23, జూన్ 2012, శనివారం

ఎక్కడున్నావు, గొంగళీ ... ?

ఇటీవల శరత్ ‘కాలమ్’ లో అవినీతిని చట్ట బద్ధం చెయ్యాలి అంటూ ఒక మంచి టపా పెట్టారు.  ఇక్కడ  నొక్కి ఆ టపా చూడ వచ్చును. అది సంగతమూ, జరిగే పనీ కాక పోయినా ఆ విధంగా రచయితలు తమ ఆవేదన వెళ్ళగ్రక్కుతూ ఉండడం పరిపాటి. అదొక విషాద వినోదం.

శరత్ గారు అవినీతిని చట్టబద్ధం చెయ్యమని భావిస్తే, నేను మన ఎన్నికల విధానం పూర్తిగా రద్ధు చేసి నాయకుల ఎన్నిక  టెండరు విధానంలో జరిగితే బావుండునని  తే 3 - 2  -1991  దీ ఈనాడు ఆదివారం వారపత్రిక  లో ఎక్కడున్నావు గొంగళీ ?! అని  ఒక కథ ప్రచురించాను.  ఆ కథ మీరు  ఈ టపాలో చదువ వచ్చును.

దిగజారుడు వ్వవస్థ మీద జనాల ఉక్రోషమే ఏదో ఒకనాడు తిరుగుబాటుగా పరిణమించడం చారిత్రక సత్యమే కదా !

ఇక, కథ చదవండి ...

శరత్ ‘ కాలమ్ ’

Open publication - Free publishing - More jogh

22, జూన్ 2012, శుక్రవారం

ఎంచక్కని కల !




ఎంచక్కని కల!
నేరమయ ప్రపంచంలో
ఎన్ని జైళ్ళూ చాలడం లేదు.

            - - -
క్షణ కాలంలో
లోకంలో ఇళ్ళన్నీ జైళ్ళు గానూ,
జైళ్ళన్నీ ఇళ్ళగానూ
మారి పోయినట్టు
గమ్మత్తయిన కల !
అప్పుడు
 ఇళ్ళగా మారిన  జైళ్ళన్నీ,

పసి పిల్లల నవ్వులతో
కళకళలాడి పోయినట్టు,
ఎంచక్కని కల !




19, జూన్ 2012, మంగళవారం

అమ్మకానికి కాదు సుమా !




పోయినవి పోగా, మిగిలిన మా పుస్తకాల జాబితా  ఇది ... మా పర హస్త గత మయిన పుస్తకాలు ..రావి శాస్త్రి మొత్తం పుస్తకాల సెట్టు, అలాగే ముళ్ళపూడి వారి రచనలు, సాక్షి వ్యాసాలు, భారతి సంచికలు,  ఇంకా చాలా ... చాలా ...


17, జూన్ 2012, ఆదివారం

కొడితే కొట్టాలిరా ...!




నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 - 12 -2011 దీ సంచికలో ప్రచురణ.

14, జూన్ 2012, గురువారం

బాల్య చేష్టా విలసితమ్ !




( నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 4 - 1 -2012 దీ సంచికలో ప్రచురణ )




11, జూన్ 2012, సోమవారం

ఎవడు బతికేడు మూడు యాభైలు ...


నవ్య వార పత్రిక తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 -3 -2012 దీ సంచికలో ప్రచురణ.


5, జూన్ 2012, మంగళవారం

మంచి పద్యాలు మరోసారి ....



కాటూరి వేంకటేశ్వర రావు గారి పౌలస్త్య హృదయం  చక్కని ఖండ కావ్యం దాని పూర్తి పాఠం ఇక్కడ ఉంచుతున్నాను.
లోగడ ఈ పుస్తకం మీద ఓ టపా రాసేను. అందులో పుస్తక సారాంశాన్ని వచనంలో రాస్తూ, అక్క డక్కడ మాత్రమే కొన్ని పద్యాలను ఉదాహరించడం జరిగింది. ఓ మిత్రుడు ఇటీవల ఆ టపా  ( ఆ టపా చూడాలంటే, ఇక్కడ నొక్కండి ) చదివి మొత్తం పద్యాలు పెడితే బావుండును కదా అన్నాడు.  మంచి పద్యాలు నలుగురితో పంచు కోవడం కన్నా వేరే ఆనందం ఏముంటుంది కనుక ?

అందుకే ఆ కావ్యఖండికను ఇక్కడ ఉంచుతున్నాను. చదివి ఆనందించండి ...










2, జూన్ 2012, శనివారం

చల్లనయ్యని చూడరో ...



ఈ కృత్రిమ మంచు శివ లింగం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలో ఆర్మీ ప్రాంతంలో శివాలయంలో ఉంది. ఆర్మీ వారి అనుమతితో సివిలియన్స్ వెళ్ళి చూడ వచ్చును. ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా , పరి శుభ్రంగా చూడ చక్కగా  ఉంటుంది.  శివరాత్రి నాడు జన సందోహంతో కళకళలాడి పోతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న చిన్న గుహలాంటి దానిలో దీనిని ఏర్పాటు చేశారు. నిత్యం మంద్ర స్వరంలో  ఓంకారం వినిపిస్తూ ఉంటుంది.

30, మే 2012, బుధవారం

ముచ్చట పడి కొనుక్కొన్న ముక్కు పద్యం !





(  నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికలో తే23-11-2011 దీ సంచికలో ప్రచురణ. )

27, మే 2012, ఆదివారం

కడుపు నింపిన కమ్మని పద్యం !








