19, ఏప్రిల్ 2013, శుక్రవారం

జానెడు మీసం ... బారెడు బ్లాగు టపా !





‘ మీసము పస మగ మూతికి ’ అని చెప్పారు పెద్దలు, మగాడికి మీసమే అందం, అది పౌరుష చిహ్నం కూడానూ. . మీసాలూ, గడ్డాలూ ఒక వర్గానికి చెందినవే. కాస్త రూప భేదం కానీ, వేరు కాదు, అయితే గడ్డాలు శాంతికీ, వైరాగ్యానికీ, సాత్విక గుణానికీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మీసాలు లేని రాజులనూ, వాటితో పాటూ గడ్డాలూ లేని ఋషులనూ ఊహించు కోలేం ! గడ్డం సాత్విక గుణ ప్రతీక అయితే, మీసం తామస గుణ ప్రతీకగానూ చెప్పు కోవచ్చును, హీరోలకి అందమైన మీస కట్టు ఉంటే, విలన్లకి కోర మీసాలు ఉండడం మనకి తెలిసినదే.
మీసాలలో చాలా రకాలు ఉన్నాయి.



 వెనుకటి రోజులలో ఫ్రెంచ్ కట్ మీసం అంటే గొప్ప క్రేజ్ ఉండేది. ఉత్తరాది సినిమా హీరోలకి మీసాలుండవు. ఎంచేతో ? ఇక మీసాలలో కోర మీసం, గుబురు మీసం, గండు మీసం, కత్తి మీసం, ... లాంటివి . చైనా వాడి మీసం కిందకి వేలాడుతూ భలే ఉంటుంది !

మీసాలు మెలేయడం మగ మహారాజల లక్షణం. దానితో పాటూ తొడ చరచడం కూడానూ. ఒక్కో సారి మీసం మెలేసి, జబ్బలు చరచు కోవడం కూడా ఉంటుంది. మీసాలు మెలేయడాన్నీ, తొడలు చరచు కోవడాన్నీ ఒక కళగా అభివృద్ధి పరచిన వాళ్ళూ ఉన్నారు. ఇంకా వివరాలు కావాలంటే బాలయ్య బాబుని సంప్రదించండి.

మన తరం రాజకీయ నాయకుల్లో గుబురు మీసాలున్న రాజకీయ వేత్త ఎవరూ అనడిగితే తడుము కోకుండా అంతా ఒకే పేరు చెబుతారు.బుర్ర మీసముల వాడు, చిరు నవ్వుల రేడు మన కనుమూరి బాపిరాజు గారు. !
ఇక ఈ మీసాల ప్రస్తావన వచ్చిన సందర్భాలను గురించి చూదాం !ముచ్చట పడి హిమాలయాలకు వెళ్ళిన ప్రవరుడు దారి తప్పాడు. వరూధుని చూసి మరలు కొంది. తన పొందు స్వీకరించ మని పరి సరి విథాల అడిగింది.

కొత్త కొత్త ధర్మపన్నాలు వల్లించింది. అల్లసాని పెద్దన మను చరిత్రలో – కానీ,
ప్రవరుడు కాదు పొమ్మన్నాడు. ఇలాంటి పాండిత్యం నీకు తప్ప మరెవ్వరికీ ఎక్కడా చూడ లేదని వెక్కిరించేడు.కామ శాస్త్ర ఉపాధ్యాయురాలి లాగా చెబుతున్నావు. ఫో! అని కసిరాడు. ఇలాంటి తుచ్ఛ మైన సుఖాల గురించి నాకు చెప్పకు ! ఇవన్నీ మీసాల మీద తేనియలు అంటూ చీదరించు కున్నాడు. ‘‘ చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాల పై తేనియల్ !’’
ఇక శ్రీనాథ కవి నూనూగు మీసాల నూత్న యవ్వనము వేళ శాలివాహన సప్త శతి రాసానని కంఠోక్తిగా చెప్పు కున్నాడు కదా !

అయితే అడిగిన దానం ఇవ్వాలి. లేదా ఎవరి చేత నయినా ఇప్పించాలి. అలా కాని వాడికి మీసం ఎందుకూ ! అని తిట్టి పోసేడు కుంద వరపు కవి చౌడప్ప. చూడండి:

ఇయ్యా యిప్పించ గల
అయ్యలకే కాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా బారెడు !
కయ్యానకు కుంద వరపు కవి చౌడప్పా !

తిరుపతి వేంకట కవులలో తిరుపతి శాస్త్రి గారికి మీసం ఉండేది కాదు కానీ, చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి గారు మాత్రం గుబురు మీసాలు పెంచే వారు ! ఆ మీసాల విషయమై పండితులకిది తగునా అని రచ్చ రచ్చ అయిందిట ఓసారి. అప్పుడు తిరుపతి కవులు ఈ పద్యం చెప్పారు. :


దోస మటంచెఱింగియును దుందుడు కొప్పఁగ బెంచి నార మీ
మీసము – ‘‘రెండు భాషలకు మేమె కవీంద్రుల మంచుఁ దెల్పఁగా
దోసము గల్గినన్ గవి వరేణ్యులు మముం గెల్వుఁడు, గెల్తురేని యీ
మీసముఁదీసి మీ పద సమీపములన్ దలలుంచి మ్రొక్కమే !
అదీ. థిషణ అంటే !

రాయని భాస్కరుడి మీద చెప్పిన పద్యాలలో ఈ మీసం గురించి ఒక చోట ...తిట్ల వర్షం కురిపించేడు కవి ! చూడండి:


వగ కల్గి యర్ధి కీయని
మొగ ముండల కేల మొలిచె మూతిని మీసల్
తెగ గొఱుగుడాయె మంగల
రగడొందఁగ కీర్తి కాంత రాయని బాచా !

ఇక, నాటకాల వాళ్ళకి గడ్డాలూ మీసాలూ ఉంటే ఒక్కో సారి కొన్ని చిక్కులు తటస్థ పడుతూ ఉంటాయండీ.

పాత్ర పరంగా వాటిని తీసేయక తీరదు. వెనుకటి రోజులలో స్త్రీ పాత్రలు ధరించే నటు లయితే మాత్రం తప్పకుండా ఆ మీసాలని తీసెయ్యాల్సి వచ్చేది.
మన నటసార్వ భౌమ నందమూరి తారక రామారావు గారు విజయ వాడలో కాలేజీలో చదివే రాజులలో బాల నాగమ్మ నాటకంలో నాగమ్మగా మీసాలు తీయకుండానే నటించేరుట ! దర్శకులు విశ్వనాథ సత్య నారాయణ. మీసాలు తియ్యాలయ్యా అంటే ఠాఠ్ ! శ్రమపడి అందంగా పెంచు కున్న మీసాలు తీసేది లేదని రామారావు పొమ్మన్నారుట. దాంతో మీసాలతోనే నాగమ్మగా నటించారు, అప్పటి నుండీ ‘‘ మీసాల నాగమ్మ ’’ అనే మాట చరిత్రలో నిలిచి పోయింది.

