

అల్పుల గురించి ఓ కవి చెబుతూ ..

నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.

అన్నాడు. నిజఁవే కుక్కలు చెప్పులను ఉండనివ్వవు. చింపి పోగులు పెడతాయి. ఇళ్ళలో కుక్కలను పెంచే వారికి ఇది అనుభవైక వేద్యమే. ఇలా మన చెప్పులు కుక్కల పాలిబడటం కుక్కల చరిత్రకే తీరని అవమానంగానూ.నష్టదాయకంగానూ. తీరని ద్రోహంగానూ ... యింకా చాలాగానూ మా తింగరి బుచ్చి వాపోతున్నాడు.

సాముల్ని కర్రతోనూ. చెప్పుతో తేళ్ళనీ , జెర్రెలనీ కొట్టి చంనడం మనుషుల అలవాటు. ఈ విధంగా చెప్పులు తేళ్ళ వంటి విషజంతువుల వధలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నమాట. విష జంతువులే కాదు, అలాంటి వెధవల పాలిట కూడా చెప్పులే సరైన ఆయుధాలు. రోమియోగాళ్ళనీ, బేవర్సుగాళ్ళనీ చెప్పు దెబ్బడలతో సత్కరించడం అమ్మాయిలకు అవసరం.చేత్తో కొట్టడం కన్నా, చెప్పుతో కొడితే మరీ అవమానించి నట్టవుతుంది.

సభల్లో నచ్చని వక్తల మీద, రాజకీయ నాయకుల మీద చెప్పులు విసరడం తెలిసినదే. అయితే కోడి గుడ్లు, టమాటాల కంటె ఇది కాస్త ఖరీదయిన వ్యవహారం అనుకుంటాను.హోళీనాడు రంగులు పూస్తారని చెప్పి పాత గుడ్డలు వేసుకు వెళ్ళి నట్టుగా వీటి కోసం ఏ చిరిగిన చెప్పులో ప్రత్యేకించడం మంచిది. లాభదాయకం. మీ ఇష్టం. ఆలోచించండి.

కుక్కలే కాదు, కొత్త చెప్పులూ కరుస్తాయి సుమండీ. ఆ బాధ వర్ణనాతీతం. అలవాటు పడే వరకూ నరకం చూపిస్తాయి. అందుకే పరైన చెప్పులూ, సరిజోడు పెళ్ళామూ లభించడం అదృష్టమనే చెప్పాలి. చెప్పులయితే కనికరించి కొన్ని రోజులకి కరవడం మానేస్తాయి కానీ, మొండి పెళ్ళాలు జీవితపర్యంతం కరుస్తూనే ఉండే ప్రమాదం ఉంది.
ఇక, ఉచితంగా చెప్పులు దొరికే చోటు ఏదంటే ఖచ్చితంగా దేవాలయాలే ! అని ఎవరయినా ఠక్కున చెప్పగలరు. కాక పోతే ఒక్కోసారి పెళ్ళి పందిళ్ళలో కూడా మనకి కావలసిన అనువైన, అందమైన కొత్త చెప్పులు ఉచితంగా దొరికే వీలుంది. ఏదో సినిమాలో నా షోలాపూర్ చెప్పులు పోయాయని గోల పాట ఒకటుంది కదూ ? ఇలాంటి చోట్ల పోయిన చెప్పులన్నీ ఉద్దేశ పూర్వకంగానే ఎవరో ఎత్తుకెళ్ళారనీ అనుకో నక్కర లేదండీ. ఒక్కో సారి హడావిడిలో మనవి కానీ చెప్పులు వేసు కోవడం, కుడి ఎడమల చెప్పులు తారుమారయి అవస్థలు పడడం కూడా జరుగుతూనే ఉంటుంది.