విద్యా లాభము నందగోరి యిటకున్ విచ్చేసి యున్నారమున్
విద్యా దేవి దయారసంబునన్జెప్పింపంగ నుప్పొంగుచున్
విద్యా బుద్ధియు నాయువున్ యశము సమ్యగ్వృద్ధి నారోగ్యమున్
విద్యా దేవతఁ గూడి మా కొసఁగు ముర్విన్ సింహశైలాథిపా !
ఈ పద్యం మా విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి ఉచిత విద్యార్ధి భోజన సత్రంలో రోజూ రెండు పూటలా భోజనాలకి ముందు విద్యార్ధులు పఠించే పద్యం. ఈ పద్యం గురించి తలచు కుంటేనే మాకు కడుపు నిండి పోయి నట్టనిపిస్తుంది.
ఎందుకో ఈ టపా కొంచెం ఓపికగా కడదాకా చదివితే మీకే తెలుస్తుంది.
వందేళ్ళ పైబడిన చరిత్ర కలిగిన ఈ భోజన సత్రంలో ఆ నాటి నుండి ఈ నాటి వరకూ వేల వేల విద్యార్ధులు రెండు పూటలా ఉచితంగా భోజనం చేసి, నగరం లోని వివిథ విద్యా సంస్థలలో చదువుకొని అభివృద్ధి లోకి వచ్చిన వారే. ఒక విధంగా ఈ భోజన శాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు. ఇదే లేక పోతే ఎంత మంది చదువులకి దూరమై పోయే వారో. విజయ నగర ప్రభువుల వితరణకీ, వారు చేసిన విద్యా సేవకీ నిదర్శనాలుగా శతజయంతులు చేసుకొన్న పలు విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ మహా రాజా సంగీత కలాశాల, మహారాజా వారి డిగ్రీ కలాశాల, మహారాజా ప్రభుత్వ సంస్కృత కలాశాల, వాటి అనుబంధ పాఠశాలలూ ... ఇలా వివిధ విద్యా సంస్థలతో మా విజయ నగరం నిజంగా విద్యల నగరమే.
ఈ విద్యా సంస్థలన్నీ ద్వారం నాయుడు గారూ, గురజాడ అప్పారావు గారూ, ఆది భట్ల నారాయణ దాసు గారూ, తాతా సుబ్బరాయ శాస్త్రులవారూ వంటి మహా మహులు పని చేసినవే కావడం గమనించాలి. ఇలాంటి గొప్ప విద్యా సంస్థలలో చదువు కోవాలని ఎక్కడెక్కడినుండో వచ్చే పేద విద్యార్థులకు ధనాభావం వారి చదువుకు ఆటంకం కలిగించ కుండా శతాబ్ది కాలం పైబడి ఈ భోజన సత్రం అమ్మ లాగా, అన్నపూర్ణలాగా ఆదుకుంటోంది. వారి కడుపు నింపుతోంది.
విజయ నగర ప్రభువులలో 1883 -1922ల మధ్య కాలంలో జీవించిన 4వ విజయరామ గజపతి మహా రాజులవారు దీని స్థాపనకు కారకులు. వీరు 3వ విజయరామ గజపతుల వారి సతీమణి అలక్ రాజేశ్వరీ దేవి గారి మేనల్లుడు. దత్తుడు. వీరి దత్తనామం పూసపాటి 4వ విజయరామ గజపతి. వీరి అర్ధాంగి లలితకుమారి గారు. ప్రసిద్ధి చెందిన కోరుకొండ సైనిక్ స్కూలు, ఇంకా, విజయ నగరం లోని సంస్కృత కలాశాలల భవన నిర్మాతలు 4వ విజయరామ గజపతులే. వీరి దత్తత చెల్లదంటూ దాయాదులు తెచ్చిన దావాయే పెద్ద దావాగా చాలా సంచలనాత్మకమైన దావాగా అందరకీ తెలిసినదే. ఈ పెద్ద దావా విషయం లోనే గురజాడ అప్పారావు గారు చాలా కృషి చేసి దావా గెలవడానికి పాటు పడ్డారు.
ఈ ముచ్చట్లన్నీ ప్రక్కన పెడితే, ఈ భోజన సత్రం ఏర్పాటుకి చెందిన ఒక ఆసక్తికరమైన కథ పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక రోజు సాయంకాలం 4వ విజయరామ గజపతి మహారాజుల వారు తమ కోట మేడ మీద చల్లగాలికి పచార్లు చేస్తూ ఉండగా బజారు వీధి గుండా నాటు బళ్ళు బారులు తీరి వెళ్తూ ఉండడం గమనించారుట. దివాన్ గారిని ఆ బళ్ళ గురించి ప్రభువులు ఆరాతీసారుట. సింహాచలం నుండి గజపతుల వారికి చెందిన భూముల పంటల నుండి వచ్చిన ఆదాయం రూపాయలలో ఆ బళ్ళ మీద రాజు గారి కోశాగారానికి తరలిస్తున్నారని దివాన్ చెప్పారుట. వెంటనే ప్రభువులు స్పందించి, సింహాచలం భూములనుండి సాలు సాలుకీ వచ్చే ఆ ఆదాయాన్ని తమ బొక్కసంలో కలిపేసు కోవడం సరికాదని, ఆ డబ్బుతో ఏదేని మంచి పని చేయాలని తలపెట్టారు. అలా వారి ఆలోచన నుండి ఆవిర్భవించినదే ఈ అన్నదాన సత్రం. తొలి రోజులలో విద్యార్ధులే కాక పేదలూ, యాత్రికులూ కూడా ఇక్కడి అన్నప్రసాదాన్ని స్వీకరించే వారుట. కాలక్రమంలో
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహం గా మారి నగరంలోని పలు విద్యా సంస్థలలో చదువుకోడానికి వచ్చే విద్యార్ధినీ విద్యార్ధులకు భోజన వసతి చేకూరుస్తోంది.ఈ అవిచ్ఛిన్న అన్నదాన క్రతువు , తంజావూరి అన్నదాన సత్రం కంటె భిన్నంగా అన్న దానంతో పాటు విద్యా దానం కూడా చేస్తోంది. అందుకే తంజావూరి అన్నదాన సత్రం సోమరులు అనే కథలు వ్యాప్తి చెందినట్టుగా ఇక్కడి భోజన సత్రం గురించి అలాంటి కథలేవీ లేవు. పైపెచ్చు ఇక్కడి సత్రంలో భోజనం చేసి, ఇక్కడి విద్యాలయాలలో చదువుకొన్న వారిలో దేశదేశాలలో కీర్తినందిన మహా మహుల జాబితా, నాకు తెలిసినంతవరకూ చెప్పాలంటే కూడా ఈ చోటు చాలదు.

