మన సాహితీ సంపద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన సాహితీ సంపద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జనవరి 2010, శనివారం

పద్య భ్రమరుకం ... పాద భ్రమరుకం !

వేసవి కాలం. మధ్యాహ్నం ఎండ ఫెడీల్మని పేల్చేస్తూ ఉంటే, ఇంట్లో అమ్మో, నాన్నమ్మో, అత్తమ్మో, పెద్దమ్మో, అమ్మమ్మో ... ఎవరో ఒకరు మామిడి కాయలు ఊరగాయ కోసం తరుగుతూ ఉంటే ...



ఒకటో, రెండో ముక్కలు లాక్కుని, ఉప్పూ కారం నంచుకుని తింటూ ఉంటే...

వాహ్ ! ఆ రోజులు ఎంత భలేగా ఉండేవో ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి...

అంతే కాదు, ఆ తరిగిన ముక్కల పక్కన పెద్దాళ్ళు పారేదామని ఉంచిన మావిడి జీడి కుప్పలోనుండి ఒకటో,రెండో తీసుకుని ... గోడల మీద కొక్కిరిబిక్కిరిగా ...
‘‘ దడిగాడు వాన సిరా’’ అని రాయడం గుర్తుకొస్తోందా?

ఎటు చదివినా ఒకే మాదిరిగా ఉండే ఈ వాక్యానికి మన తెలిగింటి మట్టి గోడలు గొప్ప ప్రాచుర్యాన్ని యిచ్చాయి కదూ!


మన కవులు కూడ యిలాంటి తమాషా పద్యాలు చాల రాసేరు. వాటిని పాద భ్రమకాలనీ, పద్యభ్రమకాలనీ అనొచ్చు.
ముందుగా పాద భ్రమకం. పద్యంలో ప్రతీ పాదమూ ఎటుచదివినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత! చూడండి ...

ధీర శయనీయశరధీ
మార విభాను మత మమత మనుభావి రమా
సార సవన నవసరసా
దారదసమతార తార తామ సదరదా !


ఇప్పుడు పద్య భ్రమకాన్ని చూద్దామా? పద్యం మామూలుగా మొదటి నుండి చదివినా, చివరి అక్షరం నుండి వెనక్కి చదివినా ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.

రాధా నాధా తరళిత
సాధకరధతావర సుత సరసనిధానా
నాధాని సరసత సురవ
తాధర కథసా తళిరత ధానాధారా !


ఆగండాగండి, యతి ప్రాసలూ గణాలూ తెలిస్తే, ఎటునుంచెటు చదివినా ఒకేలా ఉండే అక్షరాలను మేమూ పేర్చ గలం అని అనుకో వద్దు సుమా ! ... ఎందుకంటే, యివి రెండూ పూర్తిగా అర్ధవంతాలయిన పద్యాలు....
వీటి అర్ధాలను తెలిసిన వారు ప్రయత్నించి చెప్పమని కోరుతున్నాను ...

వీటి అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా, ఈ పద్యాలను కథామంజరి బ్లాగులో ... దడిగాడు వాన సిరా.




Posted by Picasa

నత్తలుండవూ?!


అల్పులు ఎప్పుడూ తక్కువ ఆలోచనలేచేస్తూ ఉంటారు. ఉన్నతమయినఆలోచనలు వారికి రావు, మరి ! పద్యంచూడండి ...
నక్కలు బొక్కలు వెదుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్

చూసారు కదూ? అందుకే కదా అన్నారు, ‘‘ పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? అని !
రకమయిన అల్పత్వాన్నే ప్రదర్శించిన బకరాజు వృత్తాంతం చూడండిదిగో ...

















ఎవ్వడవీవు? కాళ్ళు మొగ మెఱ్ఱన?’ ‘హంసను’. ‘ఎందునుందువో?’
దవ్వుల మానసంబునను’ ‘దాన విశేషములేమి తెల్పుమా?’
మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ గలవందు ’ ‘నత్తలో?!’
అవ్వి ఎరుంగమన్న నహహాయని నవ్వె బకంబులన్నియున్.