అందుకే ఆలయంలో దేవుడి ఎదుట నిలుచున్నా, చిత్తం చెప్పుల మీదనే ఉంచే భక్తులుంటారు. ఇప్పుడయితే రూసాయో, రెండో తీసుకుని టోకెన్లు ఇచ్చి, మనం వచ్చే వరకూ మన చెప్పులు భద్ర పరుస్తున్నారు కానీ లోగడ ఆ సదుపాయం ఉండేది కాదు. ఇప్పటికీ ఆ సదుపాయం లేని దేవాలయాలు చాలానే ఉన్నాయి. అవి కొత చెప్పులు ఉచితంగా కావాలనుకునే వారి పాలిట చెప్పుల కల్ప తరువులు. అయితే మనకి నచ్చిన , మనకి సరిపోయిన మంచి చెప్పులు కనిపిస్తే మన పాత చింకి చెప్పులు అక్కడ విడిచేసి దర్జాగా ఉడాయించ వచ్చు. కానీ కొన్ని మెళకువలు పాటించక పోతే దొరికి పోతాం. ముఖ్యంగా మనం వేసుకు పోదామనుకున్న చెప్పులాయన, లేదా, ఆమె ఆ చెప్పులు విడిచి ఎంత సేపయిందీ, తిరిగి వెంటనే వచ్చే ప్రమాదమేదయినా ఉందా , చుట్టు ప్రక్కల ఎవరినా నిఘా వేస్తున్నారా ? మొదలయిన విషయాల గురించి ముందుగా రెక్కీ నిర్వహించి తెలుసు కోవడం మంచిది. లేదా దెబ్బ తినేస్తాం అని మా తింగరి బుచ్చి థియరీ.
మరో విషయ మేమిటంటే, మనం శివాలయం ముందు నుంచి చెప్పుల జత ఎత్తు కొచ్చామనుకోండి ... వెంటనే మరి కొన్నాళ్ళ పాటయినా మతంమార్చెయ్యాలి. పరమ విష్ణు భక్తుల మయి పోవాలి. ఆ శివాలయం వేపు కొన్నాళ్ళు వెళ్ళడం వొంటికి మంచిది కాదు.

మా తింగరి బుచ్చిలాంటి ప్రబుద్ధులు చెప్పులు మార్చాలనిపిస్తే ఏదో దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారు. సురక్షితమైన ఆలయం ఎన్ను కోవడంలో వారి మెళకువ అంతా ఇంతా కాదు. ఎప్పుడో చెప్పు దెబ్బలు తినే వరకూ వారి తీరు మారదు.

’’ఈ మేలు చేసావంటే నీ రుణం ఉంచు కోను, నాచర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా ’’ అని ఎవరయినా అంటే మరీ వాచ్యార్ధాన్ని సీరియస్ గా తీసుకో కూడదు. చర్మం వొలిచి చెప్పులు కుట్టించడమంటే జీవితాంతం చేసిన మేలు గుర్తుంచు కుంటాననడమే కానీ నిజంగా అలాంటి చెప్పుల జత వొస్తుందనుకో కూడదు.

చెప్పుల్లో చెప్ప లేనన్ని రకాలు. బాత్ రూమ్ చెప్పులూ. ఇంట్లో తిరగడానికి వాడే చెప్పులూ, వర్షాకాలంలో వాడేవీ, ఎండా కాలంలో సౌకర్యంగా ఉండేవీ, ఫంక్షన్లలో డాబుగా కనిపించేవీ ... చాలా రకాలుంటాయి. సాదా చెప్పులూ. రబ్బరు చెప్పులూ, తోలు చెప్పులూ, బూట్లూ, హాఫ్ బూట్లూ ... చెప్పడం నాతరం కాదు. కొంత మంది రాజకీయ కాయకులకూ, ముఖ్యంగా అమ్మణ్ణులకూ, సినీతారలకూ చెప్పుల పిచ్చి జాప్తీయే. ఎన్ని రకాల చెప్పులు కొన్నా వారికి తనవి తీరదు. ఓ ముఖ్యమంత్రిణి ఇంట చెప్పుల జతలు వందల సంఖ్యలో ఉంటాయని చెప్పుకుంటారు.
చెప్పుల కథలో మరచి పోకూడని చెప్పులు చార్లీచాప్లిన్ వి.అతను వేసుకునే బూట్లు వదులుగా తమాషాగా ఉంటాయి.

ఆఫీసు కెళ్ళే భర్తల చెప్పులు, లేదా బూట్లూ, మేజోళ్ళూ తుడిచి శుభ్రం చేసి సిద్ధం చేయడం ఓ తలనొప్పి వ్యవహారం. బడి నుంచి ఇంటికి వస్తూనే కాలి చెప్పులు ఓ మూలకి విసిరేసే పిల్లలూ, బూట్లు విప్పి ఏ మూలనో గిరాటు వేసే పిల్లల తోనూ  తల్లులకి  నిత్యం సతమతమే.

చివరగా చెప్పుల సామెతలు కూడా చూద్దాం ...

1. చెప్పు కాలు నెత్తిన పెట్టి, వఠకోపమంటాడు.
2. చెప్పు కింద తేలు లాగా
3. చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా ?
4. పట్టు గుడ్డలో చెప్పును చుట్టి కొట్టినట్టు !
5. చెప్పుల వానికి చేనంతా తోలుతో కప్పినట్టుగా ఉంటుంది.
6. చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ జాగ్రత్తగా ఉండాలి.
7. చెప్పులు సరిపో లేదని కాలు తెగ కోసుకుంటారా ?
8. చెప్పులు తెగినా చుట్టరికం తెగదు.
9. చెప్పు లోని రాయి చెవి లోని జోరీగ, ఇంటి లోని పోరు ఇంతింత కాదు

చెప్పులు అరిగేలా తిరగడ మంటే, పట్టు వదలకుండా కృషి చేయడమన్నమాట.