గుబురు మీసాల వల్ల మనం అవతలి వారిని చూసి నవ్వు తున్నామో, వెక్కిరిస్తున్నామో తెలియదు. ఇదో అదనపు ప్రయోజనం !

ఇక మీసాల వల్ల లబ్ధి పొందే వ్యక్తుల భేషజాలు ఎలా ఉంటాయంటే ...
ఇంట్లో పచ్చడి మెతుకులు కతికి, పంచభక్ష్య పరమాన్నాలూ తిన్నట్టుగా, చివరాఖరిలో మీసానికి కొంచెం పెరుగు పిసరు పూసుకుని మీసం దులుపు కుంటూ వీథి లోకి వస్తారు ! వాళ్ళకి అదో తుత్తి !

ఇక, మీకు గుర్తుందా ? వెనుకటి రోజుల్లో తెలుగు సినిమాలలో హీరోలు మీసం, చిరు గడ్డం పెట్టు కుంటే ఇట్టే పోల్చు కోలేని విధంగా మారి పోయే వారు ! ప్రేక్షకులు తప్ప తోటి పాత్రధారు లెవ్వరూ గుర్తు పట్ట లేక పోయే వారు తెలుసా ! ఏమాశ్చర్యము !

పత్రికల్లో ఆడ బొమ్మలకి మీసాలు దిద్దే సరదా ప్రియులూ ఉంటారు. ఈ మనస్త్తత్వానికి మానసిక వైద్య శా స్త్రంలో

నోరు తిరగని పేద్ధ పేరేదో ఉండే ఉంటుంది !

మీసాల పేరుతో ఒక ఊరు కూడా ఉందండోయ్ ! విజయ నగరం జిల్లా గుర్ల మండలంలో మీసాల పేట అనే ఊరు ఉంది !

మన దేవుళ్ళలో ఒక్క యముడికి తప్ప, తక్కిన వారెవ్వరికీ మీసాలు ఉండవు
‘‘శ్రీకృష్ణుడికి మీసా లుండెడివా ?! ’’ అని ఆరుద్రాదులు ఒకప్పుడు రచ్చ బండ నిర్వహించారు !

లేకేం !

మీసాల కృష్ణుడు మన రాష్ట్రం లోనే ఉన్నాడండీ బాబూ !
మెదక్ జిల్లా దుబ్బాక మండలం లో చెల్లా పూర్ రాజ వేణు గోపాలుడు మీసాల కృష్ణుడే !
ఈ మీసాల కృష్ణుడి గురించి ఒక కథ కూడా చెబుతారు.

దొరల కాలంలో దుబ్బాక ప్రాంతాన్ని ఒక దొర తెగ పీడించే వాడుట. ఇలా కాదని గ్రామస్థులు ఊరిలో ఒక దేవాలయం కట్టేరుట. దొర గారికి దైవ భక్తి జాస్తి. కనీసం ఆ దేవుడిని చూసయినా దొర కొంత తగ్గుతాడని ఊరి వారి ఆలోచనట ! గుడి కట్టడానికి దొర కూడా యథోచితంగా తన వంతు విరాళం కూడా ఇచ్చేడుట !

సరే ... గుడి కట్టడం పూర్తయింది. ఇక విగ్రహ ప్రతిష్ఠే తరవాయి. ఎక్కడా దేవుడి విగ్రహాలు దొరక లేదుట. దాంతో ఆఊరి ప్రజలు ప్రక్క ఊరి లో ఉన్న గుడి నుండి వేణు గాపాలుని విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా ఎత్తుకొచ్చి, తమ ఊరి చెఱువులో కొంత కాలం దాచి ఉంచారుట. అందుకే అక్కడ ఇప్పటికీ కృష్ణమ్మ చెఱువు అనే పేరుతో ఓ చెఱువు ఉంది.
సరే కొన్నాళ్ళు గడిచేక తాము ఎత్తుకు వచ్చిన వేణు గోపాలుని విగ్రహానికి మీసాలు పెట్టి, నెమలి పింఛంతో పాటు కిరీటం ఉంచి, విగ్రహ ప్రతిష్ఘ కావించేరుట.
దాంతో విగ్రహం సొంత ఊరి దార్లు ‘‘ ఈ మీసాల కృష్ణుడు మన ఊరి వాడు కాదు ! ’’ అనుకొని వెళ్ళి పోయేరుట !

ఇక, మీసాల గురించిన సామెతలూ, జాతీయాలూ కొన్ని చూదాం :
1.మీసం మూరెడు ... రోషం బారెడు
2.మీసాలకు సంపెంగ నూనె
3.మీసం పస మగ మూతికి
4.మీసాల పసే గాని, కోస నా బట్ట !
5.మీసాలు పడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటాయా ?
6 మీసాలెందుకు రాలేదురా ! అంటే, మేనత్త చీలిక అనీ. గడ్డం వచ్చిందేమిరా అంటే మేన మామ పోలిక అన్నాట్ట
7. పులి మీసాలు పట్టుకొని స్వారీ చేయడం మంచిది కాదు

8.తీస్తే పోతుంది . తెల్లారితే వస్తుంది ! ఏమిటది ! పొడుపు కథ : జవాబు : మీసం !

మీసాల మీద శ్రీశ్రీ ఓ సినిమా కోసం రాసిన పద్యం చూడండి: ఇది మీసం మీద సీసం !

మృగరాజు జూలునే తెగనాడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమ కారు మబ్బుల బారు సేరునేలెడి తీరు
కోర మీసము పొందు కోరుకొందు
ల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు

తే. ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష

తిక్కన గారి మహా భారతంలో ధర్మరాజుని వర్ణిస్తూ ద్రౌపది చెప్పిన ఎవ్వని వాకిట అనే పద్యానికి పేరడీగా తెలుగు లెస్స అనే బ్లాగులో ఈ సరదా పద్యం కూడా మరో సారి చక్కగా చదువు కోండి !

సీ” ఎవ్వాని మీసము ఏపుగా పెరుగునో
ఊడలా మూతికి సొగసు కూర్ప
ఎవ్వాని మీసము ఎదుగునో రొయ్యలా
బారుగా పౌరుషం పరిఢ విల్ల
ఎవ్వాని మీసము మేఘ సంకాశమై
కన్పట్టు చూపరల్ భయము నంద
ఎవ్వాని మీసము నిమ్మలకాధార
మైభువి ని మిగుల అలరు చుండు

తే.గీ అట్టి సొగసైన గుబురైన నల్లనైన
మామ మీసాలు అవనికి వాసములుగ
అలరు చుండ జనులు భయమంద నేల
మామ మీసాలు మీకుండ అండ దండ
సరే, చివరిగా ... పులి, పిల్లి వంటి జంతువులకి మాత్రమే కాదు, కొన్ని పక్షులకు కూడా మీసాలుంటాయి ! చిలీ లో ఇలాంటి మీసాల పక్షులు కనిపిస్తూ ఉంటాయిట ! ( వీటి ఫొటోలు అందించిన బ్లాగరుకి ( ? క్షమించాలి. పేరు గుర్తు లేదు) ధన్యవాదాలు.










