9, డిసెంబర్ 2010, గురువారం

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !


భోజ రాజు ముఖం చూస్తూనే కవిత్వం పుట్టుకు వస్తుందిట.

ఒక రోజు భోజుడు కొలువు తీరి ఉండగా, భద్ర మణి అనే మహా పండిత కవి అక్కడికి వచ్చేడు. అప్పటికే భోజుని సింహాసనం ప్రక్కన కుడి వేపు కాళి దాస కవి సుఖాసీనుడై కూర్చుని ఉన్నాడు.
విధి లేని సరిస్థితిలో అయిష్టంగానే భద్ర మణి ఎడమ వేపు కూర్చున్నాడు. అది అతనికి అవమాన కరంగా తోచింది. మనసు కుత కుతలాడి పోయింది. ఎడమ వేపు కూర్చోవడంతో తను కాళి దాసు
కన్నా, తక్కువ అనే ఆత్మ న్యూనతా భావం అతనిని కలచి వేసింది. మరి ఉండ లేక ఈ శ్లోక పాదాలు చెప్పాడు:

గృహ్ణోత్యేష రిపో శ్శిర: ప్రతి జనం కర్షత్య సౌవాజినం
ధృత్వా చర్మ ధను: ప్రయాతి సతతం సంగ్రామ భూమావసి
ద్యూతం చైర్య మధ స్త్రియంచ న పదం .జానా వినాయాం కర:

ఈ మూడు శ్లోక పాదాల అర్ధమూ ఇది:

ఎడమ చేయి ముందుగా శత్రువు శిరస్సును పట్టుకుంటుంది. ముందుకూ వెనుకకూ లాగి గుంజుతుంది. బాణం వేసే ముందు విల్లు పట్టు కుంటుంది. జూదం, స్త్రీలను బలాత్కారం చెయ్యడం, పనికి మాలిన శపథాలు చెయ్యడం మొదలయినవి చెయ్యదు.

ఇలా భద్ర మణి ఎడమ చేయి గొప్ప తనాన్ని పొగడడం ద్వారా ఎడమ వేపు కూర్చోవడం వలన తనకి వచ్చిన చిన్న తనం ఏమీ లేదని చాటుకో డానికి ప్రయత్నించేడు.

వెంటనే కాళి దాసు శ్లోకం నాలుగో పాదాన్ని పూరించి, ఆ కవికి తేరుకో లేని గట్టి చురక అంటించేడు.

కాళి దాసు పూరించిన నాలుగో పాదం ఇది:

దానాద్యితరం విలోక్య విధినా శౌచాధి కారి కృత:

ఎడమ చేతికి దానం చేసే అర్హత లేనందు వలన బ్రహ్మ దానికి నీచమైన పనులు చేయమని నియోగించాడు సుమా !

కాళి దాసు పూరించిన శ్లోక పాదం విని కవి గారికి దిమ్మతిరిగి పోయి ఉంటుంటుంది. కదూ?

అంచేత, ఊరికే కుడి ఎడమల తగువులతో సరి పుచ్చక మనకి దక్కగల గౌరవం మనకు దక్కిన స్థానం బట్టి కాక, మన ప్రతిభా వ్యత్పత్తులను బట్టి ఉంటుందని గ్రహించాలి.


స్వస్తి.

7, డిసెంబర్ 2010, మంగళవారం

నస మంజరి


అజాత మృత మూర్ఖాణాం, వర మాద్యౌ న చాంతిమ:
సకృ ద్దు:ఖ కరా వాద్యా, వంతిమస్తు పదే పదే.

ఈ శ్లోకంలో కవి ముగ్గురి గురించి చెబుతున్నాడు.

ఇంకా పుట్టని వాడు , చని పోయిన వాడు, మూర్ఖుడు.

ఈ ముగ్గురిలో కడపటి వాడి కంటె ముందున్న ఇద్దరే మేలు. అంటే, ఇంకా పుట్టని వాడు, చని పోయిన వాడు - వీళ్ళిద్దరూ ఒక్క సారే దు:ఖాన్ని కలిగిస్తారు. కాని ఈ ఆఖరున చెప్పిన వాడున్నాడే, మూర్ఖుడు , వాడు మాత్రం మాటి మాటికి దు:ఖాన్నే కలిగిస్తూనే ఉంటాడు.

అంటే ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు. అని కవి చెబుతున్నాడు.

అలాంటి మూర్ఖులు వంద మంది ఉండడం కన్నా, గుణవంతుడైన ఒక్క కుమారుడు ఉంటే చాలని కూడా చెబుతున్నాడు.

వర మేకో గుణీ పుత్రో, నచ మూర్ఖ శతైరపి
ఏక శ్చంద్ర స్తమో హంతి, నచ తారా గణో2పి చ.

మూర్ఖులైన పుత్రులు వంద మంది కన్నా, మంచి గుణాలు కలిగిన వాడు ఒక్కడు చాలును. కోట్ల నక్షత్రాల కన్నా, చీకట్లు పార ద్రోలే చంద్రుడు ఒక్కడు చాలును కదా అని దీని భావం.

పరి వర్తిని సంసారే, మృత: కోవా న జాయతే
స జాయతో యేన జాతేన, యాతి వంశ స్సమున్నతిమ్

ఈ సంసారము చావు పుట్టుకలతో కూడినది. కనుక ఇచ్చట చని పోయిన వాడు ఎవడు తిరిగి పుట్టడం లేదు ? కాని, యెవని పుట్టుక వలన వంశం కీర్తిని పొందుతూ ఉందో, వాని పుట్టుక మాత్రమే సార్ధకమైనది. అని దీని భావం.