చెప్పుల కథలో చివరిగా ఒక స్వీయానుభవం కూడా చెప్పి ముగిస్తాను.

అదేదో సబ్బుల కంపెనీ ప్రకటన ... మరక   మంచిదే ! లాగా , కాలికి చెప్పులు లేక పోవడం కూడా ఒక్కో సారి   మంచిదే అని నా స్వీయానుభవం. చెబుతా వినండి.

అవి నేను ఓ మారు మూల కుగ్రామంలో పరిషత్ పాఠశాలలో టీచరుగా చేరిన రోజులు. రెండేళ్ళు ఆ కుగ్రామంలో నానా అవస్థలూ పడ్డాను. ఉద్యోగ మంటేనే విరక్తి కలిగింది. అక్కడి నుండి బదిలీ ఎప్పుడవుతుందా అని ఎదురు చూసాను. ఆరోజు రానే వచ్చింది. రెండేళ్ళు గడిచాక జిల్లా పరిషత్ వారు టీచర్ల బదిలీలు చేపట్టారు. మా మునిసిపల్ ఛైర్మన్ గారు తమకి అనుయాయులూ, తెలిసిన వారూ అయిన టీచర్ల బదిలీలు వారు కోరిన చోట్లకి చేయించే పనిలో జిల్లా కేంద్రానికి మరుచటి దినమే వెళ్తున్నారని తెలిసింది. వెంటనే మా ఊరికొచ్చి, ఆఘ మేఘాల మీద, అప్పటికే హెడ్మాష్టరు చేత అండార్సు చేయించిన బదిలీ దరఖాస్తు కాపీని ఛైర్మన్ గారి కి అంద చేయాలని తలపెట్టాను. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. మర్నాడు ఛైర్మను గారి కారు బయలు దేరే లోపు నా అప్లికేషను వారి చేతిలో పెట్టాలి. లేక పోతే పని జరగదు మరి. నిద్ర లేమితో మర్నాడు ఆలస్యంగా లేచాను. తుళ్ళి పడ్డాను. మాసిన బట్టలు మార్చు కో లేదు. చెప్పులు తొడుక్కుని బయలుదేరే వేళకి ఓ చెప్పు తెగి పోయి నడవడానికి సహకరించడం లేదు. టైం లేదు. ఆ చెప్పులను అలాగే వదిలేసి, మా ఇంటికి ప్రక్క వీధిలోనే ఉండే ఛైర్మను గారింటికి వట్టి కాళ్ళతోనే హడావిడిగా బయలు దేరాను. వారు నా అవతారం చూసి. చెప్పులు లేని నా కళ్ళ వేపు ఓ సారి జాలిగా చూసి, గాఢంగా నిట్టూర్చి, నా చేతి లోనుండి దరఖాస్తు అందు కున్నారు. కాలికి ( తెగి పోవడం వ్లనే అనుకోండి ) చెప్పులయినా లేని నా రూపం వారిలో ఏ పేగు కదిలించిందో మరి, వారు చేపట్టిన బదిలీ లో మొదటిది నాదే ! చక్కగా మా ఊరికి దగ్గరగా చక్కని రవాణా సౌకర్యం ఉండే చోటుకి పట్టుబట్టి నాకు బదిలీ చేయించారు. ఇప్పుడు చెప్పండి ... అర్ధాంతరంగా చెప్పు తెగి పోవడం కూడా మంచిదే కదూ ?!

ఇదండీ నేను చెప్ప గలిగినంత చెప్పుల కథ ...

శలవా మరి ....




















































15, జనవరి 2014, బుధవారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్య దోశె... ఆహా ! ఏమి రుచి !



కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లు

చాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా హొటల్ డేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాష్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ,,, ,,, మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

10, డిసెంబర్ 2013, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ...






ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.

గురువుల చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.

‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.

‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.

‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.

కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ తెలంగాణా ... సమైక్యాంధ్ర ’’

రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.



‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు

కొడుకు మళ్ళీ అవే మాటలు ,ప్పాడు.

ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.

‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు

‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ;’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...

గురువులు గజగజ వణికి పోయారు.

‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.

‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.

‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.

‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.

మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.

‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.



నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.