ఇప్పటికి ఈ మీసాల పురాణానికి స్వస్తి.



















































































































































































































































































































































































































































































































































































































10, ఏప్రిల్ 2013, బుధవారం

సూది పురాణమ్ ....





సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది.
అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ దొరికి కుడదామని కూచుంటే, సూదిలోకి దారం కళ్ళ జోడు లేనిదే ఎక్కించ లేం !. అదెక్కడ పెట్టామో గుర్తుకు రాదు. దాంతో విసుగొచ్చి సూదీ దారాలని పక్కన పడేస్తాం. తర్వాత కళ్ళ జోడు జాడ కనిపించి, కొంచెం తీరిక దొరికింది కదా అని ఏరాత్రి పూటో కుట్టడానికి కూచుంటామా ! కరెంట్ ఠక్ న పోతుంది. జీవితంలో ఐరనీ ఇదే. మన దినాలు బావుండక పోతే అన్నీ ఇలాగే జరుగుతాయి ! ... సరే, ఈ సోది కాస్సేపు ఆపి, సూది కథలోకి వద్దాం.

సూచి అనే దానికి రూపాంతరమే సూది. దీనికి మరి కొన్ని పర్యాయ పదాలూ ఉన్నాయండోయ్. సేవని,సూచకము, సూచి, సూచిక,సూచిని, సేవతి ... ఈ పదాలన్నింటికీ సూది అనే అర్ధం ! ఇంత ఆయాసం మనం పడ లేం కానీ మనం సూది అనే పిలుచుకుందాం.సూదుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు సూది. బొంత సూది, కుట్టు సూది, మందు సూది ...వీటిలో గుండు సూదులది రాచహోదా లెండి. ఇవి ఆఫీసుల్లోనూ అక్కడా చక్కా అందమైన ముఖమల్ ఆసనం అలంకరించిన చోట ఉంటాయి. వాటి దర్జాయే వేరు ! బట్టలూ, పుస్తకాలూ, బొంతలూ కుట్టే సూదులు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి కాక మిషను సూదులు వేరు. ఆస్పత్రులలో రోగుల జబ్బలకు పొడిచే మందు సూదులను లోగడ మరుగుతున్న నీళ్ళలో శుభ్రం చేసే వారు. స్టెరిలైజేషనంటారు దానిని. ఇప్పుడా బాధ లేదు. హాయిగా వాడి పారేసే మందు సూదులొచ్చేయి. సుఖమే కాక, ఇవి ఆరోగ్యరీత్యా మంచివి కూడానూ

 ఇక సూదుల పెద్దన్న దబ్బనం. వీటితో గోనె సంచులూ గట్రా కుడతారు.
అసలీ సూదులు మన దేశం లోకి విదేశాల నుండి ముందటి రోజుల్లో దిగుమతి అయ్యేవిట ! తర్వాత తర్వాత మనఁవూ సూదులను తయారు చేయడం మొదలెట్టాం.

గాంధీజీకి రోజూ బోలెడు ఉత్తరాలు వచ్చేవిట. ఓ రోజు గుండు సూది గుది గుచ్చి ఎక్కువ కాగితాల బొత్తి వచ్చిందిట. జాతి పిత ఆ ఉత్తరాన్ని పూర్తిగా ఓపికగా సాంతం చదివేక దానికున్న ఆ గుండు సూదిని తీసి జాగ్రత్త చేసి, ఉత్తరాన్ని చెత్త బుట్టలో వేసారుట ! ప్రక్క నున్న వారెవరో ఆశ్చర్య పడి ఇదేమిటని అడిగితే, ఈ ఉత్తరంలో మనకి పని కొచ్చేది ఈ గుండు సూది ఒక్కటే ! అని బదులిచ్చారుట !
మన మహా భారతంలో వచ్చిన సూది ప్రస్తావన అందరికీ తెలిసినదే కదా ! రారాజు పాండవులకి ఐదూళ్ళు కాదు కదా సూది మొన మోపినంత భూభాగం కూడా ఇవ్వనని చెప్పడం వల్లనే కదా భారత యుద్ధం వచ్చింది !
కుట్టు కోడానికే కాదు, సూది హింస కూడా ఒకటుంది. విలన్లూ, కొందరు రక్షక భటులూ నేరస్థుల గోళ్ళలో సూదులు కుక్కి నిజమో అబద్ధమో రాబట్టే, హింసాత్మక చర్యలకూ సూదులే ఉపయోగ పడడం సూదుల జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలి పోతుంది.

సూదిలోకి దారం అవలీలగా ఎక్కించ గలుగు తున్నామంటే మన కంటి చూపు భేషుగ్గా ఉన్నట్టే ! గుండు సూది నుండి ఇక్కడ సమస్తం దొరుకుతాయండీ అని ఏ షాపు గురించయినా చెప్పుకుంటూ ఉంటే ఆ షాపు ఇవాళ్టి మన మాల్ లాంటి దన్నమాట !

గతాన్నీ వర్తమానాన్నీ సమన్వయ పరుస్తూ కుట్టే సూది లేక పోయిందే ! అని కవి నారాయణ రెడ్డి గారు ఓ కవితలో ఖేద పడ్డారు.
పరమానందయ్య గారి శిష్యుల సూది కథ తెలిసినదే కదా. గురువు గారు ఓ సారి ఓ సూది తెండ్రా అని చెప్పారుట. పొలోమని శిష్యులందరూ బయల్దేరారు. వారికి ఓ చిన్న సూదిని అంతమందీ కలిసి తేవడం ఎలాగో తెలిసింది కాదు. సూది తెమ్మని గురువు గారు అందరికీ కలిసి చెప్పారాయె ! అందు వల్ల బాగా ఆలోచించి, ఆ సూదిని ఓ తాటిమానుకి గుచ్చి మోసుకొచ్చేరుట. తీరా , గురువుల దగ్గరకి వెళ్ళే సరికి తాటి దూలం ఒక్కటే మిగిలింది ! సూది దారిలో ఎక్కడో జారి పడి పోయింది !

సూదికి సంబంధించిన సామెతలు కూడా కొన్ని కనిపిస్తాయి. చూడండి ...

1. సూదికి రెండు మొనలు ఉంటాయా!

2. సూది కుతికె, దెయ్యపాకలి. ( పీక సన్నం, ఆకలెక్కువ లాంటిదన్నమాట)

3. సూది కోసం దూలం మోసినట్టు

4. సూది కోసం వెళితే, పాత రంకులు బయట పడ్డాయిట !

5. సూది గొంతు, బాన కడుపు

6. సూది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా ?

7. సూది బెజ్జం చూసి జల్లెడ వెక్కిరించి నట్టు !