కులము లోన నొకడు గుణ హీనుడుండిన
కులము చెడును వాని గుణము వలన
చెఱకు వెన్ను బుట్టి, చెరపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినుర వేమ

ఒక గుణ హీనుడు చాలు, మొత్తం వంశానికంతటికీ చెడ్డ పేరు తీసుకుని రావడానికి. చెఱకు గడ చివర వెన్ను పుడితే దాని తీపి అంతా నశించి పోతుంది కదా అని వేమన చెప్పనే చెప్పాడు కదా.

బద్దెన కూడ దీనినే తిరుగ రాసాడు

కొఱగాని కొడుకు పుట్టిన
కొఱగామియె కాదు, తండ్రి గుణముల చెఱచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెఱచు కదరా సుమతీ !

కొడుకులు పుట్ట లేదో అని ఏడిచే వారికి హెచ్చరికగా ధూర్జటి ఈ పద్యం చెప్పాడు.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నే గతుల్
వడసెన్? పుత్రులు లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్?
చెడునే మోక్ష పదంబపుత్రకునకున్ శ్రీ కాళ హస్తీశ్వరా.

బ్రతుకు మీది మమకారంతో అయ్యో, కొడుకులు పుట్ట లేదే, అని ఏడుస్తూ ఉంటారు. కురుపతికి వంద మంది కొడుకులు పుట్ట లేదా? వారి వలన అతనికి ఏ సద్గతులూ లభించ లేదు. పుత్రులే లేని శుకునికి మంచి గతులే లభించాయి. పుత్రులు లేని వారికి మోక్ష పదవి రాదను కోవడం సరి కాదు .

అందు వలన మందితో పని లేదని తెలుసు కోవాలి.

తెలియని కార్య మెల్ల కడ తేర్చుట కొక్క వివేకి చే కొనన్
వలయు, నట్లైన దిద్దు కొన వచ్చు, ప్రయోజన మాంద్య మేమియున్
కలుగదు, ఫాల మందు తిలకంబిడు నప్పుడు చేత నద్దమున్
కలిగిన చక్క చేసి కొనుగాదె, నరుండది చూచి భాస్కరా.

ఒక తెలివయిన వాని సహకారంతో ఎంతటి దుష్కర కార్యాన్నయినా చక్కగా నిర్వర్తించ వచ్చును.
చేతిలో అద్దం కలిగి ఉంటే, దానిని చూసి చక్కగా తిలకం దిద్దు కో వచ్చును కదా.

ఒక్కడు చాలునని చెప్పడాని మరీ ఇన్ని ఉదాహరణలు చెప్పాలా ! ఒక్కటి చెబితే చాలదూ ?
చాదస్తం కాక పోతే ! కథా మంజరి పేరు మార్చి నస మంజరి అని పెట్టుకో, ఫో అంటారా? తమ దయ. మద్భాగ్యం.

స్వస్తి.





2, డిసెంబర్ 2010, గురువారం

దెబ్బల రాజ్యం లో దబ్బఱ నీతులు















అమాయక గిరిజనులను మైదాన ప్రాంత వ్యాపారులు దోపిడీ చేయడంలో అనేక విధాలయిన మెళకువలు
చూపుతూ ఉంటారు. వాటికి చెందిన ఒక దోపిడీ విధానమే అడ్డకి పడ్డ అనేది.

మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకటి రోజులలో తరుచుగా వినిపించే ఈ మాటకి అర్ధం నాకు తెలిసేది కాదు. మా నాన్న గారు చెప్పిన దాని ప్రకారం, అమాయక గిరిజనులకి మైదాన ప్రాంతీయులు అడ్డ ( వెనుకటి కొలమానం. అడ్డ, తవ్వ, సేరు, కుంచం మొదలయినవి. నాలుగు అడ్డలు ఒక కుంచం అనే వారు) తో వారికి కావలసిన ధాన్యమో, బియ్యమో కొలిచి అప్పుగా ఇచ్చే వారుట. కొంత కాలానికి ఆ అడ్డెడు అప్పుకి వారు తీర్చ వలసిన బాకీని చక్ర వడ్డీతో లెక్క కట్టి, దొంగ లెక్కలు వేసి ఇబ్బడి ముబ్బడిగా పెంచి, అధిక మొత్తంలో బాకీ పడినట్టుగా తేల్చి చెప్పే వారుట. అంత బాకీ చెల్లించ లేని గిరిజనులు తాము తీసుకున్న అడ్డెడు అప్పు నిమిత్తం తమ ఇంటిలో ఉండే ఏ ఆవు పెయ్యనో ( దానినే పడ్డ అనే వారు) ఇచ్చేసే వారుట. ఇదీ అడ్డకి పడ్డ కథ. ఇది దోపిడీకి పరాకాష్ఠ .

అఙ్ఞానం, అమాయకత్వం ఉండే చోట కుటిల వ్యాపారులు తమ మోసపు వ్యాపారపు మెళకువ లన్నీ చూపెడుతూ ఉంటారు.