13, నవంబర్ 2013, బుధవారం

శునక పురాణం



‘‘ ఛీ ! కుక్క వెధవా ! ’’ అని ఎవరి మీద నయినా కోపం వొచ్చి నప్పుడు తిడతాం కానీ, శునక పురాణం చదివితే శునక జాతిని అలా కించ పరుస్తూ తిట్టడం ఎంత తప్పో తెలుసు కుంటాం. మానవ జాతి చరిత్ర మనుషుల కున్నట్టే, కుక్కల చరిత్ర కుక్కలకూ ఉంటుంది.ఆ కుక్కల చరిత్ర అంతా వాటికి వన్నె తెచ్చేదే కాక పోయినా వాటికంటూ ఓ చరిత్ర ఉంది కదా. ఆ సంగతి తెలుసు కోవాలి.

శునక పురాణం అనే శీర్షికను చూసి కథా మంజరి తిక్కల బ్లాగరు అష్టాదశ పురాణాలనూ అపనిందలపాలు చెయ్య బోతున్నాడని మాత్రం అనుకో వద్దు. ఇది కేవలం శుకములను గూర్చిన గుది గుచ్చిన భోగట్టాల సమాహారం. అంతే.


కుక్కకు చాలా సర్యాయ పదాలు ఉన్నాయి. చూదాం. కుక్క. శునకము,జాగిలము, నాయి. వే(బే)పి లాంటి తెలిసిన పదాలే కాక, శ్వానము,అలిపకము,అస్తిభిక్షము,కుక్కురము ,సారమేయము

.సూచకము,జిహ్వానము,కౌలేయకము,కంకశాయము వృకరాతి ... లాంటి చాలా పదాలకు కుక్క అనే అర్ధం.దులో మరీ, అడ కుక్కకి కుక్కురి, శుని అని పేర్లున్నాయి. వేట కుక్కకయితే ఆఖేటికము,ఉడుప కుక్క,మోరపడము లాంటి పేర్లున్నాయి.కుక్క భౌ భౌ అని అరుస్తుందని మనకు తెలుసు కానీ, కుక్క అరుపును భషణము, మొఱగుడు అని కూడా అంటారు. వీటి మాట కేం గానీ, కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. చాలా జాతులు ఉన్నాయి
, దేశవాళీ కుక్కలు, విదేశీ జాతుల కుక్కలూ కూడా ఉన్నాయి. విదేశీ కుక్కలకే మన్నన ఎక్కు కదా !సౌమ్యాకారులూ, అతి భీకరాకరులూ అయిన కుక్కలూ ఉంటాయి. జాతి కుక్కలూ, వీధి కుక్కలూ. గజ్జి కుక్కలూ , పిచ్చి కుక్కలూ లాంటి శునక జాతి భేదాలూ ఉంటాయి.. పిల్లల కున్నన్ని కాక పోయినా కుక్కలకూ చాలా వరైటీ పేర్లు ఉంటాయి. అందులో టామీ అనే పేరు మన అప్పారావు అనే పేరులాగా చాలా ప్రసిద్ధం.
 కుక్కలు చాలా విశ్వాస  పాత్రమైన  జంతువులు అన్నమాట నిజమే కానీ అవి ఎంచేతనో తమ విశ్వాస గుణాన్ని కాస్సేపు ప్రక్కన పెట్టి, యజమానినే కరచిన సంఘటనలూ అక్కడక్కడ చోటు చేసుకోవడం కాదన లేని సత్యం.కారణాల కోసం పెద్దగా అన్వేషించ నక్కర లేదు. ఎంతయినా కుక్క బుద్ధి కుక్క బుద్ధే కదా ?!


మొరిగే కుక్క కరవదని ఒక సామెత. దీనికి రుజువులూ సాక్ష్యాలూ చూపడం కష్టం. మొరిగే కుక్కల దగ్గరకి వెళ్ళి కరుస్తుందో, లేదో గమనించే సాహసం చెయ్యలేం కదా,

కొన్ని కుక్కలు విస్సాకారంగా మన మీద ఓ లుక్కు వేసి ఊరుకుంటాయే కానీ మొరగవు. బోలెడు డబ్బులు పోసి పెంచు కుంటున్నా, జబ్బుల లొస్తే కుక్కల ఆసుపత్రులకు తీసికెడుతున్నా అవి మాత్రం కిమన్నాస్తిగా ఉండి పోతాయి. చిన్న గుర్రు కూడా పెట్టవు. దొంగలను చూసి మొరగని కుక్కలు అవేం కుక్కలు ? తిండి దండగ
 కాకపోతే.

