6, జూన్ 2013, గురువారం

అలమండయినా ... అమలాపురం అయినా ... వాళ్ళంతే ! ... సెబాసో ..పతంజలీ !



కోనసీమలో 1996 లో పెద్ద గాలి ... వెర్రిగాలి వీచి లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూలి, రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయిన విషయం తెలుసు కదా ? అప్పటి వరకూ డబ్బుకు చింత లేకుండా హాయిగా గడిపిన వాళ్ళెందరో ఒక్క రోజులోకుదేలయి పోయేరు. అక్కడి వాళ్ళు అన్న పానాదులకు కూ డా విలవిలలాడి పోయేరు. ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల నుండి ఎందరో వారిని ఆదుకోడానికి వచ్చేరు..

ఆ రోజులలో నేను విజయ నగరం జిల్లా సాలూరు ప్రభుత్వ కళాశాలలో అనుబంధంగా ఉండే ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ఉండే వాడిని. మా సోదర ఉపాధ్యాయు లిద్దరితోనూ, మా సాలూరులో ఉన్న బాలికల పాఠశాలలో పని చేస్తున్న మరి ఒకరిద్దరు ఉపాధ్యాయులతొ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి మొత్తం ఆరుగురం అక్కడికి సహాయ కార్యక్రమాలలో మా వంతు సాయం చేయడానికి బయలు దేరాం.

ఊర్లో చందాలు వసూలు చేసి మొత్తం ఇరవై వేల వరకూ పోగు చేసాం. మూడు బస్తాల పాత బట్టలు సేకరించాం. సాలూరు R.T.C డిపో మేనేజరు గారు మాకు వెళ్ళి రావడానికి ఉచితంగా బస్ పాస్ ఇచ్చి తన వంతు సాయం చేసారు.

సేకరించిన డబ్బూ, బట్టల మూటలతో తే 24 -11 -1996 దీన అమలాపురం బయలు దేరాం. ఆరు గంటల ప్రయాణంతో అక్కడికి చేరాం. దిగుతూనే పెను గాలి బీభత్సం మిగిల్చిన విషాదం చూసాం. మేం భోజనాల కోసం వెళ్ళిన హొటల్ లో సీలింగ్ ఫేన్లన్నీ రెక్కలు జడలు అల్లి నట్టుగా మెలి తిరిగి పోయి ఉన్నాయి. కిటికీ, తలుపుల రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. వీధులన్నీ నానా బీభత్సంగానూ ఉన్నాయి.

మేం తెచ్చిన బట్టల మూటలు హొటల్ వారికి చూస్తూ ఉండమని అప్పగించి, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేం వచ్చిన పని చెప్పాం.

‘‘ మంచి దండీ ... రోజూ యిలా చాలా టీమ్ లు వస్తున్నాయి. వాళ్ళు తెచ్చిన బట్టలనూ, దుప్పట్లనూ మీద పడి జనాలు లాక్కు పోతున్నారు. అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు పాపం. ఒకప్పుడు నాకేమిటని బతికిన వాళ్ళు ... ఇప్పుడు తిండికీ గుడ్డకీ వాచి పోతున్నారు. మీరు ఈ మూటలని ఆటోలోనో, బస్ లోనే వేసుకుని వెళ్తారు ... మీరు పంచే లోపునే జనాలు కలియబడి పోయి ఎవరికి దొరికినవి వాళ్ళు తీసుకు పోతారు.. ఒక్కో సారయితే, ఎక్క డెక్కడి నుండో వారికి ఇద్దామని తెచ్చిన బట్టల మూటలని విధి లేక సక్రమంగా పంచే పరిస్థితి లేక మూటలు అక్కడే  విసిరేసి వెనక్కి వచ్చేస్తున్నారు.కొందరు ... ఎలా చేస్తారో ... జాగ్రత్త.

మరో విషయం లోతట్టు గ్రామాలకు ఎవరూ చేరు కోవడం లేదు. సహాయమంతా ఎంత సేపూ ఈ చుట్టు పట్ల గ్రామాల వారికే అందుతోంది.

ఎదుర్లంక లాంటి గ్రామాలకి అసలు సాయమే అందడం లేదు. అక్కడి వాళ్ళు లబోదిబో మంటున్నారు ...’’ అని ఎస్.ఐ చెప్పారు.

ఎలాగయినా ఆ ఎదుర్లంక గ్రామానికి చేరుకుని అక్కడి వారికే మేం తెచ్చిన సాయం అందించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం.



‘‘ సరే, అక్కడికి వెళ్ళగానే రాజు గారుంటారు ... వారిని కలుసుకుని మాట్లాడండి ... మీకు ఆయన సహకరిస్తారు ... ’’ అని చెప్పారు పోలీసు వారు.

ఎలా వెళ్ళాలో భోగట్టా చేసాం. అమలా పురానికి పెద్ద దూరమేం కాదు.

ఓ ప్రక్క అఖండ గోదావరి, ఓ ప్రక్క పొలాలూ .ఊళ్ళూ ఉండే సన్నని గట్టు మీద ప్రయాణం. ఎదురుగా వచ్చే వాహనాలకు దారివ్వడమే కష్టం.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోదారి పాలవుతాం. లేదా, ఇటు వేపు దొర్లి పడతాం. వాళ్ళకా దారంట ప్రయాణం అలవాటే. మాకు మాత్రం ఏక కాలంలో బీభత్స, అద్భుత, భయానక రసాలు అనుభవంలోకి వచ్చేయి.

బస్ లో ఎరుర్లంక చేరుకున్నాం. ఊరు చిన్నదే, కానీ అక్కడ నుండి గోదావరి నదిలో పంట్ మీద  యానాం చేరుకునే వీలుంది. ఇంకా  అక్కడ వంతెన రాని రోజులవి. మేం తెచ్చిన బట్టల మూటలకు మేమే గట్టి బందోబస్తుగా నిలిచేం.

ఇక పోలీసు వారు చెప్పిన రాజు గారిని కలవాలి. వారి సాయం తీసు కోవాలి. మేం సేకరించి తెచ్చిన బట్టలూ, డబ్బూ నిజమైన బాధితులకి చేరాలి. ఇదీ మా సంకల్పం,

రాజు గారి గురించి ఆరా తీసాం. అక్కడ పంచె. ధోవతి ధరించి, గుబురు మీసాలతో , కొన దేరిన ముక్కుతో కనిపించిన వ్యక్తిని చూసి రాజు గారి గురించి వాకబు చేయాలనుకున్నాం. పోలీసు వారు రాజు గారిని కలవమన్నారే కానీ, వారి పేరు చెప్ప లేదు. మేమూ అడగ లేదు. ఎంత తెలివి తక్కువ పని చేసామో తెలిసొచ్చింది.

‘‘ ఎవరండీ తమరు ? ’’ దర్పంగా అడిగేరతను.

‘‘ రాజు గారిని కలవాలండీ ’’ అన్నాం ఏక కంఠంతో.

ఆయన భళ్ళున నవ్వేరు,

‘‘ ఏ రాజు గారు కావాలండీ ? ఇక్కడ చాలా మంది రాజు లున్నారు. ఎలక్ట్రిక్ రాజున్నారు. వాటర్ రాజున్నారు. రోడ్ల రాజు గారున్నారు.గుడిసెల రాజున్నారు. బోయినాల రాజున్నారు. మందుల రాజున్నారు. క్రమశిక్షణ రాజున్నారు. రిపేర్ల రాజున్నారు . పంపిణీ రాజు గారున్నారు. ... ఇందరిలో మీకు ఏ రాజు గారు కావాలండీ ?... ’’ అనడిగేరు.

మేం తెల్లబోయి , నోట మాట రాకుండా ఉండి పోయేం.

ఏం చెప్పాలో తెలియక తలలు గోక్కున్నాం.

మా అవస్థకి జాలి పడి ఆయనే ఇలా వివరించేరు ...

‘‘ మరేం లేదు .. పెద్ద గాలికి  ఇక్కడి జనాల జీవితాలు ఎలా ఛిన్నా భిన్న మై పోయాయో కళ్ళారా చూస్తున్నారు కదా ? ఎక్క డెక్కడి నుండో వీళ్ళని ఆదుకోడానికి వస్తున్నారు. స్థానికంగా ఇక్కడి రాజులం మేం. మా వంతు సాయం అందించడం మాకు  విధాయకం కదా ? అందుకే రాజులందరం కలిసి మాకు మేమే రకరకాల కమీటీలు వేసుకుని వారం రోజుల నుండీ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నాం.

ఇక్కడి రోడ్లు ధ్వంస మయ్యాయి. అధికారుల చేత వాటిని యుద్ధ ప్రతిపదిక మీద బాగు చేయించే పనులను ఓ రాజు గారు తన బృందంతో పర్యవేక్షిస్తున్నారు. అంచేత ఆ రాజుగారు రోడ్ల రాజుగారన్నమాట ... అలాగే, తాగు నీటి అవసరాలు సత్వరం చూసే వాటర్ రాజుగారూ, పడి పోయిన ఎలక్ట్రిక్ స్తంభాలను నిలబెట్టించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులను చూసే ఎలక్ట్రిక్ రాజు గారూ, ఆకలితో హాహాకారాలు చేసే జనాలకి బోయినాల ఏర్పాట్లు చూసే బోయినాల రాజు గారూ, అల్లర్లు జరక్కుండా చూసే క్రమశిక్షణ రాజు గారూ ... చిన్నా చితకా రోగాలకు వైద్య సాయం అందేలా చూసే మందుల రాజు గారూ, పడిపోయిన పాకలను లేవనెత్తించే పనులు చూసే గుడిసెల రాజు గారూ ... ఇతర చిన్న చిన్న రిపేర్లను దగ్గరుండి చూసుకునే రిపేర్ల రాజుగారూ ... సహాయ కార్యక్రమాలను సజావుగా జరిగేలా చూసే పంపిణీ రాజు గారూ ... ఇలా ఇక్కడ రకరకాల రాజులున్నాం. మీకు కావలసిన రాజుగారెవరో చెప్పండి ...’’



ఇదంతా వింటూ ఉంటే, పతంజలి గారి రాజు గోరు నవలలో ఓ సన్నివేశం చప్పున గుర్తుకు రావడం లేదూ ? !

క్లుస్తంగా మరో సారి దాన్ని నెమరు వేసుకుందామా ?

కొత్త వలస సంత నాడు కనబడి. అత్త జబ్బుకి మందిస్తాను దివాణానికి వచ్చీ .. అని చెప్పిన రాజు గారిని వెతుక్కుంటూ వచ్చేడు కలగాడ చిన అప్పల నాయుడు.