నేను మా విజయనగరం సంస్కృత కలాశాలలో (కళాశాల కాదు, కలాశాల అనేదే సరైనదని మా గురువులు చెబుతారు) భాషాప్రవీణ చదివే రోజులలో ఇక్కడ 69 నుండీ 72 వరకూ భోజనం చేసి, చదువుకొన్నాను.
ఈ విద్యార్థి భోజన వసతి గ హాన్ని చౌల్ట్రీ అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఆ రోజులలో ఇక్కడ ప్రతి రోజూ రెండు పూటలా వివిధ విద్యా సంస్థలకు చెందిన 100 మంది విద్యార్ధినీ విద్యార్ధులం భోజనం చేసే వాళ్ళం ( ఇప్పుడీ సంఖ్య రెట్టింపయిందని తెలిసింది) ఆ నాటి ముచ్చట్లు కొన్ని మీతో పంచు కోవాలని ఇది రాస్తున్నాను.
భోజనం ప్రతి రోజూ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకీ, రాత్రి భోజనం 6 గంటలకీ పెట్టడం జరిగేది. ఈ వేళలు ఉదయం పూట పాఠశాలలకీ, కలాశాలలకీ వెళ్ళే వారికీ, రాత్రి చదువుకొనే వారికీ ఎంతో సదుపాయంగా ఉండేది. ఇక్కడి సమయ పాలన గురించి ఎంత చెప్పినా చాలదు. భోజనాలు వడ్డించే పెద్ద హాలులో విద్యార్ధలందరకీ సరిపడేలా పీటలు ఉండేవి. భోజనం అరిటాకులలో వడ్డించే వారు. ( ఇప్పుడు పీటలకు బదులు కూర్చోడానికి సిమెంటు బల్లలు కట్టారు. అరిటాకులకి బదులు స్టీలు కంచాలు వాడుతున్నారు. )
భోజనంలో అన్నం, పప్పు, నెయ్యి, ఒక కూర, పచ్చడీ, మజ్జిగా ఉండేవి. భోజనం ఏ విధంగానూ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంటుంది.
వేసవి శలవులు ముగిసి, నగరం లోని విద్యా సంస్థలలో అడ్మిషన్లు మొదలయ్యాక, అవసరం ఉన్న విద్యార్థులు ఈ సత్రంలో ఉచిత భోజనానికి కూడా అర్జీ పెట్టు కోవాలి. అలా వచ్చిన అప్లికేషన్ ల లో అర్హత గలవారికి, ఒక్కో విద్యా సంస్థకీ ఇన్ని సీట్లు చొప్పున సీట్లు కేటాయిస్తారు. మా రోజులలో ఈ చౌల్ట్రీ సీటు వచ్చే వరకూ చాలా మంది విద్యార్ధులకు మా గురువులే ఏదో ఒక త్రోవ చూపించే వారు. కొందరకి తమ ఇళ్ళ లోనే భోజనం ఏర్పాటు చేసే వారు. కొందరకి తామే స్వయంగా ఎవరింటి లోనో వారాలు కుదిర్చే వారు. ఇక సత్రం భోజనానికి సీటు వచ్చిందా, ఇక వాని చదువుకి ఏ అటంకమూ ఉండదు !
మా రోజుల సంగతి చెబుతాను ....
సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల వేళకీ, సాయంత్రం ఆరు గంటల వేళకీ మా భోజన సత్రం కళకళ లాడిపోతూ ఉండేది.
శ్లోకాలు వల్లిస్తూనో, కౌముది సూత్రాలు మననం చేసుకుంటూనో, చిన్న చిన్న సాహిత్య చర్చలు చేస్తూనో మా సంస్కృత కలాశాల విద్యార్థలం సందడి చేసే వాళ్ళం. కొత్తగా పద్యాలు అల్లడం అలవరచు కొంటున్న మా చింతా రామకృష్ణ ( ఆంధ్రామృతం బ్లాగరు) లాంటి వారు ఆశుపద్యాలు అలవోకగా చెబుతూ ఉండే వారు. ఊగరా !ఊగరా !! కథల ఫేమ్ స్వర్గీయ దాట్ల నారాయణ మూర్తిరాజు ( మాకు బాగా జూనియరు) ఖాకీ నిక్కరొకటి వేసుకుని, చేతిలో తాను తయారు చేసిన ఒక లిఖిత పత్రికతో తిరిగే వాడు. అప్పటి నుండీ పత్రికా సంపాదకుడు కావాలనే ఉబలాటం అతనిలో ఉండేది. అనంతర కాలంలో అయ్యేడు కూడానూ. ఇక, నేనూ, మా పీ.వీ.బీ శ్రీరామమూర్తీ అచ్చులో వచ్చిన మా కొత్త కథల గురించి మహా ఉత్సాహంగా కలబోసుకునే వాళ్ళం. ఓ ప్రక్క మా సంస్కృత కలాశాల విద్యార్ధుల సందడి ఇలా ఉంటే, మరో ప్రక్క సంగీత కళాశాల విద్యార్ధులు ఏవేవో రాగాలాపనలతో హోరెత్తించే వారు. డిగ్రీకాలేజీ విద్యార్ధులు మాకు తెలియని పాఠ్యాంశాల గురించి సీరియస్ గా మాట్లాడుకునే వారు. ఇదంతా మా నాని బాబు గారు విద్యార్ధుల అటెండెన్సు తీసుకోడం ముగించి, ఇక వడ్డనలు మొదలెట్టండి అంటూ హోలు లోకి వచ్చే వరకూ. పులి లాంటి ఆ మనిషి రాగానే అంతా గప్ చిప్. వడ్డన బేచ్ వడ్డన మొదలెట్టేది. సత్రం భోజనం చేసే విద్యార్ధులలోనే పదేసి మందిని వారానికో సారి మారుస్తూ వడ్డన బేచ్ గా నోటీసు బోర్డులో ఉంచే వారు. దాని ప్రకారం ఆ వారం రోజులూ రెడు పూటలా ఆ విద్యార్ధులు ముందు బేచ్ కి వడ్డనలు చేసాక, లేట్ బ్యాచ్ విద్యార్ధులతో కలసి అన్నాలు తిని తమ విద్యాసంస్థలకి వెళ్ళాలి.
ఒక విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యార్ధికీ ఈ వడ్డన బేచ్ లో వారం రోజుల పాటు వడ్డించాల్సిన పని రెండు మూడు పర్యాయాలు తగిలేది. కొంతమంది భోజన ప్రియులు ఐచ్ఛికంగా వడ్డన బేచ్ లో ఉండడానికి కుతూహలం చూపుతూ ఉండే వారు. అలాగయితే కావలసినతం తిన వచ్చునని వారి ఆలోచనగా ఉండేది. నిజానికి అక్కడ ఎవరికి కావలసినంత వారికి వడ్డన జరిగేది. వడ్డన బేచ్ కి ఉండే అవసరమే లేదు. కానయితే, కమ్మనయిన నెయ్యి కావలసినంత ముద్ద పప్పులో జారీతో ఒంపుకో వచ్చు ననే జిహ్వచాపల్యమే వారు
వడ్డన బేచ్ లో ఉండేందుకు ఇష్ట పడడానికి కారణమనుకుంటాను.
ఈ సత్రం భోజనాల నిర్వహణ చూసే మా నాని బాబు గారి గురించి చెప్పక తప్పదు !
కొంచెం మాసిన పంచె, తెల్లని పొట్టి చేతుల జుబ్బా, ‘సాదా సీదాగా కనిపిస్తూ,వృద్ధాప్యం మీద పడుతున్నట్టు కనిపించినా, కొంచెం బొంగురు గొంతుతో ఖణీమని మాట్లాడే పెద్ద గుమస్తా నాని బాబు గారంటే అందరకీ ఎంతో గౌరవం, భక్తీ ఉండేవి. అంతే ఇష్టం కూడా ఉండేది.
కర్తవ్య నిర్వహణలో నిబద్ధతా, గొప్ప మానవీయ దృక్పథమూ, కలిగిన నాని బాబు గారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలి.
మొత్తం వందమంది విద్యార్ధులనూ వారి వారి రోల్ నంబర్లతో పాటూ వారి పేర్లతోనూ గుర్తుంచుకొని పిలిచే వారు. సమయపాలన ఎంత ఖచ్చితంగా పాటించే వారంటే, ఏ రోజయినా భోజనాల వేళలో ఒక్క నిముషం అటూ ఇటూ అవనిచ్చే వారు కాదు. అర నిముషం ఆలస్యంగా వచ్చినా సరే ఆ పంక్తిలో కూర్చోడానికి వీలు లేదంతే. లేట్ బేచ్ కి వేచి ఉండాల్సిందే. వడ్డనల బేచ్, లేట్ బేచ్ వాళ్ళూ కూడా తినడాలు పూర్తయాక వచ్చే వాళ్ళు ఆ పూటకి వెనక్కి తిరిగి పోవలసినదే. అలాంటి వాళ్ళని ఒక్కోసారి రహస్యంగా వెనక్కి పిలిచి, ఓ పావలా చేతిలో ఉంచుతూ ఏ పకోడీలో కొనుక్కు తినరా నాయనా ! రేపటి నుండి లేటుగా రాకేం !’’ అని హెచ్చరించే వారు. విద్యార్ధుల అటెండెన్సు విషయంలో ఇంత కఠినంగా ఉండే నాని బాబు గారు ఒక్కడి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చే వారు. వాడే మా ఆచారి.