8. సూదిలా వచ్చి, గడ్డ పారలా మారినట్టు
9. సూదిని మూట కట్టి నట్టు

10.సూది బెజ్జంలో ఒంటె దూర వచ్చును కానీ, భాగ్య వంతుడు స్వర్గం చేర లేడు ( ఇది బైబిల్ సూక్తి)
11. గడ్డి మేటులో సూదిని వెదికినట్టు ! ( వృథా ప్రయాస అన్నమాట ! )

సూదిలొ దారం ... సందులొ బేరం లాంటి సినిమా పాటలు ఉన్నాయి కానీ, వాటిలో అశ్లీలత ఏమన్నా ఉందా అని బుర్ర గోక్కోవడం దండుగ. ఉండక పోతేనే ఆశ్చర్యం కానీ, ఉంటే అబ్బుర మేముంది ?

అన్యోన్యంగా ఉండే భార్యా భర్తలను చిలకా గోరింకాలా ఉన్నారంటారే కానీ సూదీ దారంలా కలిసి పోయారని అనక పోవడానికి కారణం ఏమిటో ; సూది కుట్టేదీ, దారం చుట్టుకు పోయేదీ కనుకనా ? చూడాలి.

ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న వూళ్ళలో సూదులోళ్ళు అని చిల్లర వ్యాపారస్తులు కొందరు రోడ్లమ్మట తిరుగుతూ కనిపిస్తారు. చేతిలో ఓ నిడుపాటి గెడ కర్రకు మీద ఆ చివర అట్ట ముక్కలకు తగిలించి సూదులూ, పిన్నీసులూ, బూరలూ, మొలతాళ్ళూ లాంటివి తెచ్చి అమ్ముతూ ఉంటారు.

ఇక, చివరగా చిన్నప్పుడు మా పెద్దాళ్ళు తరుచుగా చెప్పి కడుపారా నవ్వించిన సూది కథ ఒకటి చెబుతాను ...
అనగనగనగా ... ఒక ఊళ్ళో ఒక అవ్వ నూతి గట్టు మీద కూచుని ( నూతి గట్టు మీద కూచోడ మేఁవిటనకండి. అదంతే కథకి కాళ్ళూ చేతులూ లేవు)
చిరిగిన బొంత కుడుతోందిట. ఇంతలో చెయ్యి జారి సూది నూతిలో బుడుంగున పడి పోయిందిట. కుయ్యో, మొర్రో అంటూ , సూదీ సూదీ బేతాళా ! అంది అవ్వ. దారం నూతిలో పడి పోయింది. దారం దారం బేతాళా ! అంది . బొంత పడి పోయింది. బొంతా బొంతా బేతాళా ! అంది ఈ సారి ఏకంగా అవ్వే నూతిలోకి పడి పోయింది ! ....
ఈ కథ ఇంత వరకూ ఇలా సాగుతూ ఉంటుంది. పిల్లలు ఊఁ ... కొడుతూనే ఉంటారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ప్రశ్నలే ప్రశ్నలు !

ఊఁ.. అంటే అవ్వ నూతిలోంచి బయటి కొస్తుందా ?

ఉహూఁ !

ఉహూఁ అంటే వస్తుందా ?

(తల అడ్డంగా తిప్పే వాళ్ళం )

తల తిప్పితే వస్తుందా ?

(పగలబడి నవ్వుతాం)

వెంటనే మరో ప్రశ్న ! నవ్వితే వస్తుందా

మాట్లాడకుండా ఉంటే వస్తుందా ? కథ బాగుందంటే వస్తుందా ? వస్తుందంటే వస్తుందా ? రాదంటే వస్తుందా ! ...
ఇది అనంతం


( కృతఙ్ఞతలు : శ్రీ లతిక )






























8, ఏప్రిల్ 2013, సోమవారం

ఓ పాలేటయినాదంటే ... (బదవద్గీత పెవచనమ్ )




పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతావూ ? మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !

అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...
ఓ పాలేటయినాదంటే ...
మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు ఏసంకాలం,అలపొద్దులేళ నానూ, నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట అందిల కూకున్నాఁవా ? మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ్మూరితీ ( ఈన కతలు రాస్తాడు నెండి ) మా రవణ మూరితీ ( ఈడు అరికతలు మా బాగా సెపుతాడు ) మరింకా మా రామ జోగారావూ, మా సోమయాజులూ అన్నమాట . ఈ సివరాకరిద్దరూ ఉప్పుడు బూమ్మీద నేరు. పోనారండి. అత్తల్సు కుంతె కడుపు దేవి పోతాదండి. ఏటి సేత్తాం. అదలా గుంచండి ...
మాం కూకున్న కాడికి దగ్గర్నోనే మరో పది మంది దాకా కూకున్నరు. ఆల్లంతా పల్లెటూరి బైతులు నాగున్నరనుకున్నం. ఆల్ల ముందు నున్నగ నించుని రివట నాగున్న వోడు వొకడు సింకి నెక్చరు ఇచ్చెత్తన్నాడు. ఆడు సెప్పేదంతా సుట్టూ సేరినోల్లు సెవులప్ప గించి ఇంతన్నారు.
ఆడేటి సెపుతున్నాడూ ?బదగద్గీత ! ఆడి మాటలు యిని మాం నవ్వాపు కోనేక పోయేం ! పిక్కిరోల్లం కదా,పొగ రెక్కువుంతాది. ఆల్లని పల్లెటూరి బైతుల నాగా సూసి అయ్యేల ఇరగబడి ఇరగబడి నవ్వీసినాం. మరాల్లకి కోపం రాదా ? మమ్మల్ని కొట్టనాని కొచ్చేరు. కక్కా ముక్కా తినీవోల్లు. ఆల్లతోటి మాఁవేటి సాగ్గలం.? గుంటలం. ఓరినాయనో బేగి పరిగెత్తరా నాయన ! అంటూ అక్కడి నుండి పారి పోయినం. ఎలగయితేనేం గండం గడిసింది పిండం బయట పడింన్నట్టుగ మాకు ఆయేల దరువులు తప్పినయ్యి ! ఇయ్యాల పెందిల నెగిసీ నెగడంతోటే ఇదంతా ఎందుకో గుర్తుకొచ్చినాది. , ఆ సోదంతా బరికీసి నా బ్లాగు టపాలో పడీసినాను. ఏటంతే అనండి ఇందల నీతేటో కడాకు సదవండి మీకే తెలుస్తాది ...

ఇంతకీ బుద్దిగా తలలూపుతూ యింటున్న ఆల్లందరికీ ఆడేటి సెపుతున్నాడూ ? బదవద్గీత సెపుతున్నాడని సెప్ప నేదా ?
అదెలాగుంటే ....
‘‘కురుచ్చేత్ర యుద్దం మొదలయి పోనాది. యుద్దానికి ముందు దాపలో గుర్రఁవూ ఎలపలో గుర్రఁవూ కట్టి కిసన మూరితి బండి మీద అరుజునుడిని ఎక్కించుకుని అక్కడికి ఎల్లినాడు. అరుజునుడు ఎగస్పార్టీ వోల్లని సూసాడు. ఇంకేటుంది ?ఉచ్చ కార్చీసు కున్నాడు ! ‘అక్కడంతా ఆడికి ఎవులు కనిపించినారు ?తాతియ్యలు,బాయ్యలు,దద్దలు,మాయ్యిలు,... అంతా ఆల్లే ! ఓర్నాయనో ! నా సేతుల్తో మనోల్లని సంపనే నంటూ బానం వొగ్గీసి బండి దిగి పోనాడు.