రాయంచ మానస సరోవరం నుండి ఎలా వచ్చిందో, కొంగలుండే కొలను దగ్గరికి వచ్చింది దానిని చిత్రంగా చూసాయి, అక్కడున్న కొంగలన్నీ. కుతూహలంగా హంసను అడిగాయి : ‘‘ భలే ! నీ కాళ్ళూ, ముఖం ఎర్రగా ఉన్నాయి...నీ ఊరేది? ఎక్కడుంటావు? అక్కడి విశేషాలు చెప్పు .’’ అని.
రాయంచ బదులిచ్చింది : ‘‘ నేను హంసను. నా నివాసం మానస సరోవరం. అబ్బో అదిక్కడికి చాలా దూరం లెండి ...’’
‘‘ అలాగా ! మరక్కడ విశేషాలో?’’
రాయంచ పొంగి పోతూ తమ ప్రాంతం విశేషాలను గొప్పగా చెప్పింది : ‘‘ వాహ్ ! అక్కడ బంగారు పద్మాలూ, మంచిముత్యాలూ ఉంటాయి తెలుసా ?! ’’ అని..
కొంగలు చప్పున అడిగేయి : ‘‘ చాల్లే, సంబడం ! ... ఇంతకీ, అక్కడ నత్తలుంటాయా? అది చెబుదూ ముందు ... ’’
రాయంచ తెల్లబోయింది. అమాయికంగా బదులిచ్చింది : ‘‘ నత్తలా ! వాటి సంగతి మాకు తెలీదే ! ’’ అని.
దాంతో కొంగలన్నీ పక పకా ( బక బకా అని అందామా?) నవ్వి, రాయంచనిఓసి వెర్రి మొహఁవాఅన్నట్టుగా చూసివెక్కిరించాయిట !

ఇలాంటి బడుద్ధాయిలను చూసే కదా, మన ప్రజాకవి వేమన ...
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
విశ్వదాభిరామ ! వినుర వేమ !
అని చెప్ప లేదూ !

ఎలాగూ హంసల గురించీ , కొంగల గురించీ వచ్చింది కనుక, బాతుల గురించి కూడా చెప్పుకుందాం...
శ్రీకృ ష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో చక్కని పద్యాన్ని గుర్తు చేసుకుందాం ...














తలబక్షచ్చటగ్రుక్కి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్నాతప్రయాతద్విజా
నలిపిండీకృత శాటులన్సవిధతద్వాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసబారు వాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్.


ఎంత అపురూపమైన వర్ణనో చూడండి ...
తెల్ల వారు ఝూమునే లేచి, నదీ తీరానికి పోయి, బ్రాహ్మణులు స్నానాదులాచరిస్తారు కదా? అయితే, వాళ్ళు ఒక్కో సారిఅక్కడ తమ బట్టల పిడుచలు మరిచి పోయి యిళ్ళకి వెళ్ళి పోతూ ఉండం కద్దు. రోజు, నది ఒడ్డున రెక్కలలో తలలుదూర్చుకుని, నిద్ర పోతున్న బాతుల్ని చూసి, అవి బాపనయ్యల బట్టలనుకుని, వాటిని వారికి తిరిగి యిచ్చేద్దాం అని, ఆరెకులు దగ్గరగా వెళ్ళారు. వాళ్ళు దగ్గరకి రావడంతో, చప్పుడికి బాతులు నిద్రలేచి,టపటపా ఈదుకుంటూ వెళ్ళిపోయాయిట! తతంగాన్ని చూసి, అక్కడున్న పైరు కాపరి యువతులు విరగబడి నవ్వారుట !
ఇంత మనోహరంగా వర్ణించడం రాయల వారికే చెల్లింది కదూ !

30, డిసెంబర్ 2009, బుధవారం

హరి హరీ !!


ఈ పద్యం ఓ సారి చూస్తారూ ?

హరి కుమారుడై యొప్పు నాతడు హరి !
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి !
హరికి శిరము తోడ వరలు నాతడు హరి !

హరికి వామాక్షమై యొప్పు నాతడు హరి !

