8, ఏప్రిల్ 2013, సోమవారం

ఓ పాలేటయినాదంటే ... (బదవద్గీత పెవచనమ్ )




పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతావూ ? మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !

అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...
ఓ పాలేటయినాదంటే ...
మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు ఏసంకాలం,అలపొద్దులేళ నానూ, నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట అందిల కూకున్నాఁవా ? మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ్మూరితీ ( ఈన కతలు రాస్తాడు నెండి ) మా రవణ మూరితీ ( ఈడు అరికతలు మా బాగా సెపుతాడు ) మరింకా మా రామ జోగారావూ, మా సోమయాజులూ అన్నమాట . ఈ సివరాకరిద్దరూ ఉప్పుడు బూమ్మీద నేరు. పోనారండి. అత్తల్సు కుంతె కడుపు దేవి పోతాదండి. ఏటి సేత్తాం. అదలా గుంచండి ...
మాం కూకున్న కాడికి దగ్గర్నోనే మరో పది మంది దాకా కూకున్నరు. ఆల్లంతా పల్లెటూరి బైతులు నాగున్నరనుకున్నం. ఆల్ల ముందు నున్నగ నించుని రివట నాగున్న వోడు వొకడు సింకి నెక్చరు ఇచ్చెత్తన్నాడు. ఆడు సెప్పేదంతా సుట్టూ సేరినోల్లు సెవులప్ప గించి ఇంతన్నారు.
ఆడేటి సెపుతున్నాడూ ?బదగద్గీత ! ఆడి మాటలు యిని మాం నవ్వాపు కోనేక పోయేం ! పిక్కిరోల్లం కదా,పొగ రెక్కువుంతాది. ఆల్లని పల్లెటూరి బైతుల నాగా సూసి అయ్యేల ఇరగబడి ఇరగబడి నవ్వీసినాం. మరాల్లకి కోపం రాదా ? మమ్మల్ని కొట్టనాని కొచ్చేరు. కక్కా ముక్కా తినీవోల్లు. ఆల్లతోటి మాఁవేటి సాగ్గలం.? గుంటలం. ఓరినాయనో బేగి పరిగెత్తరా నాయన ! అంటూ అక్కడి నుండి పారి పోయినం. ఎలగయితేనేం గండం గడిసింది పిండం బయట పడింన్నట్టుగ మాకు ఆయేల దరువులు తప్పినయ్యి ! ఇయ్యాల పెందిల నెగిసీ నెగడంతోటే ఇదంతా ఎందుకో గుర్తుకొచ్చినాది. , ఆ సోదంతా బరికీసి నా బ్లాగు టపాలో పడీసినాను. ఏటంతే అనండి ఇందల నీతేటో కడాకు సదవండి మీకే తెలుస్తాది ...

ఇంతకీ బుద్దిగా తలలూపుతూ యింటున్న ఆల్లందరికీ ఆడేటి సెపుతున్నాడూ ? బదవద్గీత సెపుతున్నాడని సెప్ప నేదా ?
అదెలాగుంటే ....
‘‘కురుచ్చేత్ర యుద్దం మొదలయి పోనాది. యుద్దానికి ముందు దాపలో గుర్రఁవూ ఎలపలో గుర్రఁవూ కట్టి కిసన మూరితి బండి మీద అరుజునుడిని ఎక్కించుకుని అక్కడికి ఎల్లినాడు. అరుజునుడు ఎగస్పార్టీ వోల్లని సూసాడు. ఇంకేటుంది ?ఉచ్చ కార్చీసు కున్నాడు ! ‘అక్కడంతా ఆడికి ఎవులు కనిపించినారు ?తాతియ్యలు,బాయ్యలు,దద్దలు,మాయ్యిలు,... అంతా ఆల్లే ! ఓర్నాయనో ! నా సేతుల్తో మనోల్లని సంపనే నంటూ బానం వొగ్గీసి బండి దిగి పోనాడు.

మరప్పుడు కిసన బగవాను మూరితి ఏటన్నాడో ఎరికా ?

‘ ఓరి పల్లకోరా ! పెద్ద పోటు గాడి నాగ ఈల్లందరినీ నువ్వే సంపీస్తావను కుంతున్నావేటి ?!
పుట్టించినోడినీ నానే ! సంపీ వోడినీ నేనే . సేసే వోడినీ,సేయించే వోడినీ నానే. నానంతే ఎవులను కుంతున్నావు ? బగమంతుడిని. విందిరా గాందీనీ విజీనారం రాజు గోరినీ నానే కదా పుట్టించి నోడిని. ఈడినీ ఆడినీ,మన పోలుపిల్లి గవిరయ్య కూతురు లచ్చుమునీ,మనూరు బుగత బాబునీ,ఆడి కొడుకునీ,అందరినీ నానే కదా పుట్టించి నాను. నాను నోకంలో ఎప్పుడయితే దరమం నాసినఁవై పోతదో అప్పుడు పుడతానన్నమాట ! .......’’ ఇలా సాగి పోనాది ఆడి పెసంగం.
మద్దె మద్దెలో ఆడాడిన బూతు మాటలు తీస్సి సెబుతున్నాను కానీ,సత్తె పెమాణికంగా అయ్యేల ఆడి పెసంగం అచ్చు ఇలాగ్గానే ఉంది.
ఆడి మాటలకు బైతు గాడి మాటలనీ. తాగు ముచ్చోడి కబుర్లనీ మాం పడి పడి నవ్వీసి తన్నులు తినబోయి,తప్పించు కున్నం కానీ, ఇందల ఒక్క అచ్చరం అపద్దం నేదు. మరాడి మాటలు సుట్టూ సేరి నోల్లు ఎలాగ్గ యిన్నారూ ?మన చాగంటి పంతులు గోరు టీ.పీలో సెబుతే మనం ఇంతంన్నాం కామా ! అంత బక్తితో ఇన్నారు. స్రెద్దగా యిన్నారు.
ఇప్పుడు మీరు సెప్పండి. నవ్విన మాం గొప్పోల్లఁవా ?ఆల్ల జీవ బాసలో,ఏ జంకూ గొంకూ నేకండా సాజంగా, అమాయకంగా బూతులు కలిపేస్తూ మాటాడిన ఆడు గొప్పోడా ?ఆడు సెప్పిందంతా గొప్పోడి పెవచనం నాగా స్రెద్దగా,బయ బత్తుల తోటి యింటూ కూకున్న ఆలు గొప్పోల్లా ?ఏటంతారు ?ఆల్లే గొప్పోల్లంతాను.ఆడే గొప్పోడంతాను.

ఆల్లని పల్లెటూరి బైతుల్నాగా సూసి ఎకసెక్కెం ఆడిన మా గుంటకాయల్దే తప్పంతాను. మీరేటంతారు ?


---------------------------------------------------------------------------------------


ఇదంతా కథా మంజరి బ్లాగు టపాగా రాయదలచి నప్పుడు కొంచెం ఆలోచించాను.
వాళ్ళ జీవద్భాషలోనే,ఆ మాండలికం లోనే రాయడం సబవనిపించింది. ప్రయత్నించి చూసేను. అంతే !






31, మార్చి 2013, ఆదివారం

తమాషాగా లేదూ ? ! ...




అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !

వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ

కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.

బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
























































ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...

3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.

ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !

ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.

గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )

విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !

చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !

పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!







26, మార్చి 2013, మంగళవారం

పక్షుల, జంతువుల భాష చాలా వీజీ !!