గ్రామాలలో చిల్లర వ్యాపారులు దినుసులను అమ్మడమే కాక, కొనడం కూడ చేస్తూ ఉంటారు.
ఆ దినుసలను వారు కుంచంతో కొలుస్తూ ఉంటారు. తాము రైతు వారీ నుండి దినుసులను కొనవలసి వచ్చి నప్పుడు ‘‘ పెద్దమ్మీ, కుంచం పట్రా ’’ అని ఇంట్లోకి కేక వేసే వారుట. ఇంట్లో రెండు సైజుల కుంచాలు ఉంటాయిట. ఒకటి పెద్దదీ, రెండోది చిన్నదీనూ. వ్యాపారులు రైతు వారీ నుండి తాము దినుసులు కొనడానికి పెద్దమ్మాయిని కుంచం తెమ్మని కేకెయ్యడంలో కిటుకు, ఇంట్లో ఉన్న పెద్ద కుంచం తెమ్మని అనడం, తమకి కొలతకు ఎక్కువగా దినుసులు రావడం కోసం ఇంట్లోంచి పెద్ద రకం కుంచం తెమ్మని సంకేతం, అదే, తాము అమ్మ వలసిన దినుసుల కొలతకి చిన్న సైజు కుంచమయితే, తమకి లాభం కనుక, ’’ చిన్నమ్మాయ్, కుంచం తే ‘‘ అని, చిన్న కుంచం తెమ్మని సంకేతాన్ని పంపే వారని మా నాన్న గారు చెబుతూ ఉండే వారు.

కుటిల వ్యాపారులు ఎన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటారో తెలియ జేస్తూ ఒక కవి ఈ శ్లోకం వ్రాసేడు. చూడండి:

తులేన కించిత్ తులయా చ కించత్, మానేన కించిత్ శపథేన కించిత్
కించిచ్చ కించిచ్చ హర త్యశేషవ, వణిక్సమో నాస్తి ప్రశస్త చోర:

అసలు త్రాసు లోనే కొంత తిరకాసు ఉంటుంది. తక్కెడ సరిగా ఉండదు. ఎప్పుడు తూచినా, ఆ తక్కెడ అమ్మే వాడికే లాభదాయకంగా తప్పుడు తయారీతో ఉంటుంది. ( సరుకులు వేసే తక్కెడ క్రింద అయిస్కాంతం ముక్క పెట్టడంలాంటి గిమ్ముక్కులు కూడానూ)

ఇక, తూచడంలో కొంత మోసం. దుకాణంలో తూకం సరి పోయి నట్టుగానే అనిపిస్తుంది. ఇంటికి పోయి కొలుచు కుంటే, ఎంతో కొంత తరుగు కనిపిస్తుంది. అదెలా జరిగిందో తెలియక జుట్టు పీక్కోవడమే . ఆ కిటుకు మనకి తెలీనంత ఒడుపుగా చేసే వ్యాపారులుంటారు.

ఇక, కొల మానంలో మరి కొంత మోసం, తన నిజాయితీని నిరూపించుకుంటూ వేసే ఒట్ల తో కొంత, యిలాగ కొంచెం కొంచెంగానే కాజేసి, చివరికి ఏమీ మిగల కుండా చేసే వ్యాపారిని మించిన చోరాగ్రేసరుడు మరొకడు ఉండ బోడని కవి ఈ శ్లోకంలో చెబుతున్నాడు.


టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలు తెలిస్తేనా కదా, అంతంత కూడ బెట్ట గలిగేది?

త్రాసు, తూచడం గురించి చెబుతున్నాను కనుక, మీకు రెండు పిల్లులు, ఒక కోతి కథ గుర్తు చేయడం సమంజసం.

రెండుపిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచు కోవడంలో వాటికి తగాదా వచ్చింది. తగవు ఎటూ తేలక, అవి తగువు తీర్చమని ఒక కోతి దగ్గరకి వెళ్ళాయి.

ఆ కోతి సరేనని ఆ రొట్టె ముక్కని రెండు సమాన భాగాలుగా చేసి. ఇచ్చే మిషతో ఒక త్రాసులో రొట్టె ముక్కలు వేస్తుంది. ఒక సారి అందులో ముక్క పెద్దదయి పోయిందనీ, మరొక తూరి ఇందులో ముక్క చాల లేదనీ కబుర్లు చెబుతూ, ఆ రొట్టె ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా త్రుంచి నోట్లో వేసు కోవడం మొదలు పెట్టింది.

వెర్రి పిల్జలులకు జరుగుతున్న దేమిటో అవగతమయే లోపల ఆ కోతి మొత్తం రొట్టెను చప్పరించీసి, త్రేన్చిందిట.

జెల్ల కొడితే, దెబ్బ తినే వాడు తేరుకోక ముందే జెల్ల కొట్టీవాలి అనేది కుటిల వ్యాపారపు నీతి.

దెబ్బల రాజ్యంలో ఇలాంటి నీతులకి విలువ ఎక్కువ మరి.

మరో విషయం -


కథా మంజరిలో ఇది నా 199 వ టపా. మరి , నా 200 వ టపా రేపే విడుదల !

నా 200 వ టపా ... ( విరమణ .. ... కాదు ... ... విరామం )


ఇది నా 200వ టపా. ఈ సందర్భంగా నేను రాసిన వాటిలో కొన్ని టపాలు ఒకే చోట చూడండి ...






























































కథా మంజరిలో నా కథల టపాలు:

















పుస్తక పరిచయాలు:







7. జగన్నాథ రధ చక్రాల్ ... ! ఆ ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులో ?!