మరప్పుడు కిసన బగవాను మూరితి ఏటన్నాడో ఎరికా ?

‘ ఓరి పల్లకోరా ! పెద్ద పోటు గాడి నాగ ఈల్లందరినీ నువ్వే సంపీస్తావను కుంతున్నావేటి ?!
పుట్టించినోడినీ నానే ! సంపీ వోడినీ నేనే . సేసే వోడినీ,సేయించే వోడినీ నానే. నానంతే ఎవులను కుంతున్నావు ? బగమంతుడిని. విందిరా గాందీనీ విజీనారం రాజు గోరినీ నానే కదా పుట్టించి నోడిని. ఈడినీ ఆడినీ,మన పోలుపిల్లి గవిరయ్య కూతురు లచ్చుమునీ,మనూరు బుగత బాబునీ,ఆడి కొడుకునీ,అందరినీ నానే కదా పుట్టించి నాను. నాను నోకంలో ఎప్పుడయితే దరమం నాసినఁవై పోతదో అప్పుడు పుడతానన్నమాట ! .......’’ ఇలా సాగి పోనాది ఆడి పెసంగం.
మద్దె మద్దెలో ఆడాడిన బూతు మాటలు తీస్సి సెబుతున్నాను కానీ,సత్తె పెమాణికంగా అయ్యేల ఆడి పెసంగం అచ్చు ఇలాగ్గానే ఉంది.
ఆడి మాటలకు బైతు గాడి మాటలనీ. తాగు ముచ్చోడి కబుర్లనీ మాం పడి పడి నవ్వీసి తన్నులు తినబోయి,తప్పించు కున్నం కానీ, ఇందల ఒక్క అచ్చరం అపద్దం నేదు. మరాడి మాటలు సుట్టూ సేరి నోల్లు ఎలాగ్గ యిన్నారూ ?మన చాగంటి పంతులు గోరు టీ.పీలో సెబుతే మనం ఇంతంన్నాం కామా ! అంత బక్తితో ఇన్నారు. స్రెద్దగా యిన్నారు.
ఇప్పుడు మీరు సెప్పండి. నవ్విన మాం గొప్పోల్లఁవా ?ఆల్ల జీవ బాసలో,ఏ జంకూ గొంకూ నేకండా సాజంగా, అమాయకంగా బూతులు కలిపేస్తూ మాటాడిన ఆడు గొప్పోడా ?ఆడు సెప్పిందంతా గొప్పోడి పెవచనం నాగా స్రెద్దగా,బయ బత్తుల తోటి యింటూ కూకున్న ఆలు గొప్పోల్లా ?ఏటంతారు ?ఆల్లే గొప్పోల్లంతాను.ఆడే గొప్పోడంతాను.

ఆల్లని పల్లెటూరి బైతుల్నాగా సూసి ఎకసెక్కెం ఆడిన మా గుంటకాయల్దే తప్పంతాను. మీరేటంతారు ?


---------------------------------------------------------------------------------------


ఇదంతా కథా మంజరి బ్లాగు టపాగా రాయదలచి నప్పుడు కొంచెం ఆలోచించాను.
వాళ్ళ జీవద్భాషలోనే,ఆ మాండలికం లోనే రాయడం సబవనిపించింది. ప్రయత్నించి చూసేను. అంతే !






31, మార్చి 2013, ఆదివారం

తమాషాగా లేదూ ? ! ...




అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !

వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ

కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.

బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
























































ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...

3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.

ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !

ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.

గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )

విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !

చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !

పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!







26, మార్చి 2013, మంగళవారం

పక్షుల, జంతువుల భాష చాలా వీజీ !!




ఆ మధ్య నేను హిమాలమాలకు వెళ్ళి నప్పుడు (హరిద్వార్ , ఋషీకేశ్ వరకూ మాత్రమే అనుకోండి. ) అక్కడ నాకు ఎదురయిన ఒక మహా ముని వద్ద ( ఆ ముని నన్ను టీ నీళ్ళ కోసం డబ్బులు అడిగిన విషయం ఇక్కడ అప్రస్తుతం అనుకోండి ) పక్షులూ జంతువుల భాష నేర్చు  కున్నాను. ఆ విద్యతోనే యాగంటి కాకుల కథ అనే టపా రాసాను. కావాలంటే దానిని ఇక్కడ చూడండి.

పక్షులూ. జంతువులతో మాట్లాడ గలిగే నా భాషా పటిమను ఉదాహరణ ప్రాయంగా కొంచెం వివరిస్తాను. చూడండి :
నేను : మేకా ! మేకా ! ఏప్రియల్ తరువాత వచ్చే నెల ఏదమ్మా
చెప్పవూ ?
మేక : మే

నేను : ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు మేలు చేసేవే నంటావా ?
కాకి : కావు .. కావు

నేను : పిచ్చుకా ! పిచ్చుకా ! గల గల , వలవల, గడగడ లాంటి జంట పదం మరోటి చెప్పు చూద్దాం !
పిచ్చుక : కిచ కిచ

నేను : ఓ శునక రాజమా ! భ అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుంది తెలుసా ?కుక్క :  (ఓస్ !  ఆ పాటి తెలియదనుకున్నావా ?  ... ఇది స్వగతం కానోపు )     భౌ !

నేను : ఓ సన్నగమా ! నీకు తెలిసిన ఓ మాజీ అమెరికా ప్రెసిడెంటు పేరు చెప్పు ?
పాము : బుస్ !

( బుష్ అనే దానికి ఇది వికృతి కావచ్చు ... )

నేను : ఓ పులి రాజా ! ప్రపంచ తెలుగు మహా సభలు ఎట్లు జరిగినవి ?

పులి :  గాండ్రు

( పులి రాజు ఇటీవలే స్పోకెన్ ఇంగ్లీషు తరగతులకు వెళ్తూ ఉండడం చేత కొంచెం  తడబడినట్టుంది. ఎక్కడ కరారావుడు పెట్టాలో తెలియ లేదు పాపం.)

నేను : ధేనువా ! పార్వతికి గల పర్యాయ పదం ఒకటి చెప్ప గలవా ?
ఆవు : అంబ !

నేను : కరిరాజా ! నెయ్యిని హిందీలో  ఏమందురు ?