ఆ మధ్య నేను హిమాలమాలకు వెళ్ళి నప్పుడు (హరిద్వార్ , ఋషీకేశ్ వరకూ మాత్రమే అనుకోండి. ) అక్కడ నాకు ఎదురయిన ఒక మహా ముని వద్ద ( ఆ ముని నన్ను టీ నీళ్ళ కోసం డబ్బులు అడిగిన విషయం ఇక్కడ అప్రస్తుతం అనుకోండి ) పక్షులూ జంతువుల భాష నేర్చు  కున్నాను. ఆ విద్యతోనే యాగంటి కాకుల కథ అనే టపా రాసాను. కావాలంటే దానిని ఇక్కడ చూడండి.

పక్షులూ. జంతువులతో మాట్లాడ గలిగే నా భాషా పటిమను ఉదాహరణ ప్రాయంగా కొంచెం వివరిస్తాను. చూడండి :
నేను : మేకా ! మేకా ! ఏప్రియల్ తరువాత వచ్చే నెల ఏదమ్మా
చెప్పవూ ?
మేక : మే

నేను : ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు మేలు చేసేవే నంటావా ?
కాకి : కావు .. కావు

నేను : పిచ్చుకా ! పిచ్చుకా ! గల గల , వలవల, గడగడ లాంటి జంట పదం మరోటి చెప్పు చూద్దాం !
పిచ్చుక : కిచ కిచ

నేను : ఓ శునక రాజమా ! భ అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుంది తెలుసా ?కుక్క :  (ఓస్ !  ఆ పాటి తెలియదనుకున్నావా ?  ... ఇది స్వగతం కానోపు )     భౌ !

నేను : ఓ సన్నగమా ! నీకు తెలిసిన ఓ మాజీ అమెరికా ప్రెసిడెంటు పేరు చెప్పు ?
పాము : బుస్ !

( బుష్ అనే దానికి ఇది వికృతి కావచ్చు ... )

నేను : ఓ పులి రాజా ! ప్రపంచ తెలుగు మహా సభలు ఎట్లు జరిగినవి ?

పులి :  గాండ్రు

( పులి రాజు ఇటీవలే స్పోకెన్ ఇంగ్లీషు తరగతులకు వెళ్తూ ఉండడం చేత కొంచెం  తడబడినట్టుంది. ఎక్కడ కరారావుడు పెట్టాలో తెలియ లేదు పాపం.)

నేను : ధేనువా ! పార్వతికి గల పర్యాయ పదం ఒకటి చెప్ప గలవా ?
ఆవు : అంబ !

నేను : కరిరాజా ! నెయ్యిని హిందీలో  ఏమందురు ?

ఏనుగు : ఘీఁ

నేను : నెమలీ ! నెమలీ ! ఇలాంటి టపాలు రాస్తున్నాడు, ఈ కథా మంజరి గాడికి ఏమయింది ?
నెమలి : క్రాక్ !
.చివరగా ఓ విషయం. నరుడు ద్విపాద జంతువు కనుక అతనితో మాట్లాడితే అందరికీ జంతు భాష వచ్చి
 నట్టే కదా !!
















































































































24, మార్చి 2013, ఆదివారం

ఈ ఇష్గాలంటే నా కెంతో ఇష్టం !!





నాకు మా విజయ నగరం అంటే చాలా ఇష్టం.తెలుగు కథకు పురిటి గడ్డ కనుకయిష్టం. గురజాడ తిరిగిన తావు కనుక ఇష్టం. కన్యా శుల్కం లాంటి గొప్ప నాటకం వెలిసిన ఊరు కనుక యిష్టం. ఆ నాటకం తొలి ప్రదర్శన జరిగిన ఊరు కనుక ఇష్టం. తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో నేల కనుక యిష్టం.
   నాకింకా చాలా ఇష్టాలు ఉన్నాయి. తడియారని అచ్చు వేసిన కొత్త పుస్తక మయితే ఇష్టం. అది కథల పుస్తక మయితే మరీ మరీ  ఇష్టం.  
మా ఊరి  కోట,  పెద్ద చెరువు, గంట స్తంభంమూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు,అయ్య కోనేరు, బొంకుల దిబ్బ, మహా రాజావారి కళాశాల, మా చదువుల తల్లి
 మా సంప్కృత కళాశాల,  అమ్మ లాగ అన్నం పెట్టి ఆదరించిన సింహాచల దేవస్థానం వారి అన్నదానసత్రవూ, సంగీత కళాశాల,అమ్మ వారి  కోవిల, గుమ్చీ,  రాజారావు మేడ, డంకే షావలీ మసీదు, వ్యాస నారాయణ మెట్ట,. ఇంకా దోమల మందిరం .... నిజమే  మా విజీనారం దోమలంటే కూడా నాకు చాలా ఇష్టం. మా పతంజలి చెప్పినట్టు, అవి రాత్రి వేళ కుడుతూ, కథలూ కాకరకాయలూ రాసుకోమనీ, చదువుకోమనీ సదా హెచ్చరిస్తూ ఏండేవి కదా.
నిజమే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. మా దాట్ల నారాయణ మూర్తి రాజు, పతంజలి, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, గార్లతో ఎంతో ఇష్టంగా రాత్రీ పగలూ తిరిగిన ఊరు కనుక చాలా ఇష్టం. మరింకా మా గురు దేవులు మానా ప్రగ్గడ శేషసాయి గారు మా భాగ్యవశాన  మమ్ములను సదా ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు కనుక ఇష్టం...... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇష్టాలకు అంతూ పొంతూ ఉండదు.  అలా చెప్పడం కూడా నాకు చాలా యిష్టం.

ఈ ఇష్టాల పుస్తకంలో కొన్ని పుటలు వెనక్కి తిప్పితే, మా రసాలూరు సాలూరు వస్తుంది. ఆ ఊరంటే, అక్కడి సందు గొందులతో, మురికి వాసనaతో, పేదరికపు బీద జీవిత ముఖ పత్రాలతో నాకు చాలా ఇష్టం.
అక్కడి వేగావతి నది, పంచముఖేశ్వర స్వామి వారి ఆలయం, నేను దాదాపు పాతికేళ్ళు పని చేసిన మా కాలేజీ, ...ముత్యాలమ్మ కోవిల, పారమ్మ కొండ,దూరంగా కనిపించే   కొండలూ,  అక్కడి మల్లె తోటలు, తియ్యని పాటల బాదుషా కబీర్ షా  గారు పాడిన మా కళా వేదికా,  ఇంకా, వేగావతి బ్రిడ్జి మీద సాయంత్రాలు కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుపన్న మా మిత్ర బృందమూ,.. ఒకటేమిటి ... అన్నీ గుర్తుకు వస్తాయి.

ఆ రోజులలో మా రసాలూరు సాలూరు గురించి రాపిన నా పద్యం ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. అది కూడా చెప్పి, నా ఇష్టాల జాబితా చాలా అసమగ్రంగా ఇంతటితో ముగిస్తాను ..

సీ.
పొలిమేర విడిసి తా తొలి పూజ లందు మా
    తల్లి ముత్యాలమ్మఁ దలతు నేను. !
వేగమే లేనట్టి వెర్రి బాగుల తల్లి
     వేగావతికి నుతులు వేనవేలు !
తనుఁగొల్చు భక్తుల తరియించి వేలుపు
   పరమ పావన మూర్తి పంచ ముఖుడు !
శి రాత్రి వేళలో జన సంద్రమై కాచు
కొండ పారమ తల్లి అండ మాకు !


చాల దయగల తల్లి మా శ్యామలాంబ !
వేల్పుటెకిమీడు జోతలు వేంకటేశ !
మరులు కల్పించు మాయూరి మల్లె పొదలు !
మంచి గంధము మాయూరి మంచి తనము !!