ఇతరాలు:








నవలిక


మా శ్రీమతి కథలు




ప్రత్యేకం


నన్ను బ్లాగు లోకానికి పరిచయం చేసిన శ్రీమతి వలభోజు జ్యోతి, శ్రీ చింతా రామ కృష్ణారావు, డాక్టర్ శ్రీమతి సుధా రాణి గార్లకు మరో సారి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నాను.

కౌముది వెబ్ పత్రికలో అనగనగా ఒక మంచి కథ శీర్షికన నా కథలు వేడుక ( జూన్ 2010 ) , గుండె తడి
( నవంబరు2010) ప్రచురించిన కౌముది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నా బ్లాగుని చదువరుల చెంతకు చేర్చిన సంకలినులు కూడలి, హారం, జాల్లెడ, మాలిక , సమూహము వీటి బాధ్యులకు మరీ మరీ ధన్యవాదాలు.

నా బ్లాగు టపాలను ఆదరించిన వారందరికీ నా కృతఙ్ఞతలు.

200 టపాలు పూర్తయ్యాయి. ఇక మీదట నాకు గల వేరే వ్యాపకాల వల్ల కొంత విరామం పాటిద్దామనుకుంటున్నాను. ( పాఠక స్వగతం : హమ్మయ్య ! రక్షించేవు నాయనా ! పండుగ చేసుకుంటాం)

ఇది విరమణ కాదు, విరామమే. ( పాఠక స్వగతం: మళ్ళీ ఈ పితలాటకఁవా? హన్నా !! )


ధన్యవాదాలు ... మీ, కథా మంజరి

మనశ్శల్యాలు


లోకంలో మనస్సునకు చాల బాధ కలిగించే ఏడు విషయాల గురించి ఈ శ్లోకంలో కవి చెబుతున్నాడు.

చూడండి ...

శశీ దివస ధూసరో గళిత యౌవనా కామినీ
సరో వితగ వారిజం, ముఖ మనక్షరం స్వాకృతే:
ప్రభు ర్దన పరాయణ:, సతత దుర్గతి స్సజ్జన:,
నృపాంగణగత: ఖలో మనసి సప్త శల్యాని మే.

నాకు లోకంలో ఏడువిషయాలు మనశ్శల్యాలై నన్ను బాధిస్తూ ఉంటాయి అని కవి వాపోతున్నాడు.

అవి ఏమంటే,

తెల్లవారగానే వెల వెల పోయే చంద్రబింబం
యవ్వనం సడలి పోయిన కామిని
పద్మాలు లేనట్టి చెఱువు
అక్షరం ముక్క లేనట్టి సుందర వదనం
ధనాశా పరుడైన ప్రభువు
సత్పురుషుల నిత్య దారిద్ర్యం
అధికారుల దగ్గర ఎప్పుడూ పరమ తుంటరులకే చేరిక ఉండడం.

ఇవీ కవిగారిని బాధించే ఏడు విషయాలు.

రేయంతా నేల మీద అంతటా చక్కగా పరుచు కున్న వెన్నెల తెల్ల వారగానే వెలవెలబారి పోవడం చూస్తూ ఉంటే ప్రకృతిని ఆరాధించే ఎవరికయినా బాధాకరమే.

యవ్వనం సడలి పోయిన కామిని రూపం చూడనలవి కానిదట.
చెఱువులో పద్మాలు ఉంటేనే అందం.
ఎంత అందగాడయినా, నిరక్షర కుక్షి అయితే, వాడి ముఖం చూడాలనిపించదు మరి.
ధనాశా పరుడైన రాజు ముఖం కూడా చూడ్డానికి పరమ దరిద్రంగా ఉంటుంది.
నిత్యం అష్ట కష్టాలు పడుతూ, దరిద్రం ఓడుతూ ఉండే మంచి వారి స్థితి ఎవరికయినా బాధాకరమే.

ఇక, రాజుల కోటరీలో మంచి వారికి అణు మాత్రమైనా చోటు లేకుండా, నేర చరితులకూ, దుష్టులకూ, దగా కోరులకూ, అవినీతి పరులకూ, వంచకులకూ, మాత్రమే చోటు ఉండడం చూస్తే ఆలోచనాపరులైన వారెవరికయినా బాధని కలిగిస్తుంది కదూ?

1, డిసెంబర్ 2010, బుధవారం

ఆ పైన నీ ఇష్టం


బృహత్సంహిత లోని ఈ శ్లోకం చూడండి ...

జయే ధరిత్ర్యా: పుమేవ సారం, పురే గృహం సద్మని చైక దేశ:
తత్రా2పి శయ్యా, శయనే వరా స్త్రీ, రత్నోజ్వలా రాజ్య సుఖస్య సార:

దేశం ఎంత విశాలంగా ఉండనీ, కేంద్రమైనది నగరమే. నగరం ఎంత పెద్దదిగా ఉండనీ, తన ఇల్లే ఎంతో ప్రీతి పాత్రంగా ఉంటుంది. తన ఇల్లు ఎంత పెద్దదిగా ఉండనీ, దానిలో తన పడక గదే శాంతిని కలిగిస్తుంది. ఆ పడక గదిలో కూడ మిక్కిలి విశ్రాంతిని ఇచ్చేది శయ్య. ఆ శయ్యా సుఖం కూడ పూర్తిగా పొందాలంటే స్వీయానురక్తయై, ఉత్తమురాలైన భార్య వల్ల మాత్రమే మనశ్శాంతి చేకూరుతుంది. అని దీని భావం.