తీరా వచ్చేక, ఆ మందు లిచ్చీ రాజు గారిని, తెల్లగా పొడుగ్గా ఉండే రాజు గారిని . ఎల్ల గుబ్బ గొడుగులా ఉండే రాజు గారిని, మీసాలుండే రాజు గారిని, మూరెడు ముక్కుండే రాజు గారిని అక్కడ పోల్చుకో లేక తికమక పడి పోతూ ఉంటాడు.

పల్చటి. తెల్లటి గ్లాస్కో జుబ్బా,నీరు కావి లుంగీ వేసుకుని.పావుకోళ్ళు తొడుక్కుని, వెడల్పాటి నుదురు మీద అగరు బొట్టు పెట్టుకుని చెవులకు ఎర్రపొళ్ళ తమ్మెట్లు కలిగి ఉన్న పెదప్పల రాజు కనిపిస్తే, నాయుడు ఇబ్బంది పడుతూ. తల గోక్కుని, ‘‘ రాజు గోరి ఇల్లెక్కడండీ ? ’’ అనడిగేడు.

అప్పుడు పెదప్పలరాజు హుక్కా గుడ గుడ పీల్చి, నవ్వుతూ ఇలా అన్నారు :

‘‘ సంతకి చీటి లచ్చికి గాజులు లాగుందోయి నీ ప్రశ్న. రాజు గారంటే ఏ రాజు గారు ?మా కుటుంబంలో గోపాల రాజు లున్నారు ...విజయ గోపాల రాజు లున్నారు ..వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...సన్యాసి వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...రంగ రాజు లున్నారు.పెద రాజు గారి చంటి బాబు గారి చిన రాజు లున్నారు ..చిన రాజు గారి తాత బాబు గారి చిట్టి రాజు లున్నారు ... పెద రాజు గారి పెద బాబుగారి పెద్ద అప్పల రాజంటే, నేను ... ఇందరు రాజుల్లో నీ కెవరు కావాలోయ్ నాయుడూ ! ’’

ఆ తర్వాత ఎలాగో వారి సాయం తోనూ. ఊరి పెద్దల సాయంతోనూ మేం తెచ్చిన బట్టలను కావలసిన వారికి అందించాం. ఇంటికో రెండు వేలు చొప్పున వారు సూచించిన బాధితులకు అందించే మనుకోండి ...


అదండీ సంగతి.

అలమండయినా, అమలా పురం అయినా రాజుల మాట తీరూ, ధోరణీ, , పెంకె తనాలూ .. అన్నీ ఒక్కలాగే ఉంటాయి కాబోలు ?

సెబాసో పతంజలీ ! .. భేష్ భేష్ ... ఏం రాసే వయ్యా దివాణాల జీవితాలని !

అందుకే నువ్వు వన్ అండ్ ఓన్లీ పతంజలివి !












26, మే 2013, ఆదివారం

మా తింగరి బుచ్చి తింగిరి ఉపన్యాసమ్ : : .‘‘ గొప్పవాళ్ళ అసంపూర్ణ రచనలు ...’’: :



ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.

ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు.

ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.

పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వెయ్య మంటారా అన్నయ్య గారూ ? ! ’’ అని మా ఆవిడ అడిగితే సిగ్గు , మొహమాటం వగైరా వగైరాలని తెగ అభినయిస్తూ, ‘‘ఒ క్ఖటి ... ఒక్కటంటే ఒఖ్ఖటి ... ’’ అని ఇదై పోయే వాడు. ( ఏదయి పోయే వాడని మీరు నన్ను నిలదీస్తే చెప్పడం కష్టం. )

అలాంటిది, కొంత పరిచయం పెరిగాక ( అంటే వాడే మాతో పెంచు కున్నాక, ) ‘‘ చెల్లాయ్ ! ఇవాళ టిఫి నేమిటో ? ’’ అని ఆరా తీసే స్థాయికి ఎదిగాడు. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి పోయి, తనకి ఏ టిఫిను కావాలో అడిగి ( హొటల్లో మాదిరి ) ఆర్డరు వేసి చేయించుకునే స్థాయికి చేరి సోయేడు.

నిజం చెప్పొద్దూ ?! మా తింగరి బుచ్చి గాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు, నేను వేరే ఎవరో పరాయి కొంపలో ఉన్నట్టుగా ఉంటుంది !

అంత చనువు సంపాదించేసాడు మాయింట్లో.

వాడి వాలకం నచ్చక మాఆవిడకు నచ్చ చెప్పబోతే, నా మాట వినడం మానేసింది. అందుకు వాడు వేసిన మంత్రం ఏమిటంటే, ‘మా చెల్లాయి చేతి వంట అమృతమే ! ’ అంటూ ఆమెను ఉబ్బేయడమే. అన్నీ అబద్ధాలే ... ఆకాడికి అమృతం వాడేదో రుచి చూసినట్టు అని లాజిక్కు వినిపించాను. ‘‘ ఊరుకోండి ! మీకంతా కుళ్ళు ... మీరు తప్ప నా చేతి వంట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చు కుంటారు ... మీరే ఎంపుళ్ళు పెడతారు ’’ అని మూతి మూడు వంకర్లుతిప్పింది. నాలో పురుషాహంకారం విజృంభించి, ‘‘ ఆకాడికి నీ చేతి వంటని లోకం లోని ప్రజానీకమంతా తిన్నట్టు ! బిల్ గేట్స్ తిన్నాడా ? బిల్ క్లింటన్ తిన్నాడా ?

అక్కినేని నాగేశ్వర రావు తిన్నాడా ? అమితాబ్ బచ్చన్ రుచి చూసాడా ?... ఘంటసాల తిన్నాడా ? పెంటగాన్ ప్రజలు చవి చూసేరా !... చైనా వాడు తిన్నాడా ? నానీ పాట్కర్ తిన్నాడా ! ...’’ అంటూ వర్లించేను. ఆ దెబ్బకి మా ఆవిడ వారం రోజులపాటు నాతో మాట్లాడడం మానీసింది. అప్పటి నుండి మా తింగరి బుచ్చి గాడొస్తే, వొళ్ళు మండి పోతున్నా సరే, ఓర్చుకుని మౌనంగా ఉండడం మొదలెట్టాను. కన్యా శుల్కంలో చెప్పినట్టు పేషెన్ప్ ఉంటే కానీ లోకంలో బతకలేం ! ( పూర్ రిచర్డ్ ఉవాచ. గిరీశం నోటంట)

సరే, అదలా ఉంచితే , తింగరి బుచ్చి గాడి బలహీనతా, బలమూ కూడా ఒక్కటే. ! అది ... వేదికను చూస్తే వెర్రెత్తి పోవడం ! మైకుని చూస్తే మైమరచి పోవడం ! ప్రజా సమూహాన్ని చూస్తే పరవశించి పోవడం !

ఎవరెంత వెనక్కి లాగినా కించ పడకుండా అనర్గళంగా ఉపన్యాసం దంచడం ...

చాలా సార్లు వాడిని జనాలు బలవంతంగా వాడి చేతి లోని మైకుని లాక్కుని, వేదికి మీద నుండి లాగి పడేసారు. దాని కతడు ఏమాత్రమూ అవమాన పడి నట్టు లేదు. పైగా, ‘ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బ లన్నట్టు ’ అనే ఉదాత్త మయిన ఉపమానంతోనూ. ‘ మొరిగే కుక్కకే కాలి దెబ్బ లన్నట్టూ ’ అనే నీచోపమానంతోనూ సమర్ధించు కునేవాడు.

‘‘ నువ్వు గిరీశానికి తక్కువా, గణపతికి ఎక్కువా నయ్యా ’ అన్నాను ఓసారి నేరక పోయి. దాని కతడు సంతోషించేడు. గిరీశం వంటి మహాను భావుడి సంగతి ప్రక్కన పెడితే గణపతితో సమానం చేసి మన్నించడం నాకు చాలా సంతోషంగా ఉంది కథా మంజరీ !’’ అని ఆనందాశ్రువులు రాల్చేడు. ముద్దొచ్చి నప్పుడల్లా వాడు నన్నలాగే సంబోధిస్తాడు. అప్పటికి గానీ నేనెంత తప్పు చేసానో నాకు స్ఫురించ లేదు. సాహితీ ప్రియుల మనోభావాలు ఎంతగా దెబ్బ తింటాయో కదా ! అని మనసు విలవిల లాడి పోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు ‘‘ అంతే కాదు ... నువ్వు జంఘాల శాస్త్రికి తక్కువా, జన్ని వలస కన్నయ్యకి ఎక్కువానోయీ !’’ అనేసాను. ఈ సారి కూడా వాడు అమందానంద కందళిత హృదయారవిందు డయ్యేడు ....‘‘‘

‘‘ఎంత మాట !

జంఘాల శాస్త్రి గారితోనా పోలిక ! .. అపరాధం ! కానీ, ఆ జన్ని వలస కన్నయ్యగా రెవరోయీ ’’ అన్నాడు తన్మయంగా ... వీడికి వాడి గురించి తెలియక పోవడం నా అదృష్టం.

( వాడో పిచ్చోడు . తనలో తనే ఎప్పుడూ ఏదో వదరుతూ తిరుగుతూ ఉంటాడనే సత్యం నేను తింగరి బుచ్చికి చెప్ప దల్చుకోలేదు. )

అయిందా ?
అలాంటి తింగరి బుచ్చి అనే శాల్తీ నా ప్రారబ్ధం కొద్దీ ఈ ఉదయం మా ఇంటికి ఊడి పడి ... ‘‘ బావా ! ఎలాగయినా నువ్వో అసంపూర్ణ రచన ఒకటి వేగిరం రాసి పడెయ్యాలి !’’ అని భీష్మించుకు కూర్చున్నాడు. నేను అవాక్కయ్యాను. ( కొందరు కొన్ని విపత్కర పరిస్థితులందు ఇట్లు అవాక్కగు చుందురు కదా )

‘‘ అసంపూర్ణ రచనలంటూ ఎవరూ చెయ్యరోయి ! వివిధ కారణాల చేత వారి రచనలలో ఒకటో రెండో అలా అసంపూర్ణంగా మిగిలి పోతూ ఉంటాయంతే ...’’ అని ఙ్ఞాన బోధ చేయ బోయాను.