21, మార్చి 2013, గురువారం

యాగంటి కాకుల కథ .... (సరదాకి ...)


పక్షులు మనకు విపక్షులు కావు. వాటికీ మంచీ చెడూ తెలుసును.  మాట్లాడతాయి కూడానూ. నల దమయంతుల కథలో హంస నలుడితో మాట్లాడడమే కాకుండా నల దమయంతుల మధ్య రాయబారం కూడా నడిపింది కాదూ ?  సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకు పోతుంటే జటాయువు  వద్దని వారించ లేదూ ? ఆ మూర్ఖుడి చేతిలో చావు దెబ్బ తినీసిందను కోండి ... వెనుకటి కాలంలో పావురాలు కొరియర్ సర్వీసు చేసేవని తెలిసిందే
కదా ? పావురాల వేటతో  పడరాని పాట్లు పడిన సారంగధరుడిని ఓ సారి తలుచుకోండి ...
పక్షుల గురించి చాలా భోగట్టాలు రాయొచ్చు కానీ ప్రస్తుతానికి మన టపా పక్షులలో ఒక్క కాకికి మాత్రమే పరిమితం చేసుకుందాం.
   పక్షులలో కాకికి మాత్రం కొంత చిన్న స్థానం  ఉన్నట్టు తోస్తోంది. ఆబ్దీకాలప్పుడు కాకులను  కొంత మర్యాదగా చూడడం జరిగినా, వాటి పట్ల ఎవరికీ అంత సదభిప్రయం ఉన్నట్టు తోచదు.  కాకులలో మాల కాకి, బొంత కాకి , నీరుకాకి ..ఇలా చాలా రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకులు కోకిల గుడ్లను పొదిగి  పెద్ద చేస్తాయిట.  కనుక కోకిలకు కాకి పెంపుడు అని పేరు ఉంది.  ఉచ్ఛిష్ఠం  తినే కాకి పితరుడెట్టౌనురా అని ఈసడించు కున్న వారూ లేక పో లేదు. కాకమ్మ కబుర్లు , కాకి పిల్ల కాకికి ముద్దు , పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ కాకి మూక,  కాకిలా కలకాలం బతికే కంటే, హంసలా బతకడం మేలు ...కాకీ, కోకిలా రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వసతం కాలం వచ్చే సరికి ఏది కాకో, ఏది కోకిలో తెలిసి పోతుంది , కాకి గోల  ఏకాకి,, లోకులు పలుగాకులు,... ...లాంటి సామెతలు, మాటలు, శ్లోకాలూ  కూడా వాటిని ఈసడంచేవే కదా.

మా చిన్నప్పుడు బడిలో  ఒక అను ప్రాసకి ఉదాహరణగా  కాకీక కాకికి కోక. కేకీక కేకికి కోక. కాకీక కాకికి కాక 
కేకికా ? అని  చెప్పు కునే వాళ్ళం
కాకుల  ప్రవర్తన కూడా అటాగే ఉండడం వల్ల కాబోలు   వాటి  పట్ల మన నిరాదరణకు కారణం కానోపు.
కాకి బంగారానికీ కాకులకీ సంబంధం లేదు. అలాగే చికాకులకీ కాకులకీ సంబంధం అంటగ్గ కూడదు.
కాకితో కబురు చేస్తే రానా ? అనే మాటను బట్టి కాకులు కూడా కొరియర్ సర్వీసు చేస్తాయేమో అను కోవాలి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని మన వాళ్ళు అను కోవడం కద్దు.

అదలా ఉంచితే కాకుల మీద కలిగిన అపార మయిన సానుభూతితో వాటితో ఇంటర్వ్యూ చేదామనిపించింది. ఇటీవల మేము యాగంటి పుణ్య క్షేత్రానికి వెళ్ళి నప్పుడు అక్కడి కాకులతో కొంత సంభాషించేను.  నేనడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానా లిచ్చేయి. మా సంభాషణ జరిగిన తీరు వివరించే ముందు,  కాస్త యాగంటి గురించి  చెబుతాను. 

ఈ పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లా బనగాన పల్లి మండలం లోని ఎర్ర మల కొండల్లో ఉంది. ఉమా మహేశ్వరులు ఏక శిలా రూపంలో స్వయంభువుగా వెలిసిన క్షేత్రం ఇది. అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలు చేస్తూ  వచ్చి, ఇక్కడి అందాలకు పరవశించి పోయి , ఇక్కడ వేంకేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలను కున్నాడుట. తీరా ఆ విగ్రహానికి కుడి కాలి బొటన వేలు విరిగి పోవడంతో విగ్రహ ప్రతిష్ఠకు ఆటంకం కలిగిం.ది. దాంతో దానిని అక్కడే ఒక గుహలో ఉంచి, ముని తపస్సు చేసాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ముని కోరిక మేరకు అక్కడ  ఏక శిలా రూపంలో వెలిసారుట. అప్పుడు ముని,  వారిని చూసిన ఆనందందలో  యేన్ గంటిన్ ... యేన్ నేను కంటిన్... చూసాను అన్నాడుట. అదే కాల క్రమంలో యాగంటిగా మారిందిట. యాగంటి తప్పకుండా చూడ వలసిన ప్రదేశం. అన్ని అందాలు ఒక్క చోట చూసి పరవశించి పోతాం. . సహజ సిద్ధంగా ఉన్న గుహలు, కోనేరులు చాలా బావుంటాయి ...

ఇంతటి అందమైన చోట, పవిత్రమైన చోట కాకులతో నా సంభాషణా క్రమం బెట్టి దనినిన ...

నేను : ఆకాశాన్నంటిన  ధరలు దిగి వస్తాయనే మాటలు నిజమవుతాయి ?
కాకులు :  కావు ... కావు
నేను : మన రాజకీయాలు బాగు పడతాయనే ఆశలు నెర వేరేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : మన చదువులు  మనకి మంచి నడవడికను నేర్పేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : చలామణీలో ఉన్న నోట్లన్నీ అసలైనవే నంటారా ?
కాకులు : కావు ... కావు
నేను : కార్పొరేటు ఆసు పత్రులలో చిన్న రోగాలకు సైతం చేసే టెస్టు లన్నీ నిజానికి అవసర మైనవే నంటారా ?
కాకులు : కావు... కావు
నేను : తెలుగు సినిమా లన్నీ తెలుగు సినిమాలే నంటారా
కాకులు : కావు ... కావు
నేను : మా చిన్నప్పుడు మొదలైన తెలుగు టి.వి సీరియళ్ళు త్వరలో ముగింపు కొచ్చేవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : కథా మంజరి బ్లాగు టపా లన్నీ సీరియస్ గా రాసినవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : ఇంతకీ ఈ యాగంటి కాకుల కథలో చెప్పిన వన్నీ నిజాలేనా ?
కాకులు : కావు ... కావు

కాకులు చెప్పింది నిజమే.  ఎందుకంటే అస్సలు యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు.
దాని కొక ఐతిహ్యం చెబుతారు. అగస్త్యుడు తపస్సు చేసు కుంటూ ఉంటే, కాకా సురుడనే వాడు  లెక్క లేనన్ని కాకులతో వచ్చి గోల చేసాడుట. దానితో మునికి తపో భంగమయిందిట. అగస్త్యుడు కోపించి ఇక నుండీ యాగంటి పుణ్య క్షేత్రంలో ఒక్క కాకి కూడా ఉండకుండు గాక అని శపించాడుట.

అందు చేత, యాగంటి కాకుల కథ అంటూ నేను రాసిన దంతా ఏదో సరదాకి రాసినదే తప్ప మరోటి కాదు.  ఇందులో ఏవీ నిజాలు కానే కావు ... కావు ... కావు.