వెనుకటికి వో చాకలి ఇంట ఓ కుక్కా, గాడిదా ఉండేవిట. యజమాని తనకి సరైన తిండి పెట్టకుండా. సరిగా చూడకుండా ఉన్నాడనే ఉక్రోషంతో ఓ రాత్రి చాకలి ఇంట దొంగలు పడితే మొరగ కుండా ఉండి పోయిందిట. దాంతో కుక్క చేయ వలసిన డ్యూటీ గాడిద తన నెత్తిన వేసుకుని యజమానిని నిద్ర లేపుదామని ఓండ్ర పెట్టిందిట. చాకలి నిద్రా భంగమైనందుకు కోపంతో గాడిదని చావబాదాడట. ఈ కథ వలన తెలుసుకోవలసిన నీతి మాట అటుంచితే, పెంపుడు కుక్కలకు కూడా కోపతాపాలు ఉంటాయనీ, యజమానికి అవి సర్వ కాల సర్వావస్థల లోనూ విశ్వాస పాత్రంగా ఉంటాయనీ గుడ్డిగా నమ్మడం కూడా పొరపాటే అని గమనించాలి.

కుక్కలకు ఏకైక ప్రబల శత్రువు మ్యునిసిపాలిటీ వారి కుక్కకల బండి. వీధిలో కనిపించే ప్రతి ఊర కుక్కనీ బండిలో  పడేసి పట్టుకు పోతూ ఉంటారు

గొప్పింటి వారు తమ ఇళ్ళ గేట్ల ముందు ‘‘ కుక్క లున్నవి జాగ్రత్త ’’ అని బోర్డులు  వేలాడదీస్తూ ఉంటారు.

పోస్టు జవాన్లకూ, పేపరు కుర్రాళ్ళకూ అలాంటి ఇళ్ళలో ఉండే కుక్కల వలన ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.

పోలీసు కుక్కలు ప్రత్యేక శిక్షణ  పొందిన కుక్కలు . నేర ప్రాంతాన్ని మూచూసి, వాసన పసిగట్టి నేరస్థులను పట్టు కోవడంలో ఇవి రక్షక భటులకు సహకరిస్తాయి

ఇన్ని కుక్కల గురించి చెప్పి, పాత కాలం నాటి హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ ఫోను ముందు కనిపించే కుక్క గురించి చప్పక పోతే భౌ ! భౌ ! మని కసురు కోదూ ?

మహా భారతంలో కనిపించే కుక్క పేరు సరమ. రాక్షసులనుండి తమ గోగణానికి కాపలాగా దేవేంద్రుడు సరమ అనే కుక్కను ఉంచేడు. అయితే రాక్షసులు దానికి పాలు పోసి మచ్చిక చేసుకుని గోవులను అపహరించుకు పోయే వారు. దానితో ఇంద్రుడు గోవులు ఏమౌతున్నాయని సరమను అడిగేడు. అది చెప్పడానికి భయపడి పోయింది. దానితో ఇంద్రుడు దాని డొక్కలో తంతే పాలన్నీ కక్కీసి, పారి పోయింది.ఇంద్రుడు దానిని తరుము కుంటూ హిమాలయాల వరకూ వెళ్తే అక్కడ రాక్షులు కనిపించేరు. వారిని వధించేడు. ఇదీ కథ. దీని వలన కూడా కుక్కలు మరీ అంత విశ్వాస పాత్రులైనవి కావేమో అనే సందేహం కలుగక మానదు. పైచ్చు అవి శత్రువు నుండి లంచాలు మేయడానికి కూడా సిద్ధ పడి పోతాయని అనిపిస్తోంది.

అందుకే లంచాలు మేసే వెధవలంతా కుక్కలతో సమానమని కథా మంజరి బ్లాగరు తీర్మానించు కున్నాడు.

మహా భారతంలో మరొక కుక్క ప్రస్తావన సుప్రసిద్ధమే. పరీక్షిత్తుకు పట్టం కట్టేక ధర్మరాజాదులు బొందితో కైలాసానికి బయలు దేరారు. వారిని ఓ శునకం వెంబడిస్తూ నడిచింది, మార్గ మధ్యంలో మొదట ద్రౌది, తరువాతసహ దేవుడు, నకులుడు,భీముడూ అర్జునుడూ వరసగా నేలకు కుప్పకూలి పోయేరు. ధర్మ రాజు వెను తిరిగి చూడ లేదు. వారంతా అలా పడి పోవడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఇంద్రుడు ఎదురొచ్చి తన నగరుకి రమ్మని ధర్మరాజుని ఆహ్వానించేడు. తన వెంట వస్తున్న కుక్కని విడిచి రాననీ. అది పాపమనీ ధర్మరాజు పలికేడు. అప్పుడా కుక్క తన నిజరూపు చూపి నిలిచింది. అతడే ధర్ముడు. ధర్మజుడు ధర్మ తత్పరుడు కనుక ధర్మం అతని తుదకంటా నిలిచిందని ఫలితార్థం.