వాడు నవ్వి, ‘‘ నువ్వెంత అమాయకుడివి బావా ! అవి నిజంగా అసంపూర్ణ రచనలనుకుంటున్నావా ? కాదు ... కాదు ... కమ్మన్నా కాదు ! కొందరు ప్రముఖ రచయితలు మొదట్లో ఎడా పెడా రచనలు చేసి పారేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించీసుకుని, వాటిని కలకాలం పదిలంగా నిలబెట్టు కోవడం కోసం ఓ అసమగ్ర రచన రాసి పారేసి, లోకం మీద పడేస్తారు. కావాలనే ఆ రచనను అసంపూర్ణంగా రచిస్తారు. ఆ లోగుట్టు తెలీక మనం వెర్రి వెంగళప్పల్లాగా, ఫలానా ప్రముఖ రచయిత గారి అసంపూర్ణ రచన యిదీ ! అంటూ లొట్ట లేసుకుంటూ పదే పదే చదువుతాం! తెలుసా !అసలు కంటే కొసరు ముద్దనీ ... ఈ అసంపూర్ణ రచనలే వారు ముందు సంపాయించుకున్న కీర్తి ప్రతిష్ఠలను కలకాలం నిలబెడతాయ్ ఆ రహస్యం తెలియక నీబోటి వాళ్ళు ఆహా, ఓహో ! అంటూ వాటిని చదువుకుంటూ ఊఁ ... ఇదై పోతూ ఉంటారు ! ’’ అని తేల్చేసాడు.

‘‘ గోపీ చంద్ యమపాశం, రావి శాస్త్రి రత్తాలూ రాంబాబూ. అంతెందుకూ, మన అలమండ గాంధీ బాబు, అదే మన పతంజలి రాజుల లోగిళ్ళూ అలా రాసిన అసంపూర్ణ రచనలే ! కాక పోతే వాళ్ళు వాటిని పూర్తి చెయ్ లేకనా ! ’’ అని తీర్మానించీసేడు.

నా నోట్లో తడారి పోయింది. నిలువు గుడ్లేసుకుని ఉండి పోయేను.

ఈ తింగరోడి మాటలకి బదులు చెప్పే సాహసం చెయ్య లేను కదా !



’‘‘ అంతెందుకూ, నీకో పరమ రహస్యం యెబుతాను విను ! అసలు ఆనాడు నన్నయ్యగారూ. పోతన గారూ కూడా ఈ ట్రిక్కు ఉపయోగించే అసంపూర్ణ రచనలు చేసి వదిలారు తెలుసా ? ’’

ఈ వదరుబోతు మాటలకి నా జవజీవాలూ కృశించి పోయేలా ఉన్నాయి.

నా పరిస్థితిని పట్టించు కోకుండా తింగరి బుచ్చి తన ఉపన్యాసం కొనసాగించేడు.

ఆ విధంబెట్టి దనిన ...

‘‘ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతా మణితోనే అఖండ మయిన కీర్తి ప్రతిష్ఠలను మూట కట్టుకుని కూడా దానిని పదిలంగా నిలుపు కోవడం కోసం భారతం అనే అసంపూర్ణ రచన చేసాడు. రెండో, రెండున్నర పర్వాలో రాసి ఊరు కున్నాడు. అలాగే పోతన గారు కూడా ముందుగా రాసిన భోగినీ దండకంతోనే కీర్తి కాంతను స్వంతం చేసుకుని దానిని నిలుపు కోవడం కోసం భాగవతం అనే అసంపూర్ణ రచన చేసాడు ! అయితే, వారి రచనలకు మూల రచనలంటూ ఉండబట్టి ఆతర్వాత భారతాన్ని తిక్కన, ఎర్రనలూ. భాగవతాన్ని పోతన గారి కుమార రత్నమూ, శిష్య రత్నమూ పూర్తి చేసి పారేసారు ! ఆ విధంగా అసపూర్ణ రచనలుగా ఉంచేద్దామనుకున్న వారి ఆశలు కల్ల లయ్యాయి, ఆ విషయం బతికుండగా వారికి తెలియ దనుకో ... గతించేక తెలిసే అవకాశం ఎలానూ లేదు ! ...

అసంపూర్ణ రచనల వల్లనే కిర్తి ప్రతిష్ఠలు చిరకాలం ఎలా నిబెడతాయని నీ సందేహం. అవునా ? !

చెబుతా విను ! ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ... విను ...

’’ అని గుక్క తీసు కోడానికి కాస్సేపు ఆగేడు.

ఆసరికి చేతిలో అట్లకాడతో సహా మా ఆవిడ బిగ్గరగా సాగుతున్న వాడి ఉసన్యాస ధోరణికి ముగ్ధురాలై యాంత్రికంగా నడుచుకుంటూ అక్కడకి వచ్చి నిలుచుంది.

వాడు తిరిగి తింగర్యోపన్యాసం మొదలెట్టాడు :

‘‘ నువ్వంతకు ముందెన్నడూ చూడని ఓ ఊరికి వెళ్ళా వనుకో ... అక్కడ అంద మయిన ఓ పదో ఇరవయ్యో ఇళ్ళ వరస కనిపించి. సంతోష పడతావు. ఆ భవన నిర్మాణ కౌశలాన్ని మెచ్చు కుంటావు. సరే వాటి మధ్య ఖర్మ కాలి ఓ అసంపూర్ణ కట్టడం కనిపించిందనుకో. నివ్వెర పోతావు. అయ్యో అనుకుంటావు. సరే, మళ్ళీ ఆఊరెళ్ళే పని నీకు పడక పోయినా ... తర్వాతి రోజులలో ఎప్పటికీ నీకా ఊరు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ముందుగా ఆ అసంపూర్ణ కట్టడమే మదిలో మెదులుతూ ఉంటుంది. ఇందులో గొప్ప సైకాలజీ ఉంది. దానికి జర్మన్ లోనో, లాటిన్ లోనో, అధవా ఇంగ్లీషులోనో బారెడు పేరొకటి ఉండే ఉంటుంది. మనకికంకా తెలీదనుకో ! ఙ్ఞానం అసంపూర్ణంగా ఉండడం కూడా మనకి ఓ చక్కని అలంకారమే అనుకో ! ...

అసంపూర్ణ రచనలు చేసి లోకం మీద వదిలేసిన మహా రచయితలంతా ఈ సైకలాజికల్ పాయింట్ మాబాగా పట్టు కొన్నారు.

అందుచేతనే, గొప్ప వాళ్ళంతా అధమ పక్షం ఒకటయినా అసంపూర్ణ రచన చేస్తున్నారు. చెయ్యాలి కూడా. మరంచేత, నువ్వూ వెంఠనే ఓ అసంపూర్ణ రచన రాయాలి బావా ! ’’ అని ముగించాడు. ఆ వాగ్ధోరణికి మా ఆవిడ పరవశించి పోయి చప్పట్టు కొట్టింది. దాంతో రెచ్చి పోయి తింగరి బుచ్చి మరి కొంత సేపు  ఇలా ప్రసంగించాడు :

‘‘ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి రోజూ రుచి కరమైన వంటలు చేసి పెడుతున్నా, ఖర్మ కాలి ఓ రోజు ఉడకని అన్నమో, ఉడికీ ఉడకని కూరో చేసి, ఆ అసంపూర్ణ వంటకాన్ని మన ముఖాన తగ లేసారనుకో ! అదే మనకు చిరకాలం గుర్తుండి పోతుంది !

అసలా బ్రహ్మ దేవుడు కూడా కొన్ని అసంపూర్ణ రచనలు చెయ్య బట్టే, లోకంలో అర్ధాంతర చావులూ ... అల్పాయుష్క మరణాలూ సంభవిస్తున్నాయి. అందరికీ నూరేళ్ళే నుదుటన రచిస్తే, ఇక ఆ వెర్రి బ్రహ్మని తలుచు కునే దెవరు చెప్పు ? ...’’ అని ముగించాడు.
అప్పటికి నా ప్రాణాలు కడతేర్చుకు పోతున్నాయి.

సిగపాయ తీసి తందును కదా ! అనిపించింది కానీ మనకంత ధైర్యమేదీ ?!

అదీ కాక మా అమాయకపు శ్రీమతి వాళ్ళ అన్న గారి దివ్యమైన సలహాకి పొంగి పోయి : ‘‘ అవునండీ ... మీరు కూడా ఓ అసంపూర్ణ రచన చేద్దురూ ! ’’ అని ముందు గోముగానూ , తర్వాత శాసిస్తూనూ నిలదీసేప్రమాదం ఎలానూ పొంచి ఉంది. హతోస్మి !
ఇంతలో ... ... మా ఆవిడకు తటాలున  ఏదో గుర్తుకొచ్చి. కెవ్వున అరచినంత పని చేసి చేతిలో అట్లకాడతో వంటింట్లోకి పరిగెత్తింది.

వెనుక మేమూ గాభరాగా పరిగెత్తాం.
అక్కడ ... ... పెనం మీద ఆవిడ రచించిన ఓ అసంపూర్ణ రచన --- మాడి పోయిన అట్టు రూపంలో పొగలు కక్కుతోంది. ! 



తింగరి ఉపన్యాసమ్  ప్రస్తుతానికి సమాప్తమ్.

ఇట్లు విధేయుడు,

ఖర్మకాలిన కథామంజరి బ్లాగరు, మరియు తింగరి బుచ్చి గాడి బాధితుడు .






























































21, మే 2013, మంగళవారం

నీ మతం మండా ... పతంజలి కవిత ...




నీ మతం మండా 



కత్తి పెట్టి దేవుడ్ని

ఒక పోటు పొడిస్తే గానీ

పొడిచి, వాడి నెత్తురు

కళ్ళారా చూస్తే గానీ

నీ మతం నిలబడదు

నీ మొగం మండా

నీ మతం మండా

అప్పటిగ్గానీ నీ మతం నిలబడదు

నీ కాళ్ళు లేని మతం

నీ కళ్ళు లేని మతం

ముక్కూ మొగమూ లేని నీ

కదల్లేని మతం

( నీ పొగ మూజూడా)

అసియ్యకరమైన

నీ మతం ప్రాకటానికి

భగవంతుడి కళేబరం కావాలి

అది బలిసి పుర్రెల పూలు పూయడానికి

నరమాంసపు టెరువు కావాలి

ఛీ !

నువ్వూ నీ మతమూ

నీ మతమూ నువ్వూనూ

ఛీ ! ఛీ !

25, ఏప్రిల్ 2013, గురువారం

కథా మంజరి బ్లాగు పేరు త్వరలో మార బోతోందా ?! ....



బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి  ప్రావీణ్యం  అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! అది విషయాంతరం.

‘‘నువ్వెప్పు డొచ్చావు ? ’’ అన్నాను ఆశ్చర్యంగా,

‘‘నువ్వు రాయడం మొదలు పెట్టడం నేను రావడం ఒకే సారి జరిగేయి . అంతా చదివేసాను.’’

‘‘ఎలా ఉంది ? ’’ అడిగేను, మానవ సహజమయిన చాపల్యంతోనూ, కుతూహలంతోనూ, ఇంకా చెప్పాలంటే కుతి తోనూ.

చాక్లెట్ చప్పరించీసి నట్టు చప్పరించీసేడు.