18, మార్చి 2013, సోమవారం

తేనె లొలికే తెలుగు పద్యం ...

ఆంధ్ర భూమి సచిత్ర మాస పత్రిక, ఫిబ్రవరి నెలలో తేనె లొలికే తెలుగు పద్యం శీర్షికన ప్రచురణ.


15, మార్చి 2013, శుక్రవారం

14, మార్చి 2013, గురువారం

కొత్త కథల పుస్తకం - వేద ప్రభాస్ కథలు





మిత్రుడు వేద ప్రభాస్ ( జె.వి.బి. నాగేశ్వర రావు)  కొత్త కథల సంపుటిని వెలువరించాడు. సాహిత్యం లో కథానికకు ప్రపంచం లోనే  ఆద్యుడైన ఎడ్గార్ ఎలెన్ పో కథను  అత్యంత వేగంగా అన్ని దేశాలకూ అన్ని భాషలకూ పంప గలిగాడంటే కథా ప్రక్రియ ఎంత లలిత మైనదో,  తెలిసి పోతుంది. ఒక మంచి కథ చదివి నప్పుడు కథ ఎంత బలమైనదో కూడా అంతే  తేలిగ్గా తెలిసి పోతుంది. అంటూ తన మాటగా చెప్పుకొన్న వేద ప్రభాస్ విద్యా రంగంలో ఉపాధ్యాయునిగా మొదలిడి అనేక పదవులు నిర్వహించి, రాజీవ్ విద్యా మిషన్ లో విజయ నగరం .జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారిగా ఇటీవలనే పదవీ విరమణ చేసారు.
అచ్చంగా ఇంత వరకూ 18 కథలూ పయనం, దేవభూమి, కొయ్య గుర్రాలు అనే నవలలు రాసారు.  రెండు నవలలు తెలుగు లోకి అనువాదం చేసారు.  రెండు కథలకు ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు కూడా అందు న్నారు, ఈ పుస్తకాన్ని తమ తల్లి దండ్రులకు అంకితం చేసారు.
దీనికి ముందు మాటగా తన  అభిప్రాయాన్ని  మల్లాది తెలియ జేస్తే , ఆప్త వాక్యాన్ని పంతుల జోగారావు రాశారు. రచయిత మంజరి తన మాటగా కథా గానం వినిపించారు,


12 కథలున్న ఈ పుస్తకం వెల వంద రూపాయలు. రచయిత పేర, ప్లాట్ నంబరు 71, నటరాజ్ కాలనీ విజయ నగరం చిరునామాకు సంప్రదించ వచ్చును. లేదా 08922220996 నంబరుకి కానీ, 9490791568 సెల్ నంబరుకి కానీ ఫోన్ చేస్తే చాలును. 

25, ఫిబ్రవరి 2013, సోమవారం

చెప్పు కోడానికి చాలా కబుర్లు ఉన్నాయి .






చాలా  కాలంగా  కథా మంజరి  లో టపాలు  ఏ వీ రాయడం  లేదుకదూ

సికందరాబాదు నుండి విజయ  నగరం  మా మకాం  మార్చడమే కారణమ్.

వీలయి నంత త్వర లో  కలుద్దాము.



10, జులై 2012, మంగళవారం

అయ్యో, చచ్చి పోయింది...


కష్టే ఫలే ... శర్మ కాలక్షేపం కబుర్లు  బ్లాగులో అమ్మయ్య బతికేడు టపా చదివాక ఇది రాస్తున్నాను.
గుండెలు పిండేసే ఆ టపా ఇక్కడ చూడ వచ్చును.  వారి టపాకి కామెంటుగా ఈ మాటలు రాయడం కన్నా, నేరుగా ఒక టపాగా ఉంచితే మరింత మందికి అందుబాటులో ఉంటుందని తలచి, ఇది రాస్తున్నాను.



ఆ టపా నన్ను అమితంగా కదిలించి వేసింది.. ఎలాగయితే నేం ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలిగేరు. ఆ భాగ్యం వారికి  కలిగింది. నా బాల్యంలో, అంటే, నాకు పదేళ్ళు ఉండే రోజులలో  నేనూ, నా మిత్రులూ కూడా కళ్ళారా చూస్తూనే ఒక మరణాన్ని నివారించ లేక పోయాం. ఆ సంఘటన తలచుకొని ఇప్పటికీ మేమంతా విచారిస్తూ ఉంటాం.

వివరాలలోకి వెళ్తే ...

మా బాల్యంలో నేనూ, నామిత్రులూ కలిసి రైల్వే కట్ట ప్రక్కగా నడుస్తూ, ఊరికి  దూరంగా ఓ చోట ఏడు కానాలు అని పిలువబడే ఒక చిన్న కానా గట్టున కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం కానా అంటే  రైల్వే పట్టాలకి అడ్డంగా కట్టిన చిన్న బ్రిడ్జి. ఓ రోజు అలా చాలా సేపు గడిపేక  చీకట్లు అలుము కుంటున్న వేళ ఇంటికి పోదాం అని అందరం లేచాం. సరిగ్గా అదే సమయంలో గూడ్సు ట్రయిన్ ఏదో  , ఒక వేపునుండి రావడం  గమనించాం. అదే సమయంలో రైలు పట్టాల మీద నెత్తి మీద మూటతో పట్టాల నడుమ నుండి నడుచుకు పోతున్న ఒకావిడ మా కంట పడింది.  వెనుక నుండి వస్తున్న రైలు శబ్దం విన బడ లేదో, పరాకుగా ఉందో తెలియదు. అలా పట్టాల నడుమ నుండి నిర్లక్ష్యంగా నడుస్తూ ఉండడం మా ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక దురలవాటుగా అందరికీ ఉండేది. కారణం, మా వెనుక బడిన ప్రాంతంలో రోజులో  మూడో నాలుగో రానీ తరుచుగా  పాసింజరు ట్రయిన్లు కానీ, గూడ్సు బళ్ళు కానీ వచ్చేవి కావు.

సరే, అదే ధీమాతో పరాకుగా  పట్టాల నడుమ నడుచు కుంటూ పోతున్న ఆమెను హెచ్చరించడానికి  గాభరాగా అందరం ఒకేసారి ప్రయత్నించాం. ఆ భయాందోళనల వల్ల అనుకుంటాము, మాలో ఒక్కరికి గొంతు పెగల లేదు. ఎంత ప్రయత్నించినా, మా నోట శబ్ధం రాలేదు.ఒకే సారి అందరకీ గొంతులు పూడ్చుకు పోయాయి. ఇంతలో జరుగ వలసిన ఘోరం జరిగి పోయింది. మా కళ్ళెదుటే ఆమెను గూడ్సు బండి చాలా దూరం ఈడ్చుకొని పోయింది. కొంత దూరంలో బండి ఆగింది. మా దుఃఖం అంతా ఇంతా కాదు. పరుగు పరుగున  అక్కడకి చేరు కున్నాం. రైలు పట్టాల మధ్య తునాతునకలై పడి ఉన్న ఆ శరీరాన్ని చూసి వణికి పోయాం.
చాలా రోజులు, కాదు, చాలా ఏళ్ళ పాటు ఆ బీభత్స దృశ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉండేది.

ఇప్పుడు చెప్పండి,  వారు తమ  ఉద్యోగిని కాపాడు కోవడంలోనూ, మేము ఆమెను కాపాడ లేక పోవడంలోనూ మన ప్రమేయం ఏమైనా ఉందంటారా ? అదే దైవేచ్ఛ అంటే అనుకుంటాను. కదూ

3, జులై 2012, మంగళవారం

గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ ... ఆడియో కూడా ...



గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ చదవండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక 1980 లో ప్రచురణ.




ఈ కథ ఆడియో  ఇక్కడ వినండి ....



25, జూన్ 2012, సోమవారం

ఇబ్బంది కాదూ ?!



మనుసులను అంచనా వేయడంలో పొరబడటం వల్ల మనం ఒక్కోసారి మంచి వారినీ , సహృదయులనూ దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ కథాంశంతో వ్రాసిన ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురణ.

కథ ఆడియో ఇక్కడ  వినండి :




ఇక్కడ కథ చదవండి ....


23, జూన్ 2012, శనివారం

ఎక్కడున్నావు, గొంగళీ ... ?

ఇటీవల శరత్ ‘కాలమ్’ లో అవినీతిని చట్ట బద్ధం చెయ్యాలి అంటూ ఒక మంచి టపా పెట్టారు.  ఇక్కడ  నొక్కి ఆ టపా చూడ వచ్చును. అది సంగతమూ, జరిగే పనీ కాక పోయినా ఆ విధంగా రచయితలు తమ ఆవేదన వెళ్ళగ్రక్కుతూ ఉండడం పరిపాటి. అదొక విషాద వినోదం.

శరత్ గారు అవినీతిని చట్టబద్ధం చెయ్యమని భావిస్తే, నేను మన ఎన్నికల విధానం పూర్తిగా రద్ధు చేసి నాయకుల ఎన్నిక  టెండరు విధానంలో జరిగితే బావుండునని  తే 3 - 2  -1991  దీ ఈనాడు ఆదివారం వారపత్రిక  లో ఎక్కడున్నావు గొంగళీ ?! అని  ఒక కథ ప్రచురించాను.  ఆ కథ మీరు  ఈ టపాలో చదువ వచ్చును.

దిగజారుడు వ్వవస్థ మీద జనాల ఉక్రోషమే ఏదో ఒకనాడు తిరుగుబాటుగా పరిణమించడం చారిత్రక సత్యమే కదా !

ఇక, కథ చదవండి ...

శరత్ ‘ కాలమ్ ’

Open publication - Free publishing - More jogh

22, జూన్ 2012, శుక్రవారం

ఎంచక్కని కల !




ఎంచక్కని కల!
నేరమయ ప్రపంచంలో
ఎన్ని జైళ్ళూ చాలడం లేదు.

            - - -
క్షణ కాలంలో
లోకంలో ఇళ్ళన్నీ జైళ్ళు గానూ,
జైళ్ళన్నీ ఇళ్ళగానూ
మారి పోయినట్టు
గమ్మత్తయిన కల !
అప్పుడు
 ఇళ్ళగా మారిన  జైళ్ళన్నీ,

పసి పిల్లల నవ్వులతో
కళకళలాడి పోయినట్టు,
ఎంచక్కని కల !




19, జూన్ 2012, మంగళవారం

అమ్మకానికి కాదు సుమా !




పోయినవి పోగా, మిగిలిన మా పుస్తకాల జాబితా  ఇది ... మా పర హస్త గత మయిన పుస్తకాలు ..రావి శాస్త్రి మొత్తం పుస్తకాల సెట్టు, అలాగే ముళ్ళపూడి వారి రచనలు, సాక్షి వ్యాసాలు, భారతి సంచికలు,  ఇంకా చాలా ... చాలా ...


17, జూన్ 2012, ఆదివారం

కొడితే కొట్టాలిరా ...!




నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 - 12 -2011 దీ సంచికలో ప్రచురణ.

14, జూన్ 2012, గురువారం

బాల్య చేష్టా విలసితమ్ !




( నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 4 - 1 -2012 దీ సంచికలో ప్రచురణ )




11, జూన్ 2012, సోమవారం

ఎవడు బతికేడు మూడు యాభైలు ...


నవ్య వార పత్రిక తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 -3 -2012 దీ సంచికలో ప్రచురణ.


5, జూన్ 2012, మంగళవారం

మంచి పద్యాలు మరోసారి ....



కాటూరి వేంకటేశ్వర రావు గారి పౌలస్త్య హృదయం  చక్కని ఖండ కావ్యం దాని పూర్తి పాఠం ఇక్కడ ఉంచుతున్నాను.
లోగడ ఈ పుస్తకం మీద ఓ టపా రాసేను. అందులో పుస్తక సారాంశాన్ని వచనంలో రాస్తూ, అక్క డక్కడ మాత్రమే కొన్ని పద్యాలను ఉదాహరించడం జరిగింది. ఓ మిత్రుడు ఇటీవల ఆ టపా  ( ఆ టపా చూడాలంటే, ఇక్కడ నొక్కండి ) చదివి మొత్తం పద్యాలు పెడితే బావుండును కదా అన్నాడు.  మంచి పద్యాలు నలుగురితో పంచు కోవడం కన్నా వేరే ఆనందం ఏముంటుంది కనుక ?

అందుకే ఆ కావ్యఖండికను ఇక్కడ ఉంచుతున్నాను. చదివి ఆనందించండి ...










2, జూన్ 2012, శనివారం

చల్లనయ్యని చూడరో ...



ఈ కృత్రిమ మంచు శివ లింగం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలో ఆర్మీ ప్రాంతంలో శివాలయంలో ఉంది. ఆర్మీ వారి అనుమతితో సివిలియన్స్ వెళ్ళి చూడ వచ్చును. ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా , పరి శుభ్రంగా చూడ చక్కగా  ఉంటుంది.  శివరాత్రి నాడు జన సందోహంతో కళకళలాడి పోతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న చిన్న గుహలాంటి దానిలో దీనిని ఏర్పాటు చేశారు. నిత్యం మంద్ర స్వరంలో  ఓంకారం వినిపిస్తూ ఉంటుంది.

30, మే 2012, బుధవారం

ముచ్చట పడి కొనుక్కొన్న ముక్కు పద్యం !





(  నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికలో తే23-11-2011 దీ సంచికలో ప్రచురణ. )

27, మే 2012, ఆదివారం

కడుపు నింపిన కమ్మని పద్యం !