హరికి గల నానార్ధాలను ఉపయోగించకుని కవి ఈ చమత్కార పద్యాన్ని మన ముందుంచాడంతే !

హరి అంటే విష్ణువు , కోతి , సూర్యుడు , సింహము , చంద్రుడు అనే అర్ధాలను కవి ఇక్కడ వాడుకున్నాడు...
ఇప్పుడు పద్యంలో కవి గారి గోల ఏమిటో ఇట్టే తెలిసి పోతోంది కదూ?
మొదటి పాదంలో వరుసగా హరి అనే పదాలకి సూర్యుడు , కోతి అని అర్దాలు చెప్పుకుంటే, వాక్యార్ధం సూర్యుని కొడుకు సుగ్రీవుడని తెలుస్తోంది.. కోతి కదా?
అలాగే రెండో పాదంలో వరుసగా శ్రీ మహా విష్ణువునీ, సూర్యుడినీ చెప్పుకుందాం, వాక్యార్ధం శ్రీహరికి కుడి కన్ను సూర్యుడే కదా!
మూడో పాదంలో రెండో హరి అనే పదానికి సింహం అని అర్ధం చెప్పుకుంటే నరసింహావతారం గుర్తొచ్చి, అర్ధం అవగతమౌతుంది.
నాలుగో పాదంలో రెండో హరి పదానికి చంద్రుడు అని అర్ధం చెప్పుకుంటే విష్ణువు ఎడమ కన్ను చంద్రుడే కదా !

ఈ పాటి దానికి ఇంత వివరణ కావాలా ! ఏదో నా చాదస్తం కాక పోతే, మరీనూ !

29, డిసెంబర్ 2009, మంగళవారం

రామ గోపాలమ్ !



కోలాచలం పెద్ది భట్టు కవి శ్రీరాముని పరంగానూ, గోపాలుని పరంగానూ చెప్పిన చక్కని శ్లోకమిది ...
య:పూతనా మారణ లబ్ధ వర్ణ:
కా కోదరోయేన వినీత దర్ప:
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్.


ముందుగా గోపాలుని పరంగా అర్ధాన్ని చూదామా !

య:, పూతనా,మారణ లబ్ధ వర్ణ: = ఎవడు పూతనను చంపి కీర్తి పొందెనో
యేన కాకోదర: , వినీత దర్ప: = ఎవని చేత కాళీయుని గర్వం అణచి వేయ బడిందో
య:, సత్యభామా సహిత: = ఎవడు సత్యభామతో కూడి ఉంటాడో
యదూనాం నాధ: , స: , పాయాత్ = అట్టి యదువంశ ప్రభువయిన గోపాలుడు కాపాడు గాక !


ఇక, శ్రీరాముని పరంగా అర్ధం పరిశీలిద్దామా !

య: , పూత నామా = ఎవడు పవిత్రమైన పేరు గల వాడో
రణ లబ్ధ వర్ణ: = ఎవడు యుద్ధంలో కీర్తిని గడించాడో
అదర:, కాక: , వినీత దర్ప: = భయం లేని కాకాసురుని గర్వం అణచి వేసాడో
య: , సత్య , భా , మా, సహిత: = ఎవడు సత్యము, కాంతి మరియు లక్ష్మిలతో కూడిన వాడో
స: , రఘూణామ్ నాధ: , పాయాత్ = అట్టి రఘువంశ ప్రభువు కాపా
డు గాక !!
తెలుగు సాహిత్యంలో కూడ ద్వ్యర్ధి , త్ర్యర్ధి కావ్యాలు రాఘవ పాండవీయం వంటివి ఉన్నవి. వీలున్నపుడు వాటిని గురించి ...

బాల గోపాలమ్


కొంటె కృష్ణుని చిలిపి చేష్టలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదా?