ఆ రోజుల్లో మా కలాశాల విద్యార్ధి ఒక ఆచారి ఉండే వాడు. ( పేరు కావాలనే చెప్పడం లేదు) వాడు అమిత భోజన ప్రియుడు. తిండి పుష్ఠి జాస్తి. అందు చేత పెద్ద గుమస్తా నాని బాబు గారు, వాడు సరైన వేళకే సత్రానికి వచ్చినా, ఎప్పుడూ కావాలనే లేట్ బేచ్ కి ఉంచేసే వారు ! ‘‘ నువ్వుండరా, లేటు బ్యాచ్ లో తిందువుగాని !’’ అంటూ ...
అలాగయితే వాడు కావలసినంత తింటాడని !
వాడు ఒక్కడూ ఒక మూలకి చేరి తనే స్వయంగా వడ్డించుకు తింటూ ఉంటే, ‘‘ ఒరే, ఆచారీ, ఆ నేతి జారీలో నెయ్యిని ఒక్క చుక్కయినా మిగిల్చేది ఉందా, లేదా !’’ అంటూ నవ్వుతూ, ఎంతో దయగా పలకరించే వారు !
వారి దయాస్వభావానికి మరో మంచి ఉదాహరణ చెబుతానఒక యేడాది సత్రం భోజనాలకి సెలక్టు చేసిన విద్యార్ధుల జాబితా సత్రం నోటీసు బోర్డులో ఉంచారు. అందులో పొరపాటున ఒక విద్యార్ధి పేరుకు బదులు ఇంకొక విద్యార్ధి పేరు టైపు చేయడం జరిగింది. ఇద్దరి పేర్లూ, ఇంటి పేర్లూ, తండ్రుల పేర్లూ ఒకలాగే ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగింది. అయితే, ఆ విద్యార్ధులిద్దరూ ఒకే పాఠశాలకి చెందిన వారు మాత్రం కారు. లిష్టులో తను చదివే పాఠశాల పేరు తప్పుగా ఉన్నా, తన పేరు చూసుకొని ఒక విద్యార్ధి రోజూ వచ్చి భోజనం చేయడం మొదలు పెట్టాడు. అసలు సీటు వచ్చిన విద్యార్ధి మాత్రం తనకు సీటు లభించ లేదనే నిరాశతో వాడి స్వతం గ్రామం వెళ్ళి పోయాడు. వారం రోజులకి జరిగిన ఈ పొరపాటు ఎవరో గుర్తించడం జరిగింది. అంతే. ఇంత వరకూ వస్తున్న విద్యార్ధిని సత్రం నుంచి తొలగిస్తూ ఇకపై రావద్దని నోటీసు ఉంచారు. అసలు విద్యార్ధికి సీటు ఇచ్చినట్టుగా వర్తమానం చేసారు. ఇదంతా పై అధికారుల స్థాయిలో జరిగింది. అంతే పెద్ద గుమస్తా నాని బాబు గారు అగ్రహోదగ్రులయ్యేరు ! ‘‘ వాడికి సీటు రాక పోవచ్చును. ఏదో పొరపాటు జరిగి ఉండ వచ్చును. వాడు ఈ వారం రోజులుగా శ్రీ సింహాచల స్వామి వారి అన్న ప్రసాదం తింటున్నాడు. ఇవాళ వాడి నోటి ముందు కూడు తీసేస్తామనడం సరి కాదు. కావాలంటే వాడికీ వీడికీ కూడా సీట్లు ఇవ్వండి. ’’ అంటూ అధికారులతో వాదులాడేరు. అధికారులు అది సాధ్యం కాదు పొమ్మన్నారు. ‘‘ స్వామి ప్రసాదం తింటున్న వాడిని కాదని పొమ్మనడం నా వల్ల కాదు. వాడిని సత్రం నుండి తొలిగిస్తే, నన్నూ ఈ ఉద్యోగం లోనుండి తొలగించండి. నేను రాజీనామా చేస్తున్నాను ’’ అని నాని బాబు గారు పెద్దలతోకుండ బ్రద్దలు కొట్టేలా చెప్పారు. ఆ మానవతా దృక్పథానికి, న్యాయ పోరాటానికీ అధికారులు దిగి వచ్చేరు. సత్రం చరిత్రలో ఏ యేడూ లేని విధంగా ఆ ఏడాది నూటొక్క మంది కి సీట్లు ఇవ్వడం జరిగింది !
ఒక పేద గుమస్తా మానవత్వంతో సాధించిన గొప్ప నైతిక విజయమిది !
మేము భాషాప్రవీణ నాలుగో సంవత్సరంలో ఉండగా నాని బాబు రిటైరయి పోయారు. మేమంతా చందాలు పోగు చేసుకొని నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. సత్రంలో మేం భోజనాలు చేసే పెద్ద హాలు ఒక్కటే ఉంది. అక్కడే నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం జరుపు కోవాలని తలపెట్టాం. కార్యక్రమం సాయంత్రం అయిదింటికి మొదలయింది. పావు తక్కువ ఆరు అవుతోందో , లేదో,, ‘‘ ఇహ చాలు ! భోజనాలకి లేవండి !’’ అంటూ, తటాలున కుర్చీ లోనుంచి లేచి పోయేరు పెద్ద గుమస్తా గారు. మేమంతా బిక్క చచ్చి పోయేం.
ఇంకా సభా కార్యక్రమం చాలా ఉంది.
వేయాల్సిన దండలు ఇంకా చాలా ఉన్నాయి.
మా సంస్కృత కలాశాల విద్యార్ధి కవులు రాసు కొచ్చిన కవితలు చదవడం ఇంకా పూర్తి కానే లేదు.
సంగీతం కలాశాల పిల్లలు ఆయన గురించి స్వర పరచుకొని వచ్చిన పాటలు పాడడమే కాలేదు.
పెద్దల ప్రసంగాలు సగమైనా కాలేదు.
చదవాల్సిన సన్మాన పత్రాలు చదవనే లేదు.
మా అందరకీ ఎంతో అసంతృప్తిగా ఉన్నా, ఆయన మాటలు కాదన లేని స్థితి. అసలు సమ్మానితుడే స్టేజి దిగి పోయేక, ఇంకా సన్మాన కార్యక్రమ మేమిటి !
భోజనాలు రాత్రి తొమ్మిది వరకూ. లేటు బ్యాచి వాళ్ళూ, వడ్డన బ్యాచి వాళ్ళూ తినడాలు పూర్తయి,
పని వాళ్ళు హాలంతా శుభ్రం చేసాక కార్య క్రమం మళ్ళీ మొదలెడదామని ఉబలాట పడ్డాం. ఎలాగయితేనేం వారిని మరో గంట సేపు కార్యక్రమం జరపడానికి బలవంతం మీద ఒప్పించాం. అయిష్టంగానే ఒప్పుకొన్నారు.
ఆ కాస్సేపూ ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నారు. ఆ గంటా కాగానే ‘‘ ఇక ఈ ఆటా పాటా చాల్లెండర్రా !
ఇళ్ళకు పోయి చదువుకోండి ’’ అనేసి మళ్ళీ వేదిక దిగి పోయారు మా నాని బాబు గారు.
దండలు వేస్తామంటే ఒంటెల్లా మెడలు చాచుకు కొని తయారయి పోయే వాళ్ళని చూస్తాం. ఇలాంటి నిరాడంబర మయిన మానవతా వాదులనీ, కర్తవ్య పరాయణులనీ ఎక్కడో కానీ చూడం ! కదూ !
.కడుపు చల్లని తల్లి మా విజయ నగరం. అక్కడ భోజనం చేసి చదువుకొన్న వారెవరయినా, ఆ ప్రాంతాలకు వెళ్ళి నప్పుడు ఏమాత్రం వీలున్నా మా శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహాన్ని కళ్ళారా ఒక్క సారయినా చూసు కోనిదే రారు.
రోజూ కాక పోయినా, ఎక్కడయినా పంక్తి భోజనాలు జరిగే టప్పుడు అక్కడ భోజనం చేసిన వారికి ఈ పద్యం గుర్తుకు రాక తీరదు.
ఎందు కంటే, ఎందరికో కడుపు నింపిన కమ్మని పద్యం కదా యిది !