విద్యా లాభము నందగోరి యిటకున్ విచ్చేసి యున్నారమున్
విద్యా దేవి దయారసంబునన్జెప్పింపంగ నుప్పొంగుచున్
విద్యా బుద్ధియు నాయువున్ యశము సమ్యగ్వృద్ధి నారోగ్యమున్
విద్యా దేవతఁ గూడి మా కొసఁగు ముర్విన్ సింహశైలాథిపా !
ఈ పద్యం మా విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి ఉచిత విద్యార్ధి భోజన సత్రంలో రోజూ రెండు పూటలా భోజనాలకి ముందు విద్యార్ధులు పఠించే పద్యం. ఈ పద్యం గురించి తలచు కుంటేనే మాకు కడుపు నిండి పోయి నట్టనిపిస్తుంది.
ఎందుకో ఈ టపా కొంచెం ఓపికగా కడదాకా చదివితే మీకే తెలుస్తుంది.
వందేళ్ళ పైబడిన చరిత్ర కలిగిన ఈ భోజన సత్రంలో ఆ నాటి నుండి ఈ నాటి వరకూ వేల వేల విద్యార్ధులు రెండు పూటలా ఉచితంగా భోజనం చేసి, నగరం లోని వివిథ విద్యా సంస్థలలో చదువుకొని అభివృద్ధి లోకి వచ్చిన వారే. ఒక విధంగా ఈ భోజన శాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు. ఇదే లేక పోతే ఎంత మంది చదువులకి దూరమై పోయే వారో. విజయ నగర ప్రభువుల వితరణకీ, వారు చేసిన విద్యా సేవకీ నిదర్శనాలుగా శతజయంతులు చేసుకొన్న పలు విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ మహా రాజా సంగీత కలాశాల, మహారాజా వారి డిగ్రీ కలాశాల, మహారాజా ప్రభుత్వ సంస్కృత కలాశాల, వాటి అనుబంధ పాఠశాలలూ ... ఇలా వివిధ విద్యా సంస్థలతో మా విజయ నగరం నిజంగా విద్యల నగరమే.
ఈ విద్యా సంస్థలన్నీ ద్వారం నాయుడు గారూ, గురజాడ అప్పారావు గారూ, ఆది భట్ల నారాయణ దాసు గారూ, తాతా సుబ్బరాయ శాస్త్రులవారూ వంటి మహా మహులు పని చేసినవే కావడం గమనించాలి. ఇలాంటి గొప్ప విద్యా సంస్థలలో చదువు కోవాలని ఎక్కడెక్కడినుండో వచ్చే పేద విద్యార్థులకు ధనాభావం వారి చదువుకు ఆటంకం కలిగించ కుండా శతాబ్ది కాలం పైబడి ఈ భోజన సత్రం అమ్మ లాగా, అన్నపూర్ణలాగా ఆదుకుంటోంది. వారి కడుపు నింపుతోంది.
విజయ నగర ప్రభువులలో 1883 -1922ల మధ్య కాలంలో జీవించిన 4వ విజయరామ గజపతి మహా రాజులవారు దీని స్థాపనకు కారకులు. వీరు 3వ విజయరామ గజపతుల వారి సతీమణి అలక్ రాజేశ్వరీ దేవి గారి మేనల్లుడు. దత్తుడు. వీరి దత్తనామం పూసపాటి 4వ విజయరామ గజపతి. వీరి అర్ధాంగి లలితకుమారి గారు. ప్రసిద్ధి చెందిన కోరుకొండ సైనిక్ స్కూలు, ఇంకా, విజయ నగరం లోని సంస్కృత కలాశాలల భవన నిర్మాతలు 4వ విజయరామ గజపతులే. వీరి దత్తత చెల్లదంటూ దాయాదులు తెచ్చిన దావాయే పెద్ద దావాగా చాలా సంచలనాత్మకమైన దావాగా అందరకీ తెలిసినదే. ఈ పెద్ద దావా విషయం లోనే గురజాడ అప్పారావు గారు చాలా కృషి చేసి దావా గెలవడానికి పాటు పడ్డారు.
ఈ ముచ్చట్లన్నీ ప్రక్కన పెడితే, ఈ భోజన సత్రం ఏర్పాటుకి చెందిన ఒక ఆసక్తికరమైన కథ పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక రోజు సాయంకాలం 4వ విజయరామ గజపతి మహారాజుల వారు తమ కోట మేడ మీద చల్లగాలికి పచార్లు చేస్తూ ఉండగా బజారు వీధి గుండా నాటు బళ్ళు బారులు తీరి వెళ్తూ ఉండడం గమనించారుట. దివాన్ గారిని ఆ బళ్ళ గురించి ప్రభువులు ఆరాతీసారుట. సింహాచలం నుండి గజపతుల వారికి చెందిన భూముల పంటల నుండి వచ్చిన ఆదాయం రూపాయలలో ఆ బళ్ళ మీద రాజు గారి కోశాగారానికి తరలిస్తున్నారని దివాన్ చెప్పారుట. వెంటనే ప్రభువులు స్పందించి, సింహాచలం భూములనుండి సాలు సాలుకీ వచ్చే ఆ ఆదాయాన్ని తమ బొక్కసంలో కలిపేసు కోవడం సరికాదని, ఆ డబ్బుతో ఏదేని మంచి పని చేయాలని తలపెట్టారు. అలా వారి ఆలోచన నుండి ఆవిర్భవించినదే ఈ అన్నదాన సత్రం. తొలి రోజులలో విద్యార్ధులే కాక పేదలూ, యాత్రికులూ కూడా ఇక్కడి అన్నప్రసాదాన్ని స్వీకరించే వారుట. కాలక్రమంలో
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహం గా మారి నగరంలోని పలు విద్యా సంస్థలలో చదువుకోడానికి వచ్చే విద్యార్ధినీ విద్యార్ధులకు భోజన వసతి చేకూరుస్తోంది.ఈ అవిచ్ఛిన్న అన్నదాన క్రతువు , తంజావూరి అన్నదాన సత్రం కంటె భిన్నంగా అన్న దానంతో పాటు విద్యా దానం కూడా చేస్తోంది. అందుకే తంజావూరి అన్నదాన సత్రం సోమరులు అనే కథలు వ్యాప్తి చెందినట్టుగా ఇక్కడి భోజన సత్రం గురించి అలాంటి కథలేవీ లేవు. పైపెచ్చు ఇక్కడి సత్రంలో భోజనం చేసి, ఇక్కడి విద్యాలయాలలో చదువుకొన్న వారిలో దేశదేశాలలో కీర్తినందిన మహా మహుల జాబితా, నాకు తెలిసినంతవరకూ చెప్పాలంటే కూడా ఈ చోటు చాలదు.