ఏనుగు : ఘీఁ

నేను : నెమలీ ! నెమలీ ! ఇలాంటి టపాలు రాస్తున్నాడు, ఈ కథా మంజరి గాడికి ఏమయింది ?
నెమలి : క్రాక్ !
.చివరగా ఓ విషయం. నరుడు ద్విపాద జంతువు కనుక అతనితో మాట్లాడితే అందరికీ జంతు భాష వచ్చి
 నట్టే కదా !!
















































































































24, మార్చి 2013, ఆదివారం

ఈ ఇష్గాలంటే నా కెంతో ఇష్టం !!





నాకు మా విజయ నగరం అంటే చాలా ఇష్టం.తెలుగు కథకు పురిటి గడ్డ కనుకయిష్టం. గురజాడ తిరిగిన తావు కనుక ఇష్టం. కన్యా శుల్కం లాంటి గొప్ప నాటకం వెలిసిన ఊరు కనుక యిష్టం. ఆ నాటకం తొలి ప్రదర్శన జరిగిన ఊరు కనుక ఇష్టం. తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో నేల కనుక యిష్టం.
   నాకింకా చాలా ఇష్టాలు ఉన్నాయి. తడియారని అచ్చు వేసిన కొత్త పుస్తక మయితే ఇష్టం. అది కథల పుస్తక మయితే మరీ మరీ  ఇష్టం.  
మా ఊరి  కోట,  పెద్ద చెరువు, గంట స్తంభంమూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు,అయ్య కోనేరు, బొంకుల దిబ్బ, మహా రాజావారి కళాశాల, మా చదువుల తల్లి
 మా సంప్కృత కళాశాల,  అమ్మ లాగ అన్నం పెట్టి ఆదరించిన సింహాచల దేవస్థానం వారి అన్నదానసత్రవూ, సంగీత కళాశాల,అమ్మ వారి  కోవిల, గుమ్చీ,  రాజారావు మేడ, డంకే షావలీ మసీదు, వ్యాస నారాయణ మెట్ట,. ఇంకా దోమల మందిరం .... నిజమే  మా విజీనారం దోమలంటే కూడా నాకు చాలా ఇష్టం. మా పతంజలి చెప్పినట్టు, అవి రాత్రి వేళ కుడుతూ, కథలూ కాకరకాయలూ రాసుకోమనీ, చదువుకోమనీ సదా హెచ్చరిస్తూ ఏండేవి కదా.
నిజమే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. మా దాట్ల నారాయణ మూర్తి రాజు, పతంజలి, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, గార్లతో ఎంతో ఇష్టంగా రాత్రీ పగలూ తిరిగిన ఊరు కనుక చాలా ఇష్టం. మరింకా మా గురు దేవులు మానా ప్రగ్గడ శేషసాయి గారు మా భాగ్యవశాన  మమ్ములను సదా ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు కనుక ఇష్టం...... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇష్టాలకు అంతూ పొంతూ ఉండదు.  అలా చెప్పడం కూడా నాకు చాలా యిష్టం.

ఈ ఇష్టాల పుస్తకంలో కొన్ని పుటలు వెనక్కి తిప్పితే, మా రసాలూరు సాలూరు వస్తుంది. ఆ ఊరంటే, అక్కడి సందు గొందులతో, మురికి వాసనaతో, పేదరికపు బీద జీవిత ముఖ పత్రాలతో నాకు చాలా ఇష్టం.
అక్కడి వేగావతి నది, పంచముఖేశ్వర స్వామి వారి ఆలయం, నేను దాదాపు పాతికేళ్ళు పని చేసిన మా కాలేజీ, ...ముత్యాలమ్మ కోవిల, పారమ్మ కొండ,దూరంగా కనిపించే   కొండలూ,  అక్కడి మల్లె తోటలు, తియ్యని పాటల బాదుషా కబీర్ షా  గారు పాడిన మా కళా వేదికా,  ఇంకా, వేగావతి బ్రిడ్జి మీద సాయంత్రాలు కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుపన్న మా మిత్ర బృందమూ,.. ఒకటేమిటి ... అన్నీ గుర్తుకు వస్తాయి.

ఆ రోజులలో మా రసాలూరు సాలూరు గురించి రాపిన నా పద్యం ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. అది కూడా చెప్పి, నా ఇష్టాల జాబితా చాలా అసమగ్రంగా ఇంతటితో ముగిస్తాను ..

సీ.
పొలిమేర విడిసి తా తొలి పూజ లందు మా
    తల్లి ముత్యాలమ్మఁ దలతు నేను. !
వేగమే లేనట్టి వెర్రి బాగుల తల్లి
     వేగావతికి నుతులు వేనవేలు !
తనుఁగొల్చు భక్తుల తరియించి వేలుపు
   పరమ పావన మూర్తి పంచ ముఖుడు !
శి రాత్రి వేళలో జన సంద్రమై కాచు
కొండ పారమ తల్లి అండ మాకు !


చాల దయగల తల్లి మా శ్యామలాంబ !
వేల్పుటెకిమీడు జోతలు వేంకటేశ !
మరులు కల్పించు మాయూరి మల్లె పొదలు !
మంచి గంధము మాయూరి మంచి తనము !!




21, మార్చి 2013, గురువారం

యాగంటి కాకుల కథ .... (సరదాకి ...)


పక్షులు మనకు విపక్షులు కావు. వాటికీ మంచీ చెడూ తెలుసును.  మాట్లాడతాయి కూడానూ. నల దమయంతుల కథలో హంస నలుడితో మాట్లాడడమే కాకుండా నల దమయంతుల మధ్య రాయబారం కూడా నడిపింది కాదూ ?  సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకు పోతుంటే జటాయువు  వద్దని వారించ లేదూ ? ఆ మూర్ఖుడి చేతిలో చావు దెబ్బ తినీసిందను కోండి ... వెనుకటి కాలంలో పావురాలు కొరియర్ సర్వీసు చేసేవని తెలిసిందే
కదా ? పావురాల వేటతో  పడరాని పాట్లు పడిన సారంగధరుడిని ఓ సారి తలుచుకోండి ...
పక్షుల గురించి చాలా భోగట్టాలు రాయొచ్చు కానీ ప్రస్తుతానికి మన టపా పక్షులలో ఒక్క కాకికి మాత్రమే పరిమితం చేసుకుందాం.
   పక్షులలో కాకికి మాత్రం కొంత చిన్న స్థానం  ఉన్నట్టు తోస్తోంది. ఆబ్దీకాలప్పుడు కాకులను  కొంత మర్యాదగా చూడడం జరిగినా, వాటి పట్ల ఎవరికీ అంత సదభిప్రయం ఉన్నట్టు తోచదు.  కాకులలో మాల కాకి, బొంత కాకి , నీరుకాకి ..ఇలా చాలా రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకులు కోకిల గుడ్లను పొదిగి  పెద్ద చేస్తాయిట.  కనుక కోకిలకు కాకి పెంపుడు అని పేరు ఉంది.  ఉచ్ఛిష్ఠం  తినే కాకి పితరుడెట్టౌనురా అని ఈసడించు కున్న వారూ లేక పో లేదు. కాకమ్మ కబుర్లు , కాకి పిల్ల కాకికి ముద్దు , పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ కాకి మూక,  కాకిలా కలకాలం బతికే కంటే, హంసలా బతకడం మేలు ...కాకీ, కోకిలా రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వసతం కాలం వచ్చే సరికి ఏది కాకో, ఏది కోకిలో తెలిసి పోతుంది , కాకి గోల  ఏకాకి,, లోకులు పలుగాకులు,... ...లాంటి సామెతలు, మాటలు, శ్లోకాలూ  కూడా వాటిని ఈసడంచేవే కదా.