గాలంతా తీసీసేడు. ఇంతకీ ఈ వచ్చిందెవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? గుర్తు లేదూ ?! మా తింగరి బుచ్చి గాడు. వాడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే ఇక్కడ నొక్కి చదవండి ,,,

సరే , ప్రస్తుతానికి వద్దాం. ..

‘‘ఐతే ఏమీ బాగు లేదంటావ్ ? ’’ అన్నాను నీరసంగా.

‘‘బాగుండడం, బావు లేక పోవడం నీ చేతిలో లేదు. అందుకే మార్చెయ్ ! వెంటనే మార్చెయ్ ! ’’ అన్నాడు.

‘‘ ఏమిటి మార్చేది ? నీ తలకాయ్ ’’

‘‘ మార్చ వలసి వస్తే అదీ మార్చాలి. ముందు నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు ధృఢంగా.

‘‘ ఎందుకూ ? ’’ అన్నాను కోపంగా.

‘‘ న్యూమరాలజీ ప్రకారం. కథా మంజరి పేరులో అక్షరాలు సరిగా లేవు. కొంచెం మార్చాలి. అందుకే సరైన టపాలు పెట్ట లేక పోతున్నావు. ఆ పెట్టిన వాటిని కూడా ఎవరూ చదవడం లేదు. కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ కామెంట్ లు పెట్టడం లేదు ... అవునా ? ’’అడిగాడు.

నా ఇగో మీద వాడలా దెబ్బ తీసాక, కొంచెం నీరసం వచ్చి, ‘‘ అయితే ఇప్పుడేం చేయాలంటావ్ ’’ అనడిగేను.

‘‘వెంఠనే మార్చెయ్ ! కథా మంజరి పేరు మార్చెయ్ ! ‘‘

‘‘ మార్చడం ఎందుకూ ? ’’

‘‘ ఎందుకంటే, న్యూమరాలజీ ప్రకారం నీ కథా మంజరి బ్లాగు పేరు ఏమీ బాగా లేదు. అందుకే నీ దశ అలా తగలడింది. అందుకే దాని పేరు నేను చెప్పి నట్టుగా మార్చి పారెయ్. అప్పుడు చూసుకో ! నీ బ్లాగు దశ వెలుగుతుందీ ... హిట్టులే హిట్టులు ! కామెంట్ లే కామెంటులు ! వాటిని ప్రచురించ లేక నీ చేతి వేళ్ళు నొప్పి పుడతాయనుకో ! ఒక్క రోజు కొత్త టపా వెయ్యక పోయినా మొత్తం తెలుగు బ్లాగు ప్రియులందరూ నీమీదకి దండెత్తి వచ్చే ప్రమాదమూ ఉంది ! అందు చేత వెంటనే నేను సూచించే విధంగా నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు.

‘‘ ... .. ...’

‘‘ అప్పుడిక తెలుగు బ్లాగర్లు నీ ధాటికి తట్టుకో లేక బ్లాగులు రాయడం మానుకుంటారు. బ్లాగు లోకంలో నువ్వొక్కడివే మహా రాజులా వెలిగి పోతావ్ ’’

‘‘ బ్లాగులే లేక పోతే ఇక సంకలిను లెందుకూ వాళ్ళూ మూసేస్తారు కాబోలు’’

‘‘ హ్హ ! హ్హ! హ్హ! ... అంచేత, నేను చెప్పినట్టు చెయ్. ముందో కాగితమూ పెన్నూ తీసుకుని కథా మంజరి అని ఇంగ్లీషులో రాయ్ ...’’

ప్రయత్నించి చూస్తే పోలా ? అనే బలహీనత ఆవరించి కలం కాగితం తెచ్చు కున్నాను. వాడు చెప్పి నట్టుగా రాసేను.

Katha manjari

‘‘ బావుంది. ఇప్పుడు ఆ పేరులో నేను చెప్పిన ఇంగ్లీషు అక్షరాలు చేర్చు. నేను తీసెయ్య మన్నవి తీసెయ్ ...‘‘ అంటూ నా బ్లాగు పేరుకి శస్త్ర చికిత్స మొదలెట్టాడు.

ఇంగ్లీషు పేరులో వాడు చెప్పిన చోటల్లా కొత్త అక్షరాలు ఉంచేను. పాత అక్షరాలు కొన్ని తొలగించేను.

‘‘ ఇప్పుడీ ఇంగ్లీషు పేరుని తెలుగులో ఎలా ఉచ్చరిస్తావో ఒక్క సారి చదువు ’’ అని ఆదేశించాడు

కూడ బలుక్కుని చదివాను తెలుగు పేరు.

‘‘ ఖ్ఖదా మంఝరి ’’ ... అని తయారయింది.

‘‘ వెరీ గుడ్ ! ఇక నుండీ నీ బ్లాగు పేరు ఇదే ! ఇక చూస్తో ! నీకింక తిరుగు లేదు .. ... ...అన్నట్టు ...’’

‘‘ ఇంకా ఏఁవిటి ; ’’ అడిగేను నీళ్ళు నములుతూ ...

అబ్బే, చిన్న విషయమే ... ఈ కంప్యూటర్ ఉంచిన చోటు కూడా వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. అంచేత ఈ గోడ కొట్టించీసి, కంప్యూటర్ని ఆ మూలకి ఉండేలా  పెట్టుకో ! అప్పుడింక నీ ‘‘ ఖ్ఖదా మంఝరి ’’ వెలిగి పోతుందీ ...’’

నా కళ్ళు బైర్లు కమ్ము కొస్తున్నాయి. నేనేదో అనబోయే లోగా ...

‘‘ చెల్లెమ్మా ! పెసరట్టు రెడీయేనా ?!’’ అనరిచేడు వంట గది వేపు తొంగి చూస్తూ.

లోపలి నుంచి వాడి ప్రసంగ మంతా వింటున్నట్టే ఉంది ... ‘‘ఆఁ ! వచ్చె ... వచ్చె ... ఒక్క నిముషం అన్నయ్య గారూ ! ’’ అంటూ వినిపించింది మా ఆవిడ గొంతు.

అనతి కాలంలో తన భర్త ప్రపంచ ప్రఖ్యాత ఏకైక తెలుగు బ్లాగరు కాబోతున్నాడని ఏవేవో ఊహించు కుంటూ కలలు కంటోందేమో , ఖర్మ !నా  వెర్రి బాగుల శ్రీమతి

( సంఖ్యా శాస్త్రం పేరుతో మూఢనమ్మకాల విషాన్ని జన బాహుళ్యం లోకి వెద జల్లుతున్న ఓ తెలుగు ఛానెల్ వారికి స ‘ భక్తి ’ కంగా ఈ టపా అంకితమ్. )




19, ఏప్రిల్ 2013, శుక్రవారం

జానెడు మీసం ... బారెడు బ్లాగు టపా !





‘ మీసము పస మగ మూతికి ’ అని చెప్పారు పెద్దలు, మగాడికి మీసమే అందం, అది పౌరుష చిహ్నం కూడానూ. . మీసాలూ, గడ్డాలూ ఒక వర్గానికి చెందినవే. కాస్త రూప భేదం కానీ, వేరు కాదు, అయితే గడ్డాలు శాంతికీ, వైరాగ్యానికీ, సాత్విక గుణానికీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మీసాలు లేని రాజులనూ, వాటితో పాటూ గడ్డాలూ లేని ఋషులనూ ఊహించు కోలేం ! గడ్డం సాత్విక గుణ ప్రతీక అయితే, మీసం తామస గుణ ప్రతీకగానూ చెప్పు కోవచ్చును, హీరోలకి అందమైన మీస కట్టు ఉంటే, విలన్లకి కోర మీసాలు ఉండడం మనకి తెలిసినదే.
మీసాలలో చాలా రకాలు ఉన్నాయి.



 వెనుకటి రోజులలో ఫ్రెంచ్ కట్ మీసం అంటే గొప్ప క్రేజ్ ఉండేది. ఉత్తరాది సినిమా హీరోలకి మీసాలుండవు. ఎంచేతో ? ఇక మీసాలలో కోర మీసం, గుబురు మీసం, గండు మీసం, కత్తి మీసం, ... లాంటివి . చైనా వాడి మీసం కిందకి వేలాడుతూ భలే ఉంటుంది !

మీసాలు మెలేయడం మగ మహారాజల లక్షణం. దానితో పాటూ తొడ చరచడం కూడానూ. ఒక్కో సారి మీసం మెలేసి, జబ్బలు చరచు కోవడం కూడా ఉంటుంది. మీసాలు మెలేయడాన్నీ, తొడలు చరచు కోవడాన్నీ ఒక కళగా అభివృద్ధి పరచిన వాళ్ళూ ఉన్నారు. ఇంకా వివరాలు కావాలంటే బాలయ్య బాబుని సంప్రదించండి.

మన తరం రాజకీయ నాయకుల్లో గుబురు మీసాలున్న రాజకీయ వేత్త ఎవరూ అనడిగితే తడుము కోకుండా అంతా ఒకే పేరు చెబుతారు.బుర్ర మీసముల వాడు, చిరు నవ్వుల రేడు మన కనుమూరి బాపిరాజు గారు. !
ఇక ఈ మీసాల ప్రస్తావన వచ్చిన సందర్భాలను గురించి చూదాం !ముచ్చట పడి హిమాలయాలకు వెళ్ళిన ప్రవరుడు దారి తప్పాడు. వరూధుని చూసి మరలు కొంది. తన పొందు స్వీకరించ మని పరి సరి విథాల అడిగింది.

కొత్త కొత్త ధర్మపన్నాలు వల్లించింది. అల్లసాని పెద్దన మను చరిత్రలో – కానీ,
ప్రవరుడు కాదు పొమ్మన్నాడు. ఇలాంటి పాండిత్యం నీకు తప్ప మరెవ్వరికీ ఎక్కడా చూడ లేదని వెక్కిరించేడు.కామ శాస్త్ర ఉపాధ్యాయురాలి లాగా చెబుతున్నావు. ఫో! అని కసిరాడు. ఇలాంటి తుచ్ఛ మైన సుఖాల గురించి నాకు చెప్పకు ! ఇవన్నీ మీసాల మీద తేనియలు అంటూ చీదరించు కున్నాడు. ‘‘ చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాల పై తేనియల్ !’’
ఇక శ్రీనాథ కవి నూనూగు మీసాల నూత్న యవ్వనము వేళ శాలివాహన సప్త శతి రాసానని కంఠోక్తిగా చెప్పు కున్నాడు కదా !

అయితే అడిగిన దానం ఇవ్వాలి. లేదా ఎవరి చేత నయినా ఇప్పించాలి. అలా కాని వాడికి మీసం ఎందుకూ ! అని తిట్టి పోసేడు కుంద వరపు కవి చౌడప్ప. చూడండి:

ఇయ్యా యిప్పించ గల
అయ్యలకే కాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా బారెడు !
కయ్యానకు కుంద వరపు కవి చౌడప్పా !