చూడండి ...
మాత:కిం యదునాధ: దేహి చషకం, కింతేన?పాతుంపయ:
తన్నాస్త్యద్య, కదాస్తినా? నిశి ! నిశా కావా? అంధకారోదయో
అమీల్యాక్షి యుగం నిశాప్యుపగతా దేహేతి మాతు: ముహు:
వక్షోజాం శుక కర్షణోద్యత కర: కృష్ణ :సపుష్ణాతువ:
చిన్ని గోసాలుడు యశోదమ్మని అడుగుతున్నాడు ‘‘ అమ్మా, పాత్ర యివ్వు, పాలు త్రాగుతా ’’
యశోద: ‘‘ ఇప్పుడొద్దు, రాత్రికి త్రాగుదువులే’’
గోపాలుడు: ‘‘ రాత్రి ఎప్పుడొస్తుందమ్మా?’’
తల్లి: ‘‘చీకటి పడినప్పుడు వస్తుంది నాయనా !’’
తల్లి యిలా చెప్పగానే నంద నందనుడు కనులు రెండూ మూసుకుని ‘‘ చీకటి పడి పోయిందమ్మా !’’ అంటూ తల్లి పైట లాగుతూ మారం చేస్తున్నాడుట!
అట్టి బాల గోపాలుడు మిమ్ములను కాపాడు గాక ! అని, కవి ఆశీర్వదిస్తున్నాడు.

28, డిసెంబర్ 2009, సోమవారం

పారవశ్యం



ఒక మంచి, అందమైన శ్లోకం చూదాం.ప్రణయ పారవశ్యాన్ని ఎంత మనోహరంగా కవి వర్ణించాడో చూడండి.
రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా
ధా
మం మా కలయతి దధి రిక్త భాండే
తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి:
దేవో అపి దోహన ధియా
వృషభం నిరుంధన్







ఇక శ్లోకార్ధం ... నల్లనయ్య మీద లగ్న చిత్తయై రాధ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోందిట!
ఆమె వక్షోజ విన్యాసాలు చూస్తూ మైమరిచి పోయిన గోపాలుడు పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధాలువేస్తున్నాడుట !!

ప్రేమ పారవశ్యం అంటే ఇదే కదా?

26, డిసెంబర్ 2009, శనివారం

బావా ! బావా పన్నీరు !!

అత్త గారింటికి వచ్చిన బావగార్లను ‘‘ బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు, వీధీ వీధీ తిప్పేరు, వీశెడు గంధం పూసేరు’’ అని ఆట పట్టించే ఘట్టం మన పిల్లల తెలుగు వాచక పుస్తకాలలో కపిసిస్తూ ఉంటుంది. ఆ గడుగ్గాయిల అల్లరి గేయ రూపంలో ఉంటే , బావగారి రూపు రేఖా విలాసాలు కొంటెగా వర్ణించిన ఓ చిన్న పద్యం మన వాళ్ళు చెబుతూ ఉంటారు ..దానిని చూడండి ...

అందమునఁజూడ రాము బంటైన వాడు
నాగరికతను జము వాహనమునకీడు
శుచికి హేమాక్షుఁజంపిప శూరు జోదు
వసుధలో లేడు మా బావ వంటి వాడు !!

‘కన్నొక్కటి లేదు గాని కాంతుడు గాదే !’ అని పొగడడంలాంటిదే యిదీనూ !
ఇలా ఏ బావ గారినయినా కోతి,దున్న పోతు, పంది అంటే యింకేమయినా ఉందా చెప్పండి? మన వాళ్ళ సరదాలు బంగారం కానూ !

ప్రహేళిక

గీర్వాణ భాషలో కవులు చమత్కారవంతములైన ప్రహేళికలు కొన్ని రచించారు. ఒక దానిని చూదాం ...

సీమన్తినీషు కా శాంతా
రాజా కోభూత్ గుణోత్తమ:
విద్వద్భి: కా సదా వంద్యా
అత్రైవోక్తం న బుధ్యతే

ప్త్రీలలో మిక్కిలి శాంత స్వభావురాలయిన వారెవరు? రాజులలో గొప్ప గుణ సంపన్నుడెవరు ? బుద్ధిమంతులు దేనిని సతతం అభిలషిస్తారు? ... ఈ మూడు ప్రశ్నలకీ సమాధానాలు శ్లోకంలోనే ఉండడం యిక్కడి చమత్కారం
మూడు ప్రశ్నలకీ వరుసగా మూడు పాదాలలోనూ గల తొలి మరియు చివర గల అక్షరాలను కలిపి చదవాలి...
వరుసగా ... సీత రామ: విద్యా అనే జవాబులు రావడం లేదూ?!