అంటే, మహారాజుకైనా స్వగృహం మాత్రమే శాంతిని ఇస్తుందనీ, అందునా, అనురక్త ఐన భార్య మాత్రమే చిత్త శాంతినీ, సౌఖ్యాన్నీ ఇవ్వగలదనీ తెలుసు కోవాలి.

మన ఇంట లేని సౌకర్యాలు ఎన్నింటిని అతిథి మర్యాదలు చేసే చుట్టాలు సమకూర్చినా, మరీ ఎక్కువ రోజులు అక్కడ ఉండాలనిపించక పోవడం అందరకీ అనుభవం లోకి తరుచుగా వచ్చే విషయమే.

ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుదామా, మన ఇంట , మన పడక గదలో, మన మంచం మీద సేద దీరుదామా అని ఊరికే ఇదయి పోతాం.

ఇది నాది అను కోవడంలో ఉండే తృప్తితో ఏదీ సాటి రాదు.

అందుకే పెద్దలు గృహమే కదా స్వర్గ సీమ అన్నారు.

దానిని స్వర్గ ధామం చేయడమూ, నరక తుల్యంగా మార్చడమూ కూడ మన చేతుల్లోనే ఉంది. కదూ?




30, నవంబర్ 2010, మంగళవారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?!


( నీ హిత వచనమ్ డాట్ కామ్ సిగ్గోసిరి. మధ్యలో నన్నెందుకు
లాగుతావూ ?! హన్నా !!)


ఒక శ్లోకం చూడండి:

అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే
శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:

నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !

ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.

అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.

పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.

సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.

24, నవంబర్ 2010, బుధవారం

ఒక పరి దైవం ... ఒక పరి దెయ్యం !


ఉదయాన్నే వచ్చేడు, మిత్రుడు భీమ్ పాపాల శర్మ. వాడిని చూస్తూనే నా గుండె తరుక్కు పోయింది.పది లంఖణాలు చేసిన వాడిలా ఉన్నాడు. మనిషిలో ఉత్సహం ఎక్కడా మచ్చుకయినా లేదు. దెయ్యాలతో సయ్యాట లాడించ గలవాడూ, హత్యలూ, హింస అంటూ నిత్యం కరాళ తాండవం చేసే వాడూ, చరిత్రలో రక్తపు జాడలను రొక్కంగా మార్చ గల చతురత కలవాడూ అయినా , నా మిత్రుడే ఇలా డీలా పడి పోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఏం జరిగిందేం జరిగిందని నేను అడిగే లోపే బెక్కుతూ చెప్పేడు: ‘‘ వెధవ కల ! వెధవ కలా
అని ! వొట్టి పీడ కల ! జడిసి పోయి చచ్చేననుకో !’’ అన్నాడు.

‘‘ ఏమిట్రా, ఆ కల ? ’’ అడిగేను.

‘‘ నా ఖర్మ కాలి, ఓ పేద్ధ కార్పొరేట్ హాస్పటల్ కి వైద్యం కోసం వెళ్ళినుట.’’

‘‘ అయితే ...?’’

‘‘ నా జబ్బు తగ్గ లేదు సరి కదా, వాళ్ళు నన్నూ, నా పర్సునీ, నా క్రెడిట్ కార్డునీ, బేంక్ బ్యాలన్సునీ, మొత్తం ఊడ్చేసారు ...’’

‘‘ పోనీ, నీ రోగం కుదిరిందా ?’’

నా మాటల్లో వ్యంగ్యం ధ్వనించిందేమో, నిష్ఠుర పడుతూ అన్నాడు: ‘‘ నా బొంద తగ్గింది. తగ్గితే, ఇలా ఉంటానూ? .... రాత్రికి రాత్రే ఎవరి కంటా పడకుండా ఇలా పారి పోయి వచ్చేసాను ... ఇంకా ఉంటే, నా గోచీ కూడా మిగల్చ రేమో నని భయం వేసిందనుకో ...’’

‘‘ భయమెందుకురా? ... కలే కదా, సరే, ఇంతకీ ఏం రోగం వచ్చిందని అక్కడికి
వెళ్ళావు ?’’ ఆరాతీసాను.

‘‘ బుద్ధి తక్కువై వెళ్ళాను. కొంచెం జలుబు చేసిందంతే. జండూ బామ్ తో పోయే దానికి, తగుదునమ్మా అని, ముచ్చట కొద్దీ అక్కడికి వెళ్ళానులే .... కలలోనే కదా అని కొంచెం సాహసం చేసినట్టున్నాను.... గుండు గొరిగీసేరు ...కచ్చ దాదాపు ఊడదీసీసేరు ...’’ ఏడుస్తూ చెప్పేడు.

వాడిని ఓదార్చి, సాగనంపేక ఆలోచనలో పడ్డాను.

* * * * * * * * * * * * * * * * * * * *

‘వైద్యో నారాయణో హరి : ’ అన్నారు. కానీ, వైద్య రంగం కలవారికే కానీ, లేని వారికీ, సగటు జనాలకు - అందని మ్రాని పండే అవుతోంది. అక్కరకు రాని చుట్టమే అవుతోంది. అందని గగనమే అవుతోంది. భయ పెడుతోంది. బాధిస్తోంది. పీడిస్తోంది. ధన మదం పట్టిన వైద్య రంగంతో దేశం జబ్బు పడింది.