తిరుపతి వేంకట కవులలో తిరుపతి శాస్త్రి గారికి మీసం ఉండేది కాదు కానీ, చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి గారు మాత్రం గుబురు మీసాలు పెంచే వారు ! ఆ మీసాల విషయమై పండితులకిది తగునా అని రచ్చ రచ్చ అయిందిట ఓసారి. అప్పుడు తిరుపతి కవులు ఈ పద్యం చెప్పారు. :


దోస మటంచెఱింగియును దుందుడు కొప్పఁగ బెంచి నార మీ
మీసము – ‘‘రెండు భాషలకు మేమె కవీంద్రుల మంచుఁ దెల్పఁగా
దోసము గల్గినన్ గవి వరేణ్యులు మముం గెల్వుఁడు, గెల్తురేని యీ
మీసముఁదీసి మీ పద సమీపములన్ దలలుంచి మ్రొక్కమే !
అదీ. థిషణ అంటే !

రాయని భాస్కరుడి మీద చెప్పిన పద్యాలలో ఈ మీసం గురించి ఒక చోట ...తిట్ల వర్షం కురిపించేడు కవి ! చూడండి:


వగ కల్గి యర్ధి కీయని
మొగ ముండల కేల మొలిచె మూతిని మీసల్
తెగ గొఱుగుడాయె మంగల
రగడొందఁగ కీర్తి కాంత రాయని బాచా !

ఇక, నాటకాల వాళ్ళకి గడ్డాలూ మీసాలూ ఉంటే ఒక్కో సారి కొన్ని చిక్కులు తటస్థ పడుతూ ఉంటాయండీ.

పాత్ర పరంగా వాటిని తీసేయక తీరదు. వెనుకటి రోజులలో స్త్రీ పాత్రలు ధరించే నటు లయితే మాత్రం తప్పకుండా ఆ మీసాలని తీసెయ్యాల్సి వచ్చేది.
మన నటసార్వ భౌమ నందమూరి తారక రామారావు గారు విజయ వాడలో కాలేజీలో చదివే రాజులలో బాల నాగమ్మ నాటకంలో నాగమ్మగా మీసాలు తీయకుండానే నటించేరుట ! దర్శకులు విశ్వనాథ సత్య నారాయణ. మీసాలు తియ్యాలయ్యా అంటే ఠాఠ్ ! శ్రమపడి అందంగా పెంచు కున్న మీసాలు తీసేది లేదని రామారావు పొమ్మన్నారుట. దాంతో మీసాలతోనే నాగమ్మగా నటించారు, అప్పటి నుండీ ‘‘ మీసాల నాగమ్మ ’’ అనే మాట చరిత్రలో నిలిచి పోయింది.

గుబురు మీసాల వల్ల మనం అవతలి వారిని చూసి నవ్వు తున్నామో, వెక్కిరిస్తున్నామో తెలియదు. ఇదో అదనపు ప్రయోజనం !

ఇక మీసాల వల్ల లబ్ధి పొందే వ్యక్తుల భేషజాలు ఎలా ఉంటాయంటే ...
ఇంట్లో పచ్చడి మెతుకులు కతికి, పంచభక్ష్య పరమాన్నాలూ తిన్నట్టుగా, చివరాఖరిలో మీసానికి కొంచెం పెరుగు పిసరు పూసుకుని మీసం దులుపు కుంటూ వీథి లోకి వస్తారు ! వాళ్ళకి అదో తుత్తి !

ఇక, మీకు గుర్తుందా ? వెనుకటి రోజుల్లో తెలుగు సినిమాలలో హీరోలు మీసం, చిరు గడ్డం పెట్టు కుంటే ఇట్టే పోల్చు కోలేని విధంగా మారి పోయే వారు ! ప్రేక్షకులు తప్ప తోటి పాత్రధారు లెవ్వరూ గుర్తు పట్ట లేక పోయే వారు తెలుసా ! ఏమాశ్చర్యము !

పత్రికల్లో ఆడ బొమ్మలకి మీసాలు దిద్దే సరదా ప్రియులూ ఉంటారు. ఈ మనస్త్తత్వానికి మానసిక వైద్య శా స్త్రంలో

నోరు తిరగని పేద్ధ పేరేదో ఉండే ఉంటుంది !

మీసాల పేరుతో ఒక ఊరు కూడా ఉందండోయ్ ! విజయ నగరం జిల్లా గుర్ల మండలంలో మీసాల పేట అనే ఊరు ఉంది !

మన దేవుళ్ళలో ఒక్క యముడికి తప్ప, తక్కిన వారెవ్వరికీ మీసాలు ఉండవు
‘‘శ్రీకృష్ణుడికి మీసా లుండెడివా ?! ’’ అని ఆరుద్రాదులు ఒకప్పుడు రచ్చ బండ నిర్వహించారు !

లేకేం !

మీసాల కృష్ణుడు మన రాష్ట్రం లోనే ఉన్నాడండీ బాబూ !
మెదక్ జిల్లా దుబ్బాక మండలం లో చెల్లా పూర్ రాజ వేణు గోపాలుడు మీసాల కృష్ణుడే !
ఈ మీసాల కృష్ణుడి గురించి ఒక కథ కూడా చెబుతారు.

దొరల కాలంలో దుబ్బాక ప్రాంతాన్ని ఒక దొర తెగ పీడించే వాడుట. ఇలా కాదని గ్రామస్థులు ఊరిలో ఒక దేవాలయం కట్టేరుట. దొర గారికి దైవ భక్తి జాస్తి. కనీసం ఆ దేవుడిని చూసయినా దొర కొంత తగ్గుతాడని ఊరి వారి ఆలోచనట ! గుడి కట్టడానికి దొర కూడా యథోచితంగా తన వంతు విరాళం కూడా ఇచ్చేడుట !

సరే ... గుడి కట్టడం పూర్తయింది. ఇక విగ్రహ ప్రతిష్ఠే తరవాయి. ఎక్కడా దేవుడి విగ్రహాలు దొరక లేదుట. దాంతో ఆఊరి ప్రజలు ప్రక్క ఊరి లో ఉన్న గుడి నుండి వేణు గాపాలుని విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా ఎత్తుకొచ్చి, తమ ఊరి చెఱువులో కొంత కాలం దాచి ఉంచారుట. అందుకే అక్కడ ఇప్పటికీ కృష్ణమ్మ చెఱువు అనే పేరుతో ఓ చెఱువు ఉంది.
సరే కొన్నాళ్ళు గడిచేక తాము ఎత్తుకు వచ్చిన వేణు గోపాలుని విగ్రహానికి మీసాలు పెట్టి, నెమలి పింఛంతో పాటు కిరీటం ఉంచి, విగ్రహ ప్రతిష్ఘ కావించేరుట.
దాంతో విగ్రహం సొంత ఊరి దార్లు ‘‘ ఈ మీసాల కృష్ణుడు మన ఊరి వాడు కాదు ! ’’ అనుకొని వెళ్ళి పోయేరుట !

ఇక, మీసాల గురించిన సామెతలూ, జాతీయాలూ కొన్ని చూదాం :
1.మీసం మూరెడు ... రోషం బారెడు
2.మీసాలకు సంపెంగ నూనె
3.మీసం పస మగ మూతికి
4.మీసాల పసే గాని, కోస నా బట్ట !
5.మీసాలు పడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటాయా ?
6 మీసాలెందుకు రాలేదురా ! అంటే, మేనత్త చీలిక అనీ. గడ్డం వచ్చిందేమిరా అంటే మేన మామ పోలిక అన్నాట్ట
7. పులి మీసాలు పట్టుకొని స్వారీ చేయడం మంచిది కాదు

8.తీస్తే పోతుంది . తెల్లారితే వస్తుంది ! ఏమిటది ! పొడుపు కథ : జవాబు : మీసం !

మీసాల మీద శ్రీశ్రీ ఓ సినిమా కోసం రాసిన పద్యం చూడండి: ఇది మీసం మీద సీసం !

మృగరాజు జూలునే తెగనాడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమ కారు మబ్బుల బారు సేరునేలెడి తీరు
కోర మీసము పొందు కోరుకొందు
ల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు

తే. ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష

తిక్కన గారి మహా భారతంలో ధర్మరాజుని వర్ణిస్తూ ద్రౌపది చెప్పిన ఎవ్వని వాకిట అనే పద్యానికి పేరడీగా తెలుగు లెస్స అనే బ్లాగులో ఈ సరదా పద్యం కూడా మరో సారి చక్కగా చదువు కోండి !

సీ” ఎవ్వాని మీసము ఏపుగా పెరుగునో
ఊడలా మూతికి సొగసు కూర్ప
ఎవ్వాని మీసము ఎదుగునో రొయ్యలా
బారుగా పౌరుషం పరిఢ విల్ల
ఎవ్వాని మీసము మేఘ సంకాశమై
కన్పట్టు చూపరల్ భయము నంద
ఎవ్వాని మీసము నిమ్మలకాధార
మైభువి ని మిగుల అలరు చుండు

తే.గీ అట్టి సొగసైన గుబురైన నల్లనైన
మామ మీసాలు అవనికి వాసములుగ
అలరు చుండ జనులు భయమంద నేల
మామ మీసాలు మీకుండ అండ దండ
సరే, చివరిగా ... పులి, పిల్లి వంటి జంతువులకి మాత్రమే కాదు, కొన్ని పక్షులకు కూడా మీసాలుంటాయి ! చిలీ లో ఇలాంటి మీసాల పక్షులు కనిపిస్తూ ఉంటాయిట ! ( వీటి ఫొటోలు అందించిన బ్లాగరుకి ( ? క్షమించాలి. పేరు గుర్తు లేదు) ధన్యవాదాలు.










ఇప్పటికి ఈ మీసాల పురాణానికి స్వస్తి.



















































































































































































































































































































































































































































































































































































































10, ఏప్రిల్ 2013, బుధవారం

సూది పురాణమ్ ....





సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది.
అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ దొరికి కుడదామని కూచుంటే, సూదిలోకి దారం కళ్ళ జోడు లేనిదే ఎక్కించ లేం !. అదెక్కడ పెట్టామో గుర్తుకు రాదు. దాంతో విసుగొచ్చి సూదీ దారాలని పక్కన పడేస్తాం. తర్వాత కళ్ళ జోడు జాడ కనిపించి, కొంచెం తీరిక దొరికింది కదా అని ఏరాత్రి పూటో కుట్టడానికి కూచుంటామా ! కరెంట్ ఠక్ న పోతుంది. జీవితంలో ఐరనీ ఇదే. మన దినాలు బావుండక పోతే అన్నీ ఇలాగే జరుగుతాయి ! ... సరే, ఈ సోది కాస్సేపు ఆపి, సూది కథలోకి వద్దాం.