25, డిసెంబర్ 2009, శుక్రవారం

ఏ ఆవురా బావా !!


చిన్న కంద పద్యంలో కవి గారు, ఒకాయన తన బహు భాషా నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో చెప్తున్నారు. చూడండి ...

బావయు మరిదినిగని, యీ
యావులలో నొకటి బేరమాడుమనఁగ ‘‘నే
యావ’’ని యడిగిన వాక్యము
గావలయుంభాషలైదుగా నొక పదమున్.


బావా మరుదులిద్దరూ సంత కెళ్ళారు. మంచి ఆవు నొకదానిని బేరం చెయ్యడానికి. బావ గారు అక్కడున్న ఆవులలో ఒక దానిని చూసి, బేరమాడమన్నాడు. మరిది గారికి అక్కడున్న వాటిలో ఒక్కటీ నచ్చినట్టు లేదు. ‘‘ పదరా, బావా పోదాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు....ఒక భాషలో చెబితే చాలదన్నట్టు మొత్తం ఐదు భాషలలో పోదాం పద రమ్మన్నాడు...
పద్యంలో ఉన్న దాన్ని ‘‘ ఏ ఆవురా బావా’’ అని మారిస్తే ఆ భాషా పదాలు కనిపిస్తాయి...అన్నింటికీ రమ్మనే అర్ధం !!


ఏ - మరాఠీ
ఆవు - ఉర్దూ
రా - తెలుగు
బా - కన్నడం
వా - తమిళం

22, డిసెంబర్ 2009, మంగళవారం

చుక్కలూ, చిక్కులూ ....

ఒక తమాషా పద్యాన్ని మీతో పంచుకుంటాను ...

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేత బట్టి, నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్ !!


ఇందులో చమత్కారమంతా కవి గారు కొన్ని నక్షత్రాల పేర్లను ఉపయోగించు కోవడంలోనే ఉంది.

ఆ నక్షత్రాలు యివీ : . ఉత్తర .భరణి . మూల హస్త

వీటి ఆధారంగా పద్యంలోని కవి చమత్కారాన్ని కనుక్కోండి చూద్దాం !!

ఇది పద్మ వ్యూహ ఘట్టానికి చెందిన సందర్భం. ఈ చిన్న క్లూతో మీ శోధన మొదలెట్టండి ...








చుక్కల చిక్కుల పేరిట
చిక్కని పద్యము నొసగఁగ చింతా వారూ !
చక్కగ వివరించిరి కద !
మిక్కిలిగా నాదరింతు మదిలో మిమ్మున్. !

18, డిసెంబర్ 2009, శుక్రవారం

శివ ! శివా !!


వెనుకటి రోజులలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో భర్తలు భార్యలను ‘‘ వొసే ’’ ,, ‘‘ వొసేయ్ ’’ అని పిలవడం ఉండేది. గురజాడ వారి కన్యాశుల్కం ఓ సారి గుర్తుకు తెచ్చు కోండి ...

ఈ పిలుపును గురించి శ్రీ చెల్ల పిల్ల వేంకట శా స్త్రి గారు చక్కని పద్యం చెప్పారు. చూడండి ...

ఇతర దేశమ్ముల జనయించుకంటె
నాంధ్ర దేశాన జనయించుటార్య హితము
‘వశి వశి’ యటంచు పిలుతురు వారు భార్య
నదియు ‘శివ శివ’ యై తుద కఘములడచు !!