నేను మా విజయనగరం సంస్కృత కలాశాలలో (కళాశాల కాదు, కలాశాల అనేదే సరైనదని మా గురువులు చెబుతారు) భాషాప్రవీణ చదివే రోజులలో ఇక్కడ 69 నుండీ 72 వరకూ భోజనం చేసి, చదువుకొన్నాను.
ఈ విద్యార్థి భోజన వసతి గ హాన్ని చౌల్ట్రీ అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఆ రోజులలో ఇక్కడ ప్రతి రోజూ రెండు పూటలా వివిధ విద్యా సంస్థలకు చెందిన 100 మంది విద్యార్ధినీ విద్యార్ధులం భోజనం చేసే వాళ్ళం ( ఇప్పుడీ సంఖ్య రెట్టింపయిందని తెలిసింది) ఆ నాటి ముచ్చట్లు కొన్ని మీతో పంచు కోవాలని ఇది రాస్తున్నాను.
భోజనం ప్రతి రోజూ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకీ, రాత్రి భోజనం 6 గంటలకీ పెట్టడం జరిగేది. ఈ వేళలు ఉదయం పూట పాఠశాలలకీ, కలాశాలలకీ వెళ్ళే వారికీ, రాత్రి చదువుకొనే వారికీ ఎంతో సదుపాయంగా ఉండేది. ఇక్కడి సమయ పాలన గురించి ఎంత చెప్పినా చాలదు. భోజనాలు వడ్డించే పెద్ద హాలులో విద్యార్ధలందరకీ సరిపడేలా పీటలు ఉండేవి. భోజనం అరిటాకులలో వడ్డించే వారు. ( ఇప్పుడు పీటలకు బదులు కూర్చోడానికి సిమెంటు బల్లలు కట్టారు. అరిటాకులకి బదులు స్టీలు కంచాలు వాడుతున్నారు. )
భోజనంలో అన్నం, పప్పు, నెయ్యి, ఒక కూర, పచ్చడీ, మజ్జిగా ఉండేవి. భోజనం ఏ విధంగానూ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంటుంది.
వేసవి శలవులు ముగిసి, నగరం లోని విద్యా సంస్థలలో అడ్మిషన్లు మొదలయ్యాక, అవసరం ఉన్న విద్యార్థులు ఈ సత్రంలో ఉచిత భోజనానికి కూడా అర్జీ పెట్టు కోవాలి. అలా వచ్చిన అప్లికేషన్ ల లో అర్హత గలవారికి, ఒక్కో విద్యా సంస్థకీ ఇన్ని సీట్లు చొప్పున సీట్లు కేటాయిస్తారు. మా రోజులలో ఈ చౌల్ట్రీ సీటు వచ్చే వరకూ చాలా మంది విద్యార్ధులకు మా గురువులే ఏదో ఒక త్రోవ చూపించే వారు. కొందరకి తమ ఇళ్ళ లోనే భోజనం ఏర్పాటు చేసే వారు. కొందరకి తామే స్వయంగా ఎవరింటి లోనో వారాలు కుదిర్చే వారు. ఇక సత్రం భోజనానికి సీటు వచ్చిందా, ఇక వాని చదువుకి ఏ అటంకమూ ఉండదు !
మా రోజుల సంగతి చెబుతాను ....
సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల వేళకీ, సాయంత్రం ఆరు గంటల వేళకీ మా భోజన సత్రం కళకళ లాడిపోతూ ఉండేది.
శ్లోకాలు వల్లిస్తూనో, కౌముది సూత్రాలు మననం చేసుకుంటూనో, చిన్న చిన్న సాహిత్య చర్చలు చేస్తూనో మా సంస్కృత కలాశాల విద్యార్థలం సందడి చేసే వాళ్ళం. కొత్తగా పద్యాలు అల్లడం అలవరచు కొంటున్న మా చింతా రామకృష్ణ ( ఆంధ్రామృతం బ్లాగరు) లాంటి వారు ఆశుపద్యాలు అలవోకగా చెబుతూ ఉండే వారు. ఊగరా !ఊగరా !! కథల ఫేమ్ స్వర్గీయ దాట్ల నారాయణ మూర్తిరాజు ( మాకు బాగా జూనియరు) ఖాకీ నిక్కరొకటి వేసుకుని, చేతిలో తాను తయారు చేసిన ఒక లిఖిత పత్రికతో తిరిగే వాడు. అప్పటి నుండీ పత్రికా సంపాదకుడు కావాలనే ఉబలాటం అతనిలో ఉండేది. అనంతర కాలంలో అయ్యేడు కూడానూ. ఇక, నేనూ, మా పీ.వీ.బీ శ్రీరామమూర్తీ అచ్చులో వచ్చిన మా కొత్త కథల గురించి మహా ఉత్సాహంగా కలబోసుకునే వాళ్ళం. ఓ ప్రక్క మా సంస్కృత కలాశాల విద్యార్ధుల సందడి ఇలా ఉంటే, మరో ప్రక్క సంగీత కళాశాల విద్యార్ధులు ఏవేవో రాగాలాపనలతో హోరెత్తించే వారు. డిగ్రీకాలేజీ విద్యార్ధులు మాకు తెలియని పాఠ్యాంశాల గురించి సీరియస్ గా మాట్లాడుకునే వారు. ఇదంతా మా నాని బాబు గారు విద్యార్ధుల అటెండెన్సు తీసుకోడం ముగించి, ఇక వడ్డనలు మొదలెట్టండి అంటూ హోలు లోకి వచ్చే వరకూ. పులి లాంటి ఆ మనిషి రాగానే అంతా గప్ చిప్. వడ్డన బేచ్ వడ్డన మొదలెట్టేది. సత్రం భోజనం చేసే విద్యార్ధులలోనే పదేసి మందిని వారానికో సారి మారుస్తూ వడ్డన బేచ్ గా నోటీసు బోర్డులో ఉంచే వారు. దాని ప్రకారం ఆ వారం రోజులూ రెడు పూటలా ఆ విద్యార్ధులు ముందు బేచ్ కి వడ్డనలు చేసాక, లేట్ బ్యాచ్ విద్యార్ధులతో కలసి అన్నాలు తిని తమ విద్యాసంస్థలకి వెళ్ళాలి.
ఒక విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యార్ధికీ ఈ వడ్డన బేచ్ లో వారం రోజుల పాటు వడ్డించాల్సిన పని రెండు మూడు పర్యాయాలు తగిలేది. కొంతమంది భోజన ప్రియులు ఐచ్ఛికంగా వడ్డన బేచ్ లో ఉండడానికి కుతూహలం చూపుతూ ఉండే వారు. అలాగయితే కావలసినతం తిన వచ్చునని వారి ఆలోచనగా ఉండేది. నిజానికి అక్కడ ఎవరికి కావలసినంత వారికి వడ్డన జరిగేది. వడ్డన బేచ్ కి ఉండే అవసరమే లేదు. కానయితే, కమ్మనయిన నెయ్యి కావలసినంత ముద్ద పప్పులో జారీతో ఒంపుకో వచ్చు ననే జిహ్వచాపల్యమే వారు
వడ్డన బేచ్ లో ఉండేందుకు ఇష్ట పడడానికి కారణమనుకుంటాను.
ఈ సత్రం భోజనాల నిర్వహణ చూసే మా నాని బాబు గారి గురించి చెప్పక తప్పదు !
కొంచెం మాసిన పంచె, తెల్లని పొట్టి చేతుల జుబ్బా, ‘సాదా సీదాగా కనిపిస్తూ,వృద్ధాప్యం మీద పడుతున్నట్టు కనిపించినా, కొంచెం బొంగురు గొంతుతో ఖణీమని మాట్లాడే పెద్ద గుమస్తా నాని బాబు గారంటే అందరకీ ఎంతో గౌరవం, భక్తీ ఉండేవి. అంతే ఇష్టం కూడా ఉండేది.
కర్తవ్య నిర్వహణలో నిబద్ధతా, గొప్ప మానవీయ దృక్పథమూ, కలిగిన నాని బాబు గారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలి.
మొత్తం వందమంది విద్యార్ధులనూ వారి వారి రోల్ నంబర్లతో పాటూ వారి పేర్లతోనూ గుర్తుంచుకొని పిలిచే వారు. సమయపాలన ఎంత ఖచ్చితంగా పాటించే వారంటే, ఏ రోజయినా భోజనాల వేళలో ఒక్క నిముషం అటూ ఇటూ అవనిచ్చే వారు కాదు. అర నిముషం ఆలస్యంగా వచ్చినా సరే ఆ పంక్తిలో కూర్చోడానికి వీలు లేదంతే. లేట్ బేచ్ కి వేచి ఉండాల్సిందే. వడ్డనల బేచ్, లేట్ బేచ్ వాళ్ళూ కూడా తినడాలు పూర్తయాక వచ్చే వాళ్ళు ఆ పూటకి వెనక్కి తిరిగి పోవలసినదే. అలాంటి వాళ్ళని ఒక్కోసారి రహస్యంగా వెనక్కి పిలిచి, ఓ పావలా చేతిలో ఉంచుతూ ఏ పకోడీలో కొనుక్కు తినరా నాయనా ! రేపటి నుండి లేటుగా రాకేం !’’ అని హెచ్చరించే వారు. విద్యార్ధుల అటెండెన్సు విషయంలో ఇంత కఠినంగా ఉండే నాని బాబు గారు ఒక్కడి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చే వారు. వాడే మా ఆచారి.