కాల భైరవ స్వామి అంటే శునక రూపంగా భావించ కూడదు. కాలము అంటే నలుపు. నల్లని రూపు కలవాడు. విశ్వాసానికి పేరందిన ఒక కుక్క స్వామి వాహనం శునకం.

దత్తాత్రేయ స్వామి వారి వద్ద ఎప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలకు ప్రతీకలు. స్వామి వేద మూర్తి. స్వామి మూడు ముఖాలూ  సృష్టి, స్థితి, లయకారుల స్వరూసాలు

బళ్ళారి రాఘవ ఒకసారి గుడివాడలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నప్పుడు కాటి సీనులో ఎక్కడి నుండో ఒక కుక్క స్టేజీ మీదకు అకస్మాత్తుగా ప్రవేశించిందిట. అంతా అవాక్కయి పోయేరు. ప్రేక్షకులు గొల్లున నవ్వేరు. రాఘవ సమయస్ఫూర్తితో నాటకంలో లేని ఓ డైలాగు ... ‘‘ ఓ శునక రాజమా !నీకును నేను లోకువయిపోతినా; పొమ్ము ’’ అని దానిని అదిలించే సరికి అది అక్కడి నుండి పారి పోయిందిట. ఈ విధంగా మహా నటుడు రాఘవ ఆ నాటి నాటకం రసాభాసం కాకుండా చేసారుట.

యండమూరి వీరేంద్రనాథ్ ఏ కంగా కుక్క అనే ఓ నాటికనే రాసేడు.

రావి కొండల రావు గారి కుక్క పిల్ల దొరికింది నాటిక చాలా మందికి తెలిసిన గొప్ప హాస్య నాటిక.
కుక్కలను విశ్వాసపాత్రంగా చూపించిన రాము లాంటి తెలుగు హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి.
Ramu-poster.jpg
 అలాగే విఠలాచార్య సినిమాలలో హీరోయో, హీరోయనో అకస్మాత్తుగా కుక్కగా మారిపోయే సందర్భాలూ ఉంటాయి.
విజయా వారి పాతాళ భైరవిలో కూడా ఒక  కుక్క మనకి  గుర్తండే ఉంటుంది. ఇలా తెలుగు సాహిత్యంలో కుక్కల ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది.

Telugucinemaposter patalabhairavi 1951.JPG

కుక్కలకి ప్రాధాన్యత ఇచ్చి తీసిన ఇంగ్లీషు  సినిమాలు కొల్లలు కనిపిస్తాయి.




మరి కొన్నింటిని చూద్దాం ...


కనకపు సింహాసనమున
శునకముఁగూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !

అని. బద్దెన సుమతీ శతకంలో కుక్క బుద్ధిని ఎండ గట్టేడు. ఆ వంకతో కొందరు మనుషులు నైజాన్ని చాటి చెప్పేడన్నమాట.

కుక్కలు చెప్పులు వెతుకును అని ఊరికే మనవాళ్ళు అన లేదు కదా ? అది దాని నైజ గుణం మరి.


భర్తృహరి సుభాషిత త్రిశతిలో ఒక శ్లోకంలో కుక్కల నైజం ఇలా వర్ణించి చెప్పాడు

లాంగూల చాలన మధుశ్చరణావఘాతం
భూమౌ నిత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చభుక్తే.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం చూడండి:

వాలము ద్రిప్పు, నేలబడి వక్త్రము, కుక్షియుఁజూపు, క్రిందట
బడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్రశుం

డాలము శాలితండు లగు పిండంబుల చాటు వచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్యగుణయుక్తిఁగఁజూచు మహోన్నత స్థితిన్

దీని భావం ఏమిటంటే, కుక్క తనకి ఆహారం పవడేసే వాడి ఎదుట నానా వికారాలూ పోతుందిట. వాడి ఎదుట నిలబడి తోక ఊపుతుంది. నేల మీద దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేలను తవ్వుతుంది. కాని భద్ర గజం అలా కాదు. ఆ తినేదేదో మురిపించుకుని మురిపించుకుని మరీ తింటుంది. అదీ ధీరుల లక్షణం అంటాడు కవి.