వేరే దేశాలలో (ప్రాంతాలలో) పుట్టడం కన్నా ఆంధ్ర దేశంలో పుట్టడం మంచిది. అక్కడి వాళ్ళు భార్యలని వశి వశి ( వొసేయ్ అని అన్న మాట) అని పిలుస్తారు. చివరికదే శివ శివా ! గా మారి పోయి అన్ని పాపాలు పోగొడుతుందిట!
మరా మరా అనేది రామ రామ అయినట్టుగానన్న మాట !
శివ నామ స్మరణ పాపాలు పోగొడుతుంది. నిజమే కదా ... భార్యలని అంత అవమానకరంగా పిలిచే ( అందులో ఆత్మీయతానురాగాపాలు ఎక్కువే ననుకోండి ) మగ వాళ్ళకి పాపం చుట్టుకోదూ !
అందు చేత కనీసం ఈ తిరగేసిన నామ స్మరణ వారికి తెలియ కుండానే వారి చేత శివ నామాన్ని పొద్దస్తమానం జపించేలా చేసి, ఆ పాపాన్ని పోగొడుతుందనుకోవాలి మరి !

16, డిసెంబర్ 2009, బుధవారం

దశావతార వర్ణన


మన కవులు ప్రతిభావంతమైనవిచిత్ర కల్పనలు చాలా చేసారు.
ఈ క్రింది పద్యంలో కవి దశావతార వర్ణన ఎంత గొప్పగా చేసాడు. చూడండి :

సలిల విహారులిద్దరును, సంతత కానన చారులిద్దరున్
వెలయగ విప్రులిద్దరును, వీర పరాక్రమశాలులిద్దరున్
పొలతుక డాయు వాడొకడు, భూమి చరించెడు వాడు నొక్కడున్
చెలువుగ మీ కభీష్టములు సిద్ధి ఘటించురనంత కాలమున్.

వివరణ మీ సౌకర్యం కోసం ఈ క్రింద పొందు పరిచి ఉన్నాను. మీ ప్రయత్నం మీరు చేయండి. కాదంటే క్రింద తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి.

సలిల విహారులు = మత్స్య,కూర్మావతారాలు
కానన చారులు = వరాహ, నారసింహావతారాలు
విప్రులు = వామన, పరశురామావతారాలు
పరాక్రమశాలురు = శ్రీరామ, క్రిష్ణులు
పొలతుక డాయు వాడు = బుద్ధుడు
భూమి చరించు వాడు = కల్కి అవతారం

కారణాలు వెతకండి ....

భాషతో మన వాళ్ళు భలే ఆడుకున్నారు లెండి! క్రింది పద్యం చూడండి ...
రజక కవాటముల్ రహి తప్పి యుండుట
కేమి వొ దాని నెఱుగ వలయు
ఇల్లును, పామును హీనమైయుండుట
కేమి హేతువొ నెఱుగ వలయు
పాలిచ్చు పశువును, పక్షియు హీనమై
యుండుట యేమియోఎఱుగ వలయు
సస్యంబు, కుమ్మరి సంతోష వర్జమై
యేమిటనుండునో యెఱుగ వలయు
దాని యర్ధంబు చెప్పిన దేశికులకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పు తోడ
ఈ కథా మంజరిం గాంచు మీకు నేను
విన్నవించెద కారణాలెన్నమనుచు !!


పద్యం నాలుగు చరణాలలోనూ వరుసగా నాలుగు ప్రశ్నలు కవి సంధించేడు ...

వాటికి జవాబులు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి !!

నాలుగు పాదాలలో కవి వేసిన ప్రశ్నలకి జవాబులు వరుసగా :
. ఉతక లేక
. కప్ప లేక
.చేప లేక
. వాన లేక

  • ఉతక = అడ్డు గడియ
అర్ధం ఇప్పుడు సుబోధకమే కదా !

15, డిసెంబర్ 2009, మంగళవారం

దొంగ లెక్క !!!


ఒక్కో సారి ఆపద సమయంలో దొంగ లెక్కలు వేసి, ఆపద గట్టెక్కొచ్చు ! ఐతే, దీనికి యుక్తి, వివేకం కావాలి...
మన ప్రాచీన సాహిత్యంలో యుక్తిగా తననీ తన వారినీ చావు నుండి తప్పించిన ఓ యుక్తిపరుని వైనం ఓ చక్కని పద్యంలో ఉంది. చూడండి ...
ముందుగా పద్యం చూడండి ...