వైద్యం సరిగా తెలియని వారిని వెక్కిరిస్తూ, ‘ నీ చేతి మాత్ర, వైకుంఠ యాత్ర ’ అనడం కద్దు.

కాని, ఇప్పుడు వైద్య రంగం శత సహస్రదళాలుగా వికసించింది. విస్తరించింది. కాని , ఏం లాభం !
అధిక శాతం జనాభాకి అందుబాటులో ఉండడం లేదు.

అప్పిచ్చు వాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడ తెగక పారు ఏఱును, ద్విజుడున్
చొప్పడిన ఊర నుండుము
చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము సుమతీ !

అని, బద్దె భూపాలుడు నెత్తీ నోరూ కొట్టుకుని మరీ చెప్పేడు. ఇప్పుడు దాదాపు ప్రతీ ఊళ్ళోనూ వైద్యులు కనిపిస్తున్నారు. కాని, వారిలో కనిపించని దల్లా రవ్వంత మానవీయ దృక్పథం. అంతే.

అందుచేతనే కదా, ఒక శ్లోకంలో కవి ఇలా అన్నాడు:

వైద్య రాజ నమ స్తుభ్యం, యమరాజ సహోదర !
యమస్తు హరతి ప్రాణాన్, వైద్య:ప్రాణాన్ ధనానిచ.

యముడికి తోడ బుట్టిన వాడి వయిన ఓ వైద్యుడా ! నీకు నమస్కారం. ఎందుకంటే, యముడు కేవలం ప్రాణాలనే తీసుకుని పోతాడు. మరి వైద్యుడో ? ప్రాణాలనూ, ధనాన్నీ కూడా హరిస్తాడు. కనుక, నా జోలికి రాకయ్యా, నీకో నమస్కారం ! అని దీని భావం.

ఈ శ్లోకం చూడండి:

యావత్కంఠగతా: ప్రాణా::, యావన్నశ్యతి చేంద్రియమ్
తావత్ చికిత్సా కర్తవ్యా, కాలస్య కుటిలా గతి:

వైద్యం ఎంత వరకూ చేయాలయ్యా, అంటే,

గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ. ఇంద్రియాలలో చైతన్యం ఉన్నంత వరకూ.వైద్యుడు రోగికి చికిత్స చేస్తూనే ఉండాలి. కాల గతి చెప్పరానిది సుమీ ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో జరిగేది వేరు. యావత్తైలం, తావద్వ్యఖ్యానమ్ అన్నట్టుగా, రోగి డబ్బులు ఇచ్చేంత వరకే వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తరువాత నీ చావు చావు పొమ్మంటున్నాడు. అవును కదూ?

అయితే, వైద్యుడేమీ భగవంతుడు కాడు కదా, చికిత్స జరిపించ గలడు కానీ, ఆయుర్దాయం నిలప లేడు కదా. క్రింది శ్లోకం అదే చెబుతోంది.

వ్యాధే: తత్త్వ పరిఙ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహ:
ఏతద్వైద్యస్య వైద్యత్వం, న వైద్య: ప్రభురాయుష:

వ్యాధి స్వభావం తెలుసు కోవడం, ఉన్న బాధను తగ్గించడానికి ప్రయత్నించడం, ఇంత వరకే వైద్యుడు చేయ గలడు. ఆయుర్దాయం మాత్రం వైద్యుని చేతిలో లేదు కదా ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో, రోగికే తెలిసి పోతున్న వ్యాధి ఏమిటో కనుక్కునే నెపంతో వైద్యుడు చేయించే పరీక్షలు అన్నీ యిన్నీ కావు.వ్యాధి నిర్ధారణ మాట అలా ఉంచితే, రోగి వాటితోనే సగం దివాళా తీయడం ఖాయం.


అయితే, ఒకటి ... నీ కంటూ కథా మంజరి పేరుతో ఓ దిక్కుమాలిన బ్లాగు ఉంది కనుక, తెలుగులో ఏపిల్ కీ బోర్డుతో టైపు చేయగల నేర్పు ఉంది కనుక, వైద్యుల గురించి అవాకులూ చవాకులూ పేలుతున్నావు, ఎక్కడెక్కడివో శ్లోకాలు ఉటంకిస్తూ రాద్ధంతం చేస్తున్నావు ... మరి వైద్యులూ మనుషులే కదా, వాళ్ళూ బ్రతకొద్దూ? అంటారేమో,

చూడండి:

వైద్యామృతంలో ఒక శ్లోకం ఏమని చెబుతోందో ...

నైవ కుర్వీ లోభేన, చికిత్సా పుణ్య విక్రయమ్
ఈశ్వరాణాం వసుమతాం, లిప్సేతార్ధం తు వృత్తయే.

చికిత్స చేసే వైద్యుడు ఆ పుణ్యాన్ని ధనాశాపరుడై అమ్ముకో కూడదు. చికిత్సను ఒక దైవ కార్యంలాగా చేయాలి. అంతే తప్ప డబ్బుకి అమ్ముకో కూడదు. కాని, వైద్యులు తమ కుటుంబ పోషణ కోసం కాసులు కల వారి వద్ద, ఇవ్వగల స్తోమత కల వారి వద్ద నుండి కోరినది తీసికో వచ్చును. అని దీని భావం.