23, మే 2012, బుధవారం

కథా రచయితలు, కవులు కొలువుతీరిన ఈ అరుదైన ఫొటోకి ఇవాళకి అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !



బరంపురంలో 1979 జనవరి20, 21, 22 తేదీలలో అఖిల భారత రచయితల సమ్మేళనం వేడుకలు అపూర్వంగా జరిగేయి.
అప్పుడు తీసిన ఫొటో ఇది.
ఈ ఫొటోలో శ్రీ.శ్రీ, కాళీపట్నం రామారావు, వుప్పల లక్ష్మణ రావు, కె.వి.కృష్ణ కుమారి, చాగంటి తులసి, చాగంటి సోమయాజులు, బలివాడ కాంతారావు,  రామ మోహనరాయ్, శీలా వీర్రాజు, బలివాడ కాంతారావు, జ్వాలాముఖి, చలసాని ప్రసాద్. స్మైల్,  చెఱబండరాజు, వాకాటి పాండురంగారావు, కప్పగంతుల మల్లికార్జునరావు, భమిడిపాటి రామ గోపాలం, మంజుశ్రీ, అవసరాల రామ కృష్ణారావు, లత, వంటి ప్రముఖులతో పాటు వర్ధమాన రచయితలు దేవరాజు రవి, తాతా విశ్వనాథ శాస్త్రి,  మానేపల్లి సత్యనారాయణ, అరుణ్ కిరణ్, సస్యశ్రీ, ప్రసాద్, మల్లేశ్వరరావు, వంటి రచయితలు ఉన్నారు. విశాఖ నుండి రా.వి.శాస్త్రి ఈ సభలకు వచ్చినట్టే గుర్తు. వారు ఈ ఫోటోలో లేరేం చెప్మా ? 
ఈ సభలు జరిగేక, దాదాపు ఇరవై రెండేళ్ళ తర్వాత భ.రా.గో
 25 -4 -2002 తేదీ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో దీనిని ప్రచురించారు. ఫొటో లోని రచయితలను తాను గుర్తించి నంత వరకూ పేర్లు ప్రకటించారు.  దాదాపు 43 మంది రచయితల పేర్లు తెలిసిన వారు తెలియజేయమని కోరారు. ఎక్కువ మంది పేర్లు చెప్పిన వారికి
వంద రూపాయల విలువగల కథా సంపుటాలను బహుమతిగా ఇస్తానని కూడా
ప్రకటించేరు.  అప్పట్లో వారి ప్రకటనకి ఎలాంటి స్పందన వచ్చిందో నాకు గుర్తు లేదు. ఎంత మంది ఎందరి పేర్లు చెప్ప గలిగారోకూడా నాకు తెలియదు.
ఈ సభలు జరిగన తీరు గురించి కళ్ళకు కట్టే విధంగా భరాగో అప్పట్లో 28-1-1979 నాడు ఒక దిన పత్రికలో చక్కగా చాలా విపులంగా రిపోర్టు చేసారు కూడా !
ఇదిలా ఉంచితే,  ఈ ఫొటో ప్రచురిస్తూ భ.రా.గో గుర్తించిన రచయితలలో  మీది వరసలోని 11 వ వ్యక్తిగా వారు నన్ను పేర్కొన్నారు.  పంతుల జోగారావు ? అని
కొంచెం సందేహంగానే అన్నారు.
 వారు అనుకొన్నది సరి కాదు. ఆ వ్యక్తిని నేను కాదు. ఎవరో నాకూ తెలియదు.
ఆ సభలలో నేనూ పాల్గొన్నాను. కానీ, ఈ ఫొటోలో లేను. ఆ రోజు ఫోటో సెషన్లో మొదట తీసిన ఫొటో ఇది.
ఆ వెంటనే మరో ఫొటో కూడా ఇంత మంది రచయితల తోనూ తీయడం జరిగింది. ఆ ఫొటోలో నేను ఉన్నాను. నాతో పాటూ ఈ ఫొటోలో లేని  నేటి నవ్య సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ, ఆంధ్రభూమి ఉపసంపాదకులుగా చేసి ఇటీవల మరణించిన జ్యోత్స్న గారూ మొదలయిన మరికొంతమంది రచయితలం ఉన్నాం. మొదటి ఫొటోలో కనిపించని మరి కొంతమంది అందులో కనబడతారు. కొంత ఆలస్యంగా వచ్చి ఫొటోలో దిగిన ఆ రచయితలతో కూడిన ఫొటో ఎవరి దగ్గర దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు భ.రా.గో గారూ లేరు. ఈ ఫొటో లోని చాలా మంది రచయితలూ లేరు. తక్కిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో ?