సూచి అనే దానికి రూపాంతరమే సూది. దీనికి మరి కొన్ని పర్యాయ పదాలూ ఉన్నాయండోయ్. సేవని,సూచకము, సూచి, సూచిక,సూచిని, సేవతి ... ఈ పదాలన్నింటికీ సూది అనే అర్ధం ! ఇంత ఆయాసం మనం పడ లేం కానీ మనం సూది అనే పిలుచుకుందాం.సూదుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు సూది. బొంత సూది, కుట్టు సూది, మందు సూది ...వీటిలో గుండు సూదులది రాచహోదా లెండి. ఇవి ఆఫీసుల్లోనూ అక్కడా చక్కా అందమైన ముఖమల్ ఆసనం అలంకరించిన చోట ఉంటాయి. వాటి దర్జాయే వేరు ! బట్టలూ, పుస్తకాలూ, బొంతలూ కుట్టే సూదులు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి కాక మిషను సూదులు వేరు. ఆస్పత్రులలో రోగుల జబ్బలకు పొడిచే మందు సూదులను లోగడ మరుగుతున్న నీళ్ళలో శుభ్రం చేసే వారు. స్టెరిలైజేషనంటారు దానిని. ఇప్పుడా బాధ లేదు. హాయిగా వాడి పారేసే మందు సూదులొచ్చేయి. సుఖమే కాక, ఇవి ఆరోగ్యరీత్యా మంచివి కూడానూ

 ఇక సూదుల పెద్దన్న దబ్బనం. వీటితో గోనె సంచులూ గట్రా కుడతారు.
అసలీ సూదులు మన దేశం లోకి విదేశాల నుండి ముందటి రోజుల్లో దిగుమతి అయ్యేవిట ! తర్వాత తర్వాత మనఁవూ సూదులను తయారు చేయడం మొదలెట్టాం.

గాంధీజీకి రోజూ బోలెడు ఉత్తరాలు వచ్చేవిట. ఓ రోజు గుండు సూది గుది గుచ్చి ఎక్కువ కాగితాల బొత్తి వచ్చిందిట. జాతి పిత ఆ ఉత్తరాన్ని పూర్తిగా ఓపికగా సాంతం చదివేక దానికున్న ఆ గుండు సూదిని తీసి జాగ్రత్త చేసి, ఉత్తరాన్ని చెత్త బుట్టలో వేసారుట ! ప్రక్క నున్న వారెవరో ఆశ్చర్య పడి ఇదేమిటని అడిగితే, ఈ ఉత్తరంలో మనకి పని కొచ్చేది ఈ గుండు సూది ఒక్కటే ! అని బదులిచ్చారుట !
మన మహా భారతంలో వచ్చిన సూది ప్రస్తావన అందరికీ తెలిసినదే కదా ! రారాజు పాండవులకి ఐదూళ్ళు కాదు కదా సూది మొన మోపినంత భూభాగం కూడా ఇవ్వనని చెప్పడం వల్లనే కదా భారత యుద్ధం వచ్చింది !
కుట్టు కోడానికే కాదు, సూది హింస కూడా ఒకటుంది. విలన్లూ, కొందరు రక్షక భటులూ నేరస్థుల గోళ్ళలో సూదులు కుక్కి నిజమో అబద్ధమో రాబట్టే, హింసాత్మక చర్యలకూ సూదులే ఉపయోగ పడడం సూదుల జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలి పోతుంది.

సూదిలోకి దారం అవలీలగా ఎక్కించ గలుగు తున్నామంటే మన కంటి చూపు భేషుగ్గా ఉన్నట్టే ! గుండు సూది నుండి ఇక్కడ సమస్తం దొరుకుతాయండీ అని ఏ షాపు గురించయినా చెప్పుకుంటూ ఉంటే ఆ షాపు ఇవాళ్టి మన మాల్ లాంటి దన్నమాట !

గతాన్నీ వర్తమానాన్నీ సమన్వయ పరుస్తూ కుట్టే సూది లేక పోయిందే ! అని కవి నారాయణ రెడ్డి గారు ఓ కవితలో ఖేద పడ్డారు.
పరమానందయ్య గారి శిష్యుల సూది కథ తెలిసినదే కదా. గురువు గారు ఓ సారి ఓ సూది తెండ్రా అని చెప్పారుట. పొలోమని శిష్యులందరూ బయల్దేరారు. వారికి ఓ చిన్న సూదిని అంతమందీ కలిసి తేవడం ఎలాగో తెలిసింది కాదు. సూది తెమ్మని గురువు గారు అందరికీ కలిసి చెప్పారాయె ! అందు వల్ల బాగా ఆలోచించి, ఆ సూదిని ఓ తాటిమానుకి గుచ్చి మోసుకొచ్చేరుట. తీరా , గురువుల దగ్గరకి వెళ్ళే సరికి తాటి దూలం ఒక్కటే మిగిలింది ! సూది దారిలో ఎక్కడో జారి పడి పోయింది !

సూదికి సంబంధించిన సామెతలు కూడా కొన్ని కనిపిస్తాయి. చూడండి ...

1. సూదికి రెండు మొనలు ఉంటాయా!

2. సూది కుతికె, దెయ్యపాకలి. ( పీక సన్నం, ఆకలెక్కువ లాంటిదన్నమాట)

3. సూది కోసం దూలం మోసినట్టు

4. సూది కోసం వెళితే, పాత రంకులు బయట పడ్డాయిట !

5. సూది గొంతు, బాన కడుపు

6. సూది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా ?

7. సూది బెజ్జం చూసి జల్లెడ వెక్కిరించి నట్టు !

8. సూదిలా వచ్చి, గడ్డ పారలా మారినట్టు
9. సూదిని మూట కట్టి నట్టు

10.సూది బెజ్జంలో ఒంటె దూర వచ్చును కానీ, భాగ్య వంతుడు స్వర్గం చేర లేడు ( ఇది బైబిల్ సూక్తి)
11. గడ్డి మేటులో సూదిని వెదికినట్టు ! ( వృథా ప్రయాస అన్నమాట ! )

సూదిలొ దారం ... సందులొ బేరం లాంటి సినిమా పాటలు ఉన్నాయి కానీ, వాటిలో అశ్లీలత ఏమన్నా ఉందా అని బుర్ర గోక్కోవడం దండుగ. ఉండక పోతేనే ఆశ్చర్యం కానీ, ఉంటే అబ్బుర మేముంది ?

అన్యోన్యంగా ఉండే భార్యా భర్తలను చిలకా గోరింకాలా ఉన్నారంటారే కానీ సూదీ దారంలా కలిసి పోయారని అనక పోవడానికి కారణం ఏమిటో ; సూది కుట్టేదీ, దారం చుట్టుకు పోయేదీ కనుకనా ? చూడాలి.

ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న వూళ్ళలో సూదులోళ్ళు అని చిల్లర వ్యాపారస్తులు కొందరు రోడ్లమ్మట తిరుగుతూ కనిపిస్తారు. చేతిలో ఓ నిడుపాటి గెడ కర్రకు మీద ఆ చివర అట్ట ముక్కలకు తగిలించి సూదులూ, పిన్నీసులూ, బూరలూ, మొలతాళ్ళూ లాంటివి తెచ్చి అమ్ముతూ ఉంటారు.

ఇక, చివరగా చిన్నప్పుడు మా పెద్దాళ్ళు తరుచుగా చెప్పి కడుపారా నవ్వించిన సూది కథ ఒకటి చెబుతాను ...
అనగనగనగా ... ఒక ఊళ్ళో ఒక అవ్వ నూతి గట్టు మీద కూచుని ( నూతి గట్టు మీద కూచోడ మేఁవిటనకండి. అదంతే కథకి కాళ్ళూ చేతులూ లేవు)
చిరిగిన బొంత కుడుతోందిట. ఇంతలో చెయ్యి జారి సూది నూతిలో బుడుంగున పడి పోయిందిట. కుయ్యో, మొర్రో అంటూ , సూదీ సూదీ బేతాళా ! అంది అవ్వ. దారం నూతిలో పడి పోయింది. దారం దారం బేతాళా ! అంది . బొంత పడి పోయింది. బొంతా బొంతా బేతాళా ! అంది ఈ సారి ఏకంగా అవ్వే నూతిలోకి పడి పోయింది ! ....
ఈ కథ ఇంత వరకూ ఇలా సాగుతూ ఉంటుంది. పిల్లలు ఊఁ ... కొడుతూనే ఉంటారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ప్రశ్నలే ప్రశ్నలు !

ఊఁ.. అంటే అవ్వ నూతిలోంచి బయటి కొస్తుందా ?

ఉహూఁ !

ఉహూఁ అంటే వస్తుందా ?

(తల అడ్డంగా తిప్పే వాళ్ళం )

తల తిప్పితే వస్తుందా ?

(పగలబడి నవ్వుతాం)

వెంటనే మరో ప్రశ్న ! నవ్వితే వస్తుందా

మాట్లాడకుండా ఉంటే వస్తుందా ? కథ బాగుందంటే వస్తుందా ? వస్తుందంటే వస్తుందా ? రాదంటే వస్తుందా ! ...
ఇది అనంతం


( కృతఙ్ఞతలు : శ్రీ లతిక )






























8, ఏప్రిల్ 2013, సోమవారం

ఓ పాలేటయినాదంటే ... (బదవద్గీత పెవచనమ్ )




పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతావూ ? మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !

అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...
ఓ పాలేటయినాదంటే ...
మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు ఏసంకాలం,అలపొద్దులేళ నానూ, నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట అందిల కూకున్నాఁవా ? మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ్మూరితీ ( ఈన కతలు రాస్తాడు నెండి ) మా రవణ మూరితీ ( ఈడు అరికతలు మా బాగా సెపుతాడు ) మరింకా మా రామ జోగారావూ, మా సోమయాజులూ అన్నమాట . ఈ సివరాకరిద్దరూ ఉప్పుడు బూమ్మీద నేరు. పోనారండి. అత్తల్సు కుంతె కడుపు దేవి పోతాదండి. ఏటి సేత్తాం. అదలా గుంచండి ...
మాం కూకున్న కాడికి దగ్గర్నోనే మరో పది మంది దాకా కూకున్నరు. ఆల్లంతా పల్లెటూరి బైతులు నాగున్నరనుకున్నం. ఆల్ల ముందు నున్నగ నించుని రివట నాగున్న వోడు వొకడు సింకి నెక్చరు ఇచ్చెత్తన్నాడు. ఆడు సెప్పేదంతా సుట్టూ సేరినోల్లు సెవులప్ప గించి ఇంతన్నారు.
ఆడేటి సెపుతున్నాడూ ?బదగద్గీత ! ఆడి మాటలు యిని మాం నవ్వాపు కోనేక పోయేం ! పిక్కిరోల్లం కదా,పొగ రెక్కువుంతాది. ఆల్లని పల్లెటూరి బైతుల నాగా సూసి అయ్యేల ఇరగబడి ఇరగబడి నవ్వీసినాం. మరాల్లకి కోపం రాదా ? మమ్మల్ని కొట్టనాని కొచ్చేరు. కక్కా ముక్కా తినీవోల్లు. ఆల్లతోటి మాఁవేటి సాగ్గలం.? గుంటలం. ఓరినాయనో బేగి పరిగెత్తరా నాయన ! అంటూ అక్కడి నుండి పారి పోయినం. ఎలగయితేనేం గండం గడిసింది పిండం బయట పడింన్నట్టుగ మాకు ఆయేల దరువులు తప్పినయ్యి ! ఇయ్యాల పెందిల నెగిసీ నెగడంతోటే ఇదంతా ఎందుకో గుర్తుకొచ్చినాది. , ఆ సోదంతా బరికీసి నా బ్లాగు టపాలో పడీసినాను. ఏటంతే అనండి ఇందల నీతేటో కడాకు సదవండి మీకే తెలుస్తాది ...

ఇంతకీ బుద్దిగా తలలూపుతూ యింటున్న ఆల్లందరికీ ఆడేటి సెపుతున్నాడూ ? బదవద్గీత సెపుతున్నాడని సెప్ప నేదా ?
అదెలాగుంటే ....
‘‘కురుచ్చేత్ర యుద్దం మొదలయి పోనాది. యుద్దానికి ముందు దాపలో గుర్రఁవూ ఎలపలో గుర్రఁవూ కట్టి కిసన మూరితి బండి మీద అరుజునుడిని ఎక్కించుకుని అక్కడికి ఎల్లినాడు. అరుజునుడు ఎగస్పార్టీ వోల్లని సూసాడు. ఇంకేటుంది ?ఉచ్చ కార్చీసు కున్నాడు ! ‘అక్కడంతా ఆడికి ఎవులు కనిపించినారు ?తాతియ్యలు,బాయ్యలు,దద్దలు,మాయ్యిలు,... అంతా ఆల్లే ! ఓర్నాయనో ! నా సేతుల్తో మనోల్లని సంపనే నంటూ బానం వొగ్గీసి బండి దిగి పోనాడు.

మరప్పుడు కిసన బగవాను మూరితి ఏటన్నాడో ఎరికా ?

‘ ఓరి పల్లకోరా ! పెద్ద పోటు గాడి నాగ ఈల్లందరినీ నువ్వే సంపీస్తావను కుంతున్నావేటి ?!
పుట్టించినోడినీ నానే ! సంపీ వోడినీ నేనే . సేసే వోడినీ,సేయించే వోడినీ నానే. నానంతే ఎవులను కుంతున్నావు ? బగమంతుడిని. విందిరా గాందీనీ విజీనారం రాజు గోరినీ నానే కదా పుట్టించి నోడిని. ఈడినీ ఆడినీ,మన పోలుపిల్లి గవిరయ్య కూతురు లచ్చుమునీ,మనూరు బుగత బాబునీ,ఆడి కొడుకునీ,అందరినీ నానే కదా పుట్టించి నాను. నాను నోకంలో ఎప్పుడయితే దరమం నాసినఁవై పోతదో అప్పుడు పుడతానన్నమాట ! .......’’ ఇలా సాగి పోనాది ఆడి పెసంగం.
మద్దె మద్దెలో ఆడాడిన బూతు మాటలు తీస్సి సెబుతున్నాను కానీ,సత్తె పెమాణికంగా అయ్యేల ఆడి పెసంగం అచ్చు ఇలాగ్గానే ఉంది.
ఆడి మాటలకు బైతు గాడి మాటలనీ. తాగు ముచ్చోడి కబుర్లనీ మాం పడి పడి నవ్వీసి తన్నులు తినబోయి,తప్పించు కున్నం కానీ, ఇందల ఒక్క అచ్చరం అపద్దం నేదు. మరాడి మాటలు సుట్టూ సేరి నోల్లు ఎలాగ్గ యిన్నారూ ?మన చాగంటి పంతులు గోరు టీ.పీలో సెబుతే మనం ఇంతంన్నాం కామా ! అంత బక్తితో ఇన్నారు. స్రెద్దగా యిన్నారు.
ఇప్పుడు మీరు సెప్పండి. నవ్విన మాం గొప్పోల్లఁవా ?ఆల్ల జీవ బాసలో,ఏ జంకూ గొంకూ నేకండా సాజంగా, అమాయకంగా బూతులు కలిపేస్తూ మాటాడిన ఆడు గొప్పోడా ?ఆడు సెప్పిందంతా గొప్పోడి పెవచనం నాగా స్రెద్దగా,బయ బత్తుల తోటి యింటూ కూకున్న ఆలు గొప్పోల్లా ?ఏటంతారు ?ఆల్లే గొప్పోల్లంతాను.ఆడే గొప్పోడంతాను.

ఆల్లని పల్లెటూరి బైతుల్నాగా సూసి ఎకసెక్కెం ఆడిన మా గుంటకాయల్దే తప్పంతాను. మీరేటంతారు ?


---------------------------------------------------------------------------------------


ఇదంతా కథా మంజరి బ్లాగు టపాగా రాయదలచి నప్పుడు కొంచెం ఆలోచించాను.
వాళ్ళ జీవద్భాషలోనే,ఆ మాండలికం లోనే రాయడం సబవనిపించింది. ప్రయత్నించి చూసేను. అంతే !






31, మార్చి 2013, ఆదివారం

తమాషాగా లేదూ ? ! ...




అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !

వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ

కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.

బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
























































ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...

3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.

ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !

ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.

గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )

విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !

చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !

పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!







26, మార్చి 2013, మంగళవారం

పక్షుల, జంతువుల భాష చాలా వీజీ !!




ఆ మధ్య నేను హిమాలమాలకు వెళ్ళి నప్పుడు (హరిద్వార్ , ఋషీకేశ్ వరకూ మాత్రమే అనుకోండి. ) అక్కడ నాకు ఎదురయిన ఒక మహా ముని వద్ద ( ఆ ముని నన్ను టీ నీళ్ళ కోసం డబ్బులు అడిగిన విషయం ఇక్కడ అప్రస్తుతం అనుకోండి ) పక్షులూ జంతువుల భాష నేర్చు  కున్నాను. ఆ విద్యతోనే యాగంటి కాకుల కథ అనే టపా రాసాను. కావాలంటే దానిని ఇక్కడ చూడండి.

పక్షులూ. జంతువులతో మాట్లాడ గలిగే నా భాషా పటిమను ఉదాహరణ ప్రాయంగా కొంచెం వివరిస్తాను. చూడండి :
నేను : మేకా ! మేకా ! ఏప్రియల్ తరువాత వచ్చే నెల ఏదమ్మా
చెప్పవూ ?
మేక : మే

నేను : ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు మేలు చేసేవే నంటావా ?
కాకి : కావు .. కావు

నేను : పిచ్చుకా ! పిచ్చుకా ! గల గల , వలవల, గడగడ లాంటి జంట పదం మరోటి చెప్పు చూద్దాం !
పిచ్చుక : కిచ కిచ

నేను : ఓ శునక రాజమా ! భ అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుంది తెలుసా ?కుక్క :  (ఓస్ !  ఆ పాటి తెలియదనుకున్నావా ?  ... ఇది స్వగతం కానోపు )     భౌ !

నేను : ఓ సన్నగమా ! నీకు తెలిసిన ఓ మాజీ అమెరికా ప్రెసిడెంటు పేరు చెప్పు ?
పాము : బుస్ !

( బుష్ అనే దానికి ఇది వికృతి కావచ్చు ... )

నేను : ఓ పులి రాజా ! ప్రపంచ తెలుగు మహా సభలు ఎట్లు జరిగినవి ?

పులి :  గాండ్రు

( పులి రాజు ఇటీవలే స్పోకెన్ ఇంగ్లీషు తరగతులకు వెళ్తూ ఉండడం చేత కొంచెం  తడబడినట్టుంది. ఎక్కడ కరారావుడు పెట్టాలో తెలియ లేదు పాపం.)

నేను : ధేనువా ! పార్వతికి గల పర్యాయ పదం ఒకటి చెప్ప గలవా ?
ఆవు : అంబ !

నేను : కరిరాజా ! నెయ్యిని హిందీలో  ఏమందురు ?

ఏనుగు : ఘీఁ

నేను : నెమలీ ! నెమలీ ! ఇలాంటి టపాలు రాస్తున్నాడు, ఈ కథా మంజరి గాడికి ఏమయింది ?
నెమలి : క్రాక్ !
.చివరగా ఓ విషయం. నరుడు ద్విపాద జంతువు కనుక అతనితో మాట్లాడితే అందరికీ జంతు భాష వచ్చి
 నట్టే కదా !!
















































































































24, మార్చి 2013, ఆదివారం

ఈ ఇష్గాలంటే నా కెంతో ఇష్టం !!





నాకు మా విజయ నగరం అంటే చాలా ఇష్టం.తెలుగు కథకు పురిటి గడ్డ కనుకయిష్టం. గురజాడ తిరిగిన తావు కనుక ఇష్టం. కన్యా శుల్కం లాంటి గొప్ప నాటకం వెలిసిన ఊరు కనుక యిష్టం. ఆ నాటకం తొలి ప్రదర్శన జరిగిన ఊరు కనుక ఇష్టం. తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో నేల కనుక యిష్టం.
   నాకింకా చాలా ఇష్టాలు ఉన్నాయి. తడియారని అచ్చు వేసిన కొత్త పుస్తక మయితే ఇష్టం. అది కథల పుస్తక మయితే మరీ మరీ  ఇష్టం.  
మా ఊరి  కోట,  పెద్ద చెరువు, గంట స్తంభంమూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు,అయ్య కోనేరు, బొంకుల దిబ్బ, మహా రాజావారి కళాశాల, మా చదువుల తల్లి
 మా సంప్కృత కళాశాల,  అమ్మ లాగ అన్నం పెట్టి ఆదరించిన సింహాచల దేవస్థానం వారి అన్నదానసత్రవూ, సంగీత కళాశాల,అమ్మ వారి  కోవిల, గుమ్చీ,  రాజారావు మేడ, డంకే షావలీ మసీదు, వ్యాస నారాయణ మెట్ట,. ఇంకా దోమల మందిరం .... నిజమే  మా విజీనారం దోమలంటే కూడా నాకు చాలా ఇష్టం. మా పతంజలి చెప్పినట్టు, అవి రాత్రి వేళ కుడుతూ, కథలూ కాకరకాయలూ రాసుకోమనీ, చదువుకోమనీ సదా హెచ్చరిస్తూ ఏండేవి కదా.
నిజమే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. మా దాట్ల నారాయణ మూర్తి రాజు, పతంజలి, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, గార్లతో ఎంతో ఇష్టంగా రాత్రీ పగలూ తిరిగిన ఊరు కనుక చాలా ఇష్టం. మరింకా మా గురు దేవులు మానా ప్రగ్గడ శేషసాయి గారు మా భాగ్యవశాన  మమ్ములను సదా ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు కనుక ఇష్టం...... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇష్టాలకు అంతూ పొంతూ ఉండదు.  అలా చెప్పడం కూడా నాకు చాలా యిష్టం.