అంతే కదా, కుక్క కుక్కే , ఏనుగు ఏనుగే. దారంట ఏనుగు పోతూ ఉంటే కుక్కలు ఊఁ... అదే పనిగా మొరుగుతాయి. వాటి వలన ఏనుగుకి వచ్చే లోటు ఏమీ ఉండబోదుకదా,

శ్రీనాథుడు ఓ చాటువులో ఇదే చెప్పాడు

సర్వఙ్ఞ నామధేయము
శర్వునికే, రావుసింగ భూపాలునికే
యుర్విం జెల్లును, తక్కొరు
సర్వఙ్ఞుండనుట కుక్క సామజ మనుటే

ఈ పద్యంలో సర్వఙ్ఞుడనే పేరు శర్వునికే తప్ప సింగభూపాలుడికి చెల్లదనే గూఢార్ధం ఉందని, రాజాగ్రహం చల్లార్చడం కోసం శర్వునికీ, రావుసింగభూసాలునికి మాత్రమే సర్వఙ్ఞుడనే పేరు తగునని కవి సమర్ధన చేసాడనీ అంటారు.

కొంతమంది డబ్బుదేం ఉంది కుక్కను తంతే రాలుతుందనడం కద్దు. నిజానిజాలు పైవాడి కెరుక. పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు ఇవ్వాలన్నది మాత్రం ఖాయం. అందు వల్ల డబ్బులు రాలడం కోసం కుక్కలను తన్నే సాహసం చెయ్య వద్దని కథామంజరి విఙ్ఞప్తి చేస్తోంది.

సరే, కుక్కల ప్రస్తావన వచ్చిన మరో పద్యం చూడండి:

నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూర పంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.

కొంత మందికి అన్నింటి లోనూ దోషమే కనబడుతుందతి కానీ ఒక్క మంచీ కనబడదని దీని సారాంశం.

వేమన కూడా

అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డ వారి నెల్ల తొలగ గొట్టు
చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ

అని చెప్ప లేదూ ? !

శునక: పుచ్ఛమివ వ్యర్ధం లుబ్ధస్య పరి జీవనం
నహి గుహ్యా గోపాయచ, నచ దంశ నివారణే

అంటే, కుక్క తోక దాని సిగ్గును అది దాచు కోడానికీ, ఈగలను తోలుకోడానికీ కూడా పనికి రాదు. అలాగే లోభి వాడి ధనం కూడా ఎందుకూ పనికి రాదు. కుక్క తోక వంకర కదా

ఇదే భావాన్ని మా అన్నగారు పంతుల గోపాల కృష్ణరావు తన కందాలూ, మకరందాలూ లో ఆట వెలదుల అనుబంధంలో ఒక ఆట వెలది పద్యంలో ఇలా చెప్పేరు:

కుక్క తోక చూడ కటిలమై యుండును
దాని శీల మదిమె దాచ లేదు
తోల లేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె.

ఎంత ఇల్లాలయినా. వొసే పెద్దమ్మా, దరిద్ర గొట్టుదానా ! అని నర్మ గర్భంగా పిలిస్తే తెలివైన ఇల్లాలు ఊరుకుంటుందా ? అంతే దీటుగా నర్మ గర్భంగా తల వాచి నోయే లాగున బదులిస్తుంది.

ఆ వైనం చిత్తగించండి ...

పర్వతశ్రేష్ఠ నుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాముఅత్తను గన్న తల్లి
పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ,
సున్నమించుక తేగదే సుందరాంగి

సుష్ఠగా భోంచేసి తాంబూలం వేసుకోవాలనుకున్నాడు భర్త. పెట్టెలో అన్నీ ఉన్నాయి కానీ సున్నం లేదు. భార్యని ఇలా ముద్దుగా కేకేసి అడిగాడు
పర్వత నాజు పుత్రిక పార్వతీ దేవి. మె భర్త శివుడు. అతని విరోధి మన్మధుడు. అతని అన్న బ్రహ్మ. అతని భార్య సరస్వతి. ఆమె అత్త లక్ష్మి మెను కన్నతల్లి గంగ. ఆమె ముద్దుల బిడ్డ పెద్దమ్మ. ఒసే దరిద్రగొట్టు పెద్దమ్మా కాస్త సున్నం తేవే అని దీనర్ధం

ఆవిడ అంతే నర్మ గర్భంగా జవాబిస్తూ సున్నం తెచ్చి మగడికి అందించింది.

శతపత్రంబుల మిత్రుని
సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్
సతతముఁదాల్చెడు నాతని
సుతువాహన ! వైరి వైరి సున్నంబిదిగో !

శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు. అతని కుమారుడు కర్ణుడు. అతడిని చంపిన వాడు అర్జునుడు. వాని బావ శ్రీకృష్ణుడు,అతని కొడుకు మన్మధుడు. అతని మామ చంద్రుడు. అతనిని తలపై ధరించే వాడు శివుడు. అతని కొడుకు వినాయకుడు. అతని వాహనం ఎలుక. దానికి విరోధి పిల్లి. దానికి వైరి కుక్క ! ఒరే కుక్క వెధవా సున్నం ఇదిగోరా అని నర్మ గర్భంగా తిట్టి పోసిందా మహా ఇల్లాలు.