ఏమయినా, ఈ అరుదైన ఫొటోకి ఇప్పుడు అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !


20, మే 2012, ఆదివారం

నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా ...





ఒక వయసులో ఎంతో కొంత కవిత్వం అల్లకుండా ఉండడం సాధ్యం కాదేమో. అలా రాసిన కవిత ఇది. అప్పట్లో అందరిలాగానే నేనూ కవిత్వంలో కొంత నిప్పులు కక్కడానికి ప్రయత్నించాను. శ్రీ. శ్రీ జోక్ ప్రకారం నిప్పులు కక్కే కవిత్వం  కాదు కానీ,  నిప్పులలో కుక్క దగిన కవిత్వమే ఇది, అని త్వరలోనే తెలివిడి కలిగి, మరి కవితలు రాయడం మానేసాను.
అదన్నమాట, సంగతి.

12, మే 2012, శనివారం

ఒకటి కొంటే ఒకటి ఉచితం ... రామాయణం పుస్తకం కొంటే భారత గ్రంథం ఉచితం !


























మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..


పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.


మరో మాట ... ఎందుకేనా మంచిదని చెప్పి చదువరులను ముందే హెచ్చరించాడు.


ఒక కథ వినేటప్పుడు మఱొక కథ మీద దృష్టి నిలిపితే, మొత్తం మొదటి అర్ధం గోచరించకుండా పోతుంది. అందు చేత ఈ రాఘవ పాండవీయం చదివేటప్పుడు ఒకే అర్ధం కలిగిన మామూలు కావ్యాన్ని ఎలా చదువుతారో అలాగే చదవండి. అంటే, ముందుగా రామాయణార్థాన్ని చదువుదామనుకుంటే, మనసు లోకి మరింక భారతార్థం ఏమిటా అని ఆలోచించకండి. అలాగే భారతార్ధం వచ్చేలా చదివేటప్పుడు రామాయణార్ధ ఏమిటా అని ఆలోచించకండి. ఏకార్ధ కావ్యం ఎలా చదువుతారో అలాగే చదువు కోండి. అని వివరణ ఇచ్చాడు.






రాఘవ పాండవీయం లోని రామాయణార్థంలో నూ భారతార్ధం లోనూ అర్ధాలు వచ్చే ఒక పద్యం ఉదాహరణకు చూద్దామా !


వెలయునఖిల భువనములలోన వారణ


నగరిపురమ తల్లి నాదనర్చి


రాజ్య లక్ష్మి మిగుల బ్రబల నయోధ్యనా


రాజ వినుతి గనిన రాజధాని.






ఈ పద్యం రామాయణ పరంగా అయోధ్యా నగరాన్ని వర్ణించే పద్యం. ఇదే పద్యం భారతార్ధంలో అయితే, హస్తినాపురాన్ని వర్ణిస్తున్న పద్యం !




ఇందులో సంస్కృతాంధ్ర శబ్ద సభంగ శ్లేష కవి వాడాడు.






ముందుగా రామాయణ పరంగా అర్ధం ఎలాగంటే,


రామాయణ పరంగా పద్యంలోని పదాలు ఇలా విరిచి చదువు కోవాలి.






అఖిల భువనముల లోన్, = అన్ని లోకాలలోనూ


అవారణ, నగరిపు, రమ, తల్లి = అడ్డు లేని ఇంద్రుని యొక్క సంపదయైన అమరావతికి తల్లి అన్నట్లుగా రాజ వినుతి గనిన = గొప్ప పేరు గాంచిన


రాజధాని అయోధ్యనాన్ = అయోధ్య అనే పేరుతో ప్రబలున్ = వెలయు చున్నది.






అంటే,

ఇంద్రుని రాజధాని అమరావతి. . దానికి తల్లి లాంటి నగరం అయోధ్య అన్నమాట.!






ఇక, భారతార్థంలో అన్వయం చూదామా !






న + యోధ్య = అయోధ్య ( యుద్ధం చేసినా జయింప బడనిది )


వారణ నగరి = వారణం అంటే ఏనుగు, వారణ నగరి అంటే హస్తినా పురం !


పురమ తల్లి = పుర శ్రేష్ట్రం. ( శ్రేష్ఠమైన నగరం )


అన్వయం ఇలా చూడాలి.






అఖిల భువనములలోన + వారన నగరి + పురమ తల్లి..






అంటే, అన్ని లోకాలలోనూ, హస్తినా పురం చాలా గొప్పది అని అర్ధం అన్నమాట !


తక్కిన అర్ధమంతా సుబోధకమే కదా !


వార్నాయనో ! ఒక్క పద్యానికి రెండు రకాల ( రామాయణ, భారతార్ధాలు ) అర్ధాలు గ్రహించడానికే ఇంత పీకులాట అయింది. ఇక మొత్తం కావ్యం అంతా చదవాలంటే మాటలా ? అనుకుంటున్నారా ?


తప్పదండీ, బాబూ, కష్టే ఫలీ ! అన్నారు. కావ్య రసం గ్రోలాలంటే ఆ మాత్రం కష్టపడొద్దూ ?


పనిలో పని, పింగళి సూరన కళా పూర్ణోదయం చదవండి..ఒక మిష్టరీ నవల చదువుతున్నట్టగా ఉంటుంది. తెలుగు కవుల గొప్ప తనమేమిటో తెలుస్తుంది. ! మన కావ్య సంపదను మనం ఎంత పదిలంగా కాపాడు కోవాలో తెలుస్తుంది !






స్వస్తి.




8, మే 2012, మంగళవారం

కటకట లక్ష్మణా !



తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికలో తే 2-11-2011 దీ సంచికలో ప్రచురణ.



1, మే 2012, మంగళవారం

మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్సృహ ...