తార్కికుల్ నలుగురు,తస్కరులేవురు
శ్రోత్రియులిద్దరు, చోరుడొకడు
భూసురుల్ ముగ్గురు,మడియవిప్పొకడు
సకలార్ధ నిపుణుడు శాస్త్రి యొకడు
యల్లాపులిద్దరు, యాచకులిద్దరు
బరి వాండ్రు ముగ్గురు, బాప డొకడు
ఆగడీలిద్దరు, ఆరాధ్యులిద్దరు
దుష్టాత్ముడైనట్టి దొంగయొకడు

అరసి వారల నొక శక్తి యశనమునకు
సగముఁగోరగ, నవ సంఖ్య జగతి సురుడు
చెప్ప ; దొంగలు హతులైరి ; చేటుఁదప్పి,
విజయమందిరి యా వేళ విప్రులెల్ల !!


వివరణ : పూర్వం ఓ దొంగల గుంపు ఒకటి యాత్రీకులైన బ్రాహ్మణులని అడ్డగించి, శక్తి గుడికి తీసుకు పోయేరు.
శక్తి వారిలో సగం మందిని తాను తినేస్తానని అంది. ఎవరు బలి కావాలో నిర్ణయించుకోమంది. లేక పోతే అందరినీ తినేస్తానంది.
దొంగలు పదిహేను మంది, బ్రాహ్మణులు పదిహేను మంది ఉన్నారు.
ఎవరు బలి కావాలి ?
దొంగలు బెదిరి పోయేరు. వారికి దిక్కు తోచ లేదు. ఒక బ్రాహ్మణుడు యుక్తితో కేవలం దొంగలు కాని, కేవలం బ్రాహ్మణులు కానీ చావడం న్యాయం కాదనీ, తాము అందరూ ఒక వరుసలో నిలుచుంటామనీ, శక్తి ప్రతి ఆవర్తంలో తొమ్మిదవ వ్యక్తిని బలి తీసుకోమని వేడుకున్నాడు. శక్తి అంగీకరించింది.
దొంగలూ ఈ ప్రతిపాదనకి అంగీకరించేరు. ఆ బ్రాహ్మణుడు దొంగలనీ, బ్రాహ్మణులనీ కలగలిపి ఒక వరుసలో నిలుచోబెట్టాడు.
శక్తి ప్రతి ఆవర్తంలో తొమ్మిదో వ్యక్తిని బలి తీసుకోవడం మొదలెట్టింది.

చిత్రం !!!


ప్రతి ఆవర్తంలోనూ తొమ్మిదో వాడు దొంగే కావడం వల్ల, ఏం జరుగుతోందో గమనించే లోపల దొంగలందరూ శక్తికి బలైపోయేరు ! బ్రాహ్మణులు సురక్షితంగా బయట పడ్డారు!

ఇంతకీ, ఆ తెలివైన బ్రాహ్మణుడు చేసిన యుక్తి ఏమిటి? వేసిన దొంగ లెక్క ( !) ఏమిటో కాస్త కనిపెట్టి చెబుదురూ !

మీ ప్రయత్నం మీరు చెయ్యండి ... సాధ్యం కాక పోతే , జవాబు ఈ క్రిందనే ఉంది. చూడండి. తెలిసి పోతుంది.! మరెందుకు ఆలస్యం ?!



బ్రాహ్మణులు # గుర్తు తోనూ, దొంగలు గుర్తుతోనూ ఉన్నారు. వారందరినీ కలగలిపి, క్రింది వరుసలో నిలబెట్టాడు. శక్తి ప్రతి ఆవర్తంలోనూ తొమ్మిదో వ్యక్తిని బలి తీసుకుంది. అంతే ! ... దొంగలంతా ఖతం !!

ఆ వరుసల వైనం యిదీ : క్రింద తెలుపు భాగాన్ని డ్రాగ్ చేస్తే జవాబు కనిపిస్తుంది ...