శునక పురాణం గురించి చెప్పేటప్పుడు అంతరిక్ష ప్రయాణం చేసొచ్చిన లైకా అనే కుక్క పిల్లను తలచుకోవడం ఎంత అవసరమో, మన పతంజలి గారి బొబ్బిలి అనే కుక్కని గురించి తలుచుకోక పోవడం చాలా దారుణం. దానంత దండగమారి కుక్క లోకంలో మరోటి ఉండబోదు. రాజుల లోగిళ్ళలో పడి తెగ మేసిన పనికిమాలిన కుక్క అది. రాజులతో వేట కెళ్ళి ఎన్ని దొంగ వేషాలు వెయ్యాలో అన్నీ వేసిన కుక్క అది. దాని వైభోగం, దాని బుద్ధికుశలత, దాని యవ్వారం వగైరాల గురించి తెలుసు కోవాలంటే పతంజలి గారి వీర బొబ్బిలి, గోపాత్రుడు చదవాల్పిందే మరి.

ఇక, చివరగా కుక్కల మీ ఉన్న సామెత లేమిటో కొంచెం చూదాం. చాలా ఉన్నాయి లెండి.

1.కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదుకదా
2.కుక్క అతి మూత్రం,బంధువైరం లేకుంటే గంటకు ఆమడ దూరం పోనా అందిట !

కనబడిన చోటెల్లా ఆగి, కాలెత్తి ఉచ్చ పోయడం కుక్కల అలవాటు. అలాగే దారంట కనబడిన ప్రతి కుక్కతోనూ జట్టీ పెట్టు కోవడం కూడా దాని అలవాటు. ( తానొచ్చిన దారి వాసన బట్టి గుర్తుంచు కోవడం కోసం అలా చేస్తుంది) కుక్కకున్న ఈ లక్షణాలను చూసి ఈ సామెత పుట్టింది.
3.కుక్క ఉట్టెలు తెంచ గలదు కాని కుండలు పగులకుండా ఆప గలదా ?
4.కుక్క గోవు కాదు. కుందేలు పులి కాదు.
5.కుక్క కాటుకి చెప్పు దెబ్బ
6.కుక్కకు ఏం తెలుసు మొక్క జొన్నప రుచి ?
7.కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు.
8.కుక్కకు కూడా కలసి వచ్చే కాలం ఉంటుంది.
9.కుక్కకు కూడు పెడితే కుండకు ముప్పు
10.కుక్కకు జరీ కుచ్చులు కట్టినట్టు
11.కుక్కలు చింపిన విస్తరిలా ఉంది కాపురం
12. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు
13.కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.
14.కుక్క బుద్ధి దాలికుంటలో ఉనేనంతసేపే
15.కుక్క కనబడితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క కనబడదు.
16. మొరగ నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందిట.

ఇవి కాక చివరగా ఓ ఏ సర్టిఫికేటు కుక్కల సామెత కూడా ఉంది.

16. కుక్క ఎక్క లేక కాదు చచ్చేది. పీక్కో లేక !

ఇక, కుక్క బతుకు, కుక్క చావు లాంటి జాతీయాలు మనకి తెలిసినవే.


అయ్యా, ఇదీ శునక పురాణం. చెప్పుకోవాలంటే ఇంకా చేంతాడంత ఉంది.

ఇక శలవ్.












22, అక్టోబర్ 2013, మంగళవారం

విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ


విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ ఇవాళ  ( 22.10.2013 ) అంగరంగ  వైభవంగా జరుగుతోంది. ప్రతి యేటా జారిగే ఈ జాతరకు రాష్ట్రం నలు మూలల నుండీ జనం అశేషంగా తరలి వస్తారు.

ఉత్తరాంధ్ర కల్ప వల్లి పైడి తల్లి






పైడి తల్లి అమ్మ వారి గుడి.. ఇది కోటకు సమీపంలో మూడు లాంతర్ల వద్ద ఉంది.



విజ యగరం కోట


ఇదే సిరిమాను. ఈ సిరిమాను అమ్మ వారి జాతర నాడు కోట నుండి అమ్మ వారి గుడి వరకూ ముమ్మారు తిరుగుతుంది, పూసపాటి రాజ వంశీయులు, ప్రజా ప్రతినిథులు, అధికారులు, అశేష ప్రజానీకం  ఈ సిరిమానునుని దర్శించు కోడానికి తహతహలాడుతారు.



విజయ నగరం గంట స్తంభం


సిరిమానోత్సవానికి చెందిన  వీడియో ( లోగడ తీసినది) చూడండి ....