అంటే, డబ్బున్న వారినుండి డబ్బు తీసుకుని, పేదలకు వీలయితే ఉచితంగానూ. లేదంటే
నామ మాత్రపు వసూలు తోనూ వైద్యం చేసి మానవత్వం చూపించాలని దీనర్ధం.

కాని, దురదృష్టవశాత్తు వైద్యులు అలా ప్రవర్తించడం (ఎక్కడో, ఎవరో కాని ) లేదు. నిజానికి వైద్యుడు నారాయణుడితో సమానం. దైవంతో సమానుడైన వైద్యుడు


కొండొకచో



దెయ్యంగా మారి పోతున్నాడనేదే నా ఫిర్యాదు.

ఈశ్లోకాలు కూడా చూడండి:

జృంభమానేషు రోగేషు, మ్రియమానేషు జంతుషు
రోగ తత్త్వేషు శనకై: వ్యుత్పద్యంతే చికిత్సకా:

ప్రవర్తనార్ధ మారంభే, మధ్యే త్వౌషధ హేతవే
బహుమానార్ధ మంతే చ, జిహీర్షంతి చికిత్సకా:

రోగుల నుండి డబ్బులు గుంజు కోవడంలో వైద్యలకు వారి చిట్కాలు వారికి ఉన్నాయి. ఆ టెక్నిక్కులు , గిమ్మిక్కులు, మేజిక్కుల, వారికి బాగా తెలుసును. ఈ శ్లోకంలో కవి అదే చెబుతున్నాడు. చూడండి:

రోగాలు ముదిరి పోయి ప్రాణాలు కడ తేరి పోతూ ఉంటే, రకరకాల పరీక్షలూ గట్రా చేసి, ప్రయోగాలూ విశ్లేషణలూ జరిపి, (కొందరు) వైద్యులు అప్పుడు మెల్లగా రోగ తత్వం తెలిసిందంటూ చికిత్సకి పూనుకుంటారు.

మొదట రోగ నిదానం చేయడానికి డబ్బు గుంజుకుంటారు. మధ్యలో మందులకని డబ్బు లాగుతారు. చివరలో బహుమానమని (అంటే, రోగం తగ్గింది కనుక సంతోషం కొద్దీ) డబ్బులిమ్మని వేధిస్తారుట. ఇదీ లోక రీతి అని కవి చెబుతున్నాడు. మొత్తానికి ఆది మధ్యాంతాలలో కూడా వైద్యుడు డబ్బులు గుంజుతూనే ఉంటాడని కవి భావన.

ఈ కాలంలో బహుమానం పేరుతో అడక్క పోయినా, రూమ్ ఛార్జీలూ, సేవల ఛార్జీలూ, బెడ్ ఛార్జీలూ, మన్నూ మశానం పేరుతో బాగానే గుంజుతారు. రోగం కుదిరిందన్న ఆనందం హరించుకు పోయి, రోగికి ఈ పీడ ఎక్కువవుతుంది. ఖర్మ కాలి, రోగి టపా కట్టేస్తే, చెప్పే పని లేదు. మృత దేహం ఒప్పగించడానికిన్నూ అధిక మొత్తం చెల్లించాల్సిందే కదా !


చివరిగా మంచి ఆరోగ్యం కోసం మన పెద్దలు ఏం చెప్పారో కూడా చూడండి మరి ...

ఆరోగ్యం భాస్కరా దిచ్చే, ద్ధన మిచ్చేత్ హుతాశన:
ఙ్ఞానం మహేశ్వరా దిచ్చేత్, మోక్ష మిచ్చేత్ జనార్ధనాత్.



సూర్య భగవానుని ఉపాసించడం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది.
అగ్నిని ఉపాసించడం వలన సంపద కలుగుతుంది.
ఈశ్వరుని వలన ఙ్ఞానం కలుగుతుంది.
జనార్దనుని వలన మోక్షం కలుగుతుంది.

స్వస్తి.









17, నవంబర్ 2010, బుధవారం

అప్పటికి కానీ బుద్ధి రాదు, మరి !


అంధత్వం ఒక అంగ వైకల్యం. దురదృష్టవశాత్తు జన్మత: అంధత్వం కలిగితే, ఆ బ్రతుకంతా ఇక దుర్భరమే.

గ్రుడ్డితనం అనేది మనుషులకు చూపు సరిగా ఉండి కూడా, వేరే విధంగా వచ్చే అవకాశం ఉంది.

కళ్ళుండీ చూడ లేని కబోదులు కొందరుంటారు. వారిదంతా వక్ర బుద్ధి. అందు చేత వారి దృష్టి కూడా వక్ర మార్గాన్నే పడుతుంది.

దయామయుడైన భగవంతుడు రెండు నేత్రాలనూ ఇచ్చినది ప్రకృతిలోని అందాలను తనివి తీరా చూసి తరించేందుకే కదా ! హరిత శోభతో అలరారే చెట్లూ, చేమలూ, లతానికుంజాలూ, సూర్యోదయ సూర్యాస్తమయాల వేళ రాగ రంజితమైన ఆకాశమూ, నదులూ, సెలయేళ్ళూ, ఎగిరే పక్షులూ, పుచ్చ పువ్వులాంటి వెన్నెలా, రంగుల హరివిల్లులూ, కొండ కోనలూ. జలపాతాలూ, చెంగున దుమికే లేళ్ళూ, ... ఇలా ప్రకృతి అందాలు చూడడానికే కదా కళ్ళున్నది, కానీ, కరెన్సీ నోట్లను మాత్రమే చూడగోరే కళ్ళు ఉండీ లేనట్టే. అలాంటి వారు జాత్యంధులతో సమానం.