ఆ రోజుల్లో మా కలాశాల విద్యార్ధి ఒక ఆచారి ఉండే వాడు. ( పేరు కావాలనే చెప్పడం లేదు) వాడు అమిత భోజన ప్రియుడు. తిండి పుష్ఠి జాస్తి. అందు చేత పెద్ద గుమస్తా నాని బాబు గారు, వాడు సరైన వేళకే సత్రానికి వచ్చినా, ఎప్పుడూ కావాలనే లేట్ బేచ్ కి ఉంచేసే వారు ! ‘‘ నువ్వుండరా, లేటు బ్యాచ్ లో తిందువుగాని !’’ అంటూ ...
అలాగయితే వాడు కావలసినంత తింటాడని !
వాడు ఒక్కడూ ఒక మూలకి చేరి తనే స్వయంగా వడ్డించుకు తింటూ ఉంటే, ‘‘ ఒరే, ఆచారీ, ఆ నేతి జారీలో నెయ్యిని ఒక్క చుక్కయినా మిగిల్చేది ఉందా, లేదా !’’ అంటూ నవ్వుతూ, ఎంతో దయగా పలకరించే వారు !
వారి దయాస్వభావానికి మరో మంచి ఉదాహరణ చెబుతానఒక యేడాది సత్రం భోజనాలకి సెలక్టు చేసిన విద్యార్ధుల జాబితా సత్రం నోటీసు బోర్డులో ఉంచారు. అందులో పొరపాటున ఒక విద్యార్ధి పేరుకు బదులు ఇంకొక విద్యార్ధి పేరు టైపు చేయడం జరిగింది. ఇద్దరి పేర్లూ, ఇంటి పేర్లూ, తండ్రుల పేర్లూ ఒకలాగే ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగింది. అయితే, ఆ విద్యార్ధులిద్దరూ ఒకే పాఠశాలకి చెందిన వారు మాత్రం కారు. లిష్టులో తను చదివే పాఠశాల పేరు తప్పుగా ఉన్నా, తన పేరు చూసుకొని ఒక విద్యార్ధి రోజూ వచ్చి భోజనం చేయడం మొదలు పెట్టాడు. అసలు సీటు వచ్చిన విద్యార్ధి మాత్రం తనకు సీటు లభించ లేదనే నిరాశతో వాడి స్వతం గ్రామం వెళ్ళి పోయాడు. వారం రోజులకి జరిగిన ఈ పొరపాటు ఎవరో గుర్తించడం జరిగింది. అంతే. ఇంత వరకూ వస్తున్న విద్యార్ధిని సత్రం నుంచి తొలగిస్తూ ఇకపై రావద్దని నోటీసు ఉంచారు. అసలు విద్యార్ధికి సీటు ఇచ్చినట్టుగా వర్తమానం చేసారు. ఇదంతా పై అధికారుల స్థాయిలో జరిగింది. అంతే పెద్ద గుమస్తా నాని బాబు గారు అగ్రహోదగ్రులయ్యేరు ! ‘‘ వాడికి సీటు రాక పోవచ్చును. ఏదో పొరపాటు జరిగి ఉండ వచ్చును. వాడు ఈ వారం రోజులుగా శ్రీ సింహాచల స్వామి వారి అన్న ప్రసాదం తింటున్నాడు. ఇవాళ వాడి నోటి ముందు కూడు తీసేస్తామనడం సరి కాదు. కావాలంటే వాడికీ వీడికీ కూడా సీట్లు ఇవ్వండి. ’’ అంటూ అధికారులతో వాదులాడేరు. అధికారులు అది సాధ్యం కాదు పొమ్మన్నారు. ‘‘ స్వామి ప్రసాదం తింటున్న వాడిని కాదని పొమ్మనడం నా వల్ల కాదు. వాడిని సత్రం నుండి తొలిగిస్తే, నన్నూ ఈ ఉద్యోగం లోనుండి తొలగించండి. నేను రాజీనామా చేస్తున్నాను ’’ అని నాని బాబు గారు పెద్దలతోకుండ బ్రద్దలు కొట్టేలా చెప్పారు. ఆ మానవతా దృక్పథానికి, న్యాయ పోరాటానికీ అధికారులు దిగి వచ్చేరు. సత్రం చరిత్రలో ఏ యేడూ లేని విధంగా ఆ ఏడాది నూటొక్క మంది కి సీట్లు ఇవ్వడం జరిగింది !
ఒక పేద గుమస్తా మానవత్వంతో సాధించిన గొప్ప నైతిక విజయమిది !
మేము భాషాప్రవీణ నాలుగో సంవత్సరంలో ఉండగా నాని బాబు రిటైరయి పోయారు. మేమంతా చందాలు పోగు చేసుకొని నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. సత్రంలో మేం భోజనాలు చేసే పెద్ద హాలు ఒక్కటే ఉంది. అక్కడే నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం జరుపు కోవాలని తలపెట్టాం. కార్యక్రమం సాయంత్రం అయిదింటికి మొదలయింది. పావు తక్కువ ఆరు అవుతోందో , లేదో,, ‘‘ ఇహ చాలు ! భోజనాలకి లేవండి !’’ అంటూ, తటాలున కుర్చీ లోనుంచి లేచి పోయేరు పెద్ద గుమస్తా గారు. మేమంతా బిక్క చచ్చి పోయేం.
ఇంకా సభా కార్యక్రమం చాలా ఉంది.
వేయాల్సిన దండలు ఇంకా చాలా ఉన్నాయి.
మా సంస్కృత కలాశాల విద్యార్ధి కవులు రాసు కొచ్చిన కవితలు చదవడం ఇంకా పూర్తి కానే లేదు.
సంగీతం కలాశాల పిల్లలు ఆయన గురించి స్వర పరచుకొని వచ్చిన పాటలు పాడడమే కాలేదు.
పెద్దల ప్రసంగాలు సగమైనా కాలేదు.
చదవాల్సిన సన్మాన పత్రాలు చదవనే లేదు.
మా అందరకీ ఎంతో అసంతృప్తిగా ఉన్నా, ఆయన మాటలు కాదన లేని స్థితి. అసలు సమ్మానితుడే స్టేజి దిగి పోయేక, ఇంకా సన్మాన కార్యక్రమ మేమిటి !
భోజనాలు రాత్రి తొమ్మిది వరకూ. లేటు బ్యాచి వాళ్ళూ, వడ్డన బ్యాచి వాళ్ళూ తినడాలు పూర్తయి,
పని వాళ్ళు హాలంతా శుభ్రం చేసాక కార్య క్రమం మళ్ళీ మొదలెడదామని ఉబలాట పడ్డాం. ఎలాగయితేనేం వారిని మరో గంట సేపు కార్యక్రమం జరపడానికి బలవంతం మీద ఒప్పించాం. అయిష్టంగానే ఒప్పుకొన్నారు.
ఆ కాస్సేపూ ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నారు. ఆ గంటా కాగానే ‘‘ ఇక ఈ ఆటా పాటా చాల్లెండర్రా !
ఇళ్ళకు పోయి చదువుకోండి ’’ అనేసి మళ్ళీ వేదిక దిగి పోయారు మా నాని బాబు గారు.
దండలు వేస్తామంటే ఒంటెల్లా మెడలు చాచుకు కొని తయారయి పోయే వాళ్ళని చూస్తాం. ఇలాంటి నిరాడంబర మయిన మానవతా వాదులనీ, కర్తవ్య పరాయణులనీ ఎక్కడో కానీ చూడం ! కదూ !
.కడుపు చల్లని తల్లి మా విజయ నగరం. అక్కడ భోజనం చేసి చదువుకొన్న వారెవరయినా, ఆ ప్రాంతాలకు వెళ్ళి నప్పుడు ఏమాత్రం వీలున్నా మా శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహాన్ని కళ్ళారా ఒక్క సారయినా చూసు కోనిదే రారు.
రోజూ కాక పోయినా, ఎక్కడయినా పంక్తి భోజనాలు జరిగే టప్పుడు అక్కడ భోజనం చేసిన వారికి ఈ పద్యం గుర్తుకు రాక తీరదు.
ఎందు కంటే, ఎందరికో కడుపు నింపిన కమ్మని పద్యం కదా యిది !