మా చిన్నప్పుడు బడిలో  ఒక అను ప్రాసకి ఉదాహరణగా  కాకీక కాకికి కోక. కేకీక కేకికి కోక. కాకీక కాకికి కాక 
కేకికా ? అని  చెప్పు కునే వాళ్ళం
కాకుల  ప్రవర్తన కూడా అటాగే ఉండడం వల్ల కాబోలు   వాటి  పట్ల మన నిరాదరణకు కారణం కానోపు.
కాకి బంగారానికీ కాకులకీ సంబంధం లేదు. అలాగే చికాకులకీ కాకులకీ సంబంధం అంటగ్గ కూడదు.
కాకితో కబురు చేస్తే రానా ? అనే మాటను బట్టి కాకులు కూడా కొరియర్ సర్వీసు చేస్తాయేమో అను కోవాలి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని మన వాళ్ళు అను కోవడం కద్దు.

అదలా ఉంచితే కాకుల మీద కలిగిన అపార మయిన సానుభూతితో వాటితో ఇంటర్వ్యూ చేదామనిపించింది. ఇటీవల మేము యాగంటి పుణ్య క్షేత్రానికి వెళ్ళి నప్పుడు అక్కడి కాకులతో కొంత సంభాషించేను.  నేనడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానా లిచ్చేయి. మా సంభాషణ జరిగిన తీరు వివరించే ముందు,  కాస్త యాగంటి గురించి  చెబుతాను. 

ఈ పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లా బనగాన పల్లి మండలం లోని ఎర్ర మల కొండల్లో ఉంది. ఉమా మహేశ్వరులు ఏక శిలా రూపంలో స్వయంభువుగా వెలిసిన క్షేత్రం ఇది. అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలు చేస్తూ  వచ్చి, ఇక్కడి అందాలకు పరవశించి పోయి , ఇక్కడ వేంకేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలను కున్నాడుట. తీరా ఆ విగ్రహానికి కుడి కాలి బొటన వేలు విరిగి పోవడంతో విగ్రహ ప్రతిష్ఠకు ఆటంకం కలిగిం.ది. దాంతో దానిని అక్కడే ఒక గుహలో ఉంచి, ముని తపస్సు చేసాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ముని కోరిక మేరకు అక్కడ  ఏక శిలా రూపంలో వెలిసారుట. అప్పుడు ముని,  వారిని చూసిన ఆనందందలో  యేన్ గంటిన్ ... యేన్ నేను కంటిన్... చూసాను అన్నాడుట. అదే కాల క్రమంలో యాగంటిగా మారిందిట. యాగంటి తప్పకుండా చూడ వలసిన ప్రదేశం. అన్ని అందాలు ఒక్క చోట చూసి పరవశించి పోతాం. . సహజ సిద్ధంగా ఉన్న గుహలు, కోనేరులు చాలా బావుంటాయి ...

ఇంతటి అందమైన చోట, పవిత్రమైన చోట కాకులతో నా సంభాషణా క్రమం బెట్టి దనినిన ...

నేను : ఆకాశాన్నంటిన  ధరలు దిగి వస్తాయనే మాటలు నిజమవుతాయి ?
కాకులు :  కావు ... కావు
నేను : మన రాజకీయాలు బాగు పడతాయనే ఆశలు నెర వేరేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : మన చదువులు  మనకి మంచి నడవడికను నేర్పేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : చలామణీలో ఉన్న నోట్లన్నీ అసలైనవే నంటారా ?
కాకులు : కావు ... కావు
నేను : కార్పొరేటు ఆసు పత్రులలో చిన్న రోగాలకు సైతం చేసే టెస్టు లన్నీ నిజానికి అవసర మైనవే నంటారా ?
కాకులు : కావు... కావు
నేను : తెలుగు సినిమా లన్నీ తెలుగు సినిమాలే నంటారా
కాకులు : కావు ... కావు
నేను : మా చిన్నప్పుడు మొదలైన తెలుగు టి.వి సీరియళ్ళు త్వరలో ముగింపు కొచ్చేవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : కథా మంజరి బ్లాగు టపా లన్నీ సీరియస్ గా రాసినవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : ఇంతకీ ఈ యాగంటి కాకుల కథలో చెప్పిన వన్నీ నిజాలేనా ?
కాకులు : కావు ... కావు

కాకులు చెప్పింది నిజమే.  ఎందుకంటే అస్సలు యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు.
దాని కొక ఐతిహ్యం చెబుతారు. అగస్త్యుడు తపస్సు చేసు కుంటూ ఉంటే, కాకా సురుడనే వాడు  లెక్క లేనన్ని కాకులతో వచ్చి గోల చేసాడుట. దానితో మునికి తపో భంగమయిందిట. అగస్త్యుడు కోపించి ఇక నుండీ యాగంటి పుణ్య క్షేత్రంలో ఒక్క కాకి కూడా ఉండకుండు గాక అని శపించాడుట.

అందు చేత, యాగంటి కాకుల కథ అంటూ నేను రాసిన దంతా ఏదో సరదాకి రాసినదే తప్ప మరోటి కాదు.  ఇందులో ఏవీ నిజాలు కానే కావు ... కావు ... కావు.





18, మార్చి 2013, సోమవారం

తేనె లొలికే తెలుగు పద్యం ...

ఆంధ్ర భూమి సచిత్ర మాస పత్రిక, ఫిబ్రవరి నెలలో తేనె లొలికే తెలుగు పద్యం శీర్షికన ప్రచురణ.