‘‘ ఎటు వేపేనా వెళ్ళు, కానీ, ఉత్తరం దిక్కు వేపు మాత్రం వెళ్ళకు ! ’’ అని ముసలి రాజు మరీ మరీ చెప్పి పంపిస్తాడా ? రాకుమారుడు అటు వేపే వెళ్తాడు.
ఇచ్చట నోటీసుల అంటించ రాదు అనే బోర్డు మీది అక్షరాలు రకరకాల వాల్ సోష్టర్ల నడుమ బిక్కు బిక్కుమంటూ కనిపిస్తూ ఉంటాయి.
ఇచ్చట మూత్రము చేయ రాదు ( మా హైదరాబాదులో అలాగే రాస్తారు మరి) అని ఉంటుందా ? అక్కడంతా ముక్కులు బద్దలయ్యేంత దుర్వాసన గుప్పు మంటూ ఉంటుంది.
నిశ్శబ్దమును పాటించుము అనే చోట నయాగరా జలపాత హోరు వినిపిస్తున్నా , లైబ్రేరియన్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసి నిస్సహాయంగా చేతులెత్తేస్తాడు.
వాహనములకు ప్రవేశము లేదు అని వ్రాసి ఉన్న హెచ్చరికను తుంగలో తొక్కి ఏ పోలీసో ఎదురయ్యే వరకూ ఆకతాయి వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి.
ప్లేట్లలో చేతులు కడగరాదు అని మా ఊళ్ళో చిన్న చిన్న హొటళ్ళలో బోర్డు రాసి పెట్టే వారు. అందు చేత జనాలు ఆ వినతిని  మన్నించి, టిఫిన్ తిన్నాక, చేతులు గ్లాసులలో ముంచి చక్కా పోయే వారు.
స్త్రీలకు మాత్రమే అని కనిపిస్తున్నా కొందరు జబర్దస్తీ రాయుళ్ళు బస్సులలో ఆ సీట్ల లోనే కూర్చోడం అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే.
మెడలు పక్కకి వాల్చి వాహనాలు నడిపే చోదకుల విన్యాసాలూ,పట్ట పగలు కూడా వెలిగే వీధి దీపాలూ, బస్సుల్లో వ్రేలాడుతూ ప్రయాణం చేసే ఫుట్ బోర్డు వీరుల సర్కస్  ఫీట్లూ  ...
ఇలా చెప్పు కుంటూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. మన సామాజిక  సామాజిక స్పృహ  అలాంటిది మరి !
ఈ మేడే నాడు సామాజిక స్పృహ  గుర్తుకు రావడం యాదృచ్ఛిక మేమీ కాదు.
దానితో పాటు మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్పృహ గురించి మీకు చెప్పాలనిపించడం కూడా సహజమైన విషయమే.
మా తింగరి బుచ్చిగాడు గుర్తున్నాడు కదూ ?  పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా తింగరి బుచ్చిగాడు ఆరేడేళ్ళ వయసు లోనే గొప్ప  సామాజిక స్పృహ సంతరించు కున్నాడు. అది విశేషమే కదా ?
ఆ ముచ్చట చెప్పాలనే ఈ టపా పెడుతున్నాను.
నేనూ , మా తింగరి బుచ్చిగాడూ ఎలిమెంటరీ బడిలో చదువుకునే రోజులవి. మా బడి పేరు జంగం బడి. మా బడి పోలీసు స్టేషను వీధికి దగ్గరలోనే ఉండేది. మా బడికి ఎదురుగా ఒక చేకు గోడౌను ఉండేది. అంటే తెలుసు కదా ? గోగు నారని అక్కడ మిషన్ల లో పెట్టి పెద్ద పెద్ద బేళ్ళగా కట్టి ఎక్కడికో ఎగుమతి చేసే వారు.
ఆరోజుల్లో అక్కడ తయారయే చేకు బేళ్ళు మాకంటికి ఆకాశమంత ఎత్తుగా కనిపించేవి. ఆ తయారీ కూడా మాకు చాలా వింతగా కనిపించేది. నార బేళ్ళు కట్టే మిషన్లు ఒకటో, రెండో ఉండేవి. వాటిలో నార వేసి మనుషులు తొక్కే వాళ్ళు.  తర్వాత పెద్ద పెద్ద చక్రాలను నలుగురైదుగురు మనుషులు బలంగా పట్టుకుని తిప్పే వారు. పెద్ద పెద్ద తాళ్ళతో ఆ మిషన్లోనే వాటిని పెద్ద బేళ్ళుగా కట్టే వారు. అలా కట్టిన బేళ్ళ నుండి ఒక్క చిన్న నార పీచు లాగి తియ్యడం కూడా మాకు చాతనయ్యేది కాదు. మా శలవు రోజులన్నీ ఆ గోడౌను లో ఉండే రావి చెట్టు కిందే గడిచి పోయేవి.
సరే, ఇదంతా అలా ఉంచితే, ఒక రోజు మా తింగరి బుచ్చి నన్ను రహస్యంగా ప్రక్కకి పిలిచి, ‘‘ నీకో రహస్యం చెబుతాను. మన చేకు గోడౌనులో దొంగతనం జరుగుతోంది. తెలుసా ! ’’ అనడిగేడు.
‘‘ దొంగతనమా !’’ అన్నాను భయంగా.
‘‘ అంటే, దొంగ వ్యాపార మన్న మాట.’’ అని వివరించేడు. కల్తీ , దొంగ వ్యాపారం, దోపిడీ లాంటి పదాలు వాళ్ళ అన్నయ్య తరుచుగా అంటూ ఉంటాడు. అవే వీడికీ వంట బట్టేయి.
‘‘ మనం ఈ విషయం పోలీసులకి చెప్పాలి. పోలీసు స్టేషన్ కి వెళదాం పద !‘‘ అన్నాడు.
నా నిక్కరు తడిసి పోయింది.
‘‘ అమ్మో ! నాకు భయం’’ అన్నాను.
‘‘ నీకు సామాజిక స్పృహ లేదు.’’ వెక్కిరించాడు వాడు. ఈ పదం కూడా వాడు వాళ్ళ విప్లవ అన్నయ్య నుండి నేర్చుకున్నదే. అసలీ విప్లవమనే పదం కూడా వాడికి అలాతెలిసిందే. ‘‘ అంటే ఏమిటి ’’ అనడిగేను. ‘‘ నాకూ సరిగా తెలియదు. తిరగ బడడంట.’’ అన్నాడు. మా అవ్వ ఆ మధ్య నీరసంతో కళ్ళుతిరిగి నేలకు తిరగ బడి పోయింది. ఇది సామాజిక స్పృహ  అవునో కాదో నాకు తెలియదు. నిజంగా. నిజం. సరస్వతి తోడు.
నాకు సామాజిక స్పృహ లేదని ఖాయమై పోయేక, వాడొక్కడూ పోలీసు స్టేషన్కి బయలు దేరాడు.


 అక్కడ జరిగిన బోగట్టా అంతా నా మనో నేత్రంతో ( అంటే ఏఁవిటో నాకు సరిగ్గా తెలియదు. మా కథా మంజరి బ్లాగరు అంకుల్ చెప్పాడు ) చూసాను కనుక మీకు చెబుతున్నాను. 