#### ౦౦౦౦౦ ## ####౦౦##౦౦౦#౦౦##0





#### ౦౦౦౦౦ ## ### #౦౦##౦౦౦#౦౦##0

14, డిసెంబర్ 2009, సోమవారం

ఔరా, యిదేమి చిత్రం !!

మన అపార పారావార తుల్యమైన సాహితీ భాండారంలో ఎన్ని అనర్ఘరత్నాలు ఉన్నాయో నేనివాళ కొత్తగా వివరించ నక్కర లేదు...నేనెరిగినవాటిని మిత్రులతో పంచుకునే ప్రయత్నంలో రోజు మీకోసం అందమయిన పద్యం....

హరిని హరి బట్టి మ్రింగెను
హరి దౌడుం జూచి బెదరి హరి చెట్టెక్కెన్
హరి పలుకులు హరి మెచ్చెను
హరి వాహన మగుపడంగ హరి గర్జించెన్ !

కప్పను పట్టుకుని పాము మ్రింగి వేసిందిట!
గుర్రం పరిగెత్తడం చూసి, బెదిరి పోయి , కోతి చెట్టెక్కిందిట!
చిలుక పలుకులు విని శ్రీ హరి మెచ్చు కున్నాడుట!
యముని వాహనం దున్న పోతుని చూసి సింహం గర్జించిందిట!

నానార్ధ పద నిఘంటువు చూసి, హరికి ఎన్ని అర్ధాలున్నాయో సారిచూడండి ...
నానార్ధాల వల్లనే మీది పద్యంలో హరిని హరి తినేసాడనీ, హరిని చూసిహరి పరిగెత్తి పారి పోయేడనీ, హరి మాటలను హరే మెచ్చు కున్నాడనీ, హరి వాహనానాన్ని చూసి హరి గర్జించాడనీ బయటకి కనిపించేఅసంగతార్ధం తొలిగి పోయి వాస్తవార్ధం గోచరిస్తుంది ...

బాగుంది కదూ ?!












12, డిసెంబర్ 2009, శనివారం

అయ్యో, రామ !!



నీయాశా, అడియాశా ....
రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ
యిత్థం విచింతయతి కోన గతే ద్విరేఫే
హా ! హంత హంత ! నళినీం గజవుజ్జహార !


మిత్రులారా ! ఈ శ్లోకం ఎంత అందంగా ఉందో గమనించండి ...

ఓ తుమ్మెద తామర పువ్వులో దూరి మకరందం గ్రోలుతోంది. ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రయింది. పద్మం ముడుచుకు పోయింది ! తుమ్మెద అందులో బందీ అయి పోయింది... సరేలే, ఎలాగూ తెల్లారుతుంది, సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది. అప్పుడు బయట పడదాం అనుకుంది తుమ్మెద.
అంత లోనే వో మదించిన ఏనుగు వచ్చి, ఆ సరోవరంలో దిగి, తామరలనన్నింటినీ పెకిలించి వేసిందిట ! మిగతా పువ్వులతో పాటూ తుమ్మెద బందీగా ఉన్న పద్మాన్ని కూడా పెకిలించి వేసింది.
బయట పడదాం అనుకున్న మన తుమ్మెద ఆశ ఎలా అడియాస అయిందో చూసారు కదూ ?
మంద భాగ్యుల కథల ముగింపు యిలాగే ఉంటుందేమో, కదూ !!

ఇది చదివేక, తెలుగులో ఓ మంద భాగ్యుని గురించిన పద్యం ఒకటి గుర్తుకొస్తోంది కదూ !!!
అదేమిటో గుర్తుకు తెచ్చుకుని రాయండేం?

చిన్న క్లూ యిస్తాను ... పద్యం చివర్లో ...పోవుంగదా యాపదల్ ! అని ఉంటుంది
మిత్రుడు చింతా రామ క్రిష్ణారావు చూపిన మార్గంలో నాకు తెలిసిన కొన్ని చమత్కార శ్లోకాలూ , పద్యాలూ సరదాగా మీతో ఇక మీద పంచుకోవాలనుంది. ... మీరు సరే నంటే !