15, మార్చి 2013, శుక్రవారం

14, మార్చి 2013, గురువారం

కొత్త కథల పుస్తకం - వేద ప్రభాస్ కథలు





మిత్రుడు వేద ప్రభాస్ ( జె.వి.బి. నాగేశ్వర రావు)  కొత్త కథల సంపుటిని వెలువరించాడు. సాహిత్యం లో కథానికకు ప్రపంచం లోనే  ఆద్యుడైన ఎడ్గార్ ఎలెన్ పో కథను  అత్యంత వేగంగా అన్ని దేశాలకూ అన్ని భాషలకూ పంప గలిగాడంటే కథా ప్రక్రియ ఎంత లలిత మైనదో,  తెలిసి పోతుంది. ఒక మంచి కథ చదివి నప్పుడు కథ ఎంత బలమైనదో కూడా అంతే  తేలిగ్గా తెలిసి పోతుంది. అంటూ తన మాటగా చెప్పుకొన్న వేద ప్రభాస్ విద్యా రంగంలో ఉపాధ్యాయునిగా మొదలిడి అనేక పదవులు నిర్వహించి, రాజీవ్ విద్యా మిషన్ లో విజయ నగరం .జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారిగా ఇటీవలనే పదవీ విరమణ చేసారు.
అచ్చంగా ఇంత వరకూ 18 కథలూ పయనం, దేవభూమి, కొయ్య గుర్రాలు అనే నవలలు రాసారు.  రెండు నవలలు తెలుగు లోకి అనువాదం చేసారు.  రెండు కథలకు ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు కూడా అందు న్నారు, ఈ పుస్తకాన్ని తమ తల్లి దండ్రులకు అంకితం చేసారు.
దీనికి ముందు మాటగా తన  అభిప్రాయాన్ని  మల్లాది తెలియ జేస్తే , ఆప్త వాక్యాన్ని పంతుల జోగారావు రాశారు. రచయిత మంజరి తన మాటగా కథా గానం వినిపించారు,


12 కథలున్న ఈ పుస్తకం వెల వంద రూపాయలు. రచయిత పేర, ప్లాట్ నంబరు 71, నటరాజ్ కాలనీ విజయ నగరం చిరునామాకు సంప్రదించ వచ్చును. లేదా 08922220996 నంబరుకి కానీ, 9490791568 సెల్ నంబరుకి కానీ ఫోన్ చేస్తే చాలును. 

25, ఫిబ్రవరి 2013, సోమవారం

చెప్పు కోడానికి చాలా కబుర్లు ఉన్నాయి .






చాలా  కాలంగా  కథా మంజరి  లో టపాలు  ఏ వీ రాయడం  లేదుకదూ

సికందరాబాదు నుండి విజయ  నగరం  మా మకాం  మార్చడమే కారణమ్.

వీలయి నంత త్వర లో  కలుద్దాము.



10, జులై 2012, మంగళవారం

అయ్యో, చచ్చి పోయింది...


కష్టే ఫలే ... శర్మ కాలక్షేపం కబుర్లు  బ్లాగులో అమ్మయ్య బతికేడు టపా చదివాక ఇది రాస్తున్నాను.
గుండెలు పిండేసే ఆ టపా ఇక్కడ చూడ వచ్చును.  వారి టపాకి కామెంటుగా ఈ మాటలు రాయడం కన్నా, నేరుగా ఒక టపాగా ఉంచితే మరింత మందికి అందుబాటులో ఉంటుందని తలచి, ఇది రాస్తున్నాను.



ఆ టపా నన్ను అమితంగా కదిలించి వేసింది.. ఎలాగయితే నేం ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలిగేరు. ఆ భాగ్యం వారికి  కలిగింది. నా బాల్యంలో, అంటే, నాకు పదేళ్ళు ఉండే రోజులలో  నేనూ, నా మిత్రులూ కూడా కళ్ళారా చూస్తూనే ఒక మరణాన్ని నివారించ లేక పోయాం. ఆ సంఘటన తలచుకొని ఇప్పటికీ మేమంతా విచారిస్తూ ఉంటాం.

వివరాలలోకి వెళ్తే ...

మా బాల్యంలో నేనూ, నామిత్రులూ కలిసి రైల్వే కట్ట ప్రక్కగా నడుస్తూ, ఊరికి  దూరంగా ఓ చోట ఏడు కానాలు అని పిలువబడే ఒక చిన్న కానా గట్టున కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం కానా అంటే  రైల్వే పట్టాలకి అడ్డంగా కట్టిన చిన్న బ్రిడ్జి. ఓ రోజు అలా చాలా సేపు గడిపేక  చీకట్లు అలుము కుంటున్న వేళ ఇంటికి పోదాం అని అందరం లేచాం. సరిగ్గా అదే సమయంలో గూడ్సు ట్రయిన్ ఏదో  , ఒక వేపునుండి రావడం  గమనించాం. అదే సమయంలో రైలు పట్టాల మీద నెత్తి మీద మూటతో పట్టాల నడుమ నుండి నడుచుకు పోతున్న ఒకావిడ మా కంట పడింది.  వెనుక నుండి వస్తున్న రైలు శబ్దం విన బడ లేదో, పరాకుగా ఉందో తెలియదు. అలా పట్టాల నడుమ నుండి నిర్లక్ష్యంగా నడుస్తూ ఉండడం మా ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక దురలవాటుగా అందరికీ ఉండేది. కారణం, మా వెనుక బడిన ప్రాంతంలో రోజులో  మూడో నాలుగో రానీ తరుచుగా  పాసింజరు ట్రయిన్లు కానీ, గూడ్సు బళ్ళు కానీ వచ్చేవి కావు.

సరే, అదే ధీమాతో పరాకుగా  పట్టాల నడుమ నడుచు కుంటూ పోతున్న ఆమెను హెచ్చరించడానికి  గాభరాగా అందరం ఒకేసారి ప్రయత్నించాం. ఆ భయాందోళనల వల్ల అనుకుంటాము, మాలో ఒక్కరికి గొంతు పెగల లేదు. ఎంత ప్రయత్నించినా, మా నోట శబ్ధం రాలేదు.ఒకే సారి అందరకీ గొంతులు పూడ్చుకు పోయాయి. ఇంతలో జరుగ వలసిన ఘోరం జరిగి పోయింది. మా కళ్ళెదుటే ఆమెను గూడ్సు బండి చాలా దూరం ఈడ్చుకొని పోయింది. కొంత దూరంలో బండి ఆగింది. మా దుఃఖం అంతా ఇంతా కాదు. పరుగు పరుగున  అక్కడకి చేరు కున్నాం. రైలు పట్టాల మధ్య తునాతునకలై పడి ఉన్న ఆ శరీరాన్ని చూసి వణికి పోయాం.
చాలా రోజులు, కాదు, చాలా ఏళ్ళ పాటు ఆ బీభత్స దృశ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉండేది.

ఇప్పుడు చెప్పండి,  వారు తమ  ఉద్యోగిని కాపాడు కోవడంలోనూ, మేము ఆమెను కాపాడ లేక పోవడంలోనూ మన ప్రమేయం ఏమైనా ఉందంటారా ? అదే దైవేచ్ఛ అంటే అనుకుంటాను. కదూ

3, జులై 2012, మంగళవారం

గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ ... ఆడియో కూడా ...



గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ చదవండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక 1980 లో ప్రచురణ.




ఈ కథ ఆడియో  ఇక్కడ వినండి ....



25, జూన్ 2012, సోమవారం

ఇబ్బంది కాదూ ?!



మనుసులను అంచనా వేయడంలో పొరబడటం వల్ల మనం ఒక్కోసారి మంచి వారినీ , సహృదయులనూ దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ కథాంశంతో వ్రాసిన ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురణ.

కథ ఆడియో ఇక్కడ  వినండి :




ఇక్కడ కథ చదవండి ....