మా తింగరి బుచ్చి గాడు వీరోచితంగా పోలీసు స్టేషను వరకూ వెళ్ళి , అక్క డ చాలా సేపు తటపటాయించి, ఎలాగయితేనేం, స్టేషను లోకి ప్రవేశించాడు.
అక్కడింకా పోలీసు బాబాయిలు మేలుకో లేదు. మేలుకునే ఉన్నా,  అంటే,  ఉత్త బాబాయిల్లా గానే ఉన్నారు.
కానీ, పోలీసు బాబాయిల్లా లేరన్న మాట.
అంచేత, ఏం కావాలి బాబూ ! అనడిగేరు లాలనగా.
‘‘ కంప్లయంటు ఇవ్వడానికి వచ్చానండీ’’ అన్నాడు వీడు.
‘‘ మీ నాన్న మీదా ?’’
‘‘ కాదండీ ...’’
‘‘ మీ అమ్మ మీదా ?‘‘
‘‘ కాదండీ ..’’
‘‘ పోనీ, ఇంకెవరయినా మీ ఇంట్లో వాళ్ళ మీదా ? లేక మీ పక్కింటి అంకుల్ గారి మీదా ’’
’’ఉహూఁ !  కాదండీ ...’’
‘‘ నీ జేబులో అయిదు పైసల బిళ్ళ పోయిందా ?’’ చివరి ప్రయత్నంగా కొంచెం లాలనగానే అడిగాడు పో.బా.
‘‘ కాదండీ ..’’ అంటూ, ఎందుకయినా మంచిదని నిక్కరు జేబు ఓసారి తడిమి చూసుకున్నాడు మా తింగరి బుచ్చి గాడు.
అప్పటికి పోలీసు  బాబాయిలో నిజమైన పోలీసు బద్ధకంగా నిద్ర లేచాడు.
‘‘ మరెవరి మీదరా నా కొడకా  ?’’ విసుగ్గా అడిగేడు. అయినా, ముద్దుగానే అడిగాడు. మన వాడికి  కాళ్ళలో సన్నని వణుకు మొదలయింది.
’’ మా బడి దగ్గర గోడౌన్ వాళ్ళ మీదండీ ....వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు ...’’అన్నాడు, ఎలాగో కొంచెం ధైర్యం చిక్కబట్టుకొని.
పో.బా కి ఓ క్షణం తను  ఏం విన్నాడో అర్ధం కాలేదు.
‘‘ సరేలే ... నువ్వు మీ ఇంటికి పోయి, మీ పెద్ద వాళ్ళు ఎవరి నయినా పంపించు. వాళ్ళొచ్చి రిపోర్టు ఇస్తారు ’’ అన్నాడు.
‘‘ వాళ్ళకంత సామాజిక స్పృహ  లేదండీ !’’ అన్నాడు టక్కున మా తింగరి బుచ్చిగాడు.

ఈ సారి పోలీసు బాబాయిలందరికీ నిజంగానే మతి పోయింది ! కాసేపు మాట పడి పోయింది.

‘‘ సరేలే, పద ...ఓయ్, 110 నువ్వు వీడి వెంట వెళ్ళి ఆ సంగతేమిటో చూడు ...’’ అన్నాడొక పెద్ద పో.బా.

తింగరి బుచ్చి గాడికి ఏనుగు నెక్కి నంత సంబర మనిపించింది.

110 పో.బా తనని తన సైకిలు వెనుక కూర్చుండ పెట్టుకొని తొక్కడం వాడికి మరింత గర్వ మనిపించింది. 




సామాజిక స్పృహ ఉండడం వల్ల ఎంత గౌరవమో కదా అనుకున్నాడు.

పో.బా ని మన వాడు నేరుగా గోడౌను లోకి తీసుకు వెళ్ళి అక్కడ దొంతరలుగా ఉన్న చేకు బేళ్ళను చూపించాడు.
‘‘ ఇక్కడ ఎన్ని బేళ్ళు ఉన్నాయో చూసారు కదండీ ...’’
‘‘అయితే ? ...’’ బిక్క మొహంతో అడిగాడు పో.బా.
‘‘ రండి చెబుతాను.’’ అని పో.బా ను మా తింగరి బుచ్చి గాడు గోడౌను గేటు వెలుపలి గోడ దగ్గరకు తీసుకు వచ్చాడు. అక్కడ గోడ మీద రాసి ఉన్న అక్షరాలు చదవమన్నాడు.

పో.బా కూడ బలుక్కో కుండానే వీజీగానే చదివేసాడు :  ‘‘STICK NO BILLS  ... ’’
అప్పుడు మా తింగరి బుచ్చి గాడు విజయ గర్వంతో తల ఎగరేస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. ‘‘ చూసారా సారూ ? గోడౌన్ లోపల అంత స్టాకు ఉంచుకొని , ఇక్కడ చేకు బేళ్ళు స్టాకు లేవని బోర్డు పెట్టారు. ఇది దొంగ వ్యాపారమే కదా ? మీరు వీళ్ళని జైల్లో పెట్టాలి.’’ అన్నాడు .

పో.బా కి తల తిరిగి, మూర్ఛ వచ్చినంత పనయింది. పోలీసు ఉద్యోగం వదిలేసి ఎక్కడి కయినా పోవాలన్నంత విరక్తి  కలిగింది.

Stick no bills  అనే బోర్డుని మా తింగరి బుచ్చి గాడు తన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని ఉపయోగించి,కూడ బలుక్కొని,  
 ‘‘ స్టాక్ నో బేల్స్   ’’ అని చదువు తున్నాడని అర్ధం కావడానికి  అతనికి  కొంత సేపు పట్టింది. అతనా షాకు నుండి తేరుకునే లోపల మా తింగరి బుచ్చిగాడు ‘‘ మీకు సామాజిక స్పృహ  కానీ ఉంటే వెంటనే ఈ దొంగ వ్యాపారులను జైల్లో పెట్టాలి ! ’’ అని   ఒకటే సతాయిస్తున్నాడు.

పోలీసు బాబాయి ‘‘ సరే ... సరే ..నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, వీళ్ళందరినీ నేను జైల్లో పెడతానుగా ! ’’ అన్నాడు.

విజయ గర్వంతో విజిలు వేస్తూ మా తింగరి బుచ్చి గాడు  జారి పోతున్న నిక్కరును మీదకి లాక్కుంటూ ఇంటి ముఖం పట్టాడు.

వాడు నాలుగడుగులు వేసాడో లేదో, వెనుక నుంచి ’’ మళ్ళీ మా పోలీసే స్టేషను వేపు వచ్చావంటే ముందు నిన్ను బొక్కలో పడేసి మక్కలు విరిచేస్తాను జాగ్రత్త ! ’’ అన్న పో.బా. మాటలు వినిపించి వాడి నిక్కరు తడిసి పోయింది.   అవి పో.బా. తనని గురించి అన్న మాటలేనని వాడు వెనక్కి తిరగ నక్కర లేకుండానే పోల్చుకున్నాడు.


 అంతే ! ... ఇల్లు చేరే వరకూ పరుగో ... పరుగు !  పరుగో, పరుగు !!

ఇదండీ మా తింగరి బుచ్చిగాడి సామాజిక స్పృహ అను ఇంగ్లీషు పాండిత్యం !



ఇది నిజంగా జరిగిందంటే మీరు నమ్ముతారా ?














29, ఏప్రిల్ 2012, ఆదివారం

తగునా ఇది నీకూ ? ( పెద్దలకు మాత్రమే )


యుక్తం కిం తవ శర్వరీశ ముఖ  మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా  వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు.

భావం:
‘‘ఓ అందగాడా  నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’
‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’
‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’