మహా భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. దానికి తోడు అతనికి అలవిమాలిన పుత్ర
వాత్సల్యం అనే గ్రుడ్డితనం కూడా దాపురించింది. దానితో కౌరవ వినాశనానికి అతడే మూల కారకుడయ్యేడు.

సారపు ధర్మం, విమల సత్యం పారము పొంద లేక నాశనమవుతూ ఉంటే, నివారింప గల సమర్ధత కలిగి ఉండి కూడా , ఎవడు ఉపేక్ష చేస్తాడో , అది వాడికే చేటు కలిగిస్తుందని శ్రీకృష్ణుడు మహా భారతంలో హెచ్చరించాడు కదా?

అందు వల్ల కళ్ళు లేక పోవడం దయనీయమే అయినా, కళ్ళుండీ కానక పోవడం మాత్రం క్షంతవ్యం కానేరదు.

చాల మంది ఇలా కళ్ళున్న కబోదులుగా ఎందుకు మారుతున్నారయ్యా అంటే, మదం ముదిరి పోవడం వల్ల, అహంకారం అతిశయించడం వల్ల. అయాచితంగా ఉన్నత పదవీయోగం చేకూరడం వల్ల. తరాల తరబడి తిన్నా తరగని గని లాంటి సంపదలు వచ్చి పడడం వల్ల.

ఇలాంటి వారు పయనించేది పతన మార్గమే. ఇలాంటి వారిని అనుసరిస్తే మనకు పట్టే గతి కూడా అట్టిదే సుమా !

భాగవతంలో పోతనామాత్యుడు చెప్పిన పద్యం తెలిసినదే కదా?

కానని వాని నూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మ బద్ధులై
కానరు, విష్ణుఁగొందఱటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా !

గ్రుడ్డి వాడు మరొక గ్రుడ్డి వాని చేయి పట్టుకుని వాని సాయంతో ఏ వస్తువునూ చూడ లేడు.
అదే విధంగా, విషయాసక్తులై, కర్మ బంధాలలో చిక్కువడిన వారు శ్రీహరిని చూడ లేరు. కొందరు మహా విష్ణు భక్తులు మాత్రం ఆ స్వామిని కనులారా చూడ గలరు. అంతే కానీ సంసారంలో కొట్టు మిట్టాడుతూ ఉండే వారు భగవంతుడిని ఎన్నటికీ చూడ లేరు.

పుట్టుక చేతనే గ్రుడ్డితనం ప్రాప్తించిన వారిని సాయం తీసికొని మనం సత్యదర్శనం చేయ లేమని పోతన ఇందులో చెప్పాడు. కళ్ళున్న కబోదులను అనుసరించినా మన గతి అంతే అని కూడా అర్ధం చేసుకోవాలి.

కళ్ళున్న కబోదుల గురించి ఒక శ్లోకంలో కవి ఇలా వివరించాడు. చూడండి ...

సంపన్నో2ధవదేవ కించి దపరం నో వీక్షతే చక్షుషా,
సద్భి ర్వర్జితమార్గ మేవ చరతి ప్రోత్సాహితో జాలిశై:
తస్మిన్నేవ ముహు: స్ఖలన్ ప్రతిపదం గర్వాంధకూపే పత,
త్యస్యాంధత్వ నివర్తకైషధ మిదం దారిద్ర్య మేవాంజనమ్ !

మితి మీరిన సంపదలు కలవాడు గ్రుడ్డి వాడితో సమానం. అంధుడి లాగానే, వాడు తన కన్నులతో ఏమీ చూడ లేడు. దుష్టులతో తిరుగుతూ, వారి ప్రోత్సాహంతో సత్పురుషులు ఏవగించుకునే చెడు దారులలోనే సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆ చెడు మార్గం లోనే నడయాడుతూ ఉంటాడు. తమ చెడు ప్రవర్తన వలన చీటికీ మాటికీ అనేకమయిన దెబ్బలు తింటూ ఉంటాడు. అయినా బుద్ధి రాదు. తమ నడవడిక మార్చుకోడు. చివరకి అంధకూపంలోకి కూలి పోతాడు.

మరి, అలాంటి కళ్ళున్న కబోదుల అంధత్వం తొలిగించడానికి మార్గమే లేదా?

ఉంది.

వారి అంధత్వం పోగొట్టాలంటే దానికి దారిద్ర్యం అనేది ఒకటే తగిన అంజనం సుమా !

అంటే, అలాంటి వారి కళ్ళు తెరుచు కోవాలంటే, వారి సంపద ఉన్నదంతా ఊడ్చి పెట్టుకు పోయి, వాళ్ళు దరిద్రులయి పోవాలి, అంతా పోయేక కానీ వారి కళ్ళు తెరచు కోవు అంటున్నాడుశ్లోకంలో
కవి.

అలాగే, అధికార మదం చేత కళ్ళు కనిపించకుండా పోయే వారికి ఆ పదవి ఊడి పోతే తప్ప తిరిగి చక్కని చూపు రాదు. అధికారాంతమున చూడ వలె కదా, అయగారి సౌభాగ్యముల్ ! అని కదా ఓ కవి చెప్పాడు ...

స్వస్తి.