ఈ ఇష్టాల పుస్తకంలో కొన్ని పుటలు వెనక్కి తిప్పితే, మా రసాలూరు సాలూరు వస్తుంది. ఆ ఊరంటే, అక్కడి సందు గొందులతో, మురికి వాసనaతో, పేదరికపు బీద జీవిత ముఖ పత్రాలతో నాకు చాలా ఇష్టం.
అక్కడి వేగావతి నది, పంచముఖేశ్వర స్వామి వారి ఆలయం, నేను దాదాపు పాతికేళ్ళు పని చేసిన మా కాలేజీ, ...ముత్యాలమ్మ కోవిల, పారమ్మ కొండ,దూరంగా కనిపించే   కొండలూ,  అక్కడి మల్లె తోటలు, తియ్యని పాటల బాదుషా కబీర్ షా  గారు పాడిన మా కళా వేదికా,  ఇంకా, వేగావతి బ్రిడ్జి మీద సాయంత్రాలు కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుపన్న మా మిత్ర బృందమూ,.. ఒకటేమిటి ... అన్నీ గుర్తుకు వస్తాయి.

ఆ రోజులలో మా రసాలూరు సాలూరు గురించి రాపిన నా పద్యం ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. అది కూడా చెప్పి, నా ఇష్టాల జాబితా చాలా అసమగ్రంగా ఇంతటితో ముగిస్తాను ..

సీ.
పొలిమేర విడిసి తా తొలి పూజ లందు మా
    తల్లి ముత్యాలమ్మఁ దలతు నేను. !
వేగమే లేనట్టి వెర్రి బాగుల తల్లి
     వేగావతికి నుతులు వేనవేలు !
తనుఁగొల్చు భక్తుల తరియించి వేలుపు
   పరమ పావన మూర్తి పంచ ముఖుడు !
శి రాత్రి వేళలో జన సంద్రమై కాచు
కొండ పారమ తల్లి అండ మాకు !


చాల దయగల తల్లి మా శ్యామలాంబ !
వేల్పుటెకిమీడు జోతలు వేంకటేశ !
మరులు కల్పించు మాయూరి మల్లె పొదలు !
మంచి గంధము మాయూరి మంచి తనము !!




21, మార్చి 2013, గురువారం

యాగంటి కాకుల కథ .... (సరదాకి ...)


పక్షులు మనకు విపక్షులు కావు. వాటికీ మంచీ చెడూ తెలుసును.  మాట్లాడతాయి కూడానూ. నల దమయంతుల కథలో హంస నలుడితో మాట్లాడడమే కాకుండా నల దమయంతుల మధ్య రాయబారం కూడా నడిపింది కాదూ ?  సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకు పోతుంటే జటాయువు  వద్దని వారించ లేదూ ? ఆ మూర్ఖుడి చేతిలో చావు దెబ్బ తినీసిందను కోండి ... వెనుకటి కాలంలో పావురాలు కొరియర్ సర్వీసు చేసేవని తెలిసిందే
కదా ? పావురాల వేటతో  పడరాని పాట్లు పడిన సారంగధరుడిని ఓ సారి తలుచుకోండి ...
పక్షుల గురించి చాలా భోగట్టాలు రాయొచ్చు కానీ ప్రస్తుతానికి మన టపా పక్షులలో ఒక్క కాకికి మాత్రమే పరిమితం చేసుకుందాం.
   పక్షులలో కాకికి మాత్రం కొంత చిన్న స్థానం  ఉన్నట్టు తోస్తోంది. ఆబ్దీకాలప్పుడు కాకులను  కొంత మర్యాదగా చూడడం జరిగినా, వాటి పట్ల ఎవరికీ అంత సదభిప్రయం ఉన్నట్టు తోచదు.  కాకులలో మాల కాకి, బొంత కాకి , నీరుకాకి ..ఇలా చాలా రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకులు కోకిల గుడ్లను పొదిగి  పెద్ద చేస్తాయిట.  కనుక కోకిలకు కాకి పెంపుడు అని పేరు ఉంది.  ఉచ్ఛిష్ఠం  తినే కాకి పితరుడెట్టౌనురా అని ఈసడించు కున్న వారూ లేక పో లేదు. కాకమ్మ కబుర్లు , కాకి పిల్ల కాకికి ముద్దు , పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ కాకి మూక,  కాకిలా కలకాలం బతికే కంటే, హంసలా బతకడం మేలు ...కాకీ, కోకిలా రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వసతం కాలం వచ్చే సరికి ఏది కాకో, ఏది కోకిలో తెలిసి పోతుంది , కాకి గోల  ఏకాకి,, లోకులు పలుగాకులు,... ...లాంటి సామెతలు, మాటలు, శ్లోకాలూ  కూడా వాటిని ఈసడంచేవే కదా.

మా చిన్నప్పుడు బడిలో  ఒక అను ప్రాసకి ఉదాహరణగా  కాకీక కాకికి కోక. కేకీక కేకికి కోక. కాకీక కాకికి కాక 
కేకికా ? అని  చెప్పు కునే వాళ్ళం
కాకుల  ప్రవర్తన కూడా అటాగే ఉండడం వల్ల కాబోలు   వాటి  పట్ల మన నిరాదరణకు కారణం కానోపు.
కాకి బంగారానికీ కాకులకీ సంబంధం లేదు. అలాగే చికాకులకీ కాకులకీ సంబంధం అంటగ్గ కూడదు.
కాకితో కబురు చేస్తే రానా ? అనే మాటను బట్టి కాకులు కూడా కొరియర్ సర్వీసు చేస్తాయేమో అను కోవాలి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని మన వాళ్ళు అను కోవడం కద్దు.

అదలా ఉంచితే కాకుల మీద కలిగిన అపార మయిన సానుభూతితో వాటితో ఇంటర్వ్యూ చేదామనిపించింది. ఇటీవల మేము యాగంటి పుణ్య క్షేత్రానికి వెళ్ళి నప్పుడు అక్కడి కాకులతో కొంత సంభాషించేను.  నేనడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానా లిచ్చేయి. మా సంభాషణ జరిగిన తీరు వివరించే ముందు,  కాస్త యాగంటి గురించి  చెబుతాను. 

ఈ పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లా బనగాన పల్లి మండలం లోని ఎర్ర మల కొండల్లో ఉంది. ఉమా మహేశ్వరులు ఏక శిలా రూపంలో స్వయంభువుగా వెలిసిన క్షేత్రం ఇది. అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలు చేస్తూ  వచ్చి, ఇక్కడి అందాలకు పరవశించి పోయి , ఇక్కడ వేంకేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలను కున్నాడుట. తీరా ఆ విగ్రహానికి కుడి కాలి బొటన వేలు విరిగి పోవడంతో విగ్రహ ప్రతిష్ఠకు ఆటంకం కలిగిం.ది. దాంతో దానిని అక్కడే ఒక గుహలో ఉంచి, ముని తపస్సు చేసాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ముని కోరిక మేరకు అక్కడ  ఏక శిలా రూపంలో వెలిసారుట. అప్పుడు ముని,  వారిని చూసిన ఆనందందలో  యేన్ గంటిన్ ... యేన్ నేను కంటిన్... చూసాను అన్నాడుట. అదే కాల క్రమంలో యాగంటిగా మారిందిట. యాగంటి తప్పకుండా చూడ వలసిన ప్రదేశం. అన్ని అందాలు ఒక్క చోట చూసి పరవశించి పోతాం. . సహజ సిద్ధంగా ఉన్న గుహలు, కోనేరులు చాలా బావుంటాయి ...

ఇంతటి అందమైన చోట, పవిత్రమైన చోట కాకులతో నా సంభాషణా క్రమం బెట్టి దనినిన ...

నేను : ఆకాశాన్నంటిన  ధరలు దిగి వస్తాయనే మాటలు నిజమవుతాయి ?
కాకులు :  కావు ... కావు
నేను : మన రాజకీయాలు బాగు పడతాయనే ఆశలు నెర వేరేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : మన చదువులు  మనకి మంచి నడవడికను నేర్పేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : చలామణీలో ఉన్న నోట్లన్నీ అసలైనవే నంటారా ?
కాకులు : కావు ... కావు
నేను : కార్పొరేటు ఆసు పత్రులలో చిన్న రోగాలకు సైతం చేసే టెస్టు లన్నీ నిజానికి అవసర మైనవే నంటారా ?
కాకులు : కావు... కావు
నేను : తెలుగు సినిమా లన్నీ తెలుగు సినిమాలే నంటారా
కాకులు : కావు ... కావు
నేను : మా చిన్నప్పుడు మొదలైన తెలుగు టి.వి సీరియళ్ళు త్వరలో ముగింపు కొచ్చేవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : కథా మంజరి బ్లాగు టపా లన్నీ సీరియస్ గా రాసినవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : ఇంతకీ ఈ యాగంటి కాకుల కథలో చెప్పిన వన్నీ నిజాలేనా ?
కాకులు : కావు ... కావు

కాకులు చెప్పింది నిజమే.  ఎందుకంటే అస్సలు యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు.
దాని కొక ఐతిహ్యం చెబుతారు. అగస్త్యుడు తపస్సు చేసు కుంటూ ఉంటే, కాకా సురుడనే వాడు  లెక్క లేనన్ని కాకులతో వచ్చి గోల చేసాడుట. దానితో మునికి తపో భంగమయిందిట. అగస్త్యుడు కోపించి ఇక నుండీ యాగంటి పుణ్య క్షేత్రంలో ఒక్క కాకి కూడా ఉండకుండు గాక అని శపించాడుట.

అందు చేత, యాగంటి కాకుల కథ అంటూ నేను రాసిన దంతా ఏదో సరదాకి రాసినదే తప్ప మరోటి కాదు.  ఇందులో ఏవీ నిజాలు కానే కావు ... కావు ... కావు.